Saturday, 19 September 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 33 - ఒల్లనోరి మామా నీ పిల్లనీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 33


లవకుశ - ఒల్లనోరి మామా నీ పిల్లనీ


మన జాతిపిత, మహాత్మా గాంధీజీ కి రఘువంశ శ్రీరాముడన్నా, రామరాజ్యమన్నా చాలా విశ్వాసం. ఆయన తన ఆఖరి క్షణాల్లో కూడా హరే!రామ్! అంటూ రాముడినే తలచుకున్నారు. నవీన భారతదేశం రామరాజ్యంగా తీర్చిదిద్దబడాలని గాంధీజీ ఆకాంక్షించారు.

రామరాజ్యమంటే ఏదో ఒక వర్గానికో, లేక, హిందూమతాన్ని అవలంబించే వారికోసం ఏర్పడిన రాజ్యం మాత్రం కాదు. రామరాజ్యమంటే ధర్మం, నీతి, న్యాయం, సత్యం, అహింసలనే సూత్రాల ఆధారంగా నడిచే ఆదర్శవంతమైన ప్రజాపరిపాలనే రామరాజ్యం. ధనిక వర్గం, పేదవర్గం అనే తేడాలేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన నీతి, న్యాయం, సుఖసంతోషాలతో హాయిగా జీవించడానికి సమాన అవకాశాలు కల్పించడమే రామరాజ్య లక్ష్యం. క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన జీవనమే ఆర్ష ధర్మ లక్షణమని పెద్దలు చెపుతారు. ధర్మదేవత ఒకప్పుడు నాలుగు పాదాలమీద నడిచేదట. ఆ నాలుగు పాదాలు ఏవంటే... సత్యము, శౌచము, దయ, తపస్సు. ఎప్పుడైతే కలియుగం ప్రారంభమైనదో అప్పటినుంచి ప్రజలలో దౌష్ట్యం, హింస పెచ్చు పెరిగి శౌచము, దయ, తపోనిష్ట అనే లక్షణాలు క్రమక్రమంగా మాయమై ధర్మదేవత ఒంటికాలిపై కుంటినడకలు నడుస్తున్నది.

యుగ యుగానికి కాలమాన పరిస్థితుల ప్రకారం ధర్మం నిర్దేశించ బడుతుంది. ఆ యుగ ధర్మానుసారం ప్రజలు తమ జీవనాన్ని క్రమబద్ధంగా న్యాయమైన రీతిలో కొనసాగించాలి.  నిందలకు, అపఖ్యాతులకు ఎంతటివారైనా తలొగ్గక తప్పదు. ముల్లోకాలలో పురుషోత్తముడిగా, ధర్మనిరతితో ప్రజారంజకముగా పరిపాలన సాగించే ఆదర్శమూర్తిగా పేరుగాంచిన శ్రీరాముడు సైతం అభియోగాలు, అపనిందలకు బలియైనాడు. అది తన సాటి మహారాజుల వలనో లేక సర్వజ్ఞులైన ఋషుల వల్లనో కాదు. కేవలం ఒక అవివేకి, సంస్కారహీనుడు  వ్యక్తిగత నిందలకు పాల్పడడంతో శ్రీరాముడి సంసార జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. అల్పుడైన ఒక తాగుబోతు చాకలి సీతామాత సౌశీల్యాన్ని శంకిస్తూ మత్తులో పలికిన మాటలను శ్రీరాముడు జనవాక్యంగా భావించి న్యాయ పరిరక్షణ కోసం తన భార్య, గర్భవతియైన సీతాసాధ్విని ఒంటరిగా అడవుల్లో వదిలిపెట్టించాడు.

విద్యావిహీనుడు, కుసంస్కారియైన చాకలి తిప్పడు ఉత్తర రామాయణంలో ప్రధాన పాత్రధారి. సీతారాముల వియోగానికి మూల కారకుడు. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ గాధను ఏడవ శతాబ్దపు కవి భవభూతి సంస్కృతంలో, తర్వాత తిక్కన నిర్వచనోత్తర రామాయణంగా, 18వ శతాబ్దపు కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని (చంపూకావ్యం) గా రచించారు. చంపూకావ్యమంటే పద్యము, గద్యము రెండూ మిళితమైవున్న కావ్యం.  నెల్లూరి సీమకు చెందిన పాపరాజు గారు తన ఉత్తర రామాయణం కావ్యాన్ని తన ఇష్టదైవమైన మదనగోపాల స్వామివారికి అంకితం చేశారట.

చేమకూర వెంకటకవి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన కవి కంకంటి పాపరాజు. ఆయన వ్రాసిన ఉత్తర రామాయణం పద్య-గద్య కావ్యం ఆధారంగా ప్రముఖ సినీకవి వెంపటి సదాశివబ్రహ్మం గారు తయారు చేసిన కధను లలితా శివజ్యోతి ఫిలింస్ ఎ.శంకరరెడ్డి 'లవకుశ' రంగుల సినిమాగా నిర్మించి 1963 లో విడుదల చేశారు.

లవకుశుల కథలో ప్రతినాయకుడు, కీలకపాత్రధారి అని చెప్పుకోదగ్గ చాకలి తిప్పడి దుష్ప్రేలాపనల గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం. అదే... 'ఒల్లనోరి మామా నీ పిల్లని.....'

ఘంటసాల:

ఒల్లనోరి మామా నీ పిల్లని

నేనొల్లనోరి మామా నీ పిల్లని అబ్బా నీ పిల్ల

దీని మాటలెల్ల కల్ల సంసారమంత గుల్ల ! నేనోల్లనోరి!

జిక్కి:

నన్నొల్లనంతవెందుకు మామయ్య...

నా వల్ల నేరమేమిర అయ్యయ్యో...

దెయ్యాన్ని కోడుదునా దేవతనే కోడుదునా

నూతిలోన పడుదునా గోతిలోన పడుదునా

ఘం. 

హె...య్య! చమతకారి నాయాలా ఊరుకో

సూరిగాడి ఇంటికాడ చూడలేదటే నిన్ను

మారుమాటలాడతావ మాయదారి గుంట

నిన్ను సూస్తె వొళ్లుమంట నేనోల్లనోరి మావా నీ పిల్లని

రాఘవులు: 

నా మాటిన్రా బాబు అయిందానికి అల్లరెందుకల్లుడా

ఓరల్లుడ మేనల్లుడ మా అప్పగోరి పిల్లడా ! అయిందానికి!

