Saturday, 4 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 22 - రాగాలా సరాగాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 22

శాంతినివాసం - రాగాలా సరాగాలా

నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలకు భారతీయ సనాతనధర్మం ఆదర్శప్రాయంమార్గదర్శి. ప్రాచీన సంస్కృత నీతి శాస్త్ర గ్రంధాలలో ఆదర్శ గృహిణి యొక్క ఆరు  లక్షణాలను, ధర్మాలను ఇలా ఈ శ్లోక రూపంలో బోధించారు:

 

"కార్యేషు దాసి కరణేషు మంత్రీ

భోజ్యేషు మాతా శయనేషు రంభా

రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ

షట్ ధర్మయుక్తా కులధర్మపత్నీ"

అంటే ... ఒక ఆదర్శనీయమైన గృహిణి - 

తన దైనందిక ఇంటిపనులను నడుమువంచి పనిమనిషిలా శ్రధ్ధగా చేస్తుంది.  

. భర్త కార్యకలాపాలలో సమస్యలెదురైతే  తన తెలివితేటలు ఉపయోగించి ఒక మంత్రిలా చక్కటి సలహాలు, సన్మార్గాలు సూచిస్తుంది.

. భోజన సమయంలో కుటుంబంలోని వారందరికీ ప్రేమానురాగాలతో ఒక మాతృమూర్తిగా కడుపునిండా తినిపిస్తుంది.

. విశ్రాంతి సమయంలో పడకగదిలో అప్సరసలా అలంకరించుకుని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మహాలక్ష్మీ దేవిలా నిరంతరం కళకళలాడుతూ  అందాలరాశిలా వుంటుంది.

సహనానికి మారుపేరైన భూదేవి యంత సహనాన్ని, ఓర్మిని కలిగివుంటుంది.

ఈ ప్రాచీన సంస్కృత శ్లోకాన్ని తులసీదాసు తన రామాయణ కావ్యం అరణ్యకాండలో  అత్రిమహర్షి సతీమణి అనసూయాదేవి సీతాదేవికి ధర్మపత్ని లక్షణాలను ఉపదేశించే  సందర్భంలో ఉపయోగించుకున్నారని చెపుతారు.

అలాగే, సనాతన నీతిశాస్త్రంలో ఉత్తమ భర్త యొక్క ధర్మాలు, కర్తవ్యాలు, బాధ్యతల వివరణ కూడా ఉంది - 

. భర్త భార్యను తనలో సగభాగంగా ఆమె అవసరాలన్నీ తీరుస్తూ, జీవితాంతం ఆమె పోషణ, రక్షణ బాధ్యతలను వహించాలి

. భార్యను ఎట్టి పరిస్థితులలోనూ శారీరకంగా, మానసికంగా హింసించకూడదు.

. భార్య సముచిత సలహాలను, సూచనలను పాటిస్తూ ఆమె ఆలోచనలను గౌరవించాలి.

. భార్యాభర్తలిద్దరూ ఒకరిపట్ల మరొకరు  పరస్పర నమ్మిక కలిగి అనురాగంతో జీవితాన్ని సాగించాలి.

. భర్త పరకాంతా వ్యామోహంలో పడకుండా శ్రీరాముడివలే ఒక్క భామతోనే తన ప్రేమను పంచుకోవాలి.

పతినే  ప్రత్యక్ష దైవంగాభర్త పాదసేవే మహాయోగంగా భావించే స్త్రీలుభార్య సౌభాగ్యాలన్నీ తన భాగ్యమేనని ధర్మనిరతితో ఆమె యెడల ప్రేమానురాగాలు కలిగివుండి సంసారజీవితాన్ని సుఖమయంగా భూలోకస్వర్గముగా  చేసుకునే భర్తలు పురాణకాలంలోనే కాదు ఈ ఆధునిక యుగంలో కూడా వున్నారు.

నిదర్శనం కావాలా!

1960ల నాటి   ఈ సినిమా పాటే...


భార్య: 

'రాగాలా సరాగాలా 

హాసాలా విలాసాలా 

సాగే సంసారం హాయ్

సుఖ జీవనసారం 

                                !రాగాలా!

 

పతి పదసేవయే యోగముగా

నాతికి పతియే దైవముగా !పతి 2!

భర్త: 

సతి సౌభాగ్యాలే  తన భాగ్యమనే

భావనయే పతి ధర్మముగా -2

                                 !రాగాలా!

