Saturday, 9 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 14 - మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 14


సొంతవూరు - మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం


" ... అందుచేత,  విద్యార్ధులారా ..., భావిభారత పౌరులారా ... నవసమాజ నిర్మాతల్లారా...  ఈ శుభదినాన నేను మీకు చెప్పొచ్చేదేమిటంటే, మనమంతా భారతీయులం, భరతనగర వాసులం. ప్రపంచంలో ఎవరికీ లేని ప్రత్యేకత మనకు వుంది... అదేమిటో తెలుసా! 'భిన్నత్వంలో ఏకత్వం'. ఈ దేశంలో వందలాది కోట్ల ప్రజలున్నారు. వీరందరిది ఒక భాషకాదు, ఒక మతం కాదు. ఇక్కడ వందలాది భాషలు, అంతకు రెట్టింపు జాతులుకులాలు, మనిషికో మతంతో విభిన్నమైన ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగివున్నారు. పరస్పర భేదాభిప్రాయాలతో అంతఃకలహాలతో మనశ్శాంతి లేకుండా మనుగడ సాగిస్తున్నారు. అయినా జాతీయ సమైక్యత అనే సూత్రానికి దేశవాసులంతా కట్టుబడి వున్నారు. భారతీయత అనే మూలసూత్రం ఈ దేశవాసులను ఒక్కటిగా చేస్తోంది. 

ఎన్నో శతాబ్దాల కాలం  ఈ దేశవాసులు విదేశీయుల పాలనలో బానిస బ్రతుకులు బ్రతికి అష్టకష్టాలు అనుభవించడానికి  వారిలోని అనైక్యతే ముఖ్యకారణం. తమ కష్టాలనుండి బయటపడడానికి, పరాయి పాలన నుండి విముక్తిని పొంది స్వాతంత్ర్యం సాధించుకోవడానికి జాతీయసమైక్యత, అహింసావాదమే తప్పనిసరియని భారత స్వాతంత్ర్య సమరయోధులంతా భావించారు. గాంధీ మహాత్ముడి నాయకత్వంలో నిస్స్వార్ధ ప్రజానాయకులంతా కలసికట్టుగా కృషిచేస్తూ   భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి శాంతి సమరం చేస్తున్నారు.  ఈ దేశంలో వున్న  రాచరికపు సంస్థాన సముదాయాలనన్నింటినీ ఏకం చేసి ఆసేతుహమాచలపర్యంతం స్వయంసమృధ్ధి అఖండభారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు.

అందుచేతవిజ్ఞులైన భావిభారత పౌరుల్లారా మేల్కొనండి. కుల, మత, భాష, ప్రాంత తత్త్వాలకు అతీతంగా కృషి చేసి అన్ని వర్గాల ప్రజలమధ్య  శాంతి సామరస్యాలను, సమైక్యతా భావాన్ని పెంపొందించండి. అఖండ భారతదేశ నిర్మాణానికి , పవిత్రమైన మన భారతీయతను పరిరక్షణకు మీచేయూతనివ్వండి. ఇదే మీ తక్షణ కర్తవ్యం. దేశమాత ఋణం తీర్చుకోవడానికి ఇదే మంచి తరుణం.

పదండి ముందుకు, కదంతొక్కుతూ ఉరకండి.  శాంతియుతంగా స్వాతంత్ర్యాన్ని సాధించండి. ...

'బోలో !భరత్ మాతాకీ జై! జైహింద్!  

ఇటువంటి ఉపన్యాసాలతో, ఉద్వేగభరిత నినాదాలతో 1942 క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరమై స్వదేశాభ్యుదయవాదులను, యువకులను స్వాతంత్ర్య పోరాటంలోనికి దూకేలా ఉత్తేజితులను చేసి చైతన్యవంతులను చేసింది. అటువంటివారిలో చౌటపల్లి యువరక్తం ఘంటసాల కూడా ఒకరు.

తాను నేర్చుకున్న సంగీతంతో దేశభక్తి గీతాలు పాడుతూ ప్రజోద్యమంలో కలిసిపోయారు. తత్ఫలితంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు ఘంటసాలను జైల్లో పెట్టారు. జైలుజీవితం మంచే చేసింది. గొప్పగొప్ప రాజకీయ నాయకుల సాంగత్యం ఏర్పడింది. తనలోని సంస్కారం, వ్యక్తిత్వం మరింత మెరుగులు దిద్దుకుంది. దేశంకోసం తన వంతు సేవ ఏదో రూపంలో చేయాలనే తపన పెరిగింది.

అదృష్టంకొద్ది సినీరంగంలోకి అడుగుపెట్టిన ఘంటసాల అచంచల కృషి ఫలితంగా అంచెలంచెలుగా  ఎదిగి లలితసంగీత ప్రపంచంలో అద్వితీయ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా శిఖరాగ్రాలకు చేరుకున్నారు. సమయం, సందర్భం సమకూరినప్పుడల్లా సమాజం కోసం, దేశం కోసం తన సంగీతాన్ని సద్వినియోగం చేశారు.

తనలోని ఉన్నతభావాలను లోకవిదితంచేసే దిశలో చిత్ర నిర్మాణం తలపెట్టారు ఘంటసాల. తత్ఫలితమే, 1956 లో వచ్చిన 'సొంతవూరు' సినిమా. దేశ పురోభివృద్ధికి పల్లెలు, పంటపొలాలే పట్టుకొమ్మలనే అనే అంశం ఆధారంగా తీసిన సినిమా, దేశాభ్యుదయానికి తోడ్పాటునిచ్చే మంచి మంచి సందేశాత్మక గీతాలెన్నో వున్న సినీమాలోని అలాంటి ఒక ప్రబోధగీతమే 'మన వూరే భారతదేశం, మనమంతా భారతీయులం!' ఇదే నేటి మన ఘంటసాల సజీవరాగం.


