Saturday, 14 March 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 6 - ఎంత ఘాటు ప్రేమయో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 6


పాతాళభైరవి - ఎంత ఘాటు ప్రేమయో

ఒక సాయంత్రం పార్క్ లోకి వచ్చిన ఓ వృధ్ధదంపతులు  ఒకరికొకరు ఆసరాగా మెల్లగా నడుచుకుపోతున్నారు... 'ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో' అంటూ వేళాకోళంగా ఓ యువజంట వారిని దాటుకుంటూ ముందుకు పోయారు. ఇది నా మనసుకు పట్టలేదు. ఫన్ కి సీరియస్నెస్ కు తేడా తెలియని ఆ వయసులో, ఈ యువజంట చేసిన కామెంట్ కు నా ఒళ్ళుమండింది. ఆనాడు ఇలాటి పేరడీలు కోకొల్లలు. శ్రీరంగం నారాయణబాబు పేరడీ కింగ్. నాకు సాహిత్యంలో ఓనామాలు తెలియకపోయినా  వీళ్ళంతా తెలుగు సాహిత్యాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని తెగ ఫీలయైపోయేవాడిని. 

శ్రీశ్రీ వంటి మహాకవి కూడా పేరడీ ప్రభావానికి లోనై ఘాటుప్రేమను లేటు వయసుకు అన్వయించి ఒక సినిమాలో పాట వ్రాశారు. తదాదిగా మరింతమంది సినీ గేయరచయితలు ఈ ఘాటుప్రేమను  ఉపయోగించి మరింత ఆదాయం పొందారు.  వాళ్ళ తప్పేంలేదు. 'శంఖంలో పోసిందే పవిత్రతీర్థం' అని నమ్మే మనస్తత్త్వం ఉన్నంతకాలం మనకు సెలబ్రిటీస్ చెప్పిందే వేదం, దానికే విలువ, గుర్తింపు, గౌరవం. అప్పటికే ఉన్న అసలు మూలాలను గురించి ఎవరూ పట్టించుకోరు. తలవను కూడా తలవరు.

సరే ఈ విషయం పక్కనపెట్టి అసలు విషయానికి వద్దాము.

'ఘాటు ప్రేమ'..' కన్నుకాటు'... 'తీవ్రవీక్షణం', లేత వలపులో కళలు విరియడం వంటి పదప్రయోగాలతో తెలుగు ప్రజానీకాన్ని తీవ్రంగా బాధపెట్టిన ఆద్య సినీ కవి పింగళి నాగేంద్రరావు గారు. ఇలాటి పదాలు మన తెలుగులో ఎప్పటినుంచో వున్నవే, నేను కొత్తగా కనిపెట్టిందేమీ లేదని పింగళి గారు ఎంత చెప్పినా ఒప్పుకోరే.. కాదు కాదు మీరే నూతన పద సృష్టికర్తలంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆయనను అగ్రాసనంపై కూర్చోపెట్టారు.

గత 75 సంవత్సరాలుగా తెలుగువారందరినీ అంతటి ప్రభావితులను చేసిన 'ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో.....' పాతాళభైరవి' సినిమా లోని ఈ గీతమే ఈనాటి ఘంటసాల సజీవరాగం.

పింగళి రచనకు ఘంటసాల సంగీతం; పి.లీల, ఘంటసాలల యుగళం; తెరపై మాలతి (రాకుమారి-ఇందుమతి), ఎన్.టి.రామారావు (తోటరాముడు) ల అభినయం. ----

రాకుమారి (లీల): 

'ఎంత ఘాటుప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో! ఓ...

                                                            !ఎంత!

కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే..

నా.. మనసు మురిసెనే...

                                                            !ఎంత!

తోటరాముడు(ఘంటసాల):

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ... 

                                                            !ఎంత లేత!

కన్నులలో కనినంతనే  తెలిసిపోయెనే

నా... మనసు నిలిచెనే-2 

                                                            !ఎంత లేత!


రాకుమారి: 

ఈ జాబిలి, ఈ వెన్నెల ఈ మలయానిలమూ-2

విరహములో వివరాలను విప్పి చెప్పెనే

                                                            !ఎంత!


తోటరాముడు:

ఓ జాబిలి... ఓ వెన్నెల.. ఓ మలయానిలమా - 2

ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే

                                                            !ఎంత లేత!

అసలు ప్రేమంటే... చాలామందికి కలిగే సందేహమే. కుల మత భాషా ప్రాంతాలకు, కాలమాన పరిస్థితులకు అతీతమైనది. అవ్యక్తం, అనుభవైకవేద్యం. పరమ పవిత్రం. స్వార్ధరహిత పరస్పరానురాగ బంధం. వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసాల ప్రాతిపదికన  గాఢంగా పెనవేసుకునే జీవితబంధం.  శారీరక సౌందర్యాకర్షణల వలన, ఆస్తిఅంతస్తులు,హోదాల మోజులో కలిగే ప్రేమ తాత్కాలికం. నీతి, నిజాయితీ లేని ప్రేమ అశాశ్వతం. ప్రేమ తత్త్వం సరిగా అర్ధంకానివారికి అదెప్పటికీ బ్రహ్మ పదార్ధమే. 

నిజాయితీ తో కూడిన సున్నితమైన, మధురమైన  అసలు ప్రేమలోని గాఢత్వాన్ని విశదపర్చే క్రమంలో పింగళివారు ప్రయోగించిన  నవ్యపదం 'ఘాటు ప్రేమ'. సున్నితము,లలితము అయిన ప్రేమను  ఈ 'ఘాటు'తప్పక ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ప్రథమ వీక్షణలోనే ప్రేమాంకురం. అది అతి'తీవ్రం'. నాయిక కన్ను ప్రేమకాటు తినడంతో విరిసిన కళలు మనసును మురిపించి పరవశం కలిగించాయి. నాయిక లేతవలపులోని చాటు మోహం చూసిన మరుక్షణమే అర్ధం చేసుకున్న నాయకుడు నాయికలో విరహాగ్నిని మరింత పెంచమని జాబిలి, వెన్నెల, మలయానిలాల సహాయాన్ని అర్ధిస్తున్నాడు. ప్రేమ జంటలకు ప్రేరణను, స్ఫూర్తిని కలిగించే ఈ ప్రేమగీతాన్ని అద్భుతమైన పదజాలంతో పింగళి నాగేంద్రరావుగారు 'పాతాళభైరవి' సినిమా కోసం వ్రాశారు. 'పాళాళభైరవి' సినిమా విడుదలై 75 సంవత్సరాలు గడిచినా ఈ ప్రేమగీతం ఆనాటినుంచి ఈనాటివరకు నవ్యహరితంగా ప్రేమజంటలను,శ్రోతలను మురిపిస్తూనే వున్నది,మైమరపిస్తూనే వున్నది.

ఈ డ్యూయెట్ పాటలోని విశేషమేమిటంటే...  ఈపాటను నాయికా నాయకులిద్దరూ  ఒకే స్థలంలో నుండి ఆలపించరు. ఓ వెన్నెల రాత్రివేళలో  రాజమందిరంలోనుండి రాకుమార్తె,తోటలోనుండి తోటరాముడు తమ తమ మనసులోని ప్రేమభావాలను చంద్రుడి సమక్షంలో ఈ పాటరూపంలో విప్పి చెప్పుకుంటారు.

