Saturday, 23 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 16 - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 16


వినాయకచవితి - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే


"ఈ శెలవుల్లో మనందరం  అమ్మమ్మగారి వూరెడుతున్నాం"  అమ్మకి ఆనందం, పిల్లలికి ఆటంబాంబ్. "అమ్మమ్మ ఊరికా! నో ఛాన్స్, నేను ఛస్తే రాను! అక్కడికి వస్తే అమ్మమ్మ  వారం వారం నలుగుపిండితో నలుచుకుని కుంకుడుకాయరసంతో తలంటు స్నానం అంటూ టార్చర్ పెడుతుంది. ఆ హరాస్మెంట్ భరించడం నావల్లకాదు. నే రానంటె రానే రాను"  మనవడి ఓవర్ రియాక్షన్.

"నలుగుపిండితో తలంటుస్నానం ఒంటికి ఎంతో మంచిది తెలుసా! మీ షాంపూలు, షవర్ బాత్ ల కంటే చాలా ఆరోగ్యకరం. మా చిన్నప్పుడు విధీగా ప్రతీ శనివారం తెల్లవారుజామునే పిల్లల్ని లేపి ఒంటికి నువ్వులనూనె పట్టించి, బియ్యపుపిండి, శెనగపిండిలో పసుపుపొడి, పన్నీరు  వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి, ఆ ముద్దతో ఒళ్ళంతా నలిచి, కుంకుడుకాయరసంతోనో లేకపోతే షీకాయ ముద్దతోనో తలంటు స్నానం చేయించేవాళ్ళు! ఆ తర్వాత సాంబ్రాణి పొగతో జుట్టంతా ఆరబెట్టి జడలేశేవారు. ఇప్పటికీ నా ఒళ్ళు ఇంత నున్నగా, నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా వుందంటే దానికి కారణం నలుగుపిండి స్నానమే తెలుసా!" బామ్మ సెల్ఫీ.

మా బామ్మ  పురాణకాలపు కబుర్లని , సూక్తిముక్తావళిని శ్రద్ధగా వింటూ పాటించే ఏకైక శ్రోత మా మున్నీ ఒక్కర్తే. నలుగుపిండి తయారీ గురించి వాటిలోని ఔషధ గుణాలగురించిఅవి మన ఒంటికి చేసే మంచి గురించి బామ్మ లెక్చెర్ ని మహా శ్రద్ధగా ఆలకిస్తోంది.

"అసలు నలుగుపిండి తలంటు స్నానం వెనుక ఒక గొప్ప పౌరాణిక గాధే వుంది తెలుసా"!  కథలు, కాకరకాయలు అంటే మైమరచిపోయే మా మున్నీ ఆ కధేమిటో చెప్పమని బామ్మని ఊదరకొట్టింది.

అప్పుడు మా బామ్మ చెప్పిన కథాకధనం బెట్టిదనినా...

ఫ్లాష్ బ్యాక్ లో...

కైలాసం  

హిమవన్నగంలో పార్వతీ పరమేశ్వరుల ఆవాసం. ఇల్లు, ఇల్లాలు అసలు ఈలోకంతోనే సంబంధం లేదనట్లుగా ఒక ఏకాంత ప్రదేశంలో శివుడు ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తూ  తపస్సమాధిలో  వున్నాడు. పతి ప్రేమాదరణలకు దూరమై ఏకాంతవాసంలో వున్న పార్వతి ...

మధురహాసా మృదువిలాసా

శైలసుత హృదయేశా కరుణించి 

తనను దరిచేర్చుకోమని దీనంగా ప్రార్ధిస్తున్నది. పార్వతి విరహవేదనను, శోకాన్ని తట్టుకోలేని చెలికత్తెలు స్వాంతన వాక్యాలు పలికి పార్వతిని సర్వాంగసుందరంగా అలంకరించి మహేశునిచెంతకు తీసుకువెళ్ళాలని పరిపరివిధాలుగా సపర్యలు చేయడం మొదలెడతారు. అందులో భాగంగా పార్వతీదేవి చెలికత్తెలంతా ....

"నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

చెలువుగ శ్రీగౌరికిపుడు నలుగిడరారే!


పసిడిపూలపీటా శివునిల్లాలికి వేయరే

జతజేసి కస్తూరి జవ్వాజీ పూయరే

పసుపుగలిపి చందనమూ నెమ్మేన రాయరే! నలుగిడరే!

 

మనసులోని వగదీరా పన్నీరు చల్లరే

చిన్నారీ కన్నులలో  వెన్నెలలు కాయగా 

చెలియ మోము గని శివుడే చిందేసి డాయగా ! నలుగిడరే!


అంటూ నృత్యగీతాలతో  పార్వతి దేహమంతా పరిమళద్రవ్యాలు కలిపిన నలుగుపిండితో నలిచి అభ్యంగన స్నానానికి సంసిద్ధం చేస్తారు. ఆ విధంగా తన శరీరానికి పట్టించిన నలుగుపిండితో  పార్వతీదేవి ఒక అందమైన బాలుడి ప్రతిమను రూపొందిస్తుంది. అతి సుందరంగా వున్న ఆ బాలుడి ప్రతిమను చూసి ముచ్చటపడిన చెలికత్తెలంతా ఆ బొమ్మకు ప్రాణం పోయమని కోరడంతో పార్వతీదేవి తన దివ్యశక్తులతో ఆ ప్రతిమకు ప్రాణంపోస్తుంది. ముద్దులొలికే ఆ బాలుడిని చూసి పార్వతి మాతృహృదయం ఉప్పొంగి ఆ బాలుని తన కుమారునిగా స్వీకరిస్తుంది. తాను స్నానం చేసి వచ్చేదాకా పరులెవ్వరు లోపలికి రాకుండా కాపలాగా వుండమని తన కుమారుని ఆదేశించి లోపలకు వెళుతుంది.