పల్లవి:

మన వూరే భారతదేశం

మనమంతా భారతీయులం -2

చరణం 1: 

పల్లెలన్ని పంటలతో నింపేస్తాం

పేదగుండె మంటలనే ఆర్పేస్తాం

కరువులేని , పరువుపోని పౌరులౌతాం

                                        !మన వూరే!

చరణం 2:  

గాంధితాత చెప్పినదే వేదమంటాం

పేద గొప్ప భేదములే లేవంటాం

ఒక్కతల్లి బిడ్డలుగా  జీవిస్తాం

తల్లివంటి దేశమునే ప్రేమిస్తాం!ఒక్క!

సత్యమెంచి ధర్మమెంచి పూజిస్తాం

                                        !మన వూరే!

 చరణం 3: 

మాటుపడ్డ శౌర్యమునే వెలికీతీస్తాం

పూడుకున్న ఛాందసమే తొలగిస్తాం

ద్వేషబుధ్ధి కాలపట్టి రాసేస్తాం

నవ్యలోక ధర్మములే పాటిస్తాం!ద్వేష!

భారతీయ శాంతిగీతి పాడుకుంటాం-3

వందేమాతరం వందేమాతరం వందేమాతరం

అభ్యుదయ కవి రావూరి సత్యనారాయణ గారు వ్రాసిన గీతం. స్వీయ సంగీతంలో ఘంటసాలగారు, గాయకబృందం కలసి ఆలపించిన ఉన్నత సందేశగీతం. ఒక్క మాటలో చెప్పాలంటే మన స్వతంత్ర భారతదేశ విదేశాంగ విధానానికి ఆధారంగా రూపుదిద్దుకున్న పంచశీల సిధ్ధాంతానికి ప్రతీక 'మన వూరే భారతదేశం' పాట.

'పల్లెలన్ని పంటలతో నింపేస్తాం పేదగుండె మంటలనే ఆర్పేస్తాం కరువులేని పరువుపోని పౌరులౌతాంఎంత గొప్ప భావన. ఎంత చక్కటి దూరదృష్టి. సమాజానికి ఇంతకన్నా మంచి సందేశం ఎవ్వరివ్వగలరు, మన శతాబ్దిగాయకుడు ఘంటసాల తప్ప. జయహో ఘంటసాల.

వెస్ట్రన్ బ్యాండ్ వాద్యాలతో మార్చింగ్ ట్యూన్ లా వినపడే ఈ బృందగానాన్ని ఘంటసాల మాస్టారు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రపంచంలో బహుళ ప్రచారం పొందిన 'లోనియన్ మోడ్' లో స్వరపర్చారు. లోనియన్ మోడ్ నే మేజర్ స్కెల్ అని కూడా అంటారు. దీనికి సమాంతరమైన కర్ణాటక రాగం అందరికీ బాగా తెలిసిన శంకరాభరణం, 29వ మేళకర్త. దీనినే ధీరశంకరాభరణం అని అంటారు. ఇతర రాగాలన్నింటికంటే ఎక్కువ గమకాలు గల  రాగంగా శంకరాభరణం ప్రసిధ్ధి చెందింది. 'మన వూరే భారతదేశం' పాటను ఘంటసాలగారు శంకరాభరణం స్వరాలతో స్వరపర్చారు. ఘంటసాలగారు ఈ ప్రబోధగీతాన్ని ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంతో పాడి శ్రోతలలో సరికొత్త చైతన్యాన్ని కలిగించారు. రిపబ్లిక్ పెరేడ్స్ లో సైనిక విన్యాసాలలో ఈ రకమైన ట్యూన్స్ వినిపిస్తాయి. ఈ పాటలో ఘంటసాల మాస్టరు ట్రంపెట్స్, ఫ్లూట్స్, డ్రమ్స్, సింబల్స్, వయొలిన్స్, క్లారినెట్ వంటి వాద్యాలను ఘనంగానే వినిపించారు. 

చెప్పుకుంటే 'సొంతవూరు' సినిమా కు చాలా విశేషాలే వున్నాయి.

ఘంటసాల మాస్టారంటే వున్న ప్రత్యేక గౌరవాభిమానాల కారణంగా తన పరిపూర్ణ సహాయ సహకారాలందించి  హీరోగా నటించిన ఎన్.టి.రామారావుకు జోడీగా ఈ చిత్రంలో  అంతవరకు చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చిన రాజసులోచనను పూర్తిస్థాయి కథానాయికగా ఎలివేట్ చేశారు.

ఈ సినిమాలోని మరో విశేషంఒక నృత్యగీత సన్నివేశంలో ఎన్.టి.ఆర్  శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపించడం. అంతేకాదు, మల్లాది వారు వ్రాసిన ఆ పాటకు ఘంటసాలగారు అంతకుముందే ప్రైవేట్ రికార్డుగా పాడిన కరుణశ్రీ గారి' చూచెదవేలనో ప్రణయసుందరి', 'అంజనరేఖ వాల్గనుల', 'క్రొంజిగురాకు వ్రేళుల' పద్యాలను  జోడించి కృష్ణుని వేషంలోని ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించారు. ఈ సినిమాకు ముందు'ఇద్దరు పెళ్ళాలు' అనే సినిమాలో కూడా ఎన్.టి.ఆర్  కృష్ణుడి వేషంలో కనిపించారు. ఈ రెండింటి తర్వాతే మాయాబజార్ లో , వినాయకచవితిలో ఎన్.టి.రామారావు శ్రీకృష్ణుడి పాత్రలు ధరించి పౌరాణిక పాత్రలకు తనకు మించిన ప్రత్యమ్నాయ నటుడు మరొకరు లేరనే ఖ్యాతిని ఆర్జించారు.

