Saturday, 2 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 13 - చిలకన్న చిలకవే బంగారు చిలకవే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 13


జయం మనదే - చిలకన్న చిలకవే బంగారు చిలకవే


"ఒక దెబ్బకు రెండు పిట్టలు" అనేది ఒక తెలుగు సామెత. అంటే ఒక క్రియతో రెండు వేర్వేరు  లక్ష్యాలు సాధించడం. ఈ రకమైన ధోరణి మన పాత తెలుగు సినిమాలలో కనిపించేది. సినీమాల  లక్ష్యం  ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించడం.  అందుకోసం అవసరమున్నా లేకపోయినా  మూడు డాన్స్ లు, ఆరు పాటలు  జొప్పించినా అందుతోపాటు నర్మగర్భంగా ఏదైనా మంచి సందేశాన్ని కూడా కథ ద్వారా, లేదా పాటల ద్వారా ప్రేక్షకులకు అందించేవారు. 'ధర్మమేవ జయతే' అనే ఆర్యోక్తి గుర్తు చేస్తూ సినిమాలు తీసేవారు. అది ఇప్పుడు కాదు . ఒకప్పటి మాట. అటువంటి ఒక నర్మగర్భమైన జానపద గీతమే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

అదే మాధవపెద్ది సత్యం, జిక్కి పాడిన యుగళగీతం 'చిలకన్న చిలకవే బంగారు గిలకవే' 1956 లో వచ్చిన 'జయం మనదే సినిమా లోనిది. జానపద కవి చక్రవర్తి కొసరాజు రాఘవయ్య చౌదరీ గారు వ్రాసిన గీతం. గాయక, సంగీతదర్శకుడు ఘంటసాలగారి స్వరరచనతో రూపుదిద్దుకున్న ఆపాతమధుర గీతం ... పాత్రోచితంగా తెరపై రేలంగి , అంజలీదేవీ అభినయించిన  గీతం...

 

రేలంగి: 

చిలకన్న చిలకవే బంగారు గిలకవే

పంచవన్నెల రామచిలకా - హోయ్

పంచవన్నెల రామచిలకా

ఏడుకొండలమీద ఎగిరివచ్చిన పిట్ట

యెందున్నదో చెప్పవే

మేడల్లొవున్నదో మిద్దెల్లోవున్నదో

జాడయిన చెప్పవే చిలకా

అంజలి:

పంజరమ్మున యినుపసంకెళ్ళు

తగిలించి  బంధించి యుంచారె చిలుకా  

మూడారు వాకిళ్ళు దాటిరావాలంటే 

కోడెత్రాచున్నదే చిలుకా ! కోడె!

రేలంగి:

పట్టుబడ్డాచోట ప్రాణానికేమైన

మోసమ్ము లేదటే చిలుకా

పచ్చన్ని చేలపై స్వేఛ్ఛతో యెగిరేటి

భాగ్యమెప్పుడె రామచిలకా

 

అంజలి:

బంధాలు విడిపించి బయటికంపాలంటె సమయమ్ము చిక్కాలి చిలకా

ఓర్పుజూపక నీవు ఉడుకు జుర్రావంటె

ఓగు తప్పదు రామచిలకా ! ఓగు!

 

రేలంగి:  

బలుపు భారమ్మంత నీమీదనే బెట్టి 

భయము లేకుంటాము చిలకా - రామచిలకా

నీళ్ళల్లొ ముంచివా, పాలల్లొ మంచినా

నీవె దిక్కో రామచిలకా మాకు నీవే

దిక్కు రామచిలకా ...

పోతున్నాం.. పంచవన్నెల రామచిలకా. 


గూఢచారి శాఖల్లో, భద్రతా దళాల్లో వుండేవారంతా శత్రువుల జాడలను, సమాచారాన్ని తెలుసుకునేందుకు మామూలు ప్రజలకు అర్ధంకాని సీక్రెట్ కోడ్  భాషలో మాట్లాడుకుంటారట. ఇక్కడ ఈ పాటలో కూడా అలాటి రహస్య భాషలోనే కథానాయకుడి స్నేహితుడు, కథానాయకుడి ప్రియురాలైన రాకుమారి పరస్పరం సమాచారాన్ని అందజేసుకుంటున్నారు. కోటలో బందీగావున్న కథానాయకుడి యోగక్షేమాలు ఆరాతీస్తూ  అతని స్నేహితుడు రాచనగరు వీధుల్లో చిలకపంజరాలు పట్టుకుతిరుగుతూ  రాకుమారిని పంచవన్నెల రామచిలకా, బంగారు గిలకా అంటూ పాటరూపంలో పలకరించే అతనికి రాజభటులు కథానాయకుని ఇనుపసంకెళ్ళతో బంధించి చెరలో వుంచారనిఅక్కడి మూడారు వాకిళ్ళు దాటవీలులేకుండా కోడెత్రాచులాంటి దుష్ట సేనాని కాపాలా కాస్తున్నాడని, ఇలాటి సమయంలో ఓర్పు చూపకుండా ఆవేశపడితే కీడుతప్పదని ఆ రాకుమారి రహస్యభాషలో హెచ్చరిక చేస్తుంది.

నీళ్ళముంచినా , పాలముంచినా ఇక కథానాయకుని కాపాడే భారమంతా  నీదేనని రాకుమారిని అర్ధిస్తూ ఆ స్నేహితుడు అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఇది ఆ పాట సన్నివేశం. సన్నివేశపరంగా పాట బాహ్యరూపం ఇదే అయినా ఈ పాటలోని చిలక, పంజరం, మూడారువాకిళ్ళు వంటి మాటలు జిజ్ఞాసులకు, తాత్త్వికులకు మరో కోణంలో ఆలోచించడానికి అవకాశం కల్పిస్తున్నది.

