Saturday, 1 August 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 26 - పెళ్ళిసందడి – రావే ప్రేమలతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 26


పెళ్ళిసందడి – రావే ప్రేమలతా ...


గతమొక చరిత్ర, తిరిగిరానిదిభవిష్యత్ ఎవరూ చెప్పలేరు, మన చేతిలో లేనిదివర్తమానమే మనది; ఈ క్షణమే శాశ్వతం. అందుచేత భూత భవిష్యత్ కాలాల గురించి ఆలోచించక మనకున్న ఈ కొద్ది క్షణాలు  సద్వినియోగం చేసుకుని జీవితాన్ని  సార్ధకపర్చుకోవాలి. ఇది వేదాంత సూక్తి. పరిమిత జ్జానంతో ఈ సూక్తిని ఎవరికివారు  తమకు కావలసినరీతిలో అన్వయించుకుని ఆచరిస్తున్నారు. ముక్తి సాధన కోసం కొందరైతేజ్ఞాన సముపార్జనకోసం కొందరు; ధనార్జన, పదవులు, అధికారాల కోసం; మదిర మగువల కోసం మరికొందరు అమూల్యమైన ఈ క్షణాన్ని(వర్తమానం) వినియోగించుకుంటున్నారు.

కానీ, ఇక్కడ, ఓ భావుకుడైన యువకుడు  మాత్రం తనకున్న కొద్ది క్షణాలను  తన ప్రియురాలి సమక్షంలో ఈ ప్రపంచాన్నే మరచి మధురాతిమధురంగా ఆనందమయం చేసుకోవాలని భావిస్తున్నాడు. ప్రేమించిన యువతిని ప్రేమలతగా, మనసులోని భావాల కవితగా తన చెంతకు ఆహ్వానిస్తున్నాడు...

పద్యం:

ఆహా చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞగీతికా

లాపనసేయు  కూర్మి  జవరాలోకవైపు మరొక్క వైపునన్

ఈ పసి కమ్మతెమ్మెరలు  ఈ పువుదోటల శోభలున్నచో

రేపటి ఆశ నిన్న వేతలేటికి నేటి సుఖాల తేలుమా! ఆ....ఆ....

యుగళగీతం:

అతడు: 

రావే ప్రేమలతా నీవే నా కవితా 

కిన్నెర మీటుల కిలకిలవే  

పలు వన్నెల మెరపుల మిలమిలవే

ఆమె:

ఓహో కవిరాజా నేడే నెలరాజా 

ఎందులకోయీ  పరవశము 

నీకెందులకోయీ కలవరము

అ: 

పూవులలో  నును తీవెలలో 

ఏ తావున  నీవే  వనరాణీ -2

ఆ: 

అందవతి కనిపించినచో 

కవులందరి  చందమిదేలే ! ఓహో!

అ: 

పరువులిడే  సెలయేరువలే  

నిను చేరగ కోరును నా మనసూ

ఆ: 

ఊహలతో  ఉలికించకుమా 

నవమోహన ఈ చెలి మదినే


అ: రావే ప్రేమలతా నీవే నా కవితా


ఆ: 

ముచ్చటగా  మనముండినచో 

మన మచ్చికకు  జగమేమనునో

అ: 

లోకముతో  మనకేమి పనీ 

మనసేకమయీ మనముంటే

ఆ: 

నేనే నీ కవితా

అ: రావే ప్రేమలతా ....

ఇద్దరూ కలసి : హమ్మింగ్...


