Saturday, 25 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 12 - సరసుడ దరిచేరరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 12


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


డామిట్! కధ అడ్డంగా తిరిగింది!

ఇది గురజాడ అప్పారావు గారి 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశం మొదటి డైలాగ్. ఇదే డైలాగ్ తో సినిమా మొదలెడితే కథ అడ్డం తిరుగుతుందని నిర్మాత అనుకున్నారో ఏమో, మధురవాణి పడకటింట్లో గిరీశం, మధురవాణి సరస సంభాషణలతో మొదలెట్టారు. కన్యాశుల్కం నాటకాన్ని యథాతధంగా తెరకెక్కించలేని తమ నిస్సహాయత కు గురజాడ వారి ఫోటో సాక్షిగా ప్రేక్షకులకు సంజాయిషీ కూడా చెప్పుకున్నారు.

కన్యాశుల్కం సినిమా ప్రారంభంలోనే మొదటి సీన్ లోనే ఒక చక్కటి జావళి. అదే నేటి మన 'ఘంటసాల- సదా మదిలో మెదిలే సజీవరాగం. 70 ఏళ్ళ తర్వాత ఈ పాట ఇంకా జనాల మదిలో మెదులుతున్నదో లేదో నాకు తెలియదుకాని సంగీత సాహిత్యాల దృష్ట్యా ఈ పాట నిస్సందేహంగా సజీవరాగమే.

జావళి ...

కర్ణాటక సంప్రదాయ సంగీతంలో ఓ భాగం. స్వరపల్లవులు, కృతులు, కీర్తనలు లాగనే జావళీ ఒక సంగీత, సాహిత్య ప్రక్రియ. సాధారణంగా సంగీత కచేరీల ఉత్తరార్ధంలో ప్రదర్శింపబడుతూంటుంది. దాక్షిణాత్య సంగీత, నృత్య కార్యక్రమాలలో జావళి కూడా ఒక ప్రధానాంశం. పల్లవి, అనుపల్లవి, చరణాలతో  జావళీల సాహిత్యం వుంటుంది. ఈ జావళీలలోని సాహిత్యం  శృంగారపరమైవుంటుంది. నాయికా నాయకుల ప్రణయం ముఖ్యాంశంగా, నాయకునికి దూరమైన నాయిక యొక్క విరహవేదన వర్ణనలతో నిండివుంటుంది. బాహ్యంగా శృంగారరస ప్రధానంగా కనిపించినా ఇందులో భక్తి తత్త్వం ముడిపడివుంది.  ఇక్కడ నాయికా నాయకులు పరమాత్మ, జీవాత్మ.  పరమాత్మలోజీవాత్మ ఐక్యమై ముక్తిని పొందడమే అంతిమ పరమార్ధం. ఈ లక్ష్యంతోనే ప్రముఖ వాగ్గేయకారులంతా తమ  రచనలు చేశారు. (కాలక్రమేణా ప్రజలు సంగీత, నాట్యాది కళలలోని భక్తికన్నా వినోదానికి, రక్తికి ఎక్కువగా ఆకర్షితులవడం మొదలెట్టారు.)

భాషాపరంగా జావళీలు  కన్నడతమిళ భాషలలో కన్నా తెలుగులోనే  ఎక్కువగా వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దం నుండి బహుళ ప్రచారంలో కి వచ్చిన ఈ కళాప్రక్రియ మూలాలు, కాలానికి సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. జావళి అనే పేరు కనపడకపోయినా ఆ రకమైన సాహిత్యం సారంగపాణి, అన్నమాచార్య పదకవితలలో కనిపిస్తుంది.

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్( సమయమిదే రారా నా సామి) , స్వాతి తిరునాళ్ (సారమైన మాటలెంతో), ధర్మపురి సుబ్బరాయర్ (పరులన్నమాట నమ్మవద్దు) మొదలగువారు రచించిన జావళీలు మిక్కిలి ప్రసిధ్ధి చెంది ఈనాటికి బహుళ ప్రచారంలో వున్నాయి.

సందర్భం కనుక అందరూ స్మరించుకోతగ్గ మరొక జావళి గురించి చెప్పవలసి ఉంది. సాధారణంగా ప్రచారంలో  వుండే శృంగారరస ప్రధాన జావళీలకు కొంచెం భిన్నంగా  భార్యభర్తల మధ్య వుండే ప్రేమానురాగాలను, బాధ్యతలను ప్రకటితం చేస్తూ   ఘంటసాలవారి గురువుగారు,  వాగ్గేయకారులు అయిన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు రచించి,  కాపీ రాగంలో స్వరపరచిన 'వగల వయ్యారి అదిరా...'  అనే జావళీ ఒక నవ్యపంథాకు నాంది పలికింది.

ఈనాడు భరతనాట్యం, కూచిపూడి శైలులకు చెందిన కళాకారులందరి ప్రదర్శనలలో జావళి తప్పనిసరి అంశం. పండిత పామరులను సరిసమానంగా ఆకర్షించే జావళిని బ్లాక్&వైట్ కాలం నాటి  తెలుగు సినిమా కూడా యథాశక్తిని సద్వినియోగం చేసుకుంది. శాస్త్రీయ, లలితసంగీతాల మేళవింపుతో మనోరంజకమైన జావళీలెన్నో  సంగీతాభిమానులను అలరించాయి.

అలాటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసిన  సత్సంప్రదాయ జావళి కన్యాశుల్కం మధురవాణి కోసం అమరగాయకుడు ఘంటసాలవారు స్వరపర్చిన 'సరసుడ దరిచేరరా'. 

మన దాక్షిణాత్య సినిమాలలో శుధ్ధ శ్రోత్రీయ సంగీతం (తంజావూరు బాణి), నృత్య సంగీతం అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేవి  ఎమ్.ఎస్., పి.లీల, కోమల, ఎమ్.ఎల్.వి.శూలమంగళం (రాధా) జయలక్ష్మి, మొదలైనవారి గాత్రాలే.  ఆ కోవకు చెందిన మరో గాయనీమణి ఎన్.ఎల్.గానసరస్వతి. 1950-60 ల మధ్య వచ్చిన అనేక తెలుగుతమిళ భాషా చిత్రాలలో గానసరస్వతి గానం చేసిన  అనేక శాస్త్రీయ సంగీతనృత్యగీతాలు బహుళ జనాదరణ పొందాయి. ఆవిడ పాడిన సినిమా పాటలు రాశిలో తక్కువే అయినా వాసిలో చాలా మిన్నయనే చెప్పాలి. అలాటి సంప్రదాయ సంగీత గీతాలలో చెప్పుకోదగ్గది 'కన్యాశుల్కం' సినిమాలో శ్రీమతి ఎన్.ఎల్.గానసరస్వతి ఆలపించిన జావళి 'సరసుడ దరిజేరరా...'