అదే సమయంలో పరమశివుడు తన ధ్యానాన్ని ముగించుకుని పార్వతి ని చూచేందుకు వస్తాడు. శివుడు లోపలికి వెళ్ళడానికి వీలులేకుండా పార్వతీపుత్రుడు అడ్డుపడతాడు. ఇద్దరిమధ్యా వాగ్వాదం పెరిగి పెద్దై ఆగ్రహావేశాలతో త్రినేత్రుడు ఆ బాలుని శిరస్సును   తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఇంతలో స్నానంచేసి వచ్చిన పార్వతి తన కుమారుని మృతదేహాన్ని చూసి తీవ్రంగా చలించి విలపిస్తుంది. తర్వాతే పరమేశ్వరుడు జరిగిన విషయమంతా తెలుసుకుని పార్వతీ పుత్రుని పునరుజ్జీవుడిని చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఆ బాలుని శిరస్సు లభించకపోవడం ఉత్తరదిక్కుగా పోయి ఉత్తరాభిముఖంగా తలపెట్టుకొని వున్న ఏ జీవి శిరస్సునైనా తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞ మేరకు శివసేవకులు ఉత్తరాభిముఖంగా వున్న ఒక ఏనుగు శిరస్సును ఖండించి తీసుకువస్తారు. ఆ శిరస్సును మృతదేహానికి అతికించి మరల ప్రాణాలను పోస్తాడు మహేశ్వరుడు. ఆవిధంగా పార్వతీ తనయుడు గజముఖుడు అయ్యాడు. తర్వాత, పరమశివుడు ఆ కుమారుని కైలాసంలోని ప్రమధగణాలకు అధిపతిని చేశాడు. అందువలన గణపతి అని పిలవబడుతున్నాడు. ఏ కార్యం తలపెట్టినా తనను తొలుతగా పూజించి ప్రార్ధించేవారికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఆ కార్యం విజయవంతం చేసే దైవం కనుక గణపతిని విఘ్నేశ్వరుడని , వినాయకుడని దేవతలందరిచేతా కీర్తించబడ్డాడు. ఈనాటికీ మన అందరికీ తొలిదైవం వినాయకుడే.

అదీ కథ. చూశావా ! నలుగుపిండి స్నానం వెనుక ఎంతటి మహత్తర గాధ వున్నదో !

ఈవిధంగా నలుగుపిండి మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగమైపోయింది. పెళ్ళిళ్ళుపండగలు, మరే ఇతర శుభకార్యాలు జరిగినా మంగళకరమైన ఈ నలుగుపిండి స్నానాలు తప్పనిసరి.

మన పౌరాణిక గాధలలో కూడా దేవుళ్ళ కళ్యాణ ఘట్టాలలో ఈ నలుగు స్నానాల గురించి రసవత్తర వర్ణనలు కనిపిస్తాయి. మన జనపదాలలో  స్త్రీలకు సంబంధించిన అనేక పాటలలో నలుగు పాటలకు కూడా ప్రాముఖ్యత నిచ్చారు. గత తరం వరకు  భారతీయ స్త్రీలంతా ఆయా పాటలను తమ తల్లులు, అమ్మమ్మలు, బామ్మల ద్వారా నేర్చుకుని పండగ పర్వదినాలలో సందర్భానుసారంగా ఆ గీతాలను భక్తిశ్రధ్ధలతో పాడుతూ సంతోషంగా గడిపేవారు.

ఈ సదాచారాన్ని మన సినిమాలు కూడా బాగానే  ఉపయోగించుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పడుతూ వాటి విశిష్టతను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకుని, చూసి ఆనందించేలా చక్కటి నృత్యగీత సన్నివేశాలను రసవత్తరంగా రూపొందిచేవారు. ఎంతో కళాత్మకదృష్టితో ఉదాత్తంగా ఆయా ఘట్టాలను కన్నులకింపుగా చిత్రీకరించేవారు. కన్నులకువీనులకు విందుచేసే అటువంటి నృత్యగీతం ... 'నలుగిడరే నలుగిడరే నలుగిడరారే' 1957 నాటి పౌరాణిక చిత్రరాజం 'వినాయకచవితి' సినీమాలోని పాట అదే నేటి మన సజీవరాగం.

ట్యాలెంట్ ఉన్న కళాకారులెందరో సినిమా రంగంలో వుండేవారు. అయితే వారందరికీ నిరంతరం అవకాశాలు లభించేవికావు. ప్రతిభ, విద్వత్ గల ఎంతోమంది గాయనీగాయకులు ప్రథమశ్రేణి గాయకులుగా రాణించే అవకాశాలు లభించక కోరస్ సింగర్స్ గానే మిగిలిపోయారు. అలాటి వారిని చూసి ఘంటసాల మాస్టారు చాలా బాధపడేవారు. అవకాశం వున్నంతవరకు తన సంగీతదర్శకత్వంలో కోరస్ పాటలు పాడే గాయనీగాయకులను ఎంతగానో ఆదుకుని ప్రోత్సహించేవారు.

