Saturday, 30 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 17 - ఓ నా రాజా... ఇటు చూడవోయీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 17


సారంగధర - ఓ నా రాజా... ఇటు చూడవోయీ

 

'అమ్మాయి తంజావూరు తమిళం... అబ్బాయి రాజమండ్రి తెలుగు...అంటే లౌవ్ మ్యారేజి అన్నమాట...,  అదేం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే... పెళ్ళి తంజావూరు, రిసెప్షన్ రాజమండ్రి. రెండు పక్కలవారు బాగా కావలసినవాళ్ళే.'

'ఎక్కడి రాజమండ్రి, ఎక్కడి తంజావూరు!  ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో కదా! సాంస్కృతిక సమైక్యత అంటే ఇదే. రాజమహేంద్రవరం(రాజమండ్రి), తంజావూరుల సత్సంబంధం అనగానే హిందూదేశ  చరిత్ర పట్ల ఆసక్తికలవారికి వేయి సంవత్సరాల క్రితం నాటి దక్షిణ భారత తూర్పు చాళుక్య, చోళ సామ్రాజ్యాల వైభవం, కళాప్రాభవం గుర్తుకు రాకతప్పదు.

పదవ శతాబ్దంలో గోదావరి పరివాహిక ప్రాంతమైన వేంగి సామ్రాజ్యాన్ని  పరిపాలించిన తూర్పు చాళుక్య మహారాజు విమలాదిత్యుడు. ఆయన భార్య కుందవై. వీరి కుమారుడు రాజరాజ నరేంద్రుడు. ఇతని తల్లియైన కుందవై తంజావూరు కేంద్రంగా సువిశాల దక్షిణాది ప్రాంతాలను పరిపాలించిన  మొదటి రాజరాజచోళుడి కుమార్తె.  రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతని కుమార్తె అమ్మంగాదేవి చాళుక్య ప్రభువైన రాజరాజ నరేందుని భార్య.ఈ దంపతుల కుమారుడు రాజేంద్ర చాళుక్యుడు. ఈయన చోళరాజులైన రాజేంద్ర చోళుడు, వీరరాజేంద్ర చోళుడు, ఆ తర్వాత వచ్చిన అధిరాజేంద్రుని మరణానంతరం 1070 లో చోళ సింహాసనాన్ని అధిష్టించి కులోత్తుంగ చోళునిగా పేరు మార్చుకున్నాడు. గోదావరి ప్రాంత వేంగి రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో విలీనం చేసి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. శ్రీలంక, దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతాల వరకు చోళ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.

ఈ విధంగా ఈ రెండు రాజ్యాలు దక్షిణభారతాన్ని కొన్ని శతాబ్దాల కాలం నిరాటంకంగా పరిపాలించాయి. ఈ కాలంలోనే దక్షిణాదిన దేవాలయ సంస్కృతి, సంగీత, సాహిత్య, నృత్యశిల్పాది లలితకళలు అమితంగా పోషించబడి సాంస్కృతిక నిలయంగా పరిఢవిల్లింది.

తర్వాతి కాలంలో ఈ చరిత్రల ఆధారంగా వెలువడిన గురజాడ అప్పారావుగారి 'సారంగధర'( ఇంగ్లీషు, తెలుగు)కల్కి కృష్ణమూర్తిగారి ('పొన్నియిన్ శెల్వన్' - తమిళం), వీటి ఆధారంగా రూపొందించబడిన 'సారంగధర', 'రాజరాజ చోళన్', మణిరత్నంగారి 'పొన్నియిన్ శెల్వన్' తెలుగు, తమిళచిత్ర కళాఖండాలు వరసగా మన కళ్ళముందు మెదులుతాయి.

11వ శతాబ్దపు 'సారంగధర' చరిత్ర ఒక కాల్పనిక చారిత్రక గాధ.  కాదు నిజంగానే జరిగిందని కొందరి నమ్మిక. అందుకు  రాజమహేంద్రవరం (రాజమండ్రి) లోని సారంగధర మెట్ట, చిత్రాంగి, రత్నాంగి మేడలే నిదర్శనమని చెపుతారు. గురజాడ అప్పారావుగారు వ్రాసిన సారంగధర చరిత్ర పద్య నాటకం తెలుగు, ఇంగ్లీషు భాషలలో దేశవ్యాప్తంగా ప్రదర్శించబడి మిక్కిలి ప్రసిధ్ది పొందింది.

ఈ పద్య నాటకం ఆధారంగా సారంగధర చరిత్రను మూడుసార్లు సినిమా గా తీశారు. 1930 లో వై.వి.రావు మూకీ చిత్రం, 1937 లో బందాకనకలింగేశ్వరరావు సారంగధరుడిగా, శాంతకుమారి చిత్రాంగిగా, కన్నాంబ రత్నాంగిగా  పి పుల్లయ్య దర్శకత్వంలోమరల 1957 లో ఎన్.టి.రామారావు సారంగధరుడిగాపి.భానుమతి చిత్రాంగిగా  నిర్మించారు. ఇదే సినిమాను తమిళంలో కూడా శివాజీ గణేశన్ హీరోగా తీసి 1958 లో విడుదల చేశారు. తెలుగులో నటించిన భానుమతి, ఎస్.వి.రంగారావు, రాజసులోచన, శాంతకుమారి తమిళంలో కూడా నటించగా, నంబియార్ వంటి మరికొందరు తమిళ నటులు తమిళంలో నటించారు. తమిళం సినిమాకు జి.రామనాథన్, తెలుగులో ఘంటసాల సంగీతం నిర్వహించారు. ఎవరి బాణీలు వారివే. తెలుగు, తమిళ గీతాలు వేర్వేరు వరసలలో కూర్చబడ్డాయి.

ఘంటసాలవారి బాణీలో చిత్రాంగి భానుమతి అద్భుతంగా ఆలపించిన ఒక మధురాతి మధుర గీతమే నేటి మన సజీవరాగం.

