నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోన కవ్వించే సఖీ మయూరివై
వయారివై నేడే నటనమాడి నీవే నన్ను
దోచినావే - నా హృదయంలో !!
నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే - నా హృదయంలో !!
నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించ రావే, నీ వెచ్చని నీడా వెలసెను నా
వలపుల మేడా నివాళితో చేయిచాచి
ఎదురు చూచినానే నిదుర కాచినానే
- నా హృదయంలో నిదురించే చెలీ...!!
శంకరాభరణం చాలా విశిష్టత కలిగిన రాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతున్నందువలన ఇది సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. గమక ప్రాధాన్యత గల రాగం. ఈ ధీరశంకరాభరణం రాగానికి ప్రసిధ్ధి పొందిన అనేక జన్యరాగాలు వున్నాయి. బిలహరి, దేవగాంధారి, ఆరభి, అఠాణా, కురింజి, కదనకుతూహలం, శుధ్ధ సావేరి, కేదారం, ఇలా ఎన్నోరాగాలు ధీరశంకరాభరణ జన్యాలే. ఈ రాగాలన్నింటిలో బహుళ జనాదరణ పొందిన సినిమా పాటలు అసంఖ్యాకంగా వున్నాయి. శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతశైలిలో బిలావల్ అంటారు. (కానీ స్వరాల మూర్చన బిలహరికి దగ్గరగా వుంటుందని అంటారు). ఈ శంకరాభరణం రాగం మన భారతీయ సంగీతంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల సంగీతంలో కూడా వినిపిస్తుంది. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టమ్ లో శంకరాభరణాన్ని లోనియన్ మోడ్ లేదా మేజర్ స్కేల్ అంటారు. శ్రావ్యమైన, మృదుమధుర భావాలను వెల్లడించడానికి శంకరాభరణం రాగం చాలా అనువైన రాగంగా సంగీతజ్ఞులు భావిస్తారు.
ఈ శంకరాభరణ రాగ స్వరాలతో వచ్చిన పాటలెన్నింటినో అమరగాయకుడు ఘంటసాలవారు ఆలపించి వాటికి అజరామరత్వం కల్పించారు. సీతారామ కళ్యాణంలో రామారావు గారికి పాడిన "కానరార కైలాసనివాస", భార్యాభర్తలులో అక్కినేని వారికి పాడిన "జోరుగా హుషారు షికారు పోదమా", శాంతినివాసం లోని "కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే", అభిమానం సినిమాలోని "లపు తేనె పాట"(అన్య స్వరాలతో)... చెప్పుకుంటూపోతే ఇలాఎన్నో మనోరంజకమైన పాటలున్నాయి.
ఆ కోవలోకి చెందినదే నేటి మన ఘంటసాల మాస్టారి సజీవరాగం
"నా హృదయంలో నిదురించే చెలీ"
శంకరాభరణం రాగంలో స్వరపర్చబడింది.
ఈ పాట అక్కినేని, సావిత్రి , రాజశ్రీ, గిరిజ, జగ్గయ్య, రేలంగి మొదలగువారు నటించిన 1962లో విడుదలైన "ఆరాధన" సినీమాలోనిది. ఇదొక ట్రైయాంగిల్ లౌవ్ స్టోరీ.
జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద విబి రాజేంద్రప్రసాద్ నిర్మించిన రెండవ సినీమా " ఆరాధన". అమోఘమైన విజయం సాధించింది. అందుకు కారణం ఈ సినీమా సంగీతం , ముఖ్యంగా, "నా హృదయంలో నిదురించే చెలీ" పాట.
ఈ సినీమాకు సంగీతదర్శకుడు సుస్వరాల రసాలూరు రాజేశ్వరరావుగారు. వివిధ వాద్యాలు వాయించడంలో, విభిన్న సంగీత బాణీలు సృష్టించడంలో నిష్ణాతుడు.