బంగారు పంజరంలో చిలకలా రక్తమాంసాలతో కూడిన శరీరమనే పంజరంలో చిలక అనే ఆత్మ బందీఅయి స్వేఛ్ఛను కోల్పోయి జ్ఞాన సముపార్జన కు, ముక్తికి దూరమైపోతున్నది.  పంజరం తెరిచినప్పుడు చిలక ఎలా అయితే స్వేఛ్ఛగా ఎగిరిపోతుందో అలాగే జ్ఞానం పొందిన ఆత్మ  పరమాత్మ లో విలీనమైపోతుందని తాత్వికులు బోధిస్తారు. ఈ విధంగా కొసరాజుగారు ఒక సామాన్య జానపదగీతంలో రెండు వేర్వేరు కోణాలను స్ఫురింపజేశారు.

ఈ పాటలో కొసరాజుగారు ఉపయోగించిన - గిలక, ఉడుకు, జుర్రు, ఓగు, బలుపు వంటి మాండలీక పదాలు అరుదుగా మన సినిమా పాటలలో వినిపిస్తాయి.  సినిమా పాటంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఎంతో మేధోమథనం చేయాలని ఇలాటి గతకాలపు పాటలు కొన్ని నిరూపిస్తాయి.

'చిలకన్న చిలకవే బంగారు గిలకవేపాటను మాధవపెద్ది సత్యం , జిక్కి గార్లతో పాడించారు ఘంటసాల. సందర్భోచితంగా వరసలను కూర్చడంలో, ఆ పాటలను పాడడానికి తగిన గాయనీగాయకులను ఎన్నుకోవడంలోనూ ఘంటసాలగారు అసమాన ప్రజ్ఞావంతుడు. మాధవపెద్ది గారిని అలవాటుకు విరుధ్ధమైన పధ్ధతిలో ఘంటసాల ఈ పాటలో వినిపించారు సాధారణంగా మాధవపెద్దిగారి కంఠంలో ధ్వనించే కరకుదనం, తీవ్రత ఈ పాటలో వినపడవు. శ్రద్ధగా వినకపోతే ఈ పాటను ఘంటసాలగారే పాడుతున్నారేమో అనే భ్రమ కలుగుతుంది. జిక్కిగారుఒక్క ఒత్తుల విషయంలో తప్ప, ఏ రకమైన పాటనైనా అవలీలగా పాడి రక్తి కట్టించగల గాయని. ఆవిడచేత ఏ రకమైన పాటలు పాడించాలో ఘంటసాలగారికి బాగా తెలుసు. జిక్కిగారు కూడా ఈ విషయాన్ని గురించి తన ఇంటర్వ్యూలలో ప్రస్తావించేవారు.

వీర శృంగార రసాలకు ఎక్కువ ప్రాధాన్యత గల 'జయం మనదే' సినిమాలోని పది పాటలను జంపన, కొసరాజు, సముద్రాల, ముద్దుకృష్ణ, సదాశివబ్రహ్మంగార్లు సినిమాలోని కథాంశానికి తగినట్లు వ్రాయగా వాటిని ఘంటసాల, లీల, జిక్కి, మాధవపెద్ది పాడారు. ఘంటసాల సంగీత ప్రతిభకు తార్కాణంగా - లీల పాడిన 'కలువలరాజా కధవినరావా', నేటి సజీవరాగ గీతం 'చిలకన్న చిలకవే', 'మరువజాలని మనసు తాళని', ' వీరగంధం తెచ్చినామయా', ' ఓ చందమామ అందాలభామ' (హిందీ అనుకరణే అయినా) వంటి ఈ సినిమా లోని పాటలు ఈనాటికి సంగీతాభిమానులను అలరిస్తూనేవున్నాయి.

ఘంటసాలగారు నేటి సజీవరాగం 'చిలకన్న చిలకవే బంగారు గిలకవేయుగళగీతాన్ని యదుకుల కాంభోజి రాగ స్వరాలతో , దేశ్ రాగ ఛాయలతో స్వరపర్చారు. యదుకుల కాంభోజి 28వ మేళకర్త హరికాంభోజికి జన్యం. హరికాంభోజికి సమాంతర హిందుస్థానీ రాగం ఖమాస్ థాట్. ఈ ఖమాస్ థాట్ కు జన్యరాగం దేశ్. అందుచేత ఈనాటి మన పాటలో దేశ్ ఛాయలు కూడా వినిపించివుండవచ్చును. యదుకులకాంభోజి రాగం  అరోహణా క్రమంలో శుధ్ధసావేరిలోని ఐదు స్వరాలు, అవరోహణాక్రమంలో హరికాంభోజిలోని ఏడు స్వరాలు కలిగి ఔఢవ-సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. భక్తి, శృంగార, కరుణరసాలకు అనువైన యదుకులకాంభోజి రాగాన్ని ఘంటసాలగారు  సందర్భోచితంగా ఉపయోగించి ఈ జానపదగీతాన్ని జనరంజకం చేశారు. ఈ పాటను తానే పాడుతున్న భ్రమను కలిగించారు అక్కడక్కడ. అంత మార్దవంగా మాధవపెద్ది గళాన్ని ఈ పాటలో మార్చారు.

ఘంటసాలగారు ఈ పాటలో వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియంమేండొలిన్, తబలాడోలక్, కోల్ వంటి వాద్యాలను మన తెలుగు ప్రాంతీయత ఉట్టిపడేలా ఉపయోగించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. ఈ  పాట సన్నివేశంలో రేలంగి, అంజలీదేవీ సంపూర్ణంగా లీనమైపోయి సహజంగా  పాత్రోచితంగా నటించారు.

'జయం మనదే' రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత సుందర్లాల్ నహతా నిర్మించిన మొట్టమొదటి తెలుగు జానపద చిత్రం. 1956 లో విడుదలయింది. జానపదమంటే మాయలు, మంత్రాలు, జంతువులు, రాక్షసులు, దేవకన్యలతో వుండే విఠలాచారి నమూనా కాదు. న్యాయానికి అన్యాయానికి మధ్య, సన్మార్గులకు దుర్మార్గులకు మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా గల సినిమా. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, షావుకారు జానకి, గుమ్మడి, సి.ఎస్.ఆర్., రేలంగి, ఆర్.నాగేశ్వరరావు, పెరుమాళ్, మొదలగువారు నటించిన చిత్రం.