భార్య: 

మాయని ప్రేమల కాపురమే

మహిలో వెలసిన స్వర్గముగా -2

భర్త: 

జతబాయని కూరిమి జంటగ

మెలిగే దంపతులే ఇల ధన్యులుగా - 2

ఇద్ధరు : 

రాగాలా సరాగాలా

హాసాలా విలాసాలా 

సాగే  సంసారం హా...య్

సుఖజీవనసారం... హా..య్ సుఖజీవన సా...రం


రాగాలను, సరాగాలను మేళవించి ఘంటసాలగారు స్వరపర్చిన ఈ యుగళగీతమే సదా మదిలో మెదిలే సజీవరాగం.

జీవితాంతం సంసారం సుఖజీవనసారంగా సాగిపోతూంటే చూసేవాళ్ళకి ఏ థ్రిల్లు, ఎక్సైట్మెంట్ వుండదనేది సినిమా సిధ్ధాంతం. అందుకోసం కుటుంబ సభ్యుల మధ్య  ఈర్ష్యాసూయలుభార్యాభర్తల మధ్య అపనమ్మిక, అపార్ధాలు, సంసారం అస్తవ్యస్తం కావడం, కష్టాలు, కన్నీళ్ళు , చివరకు తన తప్పిదాన్ని భర్త తెలుసుకుని భార్యను క్షమాపణలు కోరి ఆ ఇరువురు ఒకటవడంతో సుఖాంతం కావడమనే తెలుగు సినిమా ఫార్ములాను నూటికి నూరుపాళ్ళు విజయవంతంగావినోదాత్మకంగా పండించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను, కాసులను పంటను పుష్కలంగా పొందిన సినిమా 1960ల నాటి 'శాంతినివాసం'.

జనరంజకమైన గీతాలతో చిత్రాన్ని ఆద్యంతం  మూడు డాన్సులు ఆరు పాటలుగా వినోదభరితంగా చూపిస్తూనే సనాతన ధర్మసూత్రాలను కథలో అంతర్లీనంగా ప్రవేశపెట్టి ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించారు కధారచయిత జూనియర్ సముద్రాల, దర్శకుడు సిఎస్ రావు.

ఏదో సామెత కోసం ' మూడు డాన్సులు ఆరు పాటలు ' అని అన్నానే తప్ప శాంతినివాసం సినిమాలో ఎనిమిది పాటలు, ఆరు పద్యాలు వున్నాయి. డ్యూయెట్స్ అన్నీ  ఆటా పాటా మిశ్రమమే. ఇవికాక, పూర్తిగా నృత్యగీతం ఒకటి వుంది.  వీటన్నిటినీ కథ, మాటలు సమకూర్చిన సముద్రాల రామానుజాచార్యులుగారే వ్రాశారు.

అసలు శాంతినివాసం సినిమా టైటిల్ మ్యూజిక్కే ఒక పాట. సద్గురు త్యాగరాజస్వామి సామ రాగంలో రచించిన 'శాంతములేక సౌఖ్యము లేదూ...' అనే కీర్తనను   సినిమా నేపథ్యాన్ని ప్రేక్షకులకు తెలియజేసేలా ఘంటసాలగారు సందర్భోచితంగాసింబాలిక్ గా ఉపయోగించారు. సినీమాలోని మొదటి సీనుకు లీడ్ ను ఇస్తూ  ప్రేక్షకులను భక్తి అనుభూతిలోకి ముందుగానే తీసుకువెళ్ళారు ఘంటసాల.

ఈ సినిమా లో ఐదు పాటలు హిందీ బాణీలను అనుసరించి చెసినవే. పద్యాలు, ఒక మూడు పాటలు (కలనైనా నీ తలపే- పి.లీల, శ్రీరఘురాం జయ రఘురాం - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, రాగాలా సరాగాలా - పి. సుశీల-ఘంటసాల) మాత్రం ఘంటసాలగారి సొంత స్వరరచనలు.

అలాటి ఘంటసాలగారి సొంత స్వరకల్పనలోని  'రాగాలా సరాగాలా...గీతమే నేటి మన సజీవరాగం.