మీ తప్ప మొగం చూడర మా అమ్మిని కాపాడరా

ఘం. 

నేనోల్లనోరి మావా నీపిల్లని

రాణీ :

చూడు తప్పేమీ జేసింది తమ్ముడా ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా తప్పతాగి వున్నావు సెప్పుడు మాటిన్నావు_2

అప్పడగబోయింది అదీ ఒక తప్పా... ఏరా అప్పడగబోయింది అదీ ఒక తప్పా

ఘం.

అప్పా ఓలప్పా నీ మాటలు నేనొప్పా ఇకచాలును నీ గొప్పా

నా అలి గుణము ఎరుగన నేనేలుకోను తీసుకు పో !ఒల్లనోరి!

జి.

నీ తాగుబోతు మాటలింక మానరా    

నేసత్యమైన ఇల్లాలిని చూడరా

 నే నగ్గి ముట్టుకుంటా అరిసేత బట్టుకుంటా 

తలమీద పెట్టుకుంటా

 ఘం. 

ఛె..య్య్... యెర్రిరాముడంటివోణ్ణి కాదులే నేను యెర్రి రాముడంటి

వోణ్ణి కాదులే గొప్ప శౌర్యమున్న ఇంట బుట్టినానులే .. చూడు

అగ్గిలోనబడ్డ నువ్వు బుగ్గిలోనబడ్డ పరాయింట ఉన్నదాన్ని పంచచేరనిస్తానా

 వల్లనోలే పిల్లా ఇంకెల్లీపో..ఫో.. -2

ఫో.. ఫోయే ఫోయే... నీ యాల  

"...సూరిగాడి యింటికాడ చూడలేదటే నిన్ను... మాయదారి గుంట... అగ్గిలోనబడ్డ నువ్వు బుగ్గిలోనబడ్డ పరాయింట ఉన్నదాన్ని పంచ చేరనిస్తానా... నేనేం యెర్రి రాముడంటివోణ్ణి కాదులే ... గొప్ప శౌర్యమున్న యింట బుట్టినానులే ... ఒల్లనోరి మామా నీ పిల్లని..." పరనింద, ఆత్మస్తుతి, పెళ్ళాం శీలాన్ని శంకించి దుర్భాషలాడడం ఈ పాటలోని ప్రధానాంశం. సంస్కారం, ఔచిత్యం ఎరుగని మనుషులు ఎలా రచ్చకెక్కి తమ పరువు కుటుంబపరువునే కాక తమకు సంబంధంలేని ఇతరులను కూడా అవమానపరుస్తారో చాలా సహజంగా మాండలీక భాషలో తెలియజెప్పారు కవి సదాశివ బ్రహ్మంగారు. ఈ పాటంతా ప్రాస పదాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయి.

రావణ వధానంతరం సీతాదేవి రాముడిని చేరడానికి ముందు అగ్నిప్రాయోపవేశంజేసి తన సౌశీల్యాన్ని నిరూపించుకున్న విషయాన్ని కూడా కవి నర్మగర్భంగా ఈ పాటలో ప్రకటించారు. లవకుశుల కథకే కీలకమైన ఈ పాటను సదాశివ బ్రహ్మంగారు చాలా రసవత్తరంగా వ్రాశారు.

గీత రచన ఉత్తమంగా వుంటే స్వర రచన కూడా ఉన్నతంగా వుంటుందని లవకుశ సినిమా సంగీతదర్శకుడు ఘంటసాల నిరూపించారు. వివేకం, విచక్షణ లేని కుటుంబాల్లోని దెబ్బలాటలు ఏరీతిలో వుంటాయో  అద్భుతంగా ఈ పాటలో  పాడి చూపించారు ఘంటసాల, జిక్కి, రాఘవులు, రాణీలు. మరి, యాదృచ్ఛికమా లేక ఘంటసాలగారు కావాలనే చేశారో మనకు తెలియదు కానీ, జానపద శైలిలో సాగే ఈ పాటలో ఏ రాగలక్షణాలు స్పష్టంగా కనపడవు. చాకలి తిప్పడు లాంటి తాగుబోతు  రాగయుక్తంగా పాడగలడని మనం మాత్రం ఎలా అనుకుంటాము? సన్నివేశానికి, సందర్భానికి తగినట్లుగా మంచి రసస్ఫూర్తిగల పాటనే మనకు అందించారు ఘంటసాల. లవకుశ సంగీతం గురించి తలచుకున్నప్పుడల్లా ఈ 'ఒల్లనోరి మామా నీ పిల్లని...' పాట కూడా తప్పక గుర్తుకువస్తుంది.

ఘంటసాల గాత్ర వైవిధ్యానికి ఒక మచ్చుతునక. మాస్టారు ఈ పాటలో మేండొలిన్, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్ , తబలా, డోలక్, జముకు వంటి వాద్యాలను జానపద సంగీత రీతిలో ఉపయోగించారు.

గత నాలుగైదు వారాల ఘంటసాల సజీవరాగాలను జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎంతటి విలక్షణ

(versatile) గాయకుడో, సంగీతదర్శకుడో అర్ధమవుతుంది.

'ఒల్లనోరి మామా నీ పిల్లని' పాట ఎంతో జనాదరణ పొంది ఈనాటికి సజీవమైన నిలిచి వుండడానికి కారణం ఘంటసాల గారి గానం, సంగీతం ఒక ఎత్తైతే, ఆ సన్నివేశంలో నటించిన రేలంగి, గిరిజ, శివరామకృష్ణయ్య, అన్నపూర్ణల సహజ   నటన మరో ఎత్తు. గత తరంలో గ్రామ ప్రాంతాల్లోని సామాన్య ప్రజానీకంలో  వుండే భావోద్వేగాలు, వారిలో రేగే కుటుంబ కలహాలను రేలంగి, గిరిజ, శివరామకృష్ణయ్య చాలా సహజంగా నటించి చూపారు.