సొంతవూరు సినీమాలోని పదిపాటలురెండు సీస పద్యాలు అన్నీ కట్టాణిముత్యాలే. వీటిని రావూరి సత్యనారాయణ గారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, సముద్రాల రాఘవాచార్యగారు వ్రాయగా ఘంటసాల, జిక్కి, పి. లీల, జె.వి.రాఘవులు ఆలపించారు. ఏ పాటకు ఆపాటే వైవిధ్యం తో కూడిన పాటలుగా మలచారు ఘంటసాల.

'సొంతవూరు' సినిమా పాటలను ఏ రికార్డింగ్ కంపెనీ విడుదల చేసిందో గుర్తులేదుకానీ అవి మామూలుగా వచ్చే RPM78 నలుపు రికార్డులుగా కాక RPM45 లో  తెల్లటి రికార్డులుగా వచ్చాయి. అలాగే కొన్ని పాటలు  తెల్ల రంగు రికార్డులుగా వచ్చాయి. వాటిని వినైల్ రికార్డు లంటారని విన్నాను. Polyvinyl chloride - PVC బహుశా ప్రోమోలుగా రిలీజ్ చేసి వుంటారు.  అయితే నాకు ఈ విషయంలో సరైన అవగాహన లేదు.

ఎన్.టి.ఆర్, రాజసులోచన, షావుకారు జానకి, అమర్నాథ్, సి.ఎస్.ఆర్., చంద్రకుమారిరమణారెడ్డి, సూర్యకాంతం, హేమలత, సురభి కమలాబాయి, చదలవాడ, వంగర, మొదలగువారు నటించిన  ఈ సినిమాలో మాస్టారి సహాయకుడైన సంగీతరావుగారు కూడా ఒక చిన్నపాత్రలో సి.ఎస్.ఆర్. తో కలసి ఒక సన్నివేశంలో కనిపిస్తారు.

సుప్రసిద్ధ బహుభాషా చిత్ర ఛాయాగ్రహకుడైన ఎ.విన్సెంట్ ఈ సినిమా కు కెమెరామన్ గా పనిచేశారు. సొంతవూరు సినిమా కు డైరెక్టర్ ESN  మూర్తి. డైరెక్టర్ గా ఆయనకు ఇదే మొదటి, ఆఖరి సినిమా కూడానేమో!

జి.వి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ కు తన తమ్ముడు సదాశివుడిని నిర్మాతగా ఉన్నతస్థితికి తీసుకురావాలని అశించారు ఘంటసాల. అయితే వారి దురదృష్టం, ఈ రెండో సినిమా కూడా ఆర్ధికంగా పరాజయం పొందింది. ముచ్చటగా మూడవసారి అంటూ మరో మూడేళ్ళ తర్వాత మరో సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఆ విషయాలు మరో భాగంలో చూద్దాము.

సొంతవూరు వసూళ్ళ రూపేణా ఫెయిల్ అయినా ఘంటసాలవారి సంగీతం మాత్రం  సంగీతాభిమానులను  ఏమాత్రం నిరాశపర్చలేదు. ఆ సినిమా లోని... 'శ్రీగోపాలా రాధాలోలా..', 'మనవూరే భారతదేశం', 'మల్లె మొగ్గల్లారా', 'చెంగు చెంగునా ఎగిరే రాజాపాటలు, 'స్వాగతంబోయి ఈ స్వాతంత్ర్య సీమకు', 'రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాలమేడలో' అనే పద్యాలు ఈనాటికీ అడపాదడపా వినిపిస్తూనేవున్నాయి

 


కొసమెరుపు:

ఏనాడో ఒక 65 ఏళ్ళ క్రిందటి మాట. ఘంటసాలవారి సినిమా నిర్మాణ అవశేషాలుగా కొన్ని పనికిమాలిన వస్తువులన్నింటినీ వారింటి మేడమీది గది ఒకదాంట్లో డంప్ చేశారు. అది నాకు, విజయకుమార్ కు ఆటస్థలంగా వుండేది. అలాటి వాటిలో GVS PRODUCTIONS  emblem ఒకటి. సినిమా టైటిల్స్ కు ముందు ఒక తోరణం మధ్య   వేలాడదీసిన ఒక పెద్ద గంట, దానిక్రింద GVS PRODUCTIONS అనే అక్షరాలు కనిపిస్తాయి. ఆలయ గంటలా ఈ గంట కూడా ఖంగుమని  మూడు సార్లు మ్రోగుతుంది (అని జ్ఞాపకం. ఎప్పుడో 1956 లో స్టూడియోలో  ప్రివ్యూ చూడడమే). సినిమాలో లాగే ఈ గదిలో పడివున్న గంట కూడా మ్రోగుతుందని ఆడించి చూశాను. ఖంగుమని కంచులా మ్రోగడానికి బదులు 'డబ్ డబ్' అని చప్పుడు చేయడం నాకు పెద్ద  షాక్. తర్వాత తెలిసింది ఆ తోరణం , ఆ వేలాడే గంట ఏదీ లోహంతో చేసింది కాదు , అది పేపర్ మోల్డ్  ఆర్టిఫిషియల్  వస్తువని.  ఆ గంటానాదం సౌండ్ ఎఫెక్ట్స్. అంతా రీరికార్డింగ్ మహిమ.

ఆనాడే తెలిసిపోయింది సినిమా అంటే  ఒక మాయాప్రపంచం, అక్కడ అంతా కృత్రిమం, ఏదీ సహజంకాదని.