హేమలత, స్వర్ణలత, సుమలత, ప్రేమలత, తనూలత ... యివన్నీ  యవ్వనంలో వున్న అందమైన యువతులకు పర్యాయ పదాలు, విశేషణాలు. అందుకే భావకుడైన కథానాయకుడు తన ప్రేయసిని 'ప్రేమలతా' అని సంబోధిస్తూ పూవులలో, నును తీవెలలో నిండిన వనరాణి యని వర్ణిస్తున్నాడు. అందుకు ఆ అమ్మాయి ఏమీ ఉబ్బి తబ్బిబ్బు అవలేదు. తనలాటి ' అందవతి'  కనిపిస్తే  కవులందరి తీరు ఇంతేనని ఎత్తిపోడుస్తోంది.  తన అందంమీద ఎంతవిశ్వాసం లేకపోతే తనను తానే 'అందవతి' అని పొగుడుకుంటుంది!  అంతలోనే ఆమెకు చిన్న భయం...  తమ అన్యోన్య స్నేహానికి లోకం ఏమనుకుంటుందోనని. 'మన మనసులు కలిసినపుడు లోకంతో ఏం పని అని అతని భరోసా. ఇలా ఈప్రేమ పక్షులు సుందరనందనోద్యానంలోకువకువలాడుతూ చూడముచ్చట గొలుపుతాయి.

ఈ చక్కటి యుగళగీతాన్ని జూనియర్ సముద్రాల (రామానుజం) గారు  1959లో వచ్చిన పెళ్ళిసందడి  సినీమా కోసం వ్రాశారు. ఘంటసాలగారు సంగీతం చేసిన సినీమాలలో పాటకు ముందు చిన్న సాకీయో లేక పద్యమో వుండడం ఆనవాయితీ. అలాగే ఈ పాటకు ముందు కూడా చందోబద్ధంగా ఒక మనోజ్ఞమైన పద్యాన్ని పెట్టారు రామానుజంగారు.

ఇంత  ముచ్చటైన ప్రేమ గీతంలో, బహుశా పారవశ్యంలో కాబోలు, దొర్లిన ' అందవతి' పదప్రయోగం ఆనాటి కొంతమంది తెలుగుభాషా ప్రియులకు పంటి క్రింద రాయిలా, కంటిలో నలుసులా ఇబ్బందిపెట్టింది. ఈ మాట తెలుగు నిఘంటువులలో కనపడదు.   సినీమా పాట కదా అలాగే వుంటుంది మరి అని అన్నవాళ్లు ఉన్నారు .

19-20  శతాబ్దాలకు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఒక సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. ఈనాటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహార్ సంస్థాన ఆస్థాన విద్వాంసుడు.  సరోద్, వయొలిన్, పక్వాజ్, మృదంగం  వంటి వాద్యాలలో, పాశ్చాత్య సంగీతంలో నిష్ణాతుడు. సంగీతమంటే గాత్ర సంగీతమే సంగీతమని భావిస్తున్న రోజులలో వాద్య సంగీతానికి కూడా అంతటి ప్రాశస్త్యాన్ని తెచ్చిపెట్టిన గొప్ప కళాకారుడు అల్లావుద్దీన్ ఖాన్. పద్మవిభూషణ్ బిరుదు గ్రహీత. కుమార్తె అన్నపూర్ణాదేవి, పండిట్ రవిశంకర్, నిఖిల్ బెనర్జీ, పన్నాలాల్ ఘోష్, వి.జి.జోగ్ వంటి అంతర్జాతీయ కళాకారులంతా అల్లాఉద్దీన్ ఖాన్ శిష్యులే.

అంతటి లబ్దప్రతిష్టుడైన అల్లావుద్దీన్ ఖాన్ చే ప్రచుర్యంలోనికి తీసుకురాబడిన రాగమే హేమంత్. బిలావల్ థాట్ కు చెందిన ఔఢవ  సంపూర్ణరాగం.  అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణ లో ఏడు స్వరాలు వుంటాయి. ఆరోహణ క్రమంలో లేని రిషభ పంచమ స్వరాలు అవరోహణ లో వుంటాయి.   కౌశికధ్వని  అనే రాగానికి అదనంగా కొన్ని స్వరాలు చేర్చి హేమంత్  అనే కొత్త రాగాన్ని అల్లావుద్దీన్ ఖాన్  తయారుచేశారు. హేమంత ఋతువంత  ఆహ్లాదకరమైన రాగం హేమంత్.

మనసుకు ప్రశాంతిని చేకూర్చే రాగం. అటువంటి హేమంత్  రాగ స్వరాలతో ఈనాటి ఘంటసాల సజీవరాగం ... ' రానే ప్రేమలతా  నీవే నా కవితా' యుగళగీతం రూపొందించబడింది.