ఈ నాటి మన సజీవరాగ గీతం ఒక బృందగానమే.  ఘంటసాల  మాస్టారు ఈ పాటను వైదేహి, ఉడత సరోజినిసత్యవతి అనే  గాయనులచేత సన్నివేశానికి తగినట్లుగా భావరాగ గమకయుక్తంగా పాడించారు. వినాయకచవితి సినిమాలో ఈ సన్నివేశంలో తెరమీద పార్వతీ దేవిగా సూర్యకళ, చెలికత్తెలుగా బాల, రాజేశ్వరి, శ్రీదేవీలు నటించారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి  తన శుద్ధశాస్త్రీయ సంగీత విద్వత్ ను ఉపయోగించలేదు. సాధారణ కుటుంబాలలో సంగీతం తెలియని సామాన్య స్త్రీలు పాడుకునే  నోముల పాటలు, మంగళహారతుల పాటల రీతిని అనుసరిస్తూ మన ప్రాంతీయత ప్రతిబింబించేలా సున్నితంగా, శ్రావ్యంగా ఈ పాటను తనదైన శైలిలో పాడించారు. ఇదమిద్ధంగా ఈ పాట ఫలానా రాగంలో వుందని చెప్పబడదు కానీ, ఖమాస్, దేశ్, తిలాంగ్ రాగ ఛాయలు వున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రాగాలు హిందుస్థానీ సంగీతం లోని ఖమాస్ థాట్ కు చెందినవే.

ఈ సందర్భం స్నానానికి, అందుకు సంబంధించిన వస్తుసామగ్రితో నిండినది కావడంతో ఘంటసాల మాస్టారు ఈ పాటలో జలతరంగిణి, ట్యూబోఫోన్ వాద్యాలు స్ఫుటంగా వినపడేట్లు ఉపయోగించారు. ఇతర వాద్యాలుగా వయొలిన్స్, సెల్లో, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ రిధిమ్స్ వినిపిస్తాయి.

ఘంటసాలగారిలోని సంగీతజ్ఞానాన్ని బాగా వినియోగించుకున్న సినిమా వినాయకచవితి. ఈ సినిమాలో మొత్తం 25 పాటలు, పద్యాలు, శ్లోకాలు వున్నాయి. ఇవికాక సన్నివేశాలను elevate చేయడానికి రీరికార్డింగ్. వీటన్నిటితో ఘంటసాలగారు ఈ సినిమాలో బాగానే శ్రమించి మంచి ఫలితాలు పొందారు. ఈ పాటలు, పద్యాలను ఘంటసాల, లీల, సుశీల, రాణి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, రాఘవులు, వైదేహి, సరోజిని, సత్యవతి మొదలగువారు పాడారు.

వినాయకచవితిలోని  అన్ని పాటలను, మాటలను వ్రాసిన సముద్రాల రాఘవాచార్యులవారే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ముచ్చటగా మూడే సినిమాలకు డైరక్షన్ చేపట్టిన సముద్రాల వారి మొదటి సినిమా వినాయకచవితి కాగా, మిగిలిన రెండూ భక్త రఘునాధ్ (ఘంటసాలగారి స్వంత చిత్రం), బబృవాహన సినిమాలు.

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు నిర్మించిన మొదటి పౌరాణిక చిత్రం  'వినాయకచవితి'లోఎన్.టి.రామారావు, గుమ్మడి, జమున, కృష్ణకుమారి, సూర్యకళ, రాజనాలఆర్.నాగేశ్వరరావు, మిక్కిలినేని, జి.ఎన్.స్వామి, బాలకృష్ణ, నటించారు.


కొసమెరుపు:

మాయాబజార్ సినిమా తర్వాత  ఎన్.టి.రామారావు పూర్తి స్థాయి కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయకచవితి.  ఈ రెండు సినిమాలు  1957లో కొన్ని నెలలు వ్యవధిలో విడుదలై ఘనవిజయం సాధించాయి. వినాయకచవితి సినిమాలో శ్రీకృష్ణ పాత్రధారి ఎన్.టి.ఆర్.కు ఒక పాటకానీ, పద్యం కాని లేకపోవడం ఒక విశేషం.


వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 16 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 15 - చిని పాపలాలీ కనుపాప లాలీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 15


రేపు నీదే - చిని పాపలాలీ కనుపాప లాలీ చిన్నారి పొన్నారి చివురింత లాలీ 


మొన్న ఆదివారం జరిగిన 'అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా మా ఊరి మహిళామండలివారు  తమ మహిళా  సభ్యులకోసం అనేక రకాల వినోదకార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆఖరుగా పాటలకార్యక్రమం పెట్టారు. అందులో పాల్గొన్న గాయనీ మణులంతా ఆ మహిళామండలి సభ్యులే. సంగీతమంటే ఇష్టము, పాడాలనే ఆసక్తి కలిగినవారంతా ఎమ్మెస్లో, మంగేష్కర్లో, లీలా, సుశీలలో కాలేరుకదా! అందరూ తమ శక్తివంచనలేకుండా శ్రోతలను తమ పాటలతో రంజింపజేసారు. వారంతా పాడిన అన్ని పాటలలో నా మనసుకు బాగా హత్తుకు పోయిన పాట....

"చిని పాపలాలీ, కనుపాప లాలీ చిన్నారి పొన్నారి చివురింత లాలీ..." అనే ఒక  పాత సినిమాలోని లాలి పాట.

నిజం చెప్పొద్దూ.... ఆ పాటలోని మాధుర్యం, శ్రావ్యత, మాతృమూర్తి మమతానురాగం నాకెంతో  హాయిని, మానసిక ప్రశాంతతను కలిగించి నా కనులు మూతలుపడేలా చేసింది. పదేపదే ఆ పాట నా మదిలో మెదలాడసాగింది.

చిని పాపలాలీ కనుపాప లాలీ 

చిన్నారి పొన్నారి చివురింత లాలీ...


చిన్నితండ్రీ  నవ్వుచూచి  

చిన్నబోయే చందమామ

నవ్వు వెన్నెల నావలోన 

తేలనా - విహరించనా ! చిని పాప!