భార్యభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు లేకుండా పరస్పర నమ్మికతో చల్లగా కాపురం చేసుకోవాలని, అలాకాకుండా అసూయాపరులు చెప్పే చెప్పుడుమాటలకు లొంగిపోయి భార్య సౌశీల్యాన్ని అనుమానిస్తే ఆ కుటుంబం ఎంత అతలాకుతలం అవుతుందో చాటిచెప్పే కథ 'శాంతినివాసం' కథాపరంగా ఆ ఇంటి పెద్దకొడుకు, కోడలే నాయికా నాయకులు. వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న ఆ ఇద్దరిమధ్యా సాగే ప్రణయ సరాగరాగాలే నేటి మన సజీవరాగం.

పి.సుశీల, ఘంటసాలగారు ఆలపించిన ఈ సుశ్రావ్య యుగళగీతాన్ని శాంతినివాసపు పెద్దకోడలు, పెద్దకొడుకులైన దేవిక, కాంతారావుల మీద వారి పడకగదిలో ముచ్చటగొలిపే విధంగా చిత్రీకరించారు డైరెక్టర్ సి.ఎస్. రావు.

ఒక చిన్న గిటార్ వ్యాంపింగ్, మేండొలిన్ బిట్ మీద సుశీలగారి హమ్మింగ్ తో  హుషారుగా ప్రారంభమయే ఈ పాట బ్యాక్గ్రౌండ్ లో గిటార్, మేండొలిన్, పియోనా, డబుల్ బేస్, సితార్, ఫ్లూట్, క్లారినెట్, వయొలిన్స్, తబలా, తదితర రిథిమ్స్ ను ఘంటసాల ఉపయోగించారు.

ఈ పాటలో కేదార రాగ స్వరాలు వినిపిస్తాయి. కేదారం 29 వ మేళకర్త ధీరశంకరాభరణానికి జన్యరాగం. కేదార రాగ   ఆరోహణాక్రమంలో వక్ర సంచారంతో ఐదు స్వరాలు ( 'రి, '' స్వరాలు వుండవు) అవరోహణలో  ఆరు స్వరాలు ('' వుండదు) వుండడంవలన ఈ రాగాన్ని  వక్ర ఔఢవ- షాఢవ రాగంగా పరిగణిస్తారు.

ఇలాటి హృద్యమైన రాగంలో సుశీల, ఘంటసాలగార్ల వంటి అసమాన్య గాయకులు ఆలపించిన ఈ పాటలో రాగభావా

నుభూతులకు ఏం కొదవ. శ్రోతలను మైమరపించి ఆనందామృతంలో ఓలలాడించారు. మనకు పరభాషా గీతాల అనుసరణేమాత్రం అవసరం లేదని ఈ పాట ద్వారా నిరూపించారు ఘంటసాల.

శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా& టి అశ్వత్థనారాయణ నిర్మించిన ఈ వినోదాత్మక శాంతినివాసం సినిమాలో అక్కినేని, రాజసులోచన, కాంతారావు, దేవిక, కృష్ణకుమారి, రేలంగి, సూర్యకాంతం, సురభి బాలసరస్వతి, రమణారెడ్డి, నాగయ్య, కె.వి.ఎస్.శర్మ, తదితరులు నటించగా సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు.

అత్యంత విజయవంతమైన ఈ శాంతినివాసం చిత్రానికి మూలం పాలగుమ్మి పద్మరాజుగారి 'శాంతినివాసం' నాటకం. ప్రముఖ హాస్య నటుడు బి.పద్మనాభం నాటక సంస్థ రేఖ & మురళీ ఆర్ట్స్ కోసం ఒక తమిళ నాటకం ఆధారంగా వ్రాసిన నాటకం.

వినోదం, సెంటిమెంట్ రెండూ పుష్కలంగా వున్న శాంతినివాసం సినీమా అనేక చోట్ల శతదినోత్సవాలను జరుపుకుంది. ఈ కథ హిందీలో రెండుసార్లు సినిమాగా వచ్చింది. మొదట 'ఘరానా', తర్వాత, 'ఘర్ ఘర్ కి కహానీ'.

శాంతినివాసంలో వున్న తెలుగేతర బాణీలకు అవసరమైన  తెలుగుదనం అద్ది అసలు కన్నా నకలే మిన్న అనిపించారు ఘంటసాల.