తెలుగు చిత్రసీమ తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతిగారు. అలాగే, ఆలిండియా రేడియో తొలి లలితసంగీత గాయని కూడా ఆవిడే. ఆ తర్వాతే ఘంటసాలగారి రంగప్రవేశం. ఘంటసాలగారు సంగీతదర్శకుడైన తర్వాత బాలసరస్వతిగారితో ఎన్నో పాటలు పాడారు పాడించారు. ఆ ఇద్దరు కలసి పాడిన యుగళ గీతమే మన ఈనాటి సజీవరాగం. సరళమైన శ్రావ్యమైన గీతాలు పాడడంలో ఒకరిని మించినవారు మరొకరు. వీరి గాత్ర మాధుర్యంతో 'రావే ప్రేమలతా' పాట పెళ్లిసందడి సినిమాకు గొప్ప పెన్నిధి అయింది. ఈ పాటకు మరో పెద్ద ఆకర్షణ ఘంటసాలగారు సమకూర్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకనో చిన్నప్పుడు నేర్చుకున్న జంటస్వరాలు, అలంకారాలు గుర్తుకు వస్తాయి.  ఓ పదిమంది హేమంత్ రాగంలో అలంకారాలు పాడినా వాయించినా ఇలాగే వుంటుందని ఒక ఊహ.  ఒక చిన్న మాండోలిన్ బిట్ తో పాట పల్లవి ప్రారంభమవుతుంది. పల్లవి తర్వాత, చరణాలు తర్వాత వచ్చే బిజిఎమ్స్  మనసుకు హాయిని కలిగిస్తాయి.  చరణం చరణానికి మార్పు లేకుండా పాటంతటికి ఒకే బిజిఎమ్ ను ఉపయోగించడం వలన పాట శాశ్వతంగా గుర్తుండిపోతుంది. 

ఘంటసాలగారు ఈ పాట కోసం మేండోలిన్, యూనివోక్స్ (క్లేవయొలిన్), వయొలిన్, పియానో, ఫ్లూట్, క్లారినెట్, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా, చిటికెలు, బ్రషెస్ వంటి వాద్యాలను ఉపయోగించారు.   పాటకు ముందు కేవలం ఒక తంబురా శ్రుతితో ఘంటసాల గారు పాడిన  పద్యం ఈ సన్నివేశానికి గొప్ప హైలెట్.

తెలుగు సినిమా సంగీత స్వర్ణయుగంలో నీవే నేను,  నేనే నీవు అన్నట్లుగా మమేకమైపోయిన  అక్కినేని, ఘంటసాల ల కాంబినేషన్లో వచ్చిన అద్భుతగీతం 'రావే ప్రేమలతా ... నీవే నాకవితా...' . ఏదో డామ్ పరిసరాల్లో సుందర ప్రకృతి దృశ్యాలతో నిండిన  ఉద్యానవనంలో  ఎ.ఎన్.ఆర్., అంజలీదేవిల మీద చిత్రీకరించబడిన చక్కటి హుషారైన యుగళగీతం.

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బి.ఎ.సీతారాం నిర్మించిన మొదటి చిత్రం పెళ్లిసందడి. డి.యోగానంద్ డైరక్షన్లో వచ్చిన ఈ సినీమా హీరో, హీరోయిన్ లు అక్కినేని, అంజలీదేవి కాగా యితర పాత్రలలో బి.సరోజాదేవి, చలం, గుమ్మడి, రమణారెడ్డి, డా.శివరామకృష్ణయ్య, మొదలగువారు నటించారు.

ఘంటసాల గారి సంగీతంలో ఎన్నో మంచి పాటలతో నిండిన పెళ్లిసందడి ప్రేక్షకులలో మంచి సందడి నే సృష్టించి మంచి విజయాన్ని పొందింది.