ఇదొక 'రాబిన్ హుడ్' తరహా సినిమా. దిలీప్ కుమార్ నటించిన ' ఆన్' సినిమాను గుర్తు చేసే కథాంశం కలిగిన సినిమా 'జయం మనదేసోషలిస్టు భావాలు గల తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన సినిమా. తొలి సినిమాతోనే ఎద్దుకంటిని సూటిగా పొడిచి ఘనవిజయం పొందారు సుందర్లాల్ నహతాగారు.

1956 లో వచ్చిన 'జయం మనదే' మొదలు 1964 లో వచ్చిన 'గుడిగంటలు'' సినిమా వరకు సుందర్లాల్ నిర్మించిన అన్ని సినిమాలకు ఘంటసాలగారే సంగీత దర్శకుడు. అనుకరణ పాటల విషయంలో వుండే భేదాభిప్రాయాలు తప్పించి నహతా-ఘంటసాలగార్ల మధ్య చాలా మంచి మైత్రి వుండేది. ఘంటసాలగారంటే అమితమైన గౌరవమర్యాదలు, అభిమానం సుందర్లాల్ కు వుండేవి. ప్రతి సంవత్సరం దీపావళి మర్నాడు సాయంత్రం తమ గృహంలో జరిగే లక్ష్మీపూజకు ఘంటసాలగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి నూతనవస్త్రాలతో గౌరవించి సత్కరించడం సుందర్లాల్ గారి ఆచారం. 'ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర మాత్రం కాదు' అనే సామెతను ఋజువు పరుస్తూ పరభాషాగీతాల అనుకరణకు ఒత్తిడి చేసేవారు. ఈ విషయంలో ఘంటసాల-నహతాగార్ల మధ్య ప్రణయ కలహం వంటిది వస్తూండేది. అయినా దాదాపు నహతాగారి పది సినిమాలకు వరసగా ఘంటసాలగారు సంగీతదర్శకుడిగా పనిచేశారు.

ఘంటసాలగారి లవకుశ సంగీతం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందినది సుందర్లాల్ నహతాగారే. ఆర్ధిక సమస్యలతో ఆగిపోయిన ఎ.శంకరరెడ్డిగారి లవకుశను సంపూర్ణ హక్కులతో కొనుగోలుచేసి, సినిమా పూర్తిచేయించి విడుదల చేసింది సుందర్లాల్ నహతాయే. ఆ సినిమా విజయం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలు అనుభవించిన అదృష్టశాలి నహతాగారే.

దాదాపు 70 ఏళ్ళు నిండవస్తున్న 'జయం మనదే' ను ఇంకా మనం తలచుకుంటున్నామంటే అందుకు కారణం ఆ సినిమా లోని ఘంటసాలగారి మధుర సంగీతమే.


ఘంటసాలగారి ఇటువంటి మరో సజీవరాగంతో వచ్చేవారం మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

Saturday, 25 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 12 - సరసుడ దరిచేరరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 12


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


డామిట్! కధ అడ్డంగా తిరిగింది!

ఇది గురజాడ అప్పారావు గారి 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశం మొదటి డైలాగ్. ఇదే డైలాగ్ తో సినిమా మొదలెడితే కథ అడ్డం తిరుగుతుందని నిర్మాత అనుకున్నారో ఏమో, మధురవాణి పడకటింట్లో గిరీశం, మధురవాణి సరస సంభాషణలతో మొదలెట్టారు. కన్యాశుల్కం నాటకాన్ని యథాతధంగా తెరకెక్కించలేని తమ నిస్సహాయత కు గురజాడ వారి ఫోటో సాక్షిగా ప్రేక్షకులకు సంజాయిషీ కూడా చెప్పుకున్నారు.

కన్యాశుల్కం సినిమా ప్రారంభంలోనే మొదటి సీన్ లోనే ఒక చక్కటి జావళి. అదే నేటి మన 'ఘంటసాల- సదా మదిలో మెదిలే సజీవరాగం. 70 ఏళ్ళ తర్వాత ఈ పాట ఇంకా జనాల మదిలో మెదులుతున్నదో లేదో నాకు తెలియదుకాని సంగీత సాహిత్యాల దృష్ట్యా ఈ పాట నిస్సందేహంగా సజీవరాగమే.

జావళి ...

కర్ణాటక సంప్రదాయ సంగీతంలో ఓ భాగం. స్వరపల్లవులు, కృతులు, కీర్తనలు లాగనే జావళీ ఒక సంగీత, సాహిత్య ప్రక్రియ. సాధారణంగా సంగీత కచేరీల ఉత్తరార్ధంలో ప్రదర్శింపబడుతూంటుంది. దాక్షిణాత్య సంగీత, నృత్య కార్యక్రమాలలో జావళి కూడా ఒక ప్రధానాంశం. పల్లవి, అనుపల్లవి, చరణాలతో  జావళీల సాహిత్యం వుంటుంది. ఈ జావళీలలోని సాహిత్యం  శృంగారపరమైవుంటుంది. నాయికా నాయకుల ప్రణయం ముఖ్యాంశంగా, నాయకునికి దూరమైన నాయిక యొక్క విరహవేదన వర్ణనలతో నిండివుంటుంది. బాహ్యంగా శృంగారరస ప్రధానంగా కనిపించినా ఇందులో భక్తి తత్త్వం ముడిపడివుంది.  ఇక్కడ నాయికా నాయకులు పరమాత్మ, జీవాత్మ.  పరమాత్మలోజీవాత్మ ఐక్యమై ముక్తిని పొందడమే అంతిమ పరమార్ధం. ఈ లక్ష్యంతోనే ప్రముఖ వాగ్గేయకారులంతా తమ  రచనలు చేశారు. (కాలక్రమేణా ప్రజలు సంగీత, నాట్యాది కళలలోని భక్తికన్నా వినోదానికి, రక్తికి ఎక్కువగా ఆకర్షితులవడం మొదలెట్టారు.)

