Saturday, 20 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 20 - సమయమిది దాయరా సరసుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 20

పెళ్లిసందడి - సమయమిది దాయరా సరసుడా

"బ్రదర్, ఆ కళాసమితివారు చేతులెత్తేసారు. మన అమ్మాయిల డాన్స్ ప్రోగాము వాళ్ళ సభలో పెట్టలేరట. రెండేళ్ళవరకు కార్యక్రమాలు ఫిక్స్ చేసేసేరట. అందులోనూ అమెచ్యూర్ డాన్సర్స్ కు వాళ్ళ కళాసమితిలో అవకాశం దొరికే ప్రసక్తే లేదంటున్నారు. కానీ, అసలు విషయం అదికాదు. మనవాళ్ళ డాన్స్ వాళ్ళ వేదికమీద జరగాలంటే మనం వాళ్ళకు ఎంతోకొంత డొనేషన్ ముట్టచెప్పాలనేది ఆంతర్యం. దానికి మనం అంగీకరిస్తే వచ్చే వారమే మన అమ్మాయిల నృత్యకార్యక్రమం ఖాయం. ఆ సమితి ప్రెసిండెంటే స్వయంగా వచ్చి మన అమ్మాయిలను అభినందించి ఆశీర్వదిస్తాడట. ఆ దెబ్బతో మన పిల్లల జాతకమే మారిపోయి  కళాప్రపంచంలో ఓహో! అని ఓ వెలుగువెలిగిపోతారని ఆ శెక్రెటరీ లోపాయికారీగా చెప్పాడు. నేను ససేమీరా కుదరదని చెప్పి వచ్చేసాను."

"కళాసేవ, కళాపోషణ అంటూ వీళ్ళు చేసే వ్యాపారం ఇదన్నమాట! మరిప్పుడెలా! ఏం చేద్దాము".

"చేయడానికి ఏముంది. మన తోట బంగళాలో ఓ పెద్దహాలు వుందికదా. సుమారు వెయ్యమంది దాకా కూర్చోవచ్చు. కొంచెం ఆలస్యమైనా అన్ని వసతులతో, హంగులతో ఒక సాంస్కృతిక సంస్థ ప్రారంభించి  గ్రాండ్ గా వచ్చే ఉగాది నుండి ప్రతీ నెల మంచి మంచి నృత్య, నాటక, సంగీత, కార్యక్రమాలు ఉచితంగా ఏర్పాటు చేద్దాము. ఆ గొడవంతా నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను."

"అమ్మాయిలూ! మన  సంగీత, నృత్యనాటక కళాసమితిలో మొదటి ప్రోగ్రాం మీదే. ఏం చేస్తారు? భరతనాట్యమా, కూచిపూడియా?" ఏదైనా ప్రేక్షకులు అదిరిపోవాలి, చూసుకోండి మరి".

"ప్రారంభమే శుధ్ధ శాస్త్రీయం వద్దు బాబాయ్. మన గురించి, మన టాలెంట్ గురించి పదిమందికి బాగా తెలిసేవరకు, సామాన్య ప్రేక్షకులకు అర్థమై చూసి ఆనందించేలా లలిత శాస్త్రీయ అంశాలనే ఏర్పాటు చేద్దాము".

"ఓహోహో! అంటే అప్పుడే మీరు ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకు కూర్చున్నారన్నమాట.  ముందుగా, స్టేజ్ కోసం మోడర్న్ గా మీ పేర్లను మార్చేయాలి."

"మీ డాన్స్ ఐటెమ్స్ సిధ్ధంగా వున్నాయంటున్నారు, ఒకసారి పాడి, చేసి వినిపించండమ్మా."

"ఓ పాత తెలుగు సినిమాలోని పాటే నాన్నా! మా కాలేజీ ఫంక్షన్ కోసం మా డాన్స్ టీచర్ సెలెక్ట్ చేశారు. ఆ రోజు మా ఐటెమ్ కు చాలా మంచిపేరు వచ్చింది.  చీఫ్ గెస్ట్ కూడా చాలా మెచ్చుకున్నారు."

"అలాగా! అయితే తప్పకుండా ఆ ఐటమ్సే ఫైనలైజ్ చెయ్యి బ్రదర్. "

"ఏదమ్మా ఆ పాట వినిపించండి."

"ఒక్క పాటేమిటి నాన్నా... విడియోవే చూపిస్తాము. "పెళ్ళిసందడి" అనే పాత సినిమా లో అంజలీదేవి, బి.సరోజాదేవి చేసిన ఒక వెరైటీ సెమిక్లాసికల్ డాన్స్ నెంబర్. జూనియర్ సముద్రాల వ్రాసిన పాటకు ఘంటసాల వరసలు కూర్చగా  పి.లీల, జిక్కి పాడారు. అన్ని క్లాసెస్ వాళ్ళకీ బాగా నచ్చుతుంది.

"ఓకే బ్రదర్ ! మన కళాసమితి ఫస్ట్ ఉగాది  ప్రోగ్రామ్ ఫిక్స్డ్. రెడీ ఫర్ స్టేజ్.

                                                                    -+-

ఈలోగా మనం ఆ విడియో చూసేద్దాము

సమయమిదిదాయెరా సరసుడా-2

తమిగొని జతగొని సరసాల తేలదగు

సమయమిదిదాయెరా

 

విరులు పూచెరా వెన్నెల కాచెరా

మారునీ గెలిచి కూరిమీ కలిసి

పరవశముల మెలగా! సమయ!

 

తాళలేనురా జాలమిదేల  రా

జాలినీ చూసి బాలనూ కరుణ

ఏలరా కౌగిలిలో రారా ! సమయ!


జిక్కి: 

రావోయి సక్కనోడా, నావోడ

రావోయి సక్కనోడా

లీల:

వచ్చానె సిన్నదానా, నాదాన

వచ్చానె సిన్నదానా

జిక్కి: 

సల్లని ఎన్నెలలోన సన్నాని అలలపైన 

సక్కనీ పడవానెక్కి సరదాగా పాడుకుంటూ 

                                                !రావోయి!

లీల:

సిలిపిసూపులు సూత్తు సెంతని నీవుంటే 

సెంగునా నట్టేట దూకి సేపలన్నీ పట్టుకురానా

జిక్కి:

రావోయి సక్కనోడా నావోడ

రావోయి సక్కనోడా

లీల:

పోదామె సిన్నదానా నాదాన

పోదామె సిన్నదానా

జిక్కి:

హైలేలో నా రాజా రావోయి నీదే

కన్నె రోజా ! హైలేలో!