ఈ ఆపాతమధుర గీతాన్ని మనకు అందించిన 'పాతాళభైరవి' సినిమాకు సంబంధించిన విషయాలు, విశేషాలు ఒకటా, రెండా ! తవ్వినకొద్ది ఈ అమూల్యనిధి నుండి బయటపడుతూనే వుంటాయి.

ఆసియా ఖంఢంలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియో అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. 1948లో వాహినీ స్టూడియో కట్టిన తర్వాత  నిర్మించబడిన మొదటి సినీమా వాహినీ పిక్చర్స్ బ్యానర్ మీద కెవిరెడ్డి దర్శకత్వంలోని 'గుణసుందరి కథ'. 1949లో వచ్చింది.  తర్వాత, నాగిరెడ్డిగారు విజయా ప్రొడక్షన్ సంస్థను చక్రపాణి సహ నిర్మాతగా ప్రారంభించి 1950లో 'షావుకారు' సినిమాను విడుదల చేశారు. 'పాతాళభైరవి' విజయావారి రెండవ చిత్రం. విజయా వాహినీ స్టూడియో పెర్మెనెంట్ కెమేరామన్ మార్కస్ బార్ట్లీ. విజయావారి చిత్రాలలో పాటలకు, ముఖ్యంగా, వెన్నెల పాటలకు పెట్టింది పేరు. 

చక్రపాణి గారి ఆధ్వర్యంలోని 'చందమామ'  పత్రిక అంటే ప్రజలకెంత అభిమానమో, అంతే ప్రేమ విజయావారి సినిమా చందమామ. తెలుపు నలుపు సినిమా లలో చందమామను, తటాకాలలో వెన్నెలక్రీనీడలను, చల్లగ వీచే పిల్లతెమ్మెరలకు సన్నగ నడుమూపే లతా సౌందర్యాలను అత్యద్భుతంగా చిత్రీకరించడంలో మార్కస్ బార్ట్లీని మించినవారు లేరు. భారతీయ కళా సంస్కృతిని పూర్తిగా అర్ధం చేసుకుని తెలుగు సినిమాఔన్నత్యానికి పాటుపడిన ఛాయాగ్రహకుడు. ఒంటికన్నుతో అపూర్వాలను సృష్టించిన మేధావి మార్కస్ బార్ట్లీ. ఆయన పనితనం పాతాళభైరవి సినిమాలో అణువణువున ప్రతిబింబిస్తుంది.

'ఎంత ఘాటు ప్రేమయో' పాట చిత్రీకరణ ప్రేక్షకులలో మోహాన్ని రేకెత్తించి పరవశం కలుగజేసింది. ఈ విషయంలో గాయక,సంగీత దర్శకుడు ఘంటసాల; ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లీ పోటాపోటీగా కృషి  చేశారనిపిస్తుంది.

కాశీమజిలి కథలు, అల్లావుద్దీన్ కథల ఆధారంగా తీయబడిన అపూర్వ జానపద చిత్రం 'పాతాళభైరవి'. చిత్రనిర్మాణంలోని 24 శాఖల అసమాన్య కృషి ఫలితం 'పాతాళభైరవి'. తెలుగు తమిళ భాషలలో నిర్మించిన ఈ కళాఖండం ఘనవిజయానికి ముఖ్య కారణం పింగళివారి మాటలు, ఘంటసాలవారి పాటలు. మాటలు, పాటలు రెండూ సమానంగా తెలుగనాట ప్రజలనోట నానాయి.  కెవిరెడ్డిగారి దర్శకత్వ ప్రతిభతో 200 రోజులు ఆడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పాతాళభైరవి'. అలాగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పాతాళభైరవి'. ఈ సినీమా హీరో తోటరాముడు ఎన్.టి.ఆర్ కు, విలన్ మాయలమాంత్రీకుడు ఎస్.వి.రంగారావుకు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను సంపాదించిపెట్టిన ఫాంటసీ సినిమా 'పాతాళభైరవి'. మొదట్లో ఈ సినిమా హీరోగా ఎవరిని పెట్టాలనే మీమాంసలో డైరెక్టర్ కెవిరెడ్డి గారు పడ్డారు. అంతవరకూ ఫోక్లోర్, గ్లామరస్ హీరోగా పేరు సంపాదించుకున్న  ఎ.ఎన్.ఆర్ కు బదులుగా కొత్త హీరో (షావుకారు) ఎన్.టి.ఆర్ ను  తోటరాముడు పాత్రకు ఎన్నుకున్నారు. 

పండిత పామర జనాలను ఒకే రీతిలో అలరించిన 'పాతాళభైరవి'సంచలన విజయానికి ఘంటసాల సంగీతం, పాటలు ముఖ్య కారణమయ్యాయి. ఈ సినిమా లో వున్న 11 పాటలను ఘంటసాల, పి.లీల, జిక్కి, కోమల, టి.జి.కమలాదేవి, రేలంగి, పిఠాపురం పాడారు. 

ఈ సినిమా లో ఏ పాటకు ఆ పాటే గొప్పగా వున్నప్పటికి సాహిత్య పరంగా, సంగీతపరంగా పి.లీల, ఘంటసాల 'ఎంత ఘాటు ప్రేమయో' పాట ఈనాటికీ సజీవరాగంగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.

ఘంటసాలగారికి ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారి హిందుస్థానీ సంగీతమంటే చాలా మక్కువ. ఖాన్ సాహేబ్ గానం చేసిన అనేక రాగాల స్ఫూర్తితో ఘంటసాలగారు మంచి మంచి పాటలెన్నో స్వరపర్చారు. అలాటి రాగాలలో రాగేశ్రీ (రాగేశ్వరి) ఒకటి. ఆ రాగంలోనే 'ఎంత ఘాటు ప్రేమయో' పాటను స్వరపర్చారు. రాగేశ్రీ లేదా రాగేశ్వరి హిందుస్థానీ సంగీతం లో ఖమాస్ థాట్ రాగం. అంటే జన్యరాగం. ఔడవ షాడవ రాగం. ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఆరు స్వరాలు పలుకుతాయి. శృంగార రసానికి, సరళమైన మృదుభావాలకు అనువైన రాగం రాగేశ్వరి. 

ఘంటసాలగారికి, మలయాళ గాయని పి.లీలగారికి  తెలుగు, తమిళ భాషలలో ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టిన పాట 'ఎంత ఘాటు ప్రేమయో'. ఘంటసాల మాస్టరు ఈ పాటలో ఉపయోగించిన పియానో, వైయొలిన్స్, సాక్సో, ట్రంపెట్, క్లారినెట్, ఫ్లూట్, మాండొలిన్, గిటార్, తబలా వంటి వాద్యాలు ఎంతో మృదుమధురంగా ఈ ప్రేమగీతాన్నిఉన్నతస్థాయి కి తీసుకువెళ్ళాయి. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరని సజీవరాగం, నిత్యనూతన ప్రేమగీతం' ఘంటసాలవారి 'ఎంత ఘాటు ప్రేమయో'. 

జెమినీ వాసన్ 'పాతాళభైరవి'ని హిందీలోకి డబ్ చేసినప్పుడు. తెలుగులోని ఈ యుగళగీతాలను తలత్ మహమ్మద్, గీతాదత్ పాడారు. ఆ హిందీ డబ్బింగ్ 'పాతాళ్ భైరవి' కూడా వాసన్ గారికి మంచి ఆదాయాన్నే అందించింది.