భాషాపరంగా జావళీలు  కన్నడతమిళ భాషలలో కన్నా తెలుగులోనే  ఎక్కువగా వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దం నుండి బహుళ ప్రచారంలో కి వచ్చిన ఈ కళాప్రక్రియ మూలాలు, కాలానికి సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. జావళి అనే పేరు కనపడకపోయినా ఆ రకమైన సాహిత్యం సారంగపాణి, అన్నమాచార్య పదకవితలలో కనిపిస్తుంది.

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్( సమయమిదే రారా నా సామి) , స్వాతి తిరునాళ్ (సారమైన మాటలెంతో), ధర్మపురి సుబ్బరాయర్ (పరులన్నమాట నమ్మవద్దు) మొదలగువారు రచించిన జావళీలు మిక్కిలి ప్రసిధ్ధి చెంది ఈనాటికి బహుళ ప్రచారంలో వున్నాయి.

సందర్భం కనుక అందరూ స్మరించుకోతగ్గ మరొక జావళి గురించి చెప్పవలసి ఉంది. సాధారణంగా ప్రచారంలో  వుండే శృంగారరస ప్రధాన జావళీలకు కొంచెం భిన్నంగా  భార్యభర్తల మధ్య వుండే ప్రేమానురాగాలను, బాధ్యతలను ప్రకటితం చేస్తూ   ఘంటసాలవారి గురువుగారు,  వాగ్గేయకారులు అయిన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు రచించి,  కాపీ రాగంలో స్వరపరచిన 'వగల వయ్యారి అదిరా...'  అనే జావళీ ఒక నవ్యపంథాకు నాంది పలికింది.

ఈనాడు భరతనాట్యం, కూచిపూడి శైలులకు చెందిన కళాకారులందరి ప్రదర్శనలలో జావళి తప్పనిసరి అంశం. పండిత పామరులను సరిసమానంగా ఆకర్షించే జావళిని బ్లాక్&వైట్ కాలం నాటి  తెలుగు సినిమా కూడా యథాశక్తిని సద్వినియోగం చేసుకుంది. శాస్త్రీయ, లలితసంగీతాల మేళవింపుతో మనోరంజకమైన జావళీలెన్నో  సంగీతాభిమానులను అలరించాయి.

అలాటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసిన  సత్సంప్రదాయ జావళి కన్యాశుల్కం మధురవాణి కోసం అమరగాయకుడు ఘంటసాలవారు స్వరపర్చిన 'సరసుడ దరిచేరరా'. 

మన దాక్షిణాత్య సినిమాలలో శుధ్ధ శ్రోత్రీయ సంగీతం (తంజావూరు బాణి), నృత్య సంగీతం అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేవి  ఎమ్.ఎస్., పి.లీల, కోమల, ఎమ్.ఎల్.వి.శూలమంగళం (రాధా) జయలక్ష్మి, మొదలైనవారి గాత్రాలే.  ఆ కోవకు చెందిన మరో గాయనీమణి ఎన్.ఎల్.గానసరస్వతి. 1950-60 ల మధ్య వచ్చిన అనేక తెలుగుతమిళ భాషా చిత్రాలలో గానసరస్వతి గానం చేసిన  అనేక శాస్త్రీయ సంగీతనృత్యగీతాలు బహుళ జనాదరణ పొందాయి. ఆవిడ పాడిన సినిమా పాటలు రాశిలో తక్కువే అయినా వాసిలో చాలా మిన్నయనే చెప్పాలి. అలాటి సంప్రదాయ సంగీత గీతాలలో చెప్పుకోదగ్గది 'కన్యాశుల్కం' సినిమాలో శ్రీమతి ఎన్.ఎల్.గానసరస్వతి ఆలపించిన జావళి 'సరసుడ దరిజేరరా...'

జావళి రచన -

వెంపటి సదాశివ బ్రహ్మం

స్వరరచన : ఘంటసాల

గాయని : ఎన్ ఎల్ గానసరస్వతి

నృత్యదర్శకుడు : పసుమర్తి కృష్ణమూర్తి

అభినయం: సావిత్రి


పల్లవి: 

సరసుడ దరిజేరరా.. ఔరా! - 2

సమయమిదే

సరసాల కిదివేళ చలమేలరా

                                    !సరసుడ!

వలచినదానర నే చినదానరా

పిలచిన బిగువేలరా  నన్నేలరా

                                    !సరసుడ!

 

చక్కెర విలుకాని బారి వేసారి

మక్కువతో నిన్నె  మనసార కోరి

చేరితి నీచెంత దయగను మావంత

మురిపించి మరిపించ రారా జాగేలరా

                                    !సరసుడ!