ఘంటసాలవారి మరో సజీవరాగం తో వచ్చేవారం మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

Saturday, 2 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 13 - చిలకన్న చిలకవే బంగారు చిలకవే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 13


జయం మనదే - చిలకన్న చిలకవే బంగారు చిలకవే


"ఒక దెబ్బకు రెండు పిట్టలు" అనేది ఒక తెలుగు సామెత. అంటే ఒక క్రియతో రెండు వేర్వేరు  లక్ష్యాలు సాధించడం. ఈ రకమైన ధోరణి మన పాత తెలుగు సినిమాలలో కనిపించేది. సినీమాల  లక్ష్యం  ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించడం.  అందుకోసం అవసరమున్నా లేకపోయినా  మూడు డాన్స్ లు, ఆరు పాటలు  జొప్పించినా అందుతోపాటు నర్మగర్భంగా ఏదైనా మంచి సందేశాన్ని కూడా కథ ద్వారా, లేదా పాటల ద్వారా ప్రేక్షకులకు అందించేవారు. 'ధర్మమేవ జయతే' అనే ఆర్యోక్తి గుర్తు చేస్తూ సినిమాలు తీసేవారు. అది ఇప్పుడు కాదు . ఒకప్పటి మాట. అటువంటి ఒక నర్మగర్భమైన జానపద గీతమే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

అదే మాధవపెద్ది సత్యం, జిక్కి పాడిన యుగళగీతం 'చిలకన్న చిలకవే బంగారు గిలకవే' 1956 లో వచ్చిన 'జయం మనదే సినిమా లోనిది. జానపద కవి చక్రవర్తి కొసరాజు రాఘవయ్య చౌదరీ గారు వ్రాసిన గీతం. గాయక, సంగీతదర్శకుడు ఘంటసాలగారి స్వరరచనతో రూపుదిద్దుకున్న ఆపాతమధుర గీతం ... పాత్రోచితంగా తెరపై రేలంగి , అంజలీదేవీ అభినయించిన  గీతం...

 

రేలంగి: 

చిలకన్న చిలకవే బంగారు గిలకవే

పంచవన్నెల రామచిలకా - హోయ్

పంచవన్నెల రామచిలకా

ఏడుకొండలమీద ఎగిరివచ్చిన పిట్ట

యెందున్నదో చెప్పవే

మేడల్లొవున్నదో మిద్దెల్లోవున్నదో

జాడయిన చెప్పవే చిలకా

అంజలి:

పంజరమ్మున యినుపసంకెళ్ళు

తగిలించి  బంధించి యుంచారె చిలుకా  

మూడారు వాకిళ్ళు దాటిరావాలంటే 

కోడెత్రాచున్నదే చిలుకా ! కోడె!

రేలంగి:

పట్టుబడ్డాచోట ప్రాణానికేమైన

మోసమ్ము లేదటే చిలుకా

పచ్చన్ని చేలపై స్వేఛ్ఛతో యెగిరేటి

భాగ్యమెప్పుడె రామచిలకా

 

అంజలి:

బంధాలు విడిపించి బయటికంపాలంటె సమయమ్ము చిక్కాలి చిలకా

ఓర్పుజూపక నీవు ఉడుకు జుర్రావంటె

ఓగు తప్పదు రామచిలకా ! ఓగు!

 

రేలంగి:  

బలుపు భారమ్మంత నీమీదనే బెట్టి 

భయము లేకుంటాము చిలకా - రామచిలకా

నీళ్ళల్లొ ముంచివా, పాలల్లొ మంచినా

నీవె దిక్కో రామచిలకా మాకు నీవే

దిక్కు రామచిలకా ...

పోతున్నాం.. పంచవన్నెల రామచిలకా. 


గూఢచారి శాఖల్లో, భద్రతా దళాల్లో వుండేవారంతా శత్రువుల జాడలను, సమాచారాన్ని తెలుసుకునేందుకు మామూలు ప్రజలకు అర్ధంకాని సీక్రెట్ కోడ్  భాషలో మాట్లాడుకుంటారట. ఇక్కడ ఈ పాటలో కూడా అలాటి రహస్య భాషలోనే కథానాయకుడి స్నేహితుడు, కథానాయకుడి ప్రియురాలైన రాకుమారి పరస్పరం సమాచారాన్ని అందజేసుకుంటున్నారు. కోటలో బందీగావున్న కథానాయకుడి యోగక్షేమాలు ఆరాతీస్తూ  అతని స్నేహితుడు రాచనగరు వీధుల్లో చిలకపంజరాలు పట్టుకుతిరుగుతూ  రాకుమారిని పంచవన్నెల రామచిలకా, బంగారు గిలకా అంటూ పాటరూపంలో పలకరించే అతనికి రాజభటులు కథానాయకుని ఇనుపసంకెళ్ళతో బంధించి చెరలో వుంచారనిఅక్కడి మూడారు వాకిళ్ళు దాటవీలులేకుండా కోడెత్రాచులాంటి దుష్ట సేనాని కాపాలా కాస్తున్నాడని, ఇలాటి సమయంలో ఓర్పు చూపకుండా ఆవేశపడితే కీడుతప్పదని ఆ రాకుమారి రహస్యభాషలో హెచ్చరిక చేస్తుంది.

నీళ్ళముంచినా , పాలముంచినా ఇక కథానాయకుని కాపాడే భారమంతా  నీదేనని రాకుమారిని అర్ధిస్తూ ఆ స్నేహితుడు అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఇది ఆ పాట సన్నివేశం. సన్నివేశపరంగా పాట బాహ్యరూపం ఇదే అయినా ఈ పాటలోని చిలక, పంజరం, మూడారువాకిళ్ళు వంటి మాటలు జిజ్ఞాసులకు, తాత్త్వికులకు మరో కోణంలో ఆలోచించడానికి అవకాశం కల్పిస్తున్నది.

బంగారు పంజరంలో చిలకలా రక్తమాంసాలతో కూడిన శరీరమనే పంజరంలో చిలక అనే ఆత్మ బందీఅయి స్వేఛ్ఛను కోల్పోయి జ్ఞాన సముపార్జన కు, ముక్తికి దూరమైపోతున్నది.  పంజరం తెరిచినప్పుడు చిలక ఎలా అయితే స్వేఛ్ఛగా ఎగిరిపోతుందో అలాగే జ్ఞానం పొందిన ఆత్మ  పరమాత్మ లో విలీనమైపోతుందని తాత్వికులు బోధిస్తారు. ఈ విధంగా కొసరాజుగారు ఒక సామాన్య జానపదగీతంలో రెండు వేర్వేరు కోణాలను స్ఫురింపజేశారు.