లీల:

సరసము కోరే తరుణి యిదీ

సరసనజేరే తరుణమిదీ

కన్ను చెదిరే వన్నె నాదీ

వలపు గొలుపు వయసు చెలి యిదీ

                                        !హైలేలో!


జిక్కి:

మిలమిల మెరిసే మెయి తళుకూ

కలవరపరిచే కనుబెళుకూ

మనసు నీది మమత నీది

మరులుగొలుపు వయసు చెలి యిదీ

                                        !హైలేలో!


                                    


ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అనేక ఆపాతమధురాలలో ఈ పాట ఒకటి. 1959 లో వచ్చిన "పెళ్ళిసందడి" లోని ఈ యుగళగీతమే నేటి మన సజీవరాగం.

ఇదొక రొమాంటిక్, వెరైటీ నృత్యగీతం. వైవిధ్యంతో కూడిన మూడు నృత్యరీతులు కనపర్చే పాట.  పాట మొదటి భాగంలో భరతనాట్య శైలిలో ఒక జావళి, రెండవభాగం జానపదం. మూడవ భాగం విదేశ నృత్యరీతిలో వుంటుంది. ఈ నృత్యగీతం వినోదాన్ని ఆశించి చేసినదే అయినా, ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా మన భారతీయ సంస్కృతికి తగినట్లుగా హుందాగా, గౌరవప్రదంగా చిత్రీకరించారు డైరెక్టర్ డి.యోగానంద్. ఈ సినిమా నృత్యదర్శకుడు (టైటిల్స్ లో పేరే వేయలేదు) ఎవరోగానీ అన్ని పాటలకు చక్కటి నృత్యభంగిమలను సమకూర్చి అంజలీదేవి, బి సరోజాదేవి చేత హుషారుగా నాట్యం చేయించారు.  

ఘంటసాల మాస్టారు ఈ పాటను రాగమాలికలో చేశారు.  ఒక పాటలోరెండు కన్నా ఎక్కువ రాగాలుంటే దానిని రాగమాలిక అంటారు. ఈ నృత్యమాలికలో మొదటిదైన భరతనాట్య జావళీని చారుకేశి రాగంలో, జానపదశైలిలో వుండే చరణాలను బృందావన సారంగలో, ఆఖరి ఫారిన్ టైప్ డాన్స్ ను తోడిరాగ స్వరాలతోనూ చేశారు.

చారుకేశి రాగాన్ని తెలుగు సినిమా సంగీతాభిమానులకు పరిచయం చేసినది మన ఘంటసాల మాస్టరుగారేనని గతంలో చెప్పడం జరిగింది. కర్ణాటక సంగీతంలో చారుకేశి 26వ మేళకర్త. దీనికి అనేక జన్యరాగాలున్నాయి. ముత్తుస్వామి దీక్షితర్ సంగీత సంప్రదాయం లో చారుకేశి రాగాన్ని తరంగిణిగా వ్యవహరిస్తారు. ఘంటసాలగారు ఈ పాటలో వచ్చే  చారుకేశి రాగం జావళీకి కర్ణాటక సంగీత గమకశుధ్ధిని పాటిస్తూ సశాస్త్రీయమైన మెట్టునే కట్టారు. భరతనాట్య ప్రదర్శనకు ఉపయోగించే వీణ, వయొలిన్స్, ఫ్లూట్, మృదంగం, మోర్సింగ్, గజ్జెలతో పాటు తబలాను కూడా ఉపయోగించారు. పాట ప్రారంభం తబలా నడకతోనే మొదలవుతుంది. 

ఈ పాటలో రెండవభాగం బెస్త యువతీయువకుల జానపదశైలి నృత్యం. ఈ భాగంలో నర్తకులు, గాయకులు ఆడవారే. ఈ చరణం నేపథ్యంలో వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, తబలా, డోలక్, డప్పు, గజ్జెలు, మొదలైన వాద్యాలు వినిపిస్తాయి.

ఈ భాగంలో మనకు వినిపించే రాగం బృందావనసారంగ. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో బహుళ ప్రచారం పొందిన  రాగం. కర్ణాటక సంగీతంలోని 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యం ఈ బృందావన సారంగ. హిందుస్థానీ సంగీతంలో  కాఫి థాట్ కు చెందిన రాగం. భక్తి, శృంగార రసాది అనుభూతులను వెల్లడించడానికి అనువైన శ్రావ్యమైన రాగం.

ఇక ఈ నృత్యగీతంలో మూడవ ఆంశం ఒక విదేశీ బాణీ నృత్యం. ఇది బహుళ ప్రచారంలో వున్న  ప్రాచీన జపాన్ జానపద నృత్య ప్రక్రియ. దీనిని 'పారసల్' లేదా 'హిగస ఒడోరి' డాన్స్ అని అంటారు. ఈ నృత్యశైలి జపాన్ లోని కబుకి, ఒకినావన్ ప్రాంతాలలో నుండి అభివృద్ధిలోకి వచ్చింది. ఈ నృత్యంలో నర్తకీమణులు తమ సంప్రదాయ కిమోనా దుస్తులు ధరించి వివిధరకాల కేశాలంకరణతచేతిలో రంగురంగుల గొడుగులు ధరించి, శ్రావ్యమైన, సున్నితమైన వాద్యసంగీతానికి తగినట్లుగా మెల్లని పదవిన్యాసంతో సాగే నాట్యప్రక్రియ. దీని ఆధారంగా మన నృత్య దర్శకులు రూపొందించిన  చక్కటి అంశం. ఈ నృత్యంకోసం ఘంటసాల మాస్టారు తోడి రాగ స్వరాలు ఉపయోగించారు. తోడి కర్ణాటక సంగీతంలో అతి ప్రాచీనమైనది. 8వ మేళకర్త రాగం  హనుమత్తోడి అని అంటారు. దీనికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవ్. హిందుస్థానీ సంగీతపు తోడి రాగానికి, కర్ణాటక సంగీత తోడిరాగానికి తేడా వుంది. పాశ్చాత్య (Western) దేశ సంగీతాలలో కూడా ఈ తోడి రాగం వినిపిస్తుంది. అక్కడ ఈ రాగాన్ని'ఫ్రిజియన్ మోడ్' అని అంటారు. అటువంటి సుప్రసిద్ధ రాగ స్వరాలను ఘంటసాలగారు ఈ భాగంలో ఉపయోగించారు.