 

కన్నతండ్రి కనులకాంతీ

తుడిచివేయును కలతలన్నీ

జన్మభూమి కి వన్నె తేగా

పెంచనా తరియించనా..."


అమ్మ అంటేనే దైవం. తల్లినిమించిన దైవం ఈ లోకాన లేదు. అమ్మ హృదయాంతరాళాలనుండి పెల్లుబికే మమకారపు జోలపాటలో మైమరచిపోని చిన్నారులే వుండరు. తల్లి ప్రేమామృతానికి మించినదేదీ లేదు. తల్లికి బిడ్డలపట్ల గల మమతానుబంధానికి ఎల్లలు లేవు. తన బిడ్డల బంగారు భవిష్యత్తు గురించి కనే కలలే జోలపాటలు. తన బిడ్డను నిద్రపుచ్చే క్రమంలో పాడే లాలి పాటలు అమ్మ మనసుకు దర్పణాలు.

జోలపాటలు మన సంస్కృతి లో ఒక భాగం. పసిపాపలను నిద్రపుచ్చడానికి, మారాము చేయకుండా వుండడానికి తల్లులు, లేదా ఇంట్లోని పెద్దవారు పాడే లయబధ్ధమైన పాట.  ఈ పాటల్లోని లయ, సరళమైన, మృదుమధురమైన భాష పసిపాపలకు స్వాంతనను, ప్రశాంతతను కలిగిస్తుంది. సాధారణంగా లాలిపాటల్లో వినిపించే 'రామ', 'కృష్ణ' వంటి పురాణపురుష నామాలు, వారి లీలలు చిన్న పాపలలో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది. సనాతనకాలం నుండి వస్తున్న ఈ సంప్రదాయం పసిబిడ్డలలో మానసిక వికాసాన్ని, కన్నతల్లితో మమతానుబంధాన్ని పెంపొందిస్తుంది.

గత తరంలో ఈ జోలపాటలు దైనందిక జీవితంలోనే కాక సినీమాలలో కూడా వినిపించేవి. కథాకథనానికి దోహదం చేస్తూ సన్నివేశానికి పరిపుష్టి కలిగేలా ఈ జోలపాటలను మన సినిమాలలో ఉపయోగించేవారు. 

పసిపాపలకే కాక పెద్దలకు కూడా   మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను చేకూర్చే అటువంటి లాలిపాట -- 'చిని పాప లాలీ కనుపాపలాలీ1957 లో వచ్చిన 'రేపు నీదే' సినిమాలోనిది. ఇదే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

1950 దశకంలో ఎంతోమంది గేయ రచయితలు సినిమాకి పరిచయం చేయబడ్డా, వారంతా పరిపూర్ణంగా చిత్రసీమలో నిలదొక్కుకోలేకపోయారు. అలాటి వారిలో శ్రీ కొండముది గోపాలరాయశర్మగారు ఒకరు. సామాజిక ఇతివృత్తాలతో గీతాలను, నాటకాలు వ్రాసి పేరుపొందిన రచయిత. చిత్రసీమలో ఈయనకు  ఎక్కువ అవకాశాలు కల్పించి ప్రోత్సహించినది మన ఘంటసాల మాస్టారే. మాస్టారి సంగీత దర్శకత్వంలో గోపాలరాయశర్మగారు భావయుక్తమైన పాటలెన్నింటినో చాలా సరళమైన భాషలో వ్రాసి ఆయా సన్నివేశాలకు నిండుదనం తెచ్చారు. ఈనాటి మన సజీవరాగం లోని లాలిపాటను కూడా వ్రాసింది గోపాలరాయశర్మగారే.   మృదువైన చిన్న చిన్న మాటలతో కన్నతల్లి మనోభావాలకు అక్షరరూపాన్నిచ్చి అమ్మంటే ఏమిటో మనకు తెలియజేశారు.

'చినిపాప లాలీ కనుపాప లాలీ, చిన్నారి పొన్నారి చివురింత లాలీపాట పల్లవిలోనే అమ్మ మనసులోని లాలిత్యాన్ని, మమతను వెల్లడిచేశారు. కన్నబిడ్డ ఎంత మారాము చేసి చీకాకు కలిగించినా ఆ తల్లికి తన బిడ్డంటే మురిపమే. అందుకే చరణంలో అంటారు - చిన్నితండ్రి నవ్వు చూసి చందమామే చిన్నబోయిందట. ఆ నవ్వుల వెన్నెల ఒక నావైతే ఆ నావలో తేలియాడుతూ విహరిస్తానంటోంది.

తర్వాతి చరణంలో తన పాపడి భవిష్యత్తు విషయంలో తన కలలు  తన పిల్లవాడి కన్నుల్లోని కాంతి తన తన కష్టాలను, కన్నీళ్ళను తుడిచిపెడుతుందని, దేశమంతా మెచ్చేలా, మాతృభూమికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా పెంచి పెద్ద చేస్తానని ఆ అమ్మ జోలపాడుతోంది. 

ఈ లాలిపాటను స్వరపర్చిన ఘంటసాలవారిలో గొప్ప మాతృహృదయం వుంది. మనసుకు కష్టం కలిగించే ఎటువంటి వేదనాపూరిత విషయానికైనా ఇట్టే చలించిపోయే సున్నితమైన మనసుగల ఘంటసాలగారు తల్లి మనసులోని ప్రేమను, మమకారాన్ని  ఈ పాటలో రంగరించి స్వరపర్చారు.

