అధ్యాయం - 2 - భాగం 17
సారంగధర - ఓ నా రాజా... ఇటు చూడవోయీ
'అమ్మాయి తంజావూరు తమిళం... అబ్బాయి రాజమండ్రి తెలుగు...' అంటే లౌవ్ మ్యారేజి అన్నమాట..., అదేం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే... పెళ్ళి తంజావూరు, రిసెప్షన్ రాజమండ్రి. రెండు పక్కలవారు బాగా కావలసినవాళ్ళే.'
'ఎక్కడి రాజమండ్రి, ఎక్కడి తంజావూరు! ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో కదా! సాంస్కృతిక సమైక్యత అంటే ఇదే. రాజమహేంద్రవరం(రాజమండ్రి), తంజావూరుల సత్సంబంధం అనగానే హిందూదేశ చరిత్ర పట్ల ఆసక్తికలవారికి వేయి సంవత్సరాల క్రితం నాటి దక్షిణ భారత తూర్పు చాళుక్య, చోళ సామ్రాజ్యాల వైభవం, కళాప్రాభవం గుర్తుకు రాకతప్పదు.
పదవ శతాబ్దంలో గోదావరి పరివాహిక ప్రాంతమైన వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య మహారాజు విమలాదిత్యుడు. ఆయన భార్య కుందవై. వీరి కుమారుడు రాజరాజ నరేంద్రుడు. ఇతని తల్లియైన కుందవై తంజావూరు కేంద్రంగా సువిశాల దక్షిణాది ప్రాంతాలను పరిపాలించిన మొదటి రాజరాజచోళుడి కుమార్తె. రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతని కుమార్తె అమ్మంగాదేవి చాళుక్య ప్రభువైన రాజరాజ నరేందుని భార్య.ఈ దంపతుల కుమారుడు రాజేంద్ర చాళుక్యుడు. ఈయన చోళరాజులైన రాజేంద్ర చోళుడు, వీరరాజేంద్ర చోళుడు, ఆ తర్వాత వచ్చిన అధిరాజేంద్రుని మరణానంతరం 1070 లో చోళ సింహాసనాన్ని అధిష్టించి కులోత్తుంగ చోళునిగా పేరు మార్చుకున్నాడు. గోదావరి ప్రాంత వేంగి రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో విలీనం చేసి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. శ్రీలంక, దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతాల వరకు చోళ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
ఈ విధంగా ఈ రెండు రాజ్యాలు దక్షిణభారతాన్ని కొన్ని శతాబ్దాల కాలం నిరాటంకంగా పరిపాలించాయి. ఈ కాలంలోనే దక్షిణాదిన దేవాలయ సంస్కృతి, సంగీత, సాహిత్య, నృత్య, శిల్పాది లలితకళలు అమితంగా పోషించబడి సాంస్కృతిక నిలయంగా పరిఢవిల్లింది.
తర్వాతి కాలంలో ఈ చరిత్రల ఆధారంగా వెలువడిన గురజాడ అప్పారావుగారి 'సారంగధర'( ఇంగ్లీషు, తెలుగు), కల్కి కృష్ణమూర్తిగారి ('పొన్నియిన్ శెల్వన్' - తమిళం), వీటి ఆధారంగా రూపొందించబడిన 'సారంగధర', 'రాజరాజ చోళన్', మణిరత్నంగారి 'పొన్నియిన్ శెల్వన్' తెలుగు, తమిళచిత్ర కళాఖండాలు వరసగా మన కళ్ళముందు మెదులుతాయి.
11వ శతాబ్దపు 'సారంగధర' చరిత్ర ఒక కాల్పనిక చారిత్రక గాధ. కాదు నిజంగానే జరిగిందని కొందరి నమ్మిక. అందుకు రాజమహేంద్రవరం (రాజమండ్రి) లోని సారంగధర మెట్ట, చిత్రాంగి, రత్నాంగి మేడలే నిదర్శనమని చెపుతారు. గురజాడ అప్పారావుగారు వ్రాసిన సారంగధర చరిత్ర పద్య నాటకం తెలుగు, ఇంగ్లీషు భాషలలో దేశవ్యాప్తంగా ప్రదర్శించబడి మిక్కిలి ప్రసిధ్ది పొందింది.
