Saturday, 27 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 21 - రేయీ మించెనోయి రాజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 21

శబాష్ రాముడు - రేయీ మించెనోయి రాజా

"ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది." ఇది నిన్నటివరకు చాలామంది నమ్మిన నానుడి. ఈనాడు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నా సనాతన భారతీయ సంస్కృతిలో మాత్రం స్త్రీకి ఉన్నత స్థానమే వుంది. ఈ విశ్వంలోని సమస్త శక్తులు తనలోనే వున్న ఆదిపరాశక్తి స్త్రీరూపిణిగా సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆధారమై ఆరాధించబడుతున్నది. శక్తి అంటే కేవలం ధైర్య, సాహస, వీర, శౌర్య ప్రతాపాలే కాదు.  సాత్వికత, జ్ఞానము, శాంతి, సహనము, తెలివితేటలు, విద్య, వివేకము, విచక్షణ, వంటి లక్షణాలన్నీ శక్తిలో భాగాలే. అటువంటి ఆదిపరాశక్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణార్ధం వివిధయుగాలులో అనేక మూర్తులుగా అవతరించి సమస్తప్రాణులను కాపాడుతున్నది. ఆ దైవమే ఒక మాతృమూర్తిగా, గృహిణిగా,  ఇతరుల ఔన్నత్యాన్ని కాంక్షించే ఒక మంచి స్నేహితురాలిగా జన్మనెత్తి కుటుంబ శ్రేయస్సు,  సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూనేవుంటుంది. మానసికంగా, ఆత్మస్థైర్య రీత్యా స్త్రీ  పురుషుడికంటే చాలా శక్తివంతురాలు. జీవితంలోని కష్టనష్టాలను, ఒడిదుడుకులను తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగేది పురుషుడికంటే స్త్రీ మాత్రమే.   మగవాడి పురోభివృద్ధికి  వివిధ దశలలో అన్నివిధాలా సహకరించి సహాయపడేది తల్లి, భార్య, మంచి స్నేహితురాలు మాత్రమే. ఆ విధంగా ప్రతీ పురుషుడి కృషి, విజయం వెనుక విధిగా  స్త్రీ పాత్ర ఎంతైనా వుంటుంది.

ఈ విషయాన్ని రూఢిపరిచే అలనాటి సినిమా లోని ఒక ఆత్మస్థైర్య ప్రబోధాత్మక  గీతమే నేటి మన సజీవరాగం.

విధి వక్రదృష్టికి బలియైపోయిన ఒక ధనవంతుడు పూవులమ్మినచోటే కట్టెలమ్ముకోవడం ఇష్టంలేక బ్రతుకుతెరువు కోసం తన భార్య, కూతురు, తమ్ముడితో సహా పట్నం చేరుకుని రిక్షావాలాగా కాలం గడుపుతూంటాడు.  తమ్ముడిని బాగా చదివించి ఉన్నతస్థితికి తీసుకురావాలని కలలుకంటూవుంటాడు. అనుకూలవతివివేకము గల అతని భార్య కూడా అతని ఆశయాలు నెరవేరడానికి శాయశక్తులా కృషిచేస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకువస్తూంటుంది. కానీ, ఇక్కడ కూడా అదృష్టం ఆ కుటుంబాన్ని చిన్నచూపే చూసింది. అహర్నిశలు కష్టపడి శ్రమించే ఆ రిక్షావాలా కొంతమంది దుండగుల తుపాకీ గుళ్ళకు కాలికి బలమైన గాయమై ఆస్పత్రి పాలవుతాడు. కదలలేని స్థితి. నిత్యజీవనానికి, తమ్ముడి కాలేజీపరీక్షల ఫీజుకు డబ్బు ఎలా సద్దుబాటు చేయాలో తెలియక రిక్షారాముడి మనసు అల్లకల్లోలమై భవిష్యత్ గురించి  మధనపడుతూ కంటిమీద కునుకు కరువై చింతక్రాంతుడై విచారంలో మునిగివుంటాడు.

అటువంటి దుర్భరపరిస్థితులలో భాధ్యతనెరిగిన  భార్య  అతనికి ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ.....


రేయీ మించేనోయి రాజా

హాయిగ నిదురించరా! రేయీ!

హాయిగ నిదురించరా..

 

వెల్లివిరిసీ వెన్నెల్లు కాసే

చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచే

                                            !వెల్లి!

స్వప్నాలలోనా స్వర్గాలు కంటూ

స్వర్గాలలో దేవగానాలు వింటూ

హాయిగ నీవింక నిదురించవోయి

                                        !రేయీ!

 

చీకటి వెంట వెలుగే రాదా

కష్టసుఖాలు ఇంతేకాదా!చీకటి!

చింతా వంతా నీకేలనోయి

అంతా జయమౌను శాంతించవోయి

హాయిగ నీవింక నిదురించవోయి

                                        !రేయీ! 

అని లాలిస్తూ అతను ప్రశాంతంగా నిదురించడానికి తాపత్రయపడుతోంది.

ఈ అనంతవిశ్వంలో చీకటివెలుగులు ఎంత సహజమో, మనిషిజీవితంలో కష్టాలు, సుఖాలు కూడా అంత సహజం. కష్టాలు వచ్చాయని కుంగిపోకూడదు. నీకు తోడుగా, అండగా నేనుండగా దిగులెందుకు అంతా విజయవంతంగా సాగుతుంది. కలతలు మాని వెల్లివిరిసే ఈ చల్లనివెన్నెలరాత్రిలో చక్కని కలలుకంటూ ఆ కలలో దేవగానాలు వింటూ హాయిగా నిదురపొమ్మని శ్రావ్యంగా గానంచేస్తూ భర్తకు మనశ్శాంతిని కలిగిస్తోంది ఒక ఆదర్శమహిళ.

ఔను! ఘంటసాలవారి హృదయాంతరాళాలనుండి పెల్లుబికి జాలువారిన ఈ సజీవరాగం సినీమా పాటే. 

సుఖవంతమైన సంసారనావకి వివేకవంతురాలైన ఇల్లాలే చుక్కాని అని నిరూపించిన సినిమా. 1959లో విడుదలైన రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'శభాష్ రాముడు' సినిమా.