ఖమాస్  ఒక కర్ణాటక సంగీత రాగం. ఇది 28 వ మేళ కర్త అయిన హరికాంభోజికి జన్యరాగం. షాఢవ-సంపూర్ణ రాగం. వక్రసంచారం గల ఈ రాగం ఆరోహణా క్రమంలో ఆరు స్వరాలుఅవరోహణా క్రమంలో ఏడు స్వరాలువుంటాయి. శృంగారరస ప్రధాన కృతులు , కీర్తనలు, జావళీలు ఎక్కువగా ఖమాస్ రాగంలోనే వుంటాయి. ఖమాస్ రాగంలో బహుళ జనాదరణ పొందిన సినీమా పాటలు ఎన్నోవున్నాయి. ప్రఖ్యాతి చెందిన సంప్రదాయ జావళీ రచనలన్నీ ఖమాస్, కాపీ, ఫరజ్, బేహగ్, వంటి లలితమైన రాగాలలో కనిపిస్తాయి. శాస్త్రీయ సంగీత రాగలక్షణాలను క్షుణంగా అర్ధంచేసుకొని ఆయా రాగాలను  సందర్భోచితంగా, జనరంజకంగా ప్రయోగించిన ప్రతిభాశాలి ఘంటసాల. సన్నివేశం రక్తికట్టడానికి తగిన రాగాలను, గాయనీగాయకులను ఎన్నుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. 'సరసుడ దరిజేరరా' అనే సదాశివబ్రహ్మంగారి జావళీని ఘంటసాలగారు ఖమాస్ రాగంలో మలిచారు. సంప్రదాయ  జావళి నృత్యానికి ఉపయోగించే వయొలిన్, వీణ, ఫ్లూట్ , మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాద్యాలతోనే ఘంటసాలగారు ఈ పాటను రూపొందించారు. శుధ్ధ శాస్త్రీయ సంగీత సంగతులతో, గమకశుధ్ధిని పాటింపజేస్తూ గానసరస్వతి చేత అద్భుతంగా గానం చేయించారు ఘంటసాల.

శాస్త్రీయ సంగీత విద్వాంసులు/నృత్య  ప్రదర్శనలలోని గాయకులు మూడు కాలాలలో పాడతారు. వాటిని విలంబ, మధ్యమ, ధృత కాలాలని అంటారు. నాలాటివారికి అర్ధమయే భాషలో చెప్పాలంటే --  స్లో, మీడియం, ఫాస్ట్ టెంపోలు. సాధారణంగా జావళీలు మధ్యమకాలంలో లేదా ధృతకాలం లో వుంటాయి.

కన్యాశుల్కంలో తెరమీది మధురవాణి (సావిత్రి) అంగసౌష్టవాన్ని, అభినయ పరిమితులను దృష్టిలోపెట్టుకుని సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి ఈ జావళీని మధ్యమకాలంలో నడిపించారు. మధురవాణి పాత్రలో పూర్తిగా లీనమైపోయిన సావిత్రి, శృంగారరస ప్రధానమైన ఈ జావళీని పాత్రోచితంగా,  హుందాగా అభినయించి సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

ఈ జావళీని రచించిన కవి వెంపటి సదాశివ బ్రహ్మంగారు పంచకావ్యాలను అధ్యయనం చేసిన సంస్కృతాంధ్ర భాషాకోవిదుడు. తిరుపతి వెంకట కవుల స్ఫూర్తితో శతావధాన, అష్టావధాన ప్రక్రియలలో నిష్ణాతుడు. హరికథా విద్వాంసుడు. స్వాతంత్ర్య సమరయోధుడు.

1940 ల నుండి 1970 ల లోపల ఎన్నో  విజయవంతమైన సినిమాలకు కl, మాటలు, పాటలను సమకూర్చారు. సినిమా గీతాలకు ఒక స్థాయిని, విశిష్టతను తెచ్చిన కవి సదాశివబ్రహ్మంగారు.

కన్యాశుల్కం సినిమా అదృష్టమే అదృష్టం. ఈ సినీమాలో తెలుగువారందరూ గర్వించదగ్గ మహాకవులందరి రచనలు వున్నాయి. గురజాడ అప్పారావు గారి  -'పుత్తడిబొమ్మ పూర్ణమ్మకథ', 'ఇల్లు ఇల్లనియేవు నీ యిల్లు యెక్కడే చిలుకా'; బసవరాజు అప్పారావుగారు వ్రాసిన 'నాగులచవితికి నాగేంద్రా'; దేవులపల్లి వారి 'చేదాము రారే కళ్యాణము'; మల్లాది రామకృష్ణశాస్త్రిగారి 'చిటారుకొమ్మను మిఠాయి పొట్లం'; శ్రీశ్రీ మహాప్రస్థానం లోని 'ఆనందం అర్ణవమైతే'; సముద్రాల వారి 'కీచకవధ' వీధి భాగవతంశ్రీకృష్ణ కర్ణామృత శ్లోకం- కలశ నవనీతచోరే'. ఘంటసాలవారి సంగీతవిద్వత్ కు ఒక సవాల్ కన్యాశుల్కం. శ్రోతలకు సంగీత మృష్టాన్న భోజనం. ఇంతమంది లబ్దప్రతిష్టులైన కవుల వివిధ రసాల గీతాలకు  వైవిధ్య భరితమైన సంగీతాన్ని సమకూర్చి 'కన్యాశుల్కం' ఒక ఉత్తమ చిత్రంగా రూపొందడానికి ముఖ్యకారకులయ్యారు.

ఈ సినిమాలోని నవరత్నాలవంటి ఎనిమిది పాటలను+ఒక శ్లోకాన్ని ఘంటసాలమాధవపెద్ది, ఎన్.ఎల్.గానసరస్వతి, పి. సుశీల, పద్మప్రియఆలపించారు. సుప్రసిద్ధ బహుభాషా చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన 'కన్యాశుల్కం' దృశ్యకావ్యానికి నిర్మాత డి.ఎల్.గా చిత్రసీమకు చిరపరిచితుడైన ద్రోణావఝ్ఝల లక్ష్మీనారాయణ. భానుమతిగారి భరణి స్టూడియో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి 1951 లో 'స్త్రీ సాహసంనుండి 1969 లో వచ్చిన 'ఏకవీర' వరకు ఓ డజన్  సినిమాలను నిర్మించారు. డి.ఎల్. నిర్మించిన దేవదాసు, కన్యాశుల్కం, చిరంజీవులు, ఏకవీర మొదలైన సినిమాలు ఆయన ఉత్తమాభిరుచికి అద్దం పడతాయి.

డి.ఎల్. సినిమాలన్నింటిలో ఘంటసాలగారు గాయకుడిగానో లేక సంగీతదర్శకుడిగానో ప్రముఖపాత్ర వహించారు.

