అధ్యాయం - 2 - భాగం 7
పెళ్ళిచేసిచూడు – పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని
చల్లగ కాలం గడపాలోయ్...
పెళ్ళిలో ఇచ్చిన ఐదులక్షలు తమ ఖర్చులకే చాలలేదని మరో ఐదు ఇస్తే తప్ప కోడలిని గడపలోకి రానివ్వమని ఖరాఖండీగా చెప్పడంతో అంత సొమ్ము సేకరించలేక, అత్తింటివారి సూటిపోటి మాటల అవమానాన్ని భరించలేక పరంధామం, అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నారని ఉదయాన్నే వాకర్స్ పార్క్ లో సంచలన వార్త. వరకట్న పిశాచి ధనదాహానికి మరో రెండు ప్రాణాలు బలి.
పెళ్ళిళ్ళలో కట్నం పేరుతో డబ్బు, నగలు, ఆస్తులు ఇచ్చినా, పుచ్చుకున్నా నేరమేనని, అందుకు శిక్షార్హులేనని భారత్ సర్కారు చట్టం తెచ్చినా ఈ మహమ్మారి జాడ్యం మన జాతిని పట్టి పీడిస్తూనేవుంది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో లేని ఈ జాడ్యం శతాబ్దాల కాలంగా ఆసియాలో ముఖ్యంగా దక్షిణాసియా దేశాలలో ఇంకా ప్రబలంగానే వుంది.
ఇటీవలి కాలంవరకు తండ్రి ఆస్తిలో హక్కు లేని ఆడపిల్ల
సంరక్షణకోసం, భద్రత కొంత నగదునో, బంగారు నగలనో, భూములనో తమతమ స్తోమతకు తగినట్లు
కేటాయించి ఆ పిల్ల వివాహంలో కట్నంగా అత్తింటివారికి ఇవ్వడమనేది ఒక సంప్రదాయంగా
మారి చివరికి కట్నం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళే జరగని పరిస్థితి ఏర్పడింది. ఎంత నాగరికత
పెరిగినా, ఎంత ప్రపంచీకరణ జరిగినా, మన వివాహ వ్యవస్థలో ఎన్ని మార్పులు వస్తున్నా ఈ
ఇచ్చిపుచ్చుకోవడాలలో తలెత్తే సమస్యలను, జరిగే ఘోరాలను ఎవరూ
రూపుమాపలేకపోతున్నారు.
పెళ్ళంటే నూరేళ్ళపంట. అవును, కట్నం పేరిట అత్తింట పంటే. స్తోమత కలిగినవాళ్ళకు పండగే. కానీ, స్తోమతలేని పెళ్ళి కూతురి తండ్రి మాత్రం రోడ్డున పడడం ఖాయం. ఈ విషయంలో తప్పనిసరిగా ప్రజల మనస్తత్త్వం మారాలి. మానవత్వం పెరగాలి. అప్పుడే ఈ వరకట్న విషవృక్షం సమూలంగా పెకలించబడుతుంది. వరకట్నాల నిషేధం విషయంలో వధువరులే ముందంజ వేయాలి. అదుపు ఆజ్ఞాలేని పెళ్ళి ఖర్చులను అరికట్టాలి.
డాబు, దర్పం, దర్జాల కోసం జరిగే ఆడంబరపు పెళ్ళిళ్ళను శాశ్వతంగా కట్టడి చేయాలి. అందుకు యువతే నడుంకట్టి ముందుకు సాగాలి. ఇందుకు మీకు మంచి స్ఫూర్తి కావాలా? వెంటనే చూడండి 1952 నాటి సినిమా 'పెళ్ళిచేసిచూడు'.
ఇందులోని విద్యాధికుడైన కధానాయకుని సందేశమేమిటో
తెలుసా!---
ఓ భావిభారత భాగ్యవిధాతలారా!
యువతీ యువకులారా!
స్వానుభవమున చాటు నా సందేశమిదే
...వారెవ్వా...
తాధిన్న తకధిన్న తాంగిడితక తరికిటతక తోం...
పెళ్ళిచేసుకుని యిల్లుచుసుకుని చల్లగ కాలం
గడపాలోయ్ మీరెల్లరు హాయిగ వుండాలోయ్!
కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి
కాపురములు
కూల్చు
ఘనులకు శాస్తికాగ.. పట్నాల పల్లెల
దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా
తాధిన్న తకధిన్న తాంగిడితక తరికిటతక తోం...
ఇంటా బయటా జంటకవుల వలె
అంటుకు తిరగాలోయ్ తరంపం-2
కంటిపాపలై దంపతులెపుడూ చంటి పాపలను సాకాలోయ్ -2
!!పెళ్ళి!!
నవభావములా నవరాగములా
నవజీవనమే నడపాలోయ్ -2
భావకవులవలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్
పెళ్ళి చేసుకుని హాయిగా...
వుండాలోయ్...
🌿🌷🌿
ఇదే నేటి మన సజీవరాగం.
సంగీత సాహిత్యాల పస వున్న గీతాలే పదికాలాలపాటు
ప్రజల హృదయాలలో నిల్చివుంటాయనేందుకు 'పెళ్ళిచేసిచూడు' లోని ఈ పాటే నిదర్శనం.
తాళి కట్టడానికి ముందే ఇస్తానన్న కట్నం డబ్బు తాళి కట్టిన తర్వాత కూడా
ఆడపెళ్ళివారు చెల్లించకపోవడంతో వియ్యంకుడు
ఆగ్రహించి కొడుకును అక్కడనుంచి లాక్కుపోతాడు.
రమణ, అమ్మడుల పెళ్ళి జరిగినా జరగనంత విషాదాన్ని పెళ్ళిపందిట్లో మిగిల్చిపోతుంది.
అయితే, చదువు సంస్కారంగల రమణ తండ్రికి
తెలియకుండా అత్తవారింట్లో మకాంవేసి కొత్తల్లుడి హోదాలో మనుగుడుపు లాంఛనాలన్ని
మహదానందంగా అనుభవిస్తూ , అత్తగారు, భార్య, బావమరదులను కూడా తన గానా బజానాలతో
సంతోషపరుస్తూంటాడు.
ఆ సందర్భంలోనే సంగీతప్రియుడైన కథానాయకుడు రమణ తన బావమరది తబలా వాయిస్తూండగా, మరో సిసింద్రీ బావమరది డ్యాన్స్ చేస్తూండగా తాను హార్మోనియం వాయిస్తూ కట్నాలమోజులో జీవితాలను బలిచేసే ఘనులందరికీ శాస్తి జరగాలని ఘంటసాల బాణీలో భావిభారత భాగ్యవిధాతలైన యువతీయువకులందరికీ మంచి సందేశమిస్తాడు. తర్వాత, తన భార్యతో వేరే వూళ్ళో కాపురం పెడతాడు.చిత్రవిచిత్ర నాటకాలతో ఎవరి మనసు నొప్పించకుండా తండ్రి మనసుమార్చి కథను సుఖాంతం చేస్తాడు. అభ్యుదయవాదిగా అందరి మన్ననలు పొందుతాడు.
తరతరాలుగా మన దేశంలోని మధ్యతరగతి కుటుంబీకులను పట్టిపీడిస్తున్న వరకట్న జాడ్య సమస్యను పెద్ద పెద్ద ఉపన్యాసాలతోను, ఏడుపు పెడబొబ్బలతోను కాకుండా చాలా వినోదాత్మకంగా, వ్యంగాన్ని కూడా మిళితం చేసి హాస్యరస ప్రధానంగా తెరకెక్కించారు 'పెళ్ళిచేసిచూడు' దర్శకుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్, సింపుల్ గా 'ప్రసాద్'. చెప్పదలుచుకున్న విషయాన్ని సున్నితంగా ప్రేక్షకుల హృదయాలలో నాటేలా సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇందులో చక్రపాణి గారి హస్తం ఎంతైనావుంది.