విజయా నాగిరెడ్డి-చక్రపాణి లు తీసిన 'పాతాళభైరవి' ని నాగిరెడ్డి గారి అబ్బాయిలు ఎన్.టి.ఆర్ కుమారుడు

బాలకృష్ణ హీరోగా 'భైరవద్వీపంగా' రంగుల్లో తీసి మంచి విజయం పొందారు.


అలాగే హీరో కృష్ణ  1985 లో ఈ సినిమా ను జితేంద్ర, జయప్రద హీరో హీరోయిన్ లుగా హిందీలో భారీ ఎత్తున నిర్మించి నిర్మాత గా తన ఖ్యాతిని పెంచుకున్నారు.

నూరు భారతీయ ఉత్తమ కళాఖండ చిత్రాలలో  విజయావారి తెలుగు 'పాతాళభైరవి' చోటుచేసుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.

కొసమెరుపు:-

ఒకసారి మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీలో మద్రాసు తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారోత్సవంలో 'ఘంటసాల సకల గాయక సంగీతోత్సవం' జరిగింది. లబ్దప్రతిష్టులైన సినీ గాయనీగాయకులంతా ఆ అమరగాయకుని స్మరించుకుంటూ ఆయన పాటలనే ఆలపించారు. ఆ సందర్భంగా ప్రముఖ నేపధ్యగాయకుడు పి.బి.శ్రీనివాస్ గారు   పాతాళభైరవి లోని ఈ 'ఎంత ఘాటు ప్రేమయో ' పాటలోని ప్రతీ వాక్యాన్ని తన సహజ వాగ్ధోరణిలో విశ్లేషిస్తూ, పాడుతూ ఘంటసాల మాస్టారి సంగీత ప్రతిభను బహుదా ప్రశంసించారు. తానే కనుక  భోజరాజు అయివుంటే ఈ పాటలోని ఘంటసాలగారి స్వరమాధుర్యానికి, 'ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా అనే పదాల మీద ప్రయోగించిన స్వరస్థానాల తీరుకు లక్షేసి వరహాలు కానుకగా సమర్పించుకునేవాడినని చెప్పగానే  వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలు, కరతాళధ్వనులతో మ్యూజిక్ ఎకాడెమీ ఆడిటోరియం మార్మోగింది.  సాటి గాయకుడి ప్రశంసను మించిన ప్రశంస వేరింకేముంటుంది! గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల అంతటి ఘనతను సాధించారు.


వచ్చే వారం,మరల,ఘంటసాలవారి

మరో సజీవరాగంతో మరల కలుద్దాము.


ప్రణన స్వరాట్

Saturday, 7 March 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 5 - తదీం ధీంత తననాం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!



ఘం
టసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 5

లక్ష్మమ్మ - తదీం ధీంత తననాం



పైన వున్న ఛాయాచిత్రంలోని వ్యక్తి ఎవరో తెలుసా! 

అమీర్ ఖుస్రో.

ప్రాచీన హిందూదేశ చరిత్ర గురించి అంతో ఇంతో అవగాహన వున్నవారందరికీ ఈ 13వ శతాబ్ది చరిత్ర పురుషుని గురించి తెలిసేవుంటుంది. అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలోని గొప్ప కవి,సంగీతవిద్వాంసుడువేదాంతి. సూఫీ భక్తితత్త్వాన్ని అవలంబించినవాడు. ఈ పారశీక కవి జీవితకాలమంతా హిందూదేశంలోనే గడిచింది. హిందుస్థానీ సంగీతం ఉజ్జ్వలంగా వెలుగొందడానికి ముఖ్యకారకులలో ఒకడు అమీర్ ఖుస్రో. ఈనాడు మన దేశంలో బహుళప్రచారంలో వున్న సితార్ వాద్యాన్ని కనిపెట్టినవాడు ఆయనే. అలాగే, హిందుస్థానీ సంగీతంలో ఒక భాగమైన 'తరానా'నుఖవాలీ పధ్ధతి గానానికి ఆద్యుడు ఈ అమీర్ ఖుస్రోయే.

నేటి మన ఘంటసాల సజీవరాగానికి ఈ అమీర్ ఖుస్రోకు ఏమిటి సంబంధం అనే  మీ సందేహం సహజమే. ఆ విషయానికే వద్దాము. అమీర్ ఖుస్రో హిందుస్థానీ సంగీతంలో ప్రవేశపెట్టిన 'తరానా' కు సమాంతరమైన కర్ణాటక సంగీత ప్రక్రియ 'తిల్లానా'. కర్ణాటక సంగీత కచేరీలలోభరతనాట్య ప్రదర్శనలలో ఆఖరి అంశంగా ఈ తిల్లానాను గానం చేస్తారు. లయతాళ ప్రధానమై, మధ్యమధృతకాలంలో (త్వరితగతిన) జతులతో కూడివుండిన తిల్లానా  శ్రోతలలో అత్యుత్సాహాన్నిచైతన్యాన్నిమహదానందాన్ని కలిగిస్తుంది. తిల్లానాలో కృతులలోలాగే పల్లవిఅనుపల్లవిచరణాలున్నా సాహిత్యానికి  ప్రాముఖ్యత తక్కువ. భక్తిశృంగారరస ప్రధానమైన ఈ తిల్లానాలో జతులుసంగతులతో కూడిన సంగీతమే నడుస్తుంది. మన భారతీయ సంగీతంలో ఈ తిల్లానా చాలా ప్రముఖమైన అంశం.

ప్రారంభకాలంలో తిల్లానాలను రచించినవారిలో ప్రసిద్ధులు శ్రీ వీరభద్రయ్య. అలాగే, శ్రీ మహావైద్యనాధయ్యర్ అనే విద్వాంసుడు కానడ రాగం సింహనందిని తాళంలో చేసిన తిల్లానా ఆయన విద్వత్ కు పట్టం కడతుంది. గతించిన కాలంలోని శ్రీయుతులు -  పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్స్వాతితిరునాళ్ వంటి సంగీత విద్వాంసులు చేసిన తిల్లానా రచనలు చాలా ప్రసిధ్ధి పోందాయి. ఈ శతాబ్దంలో సర్వశ్రీ లాల్గుడి జి.జయరామన్బాలమురళీకృష్ణమహారాజపురం సంతానం వంటి ప్రముఖ సంగీతవిద్వాంసులెందరో తిల్లానాలను రచించిప్రదర్శించి రసజ్ఞుల ఆదరాభిమానాలు పొందారు.

తిల్లానా స్వరరచనలు మనకు ఎక్కువగా కదనకుతూహలం, ఖమాస్, కళ్యాణికానడ బృందావనికుంతలవరాళికాపిబెహాగ్గంభీరనాటసింధుభైరవిద్విజావంతి, సింహేంద్రమధ్యమం మొదలైన రాగాలలో కనిపిస్తాయి.

శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేని సామాన్య శ్రోతలు కూడా లయప్రధానమైన తిల్లానాలకు మంత్రముగ్ధులవుతారు. పండితులతో పాటు పామరులకు కూడా బాగా ఆనందాన్ని కలిగించే ఈ తిల్లానాలను ఘంటసాలపెండ్యాల, ఎస్.రాజేశ్వరరావు వంటి సినీ సంగీత దర్శకులు పాత సినిమాలలో ప్రవేశపెట్టి తమ ప్రతిభను కనపర్చారు.

ఆవిధంగా శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి   ఫరజ్ రాగంలోని తిల్లానా రచనను ఒకదానిని ఘంటసాలగారు  తన సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమాలో ఉపయోగించారు. ఫరజ్ 15వ మేళకర్త అయిన మాయామాళవగౌళ కు జన్యరాగం. ఇది షాఢవసంపూర్ణ రాగం. రాగ ఆరోహణలో 6స్వరాలు, (రిషభం వర్జితం), అవరోహణ లో 7 స్వరాలు (రిషభంతో సహా) పలుకుతాయి.

స్వీయ సంగీతంలో ఘంటసాల బెజవాడ రాజరత్నంతో కలసి గానం చేసిన ఈ తిల్లానా యే నేటి మన 'ఘంటసాల-సదా మదిలో మెదిలే సజీవరాగం'.

గత వారాలలో చెప్పుకున్నాం - సంగీతదర్శకుడిగా ఘంటసాలగారికి తొలి అవకాశం కల్పించినది శోభనాచలా స్టూడియో అధినేతలు శ్రీ మీర్జాపురం రాజాఆయన సతీమణి, నటగాయని శ్రీమతి సి.కృష్ణవేణి. వీరు ఒకేసారి 'లక్ష్మమ్మ', 'మనదేశం', 'కీలుగుఱ్ఱం' అనే మూడు సినిమాలు నిర్మించడానికి సంకల్పించి ఘంటసాలవారిని సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నారు. ముందుగా సంగీతదర్శకుడిగా ఒప్పందం జరిగింది 'లక్ష్మమ్మసినిమాకే అయినా దీనికంటే ముందుగా 'కీలుగుఱ్ఱం', 'మనదేశంసినిమాలు విడుదలై  గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఘంటసాలగారి తొలి మూడు సినీమాలలో ఆఖరున రిలీజైన 'లక్ష్మమ్మ' కు వున్నంత నిర్మాణ నేపథ్యం మరే సినిమాకు వుండివుండదు.

1947 లో పెందుర్తి సుబ్బారావు అనే ఆయన మహతీ పిక్చర్స్ బ్యానర్ మీద గోపీచంద్ డైరక్షన్ లో సిహెచ్.నారాయణ రావు హీరోగాపి.భానుమతి ని హీరోయిన్ గా పెట్టి  ఈ లక్ష్మమ్మ కథను సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇలాటి ఏడుపుగొట్టు వేషాలు తన ఒంటికి పడవని భానుమతిగారు ఈ పాత్రను నిరాకరిస్తే తర్వాత  ఆ వేషానికి మాలతిని తీసుకున్నారు. ఈ సినిమాకు బాలాంత్రపు రజనీకాంతరావుగారు గీతరచనసంగీతనిర్వాహకులు. తారానాథ్ అనే మారుపేరుతో కొన్ని పాటలు వ్రాసి వరసలు కట్టారు. కానీఈ సినిమా నిర్మాణం కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. డైరెక్టర్ గోపీచంద్ ఈ కథను శోభనాచలావారికి వినిపించగా ఆ కథ వారికి నచ్చి నిర్మాణ హక్కులను కొనుగోలు చేసి గోపీచంద్ డైరక్షన్లో పునఃప్రారంభించారు. లక్ష్మమ్మ పాత్రను కృష్ణవేణే నటించడానికి నిర్ణయించారు. రజనీకాంతరావు అనారోగ్యకారణాల వలన ఈ సినిమా కు సంగీతం చేయలేనని తనకు బదులుగా ఘంటసాలను పెట్టుకోమని చెప్పడంతో లక్ష్మమ్మ సంగీత దర్శకుడిగా ఘంటసాల రంగప్రవేశం చేశారు. రజనీకాంతరావుగారు వ్రాసిన పాటలను, కొన్ని వరసలను ఘంటసాల యథాతధంగా వుంచి రికార్డు చేశారు. కొన్నింటికి ఘంటసాల వరసలు కట్టారు. 

ఆ సమయంలోనే 'బాలరాజు' సినిమా తీసిన ఘంటసాల బలరామయ్యగారు ఎ.ఎన్.ఆర్., అంజలీదేవిలతో

'స్వప్నసుందరి' సినిమా తీస్తున్నారు. ఆయన ఈ లక్ష్మమ్మ కథను విని తాను కూడా ఆ చిత్రాన్ని నిర్మించాలని స్వప్నసుందరి ని పక్కనపెట్టారు. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారితో  కథమాటలు వ్రాయించి యుధ్ధ ప్రాతిపదికన షూటింగ్ మొదలెట్టారు. అంతవరకు స్నేహంగా వుండిన శోభనాచలాప్రతిభా పిక్చర్స్ యూనిట్ల మధ్య యుధ్ధవాతావరణం నెలకొంది.

నువ్వా!నేనా! అని పోటాపోటీగా రాత్రింపగళ్ళు కష్టపడి షూటింగ్ లు జరిపారు. ఘంటసాల బలరామయ్యగారి 'లక్ష్మమ్మ కధ' కు సి.ఆర్.సుబ్బురామన్ సంగీత దర్శకుడు. ఆ సినిమా లో మన ఘంటసాలగారు ఒక్క పాట కూడా పాడలేదు. అందులోని మగవారి పాటలను సుసర్ల దక్షిణామూర్తి, సుబ్బురామన్ లు పాడారు.

ఈ రెండు సినిమాలు  1950 ఫిబ్రవరిలోనే పోటాపోటీగా విడదలయ్యాయి. వీటిలో ఘంటసాలగారు సంగీతం నిర్వహించిన శోభనాచలా వారి లక్ష్మమ్మకే తెలుగు ప్రజానీకం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

నేటి ఘంటసాలవారి సజీవరాగంగా ఎంచుకున్న తిల్లానా గీతం శోభనాచల-కృష్ణవేణి నిర్మాణంలో వచ్చిన 'లక్ష్మమ్మసినిమా లోనిదే. త్యాగరాజస్వామివారి ప్రియశిష్యుడైన మానాంబుచావడి సుబ్బయ్యర్ గారి శిష్యుడు  పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. గొప్ప వాగ్గేయకారుడు. ఫరజ్ రాగంలో రచించిస్వరపర్చిన ఆయన  రచించిన తిల్లానా ను ఇప్పుడు ఘంటసాల, బెజవాడ రాజరత్నం  గళాలలో విందాము. 


పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ తిల్లానా -'సుదతి నీకు తగిన చిన్నదిరా - సాహిత్యం:-

తదీం ధీంత తననాం తోం తదర

తకిట ధీం తిరికిటతక  నాదరికిటతక

తరికిట తక తక 

                            !తదీం ధీంత!

నాదరిదీం నాదరిదీం  తదియనదరి 

ధీంత తదరదాని తోందరి దాని 

తిరునదర దర ధీం

తఝుణతక  ధీంత తకఝుణుతక ధీంత -

తరికిటకిట తక తథిత్తళాంగు తోం

తకదిత్తళాంగు తోంతక  తదిగిణతోం

సుదతి నీకు తగిన చిన్నదిరా

సురతకేళి కది బలుసూటిరా

                                    !సుదతి!