ఏ సినీమాలోనైనా ఏ సన్నివేశమైనా రక్తి కట్టాలంటే సంబంధిత కళాకారులు, సాంకేతిక నిపుణులు పాత్రల స్వభావాన్ని  అర్ధం చేసుకుని తగిన ఔచిత్యాన్ని కనపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. రసరమ్య సంగీత కావ్యం లవకుశ. ఘంటసాల వారి అపూర్వ సంగీత సృష్టి లవకుశ  సంగీతం. నవరస సమన్వితము. నవరత్నోజ్జ్వల కాంతివంతము లవకుశ సంగీతప్రభ. ధన్యంబాయె తెనుగు రసజ్ఞ హృదయంబుల్.

లవకుశ సినిమాలో వున్నన్ని శ్లోకాలు, పద్యాలు, పాటలు మరే ఇతర సినిమాలోనూ అంతవరకు రాలేదు. ఈసినిమాలో 21 అనుశ్రుతంగా వస్తున్న సంప్రదాయం శ్లోకాలు, కంకంటి పాపారాజు, దువ్వూరి రామిరెడ్డి, సదాశివబ్రహ్మం పద్యాలు; సీనియర్ సముద్రాల గారు, సదాశివ బ్రహ్మంగారు, కొసరాజు గారు వ్రాసిన 18 పాటలు, వాటికి అమర్చబడిన సంగీతం లవకుశకు మణిమకుటం. లవకుశ లో మాటలు ప్రభావం కన్నా పాటలో ప్రభావమే మిన్న.

లీల, సుశీల సంగీత ప్రజ్ఞకు పెను పరీక్ష లవకుశ రామాయణ గీతాలు. పోటాపోటీగా గానం చేసి విజయం సాధించారీ గాయనీ మణులు. ఘంటసాలగారితో పాటు, జిక్కి, జానకి, రాణి, కోమల, ఎస్.వరలక్ష్మి, ఉడుత సరోజిని, మాధవపెద్ది, మల్లిక్, జె.వి.రాఘవులు, సౌమిత్రి, లవకుశ పాటలకు జీవం పోసారు. ఇందులోని ప్రతీ పాటా, పద్యం, శ్లోకం అన్నీ  ఈనాటికి ఏనాటికీ ఆణిముత్యాలే.

శ్రీరాముడిగా నటించిన ఎన్.టి.రామారావుకు, సీతాదేవిగా నటించిన అంజలీదేవికి ప్రేక్షకుల మనస్సుల్లో ఒక ప్రత్యేక స్థాయిని ఏర్పరచిన సినిమా  లవకుశ. లక్ష్మణుడు కాంతారావుకు కేంద్రప్రభుత్వ జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన సినిమా లవకుశ. శ్రీమద్రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షి అంటే నాగయ్యేనని చాటిచెప్పిన సినిమా లవకుశ. బాల నటులు నాగరాజు, సుబ్రహ్మణ్యం లను ఈనాటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని ఆదరించి అభిమానిస్తున్నారంటే అందుకు కారణం లవకుశ సినిమాయే. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులంతా కూడా తమ తమ పాత్రల్లో చాలా సహజంగా ఒదిగిపోయేలా చేసిన ఘనత లవకుశ దర్శకులు సి.పుల్లయ్య, సి.ఎస్.రావుగార్లదే.

కళాత్మకమైన భారీసెట్లకు, మునివాటికలకు అత్యుత్తమమైన రూపకల్పన చేసిన ఆర్ట్ డైరెక్టర్ టి.వి.ఎస్.శర్మగారి పనితనం, దానిని మరింత అద్భుతంగా కన్నులుపండువగా రంగుల్లో తెరకెక్కించిన కెమేరామెన్ పి.ఎల్.రాయ్ ప్రజ్ఞపాటవాలు లవకుశను ఒక మరపురాని కళాఖండంగా తీర్చిదిద్దాయి.

1934లో ఈస్టిండియా కంపెనీ వారు పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని లతో మొదటిసారిగా లవకుశ సినిమా ను తీసారు. ఆ సినిమా కు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యగారే ఈ కొత్త లవకుశ కు మొదటి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో సంయుక్తంగా ప్రారంభమైన లవకుశ నిర్మాణ కాలంలో ఏర్పడిన ఆర్ధిక సమస్యల  వలన సినిమా పూర్తికావడానికి ఆరేళ్ళు పట్టిన మాట నిజం. ఈలోగా పుల్లయ్య గారు అనారోగ్యపాలవడం వలన ఆయన స్థానే ఆయన కుమారుడు సి.ఎస్.రావుగారు మిగిలిన సినిమాను పూర్తిచేశారు. అలాగే, తమిళ చిత్రం పంపిణీదారులు లేవనెత్తిన ప్రాంతీయ వాదం సమస్యల వలన సగం పాటలు స్వరపరిచిన తర్వాత తమిళ లవకుశ సంగీత దర్శకుడిగా ఘంటసాలగారి స్థానే కె.వి.మహదేవన్ గారిని నియమించడం జరిగింది. ఆర్ధిక లావాదేవీలు వలన నిర్మాత ఎ.శంకరరెడ్డి అనేక కోర్ట్ కేసులను ఎదుర్కొన్నారు.

లవకుశ  అపూర్వ సంగీతానికి నిర్మాణ జాప్యం ఒక కారణమనే భావన చాలామందిలో వుంది. అది అంత సమంజసంగా నాకు తోచదు. నాకు తెలిసి ఘంటసాలగారు కూడా ఎప్పుడూ ఆ విధమైన భావాన్ని వ్యక్తం చేయలేదు. తాను, ఆచార్యులవారు కలిసి కూర్చొని ఒకటికి పదిసార్లు సావకాశంగా ఆలోచించుకుని లవకుశలోని రామాయణాలను మనసుకు తృప్తి కలిగేలా రూపొందించామని రేడియో ఇంటర్వ్యూ లో చెప్పారు.

కాలాతీత నిర్మాణం వలన ముఖ్య నటీనటుల, బాలనటుల వయసులోని మార్పులు సినిమా లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా ప్రేక్షకులు అదొక లోపంగా భావించకుండా కథాకధనంలో, ఆద్యంతం వీనులకు విందు చేసే దివ్య సంగీతంలో  తాదాత్మ్యం చెందారు.