పి.లీల, పి.జి.కృష్ణవేణి (జిక్కి) పోటీపడి పాడిన ఈ పాట  చరణంలో మరో ప్రధాన ఆకర్షణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. జిలిబిలిగా పక్కపక్క గమకాలతో శ్రోతలను గిలిగింతలు పెట్టే ఎమ్.ఎస్.రాజు మేండలిన్రాజేంద్రన్ ఫ్లూట్ బిట్స్, గిటార్, పియోనా, డబుల్ బేస్ వ్యాపింగ్స్, డ్రమ్స్సింబల్స్ట్యూబోఫోన్, జలతరంగిణి, ఇతర రిథిమ్స్  చాలా చైతన్యవంతంగా, ఉత్సాహభరితంగా వినిపిస్తాయి. మొత్తంమీద ఈ పాటంతా ఎంతో మృదుమధురంగాలయ ప్రధానంగా వుంటూ శ్రోతలను రంజింపజేస్తుంది. ఎన్నిసార్లు విన్నా, నా వరకూ, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గమనప్రధాన నృత్యగీతం ఇది. అందుకే  అనేక సుమధుర ఘంటసాల గీతమాలికలలో ఈ గీతం కూడా సజీవరాగమై శ్రోతలను ఎల్లప్పుడూ అలరిస్తూనే వుంటుంది.

నిజం చెప్పాలంటే, 20వ ఎపిసోడ్ నన్ను కొంచెం ఇరకాటాన పెట్టిందనే చెప్పాలి. 20వ ఎపిసోడ్ సజీవరాగ గీత చిత్రంగా 'పెళ్ళిసందడి' సినిమా నిర్ణయమైపోయినా, ఈ చిత్రంలోని ఏడు పాటల్లో ఏ పాటను సజీవరాగంగా తీసుకోవాలో నిర్దిష్టంగా ఇప్పటికీ నిర్ణయించుకోలేకపోతున్నాను.  కారణం ఈ సినిమా లోని పాటలన్నీ సుస్వరాల సుమధురగీతాలే. సజీవరాగాలుగా కొనియాడదగ్గవే. 

ఇక్కడ మరో విశేషంఈ ఏడు పాటల్లో ఆరు పాటలు డ్యూయెట్లే, ట్రిప్లెట్లే (ఈ మాట సరైనదికాదనుకుంటాను). ఒకే ఒక సోలో పి. లీల పాడిన పాట. ఘంటసాలగారికి సోలోలు లేవు. రెండు పాటలు లీల, జిక్కిలతో, ఒకటి బాలసరస్వతీదేవితో  కలసి పాడారు. ఏడవ పాట కూడా డ్యూయెట్ పాటే - జె.వి.రాఘవులు, జిక్కి - చలం, బి.సరోజాదేవి కోసం పాడారు. ఈ సినిమాలో అధికసంఖ్యలో ఆరు పాటలను పి.లీల పాడారు. వీటిలో కె.రాణితో కలసి పాడిన పాట కూడా ఒకటి వుంది.

పూర్తి వినోదాత్మక చిత్రమైన పెళ్ళిసందడిలోని పాటలన్నింటికి కూడా ఘంటసాలగారు ఉత్సాహభరితంగా పదే పదే పాడుకునేలా వరసలు సమకూర్చారు. హీరో అక్కినేని, దర్శకుడు డి.యోగానంద్, ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన అతికొద్ది చిత్రాలలో అత్యంత విజయవంతమైన చిత్రం పెళ్ళిసందడి. డైరెక్టర్ యోగానంద్ ఎన్.టి.ఆర్.కు మంచి స్నేహితుడు. ఎన్.టి.ఆర్. సినిమా లెన్నింటినో యోగానంద్ డైరక్ట్ చేశారు.

ఎఎన్.ఆర్. హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అంజలీదేవి, చలం, బి.సరోజాదేవి, గుమ్మడి, రమణారెడ్డి, సి.ఎస్.ఆర్., రాజనాల, ఆర్.నాగేశ్వరరావు, సురభి బాలసరస్వతి, డా.శివరామకృష్ణయ్య నటించారు.

కథ, మాటలు, పాటలు సముద్రాల రామానుజాచార్యులు సమకూర్చారు. రిపబ్లిక్ ప్రొడక్షన్ బ్యానర్ మీద బి.ఎ.సీతారాం నిర్మించిన తొలిచిత్రం 'పెళ్ళిసందడి'. పరిశ్రమలో సీతారాం  నిర్మాతగా నిలదొక్కుకోవడానికి పెళ్ళిసందడి అన్నివిధాలా సహకరించింది.

 

వచ్చే వారం, మరల, ఘంటసాలవారి మరో సజీవరాగం తో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్


Saturday, 13 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 19 - రావే ముద్దుల రాధా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 19

పెళ్లినాటి ప్రమాణాలు - రావే ముద్దుల రాధా

ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయితో పరిచయం పెంచుకుని సరాసరి ఒంటరిగా వున్న ఆమె ఇంటికే వెళతాడు ఓ అభినవ కృష్ణుడు. వెళ్ళినవాడు ఊరికేవుండక అక్కడ గోడకున్న రాధాకృష్ణుల చిత్రాన్ని చూస్తూ పరవశంతో పగటికల కంటూ ఆ అమ్మాయితో ఓ చక్కటి ప్రణయగీతాన్ని మొదలెడతాడు...

కృష్ణుడు: రావే ముద్దుల రాధా నా ప్రేమరాశి నీవెగా 

నవ రత్నాల రాశివి నీవెగా! రావే!

రాధ:

పోవయ్యా శ్రీ కృష్ణా! నీ సరసాలన్నీ మాయలే 

నువు దూరాన ఉంటే మేలులే ! పోవయ్యా!

 

కృష్ణుడు:

వనితలెవ్వరు నీ సాటిరారే

నిన్నె నిరతము నే కోరినానే! వనిత!

కోపమేలా దయగను బాలా

తాపమింకా నే తాళజాల !రావే!

రాధ:

మనసు నిలకడ సుంతైన లేదా

తరుణి తరుణితో ఈ ఆటలేనా 

                                            !మనసు!