కొసమెరుపు :

మైసూర్ బృందావనం గార్డెన్స్ లో ఔట్ డోర్ షూటింగ్. ఎ.ఎన్నా.ఆర్., రాజసులోచన, కెమేరా, టెక్నికల్ యూనిట్ అందరూ మైసూరు వెళ్ళిపోయారు. ఒక డ్యూయెట్ సాంగ్ పిక్చరైజేషన్ మొదలెట్టారు. అటువంటి ఆఖరి నిముషంలో మరొక పాట కూడా అక్కడే షూట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. అర్జంట్ గా 24 గంటల్లో పాట రికార్డు చేసి టేప్ బృదావన్ గార్డెన్స్ కు పంపమని ఒక హిందీ పాట గ్రామఫోన్ రికార్డుతో సహా ఘంటసాలగారికి కబురుచేశారు. వెంటనే రికార్డింగ్ థియేటర్ బుక్ చేసి సింగర్ కు  ఆర్కెష్ట్రా వారికి ఆఘమేఘాలమీద తెలియజేశారు. ఆ మధ్యాహ్నం లోపల సముద్రాల జూనియర్ గారు రావడం హిందీ పాటకు మాటలు ఇవ్వడంఘంటసాలగారు తగిన చేర్పులు మార్పులు చేసి 2 to 9 కాల్షీటులో ఆ పాటను రికార్డు చేసి రాత్రికి రాత్రే ఆ తెలుగు పాటను మైసూర్ బృందావన్ గార్డెన్స్ కు పంపడంతో ఎట్టి అవాంతరాలు లేకుండా అనుకున్న సమయానికి కొత్త పాట షూటింగ్ కూడా జరిగిపోయింది. శాంతినివాసం లో రెండు  హుషారైన డ్యూయెట్లును బృందావన్ గార్డెన్స్ లో అక్కినేని, రాజసులోచనల మీద చిత్రీకరించారు. ఆఖరి నిముషంలో చేసిన ఆ పాట ఏదో ఇప్పుడు జ్ఞాపకం లేదు.

ఇన్స్టెంట్ కాఫీలా తయారు చేయడం కోసమే నిర్మాతలు ఇలాటి హిందీ/తమిళ సినిమా పాటలను   రెడీగా వుంచుకుంటారేమో! 

వచ్చేవారం, మరల, ఘంటసాలగారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 27 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 21 - రేయీ మించెనోయి రాజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 21

శబాష్ రాముడు - రేయీ మించెనోయి రాజా

"ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది." ఇది నిన్నటివరకు చాలామంది నమ్మిన నానుడి. ఈనాడు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నా సనాతన భారతీయ సంస్కృతిలో మాత్రం స్త్రీకి ఉన్నత స్థానమే వుంది. ఈ విశ్వంలోని సమస్త శక్తులు తనలోనే వున్న ఆదిపరాశక్తి స్త్రీరూపిణిగా సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆధారమై ఆరాధించబడుతున్నది. శక్తి అంటే కేవలం ధైర్య, సాహస, వీర, శౌర్య ప్రతాపాలే కాదు.  సాత్వికత, జ్ఞానము, శాంతి, సహనము, తెలివితేటలు, విద్య, వివేకము, విచక్షణ, వంటి లక్షణాలన్నీ శక్తిలో భాగాలే. అటువంటి ఆదిపరాశక్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణార్ధం వివిధయుగాలులో అనేక మూర్తులుగా అవతరించి సమస్తప్రాణులను కాపాడుతున్నది. ఆ దైవమే ఒక మాతృమూర్తిగా, గృహిణిగా,  ఇతరుల ఔన్నత్యాన్ని కాంక్షించే ఒక మంచి స్నేహితురాలిగా జన్మనెత్తి కుటుంబ శ్రేయస్సు,  సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూనేవుంటుంది. మానసికంగా, ఆత్మస్థైర్య రీత్యా స్త్రీ  పురుషుడికంటే చాలా శక్తివంతురాలు. జీవితంలోని కష్టనష్టాలను, ఒడిదుడుకులను తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగేది పురుషుడికంటే స్త్రీ మాత్రమే.   మగవాడి పురోభివృద్ధికి  వివిధ దశలలో అన్నివిధాలా సహకరించి సహాయపడేది తల్లి, భార్య, మంచి స్నేహితురాలు మాత్రమే. ఆ విధంగా ప్రతీ పురుషుడి కృషి, విజయం వెనుక విధిగా  స్త్రీ పాత్ర ఎంతైనా వుంటుంది.

ఈ విషయాన్ని రూఢిపరిచే అలనాటి సినిమా లోని ఒక ఆత్మస్థైర్య ప్రబోధాత్మక  గీతమే నేటి మన సజీవరాగం.