లవకుశ సంచలన విజయం తెలుగు సినీరంగాన ఒక గొప్ప చరిత్ర. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు వసూళ్ళు అంతంతమాత్రమే. సినిమా ఫెయిలయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అనూహ్యంగా మూడవ వారం నుండి వసూళ్ళు పుంజుకుని  విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయదుందుభులు మ్రోగించింది. తెలుగులో 500 రోజులు ఆడిన మొదటి సినిమాగా, ఎన్నో థియేటర్లలో రజతోత్సవాలు, శతదినోత్సవాలు  జరుపుకున్న  మొదటి సినిమాగా  చరిత్ర సృష్టించింది.  తెలుగు లవకుశ  ఇతరభాషలలో డబ్ చేయగా  అక్కడ కూడా రజతోత్సవ, శతదినోత్సవ సినిమాగా నమోదు కావడం అపూర్వ విషయం.

లవకుశ అపూర్వ ఆర్ధిక విజయం నిర్మాత ఎ శంకరరెడ్డి గారికి ఏమాత్రం ఉపయోగించలేదు. ఆ సినిమా నెగెటివ్ రైట్స్ ను కొనుగోలు చేసిన సుందర్లాల్ నహతాగారికి కనకవర్షం కురిపించింది. ఏ నిముసానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు. విధివిలాసాన్ని ఎవరూ తప్పించలేరు.


కొసమెరుపు:

'రాకోయీ అనుకోని అతిథి...' అని అనుకునేలా లవకుశ సినిమా వీక్షకుల తాకిడికి మేము గురయ్యాము. మా బొబ్బిలిలో ఈ సినిమా ఆడినంతకాలం రోజూ చుట్టుపక్కల గ్రామాల్లోని చుట్టాలు, స్నేహితులు కుటుంబ సమేతంగా సినిమా చూడ్డానికి వచ్చి రాత్రి తిరిగి  వాళ్ళ ఊళ్ళకు వెళ్ళే అవకాశం లేక మా చిన్ని ఆశ్రమం(పురిల్లు)లోనే నిద్ర చేసి ఉదయం లేచి వారి వూళ్ళకు వెళ్ళేవారు. కేవలం నిద్రతో సరిపోదు కదా, గృహస్తు కనీసం మర్యాదలు తప్పనిసరి. అలా చుట్టాలు, సన్నిహితులు లేని పరాయి గ్రామ  వీక్షకులు కుటుంబాలతో సహా ఎడ్లబళ్ళలో తరలివచ్చి లవకుశ రెండాటలు చూసి సినిమా హాలు సమీపంలో ఆరుబయట చెట్లక్రింద  బళ్ళల్లో, బళ్ళ క్రింద ఎండుగడ్డి, చాపలు పరుచుకుని నిద్రపోవడం నాకెంతో వింతగా, ఆశ్చర్యంగా అనిపించేది.

 

వచ్చేవారం, మరల, ఘంటసాల వారి మరో సజీవరాగంతో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 12 September 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 32 - హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 32


వాల్మీకి - హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా


ఒకసారి జనసంచారం లేని అరణ్యమార్గంగా నారదమహర్షి పయనిస్తూండగా ఒక దొంగ తారసపడి  నారదునివద్ద వున్న వస్తువులను  బలవంతాన తస్కరించబోయాడు. నారదుడు ఆ దొంగను మాటలతో మభ్యపెట్టి అతను దొంగతనాలకు పాల్పడడానికి కారణమడిగాడు. అప్పుడా దొంగ తన భార్య కోరికలు, ముచ్చట్లు తీర్చడానికి, కుటుంబసభ్యులను పోషించడానికి అరణ్యంలో సంచరించే బాటసారులను హింసించి దోచుకుంటున్నాని చెప్పాడు. దొంగతనం, ఇతరులను హింసించడం పాపకార్యమని, పాపకర్మల ద్వారా వచ్చిన ధనంతో సుఖసంతోషాలననుభవిస్తున్న దొంగ కుటుంబం అతని పాపాలను కూడా పంచుకుంటుందో లేదో తెలుసుకోమని నారదుడు ఆ దొంగకు సలహా ఇచ్చాడు. ఆ దొంగ తన భార్యను, కుటుంబ సభ్యులను   తన సంపాదనను అనుభవిస్తున్నట్లు గానే పాపాలలో కూడా భాగం పంచుకుంటారు కదా అని అడిగాడు. భార్యా పిల్లలను, కుటుంబాన్ని పోషించడం అతని బాధ్యత, కర్తవ్యమని అందుకోసం అతను చేసే పాపకార్యాలతో తమకేమాత్రం సంబంధం లేదని, అందుచేత అతని పాపాలను పెంచుకునే ప్రసక్తే లేదని నిష్కర్షగా తేల్చిచెప్పేశారు.

ఈ సంఘటనతో జీవితంపట్ల విరక్తి చెంది కర్తవ్యవిమూఢుడైన ఆ దొంగ మరల నారదుని దర్శించి తనకు తరుణోపాయం ఉపదేశించమని కోరుకున్నాడు. అప్పుడు నారదమహర్షి ఆ దొంగతో 'రామ'నామ బీజాక్షరి మంత్రాన్ని తదేక ధ్యానంతో జపిస్తే అతనిలోని అజ్ఞానం తొలగి సాత్విక లక్షణములు అలవడి మానసిక శాంతిని, సంతోషాన్ని పొందగలవని ఉపదేశిస్తాడు. అజ్ఞానం వలన, విద్యావిహీనత వలన 'రామ' శబ్దాన్ని ఉచ్ఛరించడానికి ఇబ్బందిపడుతున్న ఆ దొంగను 'మర మర' యని జరిపించమని సలహాయిచ్చి నారదుడు వెళ్ళిపోతాడు. ఆ దొంగ ఏకాగ్రచిత్తంతో 'మర మర' అని జపించడం ప్రారంభిస్తాడు 'మర మర' అనే నామం క్రమక్రమంగా 'రామ'నామ బీజాక్షరిగా అతని నోట జపించబడింది. అతను తన పరిసరాలను, ఇహలోకాన్ని  పూర్తిగా మరచి తపోనిష్టలో మునిగిపోయాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అతని చుట్టూ దట్టమైన పుట్టలు పెరిగిపోయాయి.