సదయుడైన వెంకటేశ్వరా నిను

సరగున రమ్మనెరా సమయమురా

                                    !సుదతి!

సి.హేచ్.నారాయణరావుసి.కృష్ణవేణిగోవిందరాజుల సుబ్బారావు, లింగమూర్తివంగరహేమలతసురభి కమలాబాయి మొదలగువారు నటించిన లక్ష్మమ్మలో నాయికా నాయకులు శ్రీలక్ష్మి (కృష్ణవేణి)వెంకయ్యనాయుడు(సి.హెచ్.నారాయణరావు) వివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్యప్రదర్శనలో దేవదాసి రాధ (కుమారి రుక్మిణి ) ఈ తిల్లానాకు అభినయం పడుతుంది. నట్టువాంగం చేస్తూ ఘంటసాలగారి సంగీత సహాయకుడు పామర్తి కనిపిస్తారు. వెంపటి (పెద) సత్యం ఈ సినీమాకు నృత్యదర్శకుడు.

తారానాథ్ పేరుతో రజనీకాంతరావుగారు కొన్ని గీతాలకు వరసలు కట్టినా ఈ తిల్లనాతో సహా చాలా పాటలను ఘంటసాలగారే స్వరపర్చారు.  విజయనగరం సంగీతకళాశాలలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యరికంలో నేర్చుకున్న శాస్త్రీయ సంగీతంసంపాదించిన అనుభవం తర్వాతి కాలంలో  సినిమా రంగంలో ఘంటసాలగారికి ఎంతగానో ఉపయోగించిందనడానికి ఈ తిల్లానాయే నిదర్శనం.

సంప్రదాయబధ్ధంగా సాగిన ఈ నృత్యప్రదర్శనలో అవసరంమేరకుమృదంగంతాళాలుమోర్సింగ్గజ్జెలువైెయొలిన్స్ఫ్లూట్ వంటి వాద్యాలను మాత్రమే ఘంటసాల ఉపయోగించి తెరపై నృత్యప్రదర్శనను హుందాగా నడిపించారు. ఈ తిల్లానాను ఘంటసాలబెజవాడ రాజరత్నం ఆలపించగా, లక్ష్మమ్మ చిత్రంలోని మరో పదహారు గీతాలను ఘంటసాలసి.కృష్ణవేణిఎమ్.ఎస్.రామారావు, టి.జి.కమలాదేవి, బెజవాడ రాజరత్నం మొదలగువారు పాడారు.

సంగీతపరంగా మొదటి మూడు సినీమాలు hattrick సాధించిన ఘనవిజయం ఘంటసాలగారు భవిష్యత్ లో మరో 110 సినిమాలకు సంగీతదర్శకత్వం వహించడానికి రాచబాటను వేసిందని నిస్సందేహంగా చెప్పవచ్చును.

ఘంటసాలగారి సంగీతనిర్వహణలోని మరో సజీవరాగంతో వచ్చే వారం మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

Saturday, 28 February 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 4 - కాదు సుమా కల కాదు సుమా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘం
టసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 4

కీలుగుర్రం - కాదు సుమా కల కాదు సుమా

అమృతపానీయాన్ని అమరగానాన్ని కలబోసి తెలుగువారి  సంగీత దాహార్తిని తీర్చి, ఆ వీనులవిందులో సోలిపోయేలా చేసిన గంధర్వగాయకుడు ఘంటసాలవారి అపురూప గీతం - 'కాదుసుమా కలకాదు సుమా'

నా చిన్నతనంలో ప్రతీరోజూ ఉదయాస్తమానం ఎవరినోట విన్నా, ఎచ్చోట గాంచినా  ఈ సూపర్ డూపర్ డ్యూయెట్టే వినపడేది. ఈ పాటతో తెలుగు ప్రజానీకాన్ని మెస్మరైజ్ చేసి కట్టిపడేసిన వర్ధమాన దినదిన ప్రవర్ధమాన  గాయకుడు ఘంటసాల 'స్టోన్' (టోన్)ను అనుకరించనివారే లేరంటే  అది  కాదు సుమా  అబద్ధం కానే కాదు సుమా.

ప్రేమలు పూచే సీమలలో, వలపులు పారే సెలయేరులలో,  కన్నె తారకలతో కలగానము చేస్తూ దక్షిణనాయక ప్రేమతత్త్వంతో సరికొత్త శృంగారాభినయనానికి నాంది  పలికి   ఆనాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అద్భుత  జానపద చిత్రం 'కీలుగుఱ్ఱం' లోని సుమధుర ప్రేమగీతమే 'కాదుసుమా కలకాదు సుమా'.  

కీలుగుఱ్ఱం మహిమతో యువ నాయకీనాయకులు గగనసీమలలో తేలియాడుతూ ఆలపించిన యుగళగీతమే నేటి మన సజీవరాగం -

'కాదుసుమా కలకాదు సుమా
అమృతపానమును అమరగానమును
గగనయానమును కల్గినట్లుగా
గాలిని తేలుచు సోలిపోవుటిది   !కాదుసుమా!

ప్రేమలు పూచే సీమల లోపలా...2
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తేలియాడుటిది    !కాదుసుమా!

కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ ఓ ఓ....2
ఉత్సాహముతో ఊగుచుండుటిది   !కాదుసుమా!

పూలవాసనల గాలితెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో-2
అహహా..అహహా..
దోబూచులాడుటిది     
కాదుసుమా కలకాదు సుమా -2
ఈ శృంగారగీతాన్ని వ్రాసినవారు అలనాటి ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు, సినీ గేయ రచయిత అయిన తాపీ ధర్మారావుగారు. 
తాపీ ధర్మారావు
ఆయన ఈ పాటలో చరణాలను పల్లవితో అన్వయించడానికి - 'సోలిపోవుటిది'; 'తేలియాడుటిది'; 'ఊగుచుండుటిది'; 'దోబూచులాడుటిది'; అంటూ 'ఇది' అనే మాటను పలుసార్లు ఉపయోగించడం విశేషంగా అనిపిస్తుంది. 'కీలుగుఱ్ఱం' సినిమా లోని అధికసంఖ్యాక గీతాలను ధర్మారావుగారు వ్రాయగా ఓ నాలుగైదు పాటలను ఇనుగంటి శోభనాద్రి రావుగారు రచించారు.

'బాలరాజు' అఖండ విజయం తర్వాత హీరో నాగేస్సర్రావ్ అందుకున్న మరో సూపర్హిట్ సినిమా 'కీలుగుఱ్ఱం'. ఎ.ఎన్.ఆర్ కు రొమాంటిక్ హీరో ఇమేజ్ ను క్రియేట్  చేసిన సినిమా. ఇందులో అక్కినేనికి ముగ్గురు హీరోయిన్లు. ఆ ముగ్గురితో స్టెప్ లంటే వేయలేదుకాని ఘంటసాల కంఠంతో ఒక హీరోయిన్ తో రెండు డ్యూయెట్ లు పాడారు. మల్టీహీరోయిన్ ట్రెండ్ కు నాందిపలికిన సినిమా "కీలుగుఱ్ఱం" అంటే తప్పులేదేమో! 