జావళి రచన -

వెంపటి సదాశివ బ్రహ్మం

స్వరరచన : ఘంటసాల

గాయని : ఎన్ ఎల్ గానసరస్వతి

నృత్యదర్శకుడు : పసుమర్తి కృష్ణమూర్తి

అభినయం: సావిత్రి


పల్లవి: 

సరసుడ దరిజేరరా.. ఔరా! - 2

సమయమిదే

సరసాల కిదివేళ చలమేలరా

                                    !సరసుడ!

వలచినదానర నే చినదానరా

పిలచిన బిగువేలరా  నన్నేలరా

                                    !సరసుడ!

 

చక్కెర విలుకాని బారి వేసారి

మక్కువతో నిన్నె  మనసార కోరి

చేరితి నీచెంత దయగను మావంత

మురిపించి మరిపించ రారా జాగేలరా

                                    !సరసుడ!

ఖమాస్  ఒక కర్ణాటక సంగీత రాగం. ఇది 28 వ మేళ కర్త అయిన హరికాంభోజికి జన్యరాగం. షాఢవ-సంపూర్ణ రాగం. వక్రసంచారం గల ఈ రాగం ఆరోహణా క్రమంలో ఆరు స్వరాలుఅవరోహణా క్రమంలో ఏడు స్వరాలువుంటాయి. శృంగారరస ప్రధాన కృతులు , కీర్తనలు, జావళీలు ఎక్కువగా ఖమాస్ రాగంలోనే వుంటాయి. ఖమాస్ రాగంలో బహుళ జనాదరణ పొందిన సినీమా పాటలు ఎన్నోవున్నాయి. ప్రఖ్యాతి చెందిన సంప్రదాయ జావళీ రచనలన్నీ ఖమాస్, కాపీ, ఫరజ్, బేహగ్, వంటి లలితమైన రాగాలలో కనిపిస్తాయి. శాస్త్రీయ సంగీత రాగలక్షణాలను క్షుణంగా అర్ధంచేసుకొని ఆయా రాగాలను  సందర్భోచితంగా, జనరంజకంగా ప్రయోగించిన ప్రతిభాశాలి ఘంటసాల. సన్నివేశం రక్తికట్టడానికి తగిన రాగాలను, గాయనీగాయకులను ఎన్నుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. 'సరసుడ దరిజేరరా' అనే సదాశివబ్రహ్మంగారి జావళీని ఘంటసాలగారు ఖమాస్ రాగంలో మలిచారు. సంప్రదాయ  జావళి నృత్యానికి ఉపయోగించే వయొలిన్, వీణ, ఫ్లూట్ , మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాద్యాలతోనే ఘంటసాలగారు ఈ పాటను రూపొందించారు. శుధ్ధ శాస్త్రీయ సంగీత సంగతులతో, గమకశుధ్ధిని పాటింపజేస్తూ గానసరస్వతి చేత అద్భుతంగా గానం చేయించారు ఘంటసాల.

శాస్త్రీయ సంగీత విద్వాంసులు/నృత్య  ప్రదర్శనలలోని గాయకులు మూడు కాలాలలో పాడతారు. వాటిని విలంబ, మధ్యమ, ధృత కాలాలని అంటారు. నాలాటివారికి అర్ధమయే భాషలో చెప్పాలంటే --  స్లో, మీడియం, ఫాస్ట్ టెంపోలు. సాధారణంగా జావళీలు మధ్యమకాలంలో లేదా ధృతకాలం లో వుంటాయి.

కన్యాశుల్కంలో తెరమీది మధురవాణి (సావిత్రి) అంగసౌష్టవాన్ని, అభినయ పరిమితులను దృష్టిలోపెట్టుకుని సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి ఈ జావళీని మధ్యమకాలంలో నడిపించారు. మధురవాణి పాత్రలో పూర్తిగా లీనమైపోయిన సావిత్రి, శృంగారరస ప్రధానమైన ఈ జావళీని పాత్రోచితంగా,  హుందాగా అభినయించి సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

ఈ జావళీని రచించిన కవి వెంపటి సదాశివ బ్రహ్మంగారు పంచకావ్యాలను అధ్యయనం చేసిన సంస్కృతాంధ్ర భాషాకోవిదుడు. తిరుపతి వెంకట కవుల స్ఫూర్తితో శతావధాన, అష్టావధాన ప్రక్రియలలో నిష్ణాతుడు. హరికథా విద్వాంసుడు. స్వాతంత్ర్య సమరయోధుడు.

1940 ల నుండి 1970 ల లోపల ఎన్నో  విజయవంతమైన సినిమాలకు కl, మాటలు, పాటలను సమకూర్చారు. సినిమా గీతాలకు ఒక స్థాయిని, విశిష్టతను తెచ్చిన కవి సదాశివబ్రహ్మంగారు.

కన్యాశుల్కం సినిమా అదృష్టమే అదృష్టం. ఈ సినీమాలో తెలుగువారందరూ గర్వించదగ్గ మహాకవులందరి రచనలు వున్నాయి. గురజాడ అప్పారావు గారి  -'పుత్తడిబొమ్మ పూర్ణమ్మకథ', 'ఇల్లు ఇల్లనియేవు నీ యిల్లు యెక్కడే చిలుకా'; బసవరాజు అప్పారావుగారు వ్రాసిన 'నాగులచవితికి నాగేంద్రా'; దేవులపల్లి వారి 'చేదాము రారే కళ్యాణము'; మల్లాది రామకృష్ణశాస్త్రిగారి 'చిటారుకొమ్మను మిఠాయి పొట్లం'; శ్రీశ్రీ మహాప్రస్థానం లోని 'ఆనందం అర్ణవమైతే'; సముద్రాల వారి 'కీచకవధ' వీధి భాగవతంశ్రీకృష్ణ కర్ణామృత శ్లోకం- కలశ నవనీతచోరే'. ఘంటసాలవారి సంగీతవిద్వత్ కు ఒక సవాల్ కన్యాశుల్కం. శ్రోతలకు సంగీత మృష్టాన్న భోజనం. ఇంతమంది లబ్దప్రతిష్టులైన కవుల వివిధ రసాల గీతాలకు  వైవిధ్య భరితమైన సంగీతాన్ని సమకూర్చి 'కన్యాశుల్కం' ఒక ఉత్తమ చిత్రంగా రూపొందడానికి ముఖ్యకారకులయ్యారు.