రామనామం ఎంతో మహిమ కలది. అష్టాక్షరీ  మంత్రంలోని 'రా' ను, పంచాక్షరీ మంత్రం లోని '' కలిసి 'రామ' శబ్దంగా మారింది. 'రా' అంటే అగ్ని బీజం. శరీరాన్ని , మనసును ఉత్తేజపరుస్తుంది. '' అంటే అమృతబీజం. మనశ్శాంతిని చేకూరుస్తుంది. రామనామ జపం వలన సర్వపాపాలు తొలగిపోయి జ్ఞానం, మనశ్శాంతి, ముక్తి సిద్ధిస్తాయని పండితులు చెపుతారు.

ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సు తర్వాత పుట్టలోని మనిషికి భగవదనుగ్రహం లభించింది. మహామనీషియై బ్రహ్మజ్ఞానం పొందాడు. సుదీర్ఘ తపోనిష్టలోనుండి బయటకు వచ్చాడు. పుట్టకు సంస్కృతంలో వాల్మీకం అని పేరు. అందులోనుండి బయటకు వచ్చినవాడు కనుక వాల్మీకియైనాడు. ఆ పుట్ట పరిసరాల్లోనే ఒక ఆశ్రమం నిర్మించుకుని సాత్విక జీవనం చేయసాగాడు.

ఒకరోజు ఉదయం వాల్మీకి నదీస్నానం ముగించుకుని తిరిగివస్తూండగా ఒక చెట్టుమీద మోహపరవశత్వంలో వున్న జంట క్రౌంచపక్షులలో ఒకదానిని బోయవాడొకడు బాణంతో కూల్చడం చూసాడు. వాల్మీకి హృదయం కరుణతో ద్రవించి పోయింది. ఆక్రోశం తో ఆశువుగా ఒక శ్లోకం ఆయన నోట వెలువడింది. అదే....

 ఆదిశ్లోకం:

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః

యత్ క్రౌంచ మిధునాదేక మవధీ కామమోహితమ్

'ఓ కిరాతకుడా! కామమోహితమై యున్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని నీవు చంపావు కాబట్టి శాశ్వత కాలం సత్కీర్తిని అనుభవించలేవు' అని శపించారు.


నిజానికి ఇక్కడ వేటగాడి రూపంలో వచ్చినది మహావిష్ణువు. క్రౌంచ పక్షుల రూపంలో సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులను వధించడానికి మారు రూపం ధరించాడు. ఈ శాప ఫలితంగా వేటగాడి రూపంలో వున్న మహావిష్ణువు  తన రామావతారకాలంలో  సీతాదేవిని కోల్పోయి సుదీర్ఘమైన భార్యావియోగాన్ని అనుభవించాడు.

ఆధ్యాత్మిక విశ్లేషకులు ఈ శ్లోకానికి రామాయణం పరంగా మరోలా అర్ధం చెపుతారు.

'మా' అంటే లక్ష్మీదేవి.'నిషాద' అంటే లక్ష్మీదేవికి నివాసమైన వాడు మహావిష్ణువు (శ్రీరాముడు). ఓ! లక్ష్మీనివాసుడైన శ్రీరామా నీవు ఈ లోకాన శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు అందుకుంటావు. ఎందువలన అంటే ... క్రౌంచ పక్షుల జంటలాంటి రావణాసుర, మండోదరీ దంపతుల్లో కామమోహితుడైన అసురుడు రావణుని నీవు వధించి లోకకళ్యాణం చేశావు. వాల్మీకి నోటమ్మట ఆయనకు తెలియకుండానే 'మా' (లక్ష్మి) అనే అక్షరంతో ప్రారంభమై శ్రీరాముని కీర్తించే మంగళ శ్లోకం వెలువడింది. శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు బీజం పడింది. భారతీయులందరికీ ఆదికవి వాల్మీకి. ఆది శ్లోకం 'మా నిషాద..' ఆదికావ్యం శ్రీమద్రామాయణం.

 వాల్మీకి మహర్షి జన్మ వృత్తాంతం విషయంలో ఒక్కొక్క పురాణం ఒక్కొక్కలా వర్ణించింది. కచ్చితమైన చారిత్రకాధారాలు వున్నట్లు కనపడదు.

శ్రీరామచరిత్ మానస్ (తులసీ రామాయణం)ను వ్రాసిన 16 వ శతాబ్దపు భక్తుడు, కవియైన శ్రీ తులసీదాస్ వాల్మీకి అవతారంగా ఉత్తర భారతీయులు విశ్వసిస్తారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తన దివ్యదృష్టితో దర్శించగల బ్రహ్మజ్ఞాని వాల్మీకి.

శ్రీరాముడు ఈ భువిని జన్మించడానికి ముందే రామకథను రామాయణ మహాకావ్యంగా వ్రాసి లోకానికి గొప్ప ఉపకారం చేశాడు. పితృవాక్య  పరిపాలకుడు, ఏకపత్నీ వ్రతుడు, ధర్మనిరతికి మారుపేరు అయిన రాముడు ఏ యుగానికైనా, ఏ ప్రాంతంవారికైనా ఆదర్శప్రాయుడు, పూజనీయుడు.  అటువంటి శ్రీరాముని సృష్టించిన వాల్మీకి గొప్ప మహనీయుడు. అంతేకాదు, రామాయణ గాధతో ప్రత్యక్ష సంబంధం గలవాడు వాల్మీకి. పరుల చెప్పుడు మాటలనే జనవాక్యంగా తలదాల్చి మహాపతివ్రత, గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టి నప్పుడు ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి ఆమెకు జన్మించిన లవకుశులను పెంచి పెద్ద చేసి రఘువంశ రాజుల వారసులుగా తీర్చిదిద్దిన ఆచార్యదేవుడు వాల్మీకి.