ఈ సినిమాలో అంజలీదేవి వున్నా నాగేశ్వరరావు కు హీరోయిన్ కాదు. వ్యాంప్ కారెక్టర్. హీరోకు సవతి తల్లి. రాజావారి రెండవ భార్యలాటిది. పగటిపూట ప్రియురాలుగా పాటలు పాడుతుంది. అర్ధరాత్రయితే  తన నిజరూపంలో రాక్షసిగామారి కోటలోని గుఱ్ఱాలను, ఏనుగులను చంపి భక్షిస్తుంటుంది. ఇలాటి వేషం ససేమిరా వేయనని అంజలీదేవి భీష్మించుకుని కూర్చుంటే చిత్ర నిర్మాత, నటగాయని సి.కృష్ణవేణి బలవంతాన ఒప్పించారట. అందుకు బదులుగా అంజలీదేవి  సినిమాలో తాను పాడవలసిన పాటలన్నీ కృష్ణవేణే పాడాలని కండిషన్ పెట్టారట. దాని ప్రకారం కీలుగుఱ్ఱం సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నాలుగు పాటలు పాడారు.

భోజనప్రియులకు మృష్టాన్నభోజనంలా  లలిత సంగీతప్రియులకు మృష్టాన్నపు విందు కీలుగుఱ్ఱం పాటలు. విడుదలైన తన తొలి సినిమాలోనే  వివిధరసాలతో నిండిన 17 ఆణి ముత్యాల్లాంటి గీతాలను స్వరపర్చి, గానం చేసి ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు ఘంటసాల. ఇందులో ఘంటసాల పాడిన ఏడు పాటలు (ఏకగళగీతాలు,యుగళగీతాలు) కాక మిగిలిన పాటలను సి.కృష్ణవేణి, పి.లీల, శ్రీదేవి, రేలంగి, కనకం మొదలగు వారు పాడారు. ఈ పదిహేడు గీతాలలో  16 గీతాలకు ఘంటసాల సంగీతం సమకూర్చగా
టైటిల్స్ మీద వినిపించే 'శోభనగిరి నిలయా దయామయా' అనేఒక్క పాటకు మాత్రం టి.ఎ.మోతి అనే ఆయన వరస కూర్చారు.

ఘంటసాలవారి 'కాదుసుమా కలకాదుసుమా' పాటతో తెలుగువారందరికీ చిరపరిచితురాలై ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న గాయని వక్కలంక సరళ. 1940ల తర్వాత జెమినీ స్టూడియోలో నిర్మితమైన సినిమాలకు సహ సంగీత దర్శకురాలిగా వుండిన వక్కలంక సరళను ఘంటసాలగారి  'కాదుసుమా కలకాదుసుమా' పాట వరించింది. ఘంటసాల, సరళల ఈ యుగళగీతం ఆనాటి ఆంధ్రదేశమంతా మార్మోగింది.

వక్కలంక సరళ
ఈనాటికీ కీలుగుఱ్ఱం అంటే అందరికీ వెంటనే స్ఫురణకు వచ్చే పాట ఈ 'కాదుసుమా కలకాదుసుమా' మాత్రమే. సంగీత కుటుంబానికి చెందిన వక్కలంక సరళ కుమార్తెలు ఇద్దరూ కళాకారులే. ఒక కుమార్తె స్వప్నసుందరి. అంజలీదేవితో తనకు గల సాన్నిహిత్యం కు నిదర్శనంగా స్వప్నసుందరి అని పేరు పెట్టారట. ఈ స్వప్నసుందరి కూచిపూడి, భరతనాట్యాలలో నిష్ణాతురాలు. పద్మభూషణ్ బిరుదుపొందారు. మరొక కుమార్తె వక్కలంక పద్మ దాసరి నారాయణరావు 'గోరింటాకు' సినిమాలో శోభన్ బాబుతో హీరోయిన్ గా నటించారు. తర్వాత నటనకు స్వస్తిచెప్పి అంతర్జాతీయ స్థాయి పత్రికావిలేఖరిగా పనిచేస్తున్నారు. వక్కలంక సరళ తండ్రి, ప్రముఖ రచయిత చలం గారికి తమ్ముడు. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వక్కలంక సరళ చిత్రగాయనిగా కేవలం ఓ ఏడెనిమిది సినిమాలలో మాత్రమే పాటలు  పాడి చిత్రసీమ నుండి వైదొలిగారు.

మీర్జాపురం జమీందారుగారు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కీలుగుఱ్ఱం' సినిమా కథను కాశీమజిలి కథల స్ఫూర్తితో  తాపి ధర్మారావు నాయుడు & వెంపటి సదాశివబ్రహ్మం తయారుచేశారు.  సినిమా టైటిల్స్ లో దర్శకుడు మీర్జాపురం రాజాగారే అయినా  అధికభాగం చిత్రదర్శకుడు చిత్రపు నారాయణమూర్తి భుజస్కంధాలపైనే జరిగిందంటారు. 

కీలుగుఱ్ఱం ప్రధాన తారాగణం - అంజలీదేవి, సీనియర్ ఎ.వి.సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, కనకం, సురభి కమలా బాయి, సూర్యశ్రీ, జూనియర్ లక్ష్మీరాజ్యం, బాలామణి, వి.కోటేశ్వరరావు, మాణిక్యరావు మొదలగువారు.

1948లో కీలుగుఱ్ఱం సినిమా నిర్మాణంలో వున్న సమయంలోనే ప్రముఖ నటుడు, దర్శకుడు లంక సత్యం దర్శకత్వంలో జూపిటర్ పిక్చర్స్ స్వామి తమిళంలో 'మోహిని' అనే సినిమాను దాదాపు ఇదే కథతో తీశారు. ఈ సినిమాకు హీరోగా సుప్రసిద్ధ విలన్, కమేడియన్ నటుడు టి.ఎస్.బాలయ్య నటించగా  తమిళుల ఆరాధ్యదైవం ఎమ్.జి.రామచంద్రన్, ఆయన భార్య వి.ఎన్.జానకి ఇతర పాత్రలలో నటించారు. 1948లో విడుదలైన తమిళ 'మోహిని' జయాపజయాలపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఈ నేపథ్యంలో మీర్జాపురం రాజావారు  పది కేంద్రాలలో శతదినోత్సవాలు, ఒక కేంద్రంలో 150 రోజులు ఆడి ఘనవిజయం సాధించిన తన కీలుగుఱ్ఱాన్ని  మొండిధైర్యంతో తమిళంలోకి  'మాయా కుదిరై' పేరిట డబ్ చేసి వదిలారు. తెలుగు నుండి తమిళంలోకి డబ్ చేయబడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'కీలుగుఱ్ఱం'. ఈ డబ్బింగ్ వెర్షన్ విజయంపై కూడా  తమిళ పత్రికలలో భిన్నాభిప్రాయాలు చూడగలం

కీలుగుఱ్ఱం చిత్ర విజయానికి ఎంతో దోహదంచేసిన అంశం, వైవిధ్యం తో కూడిన ఘంటసాలవారి సుమధుర సంగీతం.  సినిమా విడుదలయి 76 సంవత్సరాలైన ఆ సినీమాలోని 'కాదుసుమా కలకాదుసుమా' యుగళగీతం మాత్రం నిత్యనూతనంగా అన్ని వర్గాల శ్రోతలను అలరిస్తూనేవుంది. 