ఈ పాటలో కొసరాజుగారు ఉపయోగించిన - గిలక, ఉడుకు, జుర్రు, ఓగు, బలుపు వంటి మాండలీక పదాలు అరుదుగా మన సినిమా పాటలలో వినిపిస్తాయి.  సినిమా పాటంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఎంతో మేధోమథనం చేయాలని ఇలాటి గతకాలపు పాటలు కొన్ని నిరూపిస్తాయి.

'చిలకన్న చిలకవే బంగారు గిలకవేపాటను మాధవపెద్ది సత్యం , జిక్కి గార్లతో పాడించారు ఘంటసాల. సందర్భోచితంగా వరసలను కూర్చడంలో, ఆ పాటలను పాడడానికి తగిన గాయనీగాయకులను ఎన్నుకోవడంలోనూ ఘంటసాలగారు అసమాన ప్రజ్ఞావంతుడు. మాధవపెద్ది గారిని అలవాటుకు విరుధ్ధమైన పధ్ధతిలో ఘంటసాల ఈ పాటలో వినిపించారు సాధారణంగా మాధవపెద్దిగారి కంఠంలో ధ్వనించే కరకుదనం, తీవ్రత ఈ పాటలో వినపడవు. శ్రద్ధగా వినకపోతే ఈ పాటను ఘంటసాలగారే పాడుతున్నారేమో అనే భ్రమ కలుగుతుంది. జిక్కిగారుఒక్క ఒత్తుల విషయంలో తప్ప, ఏ రకమైన పాటనైనా అవలీలగా పాడి రక్తి కట్టించగల గాయని. ఆవిడచేత ఏ రకమైన పాటలు పాడించాలో ఘంటసాలగారికి బాగా తెలుసు. జిక్కిగారు కూడా ఈ విషయాన్ని గురించి తన ఇంటర్వ్యూలలో ప్రస్తావించేవారు.

వీర శృంగార రసాలకు ఎక్కువ ప్రాధాన్యత గల 'జయం మనదే' సినిమాలోని పది పాటలను జంపన, కొసరాజు, సముద్రాల, ముద్దుకృష్ణ, సదాశివబ్రహ్మంగార్లు సినిమాలోని కథాంశానికి తగినట్లు వ్రాయగా వాటిని ఘంటసాల, లీల, జిక్కి, మాధవపెద్ది పాడారు. ఘంటసాల సంగీత ప్రతిభకు తార్కాణంగా - లీల పాడిన 'కలువలరాజా కధవినరావా', నేటి సజీవరాగ గీతం 'చిలకన్న చిలకవే', 'మరువజాలని మనసు తాళని', ' వీరగంధం తెచ్చినామయా', ' ఓ చందమామ అందాలభామ' (హిందీ అనుకరణే అయినా) వంటి ఈ సినిమా లోని పాటలు ఈనాటికి సంగీతాభిమానులను అలరిస్తూనేవున్నాయి.

ఘంటసాలగారు నేటి సజీవరాగం 'చిలకన్న చిలకవే బంగారు గిలకవేయుగళగీతాన్ని యదుకుల కాంభోజి రాగ స్వరాలతో , దేశ్ రాగ ఛాయలతో స్వరపర్చారు. యదుకుల కాంభోజి 28వ మేళకర్త హరికాంభోజికి జన్యం. హరికాంభోజికి సమాంతర హిందుస్థానీ రాగం ఖమాస్ థాట్. ఈ ఖమాస్ థాట్ కు జన్యరాగం దేశ్. అందుచేత ఈనాటి మన పాటలో దేశ్ ఛాయలు కూడా వినిపించివుండవచ్చును. యదుకులకాంభోజి రాగం  అరోహణా క్రమంలో శుధ్ధసావేరిలోని ఐదు స్వరాలు, అవరోహణాక్రమంలో హరికాంభోజిలోని ఏడు స్వరాలు కలిగి ఔఢవ-సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. భక్తి, శృంగార, కరుణరసాలకు అనువైన యదుకులకాంభోజి రాగాన్ని ఘంటసాలగారు  సందర్భోచితంగా ఉపయోగించి ఈ జానపదగీతాన్ని జనరంజకం చేశారు. ఈ పాటను తానే పాడుతున్న భ్రమను కలిగించారు అక్కడక్కడ. అంత మార్దవంగా మాధవపెద్ది గళాన్ని ఈ పాటలో మార్చారు.

ఘంటసాలగారు ఈ పాటలో వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియంమేండొలిన్, తబలాడోలక్, కోల్ వంటి వాద్యాలను మన తెలుగు ప్రాంతీయత ఉట్టిపడేలా ఉపయోగించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. ఈ  పాట సన్నివేశంలో రేలంగి, అంజలీదేవీ సంపూర్ణంగా లీనమైపోయి సహజంగా  పాత్రోచితంగా నటించారు.

'జయం మనదే' రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత సుందర్లాల్ నహతా నిర్మించిన మొట్టమొదటి తెలుగు జానపద చిత్రం. 1956 లో విడుదలయింది. జానపదమంటే మాయలు, మంత్రాలు, జంతువులు, రాక్షసులు, దేవకన్యలతో వుండే విఠలాచారి నమూనా కాదు. న్యాయానికి అన్యాయానికి మధ్య, సన్మార్గులకు దుర్మార్గులకు మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా గల సినిమా. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, షావుకారు జానకి, గుమ్మడి, సి.ఎస్.ఆర్., రేలంగి, ఆర్.నాగేశ్వరరావు, పెరుమాళ్, మొదలగువారు నటించిన చిత్రం.