లభ్యమైవున్న పౌరాణిక గాధల ఆధారంగా కవి సముద్రాల రాఘవాచార్యులు వారు తయారుచేసిన కధను 'వాల్మీకి' పేరుతో జూపిటర్ పిక్చర్స్ వారు 1963 లో తెలుగు, కన్నడ భాషల్లో సినీమాగా తీసి విడుదల చేశారు. ఆదికవి వాల్మీకి పాత్రలో తెలుగులో ఎన్.టి.రామారావు , కన్నడంలో రాజ్ కుమార్  తమ అత్యుత్తమ  నటనతో జీవంపోసారు. రెండు భాషల్లోనూ సి.ఎస్.రావుగారు  చిత్రదర్శకుడు కాగా సంగీత దర్శకత్వాన్ని ఘంటసాల గారు నిర్వహించారు.

లోకకళ్యాణార్ధం మహావిష్ణువు శ్రీరామునిగా ఈ భువిని అవతరించే సంఘటనను భవిష్యద్దర్శనం చేస్తూ వాల్మీకి గానం చేసిన 'హరియే వెలయునుగా భువిని...' అనే గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం.

వాల్మీకి:

హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా !హరి!

పరిపాలింప సాధుల పరిమార్ప దనుజుల !హరి!

యజ్ఞ కుండములు ఆరక వెలుగు హోమధూమములు

మింటను చెలగు వేదగీతి వనవీధుల మ్రోగు ఆ...

శిష్య బృందం:

ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్

వాల్లీకి:

వేదగీతి వనవీధుల మ్రోగు

యాగ యోగములు సాగు !హరి!

సకల జీవులకు సంతతి సౌఖ్యము సిరిసంపదలు చేకూరు

పుడమిని ధర్మము నాల్గు పాదములా ఆ...!పుడమిని!

నడిపించును జగదానందముగా !హరి!

ఎక్కడైతే యజ్ఞ యాగాదులు సక్రమంగా నిర్వర్తించ బడతాయో ఆ ప్రదేశమంతా సశ్యశ్యామలమై సుభిక్షంగా వుంటుంది. ప్రకృతి సమతుల్యంగా వుంటుంది. ప్రజలంతా మనశ్శాంతితో సుఖసంతోషాలతో హాయిగా వుంటారని శాస్త్రపురాణాలు చెపుతాయి. అందుకే ఆచార్యులు గారు 'యజ్ఞకుండములు ఆరకవెలుగు హోమధూమములు మింటను చెలగు వేదగీతి వనవీధుల మ్రోగు' అనే ఆశాభావాన్ని వాల్మీకి మహర్షి నోటమ్మట పలికించారు. అంతేకాదు, శ్రీహరి రామావతారం దాల్చితే ఈ భూమి మీద ధర్మము నాలుగు పాదాల నడుస్తుందనే ఆకాంక్ష ను కూడా వ్యక్తంచేయించారు. సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ 'లోకా సమస్తాః సుఖినోభవన్తు' అనే ఆర్యోక్తికి దర్పణం పట్టే మంచి పాట 'హరియే వెలయునుగా...'

ఘంటసాల మాస్టారు ఈ పాటను ఆరభి రాగంలో చేశారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర గల అతి ప్రాచీనమైన రాగం ఆరభి. కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త అయిన ధీర శంకరాభరణానికి జన్యం. ఔడవ-సంపూర్ణ రాగం. శుద్ధసావేరీ (5 స్వరాలు), శంకరాభరణం (7 స్వరాలు) రాగాల సమ్మేళనమే ఆరభి రాగం. ఘనరాగ పంచకాలలో మూడవ రాగం ఆరభి. ఎంతో శుభప్రదమైన ఈ రాగంలోనే సద్గురు త్యాగరాజస్వామి వారి  'సాధించెనే ఓ మనసా' పంచరత్న కీర్తన వుంది. నేటి మన సజీవరాగం 'హరియే వెలయునుగా' అనే గీతానికి  అతి పురాతనమైన ఆరభి రాగాన్ని ఎంచుకోవడంలో ఘంటసాలగారు ఎంతో ఔచిత్యాన్ని కనపర్చారు. వాల్మీకి లోని సాత్విక, భక్తి, కరుణరసాలను ప్రస్ఫుటం చేస్తూ అత్యంత భక్తిభావంతో  గానం చేసి ఆరభి రాగ స్వరూపాన్నంతా  ఘంటసాలగారు ఈ పాటలో కనపర్చారు.  మాస్టారు ఈ పాటలో వీణ (సంగీతరావుగారు వాయించారు), వయొలిన్స్, ఫ్లూట్, తబలా, తాళ వాద్యాలను సందర్భోచితంగా ఉపయోగించారు.

జానపద, పౌరాణిక సమ్మిళితం 'వాల్మీకి' సినిమా. ఈ సినిమా లో మొత్తం 17 పాటలు శ్లోకాలు వున్నాయి. వాటిని ఘంటసాల, రఘురామయ్య (నారదుడు), సుశీల, జానకి, కోమల, మాధవపెద్ది, జె.వి.రాఘవులు గానం చేశారు. వాల్మీకి సినిమాకు తలమానిక గీతాలు మూడు. అవి - 'శ్రీ రామాయణ కావ్యకథా జీవన తారక మమ”, జయ జయ జయ నటరాజా రజతశైల రాజాఠ, మరియు, హరియే వెలయునుగా”. ఈ మూడు గీతాలను ఘంటసాల గారే అద్భుతంగా ఆలపించి వాటికొక సార్ధకత ఏర్పరిచారు.

వాల్మీకి తెలుగు సినిమాలో వాల్మీకిగా ఎన్.టి.ఆర్., కన్నడంలో రాజ్ కుమార్ నటించగా ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన రఘురామయ్య, రాజసులోచన, లీలావతి,  కాంతారావు, రాజనాల, శారదా  కన్నడంలో కూడా నటించారు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో తెలుగులోని పాటల వరసలనే కన్నడంలో కూడా ఉపయోగించారు.