విశేషాలులోకీ వెళ్ళేముందు ఆ పాట సన్నివేశ పూర్వాపరాలు చూద్దాము.

సారంగధర కథలో ప్రధాన పాత్రయైన చిత్రాంగి అందచందాలు వాటివెనుక దాగిన తీవ్రమైన  ఆమె గుణాతిశయాల  విషయంలో సకలశాస్త్ర పారంగతుడురాజగురువు, ఆదికవియైన నన్నయభట్టు చేసిన  హితోపదేశాలు పెడచెవినబెట్టికుమారుడు సారంగధరుడికి చిత్రాంగిని వివాహం చేసుకోవడం ఇష్టంలేదని తెలిసిన తర్వాత  వియ్యమందకపోతే కయ్యం తప్పదన్న నిర్బంధం ఒకప్రక్క, చిత్రాంగి అందచందాల వ్యామోహం మరోప్రక్క వేంగిచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ప్రలోభాలకు గురిచేసింది. దుష్టుడైన ఒక సేనాపతి కుయుక్తితో వంశాచారం పేరుతో కత్తికి బాసికం కట్టించి   ఆమెను మోసగించి వివాహమాడతాడు.

రాజగురువు ముందుగానే ఊహించి చెప్పినట్లు చిత్రాంగి రాకతో, ఆమెలో రగిలిన పగ విద్వేషాల కారణంగా ఎన్నో అనర్ధాలు జరిగి వంశనాశనం జరుగుతుంది. సినిమాలో కథను విషాదాంతం చేయడం ఇష్టంలేక  చనిపోయిన సారంగధరుని ఒక సిద్ధుని  దయవలన మరల బ్రతికించినట్లు చూపించారని ఒక అభిప్రాయం వుంది.

ఇక మన సజీవరాగం విషయానికి వద్దాము.

తాను మెచ్చిన యువకుడి (సారంగధరుడు) నే తన తండ్రికూడా తనకు వరుడిగా నిర్ణయించాడని తెలిసి చిత్రాంగి( భానుమతి) మహదానందంతో అతని చిత్రపటం చూస్తూ పాడిన పాట ... ఓ నా రాజా! ఇటు చూడవోయీ... చిత్రాంగి - భానుమతి - గానం, ఘంటసాల సంగీతం, సముద్రాల సీ. గీత రచన


ఓ నా రాజా... ఇటు చూడవోయీ

నేనోయ్... భీతి వలదోయీ ! ఓ నా రాజా

అలిగిపోతివి అలనాడు

ఔనా నేడేది నీకు దారి ! ఓ నా రాజా!

 

కోరి తమి మీరి దరిజేరనా

మురిసి నీ మ్రోల కరిగిపోనా

వేసీ కూరిమి చెరలోనా ఆ...

కొసరి నా దాసు జేసుకోనా

                                ! ఓ నా రాజా ! 


చిత్రాంగి చిన్నెలు అనే నానుడి వుంది. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్యులవారు ఉపయోగించిన - 'నేనోయ్', 'భీతి వలదోయీ', ' నేడేది నీకు దారి', కూరిమి చెర', 'కొసరి నా దాసు చేసుకోనా' అనే పదాలు చిత్రాంగి యొక్క అభిజాత్యం , మనోప్రవృత్తి స్పష్టం చేస్తాయి. ఈ సన్నివేశానికి ముందు వచ్చే సన్నివేశంలో సారంగధరుడుఅతని ప్రేయసి కనకాంగి ల మధ్య 'అన్నానా! భామిని ఏమని' అనే యుగళగీతం సాగుతుంది. అందులో  కనకాంగి 'నిన్నే నమ్ముకున్నానని నీవే నా దైవమని' అనే భావాన్ని ప్రకటించడంలో  ఆమె యొక్క వినయవిధేయతలు ప్రియుడిపట్ల గల ఆరాధనాభావం వెల్లడవుతోంది.

ఈ రెండు పాటల ద్వారా చిత్రాంగి, కనకాంగి పాత్రల గుణగణాలను, తీరుతెన్నులను  ఆచార్యులవారు చక్కగా తెలియజెప్పారు. సంగీతదర్శకుడిగా ఘంటసాలగారు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతిగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం 'సారంగధర'. భానుమతి గారు నటించిన 'పుణ్యవతి'కి కూడా ఘంటసాలగారే సంగీతదర్శకుడైనా ఆ సినిమా లో భానుమతిగారు పాడిన పాటలు లేవు. విశేషమే.

సారంగధర చిత్రం లో భానుమతిగారు నాలుగు పాటలు పాడారు. డ్యూయెట్లు లేవు. ఘంటసాలగారితో కలసి కొన్ని సంవాద పద్యాలు వున్నాయి. భానుమతి , ఘంటసాలగార్ల మధ్య మనస్పర్ధలున్నాయని ఆ కారణంగా సారంగధర లోని భానుమతి గారి పాటలను వేరొకరిచేత చేయించారనే అపోహ ప్రచారమయింది. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజంలేదని సారంగధర సినిమాలోని భానుమతిగారి పాటలను ఘంటసాలగారే పూర్తిగా స్వరపర్చారని, ఆయనే స్వయంగా భానుమతిగారి చేత ఆ పాటల రిహార్సల్స్ చేయించి రికార్డింగ్స్ జరిపించారని సారంగధర సినీమాకు పనిచేసిన ఘంటసాలగారి సహాయకుడు సంగీత దర్శకుడు పి.సంగీతరావుగారు స్పష్టం చేశారు.