ఈ పద్య నాటకం ఆధారంగా సారంగధర చరిత్రను మూడుసార్లు సినిమా గా తీశారు. 1930 లో వై.వి.రావు మూకీ చిత్రం, 1937 లో బందాకనకలింగేశ్వరరావు సారంగధరుడిగా, శాంతకుమారి చిత్రాంగిగా, కన్నాంబ రత్నాంగిగా పి పుల్లయ్య దర్శకత్వంలో, మరల 1957 లో ఎన్.టి.రామారావు సారంగధరుడిగా, పి.భానుమతి చిత్రాంగిగా నిర్మించారు. ఇదే సినిమాను తమిళంలో కూడా శివాజీ గణేశన్ హీరోగా తీసి 1958 లో విడుదల చేశారు. తెలుగులో నటించిన భానుమతి, ఎస్.వి.రంగారావు, రాజసులోచన, శాంతకుమారి తమిళంలో కూడా నటించగా, నంబియార్ వంటి మరికొందరు తమిళ నటులు తమిళంలో నటించారు. తమిళం సినిమాకు జి.రామనాథన్, తెలుగులో ఘంటసాల సంగీతం నిర్వహించారు. ఎవరి బాణీలు వారివే. తెలుగు, తమిళ గీతాలు వేర్వేరు వరసలలో కూర్చబడ్డాయి.
ఘంటసాలవారి బాణీలో చిత్రాంగి భానుమతి అద్భుతంగా ఆలపించిన ఒక మధురాతి మధుర గీతమే నేటి మన సజీవరాగం.
విశేషాలులోకీ వెళ్ళేముందు ఆ పాట సన్నివేశ పూర్వాపరాలు చూద్దాము.
సారంగధర కథలో ప్రధాన పాత్రయైన చిత్రాంగి అందచందాలు వాటివెనుక దాగిన తీవ్రమైన ఆమె గుణాతిశయాల విషయంలో సకలశాస్త్ర పారంగతుడు, రాజగురువు, ఆదికవియైన నన్నయభట్టు చేసిన హితోపదేశాలు పెడచెవినబెట్టి, కుమారుడు సారంగధరుడికి చిత్రాంగిని వివాహం చేసుకోవడం ఇష్టంలేదని తెలిసిన తర్వాత వియ్యమందకపోతే కయ్యం తప్పదన్న నిర్బంధం ఒకప్రక్క, చిత్రాంగి అందచందాల వ్యామోహం మరోప్రక్క వేంగిచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ప్రలోభాలకు గురిచేసింది. దుష్టుడైన ఒక సేనాపతి కుయుక్తితో వంశాచారం పేరుతో కత్తికి బాసికం కట్టించి ఆమెను మోసగించి వివాహమాడతాడు.
రాజగురువు ముందుగానే ఊహించి చెప్పినట్లు చిత్రాంగి రాకతో, ఆమెలో రగిలిన పగ విద్వేషాల కారణంగా ఎన్నో అనర్ధాలు జరిగి వంశనాశనం జరుగుతుంది. సినిమాలో కథను విషాదాంతం చేయడం ఇష్టంలేక చనిపోయిన సారంగధరుని ఒక సిద్ధుని దయవలన మరల బ్రతికించినట్లు చూపించారని ఒక అభిప్రాయం వుంది.
ఇక మన సజీవరాగం విషయానికి వద్దాము.
తాను మెచ్చిన యువకుడి (సారంగధరుడు) నే తన తండ్రికూడా తనకు వరుడిగా నిర్ణయించాడని తెలిసి చిత్రాంగి( భానుమతి) మహదానందంతో అతని చిత్రపటం చూస్తూ పాడిన పాట ... ఓ నా రాజా! ఇటు చూడవోయీ... చిత్రాంగి - భానుమతి - గానం, ఘంటసాల సంగీతం, సముద్రాల సీ. గీత రచన
ఓ నా రాజా... ఇటు చూడవోయీ
నేనోయ్... భీతి
వలదోయీ ! ఓ నా రాజా
అలిగిపోతివి అలనాడు
ఔనా నేడేది నీకు
దారి ! ఓ నా రాజా!
కోరి తమి మీరి
దరిజేరనా
మురిసి నీ మ్రోల
కరిగిపోనా
వేసీ కూరిమి చెరలోనా
ఆ...
కొసరి నా దాసు
జేసుకోనా
! ఓ నా రాజా !