చాలు చాలును ఈ మాటలేలా

నీటిమూటలు నే నమ్మజాల

                                            !రావే ! ! పోవయ్యా

పెళ్ళికాని నవయవ్వనంలో వున్న యువతీయువకుల మధ్య ఇలాటి ప్రేమసల్లాపాలు, కీచులాటలు ఈరోజుల్లో సహజమని సర్దిపెట్టుకున్నా,  సౌందర్యవతియైన ఓ భార్య మొగుడు, ఓ ముగ్గురి పిల్లల తండ్రి ఈ విధమైన ప్రేమాలాపాలు వల్లిస్తూ  తనచుట్టూ తిరగడం,  అతని ఆఫీసులో పనిచేస్తున్న ఆ యువతికి ఇబ్బందికరంగా మారింది. అతనిని అల్లరిపెట్టి పదిమందిలో నిలబెట్టి బుధ్ధిచెప్పడానికి అతడు దుష్టుడో దుర్మార్గుడో కాదు. మనిషి మంచివాడు,  భార్యాబిడ్డలంటే చాలా మమకారం కలవాడు. కానీ అందమైన ఆడపిల్ల విషయంలో చపలత్వం అతని బలహీనత.  అప్పటికీ అతని అంతరాత్మ,  అతనికి నవీనపంథాలో వివాహం జరిపించిన సంఘసంస్కర్త  రూపంలో  అప్పుడప్పుడు ప్రత్యక్షమౌతూ పెళ్ళిరోజున ఆ నవదంపతులు చేసుకున్న ప్రమాణాలను గుర్తుచేసి అతని తప్పిదాన్ని హెచ్చరిస్తూనేవుంటుంది. అయితే కుక్కతోక వంకర సాఫు చేయబడుతుందా!

సుదీర్ఘంగా రోజులతరబడి సాగే సంప్రదాయ హిందూ వివాహాల తంతులో పురోహితులుకాని, పెళ్ళిపెద్దలుకానీ చేయించే ప్రమాణం ఏమిటి? దాని అంతరార్ధం ఏమిటి? ...

"ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి" ... దీనికి అర్ధం ఏమిటంటే... నీతినియమాలు పాటిస్తూ ధర్మపథంలో నడుచుకునే ప్రతీ విషయంలో, జీవనోపాధి కోసం సంపదను సన్మార్గంలో చేకూర్చుకునే విషయంలో, సంసారజీవితంలో సుఖసంతోషాలను కోరికలను తీర్చుకునే విషయంలో నీ అభిమతానికి విరుధ్ధంగా నడుచుకోను, ఎల్లప్పుడూ నీకు తోడు నీడగా వుంటానని అర్ధం.

(నిజ జీవితంలో   ఎంతమంది దంపతులు ఈ ప్రమాణానికి బధ్ధులై వ్యవహరిస్తున్నారో  అంతరాత్మ సాక్షిగా ఎవరికివారే ఆలోచించుకోవలసిన విషయం).

సంసారజీవితంలో భార్యాభర్తలకు ప్రేమగండం ఏర్పడుతుంది. భార్యకు పరపురుషుడి వలన, భర్తకు పరాయి స్త్రీ వలన ఈ ప్రేమగండం కలుగుతుంది. ఆ గండం నుండి బయటపడడానికి ఆ భార్యాభర్తలు తమ పెళ్ళిరోజున  కలసి వేసిన ఏడడుగులను, మంత్రాలసాక్షిగాపురోహితులు, బంధుమిత్రుల సమక్షంలో చేసుకున్న ప్రమాణాలను, వేసిన మూడు ముళ్ళ మంగళసూత్రాన్ని నిత్యమూ గుర్తుచేసుకోవాలి. తాము ఆ పని చేయకపోయినా తమ మనస్సాక్షి అనునిత్యమూ గుర్తుచేసి  వేధిస్తూనేవుంటుంది. ఆ మనస్సాక్షికి విరుధ్ధంగా తప్పిదాలు చేస్తే ఆ దంపతుల జీవితం సర్వనాశనం అవుతుందని అందువల్ల శీలం విషయంలో భార్యాభర్తలిద్దరూ నీతినియమాలు పాటించాలని పెళ్ళి ప్రమాణాలు చేయించిన పెద్దమనిషి హెచ్ఛరిస్తాడు. తనకు అటువంటి సమస్యే రాదని, తాను చాలా మనోనిగ్రహం కలవాడినని తనను ఏ ప్రేమగండమూ పీడించదని పదిమందిలో డంబాలు పలుకుతాడు మన హీరో.

"మొన్నటికన్నా నిన్నవింతగా

నిన్నటికన్నా నేడు వింతగా నీ సొగసు

నీ వగలు హాయి హాయిగా వెలసేనే...." అని  

"తనువు నాదిగా, మనసు నీదిగా... 

రేయి పగలుగా, పగలే రేయిగా 

నీతోనే లోకమూ నీతోనే స్వర్గమూ" 

అంటూ ప్రణయగీతాలు ఆలపించిన ఆ కథానాయకుడు ముగ్గురి బిడ్డల తండ్రి అయ్యాక తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో స్నేహం మొదలెట్టి పెళ్ళినాడు చేసిన ప్రమాణాలకు ద్రోహం చేస్తాడు. తమ స్నేహం లోకాతీతమని, అతి పవిత్రమని, సామాన్యులకు అర్థంకాని బంధమని అందుచేత పరపురుషులతో స్నేహం చేయవద్దని తనక్రింద పనిచేసే ఆ అమ్మాయికి హితోపదేశం చేస్తాడు. ఆ యువతి మాత్రం చాలా మంచిది. ఏ చెడు ఉధ్దేశాలు లేనిది. సంస్కారంగలది. అందుకే అతను ఆమెతో కలసి కనే పగటికలలో ఆమె...

" ఏదో తెలియక పిలచితినోయీ...

వాదుకు రాకోయీ...

అని

"మనసు నిలకడ సుంతైన లేదా...

తరుణి తరుణితో ఈ ఆటలేనా

చాలు చాలును ఈ మాటలేలా...."

అంటూ అతని ప్రేమకలాపాలను సున్నితంగా తిరస్కరిస్తూంటుంది. మంచి తెలివితేటలు, సంస్కారము, వివేకము, విచక్షణా గల ఆ అభ్యుదయ యువతి అతనిని సన్మార్గంలో పెట్టి అతని భార్యాపిల్లలకు సహాయపడడానికి నిశ్చయించుకుంటుంది. ఇదే  స్థూలంగా నేటి మన ఘంటసాల సజీవరాగానికి, ఈ పాట గల 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమాకు గల నేపథ్యం.