ఈ సినిమాలోని నవరత్నాలవంటి ఎనిమిది పాటలను+ఒక శ్లోకాన్ని ఘంటసాలమాధవపెద్ది, ఎన్.ఎల్.గానసరస్వతి, పి. సుశీల, పద్మప్రియఆలపించారు. సుప్రసిద్ధ బహుభాషా చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన 'కన్యాశుల్కం' దృశ్యకావ్యానికి నిర్మాత డి.ఎల్.గా చిత్రసీమకు చిరపరిచితుడైన ద్రోణావఝ్ఝల లక్ష్మీనారాయణ. భానుమతిగారి భరణి స్టూడియో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి 1951 లో 'స్త్రీ సాహసంనుండి 1969 లో వచ్చిన 'ఏకవీర' వరకు ఓ డజన్  సినిమాలను నిర్మించారు. డి.ఎల్. నిర్మించిన దేవదాసు, కన్యాశుల్కం, చిరంజీవులు, ఏకవీర మొదలైన సినిమాలు ఆయన ఉత్తమాభిరుచికి అద్దం పడతాయి.

డి.ఎల్. సినిమాలన్నింటిలో ఘంటసాలగారు గాయకుడిగానో లేక సంగీతదర్శకుడిగానో ప్రముఖపాత్ర వహించారు.

70 సంవత్సరాలు నిండిన 'కన్యాశుల్కం' ఎన్ని తరాలు మారినా చిరస్మరణీయమే. ఆ చిత్ర సంగీతం సజీవరాగమే.


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


కొసమెరుపు : -

1950 దశకంలో ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో  ఎన్నో పాటలు పాడిన పి.లీల ఈ సినిమాలో ఒక పాట కూడా పాడకపోవడం ఆశ్చర్యమే.

 

వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 18 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 11 - ఆపకురా మురళి/ఆపితివా మురళి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 11


చెరపకురా చెడేవు - ఆపకురా మురళి/ఆపితివా మురళి


జీవితసరళి... 'ఆ మాటేదో అందరికీ అర్ధమయేలా చెప్పవయ్యా...

 

Life style. .. ' ఓస్ అదా! మా మనవడి స్టైలే స్టైల్. చదవడానికి అమెరికా వెళ్ళాడు. వాడి హెయిర్ స్టైల్ కి అక్కడి దొరలే ముక్కున వేలేసుకుంటారట  ఓ కామందుగారి బడాయి. 'మా మనవరాలు మాత్రం.. దాని దగ్గరున్నన్ని మోడర్న్ డ్రెస్ లు, మాచింగ్ లిప్ స్టిక్ లు, కాలిజోళ్ళు, కళ్ళజోళ్ళు ఈ ఊళ్ళో ఎవరికీలేవు. అన్నీ బొంబాయి నుంచే తెప్పిస్తుంది. వాటిని నన్ను కూడా వేసుకోమని ఒకటే గోల... అయినా నాకు సిగ్గు బాబూ.. 'కామందుగారి భార్య మురిపెం. మనవల ముద్దు ముచ్చట్లు తీర్చడానికి బంగారం లాంటి భూములు తెగనమ్మేస్తున్నారని కోడలు రోజూ మొగుడితో లడాయి.

ఇది ఆ కుటుంబం జీవితసరళి.

ఇంతకీ జీవితసరళి అంటే...

ఒక మనిషి తన నిత్యజీవితంలో అనుసరించే విధివిధానాలు, ఆహార విహారపుటలవాట్లు, నడవడిక, సమాజంలో ఇతర వ్యక్తులతోడి స్నేహ సత్సంబంధాలు అతడి జీవితశైలిని లేదా జీవిత సరళిని తెలియజేస్తాయి. అపరిమితమైన  సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానంకంప్యూటర్ల వినియోగం, ఆధునికీకరణ, ప్రపంచీకరణ వంటి విషయాలు  అందుబాటులోకి వచ్చాక మనిషి జీవిత విధానమే పూర్తిగా మారిపోయింది. సమాజంలోని వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య  పరస్పర స్నేహానురాగాలుమమతానుబంధాలు క్రమక్రమంగా రూపుమాసిపోతున్నాయి. దీని ప్రభావం మన కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద కూడా తీవ్రంగా కనిపిస్తోంది. గత డెభ్భై ఎనభై ఏళ్ళక్రితం వున్న జీవన విధానానికిఆచార వ్యవహారాలకు, ఆహారపు అలవాట్లకు ఇప్పుడున్న తీరుతెన్నులకు సంబంధమే లేదు. మనిషి జీవిత సరళి పూర్తిగా మారిపోయింది. IT పురోభివృద్ధి ప్రభావం మన సినిమాలమీద  కూడా పడింది. గత రెండున్నర దశాబ్దాలలో మన సినీమాల సరళి పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటివరకు భారతీయ స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం. (ఈనాటి ఆధునిక వతులు ఈ సూత్రానికి కట్టుబడి వుండడానికి సిధ్ధంగా వున్నారా అంటే సందేహమే). ప్రేమాభిమానాలతో చేరదీసినా, నిర్లక్ష్యం చేసి కొట్టి తిట్టినా ఆనాటి స్త్రీకి భర్తే సర్వస్వం. ఈ రకమైన సామాజిక నీతిని అనుసరించిన కథాంశాలతో వచ్చిన సినిమాలే గత నాలుగు దశాబ్దాల క్రితం వరకు వచ్చేవి. వాటిని స్త్రీ పురుష ప్రేక్షకులంతా సమానంగా అభిమానించారు, ఆదరించారు. అందుకు ఉదాహరణగా ఈ పాటలోని సాహిత్యం చూడండి...