మంచి కథాంశాలతో,  చక్కటి సాహిత్యం, మంచి సంగీతం కలిగిన పాటలతో  పదిమందికి మంచిని నేర్పి ప్రజలలో చైతన్యం కలిగించాలని నిర్మాతాదర్శకులు భావించే రోజులలో వచ్చిన చిత్రం 'శభాష్ రాముడు'. తాను మాస్ హీరో మాత్రమే కాదు క్లాస్ హీరో కూడానని తన ఉదాత్తమైన నటనతో  తెలుగువారందరిచేతా 'శభాష్ రిక్షారాముడు' అని  జేజేలు కొట్టించుకున్న నందమూరి తారకరామారావు శభాష్ రాముడు సినిమాకు కథానాయకుడు. 

ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెతను సార్థకపరుస్తూ దేవిక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్.కు దీటుగా చక్కగా నటించారు. ఇతర ముఖ్యపాత్రలలో నటించిన రమణమూర్తి, మాలిని, గుమ్మడి, కాంతారావు, రేలంగి, గిరిజ, ఆర్.నాగేశ్వరరావు, కె.వి.ఎస్.శర్మ, ఎ.మ్ఎన్.రాజమ్  చిత్రవిజయానికి ఇతోధికంగా  దోహదం చేశారు.

'శభాష్ రాముడు' సినిమా కు హిందీ మూలం 1957 లో వచ్చిన 'బడేభాయ్' అజిత్, కామినీకౌశల్, కుమ్ కుమ్ ముఖ్యనటులు. కె.అమర్నాథ్ దర్శకనిర్మాత.

సుందర్లాల్ నహతాగారి ఆస్థాన సంగీతదర్శకుడిగా ఘంటసాలగారికి ఈ శభాష్ రాముడు నాలుగవ చిత్రం. ఇందులో వున్న తొమ్మిది పాటలు వైవిధ్యంతో కూడినవే. సందర్భోచితమైన, సన్నివేశానికి బలం చేకూర్చే భావజాలంతో నిండిన ఈ పాటలను కొసరాజుగారు (జయమ్ము నిశ్చయమ్మురా), (ఆశలే అలలాగ ఊగెనే సరదాగా), (వన్నెలు కురిసే చిన్నదిరా), సదాశివబ్రహ్మంగారు (రేయీ మించేనోయి రాజా), (జాబిల్లి వెలుంగులో కాళింది చెంత), (హల్లో డార్లింగ్ మాటాడవా), (ఓ చందమామ ఇటు చూడరా),  శ్రీశ్రీగారు (ఓ దేవా మొరవినవా), (కలకల విరిసీ జగాలే పులకించెనే)  వ్రాయగా వాటిని ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె రాణి, కె.జమునారాణి, సరోజిని, పిఠాపురం, జె.వి.రాఘవులు ఆలపించారు.

సుందర్ లాల్ గారి సినిమాలలో ఎక్కువగా పరభాషా చిత్రగీతాల ఆధారంగా చేసిన పాటలే ఎక్కువగా వుంటాయి. ఘంటసాలగారి స్వయంప్రతిభకు నిదర్శనంగా ఓ రెండో మూడో పాటలు వుంటాయి. అటువంటివాటిలో అత్యుత్తమైన గీతం నేటి మన సజీవరాగం, అదే పి.సుశీలగారు ఆలపించిన సుమధుర, సుస్వరాల హృద్యగీతం 'రేయీ మించేనోయి రాజా' వెంపటి సదాశివబ్రహ్మంగారి రచన. కథా నేపథ్యం స్ఫురింపజేస్తూ రసానుభూతికి తగిన పదజాలంతో ఉన్న ఈ పాటకు  ఘంటసాలగారు అతిశ్రావ్యంగా జోలపాట పధ్ధతిలో వరసను సమకూర్చారు.

సన్నివేశానికి అనుగుణ్యంగా రసభావాలకు, కవి సాహిత్యానికి ప్రాధాన్యతనిస్తూ పాటలను మలచడంలో మేటి ఘంటసాల. కవి సదాశివబ్రహ్మంగారి సందర్భోచిత సాహిత్యానికి తన సంగీత ప్రతిభను జోడించి  మనసులోని రాగభావాలను యథాతథంగా సుశీలగారి కోకిలకంఠం ద్వారా అతిమనోజ్ఞంగా ఈ 'రేయీమించేనోయి రాజా' పాట ద్వారా మనకందించారు ఘంటసాల.

మాట స్పష్టత, శ్రావ్యత, అనుభూతుల ప్రకటన ఘంటసాల, సుశీలగార్ల ప్రత్యేకత. అది ఈ పాటలో అణువణువున కనిపిస్తుంది. లాలిపాటలా వుండే ఈ సందేశాత్మకగీతంలో మనకు శంకరాభరణ రాగ స్వరాలు వినిపిస్తాయి. శంకరాభరణం 29వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. వైవిధ్యం కూడుకున్న అతి ప్రాచీనరాగం శంకరాభరణం. హిందుస్థానీ సంగీతశైలిలో ఈ రాగాన్ని బిలావల్ అంటారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ లేదా లోనియన్ అని అంటారు.  బహుళ ప్రచారం పొందిన బహుభాషా చిత్రగీతాలు అసంఖ్యాకంగా  శంకరాభరణం, తదదీ ఇతర జన్యరాగాలలో వున్నాయి. అందుచేత పాటను అతిశ్రధ్ధగా విని రాగ లక్ష్యలక్షణాలను నిర్దిష్టంగా పరిశీలించి రాగనిర్ణయం చేయవలసివుంటుంది. లేకపోతే ఒక రాగానికి బదులు మరొకరాగంగా పొరపాటు పడే అవకాశం వుంది.   లాలిత్యం ఉట్టిపడే ఈ పాట నేపథ్యసంగీతంలో ఉపయోగించిన సితార్, ఫ్లూట్, వయొలిన్స్, వైబ్రోఫోన్, తబలా, రిథిమ్స్ వంటి వాద్యాలు కూడా మృదువుగా ధ్వనిస్తూ శ్రోతల మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి.

ఈ పాటలో ప్రముఖంగా వినపడే ఫ్లూట్, సితార్, తబలాలు పాట మూడ్ ను ఎంతగానో ఎలివేట్ చేశాయి. గాత్రాన్ననుసరించే వాద్యాలు తప్ప వాద్యాలననుసరించి గాత్రం కాదనేది ఘంటసాలగారి సిధ్ధాంతం. అందువల్లే వారి గీతాలన్నీ సజీవరాగాలై సంగీతాభిమానులను సదా అలరిస్తున్నాయి.

రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్ లాల్ నహతా & టి.అశ్వత్థనారాయణ నిర్మించి శతదినోత్సవాలను చేసుకున్న ఎన్.టి.ఆర్. 'శభాష్ రాముడు' ను తమిళంలోకి కూడా డబ్ చేసి మంచి విజయం సాధించారు.


 

కొసమెరుపు:

'మంచి మనసుకు మంచి రోజులు', 'శభాష్ రాముడు' -  ఈ రెండు సినీమాలను తీసినది రాజశ్రీ సుందర్లాల్ నహతాయే. రెండింటిలో హీరో ఎన్.టి.ఆర్.కాగా ఘంటసాల సంగీతదర్శకుడుసి.ఎస్.రావు డైరెక్టర్. మంచిమనసు మంచి రోజులకు తమిళ మూలం 'తై పిరందాల్ వళి పిరక్కుం'. ఈ సినిమాలో హీరో పాడిన పడవపాట 'ఆశయే అలైపోలేపాట వరసలో  'ఆశలే అలలాగ ఊగెనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగాఅని కొసరాజుగారి చేత ఒక పాట వ్రాయించారు. పాట రికార్డింగ్ కూడా జరిగిందేమోతెలియదు. అయితే ఏ కారణం చేతనో ఆ పాటను 'మంచి మనసుకు మంచి రోజులు సినిమా లో ఆ సన్నివేశంలో పెట్టలేదు. దానికి బదులుగా  జూనియర్ సముద్రాలగారితో 'పొంగారు నడియేటి నదిపైన దోనె అలా అలా ఊరించు పేరాశ ఈ జీవితానా... ఏ తీరమేగేనో సుడిగాలిలోనా ఏనాటికేతీరో బ్రతుకీ జగానాఅనే మరో పాటను వ్రాయగా ఘంటసాలగారు వేరే ట్యూన్ లో చేసి పాడగా హీరో ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించించారు. అయితేసుందర్ లాల్ గారి పరభాషా గీత వ్యామోహంవ్యాపార సరళి వలన మంచి మనసుకు మంచిరోజులు సినిమా కోసం వ్రాయించి ఉపయోగించకుండా వదిలేసిన తమిళ వరస గీతం 'ఆశలే అలలాగ ఊగెనే సరదాగా...పాటను ఘంటసాలగారు పాడగా శభాష్ రాముడు సినిమాలో అదే పడవ ప్రయాణం సన్నివేశానికి ఉపయోగించుకుని రేలంగి మీద చిత్రీకరించారు దర్శకుడు సి.ఎస్.రావు.  సినిమాలలో కూడా తెరవెనుక  ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు.

వచ్చే వారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 20 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 20 - సమయమిది దాయరా సరసుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 20

పెళ్లిసందడి - సమయమిది దాయరా సరసుడా

"బ్రదర్, ఆ కళాసమితివారు చేతులెత్తేసారు. మన అమ్మాయిల డాన్స్ ప్రోగాము వాళ్ళ సభలో పెట్టలేరట. రెండేళ్ళవరకు కార్యక్రమాలు ఫిక్స్ చేసేసేరట. అందులోనూ అమెచ్యూర్ డాన్సర్స్ కు వాళ్ళ కళాసమితిలో అవకాశం దొరికే ప్రసక్తే లేదంటున్నారు. కానీ, అసలు విషయం అదికాదు. మనవాళ్ళ డాన్స్ వాళ్ళ వేదికమీద జరగాలంటే మనం వాళ్ళకు ఎంతోకొంత డొనేషన్ ముట్టచెప్పాలనేది ఆంతర్యం. దానికి మనం అంగీకరిస్తే వచ్చే వారమే మన అమ్మాయిల నృత్యకార్యక్రమం ఖాయం. ఆ సమితి ప్రెసిండెంటే స్వయంగా వచ్చి మన అమ్మాయిలను అభినందించి ఆశీర్వదిస్తాడట. ఆ దెబ్బతో మన పిల్లల జాతకమే మారిపోయి  కళాప్రపంచంలో ఓహో! అని ఓ వెలుగువెలిగిపోతారని ఆ శెక్రెటరీ లోపాయికారీగా చెప్పాడు. నేను ససేమీరా కుదరదని చెప్పి వచ్చేసాను."

"కళాసేవ, కళాపోషణ అంటూ వీళ్ళు చేసే వ్యాపారం ఇదన్నమాట! మరిప్పుడెలా! ఏం చేద్దాము".

"చేయడానికి ఏముంది. మన తోట బంగళాలో ఓ పెద్దహాలు వుందికదా. సుమారు వెయ్యమంది దాకా కూర్చోవచ్చు. కొంచెం ఆలస్యమైనా అన్ని వసతులతో, హంగులతో ఒక సాంస్కృతిక సంస్థ ప్రారంభించి  గ్రాండ్ గా వచ్చే ఉగాది నుండి ప్రతీ నెల మంచి మంచి నృత్య, నాటక, సంగీత, కార్యక్రమాలు ఉచితంగా ఏర్పాటు చేద్దాము. ఆ గొడవంతా నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను."

"అమ్మాయిలూ! మన  సంగీత, నృత్యనాటక కళాసమితిలో మొదటి ప్రోగ్రాం మీదే. ఏం చేస్తారు? భరతనాట్యమా, కూచిపూడియా?" ఏదైనా ప్రేక్షకులు అదిరిపోవాలి, చూసుకోండి మరి".

"ప్రారంభమే శుధ్ధ శాస్త్రీయం వద్దు బాబాయ్. మన గురించి, మన టాలెంట్ గురించి పదిమందికి బాగా తెలిసేవరకు, సామాన్య ప్రేక్షకులకు అర్థమై చూసి ఆనందించేలా లలిత శాస్త్రీయ అంశాలనే ఏర్పాటు చేద్దాము".

"ఓహోహో! అంటే అప్పుడే మీరు ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకు కూర్చున్నారన్నమాట.  ముందుగా, స్టేజ్ కోసం మోడర్న్ గా మీ పేర్లను మార్చేయాలి."