వచ్చే వారం ఘంటసాల గారి మరో సజీవరాగంతో మరల  కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

Saturday, 25 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 25 - భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 25

భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు, కళా సంస్కృతికి దర్పణాలు మన ప్రాచీన దేవాలయాలు. విజ్ఞాన వికాసాలను అందించిన విద్యాలయాలు. శిల్ప, సంగీత, నృత్యాది కళలు మన దేవాలయాల నుండే అభివృద్ధి చెందాయి. భారతీయ దేవాలయ సంస్కృతి 12 వ శతాబ్దం నాటికే దక్షిణాసియా దేశాల వరకు  వ్యాపించింది. 

ప్రాచీన కాలంలో ఆలయాల్లోని దేవుని పూజా విధానంలో భాగంగా దేవుని సేవ కోసమై కొంతమంది  స్త్రీలు భగవంతుని పరంగా నృత్యాలు చేసేవారు. వారిని దేవదాసీలనేవారు. వంశపారంపర్యంగా వారు దేవుని సేవ కోసమే అంకితమైపోయినవారు. ఈ దేవదాసీ నృత్యాలు కాలక్రమేణా  ఈనాడు మనం చూస్తున్న శాస్త్రీయ నృత్యాలుగా పురోభివృద్ధి చెందాయి.

తమిళనాడుకు చెందిన భరతనాట్యం, ఆంధ్రపదేశ్ కు చెందిన కూచిపూడి, ఒరియాకు చెందిన    ఒడిస్సీ, కేరళకు చెందిన మోహినియాట్టం, కర్ణాటక యక్షగానం, అస్సాం సత్త్రియ నాట్యం మొదలైనవన్నీ దేవాలయాల వరప్రసాదమే.

గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచమంతా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆధునీకరణ, నవీనత్వంపేరిట అన్ని రంగాలలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. ఆ  మార్పు శాస్త్రీయ సంగీత, నృత్యరంగాలలో కూడా బాగా కనిపిస్తుంది. సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడం కోసం  చేపడుతున్న కొత్త ప్రక్రియలు ఎన్నో.  ఇందువలన  ఈనాటి సంగీత నృత్య కళలలో మన ప్రాచీన శాస్త్రీయ దృక్పథం కొరవడుతున్నదనే భావన కలుగుతున్నది . ఇది మంచికా, చెడుకా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఈనాటి మన సజీవరాగం గత తరం సంగీతాభిమానులు మెచ్చిన ఒక పాతకాలపు సినిమాలోని శాస్త్రీయ నృత్య గీతం... అదే మన ఘంటసాలవారి స్వంత చిత్రం భక్తరఘునాథ్ లోని 'జయ మురళీలోల గోపాలా ...'


జయ మురళీ లోల గోపాలా - 2

మా ఎద మురిపాల జ్యోతుల చేసి

ప్రియమున కొలిచేము నిలిచేము స్వామి 

                                                !జయ!

 

మదవతులా మది దోచిన రాగీ

మౌనుల హృదయాల భాసించు యోగీ

కాళీయ ఫణిజాల తాండవలోలా

గైకొను మానంద  నీరాజనాలా 

                                                !జయ!

సాధారణంగా మన సినిమాలలోని శాస్త్రీయ నృత్యగీతాలు... దేవుని పరంగా కావచ్చు లేదా రాజు మహరాజుల పరంగా కావచ్చు, అవి శృంగార తత్త్వంతో నిండివుంటాయి. కానీ, ఈ నర్తకి మా త్రం కేవలం కృష్ణస్వామి నామ సంకీర్తనంతో  నృత్యం చేస్తూ  తన భక్తిప్రపత్తులు తెలియజేస్తోంది. సంకీర్తనం ద్వారా నర్తకి, శ్రవణం ద్వారా ఆలయంలోని భక్తులు దేవుని సేవించుకుంటున్నారు.

