Saturday, 6 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 18 - మారుపల్కవదేమిరా నాతో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 18


సతీ అనసూయ - మారుపల్కవదేమిరా నాతో

 

సనాతన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారకులు. సృష్టికర్తయైన బ్రహ్మదేవుని మానసపుత్రులు దక్షప్రజాపతి, కశ్యపప్రజాపతి. అంటే సంకల్పమాత్రంచేత బ్రహ్మ మనస్సునుండి ఉద్భవించినవారు. బ్రహ్మదేవుడు చేసే సృష్టికార్యాన్ని అన్నిలోకాలలో విస్తరింపజేయడానికి, సకల జీవరాశులను సృష్టించడానికి బ్రహ్మకు సహాయకులుగా నియమింపబడినవారు. దక్షప్రజాపతికి అనేకమంది కుమార్తెలు. వారిలో చాలామందిని కశ్యపప్రజాపతి వివాహమాడాడు. వారిలో అదితి, దితి, వినత, కద్రువ, దను, గగనమండలంలో ప్రకాశించే  అశ్విని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రకాంతలు కశ్యపుని భార్యలే. అదితి, దితిలు మంచి చెడులకు, ద్వందప్రవృత్తులకు ప్రతీకలు. అదితి సంతానమైన  దేవతలు, దితి సంతానమైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు  రాక్షసులుగా వృధ్ధిచెంది ఎల్లవేళలా పరస్పరం కలహించుకుంటూండేవారు.

అదితి కశ్యపులకు 12 మంది సంతానం.  సూర్యుని రూపాలైన వీరిని ద్వాదశాదిత్యులని అంటారు. వీరు సంవత్సరంలోని 12 నెలలకు అధిపతులు. ఇంద్రుడు, మిత్రుడు, ధాత, వరుణుడు, విష్ణువు (వామనావతారం) మొదలగువారు.

అష్టైశ్వర్యాలకు, భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు నిలయం స్వర్గం. అటువంటి స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు.ఈయన భార్య శచీదేవి. ఐరావతం, ఉఛ్ఛైశ్రవం, వజ్రాయుధం వంటి అమూల్య విశేషాలకు స్వంతదారుడు. దేవేంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, మఘవుడు, సహస్రాక్షుడు అనే నామాలు గలవాడు. దేవతల రాజైన ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృధ్ధిగా పండడానికి ఇంద్రుడే కారకుడవడం చేత ముల్లోకాలు ఇంద్రుని పూజించేవి. యజ్ఞయాగాది క్రతువులు జరిపే సమయంలో హవిస్సులను ఇంద్రునికి సమర్పించి తృప్తి పరిచేవారు.

ఇక్కడ మరొక విషయం చెప్పవలసి వున్నది. స్వర్గలోక ఇంద్ర పదవి శాశ్వతం కాదు.  ఇంద్రపదవి ప్రతి మన్వంతరానికి మారుతూంటుంది.  మన్వంతరం అంటే 30+ కోట్ల మానవ సంవత్సరాలు. మొత్తం 14 మన్వంతరాలలో ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో వున్నాము. దీనికి వైవస్వత మన్వంతరం అని పేరు. ఇప్పుడు ఇంద్ర పదవిలో వున్నవాడు పురందరుడు. 8వ మన్వంతరమైన సావర్ణిలో బలి చక్రవర్తి ఇంద్రపదవిని చేపడతాడు.  సత్యవాక్కుతో  నీతి నియమాలు పాటిస్తూ ధర్మపథాన ప్రజలను కాపాడేవారికి, లోక సంక్షేమం కోసం నిరాటంకంగా నూరు యజ్ఞయాగాదులు నిర్వర్తించినవారికి   ఇంద్రపదవి లభిస్తుందని పురాణాలు చెపుతాయి.

భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు నిలయమైన స్వర్గలోకవాసం అందరికీ అందుబాటులో వుండదు. మానవులు తాము చేసిన పుణ్యకార్యాలననుసరించి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు. సజీవంగా బొందితో స్వర్గలోకంలో ప్రవేశించడమనేది భూలోకవాసులకు అసాధ్యం.

అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహాపతివ్రత అనసూయాదేవి. అత్రి మహర్షి భార్య. గొప్ప తపస్సంపన్నురాలు. జాతకంలోని దోషకారణంగా వైవాహిక జీవితానికి, సుఖసంతోషాలకు దూరమైన నర్మద అనే అభాగ్యురాలి కోరికను తీరుస్తూ అనసూయాదేవి తన తపోబలంతో నర్మదను సజీవంగా స్వర్గలోకానికి పంపిస్తుంది. ఆ సమయంలో నిరంతర సుఖభోగియైన దేవేంద్రుని అపురూప సౌందర్యవతియైన రంభ ...


మారుపల్కవదేమిరా నాతో -2

సుకుమారి ఒయ్యారి నిన్నే కోరి చేరా

                                                !మారు!

ఔరా! ఈ బిగువేల ఇది నీకు మేలా

ఆరడి సేయగనేలరా తగునటరా

                                                !మారు!

చక్కెరవిలుకాని ఉక్కున మెయిచిక్కి  

చిక్కిసగమాయె సొక్కిపోయెరా

చెక్కు చెక్కున చేర్చి చక్కెర మోమీర చుక్కరా! 

అందాలు చిందు పూరెక్కరా సొంపెక్కు వలపు 

కైపెక్కి మ్రొక్కె ముదమొలయ 

చెక్కునొక్కి మదికరుగ నిక్కపు  మక్కువ

మీరగ చేర్చవు అక్కున సరిగదా ప్రియమునను

                                                !మారు!

అంటూ శృంగార భాషణలతో, నృత్యగానాలతో తన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూంటుంది. అటువంటి రసపట్టువేళ, సమయంకాని సమయంలో ఒక సాధారణ మానవకాంతయైన నర్మద సజీవంగా స్వర్గప్రవేశం చేయడంతో ఇంద్రసభే దద్దరిల్లింది. కారణం తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహం చెంది  దేవలోకాన్నే నర్మదకు కనపడకుండా అదృశ్యపరుస్తాడు.  అక్కడనుండి అదంతా మరొక గాధ. ప్రస్తుతం మనకు అనవసరం.