"మీ డాన్స్ ఐటెమ్స్ సిధ్ధంగా వున్నాయంటున్నారు, ఒకసారి పాడి, చేసి వినిపించండమ్మా."

"ఓ పాత తెలుగు సినిమాలోని పాటే నాన్నా! మా కాలేజీ ఫంక్షన్ కోసం మా డాన్స్ టీచర్ సెలెక్ట్ చేశారు. ఆ రోజు మా ఐటెమ్ కు చాలా మంచిపేరు వచ్చింది.  చీఫ్ గెస్ట్ కూడా చాలా మెచ్చుకున్నారు."

"అలాగా! అయితే తప్పకుండా ఆ ఐటమ్సే ఫైనలైజ్ చెయ్యి బ్రదర్. "

"ఏదమ్మా ఆ పాట వినిపించండి."

"ఒక్క పాటేమిటి నాన్నా... విడియోవే చూపిస్తాము. "పెళ్ళిసందడి" అనే పాత సినిమా లో అంజలీదేవి, బి.సరోజాదేవి చేసిన ఒక వెరైటీ సెమిక్లాసికల్ డాన్స్ నెంబర్. జూనియర్ సముద్రాల వ్రాసిన పాటకు ఘంటసాల వరసలు కూర్చగా  పి.లీల, జిక్కి పాడారు. అన్ని క్లాసెస్ వాళ్ళకీ బాగా నచ్చుతుంది.

"ఓకే బ్రదర్ ! మన కళాసమితి ఫస్ట్ ఉగాది  ప్రోగ్రామ్ ఫిక్స్డ్. రెడీ ఫర్ స్టేజ్.

                                                                    -+-

ఈలోగా మనం ఆ విడియో చూసేద్దాము

సమయమిదిదాయెరా సరసుడా-2

తమిగొని జతగొని సరసాల తేలదగు

సమయమిదిదాయెరా

 

విరులు పూచెరా వెన్నెల కాచెరా

మారునీ గెలిచి కూరిమీ కలిసి

పరవశముల మెలగా! సమయ!

 

తాళలేనురా జాలమిదేల  రా

జాలినీ చూసి బాలనూ కరుణ

ఏలరా కౌగిలిలో రారా ! సమయ!


జిక్కి: 

రావోయి సక్కనోడా, నావోడ

రావోయి సక్కనోడా

లీల:

వచ్చానె సిన్నదానా, నాదాన

వచ్చానె సిన్నదానా

జిక్కి: 

సల్లని ఎన్నెలలోన సన్నాని అలలపైన 

సక్కనీ పడవానెక్కి సరదాగా పాడుకుంటూ 

                                                !రావోయి!

లీల:

సిలిపిసూపులు సూత్తు సెంతని నీవుంటే 

సెంగునా నట్టేట దూకి సేపలన్నీ పట్టుకురానా

జిక్కి:

రావోయి సక్కనోడా నావోడ

రావోయి సక్కనోడా

లీల:

పోదామె సిన్నదానా నాదాన

పోదామె సిన్నదానా

జిక్కి:

హైలేలో నా రాజా రావోయి నీదే

కన్నె రోజా ! హైలేలో!

లీల:

సరసము కోరే తరుణి యిదీ

సరసనజేరే తరుణమిదీ

కన్ను చెదిరే వన్నె నాదీ

వలపు గొలుపు వయసు చెలి యిదీ

                                        !హైలేలో!


జిక్కి:

మిలమిల మెరిసే మెయి తళుకూ

కలవరపరిచే కనుబెళుకూ

మనసు నీది మమత నీది

మరులుగొలుపు వయసు చెలి యిదీ

                                        !హైలేలో!


                                    



ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అనేక ఆపాతమధురాలలో ఈ పాట ఒకటి. 1959 లో వచ్చిన "పెళ్ళిసందడి" లోని ఈ యుగళగీతమే నేటి మన సజీవరాగం.

ఇదొక రొమాంటిక్, వెరైటీ నృత్యగీతం. వైవిధ్యంతో కూడిన మూడు నృత్యరీతులు కనపర్చే పాట.  పాట మొదటి భాగంలో భరతనాట్య శైలిలో ఒక జావళి, రెండవభాగం జానపదం. మూడవ భాగం విదేశ నృత్యరీతిలో వుంటుంది. ఈ నృత్యగీతం వినోదాన్ని ఆశించి చేసినదే అయినా, ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా మన భారతీయ సంస్కృతికి తగినట్లుగా హుందాగా, గౌరవప్రదంగా చిత్రీకరించారు డైరెక్టర్ డి.యోగానంద్. ఈ సినిమా నృత్యదర్శకుడు (టైటిల్స్ లో పేరే వేయలేదు) ఎవరోగానీ అన్ని పాటలకు చక్కటి నృత్యభంగిమలను సమకూర్చి అంజలీదేవి, బి సరోజాదేవి చేత హుషారుగా నాట్యం చేయించారు.  

ఘంటసాల మాస్టారు ఈ పాటను రాగమాలికలో చేశారు.  ఒక పాటలోరెండు కన్నా ఎక్కువ రాగాలుంటే దానిని రాగమాలిక అంటారు. ఈ నృత్యమాలికలో మొదటిదైన భరతనాట్య జావళీని చారుకేశి రాగంలో, జానపదశైలిలో వుండే చరణాలను బృందావన సారంగలో, ఆఖరి ఫారిన్ టైప్ డాన్స్ ను తోడిరాగ స్వరాలతోనూ చేశారు.

చారుకేశి రాగాన్ని తెలుగు సినిమా సంగీతాభిమానులకు పరిచయం చేసినది మన ఘంటసాల మాస్టరుగారేనని గతంలో చెప్పడం జరిగింది. కర్ణాటక సంగీతంలో చారుకేశి 26వ మేళకర్త. దీనికి అనేక జన్యరాగాలున్నాయి. ముత్తుస్వామి దీక్షితర్ సంగీత సంప్రదాయం లో చారుకేశి రాగాన్ని తరంగిణిగా వ్యవహరిస్తారు. ఘంటసాలగారు ఈ పాటలో వచ్చే  చారుకేశి రాగం జావళీకి కర్ణాటక సంగీత గమకశుధ్ధిని పాటిస్తూ సశాస్త్రీయమైన మెట్టునే కట్టారు. భరతనాట్య ప్రదర్శనకు ఉపయోగించే వీణ, వయొలిన్స్, ఫ్లూట్, మృదంగం, మోర్సింగ్, గజ్జెలతో పాటు తబలాను కూడా ఉపయోగించారు. పాట ప్రారంభం తబలా నడకతోనే మొదలవుతుంది. 