70 సంవత్సరాలు నిండిన 'కన్యాశుల్కం' ఎన్ని తరాలు మారినా చిరస్మరణీయమే. ఆ చిత్ర సంగీతం సజీవరాగమే.


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


కొసమెరుపు : -

1950 దశకంలో ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో  ఎన్నో పాటలు పాడిన పి.లీల ఈ సినిమాలో ఒక పాట కూడా పాడకపోవడం ఆశ్చర్యమే.

 

వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 18 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 11 - ఆపకురా మురళి/ఆపితివా మురళి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 11


చెరపకురా చెడేవు - ఆపకురా మురళి/ఆపితివా మురళి


జీవితసరళి... 'ఆ మాటేదో అందరికీ అర్ధమయేలా చెప్పవయ్యా...

 

Life style. .. ' ఓస్ అదా! మా మనవడి స్టైలే స్టైల్. చదవడానికి అమెరికా వెళ్ళాడు. వాడి హెయిర్ స్టైల్ కి అక్కడి దొరలే ముక్కున వేలేసుకుంటారట  ఓ కామందుగారి బడాయి. 'మా మనవరాలు మాత్రం.. దాని దగ్గరున్నన్ని మోడర్న్ డ్రెస్ లు, మాచింగ్ లిప్ స్టిక్ లు, కాలిజోళ్ళు, కళ్ళజోళ్ళు ఈ ఊళ్ళో ఎవరికీలేవు. అన్నీ బొంబాయి నుంచే తెప్పిస్తుంది. వాటిని నన్ను కూడా వేసుకోమని ఒకటే గోల... అయినా నాకు సిగ్గు బాబూ.. 'కామందుగారి భార్య మురిపెం. మనవల ముద్దు ముచ్చట్లు తీర్చడానికి బంగారం లాంటి భూములు తెగనమ్మేస్తున్నారని కోడలు రోజూ మొగుడితో లడాయి.

ఇది ఆ కుటుంబం జీవితసరళి.

ఇంతకీ జీవితసరళి అంటే...

ఒక మనిషి తన నిత్యజీవితంలో అనుసరించే విధివిధానాలు, ఆహార విహారపుటలవాట్లు, నడవడిక, సమాజంలో ఇతర వ్యక్తులతోడి స్నేహ సత్సంబంధాలు అతడి జీవితశైలిని లేదా జీవిత సరళిని తెలియజేస్తాయి. అపరిమితమైన  సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానంకంప్యూటర్ల వినియోగం, ఆధునికీకరణ, ప్రపంచీకరణ వంటి విషయాలు  అందుబాటులోకి వచ్చాక మనిషి జీవిత విధానమే పూర్తిగా మారిపోయింది. సమాజంలోని వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య  పరస్పర స్నేహానురాగాలుమమతానుబంధాలు క్రమక్రమంగా రూపుమాసిపోతున్నాయి. దీని ప్రభావం మన కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద కూడా తీవ్రంగా కనిపిస్తోంది. గత డెభ్భై ఎనభై ఏళ్ళక్రితం వున్న జీవన విధానానికిఆచార వ్యవహారాలకు, ఆహారపు అలవాట్లకు ఇప్పుడున్న తీరుతెన్నులకు సంబంధమే లేదు. మనిషి జీవిత సరళి పూర్తిగా మారిపోయింది. IT పురోభివృద్ధి ప్రభావం మన సినిమాలమీద  కూడా పడింది. గత రెండున్నర దశాబ్దాలలో మన సినీమాల సరళి పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటివరకు భారతీయ స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం. (ఈనాటి ఆధునిక వతులు ఈ సూత్రానికి కట్టుబడి వుండడానికి సిధ్ధంగా వున్నారా అంటే సందేహమే). ప్రేమాభిమానాలతో చేరదీసినా, నిర్లక్ష్యం చేసి కొట్టి తిట్టినా ఆనాటి స్త్రీకి భర్తే సర్వస్వం. ఈ రకమైన సామాజిక నీతిని అనుసరించిన కథాంశాలతో వచ్చిన సినిమాలే గత నాలుగు దశాబ్దాల క్రితం వరకు వచ్చేవి. వాటిని స్త్రీ పురుష ప్రేక్షకులంతా సమానంగా అభిమానించారు, ఆదరించారు. అందుకు ఉదాహరణగా ఈ పాటలోని సాహిత్యం చూడండి...

పల్లవి:

ఆపకురా మురళీ... గోపాలా-2

అదే నా జీవిత సరళీ.. ఆపకురా!

చరణం 1:

మధుర మధురమౌ నీ మురళీ

సుధలను చిలికే ఆ మురళీ

నా ఎద నవ్వుల రవళీ

అదే నా జీవిత సరళీ 

                            !ఆపకురా!

చరణం 2: 

పతి నీ రూపని నీవే ప్రాపని

మధురగానమున రాధగ మారెద

మధుపము నయ్యెద పదముల వ్రాలెద 

నాపతి మాధవుడేరా 

                            !ఆపకురా!

భర్త తనను ప్రేమానురాగాలతో మురిపెంగా చూసుకోవడమే పరమ పెన్నిధిగా భావించే ఆ స్త్రీ దైవస్మరణలో కూడా తన పతినే తలచుకుంటుంది. తనను రాధగా భర్తను మాధవుడిగా ఊహించుకుని మధురస్మృతులలో విహరిస్తూ తానొక తేనెటీగగా మారి పతి పాదాలపై వ్రాలిపోవాలని అదే తన జీవితసరళి కావాలని ఆనందంలో తేలియాడుతూ

ఆ మురళీగానలోలుని ప్రార్ధిస్తూంటుంది. 

 

 1955 లో వచ్చిన 'చెరపకురా-చెడేవు' సినిమా కోసం

జూనియర్ సముద్రాల  వ్రాసిన ఈ పాటకు స్వరకర్త ఘంటసాల.