ఈపాటను నేపథ్యంలో అద్భుతంగా అమ్మలాగే పాడినది పి.లీలగారే అయినా, తెరమీద భావోద్వేగాలతో నటించి సన్నివేశానికి బలం చేకూర్చినది షావుకారు జానకిగారే అయినా ఇక్కడ మనకు వినపడేది, కనపడేది ఘంటసాలగారి మాతృహృదయమే. ఈ పాటను ఘంటసాలగారే పాడితే ఎంతటి గాఢత్వము, భావోద్వేగము మనము అనుభవిస్తామో అంతటి అనుభూతిని లీల ఈ లాలిపాటలో మనకు కలిగించారు. మధ్యమావతి రాగంలోని కరుణ, మాధుర్యమంతా పాట మధ్యవచ్చే ఆలాపనలో, షెహనాయ్ బిట్స్ లో నింపి మనకు అందించారు ఘంటసాల. పాటలోని గమకాలు లాలిపాటల స్వభావ స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. ఘంటసాలగారి రాగభావాన్ని యథాతధంగా తన గొంతులో పలికించగల గాయని పి.లీల. అందుకు నిదర్శనం ఈ లాలి పాటే. ఈ పాటలో ప్రధానంగా వినిపించేది షెహనాయ్ యే అయినా పియోనా, మేండలిన్,  వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియం, తబలా వంటి వాద్యాలను చాలా హృద్యంగా ఉపయోగించుకున్నారు ఘంటసాల.

  



మాస్టారు ఈ పాటకు ఎన్నుకున్న రాగం మధ్యమావతి. చాలా మంగళకరమైన, భక్తి, కరుణరస ప్రధానమైన రాగం మనసుకు ప్రశాంతతను చేకూర్చే రాగం. సంగీత విద్వాంసుల కచేరీల ముగింపులో మధ్యమావతి రాగాన్ని ఆలపించడం సంప్రదాయం. మధ్యమావతి 22 వ మేళకర్త అయిన ఖరహరప్రియ కు జన్యరాగం. మధ్యమావతి రాగ ఆరోహణ, అవరోహణ క్రమంలో ఐదు స్వరాలు మాత్రమే వుంటాయి. ఏడు స్వరాలలోని గ (గాంధారం), ధ (ధైవతం) స్వరాలు ఈ రాగానికి వుండవు. అందుచేత మధ్యమావతి ఔడవ-ఔడవ రాగంగా పరిగణించబడుతోంది. మధ్యమావతి కి సమాంతరమైన హిందుస్థానీ రాగం మధుమాద్ సారంగ్. కాఫీ థాట్ కు జన్యరాగం. మనిషిలోని  ఆర్ద్రత, మమతానురాగాలు,  శాంతస్వభావంసజీవంగా వున్నంతకాలం ఈ లాలిపాట సజీవరాగంగా మనసులో సదా మెదులుతూనే వుంటుంది.

భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కోవెలమూడి భాస్కరరావుగారు 'రేపు నీదే' సినిమాను తన స్వీయదర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, షావుకారు జానకి, ఎస్.వి.రంగారావు, రేలంగి, రాజసులోచన, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్ మొదలగువారు నటించారు. ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా లో వున్న ఏడు పాటలను కొండముది గోపాలరాయశర్మగారే వ్రాయగా వాటిని ఘంటసాల, పి.లీల, జిక్కి, పిఠాపురం, మొదలగువారు పాడారు.

ఈ సినిమా లోని  - చినిపాప లాలీ, పిలవకురా నిలపకురా, ఎక్కడైనా బావయ్యా, నీలోకంలో ఒక భాగమిది, చక్కనిది దక్కనిది ఒక్కట్టున్నది  వంటి పాటలు బహుళ జనాదరణ పొంది తరచు రేడియోలో ప్రసారమయేవి. వాట్సప్ సమూహాలలో పాత పాటల పంపకాలు ప్రారంభమైన తొలిరోజుల్లో దాదాపుగా అందరూ మరచిపోయినా ' చినిపాప లాలి కనుపాప లాలీపాటను నేనే శ్రోతలకు పునఃపరిచయం చేశాను. '(ఇలాటి ఆణిముత్యం ఒకటుందని ఇంతవరకు నాకు తెలియనే తెలియదు' అంటూ చాలామంది చేసిన  వ్యాఖ్య బలంతో ఈ మాట ఉపయోగించాను). చాలా సినీమాలలాగే ఈ సినిమా విడియో కూడా అలభ్యం కావడంతో ఈ సినిమాలోని  మంచి పాటలు అందుబాటులో లేకుండా పోయాయి. సంగీతాభిమానుల దురదృష్టం.

మనకు బ్లాక్ బస్టర్ సినిమాలలో సూపర్హిట్ పాటలుగా చెలామణి అవుతున్న పాటలొక్కటేకాదు, మంచి సంగీత సాహిత్యపు విలువలు గలిగిన  గొప్ప గీతాలు గల సినీమాలు ఎన్నో వున్నాయి. అయితే  తగిన ప్రచారం, మార్కెటింగ్  లభించక, కాలం కలసిరాక బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు  పరాజయం పొందాయి.  దానివలన  మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే  అమూల్యమైన గీతాలు ఎన్నో  మరుగున పడిపోయాయి. నా పరిధులమేరకు అలాటి మధురగీతాలను ఈ 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగంపునఃపరిచయం చేయడమే ముఖ్యోద్దేశం.

ఈనాడు మనకు తెలిసి, మనం మెచ్చిన పాటలతో పాటు ఈ తరం వారికి అంతగా పరిచయం లేని ఉత్తమ గీతాలను కూడా ఈ శీర్షిక ద్వారా పరిచయం చేయాలనేది నా సంకల్పం. అందుకు మీరంతా తప్పక ప్రోత్సహించగలరని ఆశిస్తాను.