ఈ పాటలో రెండవభాగం బెస్త యువతీయువకుల జానపదశైలి నృత్యం. ఈ భాగంలో నర్తకులు, గాయకులు ఆడవారే. ఈ చరణం నేపథ్యంలో వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, తబలా, డోలక్, డప్పు, గజ్జెలు, మొదలైన వాద్యాలు వినిపిస్తాయి.

ఈ భాగంలో మనకు వినిపించే రాగం బృందావనసారంగ. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో బహుళ ప్రచారం పొందిన  రాగం. కర్ణాటక సంగీతంలోని 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యం ఈ బృందావన సారంగ. హిందుస్థానీ సంగీతంలో  కాఫి థాట్ కు చెందిన రాగం. భక్తి, శృంగార రసాది అనుభూతులను వెల్లడించడానికి అనువైన శ్రావ్యమైన రాగం.

ఇక ఈ నృత్యగీతంలో మూడవ ఆంశం ఒక విదేశీ బాణీ నృత్యం. ఇది బహుళ ప్రచారంలో వున్న  ప్రాచీన జపాన్ జానపద నృత్య ప్రక్రియ. దీనిని 'పారసల్' లేదా 'హిగస ఒడోరి' డాన్స్ అని అంటారు. ఈ నృత్యశైలి జపాన్ లోని కబుకి, ఒకినావన్ ప్రాంతాలలో నుండి అభివృద్ధిలోకి వచ్చింది. ఈ నృత్యంలో నర్తకీమణులు తమ సంప్రదాయ కిమోనా దుస్తులు ధరించి వివిధరకాల కేశాలంకరణతచేతిలో రంగురంగుల గొడుగులు ధరించి, శ్రావ్యమైన, సున్నితమైన వాద్యసంగీతానికి తగినట్లుగా మెల్లని పదవిన్యాసంతో సాగే నాట్యప్రక్రియ. దీని ఆధారంగా మన నృత్య దర్శకులు రూపొందించిన  చక్కటి అంశం. ఈ నృత్యంకోసం ఘంటసాల మాస్టారు తోడి రాగ స్వరాలు ఉపయోగించారు. తోడి కర్ణాటక సంగీతంలో అతి ప్రాచీనమైనది. 8వ మేళకర్త రాగం  హనుమత్తోడి అని అంటారు. దీనికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవ్. హిందుస్థానీ సంగీతపు తోడి రాగానికి, కర్ణాటక సంగీత తోడిరాగానికి తేడా వుంది. పాశ్చాత్య (Western) దేశ సంగీతాలలో కూడా ఈ తోడి రాగం వినిపిస్తుంది. అక్కడ ఈ రాగాన్ని'ఫ్రిజియన్ మోడ్' అని అంటారు. అటువంటి సుప్రసిద్ధ రాగ స్వరాలను ఘంటసాలగారు ఈ భాగంలో ఉపయోగించారు.

పి.లీల, పి.జి.కృష్ణవేణి (జిక్కి) పోటీపడి పాడిన ఈ పాట  చరణంలో మరో ప్రధాన ఆకర్షణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. జిలిబిలిగా పక్కపక్క గమకాలతో శ్రోతలను గిలిగింతలు పెట్టే ఎమ్.ఎస్.రాజు మేండలిన్రాజేంద్రన్ ఫ్లూట్ బిట్స్, గిటార్, పియోనా, డబుల్ బేస్ వ్యాపింగ్స్, డ్రమ్స్సింబల్స్ట్యూబోఫోన్, జలతరంగిణి, ఇతర రిథిమ్స్  చాలా చైతన్యవంతంగా, ఉత్సాహభరితంగా వినిపిస్తాయి. మొత్తంమీద ఈ పాటంతా ఎంతో మృదుమధురంగాలయ ప్రధానంగా వుంటూ శ్రోతలను రంజింపజేస్తుంది. ఎన్నిసార్లు విన్నా, నా వరకూ, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గమనప్రధాన నృత్యగీతం ఇది. అందుకే  అనేక సుమధుర ఘంటసాల గీతమాలికలలో ఈ గీతం కూడా సజీవరాగమై శ్రోతలను ఎల్లప్పుడూ అలరిస్తూనే వుంటుంది.

నిజం చెప్పాలంటే, 20వ ఎపిసోడ్ నన్ను కొంచెం ఇరకాటాన పెట్టిందనే చెప్పాలి. 20వ ఎపిసోడ్ సజీవరాగ గీత చిత్రంగా 'పెళ్ళిసందడి' సినిమా నిర్ణయమైపోయినా, ఈ చిత్రంలోని ఏడు పాటల్లో ఏ పాటను సజీవరాగంగా తీసుకోవాలో నిర్దిష్టంగా ఇప్పటికీ నిర్ణయించుకోలేకపోతున్నాను.  కారణం ఈ సినిమా లోని పాటలన్నీ సుస్వరాల సుమధురగీతాలే. సజీవరాగాలుగా కొనియాడదగ్గవే. 

ఇక్కడ మరో విశేషంఈ ఏడు పాటల్లో ఆరు పాటలు డ్యూయెట్లే, ట్రిప్లెట్లే (ఈ మాట సరైనదికాదనుకుంటాను). ఒకే ఒక సోలో పి. లీల పాడిన పాట. ఘంటసాలగారికి సోలోలు లేవు. రెండు పాటలు లీల, జిక్కిలతో, ఒకటి బాలసరస్వతీదేవితో  కలసి పాడారు. ఏడవ పాట కూడా డ్యూయెట్ పాటే - జె.వి.రాఘవులు, జిక్కి - చలం, బి.సరోజాదేవి కోసం పాడారు. ఈ సినిమాలో అధికసంఖ్యలో ఆరు పాటలను పి.లీల పాడారు. వీటిలో కె.రాణితో కలసి పాడిన పాట కూడా ఒకటి వుంది.