సతీ అనసూయ సినిమాలో ఇంద్రుని మైమరపిస్తూ  రంభ గానం చేసిన శృంగారపద జావళీయే నేటి మన సజీవరాగం. ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు మరో మచ్చుతునక. సంగీత సాహిత్యాలు రెంటికి సమాన స్థాయి కల్పించిన ఈ గీతం జూనియర్ సముద్రాలగారి సాహితీప్రకర్షకు, ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి.

సినిమాలలో అరుదుగా వినపడే ... 'ఆరడి సేయుట'(హింసపెట్టుట)'చక్కెరవిలుకాడు' (చెఱకుగడని విల్లుగా ధరించేవాడు - మన్మథుడు)'ఉక్కున' (ప్రతాపం, శౌర్యం), 'మెయి' ( శరీరం), 'సొక్కి' (పరవశం), 'పూరెక్క'( సుకుమారమైన పుష్పరేక)'సొంపెక్కు'(అతిశయించిన) వంటి పదాలను ఉపయోగించి ప్రాచీన కవుల శృంగార పదరచనలను గుర్తు చేశారు చినసముద్రాలగారు.

సాహిత్యానికి దీటైన రీతిలో మెట్టుకట్టారు ఘంటసాలగారు. అందుకుగాను వారు ఎన్నుకున్న రాగం 'శ్రీరంజని'. 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యరాగం శ్రీరంజని. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఆరు స్వరాలు మాత్రమే వుండడంచేత ఇది షాఢవ-షాఢవ రాగంగా పరిగణిస్తారు. సప్తస్వరాలలోని ''(పంచమం) స్వరం శ్రీరంజనిలో వర్జ్యం. వదిలివేయబడింది. శృంగార, కరుణ, భక్తి రసాలను పలికించడానికి చాలా అనువైన రాగం శ్రీరంజని. హిందుస్థానీ బాణిలో కూడా కొంచెం భిన్నమైన రీతిలో  కాపి థాట్ లో శ్రీరంజని రాగాన్ని విద్వాంసులు ఆలపిస్తారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 'బ్రోచేవారెవరే, 'సొగసుగా మృదంగ తాళము',  'మారుబల్కకున్నావేమిరావంటి కీర్తనలు శ్రీరంజని రాగంలోనే కూర్చబడ్డాయి.  

శాస్త్రీయ సంగీతపు నుడికారం గల 'మారుపల్కవదేమిరా నాతో...అనే ఈ గీతాన్ని సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విదూషి శ్రీమతి ఎమ్.ఎల్.వసంతకుమారి చేత పాడించి ఎంతో ఔచిత్యాన్ని పాటించారు సంగీతదర్శకుడు ఘంటసాల. శాస్త్రీయగీతానికి కావలసిన సంగతులు, గమకాలు పుష్కలంగా గుప్పించిన   ఈ గీతాన్ని  వసంతకుమారి  అసమాన్యంగా ఆలపించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. 


ఈ పాటలో సంప్రదాయ నృత్య గీతాలకు ఉపయోగించే వాద్యాలనే తీసుకున్నారు ఘంటసాలగారు.  వీణ, వయొలిన్స్, ఫ్లూట్, మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్, గజ్జెలు వంటి వాద్యాలు ఈ పాటలో ప్రధానంగా వినిపిస్తాయి.

ఇక తెరపై ఈ జావళీకి అభినయం పట్టిన నర్తకి సామాన్యురాలు కాదు. తిరువాన్కూర్ సోదరీమణులుగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భరతనాట్య కళాకారిణులు - లలిత, పద్మిని, రాగిణిలలోని రాగిణి ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి కృష్ణమూర్తి గారి నృత్య నిర్దేశకత్వంలో   రంభగా ఇంద్రసభలో ఈ పాటకు నృత్యం చేసి సన్నివేశాన్ని రక్తికట్టించారు. స్వర్గలోకాధిపతి, అష్టదిక్పాలకులలో ప్రముఖుడు, సకల మునిగణాల పూజలను అందుకునే ఇంద్రుడు మన సినీమాలలో దుష్టుడిగా, రాక్షసప్రవృత్తి కలవాడిగా కనిపించడం వింతగా అనిపిస్తుంది. ఇది సినిమా వారి కల్పనా? లేక, పురాణాలలో కూడా ఇంద్రుడు అలాగే వుండేవాడా! ఏమో మరి తెలీదు.

దేవేంద్రుడి పాత్రను మన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు బాగానే పాట్రనైజ్ చేసి శాశ్వతం చేశారు. సినిమాలలో దేవేంద్రుడు అనగానే మన కళ్ళముందు నిలబడేది రాజనాల, మిక్కిలినేని, ఆర్.నాగేశ్వరరావు, ఎ.. సుబ్బారావు సీనియర్ & జూనియర్ లు మాత్రమే. వీరు ఇంద్రుడి పాత్రకు పేటెంట్ హక్కుదార్లుగా ప్రేక్షక హృదయాలలో నిల్చిపోయారు. 'సతీ అనసూయ' సినిమాలో ఇంద్రుడిగా రాజనాల తన సహజ ధోరణిలో నటించి మెప్పించారు.

'సతీ అనసూయ'లో  గీతగోవిందంలోని అష్టపది, నారదపురాణంలోని రెండు శ్లోకాలతో కలిపి మొత్తం 22 పాటలు పద్యాలు వుండగా వాటిలో అత్యధిక గీతాలను సముద్రాల జూనియర్, ఒకటి రెండు పాటలను  కొసరాజు వ్రాసారు. ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో ఆ పాటలను ఆయనతోపాటు పి.లీల, పి.సుశీల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది , కె.రాణి మొదలగువారు పాడారు.