విజయావారి సినిమాల కథాసంవిధానమంతా చక్రపాణిగారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సినిమా నిర్మాణ వ్యవహారమంతా చక్రపాణిగారిదే, నాగిరెడ్డిగారి జోక్యమేం వుండదు. పెట్టుబడి, వ్యాపార వ్యవహారాలు మాత్రం ఆయనవి. సినిమా నిర్మాణంలో తనకు ఏ మాత్రం అసంతృప్తి కలిగినా చక్రపాణి సహించేవారు కాదు. తనకు కావలసిన పద్ధతిలో పనిజరగకపోతే ఎంత పెద్ద నటులనైనా, సాంకేతిక నిపుణులనైనా తొలగించి మరల కొత్తగా పని మొదలెట్టడానికి సంశయించేవారు కాదు. అందుకు నిదర్శనంగా పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్ సినీమాలు చెప్పుకోవచ్చు. పెళ్ళిచేసిచూడులో నటన విషయంలో కధానాయిక జి.వరలక్ష్మి పెట్టే ఇబ్బందులు భరించలేక ఆవిడ స్థానంలో అంజలీదేవిని పెట్టుకుందామని నిర్ణయించుకున్నారట. కానీ, అంజలీదేవి మధ్యవర్తిత్వంతో జి.వరలక్ష్మిగారినే కొనసాగించినట్లు చెప్పుకుంటారు. అలాగే మిస్సమ్మలో మొదట హీరోయిన్ గా భానుమతి గారితో కొంత షూటింగ్ అయాక ఆవిడ సమయపాలన సక్రమంగా పాటించకపోవడంతో విసుగెత్తిన చక్రపాణి భానుమతి స్థానే కధానాయికగా సావిత్రిని తీసుకున్నారు. మాయాబజార్ సినిమా సంగీత దర్శకుడిగా ఎస్.రాజేశ్వరరావు ఓ నాలుగు పాటలు కంపోజ్ చేసిన తర్వాత నిర్మాతలతో ఏర్పడిన విభేదాలవలన పక్కకు తప్పుకోగా ఆయన స్థానంలో ఘంటసాల వచ్చారు. ఈవిధంగా విజయా వారి సినిమా నిర్మాణ బరువుబాధ్యతలంతా చక్రపాణి గారే భరించేవారు.
విజయావారి సినీ నిర్మాణం అంతా ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా జరిపించినట్లుగా కనిపిస్తుంది. తమ సినిమాలు ఒకే రకంగా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కావలసిన అన్ని అంశాలతో రూపొందించేవారు. ఒక ఏడాది సాంఘిక సినిమా తీస్తే ఆ మరుసటి సంవత్సరం జానపదం, తర్వాత మళ్ళీ సాంఘికం, ఇలా రొటేషన్ లోనే వారి సినీమాలు వచ్చాయి. విజయావారి మొదటి చిత్రం షావుకారు సాంఘికం, రెండవ సినిమా పాతాళభైరవి జానపదం, మూడవ సినిమా పెళ్ళిచేసిచూడు సాంఘికం, తర్వాత చంద్రహారం జానపదం, మిస్సమ్మ సాంఘికం, తర్వాత మాయాబజార్ పౌరాణికం...
అలాగే డైరక్టర్స్ కూడా సాంఘికాలను ఎల్.వి.ప్రసాద్
చేస్తే జానపదాలు, పౌరాణికాలను కె.వి.రెడ్డి చేసేవారు.ఈ ఆనవాయితీ 'అప్పుచేసి పప్పుకూడు' వరకు కొనసాగింది. తర్వాత విజయాలో ప్రసాద్ గారు పనిచేసినట్లు లేదు.
ఉదాత్తము, గంభీరము అయిన కథాశంతో కూడిన పెళ్ళిచేసిచూడు సినిమా కేవలం పెద్దలను మాత్రమే కాదు పిల్లలను కూడా అలరించింది. మద్రాసు ఆలిండియా రేడియో బాలానంద సభ్యులు --- కుందు, కందా మోహన్ , బేబీ గిరిజ (నటి కాంచన చెల్లెలు), బేబి ఉష, మొదలగువారు ఈ సినిమాలోని హాస్యాన్ని నూటికి నూరుపాళ్లూ పండించారు. పెళ్ళిచేసిచూడు లో సగం ప్రముఖ పాత్ర పిల్లలిదే. ఇంతవరకూ ఏ పెద్దల సినిమాలోను పిల్లలమీద ఏకంగా నాలుగు వినోదభరిత గీతాలు చిత్రీకరించిన దాఖలాలు లేవు. ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలోని ఆ పిల్లల పాటలు... 'బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా!'; 'అమ్మా నొప్పులే'; 'ఏవూరిదానవే వన్నెలాడీ' ఈనాటికీ కూడా అందరినీ గిలిగింతలు పెడుతున్నాయి. ఆ చిన్నపిల్లల పాటలను మాస్టర్ రామకృష్ణ, గిడుగు భారతి,ఉడత సరోజిని పాడారు.సినిమా మొదటి గంట కాలం పిల్లలదే. సినిమా ప్రారంభమైన గంటవరకు హీరో ఎన్టీఆర్ తెరమీద కనపడడంటే
ఎవరైనా నమ్ముతారా! కానీ పచ్చి నిజం. ఈనాడు అలా చూపిస్తే సూపర్ స్టార్ల వీరాభిమానులు ఊరుకుంటారా! తెరలు చించి, కుర్చీలు విరక్కొట్టి సోడాబాటిల్స్ తో రణరంగమే సృష్టిస్తారు. కానీ ఆనాడు సినిమా కు కధే ప్రధానం. కథ ప్రకారమే నాయికా నాయకుల ఉనికి.