కథానాయిక సూర్యశ్రీ, నాయకుడు ఎ.ఎన్.ఆర్

ఘంటసాలగారు ఈ పాటను తోడి రాగ స్వరాలతో చేసినా, సింధుభైరవి రాగానికి దగ్గరగా వున్నట్లు ఒకరి విశ్లేషణలో తెలిసింది. తోడిరాగం అతి ప్రాచీన రాగం. కర్ణాటక సంగీతంలో 8 వ మేళకర్త రాగం తోడి. ఆరోహణ,అవరోహణ క్రమంలో ఏడు స్వరాలు కలిగివున్న సంపూర్ణరాగం.
దీనినే హనుమత్తోడి అని కూడా అంటారు. ఈ తోడి రాగంలో సంగీత ముమూర్తుల కృతులు ఎన్నో వున్నాయి.
ఇక, సింధుభైరవి రాగం విషయానికి వస్తే ఈ రాగం కర్ణాటక, హిందుస్థానీ శైలులలో వినిపించే భాషాంగరాగం.
సింధుభైరవి హనుమత్తోడి రాగానికి జన్యరాగం. సింధుభైరవి రాగంలో అసంఖ్యాకంగా సినీగీతాలు అన్ని భాషలలోనూ వున్నాయి.

ఇప్పుడు - 'కాదుసుమా కలకాదుసుమా' పాటను చూస్తూ విందామా!!


 
ఘంటసాలగారు ఈ పాటలో వైలిన్స్, వీణ, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, ట్రంపెట్స్, తబలా, డోలక్ వంటి వాద్యాలను వినియోగించుకున్నట్లు అనిపిస్తుంది.

ఈ 76 సంవత్సరాల 'కీలుగుఱ్ఱం' సొంతదారుడు, దర్శకుడు, శోభనాచల స్టూడియో అధినేత, మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య బహదూర్.
మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య బహదూర్

వచ్చే వారం, మరల ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

Saturday, 21 February 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 3 - జయ జననీ పరమ పవనీ, అత్తలేని కోడలుత్తమురాలు, మరువలేనురా పోలీసెంకటసామి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘం
టసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 3

మన దేశం - జయ జననీ పరమ పవనీ


"ఆదిలోనే హంసపాదు"
ఈ తెలుగు సామెత మీ అందరికీ తెలిసినదే. ఏదైనా కార్యాన్ని తలపెట్టి అది నిర్విఘ్నంగా కొనసాగకుండా మొదట్లోనే ఆటంకాలు ఏర్పడి తాత్కాలికంగా లేదా సంపూర్ణంగా ఆగిపోతే దానిని 'ఆదిలోనే హంసపాదు' అనేవారు. అలాగే - ఈ  ^   గుర్తు హంసపాదు కు సంకేతం. ఏవైనా రచనలు, వ్యాజ్యాలకు సంబంధించిన వివరాలు వ్రాస్తున్నప్పుడు సరైన పదం దొరకక ఆ వ్రాత పని తాత్కాలికంగా ఆగిపోతే ^ ఈ గుర్తును ఉపయోగించి తర్వాత ఆ వ్రాతను కొనసాగించేవారు.

అలాటి హంసపాదు ఘంటసాలవారు తొలిసారిగా సంగీతదర్శకత్వం చేపట్టినప్పుడు ఎదురయింది. అదేలా అంటారా...

భరణీవారి 'రత్నమాల' సినిమా లో సిఆర్ సుబ్బురామన్ కు  సంగీత సహాయకుడిగా, ప్రతిభా వారి 'బాలరాజు' సినిమా కు సహ సంగీతదర్శకుడిగా పనిచేసిన ఘంటసాలగారికి మహతీవారి 'లక్ష్మమ్మ' సినిమాకు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం లభించింది. ఆయితే ఆయన దురదృష్టం. ఆదిలోనే హంసపాదు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. కొన్నాళ్ళ తరువాత ఆగిపోయిన 'లక్ష్మమ్మ'ను శోభనాచల అధినేతలు మీర్జాపురం రాజా, ఆయన సతీమణి, నటి సి.కృష్ణవేణి కొనుగోలు చేసి అదే నటులు,సాంకేతిక వర్గంతో పునఃప్రారంభించారు.  ఆ సినిమాకు ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ డైరెక్టర్. అదే సమయంలో కృష్ణవేణి, మీర్జాపురం రాజాగార్లు ఎల్.వి.ప్రసాద్ డైరక్షన్ లో 'మనదేశం', మీర్జాపురం రాజావారి దర్శకత్వంలో 'కీలుగుర్రం' సినిమాలను కూడా తీయ సంకల్పించి ఆ రెండు సినిమాల సంగీత దర్శకత్వం బాధ్యతలను కూడా ఘంటసాలగారికి అప్పచెప్పారు. ఘంటసాలగారు తన మొదటిచిత్రం 'మనదేశం' అనేవారు. ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమా'లక్ష్మమ్మ' అయినప్పటికీ పాటల కంపోజింగ్ చేపట్టిన మొదటి సినిమా 'మనదేశం'. అయితే ఈ మూడు సినిమాలలో ఆఖరున మొదలెట్టిన 'కీలుగుర్రం' సినిమా ముందుగా విడుదలయింది, తరవాత, 'మనదేశం', ఆఖరున మొదటిసారి ఒప్పందం చేసుకున్న 'లక్ష్మమ్మ' సినిమాలు రిలీజై ఆనాటి ఆంధ్రప్రదేశంతా విజయభేరులు మ్రోగించాయి. సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి versatality ఆనాడే తెలుగువారందరికి తెలిసింది.

నా చిన్నతనంలో అంటే నాఎలిమెంటరీ స్కూల్, తరువాత హైస్కూల్ లో చదువుతున్న రోజుల నుండి ఒక పాటను మా మాస్టర్లు ప్రార్ధనా గీతంగా పాడగలిగిన పిల్లలతో ప్రార్ధనాగీతంగా రోజూ స్కూల్లో పాడించేవారు. మిగతా పిల్లలంతా కూడా పెదవులు కదిపేవారు. రిపబ్లిక్ డే అయినా, ఆగస్ట్ 15 వచ్చినా, గాంధీజీ పుట్టినరోజైనా ఆ పాట తప్పక వినిపించేది.   అప్పట్లో ఆ మాటలకు  అర్ధం సరిగ్గా తెలియకపోయినా ఆ గీతం వినడానికి, పాడడానికి ఎంతో ఉత్సాహకరంగా,ఆసక్తిదాయకంగా, చెవులకింపుగా వుండేది.