చిత్రాంగి చిన్నెలు అనే నానుడి వుంది. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్యులవారు ఉపయోగించిన - 'నేనోయ్', 'భీతి వలదోయీ', ' నేడేది నీకు దారి', కూరిమి చెర', 'కొసరి నా దాసు చేసుకోనా' అనే పదాలు చిత్రాంగి యొక్క అభిజాత్యం , మనోప్రవృత్తి స్పష్టం చేస్తాయి. ఈ సన్నివేశానికి ముందు వచ్చే సన్నివేశంలో సారంగధరుడు, అతని ప్రేయసి కనకాంగి ల మధ్య 'అన్నానా! భామిని ఏమని' అనే యుగళగీతం సాగుతుంది. అందులో కనకాంగి 'నిన్నే నమ్ముకున్నానని నీవే నా దైవమని' అనే భావాన్ని ప్రకటించడంలో ఆమె యొక్క వినయవిధేయతలు ప్రియుడిపట్ల గల ఆరాధనాభావం వెల్లడవుతోంది.
ఈ రెండు పాటల ద్వారా చిత్రాంగి, కనకాంగి పాత్రల గుణగణాలను, తీరుతెన్నులను ఆచార్యులవారు చక్కగా తెలియజెప్పారు. సంగీతదర్శకుడిగా ఘంటసాలగారు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతిగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం 'సారంగధర'. భానుమతి గారు నటించిన 'పుణ్యవతి'కి కూడా ఘంటసాలగారే సంగీతదర్శకుడైనా ఆ సినిమా లో భానుమతిగారు పాడిన పాటలు లేవు. విశేషమే.
సారంగధర చిత్రం లో భానుమతిగారు నాలుగు పాటలు పాడారు. డ్యూయెట్లు లేవు. ఘంటసాలగారితో కలసి కొన్ని సంవాద పద్యాలు వున్నాయి. భానుమతి , ఘంటసాలగార్ల మధ్య మనస్పర్ధలున్నాయని ఆ కారణంగా సారంగధర లోని భానుమతి గారి పాటలను వేరొకరిచేత చేయించారనే అపోహ ప్రచారమయింది. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజంలేదని సారంగధర సినిమాలోని భానుమతిగారి పాటలను ఘంటసాలగారే పూర్తిగా స్వరపర్చారని, ఆయనే స్వయంగా భానుమతిగారి చేత ఆ పాటల రిహార్సల్స్ చేయించి రికార్డింగ్స్ జరిపించారని సారంగధర సినీమాకు పనిచేసిన ఘంటసాలగారి సహాయకుడు సంగీత దర్శకుడు పి.సంగీతరావుగారు స్పష్టం చేశారు.
ఆపారమైన శాస్త్రీయ సంగీతానుభవం గల ఘంటసాల మాస్టారు 'ఓ నా రాజా.... ఇటు చూడవోయీ' పాటను 'యమన్' అనే హిందుస్థానీ రాగంలో స్వరపర్చి తనకు కావలసిన రీతిలో భానుమతి గారిచేత అద్భుతంగా పాడించారు. హిందుస్థానీ 'యమన్' రాగాన్నే మన కర్ణాటక సంగీతంలో 'కళ్యాణి' అంటారు. కళ్యాణి రాగంలో ఘంటసాల మాస్టారు చేసిన పాటలు, ఇతరులకోసం పాడిన పాటలు జగత్ప్రసిధ్ధి పొందిన విషయం సంగీతాభిమానులందరికీ తెలిసినదే.
భానుమతి గారి గళంలోని, శ్రావ్యత, రాగభావాలు, పాత్రోచిత అభినయం 'ఓ నా రాజా.. ఇటు చూడవోయీ...' పాటకు వన్నె తెచ్చి సజీవరాగం చేశాయి. పాటలోని గమకాలలో ఆలాపనలో, భావప్రకటనలో ఘంటసాలగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ పాటలో వీణ, పియానో, గిటార్, మేండొలిన్, వయొలిన్స్ , ఫ్లూట్, క్లారినెట్, తబలా, ఇతర రిథిమ్స్ భానుమతిగారి పాటకు దీటుగా అమరాయి.
సముద్రాల సీనియర్ గారి పాత్రోచిత సంభాషణలు, పాటలు సారంగధర చిత్రానికి నిండుదనాన్ని, గౌరవాన్ని తెచ్చాయి. సందర్భానుసారంగా ఉపయోగించిన నన్నయభట్టు ఆంధ్రమహాభారత పద్యాలు, చేమకూర వెంకటకవి సారంగధర నాటక పద్యాలు ఈ సినిమాకు వన్నె తెచ్చాయి. సారంగధర సినిమాలో మొత్తం 22 పాటలు, పద్యాలు వున్నాయి. వాటన్నింటినీ ఘంటసాల, భానుమతి, పి.లీల, జిక్కి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత మొదలగువారు పాడారు.