మొదటినుంచి విజయావారి సినిమాలలో సంగీతానిదే పెద్ద పీట. శ్రవణానందకరమైన పాటలకు పెట్టింది పేరు సంగీతదర్శకుడు ఘంటసాలైనా, ఎస్.రాజేశ్వరరావు అయినా, పెండ్యాల అయినా, మరొకరు మరొకరు అయినా మెలొడికే ప్రాధాన్యత. విజయావారి పాటలెప్పుడూ ఆపాతమధురాలే. ఆ బీజం వేసింది విజయా తొలి ఆస్థాన సంగీత దర్శకుడు ఘంటసాలే అంటే అతిశయోక్తికాదు.
కర్ణాటక సంగీతంలో సుశిక్షితుడైన ఘంటసాలగారికి హిందుస్థానీ సంగీతం పట్ల కూడా చక్కటి అవగాహన వుంది. శాస్త్రీయ సంగీత రాగాలను లలితసంగీతానికి అనువుగా వినియోగించుకోవడంలో ఘంటసాలవారి ప్రతిభ అనన్య సామాన్యం. ఆవిషయం వారి తొలికాలపు సినిమాలనుండి ఆఖరి చిత్రాలవరకూ నిరూపిస్తూనే వచ్చాయి.
ఘంటసాలవారికి కళ్యాణి రాగమంటే మహా ఇష్టం అనే ముద్రపడింది విజయావారి షావుకారులోని 'పలుకరాదటే చిలుకా' పాటతోనే. ఈ పాటకు ముందు ఆ రాగంలో ఘంటసాలగారు మరేదైనా పాట స్వరపర్చి పాడారో లేదో తెలియదు కానీ, పెళ్ళిచేసిచూడు సినిమా లోని ఈనాటి సజీవరాగం ' పెళ్ళిచేసుకుని ఇల్లుచూసుకుని చల్లగ కాలం గడపాలోయ్' ను కూడా అదే కళ్యాణి రాగంలో చేసి సంగీతాభిమానుల అభిప్రాయాన్ని మరింత బలపర్చారు.
తదాదిగా ఘంటసాలగారు కళ్యాణి రాగంలో ఎన్నో పాటలు స్వరపర్చి గానం చేశారు. ఆ రాగంలో ఎన్ని పాటలు విన్నా విసుగుచెందని రీతిలో శ్రోతలను మైమరపించి పరవశింపజేసిన ఘనత ఘంటసాలగారిది.
అసలు మహత్తు అంతా ఆ రాగంలోనే వుంది. మంగళప్రదమైన రాగం కళ్యాణి. కర్ణాటక సంగీత మేళకర్తరాగ విభజనాచక్రంలో 'కళ్యాణి' 65వ మేళకర్త రాగంగా గుర్తింపబడింది.
మేళకర్త రాగం అంటేనే సంపూర్ణరాగం అని అర్ధం. ఆరోహణా
అవరోహణా క్రమంలో సప్తస్వరాలు వుంటాయి.
మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళ్యాణి రాగాన్ని విద్వాంసులు కచేరీ ఆరంభంలోనే ఆలపిస్తారు. ప్రసిధ్ధి పొందిన త్యాగరాజస్వామి వారి 'నిధి చాల సుఖమా', ముత్తుస్వామి దీక్షితులవారి 'కమలాంబాం భజరే' కీర్తనలు ఈ కళ్యాణి రాగానికి చెందినవే.