 


వచ్చే వారం, ఘంటసాలగారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

Saturday, 9 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 14 - మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 14


సొంతవూరు - మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం


" ... అందుచేత,  విద్యార్ధులారా ..., భావిభారత పౌరులారా ... నవసమాజ నిర్మాతల్లారా...  ఈ శుభదినాన నేను మీకు చెప్పొచ్చేదేమిటంటే, మనమంతా భారతీయులం, భరతనగర వాసులం. ప్రపంచంలో ఎవరికీ లేని ప్రత్యేకత మనకు వుంది... అదేమిటో తెలుసా! 'భిన్నత్వంలో ఏకత్వం'. ఈ దేశంలో వందలాది కోట్ల ప్రజలున్నారు. వీరందరిది ఒక భాషకాదు, ఒక మతం కాదు. ఇక్కడ వందలాది భాషలు, అంతకు రెట్టింపు జాతులుకులాలు, మనిషికో మతంతో విభిన్నమైన ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగివున్నారు. పరస్పర భేదాభిప్రాయాలతో అంతఃకలహాలతో మనశ్శాంతి లేకుండా మనుగడ సాగిస్తున్నారు. అయినా జాతీయ సమైక్యత అనే సూత్రానికి దేశవాసులంతా కట్టుబడి వున్నారు. భారతీయత అనే మూలసూత్రం ఈ దేశవాసులను ఒక్కటిగా చేస్తోంది. 

ఎన్నో శతాబ్దాల కాలం  ఈ దేశవాసులు విదేశీయుల పాలనలో బానిస బ్రతుకులు బ్రతికి అష్టకష్టాలు అనుభవించడానికి  వారిలోని అనైక్యతే ముఖ్యకారణం. తమ కష్టాలనుండి బయటపడడానికి, పరాయి పాలన నుండి విముక్తిని పొంది స్వాతంత్ర్యం సాధించుకోవడానికి జాతీయసమైక్యత, అహింసావాదమే తప్పనిసరియని భారత స్వాతంత్ర్య సమరయోధులంతా భావించారు. గాంధీ మహాత్ముడి నాయకత్వంలో నిస్స్వార్ధ ప్రజానాయకులంతా కలసికట్టుగా కృషిచేస్తూ   భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి శాంతి సమరం చేస్తున్నారు.  ఈ దేశంలో వున్న  రాచరికపు సంస్థాన సముదాయాలనన్నింటినీ ఏకం చేసి ఆసేతుహమాచలపర్యంతం స్వయంసమృధ్ధి అఖండభారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు.

అందుచేతవిజ్ఞులైన భావిభారత పౌరుల్లారా మేల్కొనండి. కుల, మత, భాష, ప్రాంత తత్త్వాలకు అతీతంగా కృషి చేసి అన్ని వర్గాల ప్రజలమధ్య  శాంతి సామరస్యాలను, సమైక్యతా భావాన్ని పెంపొందించండి. అఖండ భారతదేశ నిర్మాణానికి , పవిత్రమైన మన భారతీయతను పరిరక్షణకు మీచేయూతనివ్వండి. ఇదే మీ తక్షణ కర్తవ్యం. దేశమాత ఋణం తీర్చుకోవడానికి ఇదే మంచి తరుణం.

పదండి ముందుకు, కదంతొక్కుతూ ఉరకండి.  శాంతియుతంగా స్వాతంత్ర్యాన్ని సాధించండి. ...

'బోలో !భరత్ మాతాకీ జై! జైహింద్!  

ఇటువంటి ఉపన్యాసాలతో, ఉద్వేగభరిత నినాదాలతో 1942 క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరమై స్వదేశాభ్యుదయవాదులను, యువకులను స్వాతంత్ర్య పోరాటంలోనికి దూకేలా ఉత్తేజితులను చేసి చైతన్యవంతులను చేసింది. అటువంటివారిలో చౌటపల్లి యువరక్తం ఘంటసాల కూడా ఒకరు.

తాను నేర్చుకున్న సంగీతంతో దేశభక్తి గీతాలు పాడుతూ ప్రజోద్యమంలో కలిసిపోయారు. తత్ఫలితంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు ఘంటసాలను జైల్లో పెట్టారు. జైలుజీవితం మంచే చేసింది. గొప్పగొప్ప రాజకీయ నాయకుల సాంగత్యం ఏర్పడింది. తనలోని సంస్కారం, వ్యక్తిత్వం మరింత మెరుగులు దిద్దుకుంది. దేశంకోసం తన వంతు సేవ ఏదో రూపంలో చేయాలనే తపన పెరిగింది.

అదృష్టంకొద్ది సినీరంగంలోకి అడుగుపెట్టిన ఘంటసాల అచంచల కృషి ఫలితంగా అంచెలంచెలుగా  ఎదిగి లలితసంగీత ప్రపంచంలో అద్వితీయ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా శిఖరాగ్రాలకు చేరుకున్నారు. సమయం, సందర్భం సమకూరినప్పుడల్లా సమాజం కోసం, దేశం కోసం తన సంగీతాన్ని సద్వినియోగం చేశారు.

తనలోని ఉన్నతభావాలను లోకవిదితంచేసే దిశలో చిత్ర నిర్మాణం తలపెట్టారు ఘంటసాల. తత్ఫలితమే, 1956 లో వచ్చిన 'సొంతవూరు' సినిమా. దేశ పురోభివృద్ధికి పల్లెలు, పంటపొలాలే పట్టుకొమ్మలనే అనే అంశం ఆధారంగా తీసిన సినిమా, దేశాభ్యుదయానికి తోడ్పాటునిచ్చే మంచి మంచి సందేశాత్మక గీతాలెన్నో వున్న సినీమాలోని అలాంటి ఒక ప్రబోధగీతమే 'మన వూరే భారతదేశం, మనమంతా భారతీయులం!' ఇదే నేటి మన ఘంటసాల సజీవరాగం.