వాల్మీకి తెలుగు కన్నడ సినిమాలను నిర్మించిన జూపిటర్ పిక్చర్స్ తమిళ సంస్థకు రామాయణ కావ్యమంత చరిత్ర వుంది. తమిళ సినీమా పురోభివృద్ధిలో జూపిటర్ పిక్చర్స్ ప్రధానపాత్ర పోషించింది. 1934 మొదలు 1964 వరకు ముఫ్ఫై సంవత్సరాల కాలంలో తమిళ, తెలుగు(5), కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40 సినీమాల కు పైగా నిర్మించారు. కోయంబత్తుర్ లోని సెంట్రల్ స్టూడియో కేంద్రంగా అనేక తమిళ సినీమాలను తీసిన జంటనిర్మాతలు ఎమ్.సోమసుందరం & ఎస్.కె.మొహిద్దీన్ 1950 తర్వాత తమ స్థావరాన్ని మద్రాసుకు మార్చారు. రాజా అణ్ణామలైపురంలో (ప్రస్తుత  దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్/ ఆంధ్ర మహిళా హాస్పిటల్ కు ఎదురుగా) ఆర్కాట్ నవాబ్ లకు చెందిన స్థలంలో కట్టబడిన నెప్ట్యూన్ స్టూడియోను కొని తమ చిత్రనిర్మాణాన్ని కొనసాగించారు. ఎమ్.జి.ఆర్. నటించిన అనేక పాత బ్లాక్ బస్టర్ లను నిర్మించిన జూపిటర్ సోము, మొహిద్దీన్ తదనంతరం మొహిద్దీన్ కుమారుడు ఎస్.కె.హబిబుల్లా ఆధ్వర్యంలో 1965 లో వరకు సినీమా లు తీసారు. జూపిటర్ తీసిన ఆఖరి మూడు సినిమాలు వాల్మీకి తెలుగు, కన్నడం; మర్మయోగి తెలుగు. ఈ  ఆఖరి మూడు సినీమాల కు ఘంటసాలగారే సంగీత దర్శకులు.

ఆ తర్వాత నెప్ట్యూన్ స్టూడియో ను ఎమ్.జి.ఆర్. కొనుగోలు చేసి తన తల్లి పేరు మీద సత్యా స్టూడియోగా మార్చి తాను నిర్మించిన, నటించిన సినీమాలను అక్కడే షూటింగ్ జరిపేవారు. ఎమ్.జి.ఆర్.  మరణానంతరం సత్యా స్టూడియో ఆయన గౌరవ  చిహ్నంగా వేల్స్ యూనివర్సిటీ  నిర్వహణలో డా. ఎమ్.జి.ఆర్. - జానకి ఉమెన్స్ కాలేజీ గా రూపాంతరం చెందింది.

 

నేటి ఈ సుదీర్ఘ పురాణాన్ని ఇక్కడితో ముగించడం సముచితం.

 

వచ్చేవారం, మరో ఘంటసాల సజీవరాగంతో మరల కలుద్దాము.

 

కొసమెరుపు:

1952 లో ఘంటసాల గారు పాకిస్థానీ గాయని జొహ్రాబాయి తో కలసి పాడిన ఏకైక హిందీ గీతం గల 'రాణి' హిందీ సినిమా ను తీసినది ఈ జూపిటర్ పిక్చర్స్  వారే.

 

ప్రణవ స్వరాట్


Saturday, 5 September 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 31 - రక్తసంబంధం - ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 31


రక్తసంబంధం - ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే


తల్లితండ్రులు లేని సంసారాలలో పెద్దన్నలు, పెద్దక్కలే తమ తోబుట్టువుల సంరక్షణా భారం వహించి వారి ఉన్నతి కోసం జీవితాంతం కష్టపడతారు. తమ తోబుట్టువులు సంపూర్ణంగా తమ మాటకు కట్టుబడి ఎల్లవేళలా  తమ ఆధీనంలోనే వుండాలని కోరుకుంటారు.

రక్తసంబంధీకుల మధ్య మమతానురాగాలుబంధాలు,  అనుబంధాలు దృఢంగా, బలీయంగా వుండవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కానీ, అవి మితిమీరి రాక్షస ప్రవృత్తికి దారితీయకూడదు. రక్తసంబంధీకులకు, సన్నిహితులకు హాని కలిగించకూడదు.

అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళ పరస్పర ప్రేమానుబంధాలు, రాగద్వేషాలకు సంబంధించిన ఇతివృత్తాలతో మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే over possessiveness (ఈ మాటకు సరైన తెలుగు పదం నాకు తట్టలేదు) వల్ల సర్వనాశనమైన కుటుంబగాధా చిత్రాలు వచ్చాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసినది  ఎన్.టి.రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా జీవించి చిరంజీవత్వం కలిగించిన 'రక్తసంబంధం' సినీమా. అందులో వదినా మరదళ్ళ మధ్య సాగే  ఒక సరససల్లాప గీతమే (పి.సుశీల గానం) నేటి మన ఘంటసాల సజీవరాగం.


ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే

నీ వగలన్నీ ఒకేసారి చూపకే

అహా వుప్పొంగే ఉబలాటం దాచవే

ఇది ఒకనాటితో అయ్యేది కాదులే


నిజమే తొలిరేయీ భావాలు నిలుపలేనట్టి భావాలు

అయినా ఒక్కింతా ఆగాలీ -    ఆగాలీ

అనువైన నునుసిగ్గు జవరాలు చూపాలీ

ఎంత సాహసివైనా ఇంత తొందరపడితే

హవ్వ! నలుగురిలో నగుబాట్లు తప్పవే  -

నీ వలపెంతో గొప్పదని చాటకే  !!ఒహో!!

 

మరలరాదంటూ ఈ రోజూ మదిలో శ్రుతిమించె నీజోరూ

అసలే అన్నయ్యది వెన్నలాంటి మనసు

అలాగనీ గడుసుదేరి చేయకమ్మ అలుసు

మగడు చెంతకు చేరీ మేను తాకిన చాలూ

ఆ గడుసుదినం గాలికెగిరిపోవునే

నీ పడుచుదనం పరవశించి పండును !!ఒహో!! 