సన్నివేశానికి తగిన భావావేశంతో మృదుమధురంగా భక్తితత్పరతతో

పి లీల గానం చేయగా భర్తపట్ల అపరిమిత ప్రేమ,  విశ్వాసం గల సతిగా షావుకారు జానకి తెరపై అత్యంత సహజంగా నటించారు.

 

ఈ పాటలో 'మురళి', 'రవళి', 'సరళి'

యని ఒక చరణంలో, మరొక చరణంలో 'రూపని', 'ప్రాపని';

'మారెద', 'నయ్యెద', ' వ్రాలెద'

వంటి పదప్రయోగాలు చేసి జూనియర్  సముద్రాల గారు ప్రాసలపట్ల తనకు గల మక్కువను చాటుకున్నారు.

 

వెలుగు చీకట్లలా ఈ పాటకు రెండు పార్శ్వాలు. జీవితసరళి సవ్యంగా సాగిపోతున్నప్పుడు సంతోషంతో చేసిన దైవస్మరణ ఒకటైతే , భర్త త్రాగుడు, చెడుసావాసాలు, పరస్త్రీ వ్యామోహానికి లోనై తనను అలక్ష్యపర్చి దూరంచేసినప్పుడు బ్రతుకంతా భారమై ఆవేదనతో  దైవం ముందు విలపించిన గీతం మరొకటి. అది....

 

ఆపితివా ...మురళీ...గోపాలా -2

ఇదియే నా జీవిత సరళీ

                                    !ఆపితివా!

నవ వసంతమౌ నా వయసు

అతి ప్రశాంతమౌ ఈ మనసూ

పాపపు చీకటి పాలేనా

ఇదియేనా జీవితసరళీ

నా పతికె దూరమా! నీకే భారమా

నాధుని నమ్మిన నాతికి వెతలా

పెదవుల వేణువు వదలకురా ప్రభూ...

పతి దర్శనమీరా 

                            !ఆపకురా!


సినిమాలో రెండు వేర్వేరు సందర్భాలలో ఆనంద విషాద భావోద్వేగాలతో  వినపడే ఈ గీతాన్ని ఘంటసాల పీలు రాగంలో స్వరపర్చి పి.లీలచేత భక్తిపూర్వకంగా గానం చేయించారు.

పీలు ... ప్రసిద్ధి చెందిన ఒక హిందుస్థానీ రాగం. 'కాపి థాట్' కు జన్యం. తుమ్రీ, దాద్రా వంటి లలిత శాస్త్రీయ రీతులలో గానం చేసేప్పుడు విద్వాంసులు  ఈ పీలు రాగాన్ని ఎన్నుకుంటారు.  పీలు రాగంలో ఇతర రాగాల ఛాయలు కూడా వుండడం వలన దీనిని మిశ్రరాగంగా పరిగణిస్తారు. భక్తి, శృంగార, కరుణఆనంద, విషాదాది రస భావాలకు అనువైన ఈ పీలు రాగంలో  ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ (తుమ్రీ)పండిట్ రవిశంకర్ (సితార్) బిస్మిల్లాఖాన్ (షెహనాయ్), అంజాద్ ఆలీఖాన్ (సరోద్), హరిప్రసాద్ చౌరాసియా (ఫ్లూట్) వంటి సుప్రసిద్ధ సంగీత కళాకారుల స్వరరచనలెన్నో సంగీతప్రియులను అలరిస్తున్నాయి.

అలాగే సినిమా సంగీతంలో కూడా పీలు రాగం చేసిన అనేక గీతాలు శ్రోతల మనసులలో నిలిచివున్నాయి. భారతీయులందరికి అత్యంత ప్రీతిపాత్రమైన  భక్తిగీతం 'రఘుపతి రాఘవ రాజారాం' ఈ పీలు రాగంలోనే స్వరపర్చారు. పీలు రాగానికి సమానమైన కర్ణాటక రాగం కాపి. దీనికి హిందుస్థానీ శైలిలోని కాపికి సంబంధం లేదు. కర్ణాటక సంగీతంలోని కాపి రాగం 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ కు జన్యరాగం. అటువంటి జన, మనోరంజకమైన పీలురాగంలోని భక్తి, ఆనందం, విషాద రసాలకు ప్రాధాన్యతనిస్తూ  ఘంటసాల మాస్టారు 'ఆపకురా మురళీ గోపాల' గీతాన్ని సార్ధకత చెందేలా స్వరపర్చి శ్రోతలలో భక్తిభావాన్ని ఇనుమడింపజేసేలా పి.లీలచే అద్భుతంగా పాడించారు.

రసపోషణకు అవసరమైనంతమేరకు మాత్రమే మాస్టారు ఈ పాటకు  వాద్యాలను  సున్నితంగా ఉపయోగించారు. వయొలిన్స్, వీణ, సితార్,  ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియం, తబలా, డోలక్, తాళాలు వంటి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి. శాస్త్రీయ సంగీత నేపథ్యంగల శ్రీమతి పి.లీల గళంలో గమకాలు, ఆలాపనలు సునాయాసంగా పలుకుతాయనడానికి ' ఆపకురా మురళీ' ఒక నిదర్శనం.

ఈ పాటను  ఒక సత్సంగ సభ్యులు (పురుషులు) తమ భజన కార్యక్రమంలో ఆలపించడం యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి. 

ఘంటసాలగారి అనేక గీతాలు శాస్త్రీయ సంగీతవిద్యార్ధులకు రాగ పరిచయానికి అభ్యాసగీతాలుగా తగినవని గాఢంగా విశ్వసించే పట్రాయని సంగీతరావుగారు నా చిన్నతనంలో తరచూ వీణమీద, హార్మోనియం మీద వాయిస్తూ పిల్లలకి నేర్పడం నాకు బాగా గుర్తు.