పల్లవి:

మన వూరే భారతదేశం

మనమంతా భారతీయులం -2

చరణం 1: 

పల్లెలన్ని పంటలతో నింపేస్తాం

పేదగుండె మంటలనే ఆర్పేస్తాం

కరువులేని , పరువుపోని పౌరులౌతాం

                                        !మన వూరే!

చరణం 2:  

గాంధితాత చెప్పినదే వేదమంటాం

పేద గొప్ప భేదములే లేవంటాం

ఒక్కతల్లి బిడ్డలుగా  జీవిస్తాం

తల్లివంటి దేశమునే ప్రేమిస్తాం!ఒక్క!

సత్యమెంచి ధర్మమెంచి పూజిస్తాం

                                        !మన వూరే!

 చరణం 3: 

మాటుపడ్డ శౌర్యమునే వెలికీతీస్తాం

పూడుకున్న ఛాందసమే తొలగిస్తాం

ద్వేషబుధ్ధి కాలపట్టి రాసేస్తాం

నవ్యలోక ధర్మములే పాటిస్తాం!ద్వేష!

భారతీయ శాంతిగీతి పాడుకుంటాం-3

వందేమాతరం వందేమాతరం వందేమాతరం

అభ్యుదయ కవి రావూరి సత్యనారాయణ గారు వ్రాసిన గీతం. స్వీయ సంగీతంలో ఘంటసాలగారు, గాయకబృందం కలసి ఆలపించిన ఉన్నత సందేశగీతం. ఒక్క మాటలో చెప్పాలంటే మన స్వతంత్ర భారతదేశ విదేశాంగ విధానానికి ఆధారంగా రూపుదిద్దుకున్న పంచశీల సిధ్ధాంతానికి ప్రతీక 'మన వూరే భారతదేశం' పాట.

'పల్లెలన్ని పంటలతో నింపేస్తాం పేదగుండె మంటలనే ఆర్పేస్తాం కరువులేని పరువుపోని పౌరులౌతాంఎంత గొప్ప భావన. ఎంత చక్కటి దూరదృష్టి. సమాజానికి ఇంతకన్నా మంచి సందేశం ఎవ్వరివ్వగలరు, మన శతాబ్దిగాయకుడు ఘంటసాల తప్ప. జయహో ఘంటసాల.

వెస్ట్రన్ బ్యాండ్ వాద్యాలతో మార్చింగ్ ట్యూన్ లా వినపడే ఈ బృందగానాన్ని ఘంటసాల మాస్టారు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రపంచంలో బహుళ ప్రచారం పొందిన 'లోనియన్ మోడ్' లో స్వరపర్చారు. లోనియన్ మోడ్ నే మేజర్ స్కెల్ అని కూడా అంటారు. దీనికి సమాంతరమైన కర్ణాటక రాగం అందరికీ బాగా తెలిసిన శంకరాభరణం, 29వ మేళకర్త. దీనినే ధీరశంకరాభరణం అని అంటారు. ఇతర రాగాలన్నింటికంటే ఎక్కువ గమకాలు గల  రాగంగా శంకరాభరణం ప్రసిధ్ధి చెందింది. 'మన వూరే భారతదేశం' పాటను ఘంటసాలగారు శంకరాభరణం స్వరాలతో స్వరపర్చారు. ఘంటసాలగారు ఈ ప్రబోధగీతాన్ని ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంతో పాడి శ్రోతలలో సరికొత్త చైతన్యాన్ని కలిగించారు. రిపబ్లిక్ పెరేడ్స్ లో సైనిక విన్యాసాలలో ఈ రకమైన ట్యూన్స్ వినిపిస్తాయి. ఈ పాటలో ఘంటసాల మాస్టరు ట్రంపెట్స్, ఫ్లూట్స్, డ్రమ్స్, సింబల్స్, వయొలిన్స్, క్లారినెట్ వంటి వాద్యాలను ఘనంగానే వినిపించారు. 

చెప్పుకుంటే 'సొంతవూరు' సినిమా కు చాలా విశేషాలే వున్నాయి.

ఘంటసాల మాస్టారంటే వున్న ప్రత్యేక గౌరవాభిమానాల కారణంగా తన పరిపూర్ణ సహాయ సహకారాలందించి  హీరోగా నటించిన ఎన్.టి.రామారావుకు జోడీగా ఈ చిత్రంలో  అంతవరకు చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చిన రాజసులోచనను పూర్తిస్థాయి కథానాయికగా ఎలివేట్ చేశారు.

ఈ సినిమాలోని మరో విశేషంఒక నృత్యగీత సన్నివేశంలో ఎన్.టి.ఆర్  శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపించడం. అంతేకాదు, మల్లాది వారు వ్రాసిన ఆ పాటకు ఘంటసాలగారు అంతకుముందే ప్రైవేట్ రికార్డుగా పాడిన కరుణశ్రీ గారి' చూచెదవేలనో ప్రణయసుందరి', 'అంజనరేఖ వాల్గనుల', 'క్రొంజిగురాకు వ్రేళుల' పద్యాలను  జోడించి కృష్ణుని వేషంలోని ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించారు. ఈ సినిమాకు ముందు'ఇద్దరు పెళ్ళాలు' అనే సినిమాలో కూడా ఎన్.టి.ఆర్  కృష్ణుడి వేషంలో కనిపించారు. ఈ రెండింటి తర్వాతే మాయాబజార్ లో , వినాయకచవితిలో ఎన్.టి.రామారావు శ్రీకృష్ణుడి పాత్రలు ధరించి పౌరాణిక పాత్రలకు తనకు మించిన ప్రత్యమ్నాయ నటుడు మరొకరు లేరనే ఖ్యాతిని ఆర్జించారు.