విధి వక్రదృష్టికి బలియైపోయిన ఒక ధనవంతుడు పూవులమ్మినచోటే కట్టెలమ్ముకోవడం ఇష్టంలేక బ్రతుకుతెరువు కోసం తన భార్య, కూతురు, తమ్ముడితో సహా పట్నం చేరుకుని రిక్షావాలాగా కాలం గడుపుతూంటాడు.  తమ్ముడిని బాగా చదివించి ఉన్నతస్థితికి తీసుకురావాలని కలలుకంటూవుంటాడు. అనుకూలవతివివేకము గల అతని భార్య కూడా అతని ఆశయాలు నెరవేరడానికి శాయశక్తులా కృషిచేస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకువస్తూంటుంది. కానీ, ఇక్కడ కూడా అదృష్టం ఆ కుటుంబాన్ని చిన్నచూపే చూసింది. అహర్నిశలు కష్టపడి శ్రమించే ఆ రిక్షావాలా కొంతమంది దుండగుల తుపాకీ గుళ్ళకు కాలికి బలమైన గాయమై ఆస్పత్రి పాలవుతాడు. కదలలేని స్థితి. నిత్యజీవనానికి, తమ్ముడి కాలేజీపరీక్షల ఫీజుకు డబ్బు ఎలా సద్దుబాటు చేయాలో తెలియక రిక్షారాముడి మనసు అల్లకల్లోలమై భవిష్యత్ గురించి  మధనపడుతూ కంటిమీద కునుకు కరువై చింతక్రాంతుడై విచారంలో మునిగివుంటాడు.

అటువంటి దుర్భరపరిస్థితులలో భాధ్యతనెరిగిన  భార్య  అతనికి ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ.....


రేయీ మించేనోయి రాజా

హాయిగ నిదురించరా! రేయీ!

హాయిగ నిదురించరా..

 

వెల్లివిరిసీ వెన్నెల్లు కాసే

చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచే

                                            !వెల్లి!

స్వప్నాలలోనా స్వర్గాలు కంటూ

స్వర్గాలలో దేవగానాలు వింటూ

హాయిగ నీవింక నిదురించవోయి

                                        !రేయీ!

 

చీకటి వెంట వెలుగే రాదా

కష్టసుఖాలు ఇంతేకాదా!చీకటి!

చింతా వంతా నీకేలనోయి

అంతా జయమౌను శాంతించవోయి

హాయిగ నీవింక నిదురించవోయి

                                        !రేయీ! 

అని లాలిస్తూ అతను ప్రశాంతంగా నిదురించడానికి తాపత్రయపడుతోంది.

ఈ అనంతవిశ్వంలో చీకటివెలుగులు ఎంత సహజమో, మనిషిజీవితంలో కష్టాలు, సుఖాలు కూడా అంత సహజం. కష్టాలు వచ్చాయని కుంగిపోకూడదు. నీకు తోడుగా, అండగా నేనుండగా దిగులెందుకు అంతా విజయవంతంగా సాగుతుంది. కలతలు మాని వెల్లివిరిసే ఈ చల్లనివెన్నెలరాత్రిలో చక్కని కలలుకంటూ ఆ కలలో దేవగానాలు వింటూ హాయిగా నిదురపొమ్మని శ్రావ్యంగా గానంచేస్తూ భర్తకు మనశ్శాంతిని కలిగిస్తోంది ఒక ఆదర్శమహిళ.

ఔను! ఘంటసాలవారి హృదయాంతరాళాలనుండి పెల్లుబికి జాలువారిన ఈ సజీవరాగం సినీమా పాటే. 

సుఖవంతమైన సంసారనావకి వివేకవంతురాలైన ఇల్లాలే చుక్కాని అని నిరూపించిన సినిమా. 1959లో విడుదలైన రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'శభాష్ రాముడు' సినిమా.

మంచి కథాంశాలతో,  చక్కటి సాహిత్యం, మంచి సంగీతం కలిగిన పాటలతో  పదిమందికి మంచిని నేర్పి ప్రజలలో చైతన్యం కలిగించాలని నిర్మాతాదర్శకులు భావించే రోజులలో వచ్చిన చిత్రం 'శభాష్ రాముడు'. తాను మాస్ హీరో మాత్రమే కాదు క్లాస్ హీరో కూడానని తన ఉదాత్తమైన నటనతో  తెలుగువారందరిచేతా 'శభాష్ రిక్షారాముడు' అని  జేజేలు కొట్టించుకున్న నందమూరి తారకరామారావు శభాష్ రాముడు సినిమాకు కథానాయకుడు. 

ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెతను సార్థకపరుస్తూ దేవిక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్.కు దీటుగా చక్కగా నటించారు. ఇతర ముఖ్యపాత్రలలో నటించిన రమణమూర్తి, మాలిని, గుమ్మడి, కాంతారావు, రేలంగి, గిరిజ, ఆర్.నాగేశ్వరరావు, కె.వి.ఎస్.శర్మ, ఎ.మ్ఎన్.రాజమ్  చిత్రవిజయానికి ఇతోధికంగా  దోహదం చేశారు.

'శభాష్ రాముడు' సినిమా కు హిందీ మూలం 1957 లో వచ్చిన 'బడేభాయ్' అజిత్, కామినీకౌశల్, కుమ్ కుమ్ ముఖ్యనటులు. కె.అమర్నాథ్ దర్శకనిర్మాత.

సుందర్లాల్ నహతాగారి ఆస్థాన సంగీతదర్శకుడిగా ఘంటసాలగారికి ఈ శభాష్ రాముడు నాలుగవ చిత్రం. ఇందులో వున్న తొమ్మిది పాటలు వైవిధ్యంతో కూడినవే. సందర్భోచితమైన, సన్నివేశానికి బలం చేకూర్చే భావజాలంతో నిండిన ఈ పాటలను కొసరాజుగారు (జయమ్ము నిశ్చయమ్మురా), (ఆశలే అలలాగ ఊగెనే సరదాగా), (వన్నెలు కురిసే చిన్నదిరా), సదాశివబ్రహ్మంగారు (రేయీ మించేనోయి రాజా), (జాబిల్లి వెలుంగులో కాళింది చెంత), (హల్లో డార్లింగ్ మాటాడవా), (ఓ చందమామ ఇటు చూడరా),  శ్రీశ్రీగారు (ఓ దేవా మొరవినవా), (కలకల విరిసీ జగాలే పులకించెనే)  వ్రాయగా వాటిని ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె రాణి, కె.జమునారాణి, సరోజిని, పిఠాపురం, జె.వి.రాఘవులు ఆలపించారు.

సుందర్ లాల్ గారి సినిమాలలో ఎక్కువగా పరభాషా చిత్రగీతాల ఆధారంగా చేసిన పాటలే ఎక్కువగా వుంటాయి. ఘంటసాలగారి స్వయంప్రతిభకు నిదర్శనంగా ఓ రెండో మూడో పాటలు వుంటాయి. అటువంటివాటిలో అత్యుత్తమైన గీతం నేటి మన సజీవరాగం, అదే పి.సుశీలగారు ఆలపించిన సుమధుర, సుస్వరాల హృద్యగీతం 'రేయీ మించేనోయి రాజా' వెంపటి సదాశివబ్రహ్మంగారి రచన. కథా నేపథ్యం స్ఫురింపజేస్తూ రసానుభూతికి తగిన పదజాలంతో ఉన్న ఈ పాటకు  ఘంటసాలగారు అతిశ్రావ్యంగా జోలపాట పధ్ధతిలో వరసను సమకూర్చారు.

సన్నివేశానికి అనుగుణ్యంగా రసభావాలకు, కవి సాహిత్యానికి ప్రాధాన్యతనిస్తూ పాటలను మలచడంలో మేటి ఘంటసాల. కవి సదాశివబ్రహ్మంగారి సందర్భోచిత సాహిత్యానికి తన సంగీత ప్రతిభను జోడించి  మనసులోని రాగభావాలను యథాతథంగా సుశీలగారి కోకిలకంఠం ద్వారా అతిమనోజ్ఞంగా ఈ 'రేయీమించేనోయి రాజా' పాట ద్వారా మనకందించారు ఘంటసాల.