ఈ సినిమా లోని కొన్ని పాటల రికార్డింగ్ కు, రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళేను. 1950 దశకంలో విడుదలైన 'నాగిన్' హిందీ సినిమాలోని నాగస్వరం పాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దశాబ్దాలపాటు మార్మోగింది. ఆ పాట మ్యూజిక్  ప్రభావం అన్ని భాషా చిత్రాలమీదా పడింది. ఆ పాట వరసతో మరెన్నో పాటలు వచ్చాయి. ఆ పాట కోసం సంగీతదర్శకుడు హేమంతకుమార్ నాగస్వరంలాగే వినపడే క్లేవైలిన్ అనే ఎలక్ట్రానిక్ వాద్యాన్ని ఉపయోగించారు. తదాదిగా ఏ సినిమాలో ఎక్కడ నాగుపాము కనిపించినా ఈ క్లేవైలిన్ వాద్యం తప్పనిసరి అయింది. ఆనాటికి అపురూపమైన క్లేవైలిన్ ను ఘంటసాలగారు కూడా  'సతీ అనసూయ' లో ' ఓ ... నాగదేవతా...' పాటలో, తర్వాత ఆ నాగుపాము కనపించే సన్నివేశాలలో  తన సొంత బాణీలో ఉపయోగించారు. ఈ క్లేవైలిన్ వాద్యమే తర్వాతి కాలంలో మరికొన్ని అదనపు వాద్య శబ్దాలతో యూనివాక్స్ గా రూపాంతరం చెందింది. 'సతీ అనసూయ' సినిమా లో ఈ క్లేవైలిన్ వాద్యాన్ని ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో పనిచేసే హనుమంతాచారి అనే ఆయన వాయించారు. హిందుస్థానీ సంగీతంలో ప్రవేశమున్న హనుమంతాచారిగారు మంచి గాయకుడు, నటుడు కూడా. అనేక కన్నడం సినిమాలలో హాస్యనటుడిగా నటించారు. ప్రేమనగర్ సినిమాలో కూడా ఏరోప్రేన్ సీన్ లో ANR తో కనిపిస్తారు. AVM వారి 'రాము' తెలుగుతమిళ సినీమాలలో బాలనటుడిగా గర్తింపు పొంది, నేషనల్ అవార్డ్ పొందిన రాజ్ కుమార్ ఈయన కుమారుడే. ఘంటసాలగారితో ఎంతో సన్నిహితంగా వుంటూ ఎన్నో సినీమాలలో పనిచేసిన హనుమంతాచారి 1981 లో  జరిగిన తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆక్సిడెంట్ లో దుర్మరణం చెందారు.

సతీ అనసూయ సినిమా సంగీతపరంగా ఘంటసాలగారికి మంచి పేరును తెచ్చిపెట్టడమేకాక ఆర్ధికంగా కూడా గొప్ప విజయం సాధించింది. రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత సుందర్ లాల్ నహతా తన రెండవ చిత్రమైన 'సతీ అనసూయ' దర్శకత్వ బాధ్యతలను పౌరాణిక చిత్ర నిర్మాణంలో అనుభవజ్ఞుడైన  దర్శక నిర్మాత కడారు నాగభూషణం కు అప్పగించారు. సతీ అనసూయ టైటిల్ రోల్ లో అంజలీ దేవిఆమె భర్త అత్రి మహర్షి గా  గుమ్మడి నటించారు. ఇతర ముఖ్యపాత్రలలో జమున, ఆమె కురూపి భర్తగా కె.వి.ఎస్.శర్మఅమర్నాథ్, కాంతారావు, రేలంగి, ముక్కామల, పద్మనాభం, రాజనాల, సూర్యకళ నటించారు.


కొసమెరుపు -

ఇటీవలి కాలంలో 'సతీ అనసూయసినిమా వాల్ పోస్టర్లలో  అందాల రాకుమారుడిగా ఎన్.టి.రామారావు బొమ్మ  ప్రముఖంగా కనిపిస్తూ ఎన్.టి.ఆర్ అభిమానులకు  కన్నులవిందు చేస్తూంటుంది. అయితే ఆయన ఆ సినిమాలో ఎక్కడా కనపడరు. ఆ రోజుల్లో సినిమా ఆఖరున వేసే జాతీయగీతానికి మర్యాదపూర్వకంగా ఓ రెండునిముషాలు కూడా వేచివుండే ఓపికలేకుండా  థియేటర్లలోనుండి బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ ఆ సినిమాలో అసలు కనపడివుండరు. సతీ అనసూయ పాతివ్రత్య ప్రభావంతో నర్మద కురూపి భర్త (కె.వి.ఎస్.శర్మ) పునర్జీవుడై  లేచినప్పుడు సుందరాంగుడైన ఓ రాకుమారుడిగా ఎన్.టి.ఆర్  రెండు నిముషాలపాటు  దర్శనమిస్తారు. నామకార్ధం రెండు మూడు డైలాగ్స్, నో సాంగ్స్, ఓన్లీ జెస్చర్స్. సినిమాలో కనిపించే త్రిమూర్తులకు, అత్రిఅనసూయలకుసినిమా చూస్తున్న ప్రేక్షకులకు జమున ప్రక్కన నిల్చుని నమస్కారాలు చేయడంతో  సరి.   సినిమా టైటిల్స్ లో వేసినట్లుగా ఎన్.టి.ఆర్ ది  ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఓన్లీ. అదే ఎన్.టి.ఆర్  ఆ సినిమా ప్రొడ్యూసర్ సుందర్లాల్  నహతా తీసిన మొదటి సినిమా  'జయంమనదే' లో ఫుల్ లెన్గ్త్ డాషింగ్ ఎండ్ డైనమిక్ హీరో.  ఆనాటి నటీనటులు, నిర్మాతల మధ్యనుండే స్నేహ సుహృద్భావాలకు ఇదొక చక్కని నిదర్శనం.


ఎన్.టి.ఆర్ గెస్ట్ అపియరెన్స్


వచ్చేవారం, మరో ఘంటసాల సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 30 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 17 - ఓ నా రాజా... ఇటు చూడవోయీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 17


సారంగధర - ఓ నా రాజా... ఇటు చూడవోయీ

 

'అమ్మాయి తంజావూరు తమిళం... అబ్బాయి రాజమండ్రి తెలుగు...అంటే లౌవ్ మ్యారేజి అన్నమాట...,  అదేం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే... పెళ్ళి తంజావూరు, రిసెప్షన్ రాజమండ్రి. రెండు పక్కలవారు బాగా కావలసినవాళ్ళే.'

'ఎక్కడి రాజమండ్రి, ఎక్కడి తంజావూరు!  ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో కదా! సాంస్కృతిక సమైక్యత అంటే ఇదే. రాజమహేంద్రవరం(రాజమండ్రి), తంజావూరుల సత్సంబంధం అనగానే హిందూదేశ  చరిత్ర పట్ల ఆసక్తికలవారికి వేయి సంవత్సరాల క్రితం నాటి దక్షిణ భారత తూర్పు చాళుక్య, చోళ సామ్రాజ్యాల వైభవం, కళాప్రాభవం గుర్తుకు రాకతప్పదు.