ఆ పాటే "జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ" అనే ప్రబోధగీతం. స్కూల్ ఫంక్షన్లలోనూ, లౌడ్ స్పీకర్లలోనూ ఈ పాట మార్మోగేది. చాలాకాలం వరకు ఆ పాట మన జాతీయగీతమనే అనుకునేవాడిని. టెలివిజన్ లలో సినీమాలు వేయడం ప్రారంభించేక ఒకసారి 'మన దేశం' అనే అతిపాత సినీమా ను చూడడం తటస్థించింది. అంతవరకూ ఆ సినిమా పేరు వినడమే తప్ప చూడలేదు. ఆ సినిమా ప్రారంభంలో టైటిల్స్ మీద  'జయ జననీ పరమ పావని' అనే ఈ ప్రబోధగీతం వినవచ్చింది. అప్పుడే తెలిసింది ఇదొక సినీమా గీతమని. పాఠశాల విద్యార్ధులను ఎంతో ప్రభావితం చేసిన ఈ ప్రబోధగీతాన్ని శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు. ఘంటసాల, సి.కృష్ణవేణి, పిఠాపురం నాగేశ్వరరావు, బృందం కలసి ఈ పాట పాడారు.
సముద్రాల రాఘవాచార్య

                                                                        సి.కృష్ణవేణి                         పిఠాపురం నాగేశ్వరరావు
సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటర్జీ వ్రాసిన 'విప్రదాస్' నవల ఆధారంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నేపధ్యంగా తీసుకొని  నటి, గాయని, మీర్జాపురం రాజావారి సతీమణి శ్రీమతి సి కృష్ణవేణి నిర్మించిన చిత్రం 'మనదేశం'. ఒక  చిన్న పోలీసు ఇన్స్పెక్టర్ వేషంలో ఎన్.టి.రామారావును తెలుగువారికి పరిచయం చేసిన చిత్రం 'మనదేశం'.

'జయ జననీ పరమ పావని'  పాట ద్వారా తెలుగు ప్రజలందరిలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, దేశభక్తిని పురిగొల్పిన   సముద్రాలగారు ఈ పాటలో ఆ సేతుహిమాచల పర్యంతం గల సస్యశ్యామలమైన భారతదేశం గురించి, ఆ దేశంలో గల పవిత్ర  జీవనదుల ఔన్నత్యం గురించి వర్ణించి చెప్పారు.
ఆ గీతం: -

"జయ జననీ పరమపావనీ
జయ జయ భారత జననీ !జయ!

శీతశైల మణి శృంగ కీరీటా
సింహళ జాంబూనద పీఠా
వింధ్యమహీధర మహామేఖలా
విమల కాశ్మీర కస్తూరిరేఖ !జయ!

గంగా సింధూ మహానదీ
గౌతమీ కృష్ణా కావేరీ
జీవసార పరిపోషిత కోమల
సశ్య విశాలా శ్యామలా !జయ!

ఈ గీతంలో భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని,భారతమాతకు అలంకారప్రాయంగా నిలిచే సహజ వనరుల గురించి, భరతమాత ఔన్నత్యాన్ని కీర్తించి చెప్పారు.  అటువంటి ఉత్కృష్ట దేశంలో జన్మించడం మన అదృష్టమని ప్రజల హృదయాలలో చైతన్యం రేకెత్తించారు  సముద్రాల రాఘవాచార్యులవారు. ముత్యాలసరాల వంటి సరళ పదజాలానికి  లాలిత్యంతో కూడిన  సంగీతం సమకూర్చి శ్రీమతి సి.కృష్ణవేణి బృందంతో  గానం చేసిన శ్రీ ఘంటసాలవారి గళంలోని మార్దవం , శ్రోతలను పరవశులను చేస్తుంది. 

తెలుగు భాషలోని సౌందర్యమంతా ఘంటసాలవారి సుస్పష్టమైన ఉచ్ఛారణలో‌,భావ ప్రకటనలో, సుశ్రావ్యమైన గానంలో ప్రకటితమయింది. "ఇంతై వటుడింతై" అనే రీతిలో ఘంటసాలవారి సంగీత విశ్వరూపం అనతికాలంలోనే దిగంతాలకు ప్రాకింది. "జయ జననీ పరమ పావనీ" అనే గీతాన్ని ఘంటసాలవారు ' శుధ్ధ సావేరీ' రాగంలో  స్వరపర్చినట్లు ఒక వ్యాసంలో చదివాను.

"శుధ్ధ సావేరి" కర్ణాటక మేళకర్త రాగమైన "ధీరశంకరాభరణం" యొక్క జన్య రాగం.  ఈ రాగంలో కేవలం ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. శుధ్ధ సావేరీ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'దుర్గ' అంటారు. ఇటీవల మరొకరు ఈ పాట విని శుధ్ధ సావేరీ రాగంలో లేని గాంధారం కూడా ఈ పాటలో వినిపిస్తున్నందున ఈ పాట 'సామ' రాగంలో వుందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు.
సరే... ఇప్పుడు ఆ సామ రాగ లక్షణాలు కూడా చూద్దాము.

సామ రాగం కర్నాటక సంగీతం లో 28వ మేళకర్త అయిన హరికాంభోజి రాగ జన్యం.  ఆరోహణ-అవరోహణ క్రమం :- 'సరిమపదస - సదపమగరిస' 

శుద్ధసావేరి :- 'సరిమపదస-సదపమరిస'
29వ మేళకర్త ధీరశంకరాభరణం రాగానికి జన్యరాగం శుద్ధసావేరి.
 
శుద్ధసావేరి, సామ పక్క పక్క మేళకర్తల జన్యరాగాలు.

సామకు శుద్ధసావేరి కి మధ్య గల తేడా గాంధారం ఒక్కటే. 
ఈ స్వరబేధాలు సక్రమంగా గుర్తించకపోతే రాగనిర్ణయంలో పొరపాటు జరిగే అవకాశం వుంది.

ఘంటసాలవారు ఈ పాటకు వైలిన్స్, ట్యూబోఫోన్, జలతరంగ్, సాక్సోఫోన్, తబలా మొదలగు వాద్యాలను నేపథ్యంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ దురభిమానాలను పక్కన పెడితే  ఈ గీతం సర్వ విధాలా ఇతర జాతీయగీతాల జాబితాలో చేర్చదగ్గ ఉత్తమ జాతీయగీతం.  ఈ తరం పిల్లలంతా  తప్పక నేర్చువలసిన ఉత్తేజభరిత ప్రబోధ గీతం. ఇప్పుడు ఆగీతాన్ని చూస్తూ విందామా!


                                             

కొసమెరుపు -

మన దేశం సినిమాలో సముద్రాల సీనియర్ గారు వ్రాయగా హీరోయిన్ సి కృష్ణవేణి పాడి అభినయించిన  'అత్తలేని కోడలుత్తమురాలు'; పి.జి.కృష్ణవేణి(జిక్కి) పాడగా లక్ష్మీకాంత, రేలంగి నటించిన 'పంచదార వంటి పోలీసెంకటసామి నిను నేను మరువలేనురా ' పాటలు సూపర్హిట్ అయాయి. ఆ పాటలను మరల ఘంటసాల గారు గ్రామఫోన్ రికార్డులుగా పాడగా అవి ఆంధ్రదేశమంతా మార్మోగాయి. జానపదబాణీలో సాగిన ఆ రెండు పాటలను స్త్రీల ముఖభావాలతో అభినయిస్తూ  ఘంటసాలగారు తన కచేరీలలో విధిగా పాడి ప్రేక్షకులను సమ్మోహనపర్చేవారు. 
   
అత్తలేనికోడలుత్తమురాలు ఓయమ్మా... 
                
మరువలేనురా నిను నేను పంచదారవంటి

సదా మదిలో మెదిలే  ఘంటసాలవారి మరో మధురగీతంతో మళ్ళీ వచ్చేవారం.....

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 6 - ఎంత ఘాటు ప్రేమయో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...