పల్లవి:

ఆపకురా మురళీ... గోపాలా-2

అదే నా జీవిత సరళీ.. ఆపకురా!

చరణం 1:

మధుర మధురమౌ నీ మురళీ

సుధలను చిలికే ఆ మురళీ

నా ఎద నవ్వుల రవళీ

అదే నా జీవిత సరళీ 

                            !ఆపకురా!

చరణం 2: 

పతి నీ రూపని నీవే ప్రాపని

మధురగానమున రాధగ మారెద

మధుపము నయ్యెద పదముల వ్రాలెద 

నాపతి మాధవుడేరా 

                            !ఆపకురా!

భర్త తనను ప్రేమానురాగాలతో మురిపెంగా చూసుకోవడమే పరమ పెన్నిధిగా భావించే ఆ స్త్రీ దైవస్మరణలో కూడా తన పతినే తలచుకుంటుంది. తనను రాధగా భర్తను మాధవుడిగా ఊహించుకుని మధురస్మృతులలో విహరిస్తూ తానొక తేనెటీగగా మారి పతి పాదాలపై వ్రాలిపోవాలని అదే తన జీవితసరళి కావాలని ఆనందంలో తేలియాడుతూ

ఆ మురళీగానలోలుని ప్రార్ధిస్తూంటుంది. 

 

 1955 లో వచ్చిన 'చెరపకురా-చెడేవు' సినిమా కోసం

జూనియర్ సముద్రాల  వ్రాసిన ఈ పాటకు స్వరకర్త ఘంటసాల.

సన్నివేశానికి తగిన భావావేశంతో మృదుమధురంగా భక్తితత్పరతతో

పి లీల గానం చేయగా భర్తపట్ల అపరిమిత ప్రేమ,  విశ్వాసం గల సతిగా షావుకారు జానకి తెరపై అత్యంత సహజంగా నటించారు.

 

ఈ పాటలో 'మురళి', 'రవళి', 'సరళి'

యని ఒక చరణంలో, మరొక చరణంలో 'రూపని', 'ప్రాపని';

'మారెద', 'నయ్యెద', ' వ్రాలెద'

వంటి పదప్రయోగాలు చేసి జూనియర్  సముద్రాల గారు ప్రాసలపట్ల తనకు గల మక్కువను చాటుకున్నారు.

 

వెలుగు చీకట్లలా ఈ పాటకు రెండు పార్శ్వాలు. జీవితసరళి సవ్యంగా సాగిపోతున్నప్పుడు సంతోషంతో చేసిన దైవస్మరణ ఒకటైతే , భర్త త్రాగుడు, చెడుసావాసాలు, పరస్త్రీ వ్యామోహానికి లోనై తనను అలక్ష్యపర్చి దూరంచేసినప్పుడు బ్రతుకంతా భారమై ఆవేదనతో  దైవం ముందు విలపించిన గీతం మరొకటి. అది....

 

ఆపితివా ...మురళీ...గోపాలా -2

ఇదియే నా జీవిత సరళీ

                                    !ఆపితివా!

నవ వసంతమౌ నా వయసు

అతి ప్రశాంతమౌ ఈ మనసూ

పాపపు చీకటి పాలేనా

ఇదియేనా జీవితసరళీ

నా పతికె దూరమా! నీకే భారమా

నాధుని నమ్మిన నాతికి వెతలా

పెదవుల వేణువు వదలకురా ప్రభూ...

పతి దర్శనమీరా 

                            !ఆపకురా!


సినిమాలో రెండు వేర్వేరు సందర్భాలలో ఆనంద విషాద భావోద్వేగాలతో  వినపడే ఈ గీతాన్ని ఘంటసాల పీలు రాగంలో స్వరపర్చి పి.లీలచేత భక్తిపూర్వకంగా గానం చేయించారు.

పీలు ... ప్రసిద్ధి చెందిన ఒక హిందుస్థానీ రాగం. 'కాపి థాట్' కు జన్యం. తుమ్రీ, దాద్రా వంటి లలిత శాస్త్రీయ రీతులలో గానం చేసేప్పుడు విద్వాంసులు  ఈ పీలు రాగాన్ని ఎన్నుకుంటారు.  పీలు రాగంలో ఇతర రాగాల ఛాయలు కూడా వుండడం వలన దీనిని మిశ్రరాగంగా పరిగణిస్తారు. భక్తి, శృంగార, కరుణఆనంద, విషాదాది రస భావాలకు అనువైన ఈ పీలు రాగంలో  ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ (తుమ్రీ)పండిట్ రవిశంకర్ (సితార్) బిస్మిల్లాఖాన్ (షెహనాయ్), అంజాద్ ఆలీఖాన్ (సరోద్), హరిప్రసాద్ చౌరాసియా (ఫ్లూట్) వంటి సుప్రసిద్ధ సంగీత కళాకారుల స్వరరచనలెన్నో సంగీతప్రియులను అలరిస్తున్నాయి.

అలాగే సినిమా సంగీతంలో కూడా పీలు రాగం చేసిన అనేక గీతాలు శ్రోతల మనసులలో నిలిచివున్నాయి. భారతీయులందరికి అత్యంత ప్రీతిపాత్రమైన  భక్తిగీతం 'రఘుపతి రాఘవ రాజారాం' ఈ పీలు రాగంలోనే స్వరపర్చారు. పీలు రాగానికి సమానమైన కర్ణాటక రాగం కాపి. దీనికి హిందుస్థానీ శైలిలోని కాపికి సంబంధం లేదు. కర్ణాటక సంగీతంలోని కాపి రాగం 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ కు జన్యరాగం. అటువంటి జన, మనోరంజకమైన పీలురాగంలోని భక్తి, ఆనందం, విషాద రసాలకు ప్రాధాన్యతనిస్తూ  ఘంటసాల మాస్టారు 'ఆపకురా మురళీ గోపాల' గీతాన్ని సార్ధకత చెందేలా స్వరపర్చి శ్రోతలలో భక్తిభావాన్ని ఇనుమడింపజేసేలా పి.లీలచే అద్భుతంగా పాడించారు.