ఆపారమైన శాస్త్రీయ సంగీతానుభవం గల ఘంటసాల మాస్టారు 'ఓ నా రాజా.... ఇటు చూడవోయీ' పాటను 'యమన్అనే హిందుస్థానీ రాగంలో స్వరపర్చి తనకు కావలసిన రీతిలో భానుమతి గారిచేత అద్భుతంగా పాడించారు. హిందుస్థానీ 'యమన్' రాగాన్నే మన కర్ణాటక సంగీతంలో 'కళ్యాణి' అంటారు. కళ్యాణి రాగంలో ఘంటసాల మాస్టారు చేసిన పాటలు, ఇతరులకోసం పాడిన పాటలు జగత్ప్రసిధ్ధి పొందిన విషయం సంగీతాభిమానులందరికీ తెలిసినదే.

భానుమతి గారి గళంలోని, శ్రావ్యతరాగభావాలు, పాత్రోచిత అభినయం 'ఓ నా రాజా.. ఇటు చూడవోయీ...పాటకు వన్నె తెచ్చి  సజీవరాగం చేశాయి.  పాటలోని గమకాలలో ఆలాపనలో, భావప్రకటనలో ఘంటసాలగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ పాటలో వీణ, పియానో, గిటార్, మేండొలిన్, వయొలిన్స్ , ఫ్లూట్, క్లారినెట్, తబలా, ఇతర రిథిమ్స్ భానుమతిగారి పాటకు దీటుగా అమరాయి.

సముద్రాల సీనియర్ గారి పాత్రోచిత సంభాషణలు, పాటలు సారంగధర చిత్రానికి నిండుదనాన్ని, గౌరవాన్ని తెచ్చాయి. సందర్భానుసారంగా ఉపయోగించిన నన్నయభట్టు ఆంధ్రమహాభారత పద్యాలుచేమకూర వెంకటకవి సారంగధర నాటక పద్యాలు ఈ సినిమాకు వన్నె తెచ్చాయి.  సారంగధర సినిమాలో మొత్తం 22 పాటలుపద్యాలు వున్నాయి. వాటన్నింటినీ ఘంటసాల, భానుమతి, పి.లీల, జిక్కి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత మొదలగువారు పాడారు.

సారంగధర చిత్రంలోని నటీనటులంతా హేమాహేమీలే ... ఎస్.వి.రంగారావు (రాజరాజనరేంద్రుడు)ఎన్.టి.రామారావు (సారంగధరుడు)భానుమతి (చిత్రాంగి)రత్నాంగి (శాంతకుమారి)రాజసులోచన (కనకాంగి)గుమ్మడి (సింగన మంత్రి)ముక్కామల ( దుష్ట సేనాపతి)మిక్కిలినేని (నన్నయభట్టు)చలం (సుబుధ్ధి)ఎ.వి.సుబ్బారావు (చిత్రాంగి తండ్రి), రేలంగి, సురభి బాలసరస్వతి ( చిత్రాంగి చెలికత్తె) అందరూ తమ తమ పాత్రలలో పూర్తిగా లీనమైపోయి నటించారు. తెలుగు, తమిళ భాషా చిత్రానికి  వి.ఎస్.రాఘవన్కె.ఎస్.రామచంద్రరావులు దర్శకత్వం వహించగా మినర్వా పిక్చర్స్ బ్యానర్ మీద టి నామదేవ రెడ్డియార్  సారంగధర చిత్రాన్ని నిర్మించారు.

సారంగధర సినిమా మా కుటుంబానికి ఎప్పటికి మరుపురాని, మరువలేని మధుర జ్ఞాపకం. 1957 ఏప్రిల్ లో మా తాతగారు, ఘంటసాలవారికి గురుదేవులైన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం లో కాలధర్మం చెందారు. గురువుగారి స్మృతికి చిహ్నంగా ఘంటసాలగారు  గురువుగారి 'లలితే సరసగాన కళాశ్రితే' అనే కీర్తనను సారంగధర సినిమా టైటిల్ మ్యూజిక్ గా మలచి గురువుగారి పట్ల తనకు గల శ్రధ్ధాభక్తులను చాటుకున్నారు.



కొసమెరుపు - 

ఇప్పుడు చెన్నైలో వున్న  తేనాంపేట మెట్రో రైల్వే స్టేషన్ వెనక వేపు రేవతీ స్టూడియో ఉండేది. దానిని మౌంట్ రోడ్ రేవతి అనేవారు. ఆ రేవతీ స్టూడియోలోనే 'సారంగధర' సినిమా పాటల రికార్డింగ్రీ-రికార్డింగ్ జరిగింది. సౌండ్ ఇంజనీర్ కణ్ణన్ అనే గుర్తు.  చాలా భాగం రీరికార్డింగ్ లకు నేనూ వెళ్ళేవాడిని . వరసగా ఓ మూడు రోజులపాటు 2-9 కాల్షీట్ లో ఆ సినిమా రీ-రికార్డింగ్ జరిగిన గుర్తు.

రీరికార్డింగ్ సమయంలో సౌండ్ లేకుండా సినిమా చూస్తూ డైలాగ్స్ పోర్షన్ మీద ఆర్కెష్ట్రా మ్యూజిక్ పోస్ట్ చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం ఆరు-ఏడు గంటల మధ్య టీ బ్రేక్. ఆ సమయంలో  ఆరుబయట లాన్స్ లో అందరూ ఆ సినిమా కంపెనీవారు ఇచ్చే కాఫీ టిఫిన్లు ఆరగించి, సిగరెట్లు కాలుస్తూ లోకాభిరామాయణం చేసేవారు. ఒకరోజు అలాటి సమయంలో తూర్పు ఆకాశంలో దూరంగా మిణుకుమిణుకుమంటూ ఏవో  పయనించడం కనిపించింది. ఆ చీకట్లో ఆకారాలేవీ కనపడలేదు. అవి కాంటినెంటల్ సూపర్ జెట్స్ అని కొందరు, కాదు ఎయిర్ బెలూన్స్ అనిఅదేం కాదు పేపర్లలో కూడా వచ్చింది అవి ఫ్లైయింగ్ సాసర్సే అని వాటిలో ఇతర గ్రహవాసులుంటారని వాళ్ళవల్ల మన భూమికి నాశనం ఏర్పడుతుందని, ఇలా  రకరకాలుగా చర్చించుకోవడం మొదలెట్టారు. ఇంతలో వీళ్ళ చర్చలకు బ్రేక్ ఇస్తూ నెక్స్ట్ సీన్ రీరికార్డింగ్ కు మాస్టారి పిలుపురావడంతో ఆర్కెష్ట్రా అంతా ధియేటర్లోకి పరుగెత్తారు. ఆ తర్వాత ఆ కాంతి గ్రహాల గురించి పట్టించుకున్నవాళ్ళే లేరు.