సొంతవూరు సినీమాలోని పదిపాటలురెండు సీస పద్యాలు అన్నీ కట్టాణిముత్యాలే. వీటిని రావూరి సత్యనారాయణ గారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, సముద్రాల రాఘవాచార్యగారు వ్రాయగా ఘంటసాల, జిక్కి, పి. లీల, జె.వి.రాఘవులు ఆలపించారు. ఏ పాటకు ఆపాటే వైవిధ్యం తో కూడిన పాటలుగా మలచారు ఘంటసాల.

'సొంతవూరు' సినిమా పాటలను ఏ రికార్డింగ్ కంపెనీ విడుదల చేసిందో గుర్తులేదుకానీ అవి మామూలుగా వచ్చే RPM78 నలుపు రికార్డులుగా కాక RPM45 లో  తెల్లటి రికార్డులుగా వచ్చాయి. అలాగే కొన్ని పాటలు  తెల్ల రంగు రికార్డులుగా వచ్చాయి. వాటిని వినైల్ రికార్డు లంటారని విన్నాను. Polyvinyl chloride - PVC బహుశా ప్రోమోలుగా రిలీజ్ చేసి వుంటారు.  అయితే నాకు ఈ విషయంలో సరైన అవగాహన లేదు.

ఎన్.టి.ఆర్, రాజసులోచన, షావుకారు జానకి, అమర్నాథ్, సి.ఎస్.ఆర్., చంద్రకుమారిరమణారెడ్డి, సూర్యకాంతం, హేమలత, సురభి కమలాబాయి, చదలవాడ, వంగర, మొదలగువారు నటించిన  ఈ సినిమాలో మాస్టారి సహాయకుడైన సంగీతరావుగారు కూడా ఒక చిన్నపాత్రలో సి.ఎస్.ఆర్. తో కలసి ఒక సన్నివేశంలో కనిపిస్తారు.

సుప్రసిద్ధ బహుభాషా చిత్ర ఛాయాగ్రహకుడైన ఎ.విన్సెంట్ ఈ సినిమా కు కెమెరామన్ గా పనిచేశారు. సొంతవూరు సినిమా కు డైరెక్టర్ ESN  మూర్తి. డైరెక్టర్ గా ఆయనకు ఇదే మొదటి, ఆఖరి సినిమా కూడానేమో!

జి.వి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ కు తన తమ్ముడు సదాశివుడిని నిర్మాతగా ఉన్నతస్థితికి తీసుకురావాలని అశించారు ఘంటసాల. అయితే వారి దురదృష్టం, ఈ రెండో సినిమా కూడా ఆర్ధికంగా పరాజయం పొందింది. ముచ్చటగా మూడవసారి అంటూ మరో మూడేళ్ళ తర్వాత మరో సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఆ విషయాలు మరో భాగంలో చూద్దాము.

సొంతవూరు వసూళ్ళ రూపేణా ఫెయిల్ అయినా ఘంటసాలవారి సంగీతం మాత్రం  సంగీతాభిమానులను  ఏమాత్రం నిరాశపర్చలేదు. ఆ సినిమా లోని... 'శ్రీగోపాలా రాధాలోలా..', 'మనవూరే భారతదేశం', 'మల్లె మొగ్గల్లారా', 'చెంగు చెంగునా ఎగిరే రాజాపాటలు, 'స్వాగతంబోయి ఈ స్వాతంత్ర్య సీమకు', 'రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాలమేడలో' అనే పద్యాలు ఈనాటికీ అడపాదడపా వినిపిస్తూనేవున్నాయి

 


కొసమెరుపు:

ఏనాడో ఒక 65 ఏళ్ళ క్రిందటి మాట. ఘంటసాలవారి సినిమా నిర్మాణ అవశేషాలుగా కొన్ని పనికిమాలిన వస్తువులన్నింటినీ వారింటి మేడమీది గది ఒకదాంట్లో డంప్ చేశారు. అది నాకు, విజయకుమార్ కు ఆటస్థలంగా వుండేది. అలాటి వాటిలో GVS PRODUCTIONS  emblem ఒకటి. సినిమా టైటిల్స్ కు ముందు ఒక తోరణం మధ్య   వేలాడదీసిన ఒక పెద్ద గంట, దానిక్రింద GVS PRODUCTIONS అనే అక్షరాలు కనిపిస్తాయి. ఆలయ గంటలా ఈ గంట కూడా ఖంగుమని  మూడు సార్లు మ్రోగుతుంది (అని జ్ఞాపకం. ఎప్పుడో 1956 లో స్టూడియోలో  ప్రివ్యూ చూడడమే). సినిమాలో లాగే ఈ గదిలో పడివున్న గంట కూడా మ్రోగుతుందని ఆడించి చూశాను. ఖంగుమని కంచులా మ్రోగడానికి బదులు 'డబ్ డబ్' అని చప్పుడు చేయడం నాకు పెద్ద  షాక్. తర్వాత తెలిసింది ఆ తోరణం , ఆ వేలాడే గంట ఏదీ లోహంతో చేసింది కాదు , అది పేపర్ మోల్డ్  ఆర్టిఫిషియల్  వస్తువని.  ఆ గంటానాదం సౌండ్ ఎఫెక్ట్స్. అంతా రీరికార్డింగ్ మహిమ.

ఆనాడే తెలిసిపోయింది సినిమా అంటే  ఒక మాయాప్రపంచం, అక్కడ అంతా కృత్రిమం, ఏదీ సహజంకాదని.

ఘంటసాలవారి మరో సజీవరాగం తో వచ్చేవారం మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 16 - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...