పదవ శతాబ్దంలో గోదావరి పరివాహిక ప్రాంతమైన వేంగి సామ్రాజ్యాన్ని  పరిపాలించిన తూర్పు చాళుక్య మహారాజు విమలాదిత్యుడు. ఆయన భార్య కుందవై. వీరి కుమారుడు రాజరాజ నరేంద్రుడు. ఇతని తల్లియైన కుందవై తంజావూరు కేంద్రంగా సువిశాల దక్షిణాది ప్రాంతాలను పరిపాలించిన  మొదటి రాజరాజచోళుడి కుమార్తె.  రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతని కుమార్తె అమ్మంగాదేవి చాళుక్య ప్రభువైన రాజరాజ నరేందుని భార్య.ఈ దంపతుల కుమారుడు రాజేంద్ర చాళుక్యుడు. ఈయన చోళరాజులైన రాజేంద్ర చోళుడు, వీరరాజేంద్ర చోళుడు, ఆ తర్వాత వచ్చిన అధిరాజేంద్రుని మరణానంతరం 1070 లో చోళ సింహాసనాన్ని అధిష్టించి కులోత్తుంగ చోళునిగా పేరు మార్చుకున్నాడు. గోదావరి ప్రాంత వేంగి రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో విలీనం చేసి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. శ్రీలంక, దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతాల వరకు చోళ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.

ఈ విధంగా ఈ రెండు రాజ్యాలు దక్షిణభారతాన్ని కొన్ని శతాబ్దాల కాలం నిరాటంకంగా పరిపాలించాయి. ఈ కాలంలోనే దక్షిణాదిన దేవాలయ సంస్కృతి, సంగీత, సాహిత్య, నృత్యశిల్పాది లలితకళలు అమితంగా పోషించబడి సాంస్కృతిక నిలయంగా పరిఢవిల్లింది.

తర్వాతి కాలంలో ఈ చరిత్రల ఆధారంగా వెలువడిన గురజాడ అప్పారావుగారి 'సారంగధర'( ఇంగ్లీషు, తెలుగు)కల్కి కృష్ణమూర్తిగారి ('పొన్నియిన్ శెల్వన్' - తమిళం), వీటి ఆధారంగా రూపొందించబడిన 'సారంగధర', 'రాజరాజ చోళన్', మణిరత్నంగారి 'పొన్నియిన్ శెల్వన్' తెలుగు, తమిళచిత్ర కళాఖండాలు వరసగా మన కళ్ళముందు మెదులుతాయి.

11వ శతాబ్దపు 'సారంగధర' చరిత్ర ఒక కాల్పనిక చారిత్రక గాధ.  కాదు నిజంగానే జరిగిందని కొందరి నమ్మిక. అందుకు  రాజమహేంద్రవరం (రాజమండ్రి) లోని సారంగధర మెట్ట, చిత్రాంగి, రత్నాంగి మేడలే నిదర్శనమని చెపుతారు. గురజాడ అప్పారావుగారు వ్రాసిన సారంగధర చరిత్ర పద్య నాటకం తెలుగు, ఇంగ్లీషు భాషలలో దేశవ్యాప్తంగా ప్రదర్శించబడి మిక్కిలి ప్రసిధ్ది పొందింది.

ఈ పద్య నాటకం ఆధారంగా సారంగధర చరిత్రను మూడుసార్లు సినిమా గా తీశారు. 1930 లో వై.వి.రావు మూకీ చిత్రం, 1937 లో బందాకనకలింగేశ్వరరావు సారంగధరుడిగా, శాంతకుమారి చిత్రాంగిగా, కన్నాంబ రత్నాంగిగా  పి పుల్లయ్య దర్శకత్వంలోమరల 1957 లో ఎన్.టి.రామారావు సారంగధరుడిగాపి.భానుమతి చిత్రాంగిగా  నిర్మించారు. ఇదే సినిమాను తమిళంలో కూడా శివాజీ గణేశన్ హీరోగా తీసి 1958 లో విడుదల చేశారు. తెలుగులో నటించిన భానుమతి, ఎస్.వి.రంగారావు, రాజసులోచన, శాంతకుమారి తమిళంలో కూడా నటించగా, నంబియార్ వంటి మరికొందరు తమిళ నటులు తమిళంలో నటించారు. తమిళం సినిమాకు జి.రామనాథన్, తెలుగులో ఘంటసాల సంగీతం నిర్వహించారు. ఎవరి బాణీలు వారివే. తెలుగు, తమిళ గీతాలు వేర్వేరు వరసలలో కూర్చబడ్డాయి.

ఘంటసాలవారి బాణీలో చిత్రాంగి భానుమతి అద్భుతంగా ఆలపించిన ఒక మధురాతి మధుర గీతమే నేటి మన సజీవరాగం.

విశేషాలులోకీ వెళ్ళేముందు ఆ పాట సన్నివేశ పూర్వాపరాలు చూద్దాము.

సారంగధర కథలో ప్రధాన పాత్రయైన చిత్రాంగి అందచందాలు వాటివెనుక దాగిన తీవ్రమైన  ఆమె గుణాతిశయాల  విషయంలో సకలశాస్త్ర పారంగతుడురాజగురువు, ఆదికవియైన నన్నయభట్టు చేసిన  హితోపదేశాలు పెడచెవినబెట్టికుమారుడు సారంగధరుడికి చిత్రాంగిని వివాహం చేసుకోవడం ఇష్టంలేదని తెలిసిన తర్వాత  వియ్యమందకపోతే కయ్యం తప్పదన్న నిర్బంధం ఒకప్రక్క, చిత్రాంగి అందచందాల వ్యామోహం మరోప్రక్క వేంగిచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ప్రలోభాలకు గురిచేసింది. దుష్టుడైన ఒక సేనాపతి కుయుక్తితో వంశాచారం పేరుతో కత్తికి బాసికం కట్టించి   ఆమెను మోసగించి వివాహమాడతాడు.

రాజగురువు ముందుగానే ఊహించి చెప్పినట్లు చిత్రాంగి రాకతో, ఆమెలో రగిలిన పగ విద్వేషాల కారణంగా ఎన్నో అనర్ధాలు జరిగి వంశనాశనం జరుగుతుంది. సినిమాలో కథను విషాదాంతం చేయడం ఇష్టంలేక  చనిపోయిన సారంగధరుని ఒక సిద్ధుని  దయవలన మరల బ్రతికించినట్లు చూపించారని ఒక అభిప్రాయం వుంది.

ఇక మన సజీవరాగం విషయానికి వద్దాము.