ఇక సినిమాల విషయానికి వస్తే కళ్యాణి రాగంలో పాటలు చేయని సంగీతదర్శకులే వుండరు. కర్ణాటక సంగీతంలోని కళ్యాణి రాగానికి సమాంతర హిందుస్థానీ రాగం 'యమన్'. ఈ యమన్ రాగంలో అనేక సూపర్హిట్ సాంగ్స్ హిందీ సినిమా లలో ఉన్నాయి. ఈ కళ్యాణి రాగ స్వరాలను వెస్ట్రన్ సంగీతంలో 'లిడియన్' అంటారు. అంతటి జగత్ప్రసిధ్ధి చెందిన కళ్యాణి
ఘంటసాలవారి ఇష్టసఖి కావడంలో ఆశ్చర్యం ఏముంది. ఈ
కళ్యాణిరాగంలో ఘంటసాలగారు పాడిన ప్రతి ఒక్కపాటా వైవిధ్యం తో కూడినవే.
'ఓ.. భావిభారత భాగ్యవిధాతలారా!' యువతీ యువకులారా!..' అని సాకీ ఎత్తుగడ... వారెవ్వా! తాధిన్న తకధిన్న తాంగిడితక తరికిటతక తోం... అన్న ముక్తాయింపు మనకెంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. పాట మొత్తం ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది. కథానాయకుడు సంగీతప్రియుడు, హార్మోనియం వాద్యగాడు కూడా కావడంవలన అతను పాడిన రెండు మూడు పాటలను హార్మోనియం ప్రధానవాద్యంగా మలచారు ఘంటసాల. సంగీతంతో ఏమాత్రం సంబంధంలేని హీరో ఎన్టీఆర్ నటనకు ఇదొక పెద్ద సవాలు. ఏదో ఆషామాషీగా హార్మోనియం ముందు కూర్చుంటే సన్నివేశం రక్తికట్టదు. అందుకోసం రామారావుగారు ప్రత్యేక శ్రధ్ధతో ఘంటసాలగారు ఈ పాటలను కంపోజ్ చేస్తున్నప్పుడు, రిహార్సల్స్ సమయంలో పక్కనే కూర్చుని హార్మోనియం ఎలా పట్టుకుంటారో, మెట్లమీద వ్రేళ్ళు ఎలా వుంచుతారో మొదలైన విషయాలను అవగాహన చేసుకుని ఆ విధంగా పాటల షూటింగ్ లో అనుసరించారట. ఈ పాట మరింత రక్తి కట్టడానికి ఎన్టీఆర్ తోపాటు తెరమీద తబలావాయించిన జోగారావు, పాటకు తగిన డ్యాన్సాడిన మాస్టర్ కుందుల నటన కూడా చాలా దోహదం చేసింది. ఘంటసాలగారు ఈ పాటను చాలా నాచురల్ గా, సునాయాసంగా, హుషారుగా పాడారు. ఆ కంఠంలోని మాధుర్యానికి, భావప్రకటనకు ఎవరైనా ముగ్ధులు కాకతప్పదు.
ఘంటసాలగారి వాద్యగోష్టి ఎప్పుడూ సున్నితంగా, వీనులవిందుగా వుంటుంది. కర్ణకఠోర ధ్వనులు దరికిచేరవు. ఈ పాటలో కూడా హార్మోనియం, వయొలిన్స్, పియానో, ఫ్లూట్, క్లారినెట్, తబలా, టేప్ (డప్పు) వంటి వాద్యాలనే సరళంగా ఉపయోగించారు.
పెళ్ళిచేసిచూడులో ఎన్ని పాటలున్నాయో అంతమంది గాయనీగాయకులుండడం ఓ విశేషం. పింగళివారు పదహారు పాటలను, ఊటుకూరు సత్యనారాయణ ఒక పాట వ్రాయగా వెరసి ఆ 17 పాటలను ఘంటసాలవారి సంగీత నిర్దేశకత్వంలో, ఆయనతోపాటు పి.లీల, రాణి, ఉడత, కోమల, భారతి, రామకృష్ణ, శకుంతల, జిక్కి , విజె వర్మ, పిఠాపురం, పామర్తి మొదలగువారు పాడించారు. సాటి గాయనీగాయకులను ప్రోత్సహించడం లో ఘంటసాలవారి సహృదయతకు ఈ సినీమా ఓ మచ్చుతునక.