పూర్తి వినోదాత్మక చిత్రమైన పెళ్ళిసందడిలోని పాటలన్నింటికి కూడా ఘంటసాలగారు ఉత్సాహభరితంగా పదే పదే పాడుకునేలా వరసలు సమకూర్చారు. హీరో అక్కినేని, దర్శకుడు డి.యోగానంద్, ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన అతికొద్ది చిత్రాలలో అత్యంత విజయవంతమైన చిత్రం పెళ్ళిసందడి. డైరెక్టర్ యోగానంద్ ఎన్.టి.ఆర్.కు మంచి స్నేహితుడు. ఎన్.టి.ఆర్. సినిమా లెన్నింటినో యోగానంద్ డైరక్ట్ చేశారు.

ఎఎన్.ఆర్. హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అంజలీదేవి, చలం, బి.సరోజాదేవి, గుమ్మడి, రమణారెడ్డి, సి.ఎస్.ఆర్., రాజనాల, ఆర్.నాగేశ్వరరావు, సురభి బాలసరస్వతి, డా.శివరామకృష్ణయ్య నటించారు.

కథ, మాటలు, పాటలు సముద్రాల రామానుజాచార్యులు సమకూర్చారు. రిపబ్లిక్ ప్రొడక్షన్ బ్యానర్ మీద బి.ఎ.సీతారాం నిర్మించిన తొలిచిత్రం 'పెళ్ళిసందడి'. పరిశ్రమలో సీతారాం  నిర్మాతగా నిలదొక్కుకోవడానికి పెళ్ళిసందడి అన్నివిధాలా సహకరించింది.

 

వచ్చే వారం, మరల, ఘంటసాలవారి మరో సజీవరాగం తో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్


Saturday, 13 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 19 - రావే ముద్దుల రాధా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 19

పెళ్లినాటి ప్రమాణాలు - రావే ముద్దుల రాధా

ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయితో పరిచయం పెంచుకుని సరాసరి ఒంటరిగా వున్న ఆమె ఇంటికే వెళతాడు ఓ అభినవ కృష్ణుడు. వెళ్ళినవాడు ఊరికేవుండక అక్కడ గోడకున్న రాధాకృష్ణుల చిత్రాన్ని చూస్తూ పరవశంతో పగటికల కంటూ ఆ అమ్మాయితో ఓ చక్కటి ప్రణయగీతాన్ని మొదలెడతాడు...

కృష్ణుడు: రావే ముద్దుల రాధా నా ప్రేమరాశి నీవెగా 

నవ రత్నాల రాశివి నీవెగా! రావే!

రాధ:

పోవయ్యా శ్రీ కృష్ణా! నీ సరసాలన్నీ మాయలే 

నువు దూరాన ఉంటే మేలులే ! పోవయ్యా!

 

కృష్ణుడు:

వనితలెవ్వరు నీ సాటిరారే

నిన్నె నిరతము నే కోరినానే! వనిత!

కోపమేలా దయగను బాలా

తాపమింకా నే తాళజాల !రావే!

రాధ:

మనసు నిలకడ సుంతైన లేదా

తరుణి తరుణితో ఈ ఆటలేనా 

                                            !మనసు!

చాలు చాలును ఈ మాటలేలా

నీటిమూటలు నే నమ్మజాల

                                            !రావే ! ! పోవయ్యా

పెళ్ళికాని నవయవ్వనంలో వున్న యువతీయువకుల మధ్య ఇలాటి ప్రేమసల్లాపాలు, కీచులాటలు ఈరోజుల్లో సహజమని సర్దిపెట్టుకున్నా,  సౌందర్యవతియైన ఓ భార్య మొగుడు, ఓ ముగ్గురి పిల్లల తండ్రి ఈ విధమైన ప్రేమాలాపాలు వల్లిస్తూ  తనచుట్టూ తిరగడం,  అతని ఆఫీసులో పనిచేస్తున్న ఆ యువతికి ఇబ్బందికరంగా మారింది. అతనిని అల్లరిపెట్టి పదిమందిలో నిలబెట్టి బుధ్ధిచెప్పడానికి అతడు దుష్టుడో దుర్మార్గుడో కాదు. మనిషి మంచివాడు,  భార్యాబిడ్డలంటే చాలా మమకారం కలవాడు. కానీ అందమైన ఆడపిల్ల విషయంలో చపలత్వం అతని బలహీనత.  అప్పటికీ అతని అంతరాత్మ,  అతనికి నవీనపంథాలో వివాహం జరిపించిన సంఘసంస్కర్త  రూపంలో  అప్పుడప్పుడు ప్రత్యక్షమౌతూ పెళ్ళిరోజున ఆ నవదంపతులు చేసుకున్న ప్రమాణాలను గుర్తుచేసి అతని తప్పిదాన్ని హెచ్చరిస్తూనేవుంటుంది. అయితే కుక్కతోక వంకర సాఫు చేయబడుతుందా!

సుదీర్ఘంగా రోజులతరబడి సాగే సంప్రదాయ హిందూ వివాహాల తంతులో పురోహితులుకాని, పెళ్ళిపెద్దలుకానీ చేయించే ప్రమాణం ఏమిటి? దాని అంతరార్ధం ఏమిటి? ...

"ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి" ... దీనికి అర్ధం ఏమిటంటే... నీతినియమాలు పాటిస్తూ ధర్మపథంలో నడుచుకునే ప్రతీ విషయంలో, జీవనోపాధి కోసం సంపదను సన్మార్గంలో చేకూర్చుకునే విషయంలో, సంసారజీవితంలో సుఖసంతోషాలను కోరికలను తీర్చుకునే విషయంలో నీ అభిమతానికి విరుధ్ధంగా నడుచుకోను, ఎల్లప్పుడూ నీకు తోడు నీడగా వుంటానని అర్ధం.

(నిజ జీవితంలో   ఎంతమంది దంపతులు ఈ ప్రమాణానికి బధ్ధులై వ్యవహరిస్తున్నారో  అంతరాత్మ సాక్షిగా ఎవరికివారే ఆలోచించుకోవలసిన విషయం).