తాను మెచ్చిన యువకుడి (సారంగధరుడు) నే తన తండ్రికూడా తనకు వరుడిగా నిర్ణయించాడని తెలిసి చిత్రాంగి( భానుమతి) మహదానందంతో అతని చిత్రపటం చూస్తూ పాడిన పాట ... ఓ నా రాజా! ఇటు చూడవోయీ... చిత్రాంగి - భానుమతి - గానం, ఘంటసాల సంగీతం, సముద్రాల సీ. గీత రచన


ఓ నా రాజా... ఇటు చూడవోయీ

నేనోయ్... భీతి వలదోయీ ! ఓ నా రాజా

అలిగిపోతివి అలనాడు

ఔనా నేడేది నీకు దారి ! ఓ నా రాజా!

 

కోరి తమి మీరి దరిజేరనా

మురిసి నీ మ్రోల కరిగిపోనా

వేసీ కూరిమి చెరలోనా ఆ...

కొసరి నా దాసు జేసుకోనా

                                ! ఓ నా రాజా ! 


చిత్రాంగి చిన్నెలు అనే నానుడి వుంది. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్యులవారు ఉపయోగించిన - 'నేనోయ్', 'భీతి వలదోయీ', ' నేడేది నీకు దారి', కూరిమి చెర', 'కొసరి నా దాసు చేసుకోనా' అనే పదాలు చిత్రాంగి యొక్క అభిజాత్యం , మనోప్రవృత్తి స్పష్టం చేస్తాయి. ఈ సన్నివేశానికి ముందు వచ్చే సన్నివేశంలో సారంగధరుడుఅతని ప్రేయసి కనకాంగి ల మధ్య 'అన్నానా! భామిని ఏమని' అనే యుగళగీతం సాగుతుంది. అందులో  కనకాంగి 'నిన్నే నమ్ముకున్నానని నీవే నా దైవమని' అనే భావాన్ని ప్రకటించడంలో  ఆమె యొక్క వినయవిధేయతలు ప్రియుడిపట్ల గల ఆరాధనాభావం వెల్లడవుతోంది.

ఈ రెండు పాటల ద్వారా చిత్రాంగి, కనకాంగి పాత్రల గుణగణాలను, తీరుతెన్నులను  ఆచార్యులవారు చక్కగా తెలియజెప్పారు. సంగీతదర్శకుడిగా ఘంటసాలగారు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతిగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం 'సారంగధర'. భానుమతి గారు నటించిన 'పుణ్యవతి'కి కూడా ఘంటసాలగారే సంగీతదర్శకుడైనా ఆ సినిమా లో భానుమతిగారు పాడిన పాటలు లేవు. విశేషమే.

సారంగధర చిత్రం లో భానుమతిగారు నాలుగు పాటలు పాడారు. డ్యూయెట్లు లేవు. ఘంటసాలగారితో కలసి కొన్ని సంవాద పద్యాలు వున్నాయి. భానుమతి , ఘంటసాలగార్ల మధ్య మనస్పర్ధలున్నాయని ఆ కారణంగా సారంగధర లోని భానుమతి గారి పాటలను వేరొకరిచేత చేయించారనే అపోహ ప్రచారమయింది. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజంలేదని సారంగధర సినిమాలోని భానుమతిగారి పాటలను ఘంటసాలగారే పూర్తిగా స్వరపర్చారని, ఆయనే స్వయంగా భానుమతిగారి చేత ఆ పాటల రిహార్సల్స్ చేయించి రికార్డింగ్స్ జరిపించారని సారంగధర సినీమాకు పనిచేసిన ఘంటసాలగారి సహాయకుడు సంగీత దర్శకుడు పి.సంగీతరావుగారు స్పష్టం చేశారు.

ఆపారమైన శాస్త్రీయ సంగీతానుభవం గల ఘంటసాల మాస్టారు 'ఓ నా రాజా.... ఇటు చూడవోయీ' పాటను 'యమన్అనే హిందుస్థానీ రాగంలో స్వరపర్చి తనకు కావలసిన రీతిలో భానుమతి గారిచేత అద్భుతంగా పాడించారు. హిందుస్థానీ 'యమన్' రాగాన్నే మన కర్ణాటక సంగీతంలో 'కళ్యాణి' అంటారు. కళ్యాణి రాగంలో ఘంటసాల మాస్టారు చేసిన పాటలు, ఇతరులకోసం పాడిన పాటలు జగత్ప్రసిధ్ధి పొందిన విషయం సంగీతాభిమానులందరికీ తెలిసినదే.

భానుమతి గారి గళంలోని, శ్రావ్యతరాగభావాలు, పాత్రోచిత అభినయం 'ఓ నా రాజా.. ఇటు చూడవోయీ...పాటకు వన్నె తెచ్చి  సజీవరాగం చేశాయి.  పాటలోని గమకాలలో ఆలాపనలో, భావప్రకటనలో ఘంటసాలగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ పాటలో వీణ, పియానో, గిటార్, మేండొలిన్, వయొలిన్స్ , ఫ్లూట్, క్లారినెట్, తబలా, ఇతర రిథిమ్స్ భానుమతిగారి పాటకు దీటుగా అమరాయి.

సముద్రాల సీనియర్ గారి పాత్రోచిత సంభాషణలు, పాటలు సారంగధర చిత్రానికి నిండుదనాన్ని, గౌరవాన్ని తెచ్చాయి. సందర్భానుసారంగా ఉపయోగించిన నన్నయభట్టు ఆంధ్రమహాభారత పద్యాలుచేమకూర వెంకటకవి సారంగధర నాటక పద్యాలు ఈ సినిమాకు వన్నె తెచ్చాయి.  సారంగధర సినిమాలో మొత్తం 22 పాటలుపద్యాలు వున్నాయి. వాటన్నింటినీ ఘంటసాల, భానుమతి, పి.లీల, జిక్కి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత మొదలగువారు పాడారు.