భక్త రఘునాథ్ సినీమాలో ఒక ఆలయ నృత్య సన్నివేశంకోసం  శ్రీ సముద్రాల రాఘవాచార్యులువారు వ్రాసిన చిన్నగీతం ఇది.  సాహి త్యందృష్ట్యా కేవలం ఒక చిన్న పల్లవి రెండేరెండు చరణాలతో ముగించారు. సముద్రాల వారు ఆరితేరిన శ్రీవైష్ణవ  కవి అయినా క్లిష్టమైన 'మదవతుల మది  దోచిన రాగి; మౌనుల హృదయాల భాసించు  యోగి అని శ్రీకృష్ణుని  సంబోధించడంలో సముద్రాలవారి కవితా శైలి స్పష్టమవుతుంది. సంగీత సాహిత్య నృత్య సమన్విత గీతంలో  సాహిత్యం ఎంతవరకు వుండాలో అంతవరకే ఉపయోగించుకున్నారు దర్శక రచయిత సముద్రాల. సన్నివేశానికి అనుగుణ్యమైన సంగీత నృత్యాలను సమకూర్చే  భాధ్యతను సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్య దర్శకుడు వెంపటి పెద సత్యంకు  వదిలేశారు. సంస్కృత సమాసాల జోలికి పోకుండా సరళమైన చిన్న చిన్న పదాలనే సమర్థవంతంగా వాడారు.

ఘంటసాల మాస్టారు ఈ నృత్య గీతాన్ని శ్రీరంజని రాగంలో మలచారు. కర్ణాటక సంగీతంలో 22 వ మేళకర్త  ఖరహరప్రియకు జన్యరాగం. ఆరోహణ అవరోహణ క్రమంలో ఆరు స్వరాలు మాత్రమే వుండే షాఢవ రాగం. పంచమ స్వరం వుండదు. శృంగార భక్తి రసాలను వెల్లడించడానికి చాలా అనువైన రాగం శ్రీరంజని. అందుకే మాస్టారు ఈ రాగంలో ఈ నృత్య గీతాన్ని చేయడానికి సంకల్పించారు.  కర్ణాటక సంగీతంలో మంచి అనుభవం గల ఎ.పి.కోమలగారితో  ఈ పాటను పాడించారు పాటలో వచ్చే చిన్నచిన్న ఆలాపనలు, స్వరకల్పనలు, గమకాలు, సంగతులు అన్నీ కోమల గళంలో సలక్షణంగా పలికి శ్రోతలను రంజింపజేశాయి. మృదంగం, మోర్సింగ్ ల తాళగతులతో ఆరంభమయ్యే ఈ నృత్య గీతంలో ప్రధాన వాద్యంగా వీణను ఎన్నుకున్నారు ఘంటసాల గారు. రికార్డింగ్ లో ఈ పాటకు వీణను వాయించిన సంగీతరావుగారే తెరపై కూడా వీణ వాయిస్తూ కనపడడం ఒక విశేషం. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే విద్యార్థులకు అభ్యాస గీతంగా ఘంటసాలగారు కర్నాటక సంగీత శాస్త్ర మర్యాదలననుసరించి స్వరపర్చిన అనేక గీతాలను నేర్పడం ఎంతైనా సముచితమని శ్రీ సంగీతరావుగారి నిశ్చితాభిప్రాయం. అటువంటి గీతాలలో శాస్త్రీయత ఉట్టిపడే ఈ 'జయమురళీలోలా' ఒకటి. 

భక్తరఘునాథ్ సినిమాకు వెంపటి పెదసత్యం, చిన్నిలాల్, సంపత్ లాల్ లు నృత్య దర్శకులుగా  వ్యవహరించారు. ఈ శాస్త్రీయ నృత్య గీతాన్ని మాత్రం వెంపటి వారే రూపొందించారు.  అప్పుడే  సినీమా రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన నర్తకి  సోదరీమణులు స్వర్ణ, మణిలలో స్వర్ణ చేత ఈ నృత్యాన్ని చేయించి ఆ కొత్త నటికి ప్రోత్సాహాన్ని అందించారు ఘంటసాల. ఆ నాటి ఆ మణియే తర్వాతి కాలంలో గీతాంజలిగా బహు భాషా చిత్ర నటిగా ప్రఖ్యాతి చెందారు.

సంగీతభరిత భక్తి చిత్రంగా ఘంటసాలగారు నిర్మించిన భక్తరఘునాథ్ ఈనాడు సినీమాగా  గాని వీడియోగా గాని మనకు అందుబాటులో లేకపోవడం చాలా విచారకరం.