సినిమా డైరెక్టర్ హోదాలో సెట్ మీదకు వచ్చాక సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ ఆలోచించడం, సిగరెట్ పెట్టెల అట్టల వెనకాల ఆ సీన్ కు కావలసిన డైలాగ్ లు వ్రాయడం, డైలాగులు చెప్పడం చేతకాని నటీనటులచేత ఎబిసిడిలు 26 వల్లింపజేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ లచేత మాట్లాడించి వాయిస్ మిక్స్ చేయడం వంటి పధ్ధతులకు బధ్ధ విరోధి ఆయన. సినీమా  షూటింగ్ మొదలెట్టడానికి మూడు మాసాల ముందే పూర్తి సినీమాకు కావలసిన స్క్రిప్ట్, సీన్ డివిజన్, కెమెరా ఏంగిల్స్, షాట్ డివిజన్ మొదలైనవాటినన్నింటినీ స్వహస్తాలతో ఒక పెద్ద పుస్తకంలో రాసుకుని దానిని తు.చ. తప్పకుండా తెరకెక్కించడం ఆయన సంప్రదాయం. షూటింగ్ సమయంలో అంతకన్నా మంచి ఆలోచనలు మనసులో మెదలినా వాటిని తన తర్వాతి సినీమాలో ఉపయోగించవలసిందే తప్ప ఈ సినిమా స్క్రిప్ట్ ను మార్చడానికి ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అలాగే ఆ సినిమా కోసం కేటాయించబడిన ముడి ఫిల్మ్ కోటాలో,  అనుకున్న బడ్జెట్ లోపలే సినీమాను ముగించడంలో అఖండుడు ఆయన. సినీ నిర్మాణానికి బ్రహ్మర్షి, మార్గదర్శి.

ఆయనే కదిరి వెంకటరెడ్డి. కళ, వ్యాపారం రెంటిని సమాన పాళ్ళలో అనుసరిస్తూ సినీమాలు తీసిన అత్యుత్తమ దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన అడుగుజాడలలోనే నడిచి దర్శక నిర్మాత గా ఎనలేని ఖ్యాతి నార్జించిన నటుడు ఎన్.టి.రామారావు. ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు తన మొదటి  సాంఘిక చిత్రానికి కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని కాచుకుని కూర్చొని కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో 'దొంగరాముడు' సినీమా ను తీశారు అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదనరావుగారు.

భక్తి, జానపదపౌరాణిక చిత్రదర్శకత్వంలో అసమాన్యుడైన కె.వి.రెడ్డిగారు నిర్మాతగా తన జయంతీ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన తొలి సాంఘిక చిత్రం 'పెళ్ళినాటి ప్రమాణాలు'  తన 30 ఏళ్ళ సినిమా జీవితంలో కె.వి.రెడ్డిగారు మూడే మూడు సాంఘిక సినిమాలకు దర్శకత్వం వహించారు. అవి వాహినీవారి 'పెద్ద మనుషులు',  అన్నపూర్ణా పిక్చర్స్ 'దొంగరాముడు', జయంతీ పిక్చర్స్ 'పెళ్ళినాటి ప్రమాణాలు'. మూడూ మూడు ఆణిముత్యాలు. ఈ మూడు సినీమాలు ఘనమైన ఆర్ధిక విజయం సాధించడమే కాక ఉత్తమ చిత్రాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం బహుమతులు  పొందాయి.

తొలిసారిగా కె.వి.రెడ్డిగారు నిర్మాతగా, దర్శకుడిగా  తెలుగు ప్రేక్షకులకు సమర్పించిన చిత్ర కళాఖండం 'పెళ్ళినాటి ప్రమాణాలు'. పెళ్ళైన మగవారి చపలత్వం, పరస్త్రీ వ్యామోహం కథాంశంగా గల సినీమా. కథాంశం తీవ్రమైనదీ, గంభీరమైనదీ అయినా  ఏడ్పులు పెడబొబ్బలు, శోకగీతాలతో ప్రేక్షకులను విసిగించకుండా ఆద్యంతం వినోదాన్ని పుష్కలంగా పంచి సినిమాను హాస్యరసాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ద్వారా సమాజానికి తాను ఇవ్వదల్చిన సందేశాన్ని అతి సున్నితంగా అందించారు కె.వి. రెడ్డి. తనకు అత్యంత సన్నిహితులైన పింగళి నాగేంద్రరావుగారి మాటలు పాటలు, ఘంటసాల వేంకటేశ్వరరావుగారి సంగీతం ఈ సినిమా ఉన్నత ప్రమాణాలకు ఎంతో దోహదం చేశాయి. పింగళి వారి మాటల్లోని, పాటల్లోని సున్నితమైన హాస్యం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

కథా వస్తువుకు అనుగుణంగా తన సంగీతాన్ని కూడా వినోదభరితంగా జనరంజకంగా సమకూర్చారు ఘంటసాల. పెళ్ళినాటి ప్రమాణాలు సినీమా లో మొత్తం 11 పాటలు పద్యాలు వున్నాయి. అందులో ఓ రెండు పాటలు తప్ప మిగిలినవన్నీ హాస్యశృంగారరస ప్రధానమే. ఆ మూడ్ ను చిత్రం ఆద్యంతం అద్భుతంగా  కొనసాగించారు ఘంటసాల. హీరో  ఎ.ఎన్.ఆర్. పాటలను ఘంటసాల, హీరోయిన్ జమున పాటలను పి.లీల, సెకెండ్ హీరోయిన్ రాజసులోచన పాటలను పి.సుశీల ఎంతో ఉత్సాహభరితంగా ఆలపించారు. మిగిలినవాటిని జిక్కి, సురభి కమలాబాయి, మాధవపెద్ది పాడారు. ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో   అన్ని పాటలు బహుళ జనాదరణ పొందిన సినిమాల లిస్ట్ లోనికి పెళ్ళినాటి ప్రమాణాలు పాటలు కూడా నిస్సందేహంగా చోటుచేసుకుంటాయి. అందుకు ఘంటసాలవారి సంగీతప్రతిభ కొంత కారణమైతే దర్శకుడు కె.వి.రెడ్డిగారి సంగీతాభిరుచి మరికొంత కారణం.

ఈనాటి మన సజీవరాగం - 'రావే ముద్దుల రాధా నా ప్రేమరాశివి నీవెగా నవరత్నాల రాశివి నీవెగా...ఘంటసాల, పి.సుశీల ఆలపించిన ఈ యుగళగీతాన్ని తెరమీద అక్కినేని, రాజసులోచన రాధాకృష్ణుల పాత్రలలో ఎంతో ఉత్సాహంగా అభినయించి ప్రేక్షకులను సమ్మోహనపర్చారు.