మాట స్పష్టత, శ్రావ్యత, అనుభూతుల ప్రకటన ఘంటసాల, సుశీలగార్ల ప్రత్యేకత. అది ఈ పాటలో అణువణువున కనిపిస్తుంది. లాలిపాటలా వుండే ఈ సందేశాత్మకగీతంలో మనకు శంకరాభరణ రాగ స్వరాలు వినిపిస్తాయి. శంకరాభరణం 29వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. వైవిధ్యం కూడుకున్న అతి ప్రాచీనరాగం శంకరాభరణం. హిందుస్థానీ సంగీతశైలిలో ఈ రాగాన్ని బిలావల్ అంటారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ లేదా లోనియన్ అని అంటారు.  బహుళ ప్రచారం పొందిన బహుభాషా చిత్రగీతాలు అసంఖ్యాకంగా  శంకరాభరణం, తదదీ ఇతర జన్యరాగాలలో వున్నాయి. అందుచేత పాటను అతిశ్రధ్ధగా విని రాగ లక్ష్యలక్షణాలను నిర్దిష్టంగా పరిశీలించి రాగనిర్ణయం చేయవలసివుంటుంది. లేకపోతే ఒక రాగానికి బదులు మరొకరాగంగా పొరపాటు పడే అవకాశం వుంది.   లాలిత్యం ఉట్టిపడే ఈ పాట నేపథ్యసంగీతంలో ఉపయోగించిన సితార్, ఫ్లూట్, వయొలిన్స్, వైబ్రోఫోన్, తబలా, రిథిమ్స్ వంటి వాద్యాలు కూడా మృదువుగా ధ్వనిస్తూ శ్రోతల మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి.

ఈ పాటలో ప్రముఖంగా వినపడే ఫ్లూట్, సితార్, తబలాలు పాట మూడ్ ను ఎంతగానో ఎలివేట్ చేశాయి. గాత్రాన్ననుసరించే వాద్యాలు తప్ప వాద్యాలననుసరించి గాత్రం కాదనేది ఘంటసాలగారి సిధ్ధాంతం. అందువల్లే వారి గీతాలన్నీ సజీవరాగాలై సంగీతాభిమానులను సదా అలరిస్తున్నాయి.

రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్ లాల్ నహతా & టి.అశ్వత్థనారాయణ నిర్మించి శతదినోత్సవాలను చేసుకున్న ఎన్.టి.ఆర్. 'శభాష్ రాముడు' ను తమిళంలోకి కూడా డబ్ చేసి మంచి విజయం సాధించారు.


 

కొసమెరుపు:

'మంచి మనసుకు మంచి రోజులు', 'శభాష్ రాముడు' -  ఈ రెండు సినీమాలను తీసినది రాజశ్రీ సుందర్లాల్ నహతాయే. రెండింటిలో హీరో ఎన్.టి.ఆర్.కాగా ఘంటసాల సంగీతదర్శకుడుసి.ఎస్.రావు డైరెక్టర్. మంచిమనసు మంచి రోజులకు తమిళ మూలం 'తై పిరందాల్ వళి పిరక్కుం'. ఈ సినిమాలో హీరో పాడిన పడవపాట 'ఆశయే అలైపోలేపాట వరసలో  'ఆశలే అలలాగ ఊగెనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగాఅని కొసరాజుగారి చేత ఒక పాట వ్రాయించారు. పాట రికార్డింగ్ కూడా జరిగిందేమోతెలియదు. అయితే ఏ కారణం చేతనో ఆ పాటను 'మంచి మనసుకు మంచి రోజులు సినిమా లో ఆ సన్నివేశంలో పెట్టలేదు. దానికి బదులుగా  జూనియర్ సముద్రాలగారితో 'పొంగారు నడియేటి నదిపైన దోనె అలా అలా ఊరించు పేరాశ ఈ జీవితానా... ఏ తీరమేగేనో సుడిగాలిలోనా ఏనాటికేతీరో బ్రతుకీ జగానాఅనే మరో పాటను వ్రాయగా ఘంటసాలగారు వేరే ట్యూన్ లో చేసి పాడగా హీరో ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించించారు. అయితేసుందర్ లాల్ గారి పరభాషా గీత వ్యామోహంవ్యాపార సరళి వలన మంచి మనసుకు మంచిరోజులు సినిమా కోసం వ్రాయించి ఉపయోగించకుండా వదిలేసిన తమిళ వరస గీతం 'ఆశలే అలలాగ ఊగెనే సరదాగా...పాటను ఘంటసాలగారు పాడగా శభాష్ రాముడు సినిమాలో అదే పడవ ప్రయాణం సన్నివేశానికి ఉపయోగించుకుని రేలంగి మీద చిత్రీకరించారు దర్శకుడు సి.ఎస్.రావు.  సినిమాలలో కూడా తెరవెనుక  ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు.

వచ్చే వారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 22 - రాగాలా సరాగాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...