వచ్చే వారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

Saturday, 18 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 24 - సరియా మాతో సమరాన నిలువగలడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 24

దీపావళి - సరియా మాతో సమరాన నిలువగలడా

సనాతన ధర్మాన్ని గౌరవించే భారతీయులందరికీ దీపావళి అత్యంత ప్రధానమైన, విశిష్టత కలిగిన పర్వదినం. మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వెలుగు-చీకటి మధ్య సమన్వయపర్చే ప్రయత్నమే దీపావళి పండగ. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగి చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇళ్ల ముంగిళ్ళలో దీపాలను  వెలిగించి పండగ జరుపుకుంటారు. అంతర్ముఖంగా అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగులను ప్రసరింపజేయడమే దీపావళి పరమార్థం.

ఈ దీపావళి పండగ వెనుక రెండు అతి ముఖ్యమైన పురాణ యితిహాసాలు వున్నాయి.  ఒకటి రామాయణం; మరొకటి భాగవతము. శ్రీరాముడు రావణాసురుని వధించి సీతాదేవితో అయోధ్యకు వచ్చిన రోజున,  లోక కంటకుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధంలో వధించిన రోజున ఈ దీపావళి పండగను జరుపుకుంటారు.

అసమాన వరప్రసాద బలంతో ముల్లోకాధిపత్యం సంపాదించి మితిమీరిన కండకావరంతో అసురుడిగా మారిన నరకుని హింసలనుండి    సాధు సజ్జనులను కాపాడమని  వచ్చిన మునులకు, భక్తులకు నరకుని రణరంగంలో సంహరిస్తానని అభయమిస్తాడు శ్రీకృష్ణుడు. అంతఃపురంలో వున్న సత్యభామ ఈ వార్తను విని యదుమౌళి ప్రియ సతిగా, తాను గీచిన గీటు దాటి చరించని (అమాయకపు భ్రమ)  తన పతికి తోడుగా రణరంగాన నరకునితో పోరాడి విజయం కట్టబెట్టి   తీరుతానని ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది సత్యభామ. ఆ సమరోత్సాహంలో విల్లంబులు అందుకుని నరకుడు తమతో సరిసాటిగా సమరాన నిలువగలడా అంటూ ఒక పాట రూపంలో తన సుకుమార రూపలావణ్యాలను, వీర శౌర్య ప్రతాపాలను ప్రదర్శిస్తుంది ...


సరియా మాతో సమరాన నిలువగలడా 

                                                        !సరియా !

 పెదవుల వలపు సింగార మొలక

 కన్ను కొనల  కోపానల మెలయ

యదుపతి మురియ

నరకుడూ వెరవ చలము, బలము చూపేగా 

                                                        !సరియా!

దురమునా ప్రబల దానవకోటీ 

పరువుమాపి యిల గూల్చిన మేటి !దురమునా!

నరహరీ యెదుర నరకునీ తరమ

దురుసు పలుకులాడేనా

                                                        !సరియా!

కన్నెలు మదిని సమ్మోదపడగా దనుజ

లోకము కంపిలిపోవా !కన్నెలు!

ధనువుగొనీ మనోహరునీ 

సరసన నిలచి నరకునీ గెలిచి

బిరుదు గొనక మానేనా 


                                                        !సరియా!