రసపోషణకు అవసరమైనంతమేరకు మాత్రమే మాస్టారు ఈ పాటకు  వాద్యాలను  సున్నితంగా ఉపయోగించారు. వయొలిన్స్, వీణ, సితార్,  ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియం, తబలా, డోలక్, తాళాలు వంటి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి. శాస్త్రీయ సంగీత నేపథ్యంగల శ్రీమతి పి.లీల గళంలో గమకాలు, ఆలాపనలు సునాయాసంగా పలుకుతాయనడానికి ' ఆపకురా మురళీ' ఒక నిదర్శనం.

ఈ పాటను  ఒక సత్సంగ సభ్యులు (పురుషులు) తమ భజన కార్యక్రమంలో ఆలపించడం యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి. 

ఘంటసాలగారి అనేక గీతాలు శాస్త్రీయ సంగీతవిద్యార్ధులకు రాగ పరిచయానికి అభ్యాసగీతాలుగా తగినవని గాఢంగా విశ్వసించే పట్రాయని సంగీతరావుగారు నా చిన్నతనంలో తరచూ వీణమీద, హార్మోనియం మీద వాయిస్తూ పిల్లలకి నేర్పడం నాకు బాగా గుర్తు.

1950 దశకం నాటికి ఘంటసాలగారు చలనచిత్ర గాయకుడిగా, సంగీతదర్శకుడిగా తనకంటూ ఒక బాణీని, దృఢమైన సుస్థిరతను ఏర్పరచుకున్నారు. సినీగీత సంగీత కచేరీలకు ఆద్యుడు ఘంటసాలగారు. వివిధ సంగీత ప్రక్రియలతో కూడిన ఘంటసాలగారి సంగీతకచేరీ శ్రోతలకు మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఉచ్ఛ స్థాయికి చేరుకున్న ఘంటసాల తన స్వంత ఆర్కెష్ట్రాను ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకమని భావించారు.  ప్రసాదరావు ఆర్కెష్ట్రా, దక్షిణామూర్తి ఆర్కెష్ట్రా, మాస్టర్ వేణు ఆర్కెష్ట్రా అని కొన్ని ఆర్కెష్ట్రాల పేర్లు పాత సినిమా టైటిల్స్ లో మనం చూస్తూంటాము. సినిమా సంగీతదర్శకుడిగా ఒకరి పేరు , ఆర్కెష్ట్రాకు మరొకరి పేరు వుంటుంది.

1954 సంక్రాంతి పండగరోజులన్నీ అయ్యాక  ఒక శుభముహుర్తాన ఘంటసాలగారు తమ స్వంత ఆర్కెష్ట్రాను .... సర్వశ్రీ - పామర్తి (తబలా), పి. సంగీతరావు (హార్మోనియం), హుస్సేన్ రెడ్డి (ఆర్గన్), ఎన్.సి.కృష్ణమాచారి (వయొలిన్), సుబ్రహ్మణ్యం (వయోలా), ఎమ్.ఎస్.రాజు (వీణ), రాజేంద్రన్ (ఫ్లూట్), సుభాన్ (క్లారినెట్), కణ్ణన్ఆర్.వి.భద్రం (రిథిమ్స్) వంటి సంగీత కళాకారులతో, గురుసమానుడైన ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ సమక్షంలో వారి ఆశిస్సులతో ప్రారంభోత్సవం జరిపారు. 

శ్రీమతి పి లీల ప్రార్ధనాగీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సర్వశ్రీ - వి.నాగయ్య, సీనియర్ సముద్రాల, రావూరు సత్యనారాయణరావు, దర్శక నిర్మాత కోవెలమూడి భాస్కరరావులు విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు. అప్పటినుంచే ఘంటసాలగారు సినీ సంగీతప్రపంచంలో ఘంటసాల మాస్టారుగా అందరి మన్ననలు అందుకోసాగారు. 

ఘంటసాల ఆర్కెష్ట్రాతో తయారైన మొట్టమొదటి చిత్రం భాస్కర్ ప్రొడక్షన్స్ 'చెరపకురా-చెడేవు' 1955 లో విడుదలయింది. ఎన్.టి.రామారావు, అమర్నాథ్, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్., రేలంగి, షావుకారు జానకి, రాజసులోచనలక్ష్మీరాజ్యం, చంద్రకుమారి, పుష్పలత మొదలగువారు నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత అయిన భాస్కరరావుగారే డైరక్ట్ చేశారు. చెరపకురా చెడేవు అనే పేరు చూడగానే కథాసారాంశం అంతా అర్ధమైపోతుంది. 'బ్రతుకుతెరువు' సినిమా తర్వాత తీసిన ఈ సినిమా కూడా మంచి విజయాన్నే పొందింది. దీనిని తమిళంలో  'ఇల్లరమే ఇన్బంపేరుతో డబ్ చేశారు.

ఘంటసాలగారిని అమితంగా అభిమానించి గౌరవించిన నిర్మాత లలో భాస్కరరావు గారు ఒకరు. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన  దాదాపు ఆరేడు సినీమాలు అన్నింటికీ  వరుసగా ఘంటసాలగారే సంగీతదర్శకుడు.  ఆ బ్యానర్ కు  ఘంటసాలగారు సంగీత దర్శకత్వం నిర్వహించిన ఆఖరు చిత్రం 'మోహినీ రుక్మాంగద' ఆ తర్వాత, కోవెలమూడి భాస్కరరావుగారు సినీమాలు తీసినట్లుగా కనపడదు.

'చెరపకురా-చెడేవు' లోని పది పాటలను సముద్రాల జూనియర్, రావూరి సత్యనారాయణ రావు వ్రాశారు. పి.లీల పాడిన ' ఆపకురా మురళీ',  'యోగము అనురాగము', జిక్కి పాడిన 'గులాబీలతోట',  అందాల నా రాజ రావోయి' , ఘంటసాల & రాణి పాడిన 'నాటకం ఆడుదాం', ' ప్రేమో ప్రేమో ప్రేమ', పాటలు ఆనాడు బహుళజనాదరణ పొందాయి. సంగీతపరంగా ఘంటసాలగారికి మంచి పేరు తెచ్చిన సినిమా 'చెరపకురా-చెడేవు'.

ఇందులోని విశేషం ఏమంటే హీరో ఎన్.టి.ఆర్ కు గాని, సెకండ్ హీరో అమర్నాథ్ కు గాని పాటలే లేవు. ఉన్న రెండు డ్యూయెట్ లు రేలంగి, పుష్పలతలకే. దీనినిబట్టి ఆనాడు దర్శకులు కథాంశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో అర్ధమవుతుంది.