వచ్చేవారంఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్


Saturday, 23 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 16 - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 16


వినాయకచవితి - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే


"ఈ శెలవుల్లో మనందరం  అమ్మమ్మగారి వూరెడుతున్నాం"  అమ్మకి ఆనందం, పిల్లలికి ఆటంబాంబ్. "అమ్మమ్మ ఊరికా! నో ఛాన్స్, నేను ఛస్తే రాను! అక్కడికి వస్తే అమ్మమ్మ  వారం వారం నలుగుపిండితో నలుచుకుని కుంకుడుకాయరసంతో తలంటు స్నానం అంటూ టార్చర్ పెడుతుంది. ఆ హరాస్మెంట్ భరించడం నావల్లకాదు. నే రానంటె రానే రాను"  మనవడి ఓవర్ రియాక్షన్.

"నలుగుపిండితో తలంటుస్నానం ఒంటికి ఎంతో మంచిది తెలుసా! మీ షాంపూలు, షవర్ బాత్ ల కంటే చాలా ఆరోగ్యకరం. మా చిన్నప్పుడు విధీగా ప్రతీ శనివారం తెల్లవారుజామునే పిల్లల్ని లేపి ఒంటికి నువ్వులనూనె పట్టించి, బియ్యపుపిండి, శెనగపిండిలో పసుపుపొడి, పన్నీరు  వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి, ఆ ముద్దతో ఒళ్ళంతా నలిచి, కుంకుడుకాయరసంతోనో లేకపోతే షీకాయ ముద్దతోనో తలంటు స్నానం చేయించేవాళ్ళు! ఆ తర్వాత సాంబ్రాణి పొగతో జుట్టంతా ఆరబెట్టి జడలేశేవారు. ఇప్పటికీ నా ఒళ్ళు ఇంత నున్నగా, నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా వుందంటే దానికి కారణం నలుగుపిండి స్నానమే తెలుసా!" బామ్మ సెల్ఫీ.

మా బామ్మ  పురాణకాలపు కబుర్లని , సూక్తిముక్తావళిని శ్రద్ధగా వింటూ పాటించే ఏకైక శ్రోత మా మున్నీ ఒక్కర్తే. నలుగుపిండి తయారీ గురించి వాటిలోని ఔషధ గుణాలగురించిఅవి మన ఒంటికి చేసే మంచి గురించి బామ్మ లెక్చెర్ ని మహా శ్రద్ధగా ఆలకిస్తోంది.

"అసలు నలుగుపిండి తలంటు స్నానం వెనుక ఒక గొప్ప పౌరాణిక గాధే వుంది తెలుసా"!  కథలు, కాకరకాయలు అంటే మైమరచిపోయే మా మున్నీ ఆ కధేమిటో చెప్పమని బామ్మని ఊదరకొట్టింది.

అప్పుడు మా బామ్మ చెప్పిన కథాకధనం బెట్టిదనినా...

ఫ్లాష్ బ్యాక్ లో...

కైలాసం  

హిమవన్నగంలో పార్వతీ పరమేశ్వరుల ఆవాసం. ఇల్లు, ఇల్లాలు అసలు ఈలోకంతోనే సంబంధం లేదనట్లుగా ఒక ఏకాంత ప్రదేశంలో శివుడు ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తూ  తపస్సమాధిలో  వున్నాడు. పతి ప్రేమాదరణలకు దూరమై ఏకాంతవాసంలో వున్న పార్వతి ...

మధురహాసా మృదువిలాసా

శైలసుత హృదయేశా కరుణించి 

తనను దరిచేర్చుకోమని దీనంగా ప్రార్ధిస్తున్నది. పార్వతి విరహవేదనను, శోకాన్ని తట్టుకోలేని చెలికత్తెలు స్వాంతన వాక్యాలు పలికి పార్వతిని సర్వాంగసుందరంగా అలంకరించి మహేశునిచెంతకు తీసుకువెళ్ళాలని పరిపరివిధాలుగా సపర్యలు చేయడం మొదలెడతారు. అందులో భాగంగా పార్వతీదేవి చెలికత్తెలంతా ....

"నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

చెలువుగ శ్రీగౌరికిపుడు నలుగిడరారే!


పసిడిపూలపీటా శివునిల్లాలికి వేయరే

జతజేసి కస్తూరి జవ్వాజీ పూయరే

పసుపుగలిపి చందనమూ నెమ్మేన రాయరే! నలుగిడరే!

 

మనసులోని వగదీరా పన్నీరు చల్లరే

చిన్నారీ కన్నులలో  వెన్నెలలు కాయగా 

చెలియ మోము గని శివుడే చిందేసి డాయగా ! నలుగిడరే!