సమరాన నిలువ,

సమరాన నిలువ,

సమరాన నిలువగలడా 


సత్యభామ నైజాన్ని బాగా గుర్తెరిగిన కృష్ణుడు ఆమె నిర్ణయాన్ని నిరుత్సాహపరుస్తాడు. రణరంగమంటే కోకిలాలాప కుసుమపరాగ వనవిహారం కాదని భీకరధ్వనులతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో భయానకంగా వుంటుందని అది సత్యభామ వంటి కుసుమకోమలులకు తగిన స్థలం కాదని హితవు పలుకుతాడు. కానీ సత్యభామ తన మంకుతనాన్ని మరింత పెంచి నరకునితో యుధ్ధం చేసే తీరుతానని భీష్మించుకుని కృష్ణుడితో రణభూమికి తరలి వెడుతుంది. ఈ సందర్భం కోసమే కృష్ణుడు ఎదురుచూస్తున్నాడు. నరకాసురవధలో సత్యభామే ప్రధాన పాత్రధారియని జగన్నాటక సూత్రధారి యైన కృష్ణుడికి మాత్రమే తెలుసు. నరకాసురుడు తన మరణం  తల్లి ద్వారా మాత్రమే సంభవించేలా వరం పొందాడు. భూదేవి, వరాహస్వామి (విష్ణువు) కి జన్మించి అసురుడుగా మారినవాడే నరకుడు. దుర్మార్గుడైన నరకుని సంహరించడానికి అవతరించిన భూదేవియే సత్యభామ. నరకాసురవధతో ముల్లోకాలకు పట్టిన పీడ తొలగిపోయింది. ప్రజలంతా మహదానందంతో దీపాలను వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ వృత్తాంతమే  'దీపావళి' సినిమా గా 1960 లో మన ముందుకు వచ్చింది.

అందులో సత్యభామ ఆలపించిన ' సరియా మాతో సమరాన నిలువగలడా....' అనే గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం.

పౌరాణిక చిత్రాలకు కథ, మాటలు, పాటలు వ్రాయడంలో నిష్ణాతుడైన తెలుగు టాకీ తొలితరం సినిమా కవి సముద్రాల  రాఘవాచార్యులు. సీనియర్ సముద్రాలగా లబ్దప్రతిష్టులు. తెలుగు సినిమాలలో తొలి రోజులనాటి గ్రాంధిక పరిభాషకు స్వస్తి చెప్పి, తెలుగు భాషలోని సాహిత్యపు విలువలు విడనాడకుండా  వ్యవహారిక భాషలో మాటలు, పాటలు వ్రాయడం మొదలెట్టిన తొలి  కవి సముద్రాల సీనియర్.

దీపావళి సినిమా లోని మొత్తం 22 పాటలు, పద్యాలను  సముద్రాలగారే జనరంజకంగా వ్రాశారు. 'సరియా మాతో సమరాన నిలువగలడా' పాటను వీర శృంగార రసాలను సమపాళ్లలో మేళవించి తన కవితా పటిమను చాటిచెప్పారు సముద్రాల.   ఈ పాటలో వినపడే... 'ఎలయ', 'మురియ', 'వెరవ', 'చలము', 'సమ్మోదము',  'దురము', 'దురుసు', 'కంపిలి' వంటి సినీమాలలో అరుదైన పదాలు సముద్రాల వారి పాండిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.

దీపావళి చిత్రం ఆద్యంతం వైవిధ్యభరితమైన సంగీతాన్ని వినిపించిన ఘంటసాలవారు 'సరియా మాతో'...' అన్నట్లుగా  స్వరకల్పనలో తనకు తానే సాటిగా ఈ పాటను  మాల్కౌన్స్ రాగ స్వరాలతో అద్భుతంగా స్వరపర్చారు. హిందుస్థానీ మాల్కౌన్స్ రాగానికి సమాంతరమైన కర్ణాటక సంగీత రాగం హిందోళం. మాల్కౌన్స్ భైరవి థాట్ కు చెందిన ఔడవరాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణాక్రమంలో 'స గ మ ద ని' అనే ఐదు స్వరాలు మాత్రమే వినిపిస్తాయి. 'రి, ప' స్వరాలు ఈ రాగానికి వుండవు.

అతి ప్రాచీనము, సుప్రసిద్ధము అయిన ఈ మాల్కౌన్స్ రాగంలో  సుప్రసిద్ధ సంగీత విద్వాంసుల గీతాలే కాక వందలాది  సినిమా పాటలు కూడా వివిధభాషలలో రూపొంది ఆపాతమధురాలుగా నిలిచిపోయాయి.