ఈ పాటను స్వరపర్చడానికి ఘంటసాల మాస్టారు హిందుస్థానీ రాగమైన పీలును  ఉపయోగించుకున్నారు. పీలు రాగం  హిందుస్థానీ కాఫి థాట్ కు చెందిన రాగం. వక్రసంచారంతో 12 స్వరాలు పలికే సంపూర్ణరాగం. తుమ్రీ, భజన్స్ వంటి లలిత-శాస్త్రీయ గీతాలు, భక్తిశృంగార రస గీతాలాపనకు అనువైన రాగం పీలు. కానీ, ఘంటసాలగారివంటి ఉద్దండ సంగీతదర్శకులు పీలు రాగాన్ని విషాదగీతాలకు కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. అందుకు ఉదాహరణ 'పుణ్యవతి' లోని 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు ' పాట. హిందుస్థానీ సంగీతంలోని కిర్వాని, గార వంటి రాగాలు ఈ పీలును పోలివుంటాయి. కర్ణాటక సంగీతంలో పీలుకు సమాంతరమైన రాగం కాపి. ఈ పీలు రాగంలో బహుళ జనాదరణ పొందిన  పాటలెన్నో తెలుగు, హిందీ సినిమాలలో వున్నాయి. పీలురాగ లక్షణాలన్నింటిని సక్రమంగా కనపరుస్తూ ఘంటసాల, సుశీల 'రావే ముద్దుల రాధా...' యుగళగీతాన్ని అత్యంత మధురంగా ఆలపించారు.

ఈ పాటలో వినిపించే తబలా జతులు,  గజ్జెల సవ్వడులతో,  వీణ, సితార్, షెహనాయ్, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్ ల సముదాయంతో చేసిన నేపథ్యసంగీతంతో  పీలు రాగభావాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తూ శ్రోతలకు రసానందాన్ని కలిగించారు ఘంటసాల.

పెళ్ళినాటి ప్రమాణాలులో ఈ యుగళం మాత్రమే కాదు, అన్ని పాటలు శ్రవణానందాన్ని కలిగించేవే శ్రోతలలో రసహృదయం వున్నంతవరకూ, లాలిత్యంతో కూడిన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నంతవరకూ ఘంటసాల గీతాలు సజీవరాగాలే.


వచ్చేవారం, మరల, మదిలో మెదిలే మరో సజీవరాగంతో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 6 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 18 - మారుపల్కవదేమిరా నాతో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 18


సతీ అనసూయ - మారుపల్కవదేమిరా నాతో

 

సనాతన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారకులు. సృష్టికర్తయైన బ్రహ్మదేవుని మానసపుత్రులు దక్షప్రజాపతి, కశ్యపప్రజాపతి. అంటే సంకల్పమాత్రంచేత బ్రహ్మ మనస్సునుండి ఉద్భవించినవారు. బ్రహ్మదేవుడు చేసే సృష్టికార్యాన్ని అన్నిలోకాలలో విస్తరింపజేయడానికి, సకల జీవరాశులను సృష్టించడానికి బ్రహ్మకు సహాయకులుగా నియమింపబడినవారు. దక్షప్రజాపతికి అనేకమంది కుమార్తెలు. వారిలో చాలామందిని కశ్యపప్రజాపతి వివాహమాడాడు. వారిలో అదితి, దితి, వినత, కద్రువ, దను, గగనమండలంలో ప్రకాశించే  అశ్విని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రకాంతలు కశ్యపుని భార్యలే. అదితి, దితిలు మంచి చెడులకు, ద్వందప్రవృత్తులకు ప్రతీకలు. అదితి సంతానమైన  దేవతలు, దితి సంతానమైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు  రాక్షసులుగా వృధ్ధిచెంది ఎల్లవేళలా పరస్పరం కలహించుకుంటూండేవారు.

అదితి కశ్యపులకు 12 మంది సంతానం.  సూర్యుని రూపాలైన వీరిని ద్వాదశాదిత్యులని అంటారు. వీరు సంవత్సరంలోని 12 నెలలకు అధిపతులు. ఇంద్రుడు, మిత్రుడు, ధాత, వరుణుడు, విష్ణువు (వామనావతారం) మొదలగువారు.

అష్టైశ్వర్యాలకు, భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు నిలయం స్వర్గం. అటువంటి స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు.ఈయన భార్య శచీదేవి. ఐరావతం, ఉఛ్ఛైశ్రవం, వజ్రాయుధం వంటి అమూల్య విశేషాలకు స్వంతదారుడు. దేవేంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, మఘవుడు, సహస్రాక్షుడు అనే నామాలు గలవాడు. దేవతల రాజైన ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృధ్ధిగా పండడానికి ఇంద్రుడే కారకుడవడం చేత ముల్లోకాలు ఇంద్రుని పూజించేవి. యజ్ఞయాగాది క్రతువులు జరిపే సమయంలో హవిస్సులను ఇంద్రునికి సమర్పించి తృప్తి పరిచేవారు.

ఇక్కడ మరొక విషయం చెప్పవలసి వున్నది. స్వర్గలోక ఇంద్ర పదవి శాశ్వతం కాదు.  ఇంద్రపదవి ప్రతి మన్వంతరానికి మారుతూంటుంది.  మన్వంతరం అంటే 30+ కోట్ల మానవ సంవత్సరాలు. మొత్తం 14 మన్వంతరాలలో ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో వున్నాము. దీనికి వైవస్వత మన్వంతరం అని పేరు. ఇప్పుడు ఇంద్ర పదవిలో వున్నవాడు పురందరుడు. 8వ మన్వంతరమైన సావర్ణిలో బలి చక్రవర్తి ఇంద్రపదవిని చేపడతాడు.  సత్యవాక్కుతో  నీతి నియమాలు పాటిస్తూ ధర్మపథాన ప్రజలను కాపాడేవారికి, లోక సంక్షేమం కోసం నిరాటంకంగా నూరు యజ్ఞయాగాదులు నిర్వర్తించినవారికి   ఇంద్రపదవి లభిస్తుందని పురాణాలు చెపుతాయి.

భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు నిలయమైన స్వర్గలోకవాసం అందరికీ అందుబాటులో వుండదు. మానవులు తాము చేసిన పుణ్యకార్యాలననుసరించి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు. సజీవంగా బొందితో స్వర్గలోకంలో ప్రవేశించడమనేది భూలోకవాసులకు అసాధ్యం.

అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహాపతివ్రత అనసూయాదేవి. అత్రి మహర్షి భార్య. గొప్ప తపస్సంపన్నురాలు. జాతకంలోని దోషకారణంగా వైవాహిక జీవితానికి, సుఖసంతోషాలకు దూరమైన నర్మద అనే అభాగ్యురాలి కోరికను తీరుస్తూ అనసూయాదేవి తన తపోబలంతో నర్మదను సజీవంగా స్వర్గలోకానికి పంపిస్తుంది. ఆ సమయంలో నిరంతర సుఖభోగియైన దేవేంద్రుని అపురూప సౌందర్యవతియైన రంభ ...