ఇదొక 'రాబిన్ హుడ్' తరహా సినిమా. దిలీప్ కుమార్ నటించిన ' ఆన్' సినిమాను గుర్తు చేసే కథాంశం కలిగిన సినిమా 'జయం మనదేసోషలిస్టు భావాలు గల తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన సినిమా. తొలి సినిమాతోనే ఎద్దుకంటిని సూటిగా పొడిచి ఘనవిజయం పొందారు సుందర్లాల్ నహతాగారు.

1956 లో వచ్చిన 'జయం మనదే' మొదలు 1964 లో వచ్చిన 'గుడిగంటలు'' సినిమా వరకు సుందర్లాల్ నిర్మించిన అన్ని సినిమాలకు ఘంటసాలగారే సంగీత దర్శకుడు. అనుకరణ పాటల విషయంలో వుండే భేదాభిప్రాయాలు తప్పించి నహతా-ఘంటసాలగార్ల మధ్య చాలా మంచి మైత్రి వుండేది. ఘంటసాలగారంటే అమితమైన గౌరవమర్యాదలు, అభిమానం సుందర్లాల్ కు వుండేవి. ప్రతి సంవత్సరం దీపావళి మర్నాడు సాయంత్రం తమ గృహంలో జరిగే లక్ష్మీపూజకు ఘంటసాలగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి నూతనవస్త్రాలతో గౌరవించి సత్కరించడం సుందర్లాల్ గారి ఆచారం. 'ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర మాత్రం కాదు' అనే సామెతను ఋజువు పరుస్తూ పరభాషాగీతాల అనుకరణకు ఒత్తిడి చేసేవారు. ఈ విషయంలో ఘంటసాల-నహతాగార్ల మధ్య ప్రణయ కలహం వంటిది వస్తూండేది. అయినా దాదాపు నహతాగారి పది సినిమాలకు వరసగా ఘంటసాలగారు సంగీతదర్శకుడిగా పనిచేశారు.

ఘంటసాలగారి లవకుశ సంగీతం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందినది సుందర్లాల్ నహతాగారే. ఆర్ధిక సమస్యలతో ఆగిపోయిన ఎ.శంకరరెడ్డిగారి లవకుశను సంపూర్ణ హక్కులతో కొనుగోలుచేసి, సినిమా పూర్తిచేయించి విడుదల చేసింది సుందర్లాల్ నహతాయే. ఆ సినిమా విజయం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలు అనుభవించిన అదృష్టశాలి నహతాగారే.

దాదాపు 70 ఏళ్ళు నిండవస్తున్న 'జయం మనదే' ను ఇంకా మనం తలచుకుంటున్నామంటే అందుకు కారణం ఆ సినిమా లోని ఘంటసాలగారి మధుర సంగీతమే.


ఘంటసాలగారి ఇటువంటి మరో సజీవరాగంతో వచ్చేవారం మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

Saturday, 25 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 12 - సరసుడ దరిచేరరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 12


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


డామిట్! కధ అడ్డంగా తిరిగింది!

ఇది గురజాడ అప్పారావు గారి 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశం మొదటి డైలాగ్. ఇదే డైలాగ్ తో సినిమా మొదలెడితే కథ అడ్డం తిరుగుతుందని నిర్మాత అనుకున్నారో ఏమో, మధురవాణి పడకటింట్లో గిరీశం, మధురవాణి సరస సంభాషణలతో మొదలెట్టారు. కన్యాశుల్కం నాటకాన్ని యథాతధంగా తెరకెక్కించలేని తమ నిస్సహాయత కు గురజాడ వారి ఫోటో సాక్షిగా ప్రేక్షకులకు సంజాయిషీ కూడా చెప్పుకున్నారు.

కన్యాశుల్కం సినిమా ప్రారంభంలోనే మొదటి సీన్ లోనే ఒక చక్కటి జావళి. అదే నేటి మన 'ఘంటసాల- సదా మదిలో మెదిలే సజీవరాగం. 70 ఏళ్ళ తర్వాత ఈ పాట ఇంకా జనాల మదిలో మెదులుతున్నదో లేదో నాకు తెలియదుకాని సంగీత సాహిత్యాల దృష్ట్యా ఈ పాట నిస్సందేహంగా సజీవరాగమే.

జావళి ...

కర్ణాటక సంప్రదాయ సంగీతంలో ఓ భాగం. స్వరపల్లవులు, కృతులు, కీర్తనలు లాగనే జావళీ ఒక సంగీత, సాహిత్య ప్రక్రియ. సాధారణంగా సంగీత కచేరీల ఉత్తరార్ధంలో ప్రదర్శింపబడుతూంటుంది. దాక్షిణాత్య సంగీత, నృత్య కార్యక్రమాలలో జావళి కూడా ఒక ప్రధానాంశం. పల్లవి, అనుపల్లవి, చరణాలతో  జావళీల సాహిత్యం వుంటుంది. ఈ జావళీలలోని సాహిత్యం  శృంగారపరమైవుంటుంది. నాయికా నాయకుల ప్రణయం ముఖ్యాంశంగా, నాయకునికి దూరమైన నాయిక యొక్క విరహవేదన వర్ణనలతో నిండివుంటుంది. బాహ్యంగా శృంగారరస ప్రధానంగా కనిపించినా ఇందులో భక్తి తత్త్వం ముడిపడివుంది.  ఇక్కడ నాయికా నాయకులు పరమాత్మ, జీవాత్మ.  పరమాత్మలోజీవాత్మ ఐక్యమై ముక్తిని పొందడమే అంతిమ పరమార్ధం. ఈ లక్ష్యంతోనే ప్రముఖ వాగ్గేయకారులంతా తమ  రచనలు చేశారు. (కాలక్రమేణా ప్రజలు సంగీత, నాట్యాది కళలలోని భక్తికన్నా వినోదానికి, రక్తికి ఎక్కువగా ఆకర్షితులవడం మొదలెట్టారు.)