ఎన్.టి.ఆర్, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, డా. శివరామకృష్ణయ్య, జోగారావు, పద్మనాభం, మహంకాళి వెంకయ్య, పుష్పలత మొదలగువారు నటించిన 'పెళ్ళిచేసిచూడు' తమిళంలో 'కళ్యాణం పణ్ణి పార్' ఒకేసారి తీసారు. పాటలన్నీ రెండు భాషలలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఓ పుష్కర కాలం తర్వాత విజయావారే ఈ సినిమా ను హున్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వంలో 'మదువే మాడినోడు' పేరుతో రాజ్ కుమార్, లీలావతి హీరో హీరోయిన్ లుగా కన్నడంలో తీసి మంచి విజయం పొందారు. ఆ సినిమాకు కూడా ఘంటసాలగారే సంగీతదర్శకత్వం వహించి హీరో పాటలు పాడారు. తెలుగులో లీల పాడిన పాటలను కన్నడంలో పి.సుశీల పాడారు. తెలుగు తమిళాలకు డైరక్ట్ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారు ఈ సినిమా ను హిందీలో 'షాదీ కె బాద్' గా స్వీయదర్శకత్వంలో రంగుల్లో నిర్మించారు. జితేంద్ర, రాఖి నటించిన ఈ చిత్రానికి లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు.
ఈ విధంగా విజయావారి మూడవ సినిమా 'పెళ్ళిచేసిచూడు' సర్వత్రా కళ్యాణప్రదంగా ప్రేక్షకులను ఆనందపర్చింది.
'పెళ్ళిచేసిచూడు' సినిమా పబ్లిసిటీ విషయంలో విజయావారు వినూత్న పోకడలు పోయారు. సినిమా విడుదలకు ముందు ఈ సినీమా కధలోని ముఖ్యాంశాలతో, ముఖ్య సూత్రధారులను పరిచయం చేస్తూ పింగళివారిచే ఒక పెద్దపాటను వ్రాయించి ఘంటసాలవారిచేత పాడించి దానిని ఆంధ్రదేశంలోని అన్ని థియేటర్లలో పెళ్ళిచేసిచూడు సినిమా స్లైడ్స్ మీద వినిపించి సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల గొప్ప ఉత్కంఠను కలిగించారు.
విజయావారికి ఘంటసాలగారి మీద ఎంత అభిమానమూ, నమ్మకమూ లేకపోతే ... 'గంట గంటకూ ఇంట ఇంటనూ ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ...' అని అంటారు! చిత్రం ఏమంటే ఈ ట్రైలర్ గీతాన్ని ఘంటసాలగారే పాడి తన గురించి తానే పరిచయం చేసుకున్నారు.
సినిమా పబ్లిసిటీ విషయంలో విజయావారి ఈ సరికొత్త
పోకడ మంచి ఫలితాలనే ఇచ్చింది.
నాకు ఏడేళ్ళ వయసులో 'పెళ్ళిచేసిచూడు' సినిమా బొబ్బిలి శ్రీరామా టకీస్ (రాజావారిదే) లో విడుదలైనప్పుడు కోటలోని ఘోషా స్త్రీలతోపాటు మా ఇంటి ఆడవాళ్లకూ అందిన ఆహ్వానం మేరకు ఆ సినిమాను మొదటిసారిగా బాక్స్ లో కూర్చొని పరదాల వెనకనుండి చూడడం ఎన్నటికి మరపురాని అనుభవం.
కొసమెరుపు:-
ఈ సినిమా లోని ' ఏడుకొండలవాడా వెంకటా రమణా' అనే గీతాన్ని ముందుగా జిక్కితో పాడించారు. ఆది రికార్డు గా కూడా వచ్చింది.
కానీ ఆ పాట తమకంత తృప్తికరంగా లేకపోవడంతో మరల పి.లీలతో పాడించి రికార్డు చేశారు.
ఆదే సినిమాలో కూడా వినిపిస్తుంది.
కర్ణాటక సంగీత రాగాలైన 'చారుకేశి','చక్రవాకం' లను తెలుగు సినిమాలకు మొట్టమొదటి సారిగా పరిచయం చేసినది ఘంటసాలగారే.
ప్రణవ స్వరాట్