కొసమెరుపు:-

పురాణపురుషుడు, త్రిలోకసంచారి అయిన నారదుడికి చొక్కా తొడిగిన ఘనత కోవెలమూడి భాస్కరరావు

గారిదే.  వివరాలు తెలియాలంటే చూడండి భాస్కర్ ప్రొడక్షన్స్ వారి 'పార్వతీ కళ్యాణం'. 



వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

  

ప్రణవ స్వరాట్


Saturday, 11 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 10 - విజ్ఞానదీపమును వెలిగింప రారయ్యా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 10


చంద్రహారం - విజ్ఞానదీపమును  వెలిగింప రారయ్యా

'అమ్మాయిలూ! అందరూ వచ్చేశారా! కాసేపు మీ గాసిప్ పురాణం కట్టిపెడితే కొత్త పాట నేర్చుకుందాము. మనం నేర్చుకునే విద్య - స్కూల్ పాఠాలుసంగీతం, సాహిత్యం, డాన్స్, చిత్రలేఖనం, ఏదైనా కావచ్చు అది  మానసికోల్లాసంతోపాటు విజ్ఞాన వికాసాలను, పరోపకార పరాయణత్వాన్ని మనకు, మన చుట్టూ వున్న సమాజానికి కలిగించాలి అప్పుడే మనం నేర్చుకున్న విద్యకు సార్ధకత ఏర్పడుతుంది.

ఉదాహరణకు ఈవేళటి పాటనే తీసుకోండి ... ఈ పాట చరణంలో కవి ఏమంటున్నాడో తెలుసా !


'పరహితమె పరసుఖమే పరమార్ధ

చింతనయే మానవుల ధర్మమని భావించరయ్యా...

వినయమున సహనమున విజయములు సాధించి దీన

బలహీనులను కరుణతో పాలించి

జీవులకు దేవులకు భేదమే లేదని

భువిని ఈ సత్యమును చాటించరయ్యా....'

 

ఇక పాట పల్లవి ఎలా ఎత్తుకున్నాడో చూద్దామా...

 

'విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య

అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా

                                    !విజ్ఞానదీపమును!

ఈ పాటలో అందరూ పాటించదగిన గొప్ప సందేశమున్నది. ఎంతో అర్ధమూ పరమార్ధమూ వున్నది.  చూడండీ...

చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా వినయవిధేయతలు, శాంత సహనాలు కలిగివుండాలి. ఆపదలోవున్నవారికి సాయపడాలనే పరోపకార చింతన వుండాలి. ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషి కలిగివుంటే మనిషికి దేవుడికి భేదమే వుండదు. ఏమంటారు .... చాలా ఆదర్శవంతమైన గీతం కదూ! 

ఇలాటి పాటలను నేర్చుకుని పదిమందిలో పాడడంలో ఎంతో ఆత్మానందం, తృప్తి కలుగుతుంది కదూ... ఈ పాటను ఎవరు వ్రాసారో తెలుసా! ఆయన పేరు పింగళి నాగేంద్రరావుగారు. తాను వ్రాసిన ప్రతి పదమూ సామాన్య ప్రజలకు అందుబాటులో వుంటూ వినోదంతోపాటు సామాజిక స్పృహను కూడా కలిగించాలని ఆశించిన గొప్ప ప్రజాకవి.

ఇప్పుడు ఈ పాటను నేర్చుకుందామా!

ఓ రెండువారాల క్రితం మీరంతా ఇష్టపడే కళ్యాణి రాగంలో చేసిన పాటను గురించి చెప్పుకున్నాం గుర్తుందా... 'పెళ్ళిచేసుకుని ఇల్లుచూసుకుని'.... ఆ! అదే.. కర్నాటక సంగీతంలో చాలా సుప్రసిధ్ధమైన రాగం కళ్యాణి యని, దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారని, ఇది 65వ మేళకర్తయని చెప్పుకున్నాము. ఈ 65వ మేళకర్త యైన కళ్యాణికి చాలా జన్యరాగాలు వున్నాయి. అందులో సారంగ రాగం ఒకటి. సారంగ భక్తి, శృంగార రస భావాల ప్రకటన కు అనువైన రాగం.

హిందుస్థానీ సంగీతంలో కూడా సారంగ్ అనే రాగం వుంది అయితే దానికి కర్ణాటక సారంగకు సంబంధం లేదు. సారంగ రాగ ఆరోహణఅవరోహణా క్రమం రెండు విధాలుగా ప్రచారంలో వుంది. ఆ శాస్త్ర వివరాలు కాలక్రమేణా నేర్చుకుందాము. ఈ సారంగ రాగంలో త్యాగయ్య, దీక్షితర్ ల కృతులు అనేకం ప్రచారం లో వున్నాయి.

ఇప్పుడు, పింగళి వారి 'విజ్ఞాన దీపమును' పాటను సారంగ రాగంలో పాడి వినిపిస్తాను.... మీరు కూడా అలాగే నాతో కలసి పాడండి.

ఇదే పాట కొన్నేళ్ళ క్రితం నా ఊహల్లో మరోలా వుండేది .... కొంతమంది స్త్రీ పురుష గంధర్వులు ఆకాశంలో మేఘాలలో విహరిస్తూంటారు. వారు భూలోకవాసులను ఉద్దేశించి ఈ గీతాన్ని ఆలపిస్తూ తమ చేతులలోని

ప్రకాశవంతమైన జ్ఞానదీపికలను నలుదెసలా ప్రసరింపజేస్తూ అదృశ్యమైపోతారు. ఇదో రకమైన ఊహాచిత్రం. ఈ పాటను ఎవరైనా ఎలాగైనా ఊహించుకోవచ్చు. కారణంఈ పాటకు దృశ్యరూపం లేదు.  అలాటి ఒక చిత్రగీతమే నేటి ఘంటసాల సజీవరాగం.