భాషాపరంగా జావళీలు  కన్నడతమిళ భాషలలో కన్నా తెలుగులోనే  ఎక్కువగా వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దం నుండి బహుళ ప్రచారంలో కి వచ్చిన ఈ కళాప్రక్రియ మూలాలు, కాలానికి సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. జావళి అనే పేరు కనపడకపోయినా ఆ రకమైన సాహిత్యం సారంగపాణి, అన్నమాచార్య పదకవితలలో కనిపిస్తుంది.

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్( సమయమిదే రారా నా సామి) , స్వాతి తిరునాళ్ (సారమైన మాటలెంతో), ధర్మపురి సుబ్బరాయర్ (పరులన్నమాట నమ్మవద్దు) మొదలగువారు రచించిన జావళీలు మిక్కిలి ప్రసిధ్ధి చెంది ఈనాటికి బహుళ ప్రచారంలో వున్నాయి.

సందర్భం కనుక అందరూ స్మరించుకోతగ్గ మరొక జావళి గురించి చెప్పవలసి ఉంది. సాధారణంగా ప్రచారంలో  వుండే శృంగారరస ప్రధాన జావళీలకు కొంచెం భిన్నంగా  భార్యభర్తల మధ్య వుండే ప్రేమానురాగాలను, బాధ్యతలను ప్రకటితం చేస్తూ   ఘంటసాలవారి గురువుగారు,  వాగ్గేయకారులు అయిన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు రచించి,  కాపీ రాగంలో స్వరపరచిన 'వగల వయ్యారి అదిరా...'  అనే జావళీ ఒక నవ్యపంథాకు నాంది పలికింది.

ఈనాడు భరతనాట్యం, కూచిపూడి శైలులకు చెందిన కళాకారులందరి ప్రదర్శనలలో జావళి తప్పనిసరి అంశం. పండిత పామరులను సరిసమానంగా ఆకర్షించే జావళిని బ్లాక్&వైట్ కాలం నాటి  తెలుగు సినిమా కూడా యథాశక్తిని సద్వినియోగం చేసుకుంది. శాస్త్రీయ, లలితసంగీతాల మేళవింపుతో మనోరంజకమైన జావళీలెన్నో  సంగీతాభిమానులను అలరించాయి.

అలాటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసిన  సత్సంప్రదాయ జావళి కన్యాశుల్కం మధురవాణి కోసం అమరగాయకుడు ఘంటసాలవారు స్వరపర్చిన 'సరసుడ దరిచేరరా'. 

మన దాక్షిణాత్య సినిమాలలో శుధ్ధ శ్రోత్రీయ సంగీతం (తంజావూరు బాణి), నృత్య సంగీతం అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేవి  ఎమ్.ఎస్., పి.లీల, కోమల, ఎమ్.ఎల్.వి.శూలమంగళం (రాధా) జయలక్ష్మి, మొదలైనవారి గాత్రాలే.  ఆ కోవకు చెందిన మరో గాయనీమణి ఎన్.ఎల్.గానసరస్వతి. 1950-60 ల మధ్య వచ్చిన అనేక తెలుగుతమిళ భాషా చిత్రాలలో గానసరస్వతి గానం చేసిన  అనేక శాస్త్రీయ సంగీతనృత్యగీతాలు బహుళ జనాదరణ పొందాయి. ఆవిడ పాడిన సినిమా పాటలు రాశిలో తక్కువే అయినా వాసిలో చాలా మిన్నయనే చెప్పాలి. అలాటి సంప్రదాయ సంగీత గీతాలలో చెప్పుకోదగ్గది 'కన్యాశుల్కం' సినిమాలో శ్రీమతి ఎన్.ఎల్.గానసరస్వతి ఆలపించిన జావళి 'సరసుడ దరిజేరరా...'

జావళి రచన -

వెంపటి సదాశివ బ్రహ్మం

స్వరరచన : ఘంటసాల

గాయని : ఎన్ ఎల్ గానసరస్వతి

నృత్యదర్శకుడు : పసుమర్తి కృష్ణమూర్తి

అభినయం: సావిత్రి


పల్లవి: 

సరసుడ దరిజేరరా.. ఔరా! - 2

సమయమిదే

సరసాల కిదివేళ చలమేలరా

                                    !సరసుడ!

వలచినదానర నే చినదానరా

పిలచిన బిగువేలరా  నన్నేలరా

                                    !సరసుడ!

 

చక్కెర విలుకాని బారి వేసారి

మక్కువతో నిన్నె  మనసార కోరి

చేరితి నీచెంత దయగను మావంత

మురిపించి మరిపించ రారా జాగేలరా

                                    !సరసుడ!

ఖమాస్  ఒక కర్ణాటక సంగీత రాగం. ఇది 28 వ మేళ కర్త అయిన హరికాంభోజికి జన్యరాగం. షాఢవ-సంపూర్ణ రాగం. వక్రసంచారం గల ఈ రాగం ఆరోహణా క్రమంలో ఆరు స్వరాలుఅవరోహణా క్రమంలో ఏడు స్వరాలువుంటాయి. శృంగారరస ప్రధాన కృతులు , కీర్తనలు, జావళీలు ఎక్కువగా ఖమాస్ రాగంలోనే వుంటాయి. ఖమాస్ రాగంలో బహుళ జనాదరణ పొందిన సినీమా పాటలు ఎన్నోవున్నాయి. ప్రఖ్యాతి చెందిన సంప్రదాయ జావళీ రచనలన్నీ ఖమాస్, కాపీ, ఫరజ్, బేహగ్, వంటి లలితమైన రాగాలలో కనిపిస్తాయి. శాస్త్రీయ సంగీత రాగలక్షణాలను క్షుణంగా అర్ధంచేసుకొని ఆయా రాగాలను  సందర్భోచితంగా, జనరంజకంగా ప్రయోగించిన ప్రతిభాశాలి ఘంటసాల. సన్నివేశం రక్తికట్టడానికి తగిన రాగాలను, గాయనీగాయకులను ఎన్నుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. 'సరసుడ దరిజేరరా' అనే సదాశివబ్రహ్మంగారి జావళీని ఘంటసాలగారు ఖమాస్ రాగంలో మలిచారు. సంప్రదాయ  జావళి నృత్యానికి ఉపయోగించే వయొలిన్, వీణ, ఫ్లూట్ , మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాద్యాలతోనే ఘంటసాలగారు ఈ పాటను రూపొందించారు. శుధ్ధ శాస్త్రీయ సంగీత సంగతులతో, గమకశుధ్ధిని పాటింపజేస్తూ గానసరస్వతి చేత అద్భుతంగా గానం చేయించారు ఘంటసాల.