సారంగధర చిత్రంలోని నటీనటులంతా హేమాహేమీలే ... ఎస్.వి.రంగారావు (రాజరాజనరేంద్రుడు)ఎన్.టి.రామారావు (సారంగధరుడు)భానుమతి (చిత్రాంగి)రత్నాంగి (శాంతకుమారి)రాజసులోచన (కనకాంగి)గుమ్మడి (సింగన మంత్రి)ముక్కామల ( దుష్ట సేనాపతి)మిక్కిలినేని (నన్నయభట్టు)చలం (సుబుధ్ధి)ఎ.వి.సుబ్బారావు (చిత్రాంగి తండ్రి), రేలంగి, సురభి బాలసరస్వతి ( చిత్రాంగి చెలికత్తె) అందరూ తమ తమ పాత్రలలో పూర్తిగా లీనమైపోయి నటించారు. తెలుగు, తమిళ భాషా చిత్రానికి  వి.ఎస్.రాఘవన్కె.ఎస్.రామచంద్రరావులు దర్శకత్వం వహించగా మినర్వా పిక్చర్స్ బ్యానర్ మీద టి నామదేవ రెడ్డియార్  సారంగధర చిత్రాన్ని నిర్మించారు.

సారంగధర సినిమా మా కుటుంబానికి ఎప్పటికి మరుపురాని, మరువలేని మధుర జ్ఞాపకం. 1957 ఏప్రిల్ లో మా తాతగారు, ఘంటసాలవారికి గురుదేవులైన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం లో కాలధర్మం చెందారు. గురువుగారి స్మృతికి చిహ్నంగా ఘంటసాలగారు  గురువుగారి 'లలితే సరసగాన కళాశ్రితే' అనే కీర్తనను సారంగధర సినిమా టైటిల్ మ్యూజిక్ గా మలచి గురువుగారి పట్ల తనకు గల శ్రధ్ధాభక్తులను చాటుకున్నారు.



కొసమెరుపు - 

ఇప్పుడు చెన్నైలో వున్న  తేనాంపేట మెట్రో రైల్వే స్టేషన్ వెనక వేపు రేవతీ స్టూడియో ఉండేది. దానిని మౌంట్ రోడ్ రేవతి అనేవారు. ఆ రేవతీ స్టూడియోలోనే 'సారంగధర' సినిమా పాటల రికార్డింగ్రీ-రికార్డింగ్ జరిగింది. సౌండ్ ఇంజనీర్ కణ్ణన్ అనే గుర్తు.  చాలా భాగం రీరికార్డింగ్ లకు నేనూ వెళ్ళేవాడిని . వరసగా ఓ మూడు రోజులపాటు 2-9 కాల్షీట్ లో ఆ సినిమా రీ-రికార్డింగ్ జరిగిన గుర్తు.

రీరికార్డింగ్ సమయంలో సౌండ్ లేకుండా సినిమా చూస్తూ డైలాగ్స్ పోర్షన్ మీద ఆర్కెష్ట్రా మ్యూజిక్ పోస్ట్ చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం ఆరు-ఏడు గంటల మధ్య టీ బ్రేక్. ఆ సమయంలో  ఆరుబయట లాన్స్ లో అందరూ ఆ సినిమా కంపెనీవారు ఇచ్చే కాఫీ టిఫిన్లు ఆరగించి, సిగరెట్లు కాలుస్తూ లోకాభిరామాయణం చేసేవారు. ఒకరోజు అలాటి సమయంలో తూర్పు ఆకాశంలో దూరంగా మిణుకుమిణుకుమంటూ ఏవో  పయనించడం కనిపించింది. ఆ చీకట్లో ఆకారాలేవీ కనపడలేదు. అవి కాంటినెంటల్ సూపర్ జెట్స్ అని కొందరు, కాదు ఎయిర్ బెలూన్స్ అనిఅదేం కాదు పేపర్లలో కూడా వచ్చింది అవి ఫ్లైయింగ్ సాసర్సే అని వాటిలో ఇతర గ్రహవాసులుంటారని వాళ్ళవల్ల మన భూమికి నాశనం ఏర్పడుతుందని, ఇలా  రకరకాలుగా చర్చించుకోవడం మొదలెట్టారు. ఇంతలో వీళ్ళ చర్చలకు బ్రేక్ ఇస్తూ నెక్స్ట్ సీన్ రీరికార్డింగ్ కు మాస్టారి పిలుపురావడంతో ఆర్కెష్ట్రా అంతా ధియేటర్లోకి పరుగెత్తారు. ఆ తర్వాత ఆ కాంతి గ్రహాల గురించి పట్టించుకున్నవాళ్ళే లేరు.


వచ్చేవారంఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్


Saturday, 23 May 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 16 - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 16


వినాయకచవితి - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే


"ఈ శెలవుల్లో మనందరం  అమ్మమ్మగారి వూరెడుతున్నాం"  అమ్మకి ఆనందం, పిల్లలికి ఆటంబాంబ్. "అమ్మమ్మ ఊరికా! నో ఛాన్స్, నేను ఛస్తే రాను! అక్కడికి వస్తే అమ్మమ్మ  వారం వారం నలుగుపిండితో నలుచుకుని కుంకుడుకాయరసంతో తలంటు స్నానం అంటూ టార్చర్ పెడుతుంది. ఆ హరాస్మెంట్ భరించడం నావల్లకాదు. నే రానంటె రానే రాను"  మనవడి ఓవర్ రియాక్షన్.

"నలుగుపిండితో తలంటుస్నానం ఒంటికి ఎంతో మంచిది తెలుసా! మీ షాంపూలు, షవర్ బాత్ ల కంటే చాలా ఆరోగ్యకరం. మా చిన్నప్పుడు విధీగా ప్రతీ శనివారం తెల్లవారుజామునే పిల్లల్ని లేపి ఒంటికి నువ్వులనూనె పట్టించి, బియ్యపుపిండి, శెనగపిండిలో పసుపుపొడి, పన్నీరు  వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి, ఆ ముద్దతో ఒళ్ళంతా నలిచి, కుంకుడుకాయరసంతోనో లేకపోతే షీకాయ ముద్దతోనో తలంటు స్నానం చేయించేవాళ్ళు! ఆ తర్వాత సాంబ్రాణి పొగతో జుట్టంతా ఆరబెట్టి జడలేశేవారు. ఇప్పటికీ నా ఒళ్ళు ఇంత నున్నగా, నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా వుందంటే దానికి కారణం నలుగుపిండి స్నానమే తెలుసా!" బామ్మ సెల్ఫీ.

మా బామ్మ  పురాణకాలపు కబుర్లని , సూక్తిముక్తావళిని శ్రద్ధగా వింటూ పాటించే ఏకైక శ్రోత మా మున్నీ ఒక్కర్తే. నలుగుపిండి తయారీ గురించి వాటిలోని ఔషధ గుణాలగురించిఅవి మన ఒంటికి చేసే మంచి గురించి బామ్మ లెక్చెర్ ని మహా శ్రద్ధగా ఆలకిస్తోంది.