మారుపల్కవదేమిరా నాతో -2

సుకుమారి ఒయ్యారి నిన్నే కోరి చేరా

                                                !మారు!

ఔరా! ఈ బిగువేల ఇది నీకు మేలా

ఆరడి సేయగనేలరా తగునటరా

                                                !మారు!

చక్కెరవిలుకాని ఉక్కున మెయిచిక్కి  

చిక్కిసగమాయె సొక్కిపోయెరా

చెక్కు చెక్కున చేర్చి చక్కెర మోమీర చుక్కరా! 

అందాలు చిందు పూరెక్కరా సొంపెక్కు వలపు 

కైపెక్కి మ్రొక్కె ముదమొలయ 

చెక్కునొక్కి మదికరుగ నిక్కపు  మక్కువ

మీరగ చేర్చవు అక్కున సరిగదా ప్రియమునను

                                                !మారు!

అంటూ శృంగార భాషణలతో, నృత్యగానాలతో తన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూంటుంది. అటువంటి రసపట్టువేళ, సమయంకాని సమయంలో ఒక సాధారణ మానవకాంతయైన నర్మద సజీవంగా స్వర్గప్రవేశం చేయడంతో ఇంద్రసభే దద్దరిల్లింది. కారణం తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహం చెంది  దేవలోకాన్నే నర్మదకు కనపడకుండా అదృశ్యపరుస్తాడు.  అక్కడనుండి అదంతా మరొక గాధ. ప్రస్తుతం మనకు అనవసరం.

సతీ అనసూయ సినిమాలో ఇంద్రుని మైమరపిస్తూ  రంభ గానం చేసిన శృంగారపద జావళీయే నేటి మన సజీవరాగం. ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు మరో మచ్చుతునక. సంగీత సాహిత్యాలు రెంటికి సమాన స్థాయి కల్పించిన ఈ గీతం జూనియర్ సముద్రాలగారి సాహితీప్రకర్షకు, ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి.

సినిమాలలో అరుదుగా వినపడే ... 'ఆరడి సేయుట'(హింసపెట్టుట)'చక్కెరవిలుకాడు' (చెఱకుగడని విల్లుగా ధరించేవాడు - మన్మథుడు)'ఉక్కున' (ప్రతాపం, శౌర్యం), 'మెయి' ( శరీరం), 'సొక్కి' (పరవశం), 'పూరెక్క'( సుకుమారమైన పుష్పరేక)'సొంపెక్కు'(అతిశయించిన) వంటి పదాలను ఉపయోగించి ప్రాచీన కవుల శృంగార పదరచనలను గుర్తు చేశారు చినసముద్రాలగారు.

సాహిత్యానికి దీటైన రీతిలో మెట్టుకట్టారు ఘంటసాలగారు. అందుకుగాను వారు ఎన్నుకున్న రాగం 'శ్రీరంజని'. 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యరాగం శ్రీరంజని. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఆరు స్వరాలు మాత్రమే వుండడంచేత ఇది షాఢవ-షాఢవ రాగంగా పరిగణిస్తారు. సప్తస్వరాలలోని ''(పంచమం) స్వరం శ్రీరంజనిలో వర్జ్యం. వదిలివేయబడింది. శృంగార, కరుణ, భక్తి రసాలను పలికించడానికి చాలా అనువైన రాగం శ్రీరంజని. హిందుస్థానీ బాణిలో కూడా కొంచెం భిన్నమైన రీతిలో  కాపి థాట్ లో శ్రీరంజని రాగాన్ని విద్వాంసులు ఆలపిస్తారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 'బ్రోచేవారెవరే, 'సొగసుగా మృదంగ తాళము',  'మారుబల్కకున్నావేమిరావంటి కీర్తనలు శ్రీరంజని రాగంలోనే కూర్చబడ్డాయి.  

శాస్త్రీయ సంగీతపు నుడికారం గల 'మారుపల్కవదేమిరా నాతో...అనే ఈ గీతాన్ని సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విదూషి శ్రీమతి ఎమ్.ఎల్.వసంతకుమారి చేత పాడించి ఎంతో ఔచిత్యాన్ని పాటించారు సంగీతదర్శకుడు ఘంటసాల. శాస్త్రీయగీతానికి కావలసిన సంగతులు, గమకాలు పుష్కలంగా గుప్పించిన   ఈ గీతాన్ని  వసంతకుమారి  అసమాన్యంగా ఆలపించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. 


ఈ పాటలో సంప్రదాయ నృత్య గీతాలకు ఉపయోగించే వాద్యాలనే తీసుకున్నారు ఘంటసాలగారు.  వీణ, వయొలిన్స్, ఫ్లూట్, మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్, గజ్జెలు వంటి వాద్యాలు ఈ పాటలో ప్రధానంగా వినిపిస్తాయి.

ఇక తెరపై ఈ జావళీకి అభినయం పట్టిన నర్తకి సామాన్యురాలు కాదు. తిరువాన్కూర్ సోదరీమణులుగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భరతనాట్య కళాకారిణులు - లలిత, పద్మిని, రాగిణిలలోని రాగిణి ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి కృష్ణమూర్తి గారి నృత్య నిర్దేశకత్వంలో   రంభగా ఇంద్రసభలో ఈ పాటకు నృత్యం చేసి సన్నివేశాన్ని రక్తికట్టించారు. స్వర్గలోకాధిపతి, అష్టదిక్పాలకులలో ప్రముఖుడు, సకల మునిగణాల పూజలను అందుకునే ఇంద్రుడు మన సినీమాలలో దుష్టుడిగా, రాక్షసప్రవృత్తి కలవాడిగా కనిపించడం వింతగా అనిపిస్తుంది. ఇది సినిమా వారి కల్పనా? లేక, పురాణాలలో కూడా ఇంద్రుడు అలాగే వుండేవాడా! ఏమో మరి తెలీదు.

దేవేంద్రుడి పాత్రను మన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు బాగానే పాట్రనైజ్ చేసి శాశ్వతం చేశారు. సినిమాలలో దేవేంద్రుడు అనగానే మన కళ్ళముందు నిలబడేది రాజనాల, మిక్కిలినేని, ఆర్.నాగేశ్వరరావు, ఎ.. సుబ్బారావు సీనియర్ & జూనియర్ లు మాత్రమే. వీరు ఇంద్రుడి పాత్రకు పేటెంట్ హక్కుదార్లుగా ప్రేక్షక హృదయాలలో నిల్చిపోయారు. 'సతీ అనసూయ' సినిమాలో ఇంద్రుడిగా రాజనాల తన సహజ ధోరణిలో నటించి మెప్పించారు.