ఆ వివరాలు తెలియాలంటే మనం డెభ్భైరెండేళ్ళ గతానికి వెళ్ళి  విజయా నాగిరెడ్డి-చక్రపాణి ల అద్భుత భారీ జానపద చిత్రం  'చంద్రహారంను చూడాలి. ఘంటసాలగారి మధురాతిమధుర సంగీతంఊహాలోకాల్లో విహరింపజేసే గోఖలేగారి కళాచాతుర్యం, మార్కస్ బార్ట్లీ ఛాయాగ్రహణం, ఎన్.టి.ఆర్., సావిత్రి ల అపురూప సౌందర్యం, విభిన్న పాత్రలలో ఎస్.వి.రంగారావు, రేలంగి నటనా ప్రాభవం  చంద్రహారానికి జీవం.

చంద్రహారం సినిమా టైటిల్స్ మీద అత్యంత శ్రవణానందకరంగా వినపడే 'విజ్ఞానదీపమును వెలిగించరారయ్యా..' అనే గీతమే ఈనాటి సజీవరాగం. ఘంటసాలగారు ఈ పాటను సారంగ రాగంలో స్వరపర్చి గానం చేశారు. ఈ పాట శ్రోతలలో మానసికానందాన్ని కలిగిస్తూ, భక్తిభావాన్ని, తాత్త్విక చింతనను మేల్కొలుపుతుంది.

ఈ పాటలోని సాహిత్యం, భావం ఎంతోఉదాత్తమైనది. ఘంటసాల, ఎ.పి.కోమల, బృందం పాడిన ఈ పాట గంటానినాదం, త్రిస్థాయిలలో ఓంకార స్వరం, పియోనాడ్రమ్స్ ల లయతో ప్రారంభమై ఒక  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పాట మధ్యలో  అక్కడక్కడ వినపడే వయొలిన్ బిట్స్ (తీగెలను కమాన్ తో కాక వ్రేళ్ళతో మీటితే ఆ రకమైన ధ్వని వస్తుంది. వేరే సినిమా పాట రికార్డింగ్ లో విన్నాను. అలాటి నోట్స్ ను ఆర్కెష్ట్రాలోని వైయొలినిస్టులు ఏదో పేరుతో అనేవారు. ఆ మాట ఇప్పుడు గుర్తుకు రావడంలేదు).

ఈ పాట సినిమా టైటిల్స్  గీతం లతల చిత్రాలతో కూడిన మండపం, మధ్యన వేలాడుతున్న పెద్ద దీపపు సెమ్మె  నేపథ్యంగా తీసుకుని  వినిపించారు.  అక్కడ మరే దృశ్యరూపం కనపడదు.  నా వరకుఒక సంగీతం గురువుగారు ప్రశాంతమైన వాతావరణంలో తమ శిష్యురాళ్ళకు ఈ పాటను నేర్పుతున్న అనుభూతిని కలిగిస్తుంది. కారణంబహుశా, నేను పుట్టిపెరిగిన సంగీత వాతావరణం కావచ్చు.

నాకు ఎనిమిదేళ్ళ వయసులో విజయనగరంలో మాతాతగారింట్లో వుండేప్పుడు ఆయన శిష్యుడైన ఘంటసాల సంగీతం సమకూర్చి పాటలు పాడిన ఈ చంద్రహారం సినిమా విడుదలయింది (విజయనగరం కృష్ణా టాకీస్ అని జ్ఞాపకం). విజయావారి సినిమాలంటే మొదటినుంచి ప్రేక్షకులకు ఒక ఉత్సాహం, ఉత్కంఠ ఉండేవి.  విజయావారి సినిమా పబ్లిసిటీ కూడా వినూత్నంగా,భారీగానే వుండేది. సొంత ప్రెస్ (బి.ఎన్.కె. ప్రెస్) చేతిలో వుండడంవలన నాణ్యమైన రంగురంగుల పోస్టర్లు, పాంప్లెట్స్ తో చంద్రహారం సినిమా పబ్లిసిటీ చాలా ఘనంగానే జరిగింది.  సినిమా రిలీజ్ కు ముందు మామూలుగా వచ్చే పోస్టర్ల తడకలు కట్టిన  జట్కాబళ్ళుసైకిల్ రిక్షాలే కాకమధ్య మధ్య స్పెషల్ గా విజయవాడ డిస్ట్రిబ్యూటర్ ల వాళ్ళు పంపే రంగురంగు దీపాల ఎడ్వర్టైజ్మెంట్ వ్యాన్ లు కూడా మా విజయనగరం వీధుల్లో దర్శనమిచ్చాయి. సాధారణంగా సైకిల్ రిక్షా, జట్కాబండి పబ్లిసిటీకి మాత్రమే అలవాటుపడిన మా సుబ్రహ్మణ్యం పేట గెడ్డవీధివారికి విజయావారి రంగుల పోస్టర్ వ్యాన్ కూడా ఒక రాత్రి వేళ రావడం  మహదానందం కలిగించింది. మిగతా పిల్లలతోపాటూ నేను కూడా ఆ వ్యాన్ వెనకాల కొంత దూరం పరిగెత్తి అతికష్టం మీద ఎ4 సైజ్ లో వున్న రంగురంగుల గ్లేజ్డ్ పాంప్లెట్ ను సంపాదించడం ఆ వయసులో ఓ గొప్ప ఘనకార్యం.

ఎన్.టి.ఆర్., ఎస్విరంగారావు, సావిత్రి, శ్రీరంజని ముఖాలతో వున్న ఆ రంగుల పేపర్ ను నా రైటింగ్ పాడ్ కు అంటించి అపురూపంగా చూసుకునేవాడిని. ఆ రైటింగ్ పాడ్ మా విజయనగరం ఇంటిలో చాలా ఏళ్ళే వుండేది.

ఎన్.టి.ఆర్.ఎస్విరంగారావుసావిత్రిశ్రీరంజని ముఖాలతో వున్న ఆ పింకు, బ్లూ రంగులలో పల్చటి పేపర్ ను నా రైటింగ్ పాడ్ కు అంటించి అపురూపంగా చూసుకునేవాడిని. ఆ రైటింగ్ పాడ్ మా విజయనగరం ఇంటిలో చాలా ఏళ్ళే వుండేది.