శాస్త్రీయ సంగీత విద్వాంసులు/నృత్య  ప్రదర్శనలలోని గాయకులు మూడు కాలాలలో పాడతారు. వాటిని విలంబ, మధ్యమ, ధృత కాలాలని అంటారు. నాలాటివారికి అర్ధమయే భాషలో చెప్పాలంటే --  స్లో, మీడియం, ఫాస్ట్ టెంపోలు. సాధారణంగా జావళీలు మధ్యమకాలంలో లేదా ధృతకాలం లో వుంటాయి.

కన్యాశుల్కంలో తెరమీది మధురవాణి (సావిత్రి) అంగసౌష్టవాన్ని, అభినయ పరిమితులను దృష్టిలోపెట్టుకుని సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి ఈ జావళీని మధ్యమకాలంలో నడిపించారు. మధురవాణి పాత్రలో పూర్తిగా లీనమైపోయిన సావిత్రి, శృంగారరస ప్రధానమైన ఈ జావళీని పాత్రోచితంగా,  హుందాగా అభినయించి సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

ఈ జావళీని రచించిన కవి వెంపటి సదాశివ బ్రహ్మంగారు పంచకావ్యాలను అధ్యయనం చేసిన సంస్కృతాంధ్ర భాషాకోవిదుడు. తిరుపతి వెంకట కవుల స్ఫూర్తితో శతావధాన, అష్టావధాన ప్రక్రియలలో నిష్ణాతుడు. హరికథా విద్వాంసుడు. స్వాతంత్ర్య సమరయోధుడు.

1940 ల నుండి 1970 ల లోపల ఎన్నో  విజయవంతమైన సినిమాలకు కl, మాటలు, పాటలను సమకూర్చారు. సినిమా గీతాలకు ఒక స్థాయిని, విశిష్టతను తెచ్చిన కవి సదాశివబ్రహ్మంగారు.

కన్యాశుల్కం సినిమా అదృష్టమే అదృష్టం. ఈ సినీమాలో తెలుగువారందరూ గర్వించదగ్గ మహాకవులందరి రచనలు వున్నాయి. గురజాడ అప్పారావు గారి  -'పుత్తడిబొమ్మ పూర్ణమ్మకథ', 'ఇల్లు ఇల్లనియేవు నీ యిల్లు యెక్కడే చిలుకా'; బసవరాజు అప్పారావుగారు వ్రాసిన 'నాగులచవితికి నాగేంద్రా'; దేవులపల్లి వారి 'చేదాము రారే కళ్యాణము'; మల్లాది రామకృష్ణశాస్త్రిగారి 'చిటారుకొమ్మను మిఠాయి పొట్లం'; శ్రీశ్రీ మహాప్రస్థానం లోని 'ఆనందం అర్ణవమైతే'; సముద్రాల వారి 'కీచకవధ' వీధి భాగవతంశ్రీకృష్ణ కర్ణామృత శ్లోకం- కలశ నవనీతచోరే'. ఘంటసాలవారి సంగీతవిద్వత్ కు ఒక సవాల్ కన్యాశుల్కం. శ్రోతలకు సంగీత మృష్టాన్న భోజనం. ఇంతమంది లబ్దప్రతిష్టులైన కవుల వివిధ రసాల గీతాలకు  వైవిధ్య భరితమైన సంగీతాన్ని సమకూర్చి 'కన్యాశుల్కం' ఒక ఉత్తమ చిత్రంగా రూపొందడానికి ముఖ్యకారకులయ్యారు.

ఈ సినిమాలోని నవరత్నాలవంటి ఎనిమిది పాటలను+ఒక శ్లోకాన్ని ఘంటసాలమాధవపెద్ది, ఎన్.ఎల్.గానసరస్వతి, పి. సుశీల, పద్మప్రియఆలపించారు. సుప్రసిద్ధ బహుభాషా చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన 'కన్యాశుల్కం' దృశ్యకావ్యానికి నిర్మాత డి.ఎల్.గా చిత్రసీమకు చిరపరిచితుడైన ద్రోణావఝ్ఝల లక్ష్మీనారాయణ. భానుమతిగారి భరణి స్టూడియో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి 1951 లో 'స్త్రీ సాహసంనుండి 1969 లో వచ్చిన 'ఏకవీర' వరకు ఓ డజన్  సినిమాలను నిర్మించారు. డి.ఎల్. నిర్మించిన దేవదాసు, కన్యాశుల్కం, చిరంజీవులు, ఏకవీర మొదలైన సినిమాలు ఆయన ఉత్తమాభిరుచికి అద్దం పడతాయి.

డి.ఎల్. సినిమాలన్నింటిలో ఘంటసాలగారు గాయకుడిగానో లేక సంగీతదర్శకుడిగానో ప్రముఖపాత్ర వహించారు.

70 సంవత్సరాలు నిండిన 'కన్యాశుల్కం' ఎన్ని తరాలు మారినా చిరస్మరణీయమే. ఆ చిత్ర సంగీతం సజీవరాగమే.


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


కొసమెరుపు : -

1950 దశకంలో ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో  ఎన్నో పాటలు పాడిన పి.లీల ఈ సినిమాలో ఒక పాట కూడా పాడకపోవడం ఆశ్చర్యమే.

 

వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 14 - మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...