అంటూ నృత్యగీతాలతో  పార్వతి దేహమంతా పరిమళద్రవ్యాలు కలిపిన నలుగుపిండితో నలిచి అభ్యంగన స్నానానికి సంసిద్ధం చేస్తారు. ఆ విధంగా తన శరీరానికి పట్టించిన నలుగుపిండితో  పార్వతీదేవి ఒక అందమైన బాలుడి ప్రతిమను రూపొందిస్తుంది. అతి సుందరంగా వున్న ఆ బాలుడి ప్రతిమను చూసి ముచ్చటపడిన చెలికత్తెలంతా ఆ బొమ్మకు ప్రాణం పోయమని కోరడంతో పార్వతీదేవి తన దివ్యశక్తులతో ఆ ప్రతిమకు ప్రాణంపోస్తుంది. ముద్దులొలికే ఆ బాలుడిని చూసి పార్వతి మాతృహృదయం ఉప్పొంగి ఆ బాలుని తన కుమారునిగా స్వీకరిస్తుంది. తాను స్నానం చేసి వచ్చేదాకా పరులెవ్వరు లోపలికి రాకుండా కాపలాగా వుండమని తన కుమారుని ఆదేశించి లోపలకు వెళుతుంది.

అదే సమయంలో పరమశివుడు తన ధ్యానాన్ని ముగించుకుని పార్వతి ని చూచేందుకు వస్తాడు. శివుడు లోపలికి వెళ్ళడానికి వీలులేకుండా పార్వతీపుత్రుడు అడ్డుపడతాడు. ఇద్దరిమధ్యా వాగ్వాదం పెరిగి పెద్దై ఆగ్రహావేశాలతో త్రినేత్రుడు ఆ బాలుని శిరస్సును   తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఇంతలో స్నానంచేసి వచ్చిన పార్వతి తన కుమారుని మృతదేహాన్ని చూసి తీవ్రంగా చలించి విలపిస్తుంది. తర్వాతే పరమేశ్వరుడు జరిగిన విషయమంతా తెలుసుకుని పార్వతీ పుత్రుని పునరుజ్జీవుడిని చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఆ బాలుని శిరస్సు లభించకపోవడం ఉత్తరదిక్కుగా పోయి ఉత్తరాభిముఖంగా తలపెట్టుకొని వున్న ఏ జీవి శిరస్సునైనా తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞ మేరకు శివసేవకులు ఉత్తరాభిముఖంగా వున్న ఒక ఏనుగు శిరస్సును ఖండించి తీసుకువస్తారు. ఆ శిరస్సును మృతదేహానికి అతికించి మరల ప్రాణాలను పోస్తాడు మహేశ్వరుడు. ఆవిధంగా పార్వతీ తనయుడు గజముఖుడు అయ్యాడు. తర్వాత, పరమశివుడు ఆ కుమారుని కైలాసంలోని ప్రమధగణాలకు అధిపతిని చేశాడు. అందువలన గణపతి అని పిలవబడుతున్నాడు. ఏ కార్యం తలపెట్టినా తనను తొలుతగా పూజించి ప్రార్ధించేవారికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఆ కార్యం విజయవంతం చేసే దైవం కనుక గణపతిని విఘ్నేశ్వరుడని , వినాయకుడని దేవతలందరిచేతా కీర్తించబడ్డాడు. ఈనాటికీ మన అందరికీ తొలిదైవం వినాయకుడే.

అదీ కథ. చూశావా ! నలుగుపిండి స్నానం వెనుక ఎంతటి మహత్తర గాధ వున్నదో !

ఈవిధంగా నలుగుపిండి మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగమైపోయింది. పెళ్ళిళ్ళుపండగలు, మరే ఇతర శుభకార్యాలు జరిగినా మంగళకరమైన ఈ నలుగుపిండి స్నానాలు తప్పనిసరి.

మన పౌరాణిక గాధలలో కూడా దేవుళ్ళ కళ్యాణ ఘట్టాలలో ఈ నలుగు స్నానాల గురించి రసవత్తర వర్ణనలు కనిపిస్తాయి. మన జనపదాలలో  స్త్రీలకు సంబంధించిన అనేక పాటలలో నలుగు పాటలకు కూడా ప్రాముఖ్యత నిచ్చారు. గత తరం వరకు  భారతీయ స్త్రీలంతా ఆయా పాటలను తమ తల్లులు, అమ్మమ్మలు, బామ్మల ద్వారా నేర్చుకుని పండగ పర్వదినాలలో సందర్భానుసారంగా ఆ గీతాలను భక్తిశ్రధ్ధలతో పాడుతూ సంతోషంగా గడిపేవారు.

ఈ సదాచారాన్ని మన సినిమాలు కూడా బాగానే  ఉపయోగించుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పడుతూ వాటి విశిష్టతను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకుని, చూసి ఆనందించేలా చక్కటి నృత్యగీత సన్నివేశాలను రసవత్తరంగా రూపొందిచేవారు. ఎంతో కళాత్మకదృష్టితో ఉదాత్తంగా ఆయా ఘట్టాలను కన్నులకింపుగా చిత్రీకరించేవారు. కన్నులకువీనులకు విందుచేసే అటువంటి నృత్యగీతం ... 'నలుగిడరే నలుగిడరే నలుగిడరారే' 1957 నాటి పౌరాణిక చిత్రరాజం 'వినాయకచవితి' సినీమాలోని పాట అదే నేటి మన సజీవరాగం.

ట్యాలెంట్ ఉన్న కళాకారులెందరో సినిమా రంగంలో వుండేవారు. అయితే వారందరికీ నిరంతరం అవకాశాలు లభించేవికావు. ప్రతిభ, విద్వత్ గల ఎంతోమంది గాయనీగాయకులు ప్రథమశ్రేణి గాయకులుగా రాణించే అవకాశాలు లభించక కోరస్ సింగర్స్ గానే మిగిలిపోయారు. అలాటి వారిని చూసి ఘంటసాల మాస్టారు చాలా బాధపడేవారు. అవకాశం వున్నంతవరకు తన సంగీతదర్శకత్వంలో కోరస్ పాటలు పాడే గాయనీగాయకులను ఎంతగానో ఆదుకుని ప్రోత్సహించేవారు.