"అసలు నలుగుపిండి తలంటు స్నానం వెనుక ఒక గొప్ప పౌరాణిక గాధే వుంది తెలుసా"!  కథలు, కాకరకాయలు అంటే మైమరచిపోయే మా మున్నీ ఆ కధేమిటో చెప్పమని బామ్మని ఊదరకొట్టింది.

అప్పుడు మా బామ్మ చెప్పిన కథాకధనం బెట్టిదనినా...

ఫ్లాష్ బ్యాక్ లో...

కైలాసం  

హిమవన్నగంలో పార్వతీ పరమేశ్వరుల ఆవాసం. ఇల్లు, ఇల్లాలు అసలు ఈలోకంతోనే సంబంధం లేదనట్లుగా ఒక ఏకాంత ప్రదేశంలో శివుడు ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తూ  తపస్సమాధిలో  వున్నాడు. పతి ప్రేమాదరణలకు దూరమై ఏకాంతవాసంలో వున్న పార్వతి ...

మధురహాసా మృదువిలాసా

శైలసుత హృదయేశా కరుణించి 

తనను దరిచేర్చుకోమని దీనంగా ప్రార్ధిస్తున్నది. పార్వతి విరహవేదనను, శోకాన్ని తట్టుకోలేని చెలికత్తెలు స్వాంతన వాక్యాలు పలికి పార్వతిని సర్వాంగసుందరంగా అలంకరించి మహేశునిచెంతకు తీసుకువెళ్ళాలని పరిపరివిధాలుగా సపర్యలు చేయడం మొదలెడతారు. అందులో భాగంగా పార్వతీదేవి చెలికత్తెలంతా ....

"నలుగిడరే నలుగిడరే నలుగిడరారే

చెలువుగ శ్రీగౌరికిపుడు నలుగిడరారే!


పసిడిపూలపీటా శివునిల్లాలికి వేయరే

జతజేసి కస్తూరి జవ్వాజీ పూయరే

పసుపుగలిపి చందనమూ నెమ్మేన రాయరే! నలుగిడరే!

 

మనసులోని వగదీరా పన్నీరు చల్లరే

చిన్నారీ కన్నులలో  వెన్నెలలు కాయగా 

చెలియ మోము గని శివుడే చిందేసి డాయగా ! నలుగిడరే!


అంటూ నృత్యగీతాలతో  పార్వతి దేహమంతా పరిమళద్రవ్యాలు కలిపిన నలుగుపిండితో నలిచి అభ్యంగన స్నానానికి సంసిద్ధం చేస్తారు. ఆ విధంగా తన శరీరానికి పట్టించిన నలుగుపిండితో  పార్వతీదేవి ఒక అందమైన బాలుడి ప్రతిమను రూపొందిస్తుంది. అతి సుందరంగా వున్న ఆ బాలుడి ప్రతిమను చూసి ముచ్చటపడిన చెలికత్తెలంతా ఆ బొమ్మకు ప్రాణం పోయమని కోరడంతో పార్వతీదేవి తన దివ్యశక్తులతో ఆ ప్రతిమకు ప్రాణంపోస్తుంది. ముద్దులొలికే ఆ బాలుడిని చూసి పార్వతి మాతృహృదయం ఉప్పొంగి ఆ బాలుని తన కుమారునిగా స్వీకరిస్తుంది. తాను స్నానం చేసి వచ్చేదాకా పరులెవ్వరు లోపలికి రాకుండా కాపలాగా వుండమని తన కుమారుని ఆదేశించి లోపలకు వెళుతుంది.

అదే సమయంలో పరమశివుడు తన ధ్యానాన్ని ముగించుకుని పార్వతి ని చూచేందుకు వస్తాడు. శివుడు లోపలికి వెళ్ళడానికి వీలులేకుండా పార్వతీపుత్రుడు అడ్డుపడతాడు. ఇద్దరిమధ్యా వాగ్వాదం పెరిగి పెద్దై ఆగ్రహావేశాలతో త్రినేత్రుడు ఆ బాలుని శిరస్సును   తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఇంతలో స్నానంచేసి వచ్చిన పార్వతి తన కుమారుని మృతదేహాన్ని చూసి తీవ్రంగా చలించి విలపిస్తుంది. తర్వాతే పరమేశ్వరుడు జరిగిన విషయమంతా తెలుసుకుని పార్వతీ పుత్రుని పునరుజ్జీవుడిని చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఆ బాలుని శిరస్సు లభించకపోవడం ఉత్తరదిక్కుగా పోయి ఉత్తరాభిముఖంగా తలపెట్టుకొని వున్న ఏ జీవి శిరస్సునైనా తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞ మేరకు శివసేవకులు ఉత్తరాభిముఖంగా వున్న ఒక ఏనుగు శిరస్సును ఖండించి తీసుకువస్తారు. ఆ శిరస్సును మృతదేహానికి అతికించి మరల ప్రాణాలను పోస్తాడు మహేశ్వరుడు. ఆవిధంగా పార్వతీ తనయుడు గజముఖుడు అయ్యాడు. తర్వాత, పరమశివుడు ఆ కుమారుని కైలాసంలోని ప్రమధగణాలకు అధిపతిని చేశాడు. అందువలన గణపతి అని పిలవబడుతున్నాడు. ఏ కార్యం తలపెట్టినా తనను తొలుతగా పూజించి ప్రార్ధించేవారికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఆ కార్యం విజయవంతం చేసే దైవం కనుక గణపతిని విఘ్నేశ్వరుడని , వినాయకుడని దేవతలందరిచేతా కీర్తించబడ్డాడు. ఈనాటికీ మన అందరికీ తొలిదైవం వినాయకుడే.

అదీ కథ. చూశావా ! నలుగుపిండి స్నానం వెనుక ఎంతటి మహత్తర గాధ వున్నదో !

ఈవిధంగా నలుగుపిండి మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగమైపోయింది. పెళ్ళిళ్ళుపండగలు, మరే ఇతర శుభకార్యాలు జరిగినా మంగళకరమైన ఈ నలుగుపిండి స్నానాలు తప్పనిసరి.