"నా హృదయంలో నిదురించ చెలీ" పాటను శ్రీ శ్రీ వ్రాసారు. "మనసు కవి" కితాబును మనవాళ్ళు ఆత్రేయగారికి ఇచ్చారు కానీ అలాటి హృద్యమైన , మనసులో చిరస్థాయిగా నిలచిపోయే పాటలెన్నింటినో శ్రీశ్రీ గారు వ్రాసారు.
ఈ ఆరాధన చిత్రానికి మాతృక 'సాగరిక' అనే బెంగాలీ సినీమా, 1956లో వచ్చింది. ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్ ప్రధాన పాత్రలు ధరించారు. రాబిన్ ఛటర్జీ సంగీతంలో శ్యామల్ మిత్ర అనే గాయకుడు పాడిన పాట వరసనే తెలుగులో "నా హృదయంలో నిదురించే చెలి " గా మలిచారు రాజేశ్వరరావు గారు.
పాట మూలం బెంగాలీయే అయినా దానికి పూర్తి తెలుగుదనాన్ని ఆపాదించినవారు మాత్రం సాలూరు రాజేశ్వరరావుగారు, ఘంటసాలగారు మాత్రమే. గమకప్రాధాన్యంగల సుశాస్త్రీయ శంకరాభరణ రాగాన్ని లలితమైన గమకాలతో అత్యంత శ్రావ్యంగా, మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ అమోఘంగా గానం చేసారు ఘంటసాల.
మన పాత సినిమాలలో హీరో, హీరోయిన్లు లేదా వ్యాంప్ పాత్రధారులు చేత పియోనా వాయిస్తూ పాటలు పాడించడమనేది అనవాయితీగా వచ్చిన బాక్సాఫీస్ ఫార్ములా. రాజేశ్వరరావుగారు చాలా బాగా పియోనా వాయిస్తారు. కానీ, తన సినిమా లలో పియోనా పాటలన్నీ తన పెద్ద కుమారుడు రామలింగేశ్వరావు చేతే వాయింపజేసేవారు. ఈ పాట చిత్రీకరణ లో పియోనా వాయిస్తూ క్లోజప్ లో కనిపించే చేతులు రామలింగంవే అని చెప్పుకోవడం నేను విన్నాను.
పియోనా, ఫ్లూట్, తబలా ప్రధానంగా సాగే ఈ పాటలో ఘంటసాలవారి కంఠస్వరం ప్రతీ నోట్ ను చాలా ఖణీగా, సుస్పష్టంగా శ్రోతల హృదయాలను తాకేలా పలికింది.
ఈ సినీమా లో ఏడు పాటలుండగా హీరో అక్కినేనికి ఒకే ఒక్క పాట ఈ సూపర్ హిట్ సాంగ్. మాస్టారు పాడారు. ఆనాటి సినీమాలలో హీరోల కంటే రేలంగికే ఎక్కువ పాటలుండేవి. ఆరాధనలో రేలంగికి ఉన్న రెండు డ్యూయెట్ లను ఘంటసాల మాస్టారే పాడారు. ఆ పాటలలో ఘంటసాలవారి గాత్ర వైవిధ్యం విన్నవారికే ఎరుక.
అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు బెంగాలీ సాగరికలోని పాటకన్నా అరాధన చిత్రంలోని "నా హృదయంలో నిదురించే చెలీ" పాటే మిన్నగా భావిస్తాను. అందువల్లే ఈ పాట గత అరవై సంవత్సరాలుగా తెలుగు హృదయాలను దోచుకుంటూనే వుంది, గాయకులందరి నోటా వినవస్తూనే వుంది.
ఈ శీర్షిక విషయంగా చిన్న మాట.
ఘంటసాల పాట మీద ఉన్న ఆరాధనతో ఈ 'సజీవరాగం' సమీక్ష మొదలుపెట్టానే కానీ, ఆ యా పాటలలో గల సంగీత సాహిత్య వైశిష్ట్యాన్ని సోదోహరణంగా చెప్పడానికి నాకు భాషలోగానీ, సంగీతంలో గానీ ఏమాత్రం ప్రవేశం లేదు. అందుచేత నా యీ వ్యాసాలు vague గా , shallow గా వుండే అవకాశం వుంది.
అందరూ సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్