1950 దశకం నాటికి ఘంటసాలగారు చలనచిత్ర గాయకుడిగా, సంగీతదర్శకుడిగా తనకంటూ ఒక బాణీని, దృఢమైన సుస్థిరతను ఏర్పరచుకున్నారు. సినీగీత సంగీత కచేరీలకు ఆద్యుడు ఘంటసాలగారు. వివిధ సంగీత ప్రక్రియలతో కూడిన ఘంటసాలగారి సంగీతకచేరీ శ్రోతలకు మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఉచ్ఛ స్థాయికి చేరుకున్న ఘంటసాల తన స్వంత ఆర్కెష్ట్రాను ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకమని భావించారు.  ప్రసాదరావు ఆర్కెష్ట్రా, దక్షిణామూర్తి ఆర్కెష్ట్రా, మాస్టర్ వేణు ఆర్కెష్ట్రా అని కొన్ని ఆర్కెష్ట్రాల పేర్లు పాత సినిమా టైటిల్స్ లో మనం చూస్తూంటాము. సినిమా సంగీతదర్శకుడిగా ఒకరి పేరు , ఆర్కెష్ట్రాకు మరొకరి పేరు వుంటుంది.

1954 సంక్రాంతి పండగరోజులన్నీ అయ్యాక  ఒక శుభముహుర్తాన ఘంటసాలగారు తమ స్వంత ఆర్కెష్ట్రాను .... సర్వశ్రీ - పామర్తి (తబలా), పి. సంగీతరావు (హార్మోనియం), హుస్సేన్ రెడ్డి (ఆర్గన్), ఎన్.సి.కృష్ణమాచారి (వయొలిన్), సుబ్రహ్మణ్యం (వయోలా), ఎమ్.ఎస్.రాజు (వీణ), రాజేంద్రన్ (ఫ్లూట్), సుభాన్ (క్లారినెట్), కణ్ణన్ఆర్.వి.భద్రం (రిథిమ్స్) వంటి సంగీత కళాకారులతో, గురుసమానుడైన ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ సమక్షంలో వారి ఆశిస్సులతో ప్రారంభోత్సవం జరిపారు. 

శ్రీమతి పి లీల ప్రార్ధనాగీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సర్వశ్రీ - వి.నాగయ్య, సీనియర్ సముద్రాల, రావూరు సత్యనారాయణరావు, దర్శక నిర్మాత కోవెలమూడి భాస్కరరావులు విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు. అప్పటినుంచే ఘంటసాలగారు సినీ సంగీతప్రపంచంలో ఘంటసాల మాస్టారుగా అందరి మన్ననలు అందుకోసాగారు. 

ఘంటసాల ఆర్కెష్ట్రాతో తయారైన మొట్టమొదటి చిత్రం భాస్కర్ ప్రొడక్షన్స్ 'చెరపకురా-చెడేవు' 1955 లో విడుదలయింది. ఎన్.టి.రామారావు, అమర్నాథ్, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్., రేలంగి, షావుకారు జానకి, రాజసులోచనలక్ష్మీరాజ్యం, చంద్రకుమారి, పుష్పలత మొదలగువారు నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత అయిన భాస్కరరావుగారే డైరక్ట్ చేశారు. చెరపకురా చెడేవు అనే పేరు చూడగానే కథాసారాంశం అంతా అర్ధమైపోతుంది. 'బ్రతుకుతెరువు' సినిమా తర్వాత తీసిన ఈ సినిమా కూడా మంచి విజయాన్నే పొందింది. దీనిని తమిళంలో  'ఇల్లరమే ఇన్బంపేరుతో డబ్ చేశారు.

ఘంటసాలగారిని అమితంగా అభిమానించి గౌరవించిన నిర్మాత లలో భాస్కరరావు గారు ఒకరు. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన  దాదాపు ఆరేడు సినీమాలు అన్నింటికీ  వరుసగా ఘంటసాలగారే సంగీతదర్శకుడు.  ఆ బ్యానర్ కు  ఘంటసాలగారు సంగీత దర్శకత్వం నిర్వహించిన ఆఖరు చిత్రం 'మోహినీ రుక్మాంగద' ఆ తర్వాత, కోవెలమూడి భాస్కరరావుగారు సినీమాలు తీసినట్లుగా కనపడదు.

'చెరపకురా-చెడేవు' లోని పది పాటలను సముద్రాల జూనియర్, రావూరి సత్యనారాయణ రావు వ్రాశారు. పి.లీల పాడిన ' ఆపకురా మురళీ',  'యోగము అనురాగము', జిక్కి పాడిన 'గులాబీలతోట',  అందాల నా రాజ రావోయి' , ఘంటసాల & రాణి పాడిన 'నాటకం ఆడుదాం', ' ప్రేమో ప్రేమో ప్రేమ', పాటలు ఆనాడు బహుళజనాదరణ పొందాయి. సంగీతపరంగా ఘంటసాలగారికి మంచి పేరు తెచ్చిన సినిమా 'చెరపకురా-చెడేవు'.

ఇందులోని విశేషం ఏమంటే హీరో ఎన్.టి.ఆర్ కు గాని, సెకండ్ హీరో అమర్నాథ్ కు గాని పాటలే లేవు. ఉన్న రెండు డ్యూయెట్ లు రేలంగి, పుష్పలతలకే. దీనినిబట్టి ఆనాడు దర్శకులు కథాంశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో అర్ధమవుతుంది.

కొసమెరుపు:-

పురాణపురుషుడు, త్రిలోకసంచారి అయిన నారదుడికి చొక్కా తొడిగిన ఘనత కోవెలమూడి భాస్కరరావు

గారిదే.  వివరాలు తెలియాలంటే చూడండి భాస్కర్ ప్రొడక్షన్స్ వారి 'పార్వతీ కళ్యాణం'. 



వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

  

ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 13 - చిలకన్న చిలకవే బంగారు చిలకవే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...