మన పౌరాణిక గాధలలో కూడా దేవుళ్ళ కళ్యాణ ఘట్టాలలో ఈ నలుగు స్నానాల గురించి రసవత్తర వర్ణనలు కనిపిస్తాయి. మన జనపదాలలో  స్త్రీలకు సంబంధించిన అనేక పాటలలో నలుగు పాటలకు కూడా ప్రాముఖ్యత నిచ్చారు. గత తరం వరకు  భారతీయ స్త్రీలంతా ఆయా పాటలను తమ తల్లులు, అమ్మమ్మలు, బామ్మల ద్వారా నేర్చుకుని పండగ పర్వదినాలలో సందర్భానుసారంగా ఆ గీతాలను భక్తిశ్రధ్ధలతో పాడుతూ సంతోషంగా గడిపేవారు.

ఈ సదాచారాన్ని మన సినిమాలు కూడా బాగానే  ఉపయోగించుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పడుతూ వాటి విశిష్టతను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకుని, చూసి ఆనందించేలా చక్కటి నృత్యగీత సన్నివేశాలను రసవత్తరంగా రూపొందిచేవారు. ఎంతో కళాత్మకదృష్టితో ఉదాత్తంగా ఆయా ఘట్టాలను కన్నులకింపుగా చిత్రీకరించేవారు. కన్నులకువీనులకు విందుచేసే అటువంటి నృత్యగీతం ... 'నలుగిడరే నలుగిడరే నలుగిడరారే' 1957 నాటి పౌరాణిక చిత్రరాజం 'వినాయకచవితి' సినీమాలోని పాట అదే నేటి మన సజీవరాగం.

ట్యాలెంట్ ఉన్న కళాకారులెందరో సినిమా రంగంలో వుండేవారు. అయితే వారందరికీ నిరంతరం అవకాశాలు లభించేవికావు. ప్రతిభ, విద్వత్ గల ఎంతోమంది గాయనీగాయకులు ప్రథమశ్రేణి గాయకులుగా రాణించే అవకాశాలు లభించక కోరస్ సింగర్స్ గానే మిగిలిపోయారు. అలాటి వారిని చూసి ఘంటసాల మాస్టారు చాలా బాధపడేవారు. అవకాశం వున్నంతవరకు తన సంగీతదర్శకత్వంలో కోరస్ పాటలు పాడే గాయనీగాయకులను ఎంతగానో ఆదుకుని ప్రోత్సహించేవారు.

ఈ నాటి మన సజీవరాగ గీతం ఒక బృందగానమే.  ఘంటసాల  మాస్టారు ఈ పాటను వైదేహి, ఉడత సరోజినిసత్యవతి అనే  గాయనులచేత సన్నివేశానికి తగినట్లుగా భావరాగ గమకయుక్తంగా పాడించారు. వినాయకచవితి సినిమాలో ఈ సన్నివేశంలో తెరమీద పార్వతీ దేవిగా సూర్యకళ, చెలికత్తెలుగా బాల, రాజేశ్వరి, శ్రీదేవీలు నటించారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి  తన శుద్ధశాస్త్రీయ సంగీత విద్వత్ ను ఉపయోగించలేదు. సాధారణ కుటుంబాలలో సంగీతం తెలియని సామాన్య స్త్రీలు పాడుకునే  నోముల పాటలు, మంగళహారతుల పాటల రీతిని అనుసరిస్తూ మన ప్రాంతీయత ప్రతిబింబించేలా సున్నితంగా, శ్రావ్యంగా ఈ పాటను తనదైన శైలిలో పాడించారు. ఇదమిద్ధంగా ఈ పాట ఫలానా రాగంలో వుందని చెప్పబడదు కానీ, ఖమాస్, దేశ్, తిలాంగ్ రాగ ఛాయలు వున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రాగాలు హిందుస్థానీ సంగీతం లోని ఖమాస్ థాట్ కు చెందినవే.

ఈ సందర్భం స్నానానికి, అందుకు సంబంధించిన వస్తుసామగ్రితో నిండినది కావడంతో ఘంటసాల మాస్టారు ఈ పాటలో జలతరంగిణి, ట్యూబోఫోన్ వాద్యాలు స్ఫుటంగా వినపడేట్లు ఉపయోగించారు. ఇతర వాద్యాలుగా వయొలిన్స్, సెల్లో, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ రిధిమ్స్ వినిపిస్తాయి.

ఘంటసాలగారిలోని సంగీతజ్ఞానాన్ని బాగా వినియోగించుకున్న సినిమా వినాయకచవితి. ఈ సినిమాలో మొత్తం 25 పాటలు, పద్యాలు, శ్లోకాలు వున్నాయి. ఇవికాక సన్నివేశాలను elevate చేయడానికి రీరికార్డింగ్. వీటన్నిటితో ఘంటసాలగారు ఈ సినిమాలో బాగానే శ్రమించి మంచి ఫలితాలు పొందారు. ఈ పాటలు, పద్యాలను ఘంటసాల, లీల, సుశీల, రాణి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, రాఘవులు, వైదేహి, సరోజిని, సత్యవతి మొదలగువారు పాడారు.

వినాయకచవితిలోని  అన్ని పాటలను, మాటలను వ్రాసిన సముద్రాల రాఘవాచార్యులవారే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ముచ్చటగా మూడే సినిమాలకు డైరక్షన్ చేపట్టిన సముద్రాల వారి మొదటి సినిమా వినాయకచవితి కాగా, మిగిలిన రెండూ భక్త రఘునాధ్ (ఘంటసాలగారి స్వంత చిత్రం), బబృవాహన సినిమాలు.

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు నిర్మించిన మొదటి పౌరాణిక చిత్రం  'వినాయకచవితి'లోఎన్.టి.రామారావు, గుమ్మడి, జమున, కృష్ణకుమారి, సూర్యకళ, రాజనాలఆర్.నాగేశ్వరరావు, మిక్కిలినేని, జి.ఎన్.స్వామి, బాలకృష్ణ, నటించారు.


కొసమెరుపు:

మాయాబజార్ సినిమా తర్వాత  ఎన్.టి.రామారావు పూర్తి స్థాయి కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయకచవితి.  ఈ రెండు సినిమాలు  1957లో కొన్ని నెలలు వ్యవధిలో విడుదలై ఘనవిజయం సాధించాయి. వినాయకచవితి సినిమాలో శ్రీకృష్ణ పాత్రధారి ఎన్.టి.ఆర్.కు ఒక పాటకానీ, పద్యం కాని లేకపోవడం ఒక విశేషం.


వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 18 - మారుపల్కవదేమిరా నాతో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...