ఈ నాటి మన సజీవరాగ గీతం ఒక బృందగానమే.  ఘంటసాల  మాస్టారు ఈ పాటను వైదేహి, ఉడత సరోజినిసత్యవతి అనే  గాయనులచేత సన్నివేశానికి తగినట్లుగా భావరాగ గమకయుక్తంగా పాడించారు. వినాయకచవితి సినిమాలో ఈ సన్నివేశంలో తెరమీద పార్వతీ దేవిగా సూర్యకళ, చెలికత్తెలుగా బాల, రాజేశ్వరి, శ్రీదేవీలు నటించారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి  తన శుద్ధశాస్త్రీయ సంగీత విద్వత్ ను ఉపయోగించలేదు. సాధారణ కుటుంబాలలో సంగీతం తెలియని సామాన్య స్త్రీలు పాడుకునే  నోముల పాటలు, మంగళహారతుల పాటల రీతిని అనుసరిస్తూ మన ప్రాంతీయత ప్రతిబింబించేలా సున్నితంగా, శ్రావ్యంగా ఈ పాటను తనదైన శైలిలో పాడించారు. ఇదమిద్ధంగా ఈ పాట ఫలానా రాగంలో వుందని చెప్పబడదు కానీ, ఖమాస్, దేశ్, తిలాంగ్ రాగ ఛాయలు వున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రాగాలు హిందుస్థానీ సంగీతం లోని ఖమాస్ థాట్ కు చెందినవే.

ఈ సందర్భం స్నానానికి, అందుకు సంబంధించిన వస్తుసామగ్రితో నిండినది కావడంతో ఘంటసాల మాస్టారు ఈ పాటలో జలతరంగిణి, ట్యూబోఫోన్ వాద్యాలు స్ఫుటంగా వినపడేట్లు ఉపయోగించారు. ఇతర వాద్యాలుగా వయొలిన్స్, సెల్లో, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ రిధిమ్స్ వినిపిస్తాయి.

ఘంటసాలగారిలోని సంగీతజ్ఞానాన్ని బాగా వినియోగించుకున్న సినిమా వినాయకచవితి. ఈ సినిమాలో మొత్తం 25 పాటలు, పద్యాలు, శ్లోకాలు వున్నాయి. ఇవికాక సన్నివేశాలను elevate చేయడానికి రీరికార్డింగ్. వీటన్నిటితో ఘంటసాలగారు ఈ సినిమాలో బాగానే శ్రమించి మంచి ఫలితాలు పొందారు. ఈ పాటలు, పద్యాలను ఘంటసాల, లీల, సుశీల, రాణి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, రాఘవులు, వైదేహి, సరోజిని, సత్యవతి మొదలగువారు పాడారు.

వినాయకచవితిలోని  అన్ని పాటలను, మాటలను వ్రాసిన సముద్రాల రాఘవాచార్యులవారే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ముచ్చటగా మూడే సినిమాలకు డైరక్షన్ చేపట్టిన సముద్రాల వారి మొదటి సినిమా వినాయకచవితి కాగా, మిగిలిన రెండూ భక్త రఘునాధ్ (ఘంటసాలగారి స్వంత చిత్రం), బబృవాహన సినిమాలు.

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు నిర్మించిన మొదటి పౌరాణిక చిత్రం  'వినాయకచవితి'లోఎన్.టి.రామారావు, గుమ్మడి, జమున, కృష్ణకుమారి, సూర్యకళ, రాజనాలఆర్.నాగేశ్వరరావు, మిక్కిలినేని, జి.ఎన్.స్వామి, బాలకృష్ణ, నటించారు.


కొసమెరుపు:

మాయాబజార్ సినిమా తర్వాత  ఎన్.టి.రామారావు పూర్తి స్థాయి కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయకచవితి.  ఈ రెండు సినిమాలు  1957లో కొన్ని నెలలు వ్యవధిలో విడుదలై ఘనవిజయం సాధించాయి. వినాయకచవితి సినిమాలో శ్రీకృష్ణ పాత్రధారి ఎన్.టి.ఆర్.కు ఒక పాటకానీ, పద్యం కాని లేకపోవడం ఒక విశేషం.


వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 16 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 15 - చిని పాపలాలీ కనుపాప లాలీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 15


రేపు నీదే - చిని పాపలాలీ కనుపాప లాలీ చిన్నారి పొన్నారి చివురింత లాలీ 


మొన్న ఆదివారం జరిగిన 'అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా మా ఊరి మహిళామండలివారు  తమ మహిళా  సభ్యులకోసం అనేక రకాల వినోదకార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆఖరుగా పాటలకార్యక్రమం పెట్టారు. అందులో పాల్గొన్న గాయనీ మణులంతా ఆ మహిళామండలి సభ్యులే. సంగీతమంటే ఇష్టము, పాడాలనే ఆసక్తి కలిగినవారంతా ఎమ్మెస్లో, మంగేష్కర్లో, లీలా, సుశీలలో కాలేరుకదా! అందరూ తమ శక్తివంచనలేకుండా శ్రోతలను తమ పాటలతో రంజింపజేసారు. వారంతా పాడిన అన్ని పాటలలో నా మనసుకు బాగా హత్తుకు పోయిన పాట....

"చిని పాపలాలీ, కనుపాప లాలీ చిన్నారి పొన్నారి చివురింత లాలీ..." అనే ఒక  పాత సినిమాలోని లాలి పాట.

నిజం చెప్పొద్దూ.... ఆ పాటలోని మాధుర్యం, శ్రావ్యత, మాతృమూర్తి మమతానురాగం నాకెంతో  హాయిని, మానసిక ప్రశాంతతను కలిగించి నా కనులు మూతలుపడేలా చేసింది. పదేపదే ఆ పాట నా మదిలో మెదలాడసాగింది.

చిని పాపలాలీ కనుపాప లాలీ 

చిన్నారి పొన్నారి చివురింత లాలీ...