ఈ చంద్రహారం సినిమాకు ముందు వచ్చిన విజయావారి 'పాతాళభైరవిసినిమా చంద్రహారం సినిమా పట్ల భారీ అంచనాలకు తావు ఇచ్చింది. నా ఉద్దేశంలో అదే చంద్రహారం కొంపముంచింది. అత్యంత విజయం పొందిన విజయావారి పాతాళభైరవి తర్వాత ఆ సంస్థ నుండి వస్తున్న సినిమా అనగానే  సామాన్య ప్రేక్షకులు ఎంతో ఊహించారు. 'పాతాళభైరవి' లో లాగే ఎస్విరంగారావు మాయలు, తంత్రాలుఎన్.టి.ఆర్. కత్తియుధ్ధాలు, సాహసకృత్యాలు, ఇతర వినోదాలు పుష్కలంగా వుంటాయనుకున్నారు. దానికి తగ్గట్టుగా  తెలుగు తమిళ భాషలలో భారీగా నిర్మించిన చంద్రహారం ఒక్క తెలుగులోనే నలభై కేంద్రాలలో విడుదలచేశారు. చంద్రహారంలో పాతాళభైరవి లెవెల్ లో  ఏ థ్రిల్స్ కనపడకపోవడంతో B ,C సెంటర్ ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా ఫెయిల్ అనే టాక్ మొదటి మూడు ఆటల్లోనే ప్రచారమయింది. పాతాళభైరవిలోని ఎన్.టి.ఆర్., ఎస్.వి.రంగారావుల రాజసతామస గుణాలుకు పూర్తి విరుధ్ధంగా చంద్రహారం సినిమాలోని  చందనరాజు ఎన్.టి.ఆర్., మాలీ ఎస్.వి.రంగారావుల సాత్విక లక్షణాలను subtle expressions ను మామూలు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. సాధారణంగానే రాజసగుణాలు గలవారి పట్ల ఉండే ఆకర్షణ, మోజు సాత్విక గుణాలు వున్నవారిపట్ల వుండదు. ఏ సినిమా లోనూ కనిపించనంత అందంగా ఎన్.టి.ఆర్. అందరి మనసులను దోచుకున్నా పది రీళ్ళకు పైగా unconscious stage లో inactive గా వుంటే (చంచల (సావిత్రి) శాపమే అనుకోండి) ఎవరికి నచ్చుతుంది.

పింగళివారి పంచ్ లు పేల్చాల్సిన ఎస్.వి.రంగారావు  పరమ సీరియస్ గా నాగయ్యగారిలా సాత్వికంగా కనిపిస్తే ఎలా? నవ్వులు పండించవలసిన రేలంగి విలన్ కావడం, గయ్యాళి సూర్యకాంతం సాఫ్ట్ సిస్టర్ రోల్, వ్యాంప్ చంచల సావిత్రిలో వుండే గ్లామర్ హీరోయిన్ శ్రీరంజనిలో ప్రేక్షకులకు కనపడకపోవడమూ  మైనస్ పాయింట్లే. ఇవేవీ సగటు ప్రేక్షకులకు నచ్చలేదు.  విశేషం ఏమంటే, డైరెక్టర్ గా కమలాకర కామేశ్వరరావు గారికి చంద్రహారం మొదటి సినీమా. కె.వి.రెడ్డిగారి సహాయకుడిగా అనుభవం గల ఆయన డైరక్షన్ కు సోషల్ కామెడీ సినిమా ల స్పెషలిస్టు ఎల్.వి.ప్రసాద్ గారిని పర్యవేక్షకుడిగా ఎందుకు పెట్టవలసివచ్చిందో ఏమైతేనేం.. డైరెక్టర్ గారి మొదటి సినిమా యే హాంఫట్. ఆ దెబ్బతో కామేశ్వరరావు గారు  మళ్ళీ ఓ ఎనిమిదేళ్ళపాటు  గుండమ్మకథ సినిమా వరకూ విజయాలో అడుగుపెట్టలేదు. 1954 నాటి భారీనష్టాన్ని గుండమ్మకధ సిల్వర్ జూబ్లీతో కొంతవరకు compensate చేశారు కమలాకర. ఈ జయాపజయాలన్నిటి వెనుక చక్రపాణి గారి హస్తం తప్పనిసరి. 72 ఏళ్ళ క్రితమే 25 లక్షల  ఖర్చుతో నిర్మించబడి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన భారీ జానపదచిత్రం 'చంద్రహారం' . కళ్ళుమిరుమిట్లుగొలిపే గోఖలేగారి  భారీ సెట్ల కళానైపుణ్యం, మార్కస్ బార్ట్లీ గారి కెమేరా పనితనం అన్నీ బూడిదలో పొసిన పన్నీరయింది. ఇంత హెవీ లాస్ ను విజయా సంస్థ కనుక తట్టుకుని నిలబడి వరుస చిత్రాలను నిర్మించగలిగింది.  రామారావు పది రీళ్ళకు పైగా నిద్రపోతుంటే సినిమా ఫ్లాప్ కాక మరేటవుద్ది అని చక్రపాణి గారు తనమీద తానే కామెంట్ చేసుకున్నారట.

వ్యాపారరీత్యా నిర్మాత లకు నష్టం తెచ్చినా  గొప్ప సాంకేతిక వీలువలు కలిగిన ఉత్తమ కళాఖండం 'చంద్రహారం'. ఘంటసాలగారి సంగీతం, గోఖలేగారి ఆర్ట్ విభాగం, బార్ట్లీ కెమేరా, నటీనటుల హృద్యమైన నటన చంద్రహారానికి ఎప్పటికీ పెద్ద ఎసట్.

చంద్రహారానికి ఘంటసాలగారు సమకూర్చిన సంగీతం ఎన్ని తరాలకైనా నిత్యనూతనమే, ఆపాత మధురమే. ఘంటసాల, లీల, మాధవపెద్ది, పిఠాపురం, కోమల, రాణి , లలిత, పద్మావతిలు ఆలపించిన 13 గీతాలు చంద్రహారపు ఆణిముత్యాలుగా భాసిల్లుతూనేవుంటాయి.


కొసమెరుపు -

రెండు మూడు లక్షలతో తీసిన 'పరోపకారం' ఫెయిల్, పాతిక లక్షల భారీ చంద్రహారం ఫెయిల్. ప్రేక్షకులకు ఎప్పుడు ఏది నచ్చుతుందో ఆ బ్రహ్మకే తెలియదు.

వచ్చేవారం  ఘంటసాలవారి  మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 12 - సరసుడ దరిచేరరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...