సంసారజీవితంలో భార్యాభర్తలకు ప్రేమగండం ఏర్పడుతుంది. భార్యకు పరపురుషుడి వలన, భర్తకు పరాయి స్త్రీ వలన ఈ ప్రేమగండం కలుగుతుంది. ఆ గండం నుండి బయటపడడానికి ఆ భార్యాభర్తలు తమ పెళ్ళిరోజున  కలసి వేసిన ఏడడుగులను, మంత్రాలసాక్షిగాపురోహితులు, బంధుమిత్రుల సమక్షంలో చేసుకున్న ప్రమాణాలను, వేసిన మూడు ముళ్ళ మంగళసూత్రాన్ని నిత్యమూ గుర్తుచేసుకోవాలి. తాము ఆ పని చేయకపోయినా తమ మనస్సాక్షి అనునిత్యమూ గుర్తుచేసి  వేధిస్తూనేవుంటుంది. ఆ మనస్సాక్షికి విరుధ్ధంగా తప్పిదాలు చేస్తే ఆ దంపతుల జీవితం సర్వనాశనం అవుతుందని అందువల్ల శీలం విషయంలో భార్యాభర్తలిద్దరూ నీతినియమాలు పాటించాలని పెళ్ళి ప్రమాణాలు చేయించిన పెద్దమనిషి హెచ్ఛరిస్తాడు. తనకు అటువంటి సమస్యే రాదని, తాను చాలా మనోనిగ్రహం కలవాడినని తనను ఏ ప్రేమగండమూ పీడించదని పదిమందిలో డంబాలు పలుకుతాడు మన హీరో.

"మొన్నటికన్నా నిన్నవింతగా

నిన్నటికన్నా నేడు వింతగా నీ సొగసు

నీ వగలు హాయి హాయిగా వెలసేనే...." అని  

"తనువు నాదిగా, మనసు నీదిగా... 

రేయి పగలుగా, పగలే రేయిగా 

నీతోనే లోకమూ నీతోనే స్వర్గమూ" 

అంటూ ప్రణయగీతాలు ఆలపించిన ఆ కథానాయకుడు ముగ్గురి బిడ్డల తండ్రి అయ్యాక తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో స్నేహం మొదలెట్టి పెళ్ళినాడు చేసిన ప్రమాణాలకు ద్రోహం చేస్తాడు. తమ స్నేహం లోకాతీతమని, అతి పవిత్రమని, సామాన్యులకు అర్థంకాని బంధమని అందుచేత పరపురుషులతో స్నేహం చేయవద్దని తనక్రింద పనిచేసే ఆ అమ్మాయికి హితోపదేశం చేస్తాడు. ఆ యువతి మాత్రం చాలా మంచిది. ఏ చెడు ఉధ్దేశాలు లేనిది. సంస్కారంగలది. అందుకే అతను ఆమెతో కలసి కనే పగటికలలో ఆమె...

" ఏదో తెలియక పిలచితినోయీ...

వాదుకు రాకోయీ...

అని

"మనసు నిలకడ సుంతైన లేదా...

తరుణి తరుణితో ఈ ఆటలేనా

చాలు చాలును ఈ మాటలేలా...."

అంటూ అతని ప్రేమకలాపాలను సున్నితంగా తిరస్కరిస్తూంటుంది. మంచి తెలివితేటలు, సంస్కారము, వివేకము, విచక్షణా గల ఆ అభ్యుదయ యువతి అతనిని సన్మార్గంలో పెట్టి అతని భార్యాపిల్లలకు సహాయపడడానికి నిశ్చయించుకుంటుంది. ఇదే  స్థూలంగా నేటి మన ఘంటసాల సజీవరాగానికి, ఈ పాట గల 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమాకు గల నేపథ్యం.

సినిమా డైరెక్టర్ హోదాలో సెట్ మీదకు వచ్చాక సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ ఆలోచించడం, సిగరెట్ పెట్టెల అట్టల వెనకాల ఆ సీన్ కు కావలసిన డైలాగ్ లు వ్రాయడం, డైలాగులు చెప్పడం చేతకాని నటీనటులచేత ఎబిసిడిలు 26 వల్లింపజేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ లచేత మాట్లాడించి వాయిస్ మిక్స్ చేయడం వంటి పధ్ధతులకు బధ్ధ విరోధి ఆయన. సినీమా  షూటింగ్ మొదలెట్టడానికి మూడు మాసాల ముందే పూర్తి సినీమాకు కావలసిన స్క్రిప్ట్, సీన్ డివిజన్, కెమెరా ఏంగిల్స్, షాట్ డివిజన్ మొదలైనవాటినన్నింటినీ స్వహస్తాలతో ఒక పెద్ద పుస్తకంలో రాసుకుని దానిని తు.చ. తప్పకుండా తెరకెక్కించడం ఆయన సంప్రదాయం. షూటింగ్ సమయంలో అంతకన్నా మంచి ఆలోచనలు మనసులో మెదలినా వాటిని తన తర్వాతి సినీమాలో ఉపయోగించవలసిందే తప్ప ఈ సినిమా స్క్రిప్ట్ ను మార్చడానికి ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అలాగే ఆ సినిమా కోసం కేటాయించబడిన ముడి ఫిల్మ్ కోటాలో,  అనుకున్న బడ్జెట్ లోపలే సినీమాను ముగించడంలో అఖండుడు ఆయన. సినీ నిర్మాణానికి బ్రహ్మర్షి, మార్గదర్శి.

ఆయనే కదిరి వెంకటరెడ్డి. కళ, వ్యాపారం రెంటిని సమాన పాళ్ళలో అనుసరిస్తూ సినీమాలు తీసిన అత్యుత్తమ దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన అడుగుజాడలలోనే నడిచి దర్శక నిర్మాత గా ఎనలేని ఖ్యాతి నార్జించిన నటుడు ఎన్.టి.రామారావు. ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు తన మొదటి  సాంఘిక చిత్రానికి కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని కాచుకుని కూర్చొని కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో 'దొంగరాముడు' సినీమా ను తీశారు అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదనరావుగారు.