చిన్నితండ్రీ  నవ్వుచూచి  

చిన్నబోయే చందమామ

నవ్వు వెన్నెల నావలోన 

తేలనా - విహరించనా ! చిని పాప!

 

కన్నతండ్రి కనులకాంతీ

తుడిచివేయును కలతలన్నీ

జన్మభూమి కి వన్నె తేగా

పెంచనా తరియించనా..."


అమ్మ అంటేనే దైవం. తల్లినిమించిన దైవం ఈ లోకాన లేదు. అమ్మ హృదయాంతరాళాలనుండి పెల్లుబికే మమకారపు జోలపాటలో మైమరచిపోని చిన్నారులే వుండరు. తల్లి ప్రేమామృతానికి మించినదేదీ లేదు. తల్లికి బిడ్డలపట్ల గల మమతానుబంధానికి ఎల్లలు లేవు. తన బిడ్డల బంగారు భవిష్యత్తు గురించి కనే కలలే జోలపాటలు. తన బిడ్డను నిద్రపుచ్చే క్రమంలో పాడే లాలి పాటలు అమ్మ మనసుకు దర్పణాలు.

జోలపాటలు మన సంస్కృతి లో ఒక భాగం. పసిపాపలను నిద్రపుచ్చడానికి, మారాము చేయకుండా వుండడానికి తల్లులు, లేదా ఇంట్లోని పెద్దవారు పాడే లయబధ్ధమైన పాట.  ఈ పాటల్లోని లయ, సరళమైన, మృదుమధురమైన భాష పసిపాపలకు స్వాంతనను, ప్రశాంతతను కలిగిస్తుంది. సాధారణంగా లాలిపాటల్లో వినిపించే 'రామ', 'కృష్ణ' వంటి పురాణపురుష నామాలు, వారి లీలలు చిన్న పాపలలో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది. సనాతనకాలం నుండి వస్తున్న ఈ సంప్రదాయం పసిబిడ్డలలో మానసిక వికాసాన్ని, కన్నతల్లితో మమతానుబంధాన్ని పెంపొందిస్తుంది.

గత తరంలో ఈ జోలపాటలు దైనందిక జీవితంలోనే కాక సినీమాలలో కూడా వినిపించేవి. కథాకథనానికి దోహదం చేస్తూ సన్నివేశానికి పరిపుష్టి కలిగేలా ఈ జోలపాటలను మన సినిమాలలో ఉపయోగించేవారు. 

పసిపాపలకే కాక పెద్దలకు కూడా   మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను చేకూర్చే అటువంటి లాలిపాట -- 'చిని పాప లాలీ కనుపాపలాలీ1957 లో వచ్చిన 'రేపు నీదే' సినిమాలోనిది. ఇదే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

1950 దశకంలో ఎంతోమంది గేయ రచయితలు సినిమాకి పరిచయం చేయబడ్డా, వారంతా పరిపూర్ణంగా చిత్రసీమలో నిలదొక్కుకోలేకపోయారు. అలాటి వారిలో శ్రీ కొండముది గోపాలరాయశర్మగారు ఒకరు. సామాజిక ఇతివృత్తాలతో గీతాలను, నాటకాలు వ్రాసి పేరుపొందిన రచయిత. చిత్రసీమలో ఈయనకు  ఎక్కువ అవకాశాలు కల్పించి ప్రోత్సహించినది మన ఘంటసాల మాస్టారే. మాస్టారి సంగీత దర్శకత్వంలో గోపాలరాయశర్మగారు భావయుక్తమైన పాటలెన్నింటినో చాలా సరళమైన భాషలో వ్రాసి ఆయా సన్నివేశాలకు నిండుదనం తెచ్చారు. ఈనాటి మన సజీవరాగం లోని లాలిపాటను కూడా వ్రాసింది గోపాలరాయశర్మగారే.   మృదువైన చిన్న చిన్న మాటలతో కన్నతల్లి మనోభావాలకు అక్షరరూపాన్నిచ్చి అమ్మంటే ఏమిటో మనకు తెలియజేశారు.

'చినిపాప లాలీ కనుపాప లాలీ, చిన్నారి పొన్నారి చివురింత లాలీపాట పల్లవిలోనే అమ్మ మనసులోని లాలిత్యాన్ని, మమతను వెల్లడిచేశారు. కన్నబిడ్డ ఎంత మారాము చేసి చీకాకు కలిగించినా ఆ తల్లికి తన బిడ్డంటే మురిపమే. అందుకే చరణంలో అంటారు - చిన్నితండ్రి నవ్వు చూసి చందమామే చిన్నబోయిందట. ఆ నవ్వుల వెన్నెల ఒక నావైతే ఆ నావలో తేలియాడుతూ విహరిస్తానంటోంది.

తర్వాతి చరణంలో తన పాపడి భవిష్యత్తు విషయంలో తన కలలు  తన పిల్లవాడి కన్నుల్లోని కాంతి తన తన కష్టాలను, కన్నీళ్ళను తుడిచిపెడుతుందని, దేశమంతా మెచ్చేలా, మాతృభూమికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా పెంచి పెద్ద చేస్తానని ఆ అమ్మ జోలపాడుతోంది. 

ఈ లాలిపాటను స్వరపర్చిన ఘంటసాలవారిలో గొప్ప మాతృహృదయం వుంది. మనసుకు కష్టం కలిగించే ఎటువంటి వేదనాపూరిత విషయానికైనా ఇట్టే చలించిపోయే సున్నితమైన మనసుగల ఘంటసాలగారు తల్లి మనసులోని ప్రేమను, మమకారాన్ని  ఈ పాటలో రంగరించి స్వరపర్చారు.