'సరియా మాతో....' పాటలోని సంగతులు, గమకాలు, భావాలు గాయకులందరికీ పెను సవాలు. శృంగార, వీర రసానుభూతులనులను  ఒకే సమయంలో అతి సమర్ధవంతంగా గాయని గళంలోనుండి పలికింపజేయడంలో ఘంటసాల తన విద్వత్ ను ప్రదర్శించారు. తనకు సాటిగా ఈ పాటను మరెవ్వరూ పాడలేరన్న రీతిలో పాడి అటు సంగీతదర్శకుడు ఘంటసాలను, ఇటు శ్రోతలను మెప్పించిన కోమల గాయని  కోమల. సెమి క్లాసికల్ సాంగ్ అనగానే ఘంటసాలగారి మొదటి ఛాయిస్ ఆలిండియా రేడియో నిలయ విద్వాంసురాలు  ఆర్కాట్ పార్ధసారధి కోమలగారే. దీపావళి సినిమాలో హీరోయిన్ పాటలు పద్యాలన్నింటినీ ఎ.. కోమలే అద్వితీయంగా పాడారు.

ఘంటసాలగారు ఈ పాటకోసం వయొలిన్స్, వీణ, సితార్, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, డబుల్ బేస్, తబలా, పక్వాజ్, డోలక్, మువ్వలు వంటి వాద్యాలను దురిత గమనప్రధానంగా ఉపయోగించి పాటను రక్తి కట్టించారు. ఈ చిత్రంలోని ఇతర గీతాలను ఘంటసాల, మాధవపెద్ది, ఎస్.వరలక్ష్మి,  జె.వి.రాఘవులు, జమునారాణి ఆపించారు.

సత్యభామ అనగానే తెలుగు కళాప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది స్థానం నరసింహారావువేదాంతం సత్యనారాయణ శర్మ, ఎస్.వరలక్ష్మి, జమున, సావిత్రి గార్లే.  నవరసాలను అత్యద్భుతంగా పోషించగల నవరస కథానాయకి సావిత్రి మాత్రమే. దీపావళి సినిమాలో సత్యభామగా సావిత్రి ఈ పాటలో అసమానంగా నటించారు.

దీపావళి సినిమాలో ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వీ.రంగారావురమణారెడ్డి, కాంతారావు, గుమ్మడి, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, వంటి హేమాహేమీ నటులు పోటాపోటీగా నటించి దీపావళి సినిమా దిగ్విజయానికి దోహదం చేశారు.

పూర్తిస్థాయి శ్రీకృష్ణుడిగా ఎన్.టి.రామారావుకు మూడవ చిత్రం దీపావళి. మాయా కృష్ణునిగా నరకాసురుడు గోపికలను అల్లరిపెట్టే సన్నివేశంలో ఎస్.వి.రంగారావు మేనరిజమ్స్ ను  ఎన్.టి.ఆర్. బహు చక్కగా అభినయించి మంచి వినోదం కలిగించారు.  

మ్యూజికల్ హిట్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల అమోదాన్ని పొందిన దీపావళి  సినిమా అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు  జరుపుకుంది. ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయబడింది.

చాలా తక్కువ సినీమాలకు మాత్రమే దర్శకుడిగా పనిచేసిన సబ్నవిస్ రజనీకాంత్ డైరక్ట్ చేసిన దీపావళి సినీమాను, వినాయకచవితి సినీమాను  తీసిన కె.గోపాలరావు గారే అశ్వరాజ్  ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు.

కొసమెరుపు: 

ఈనాడు మనకు ఆందుబాటులో వున్న దీపావళి సినిమా వీడియో టైటిల్స్ విషయంలో  ఏదో తారుమారు  జరిగింది. అవి ఒరిజినల్ టైటిల్స్ కావు.  మొదట్లోని కొన్ని  పేర్లు  మళ్ళా ప్రింట్ చేసి అతికించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. టైటిల్ మ్యూజిక్ లో కూడా జర్క్ కనిపిస్తుంది. ఆ గడబిడలో సంగీతదర్శకుడిగా  ఘంటసాలగారి పేరు మాయమైపోయింది. ఈ పొరపాట్లను గమనించని  టివి ఛానల్స్ సంగీతం సంగీతరావు అని  కూడా ప్రకటించడం జరిగింది. ఈ పొరపాటు ఏనాటికైనా  సవరించబడేనా!!


వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 26 - పెళ్ళిసందడి – రావే ప్రేమలతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...