'సతీ అనసూయ'లో  గీతగోవిందంలోని అష్టపది, నారదపురాణంలోని రెండు శ్లోకాలతో కలిపి మొత్తం 22 పాటలు పద్యాలు వుండగా వాటిలో అత్యధిక గీతాలను సముద్రాల జూనియర్, ఒకటి రెండు పాటలను  కొసరాజు వ్రాసారు. ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో ఆ పాటలను ఆయనతోపాటు పి.లీల, పి.సుశీల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది , కె.రాణి మొదలగువారు పాడారు.

ఈ సినిమా లోని కొన్ని పాటల రికార్డింగ్ కు, రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళేను. 1950 దశకంలో విడుదలైన 'నాగిన్' హిందీ సినిమాలోని నాగస్వరం పాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దశాబ్దాలపాటు మార్మోగింది. ఆ పాట మ్యూజిక్  ప్రభావం అన్ని భాషా చిత్రాలమీదా పడింది. ఆ పాట వరసతో మరెన్నో పాటలు వచ్చాయి. ఆ పాట కోసం సంగీతదర్శకుడు హేమంతకుమార్ నాగస్వరంలాగే వినపడే క్లేవైలిన్ అనే ఎలక్ట్రానిక్ వాద్యాన్ని ఉపయోగించారు. తదాదిగా ఏ సినిమాలో ఎక్కడ నాగుపాము కనిపించినా ఈ క్లేవైలిన్ వాద్యం తప్పనిసరి అయింది. ఆనాటికి అపురూపమైన క్లేవైలిన్ ను ఘంటసాలగారు కూడా  'సతీ అనసూయ' లో ' ఓ ... నాగదేవతా...' పాటలో, తర్వాత ఆ నాగుపాము కనపించే సన్నివేశాలలో  తన సొంత బాణీలో ఉపయోగించారు. ఈ క్లేవైలిన్ వాద్యమే తర్వాతి కాలంలో మరికొన్ని అదనపు వాద్య శబ్దాలతో యూనివాక్స్ గా రూపాంతరం చెందింది. 'సతీ అనసూయ' సినిమా లో ఈ క్లేవైలిన్ వాద్యాన్ని ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో పనిచేసే హనుమంతాచారి అనే ఆయన వాయించారు. హిందుస్థానీ సంగీతంలో ప్రవేశమున్న హనుమంతాచారిగారు మంచి గాయకుడు, నటుడు కూడా. అనేక కన్నడం సినిమాలలో హాస్యనటుడిగా నటించారు. ప్రేమనగర్ సినిమాలో కూడా ఏరోప్రేన్ సీన్ లో ANR తో కనిపిస్తారు. AVM వారి 'రాము' తెలుగుతమిళ సినీమాలలో బాలనటుడిగా గర్తింపు పొంది, నేషనల్ అవార్డ్ పొందిన రాజ్ కుమార్ ఈయన కుమారుడే. ఘంటసాలగారితో ఎంతో సన్నిహితంగా వుంటూ ఎన్నో సినీమాలలో పనిచేసిన హనుమంతాచారి 1981 లో  జరిగిన తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆక్సిడెంట్ లో దుర్మరణం చెందారు.

సతీ అనసూయ సినిమా సంగీతపరంగా ఘంటసాలగారికి మంచి పేరును తెచ్చిపెట్టడమేకాక ఆర్ధికంగా కూడా గొప్ప విజయం సాధించింది. రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత సుందర్ లాల్ నహతా తన రెండవ చిత్రమైన 'సతీ అనసూయ' దర్శకత్వ బాధ్యతలను పౌరాణిక చిత్ర నిర్మాణంలో అనుభవజ్ఞుడైన  దర్శక నిర్మాత కడారు నాగభూషణం కు అప్పగించారు. సతీ అనసూయ టైటిల్ రోల్ లో అంజలీ దేవిఆమె భర్త అత్రి మహర్షి గా  గుమ్మడి నటించారు. ఇతర ముఖ్యపాత్రలలో జమున, ఆమె కురూపి భర్తగా కె.వి.ఎస్.శర్మఅమర్నాథ్, కాంతారావు, రేలంగి, ముక్కామల, పద్మనాభం, రాజనాల, సూర్యకళ నటించారు.




కొసమెరుపు -

ఇటీవలి కాలంలో 'సతీ అనసూయసినిమా వాల్ పోస్టర్లలో  అందాల రాకుమారుడిగా ఎన్.టి.రామారావు బొమ్మ  ప్రముఖంగా కనిపిస్తూ ఎన్.టి.ఆర్ అభిమానులకు  కన్నులవిందు చేస్తూంటుంది. అయితే ఆయన ఆ సినిమాలో ఎక్కడా కనపడరు. ఆ రోజుల్లో సినిమా ఆఖరున వేసే జాతీయగీతానికి మర్యాదపూర్వకంగా ఓ రెండునిముషాలు కూడా వేచివుండే ఓపికలేకుండా  థియేటర్లలోనుండి బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ ఆ సినిమాలో అసలు కనపడివుండరు. సతీ అనసూయ పాతివ్రత్య ప్రభావంతో నర్మద కురూపి భర్త (కె.వి.ఎస్.శర్మ) పునర్జీవుడై  లేచినప్పుడు సుందరాంగుడైన ఓ రాకుమారుడిగా ఎన్.టి.ఆర్  రెండు నిముషాలపాటు  దర్శనమిస్తారు. నామకార్ధం రెండు మూడు డైలాగ్స్, నో సాంగ్స్, ఓన్లీ జెస్చర్స్. సినిమాలో కనిపించే త్రిమూర్తులకు, అత్రిఅనసూయలకుసినిమా చూస్తున్న ప్రేక్షకులకు జమున ప్రక్కన నిల్చుని నమస్కారాలు చేయడంతో  సరి.   సినిమా టైటిల్స్ లో వేసినట్లుగా ఎన్.టి.ఆర్ ది  ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఓన్లీ. అదే ఎన్.టి.ఆర్  ఆ సినిమా ప్రొడ్యూసర్ సుందర్లాల్  నహతా తీసిన మొదటి సినిమా  'జయంమనదే' లో ఫుల్ లెన్గ్త్ డాషింగ్ ఎండ్ డైనమిక్ హీరో.  ఆనాటి నటీనటులు, నిర్మాతల మధ్యనుండే స్నేహ సుహృద్భావాలకు ఇదొక చక్కని నిదర్శనం.


ఎన్.టి.ఆర్ గెస్ట్ అపియరెన్స్


వచ్చేవారం, మరో ఘంటసాల సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 20 - సమయమిది దాయరా సరసుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...