ఈపాటను నేపథ్యంలో అద్భుతంగా అమ్మలాగే పాడినది పి.లీలగారే అయినా, తెరమీద భావోద్వేగాలతో నటించి సన్నివేశానికి బలం చేకూర్చినది షావుకారు జానకిగారే అయినా ఇక్కడ మనకు వినపడేది, కనపడేది ఘంటసాలగారి మాతృహృదయమే. ఈ పాటను ఘంటసాలగారే పాడితే ఎంతటి గాఢత్వము, భావోద్వేగము మనము అనుభవిస్తామో అంతటి అనుభూతిని లీల ఈ లాలిపాటలో మనకు కలిగించారు. మధ్యమావతి రాగంలోని కరుణ, మాధుర్యమంతా పాట మధ్యవచ్చే ఆలాపనలో, షెహనాయ్ బిట్స్ లో నింపి మనకు అందించారు ఘంటసాల. పాటలోని గమకాలు లాలిపాటల స్వభావ స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. ఘంటసాలగారి రాగభావాన్ని యథాతధంగా తన గొంతులో పలికించగల గాయని పి.లీల. అందుకు నిదర్శనం ఈ లాలి పాటే. ఈ పాటలో ప్రధానంగా వినిపించేది షెహనాయ్ యే అయినా పియోనా, మేండలిన్,  వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియం, తబలా వంటి వాద్యాలను చాలా హృద్యంగా ఉపయోగించుకున్నారు ఘంటసాల.

  



మాస్టారు ఈ పాటకు ఎన్నుకున్న రాగం మధ్యమావతి. చాలా మంగళకరమైన, భక్తి, కరుణరస ప్రధానమైన రాగం మనసుకు ప్రశాంతతను చేకూర్చే రాగం. సంగీత విద్వాంసుల కచేరీల ముగింపులో మధ్యమావతి రాగాన్ని ఆలపించడం సంప్రదాయం. మధ్యమావతి 22 వ మేళకర్త అయిన ఖరహరప్రియ కు జన్యరాగం. మధ్యమావతి రాగ ఆరోహణ, అవరోహణ క్రమంలో ఐదు స్వరాలు మాత్రమే వుంటాయి. ఏడు స్వరాలలోని గ (గాంధారం), ధ (ధైవతం) స్వరాలు ఈ రాగానికి వుండవు. అందుచేత మధ్యమావతి ఔడవ-ఔడవ రాగంగా పరిగణించబడుతోంది. మధ్యమావతి కి సమాంతరమైన హిందుస్థానీ రాగం మధుమాద్ సారంగ్. కాఫీ థాట్ కు జన్యరాగం. మనిషిలోని  ఆర్ద్రత, మమతానురాగాలు,  శాంతస్వభావంసజీవంగా వున్నంతకాలం ఈ లాలిపాట సజీవరాగంగా మనసులో సదా మెదులుతూనే వుంటుంది.

భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కోవెలమూడి భాస్కరరావుగారు 'రేపు నీదే' సినిమాను తన స్వీయదర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, షావుకారు జానకి, ఎస్.వి.రంగారావు, రేలంగి, రాజసులోచన, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్ మొదలగువారు నటించారు. ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా లో వున్న ఏడు పాటలను కొండముది గోపాలరాయశర్మగారే వ్రాయగా వాటిని ఘంటసాల, పి.లీల, జిక్కి, పిఠాపురం, మొదలగువారు పాడారు.

ఈ సినిమా లోని  - చినిపాప లాలీ, పిలవకురా నిలపకురా, ఎక్కడైనా బావయ్యా, నీలోకంలో ఒక భాగమిది, చక్కనిది దక్కనిది ఒక్కట్టున్నది  వంటి పాటలు బహుళ జనాదరణ పొంది తరచు రేడియోలో ప్రసారమయేవి. వాట్సప్ సమూహాలలో పాత పాటల పంపకాలు ప్రారంభమైన తొలిరోజుల్లో దాదాపుగా అందరూ మరచిపోయినా ' చినిపాప లాలి కనుపాప లాలీపాటను నేనే శ్రోతలకు పునఃపరిచయం చేశాను. '(ఇలాటి ఆణిముత్యం ఒకటుందని ఇంతవరకు నాకు తెలియనే తెలియదు' అంటూ చాలామంది చేసిన  వ్యాఖ్య బలంతో ఈ మాట ఉపయోగించాను). చాలా సినీమాలలాగే ఈ సినిమా విడియో కూడా అలభ్యం కావడంతో ఈ సినిమాలోని  మంచి పాటలు అందుబాటులో లేకుండా పోయాయి. సంగీతాభిమానుల దురదృష్టం.

మనకు బ్లాక్ బస్టర్ సినిమాలలో సూపర్హిట్ పాటలుగా చెలామణి అవుతున్న పాటలొక్కటేకాదు, మంచి సంగీత సాహిత్యపు విలువలు గలిగిన  గొప్ప గీతాలు గల సినీమాలు ఎన్నో వున్నాయి. అయితే  తగిన ప్రచారం, మార్కెటింగ్  లభించక, కాలం కలసిరాక బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు  పరాజయం పొందాయి.  దానివలన  మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే  అమూల్యమైన గీతాలు ఎన్నో  మరుగున పడిపోయాయి. నా పరిధులమేరకు అలాటి మధురగీతాలను ఈ 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగంపునఃపరిచయం చేయడమే ముఖ్యోద్దేశం.

ఈనాడు మనకు తెలిసి, మనం మెచ్చిన పాటలతో పాటు ఈ తరం వారికి అంతగా పరిచయం లేని ఉత్తమ గీతాలను కూడా ఈ శీర్షిక ద్వారా పరిచయం చేయాలనేది నా సంకల్పం. అందుకు మీరంతా తప్పక ప్రోత్సహించగలరని ఆశిస్తాను.

 


వచ్చే వారం, ఘంటసాలగారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 17 - ఓ నా రాజా... ఇటు చూడవోయీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...