భక్తి, జానపదపౌరాణిక చిత్రదర్శకత్వంలో అసమాన్యుడైన కె.వి.రెడ్డిగారు నిర్మాతగా తన జయంతీ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన తొలి సాంఘిక చిత్రం 'పెళ్ళినాటి ప్రమాణాలు'  తన 30 ఏళ్ళ సినిమా జీవితంలో కె.వి.రెడ్డిగారు మూడే మూడు సాంఘిక సినిమాలకు దర్శకత్వం వహించారు. అవి వాహినీవారి 'పెద్ద మనుషులు',  అన్నపూర్ణా పిక్చర్స్ 'దొంగరాముడు', జయంతీ పిక్చర్స్ 'పెళ్ళినాటి ప్రమాణాలు'. మూడూ మూడు ఆణిముత్యాలు. ఈ మూడు సినీమాలు ఘనమైన ఆర్ధిక విజయం సాధించడమే కాక ఉత్తమ చిత్రాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం బహుమతులు  పొందాయి.

తొలిసారిగా కె.వి.రెడ్డిగారు నిర్మాతగా, దర్శకుడిగా  తెలుగు ప్రేక్షకులకు సమర్పించిన చిత్ర కళాఖండం 'పెళ్ళినాటి ప్రమాణాలు'. పెళ్ళైన మగవారి చపలత్వం, పరస్త్రీ వ్యామోహం కథాంశంగా గల సినీమా. కథాంశం తీవ్రమైనదీ, గంభీరమైనదీ అయినా  ఏడ్పులు పెడబొబ్బలు, శోకగీతాలతో ప్రేక్షకులను విసిగించకుండా ఆద్యంతం వినోదాన్ని పుష్కలంగా పంచి సినిమాను హాస్యరసాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ద్వారా సమాజానికి తాను ఇవ్వదల్చిన సందేశాన్ని అతి సున్నితంగా అందించారు కె.వి. రెడ్డి. తనకు అత్యంత సన్నిహితులైన పింగళి నాగేంద్రరావుగారి మాటలు పాటలు, ఘంటసాల వేంకటేశ్వరరావుగారి సంగీతం ఈ సినిమా ఉన్నత ప్రమాణాలకు ఎంతో దోహదం చేశాయి. పింగళి వారి మాటల్లోని, పాటల్లోని సున్నితమైన హాస్యం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

కథా వస్తువుకు అనుగుణంగా తన సంగీతాన్ని కూడా వినోదభరితంగా జనరంజకంగా సమకూర్చారు ఘంటసాల. పెళ్ళినాటి ప్రమాణాలు సినీమా లో మొత్తం 11 పాటలు పద్యాలు వున్నాయి. అందులో ఓ రెండు పాటలు తప్ప మిగిలినవన్నీ హాస్యశృంగారరస ప్రధానమే. ఆ మూడ్ ను చిత్రం ఆద్యంతం అద్భుతంగా  కొనసాగించారు ఘంటసాల. హీరో  ఎ.ఎన్.ఆర్. పాటలను ఘంటసాల, హీరోయిన్ జమున పాటలను పి.లీల, సెకెండ్ హీరోయిన్ రాజసులోచన పాటలను పి.సుశీల ఎంతో ఉత్సాహభరితంగా ఆలపించారు. మిగిలినవాటిని జిక్కి, సురభి కమలాబాయి, మాధవపెద్ది పాడారు. ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో   అన్ని పాటలు బహుళ జనాదరణ పొందిన సినిమాల లిస్ట్ లోనికి పెళ్ళినాటి ప్రమాణాలు పాటలు కూడా నిస్సందేహంగా చోటుచేసుకుంటాయి. అందుకు ఘంటసాలవారి సంగీతప్రతిభ కొంత కారణమైతే దర్శకుడు కె.వి.రెడ్డిగారి సంగీతాభిరుచి మరికొంత కారణం.

ఈనాటి మన సజీవరాగం - 'రావే ముద్దుల రాధా నా ప్రేమరాశివి నీవెగా నవరత్నాల రాశివి నీవెగా...ఘంటసాల, పి.సుశీల ఆలపించిన ఈ యుగళగీతాన్ని తెరమీద అక్కినేని, రాజసులోచన రాధాకృష్ణుల పాత్రలలో ఎంతో ఉత్సాహంగా అభినయించి ప్రేక్షకులను సమ్మోహనపర్చారు.

ఈ పాటను స్వరపర్చడానికి ఘంటసాల మాస్టారు హిందుస్థానీ రాగమైన పీలును  ఉపయోగించుకున్నారు. పీలు రాగం  హిందుస్థానీ కాఫి థాట్ కు చెందిన రాగం. వక్రసంచారంతో 12 స్వరాలు పలికే సంపూర్ణరాగం. తుమ్రీ, భజన్స్ వంటి లలిత-శాస్త్రీయ గీతాలు, భక్తిశృంగార రస గీతాలాపనకు అనువైన రాగం పీలు. కానీ, ఘంటసాలగారివంటి ఉద్దండ సంగీతదర్శకులు పీలు రాగాన్ని విషాదగీతాలకు కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. అందుకు ఉదాహరణ 'పుణ్యవతి' లోని 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు ' పాట. హిందుస్థానీ సంగీతంలోని కిర్వాని, గార వంటి రాగాలు ఈ పీలును పోలివుంటాయి. కర్ణాటక సంగీతంలో పీలుకు సమాంతరమైన రాగం కాపి. ఈ పీలు రాగంలో బహుళ జనాదరణ పొందిన  పాటలెన్నో తెలుగు, హిందీ సినిమాలలో వున్నాయి. పీలురాగ లక్షణాలన్నింటిని సక్రమంగా కనపరుస్తూ ఘంటసాల, సుశీల 'రావే ముద్దుల రాధా...' యుగళగీతాన్ని అత్యంత మధురంగా ఆలపించారు.

ఈ పాటలో వినిపించే తబలా జతులు,  గజ్జెల సవ్వడులతో,  వీణ, సితార్, షెహనాయ్, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్ ల సముదాయంతో చేసిన నేపథ్యసంగీతంతో  పీలు రాగభావాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తూ శ్రోతలకు రసానందాన్ని కలిగించారు ఘంటసాల.

పెళ్ళినాటి ప్రమాణాలులో ఈ యుగళం మాత్రమే కాదు, అన్ని పాటలు శ్రవణానందాన్ని కలిగించేవే శ్రోతలలో రసహృదయం వున్నంతవరకూ, లాలిత్యంతో కూడిన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నంతవరకూ ఘంటసాల గీతాలు సజీవరాగాలే.


వచ్చేవారం, మరల, మదిలో మెదిలే మరో సజీవరాగంతో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 21 - రేయీ మించెనోయి రాజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...