సారంగధర చిత్రంలోని నటీనటులంతా హేమాహేమీలే ... ఎస్.వి.రంగారావు (రాజరాజనరేంద్రుడు), ఎన్.టి.రామారావు (సారంగధరుడు), భానుమతి (చిత్రాంగి), రత్నాంగి (శాంతకుమారి), రాజసులోచన (కనకాంగి), గుమ్మడి (సింగన మంత్రి), ముక్కామల ( దుష్ట సేనాపతి), మిక్కిలినేని (నన్నయభట్టు), చలం (సుబుధ్ధి), ఎ.వి.సుబ్బారావు (చిత్రాంగి తండ్రి), రేలంగి, సురభి బాలసరస్వతి ( చిత్రాంగి చెలికత్తె) అందరూ తమ తమ పాత్రలలో పూర్తిగా లీనమైపోయి నటించారు. తెలుగు, తమిళ భాషా చిత్రానికి వి.ఎస్.రాఘవన్, కె.ఎస్.రామచంద్రరావులు దర్శకత్వం వహించగా మినర్వా పిక్చర్స్ బ్యానర్ మీద టి నామదేవ రెడ్డియార్ సారంగధర చిత్రాన్ని నిర్మించారు.
సారంగధర సినిమా మా కుటుంబానికి ఎప్పటికి మరుపురాని, మరువలేని మధుర జ్ఞాపకం. 1957 ఏప్రిల్ లో మా తాతగారు, ఘంటసాలవారికి గురుదేవులైన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం లో కాలధర్మం చెందారు. గురువుగారి స్మృతికి చిహ్నంగా ఘంటసాలగారు గురువుగారి 'లలితే సరసగాన కళాశ్రితే' అనే కీర్తనను సారంగధర సినిమా టైటిల్ మ్యూజిక్ గా మలచి గురువుగారి పట్ల తనకు గల శ్రధ్ధాభక్తులను చాటుకున్నారు.
కొసమెరుపు -
ఇప్పుడు చెన్నైలో
వున్న తేనాంపేట మెట్రో రైల్వే స్టేషన్
వెనక వేపు రేవతీ స్టూడియో ఉండేది. దానిని మౌంట్ రోడ్ రేవతి అనేవారు. ఆ రేవతీ
స్టూడియోలోనే 'సారంగధర' సినిమా పాటల రికార్డింగ్, రీ-రికార్డింగ్ జరిగింది. సౌండ్ ఇంజనీర్ కణ్ణన్ అనే గుర్తు. చాలా భాగం రీరికార్డింగ్ లకు నేనూ వెళ్ళేవాడిని . వరసగా ఓ మూడు రోజులపాటు 2-9 కాల్షీట్ లో ఆ సినిమా రీ-రికార్డింగ్ జరిగిన గుర్తు.
రీరికార్డింగ్ సమయంలో సౌండ్ లేకుండా సినిమా చూస్తూ డైలాగ్స్ పోర్షన్ మీద ఆర్కెష్ట్రా మ్యూజిక్ పోస్ట్ చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం ఆరు-ఏడు గంటల మధ్య టీ బ్రేక్. ఆ సమయంలో ఆరుబయట లాన్స్ లో అందరూ ఆ సినిమా కంపెనీవారు ఇచ్చే కాఫీ టిఫిన్లు ఆరగించి, సిగరెట్లు కాలుస్తూ లోకాభిరామాయణం చేసేవారు. ఒకరోజు అలాటి సమయంలో తూర్పు ఆకాశంలో దూరంగా మిణుకుమిణుకుమంటూ ఏవో పయనించడం కనిపించింది. ఆ చీకట్లో ఆకారాలేవీ కనపడలేదు. అవి కాంటినెంటల్ సూపర్ జెట్స్ అని కొందరు, కాదు ఎయిర్ బెలూన్స్ అని, అదేం కాదు పేపర్లలో కూడా వచ్చింది అవి ఫ్లైయింగ్ సాసర్సే అని వాటిలో ఇతర గ్రహవాసులుంటారని వాళ్ళవల్ల మన భూమికి నాశనం ఏర్పడుతుందని, ఇలా రకరకాలుగా చర్చించుకోవడం మొదలెట్టారు. ఇంతలో వీళ్ళ చర్చలకు బ్రేక్ ఇస్తూ నెక్స్ట్ సీన్ రీరికార్డింగ్ కు మాస్టారి పిలుపురావడంతో ఆర్కెష్ట్రా అంతా ధియేటర్లోకి పరుగెత్తారు. ఆ తర్వాత ఆ కాంతి గ్రహాల గురించి పట్టించుకున్నవాళ్ళే లేరు.
వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్