 

వైవాహిక జీవితంలో  అంతో యింతో అనుభవం సంపాదించిన ఆ యింటి ఆడపడుచు శోభనం నాటి రాత్రి చెప్పవలసిన హితోపదేశాలను కొంత అల్లరి, కొంత చిలిపితనాన్ని మేళవించి ఒదినగారిని ఆట పట్టించే గీతం ఇది. ఆరుద్రగారు ఎంతో శ్రమించి ఈ పాటను వ్రాసారని ఈ పాట కంపోజింగ్ లో పాల్గొన్న ఘంటసాల మాస్టారి సహాయకులు శ్రీ సంగీతరావుగారు చెప్పడం జరిగింది. పరభాషా గీతాలు జోలికి పోకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాస్టారు ఇచ్చిన ట్యూన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ చూపిన దర్శకుడు వి.మధుసూదన రావుగారు  పాట సాహిత్యం విషయంలో  మాత్రం అడుగడుక్కు సొడ్లు పెడుతూవచ్చారట. ఆరుద్ర గారు కూడా ఏమాత్రం విసుగు, కోపం ప్రదర్శించకుండా ఎంతో ఓపికతో పల్లవి మీద మీద పల్లవి వరుసగా ముఫ్ఫై పల్లవులు వ్రాయగా  మధుసూదనరావుగారు చివరకు ఈ 'ఓహో! వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్నీ ఒకేసారి చూపకే అహా వుప్పోంగే ఉబలాటం దాచవే ఇది ఒకనాటి తో అయ్యేది కాదులే...' మొట్టమొదటగా రాసిన పల్లవికే ఆమోదముద్ర వేసారట.  పాట పల్లవిని బట్టే మిగిలిన చరణాలు రూపం సంతరించుకుంటాయి. సంగీతసాహిత్య రంగాల్లో ఎంత ఆరితేరినా సినీమా రంగంలో అవేవీ చెల్లుబాటు కావని అక్కడ దర్శక నిర్మాతల ఇష్టాయిష్టాలు ప్రకారమే పనులు జరుగుతాయని ఇలాంటి ఉదంతాలు  చెప్పకచెపుతాయి.

ఘంటసాల మాస్టారు ఈ పాటను హరికాంభోజి రాగం స్వరాలతో చేశారు. కర్ణాటక సంగీతంలో హరికాంభోజి 28వ మేళకర్త. అంటే సంపూర్ణ రాగం. ముత్తుస్వామి దీక్షితార్ సంప్రదాయంలో ఈ రాగాన్ని హరికేదారగౌళగా వ్యవహరిస్తారు. కాంభోజి, మోహన, ఖమాస్, శహన, సురటి రాగాలు హరికాంభోజికి జన్య రాగాలు. హిందుస్థానీ సంగీతంలో హరికాంభోజికి సమాంతరమైనది ఖమాస్ థాట్. వెస్ట్రన్ మ్యూజిక్ లో దీనిని మిక్సోలిడియన్ మోడ్ అంటారు. అతి ప్రాచీనమైన రాగాలలో ఈ హరికాంభోజి ఒకటి. ఈ రాగంలో  ప్రసిద్ధి చెందిన అనేక శాస్త్రీయ సంగీత కృతులు, వివిధ భాషల్లో సూపర్హిట్  సినీమా పాటలు వున్నాయి. ఘంటసాలగారి సంగీతం సరళిని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న పి.సుశీలగారు ఈ పాటను  సందర్భోచిత భావప్రకటనతో మనోజ్ఞంగా ఆలపించారు. తెరమీద వదినా మరదళ్ళుగా సావిత్రి, దేవిక, శోభనం పెళ్ళికొడుకుగా ఎన్.టి.ఆర్. ఔచిత్యమైన  హావభావాలతో ఈ మొదటిరాత్రి సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఘంటసాలగారు ఈ పాటను చాలా ఆహ్లాదకరంగా స్వరపరిచారు. పాట నేపథ్యంలో వినపడే స్పానిష్ గిటార్, సితార్, పియోనా, వయొలిన్స్, హార్ప్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ వంటి వాద్యాల ఎఫెక్ట్స్  ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి మంచి హుషారును కలిగిస్తాయి.

రక్తసంబంధం సినిమాలోని ఎనిమిది పాటలను చేరో రెండేసి పాటలు చొప్పున ఆరుద్ర, సి.నా.రె., అనిశెట్టి, ఒక పాటను దాశరథి, ఒక పాటను కొసరాజు వ్రాయగా ఘంటసాల సంగీత దర్శకత్వంలో వాటిని ఆయనతోపాటు పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి పాడారు.

రక్తసంబంధం సినీమాకు మూలం కె.పి.కొట్టార్కర అనే మలయాళ రచయిత వ్రాసిన కథ ఆధారంగా తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రిలు అన్నాచెల్లెళ్లుగా నటించిన 'పాశమలర్' అనే తమిళ చిత్రం. తమిళ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సిల్వర్ జూబ్లీ సినిమా. ఈ సినిమాలోని అన్నాచెల్లెళ్ల రక్తపాశానికి తమిళ ప్రేక్షకులు ఎంతగా ప్రభావితులైనారంటే ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు శివాజీ, సావిత్రిలు కలిసి నటించినా  ప్రేమికులుగా మరే సినీమాలోనూ నటించలేదని చెప్పుకుంటారు. పాశమలర్ అఖండ విజయం ఈ కథను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, సింహళీ భాషలలో సినీమాలను తీయడానికి ప్రేరేపించింది.

తెలుగులో ఈ కథను రక్తసంబంధం పేరుతో రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా, డూండీలు నిర్మించారు. సుందర్లాల్ గారి ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని  ఒకటి రెండు తప్ప మిగిలిన పాటలన్నీ తమిళ సినిమా పాటల వరసలనే ఉపయోగించుకున్నారు. తమిళ వాసనలేని ఆ ఒక్క పాటే ఘంటసాలగారు స్వరపరిచిన 'ఒహో! వయ్యారి వదినా ఉలుకెందుకే' నేటి మన సజీవరాగం.

వీరమాచినేని మధుసూదనరావుగారి దర్శకత్వంలో నిర్మించబడిన 'రక్తసంబంధం' సినిమాలో అన్నాచెల్లెళ్లుగా జీవించిన ఎన్.టి.ఆర్., సావిత్రితోపాటు కాంతారావు, దేవిక, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, ప్రభాకరరెడ్డి, సూర్యకాంతం, మొదలగువారు ఈ సినిమా ఘన విజయానికి ఎంతో దోహదం చేశారు. ఈ సినిమాలోని  పాటల ట్యూన్సన్నీ చాలావరకు తమిళంవే అయినా, ఘంటసాల గారి హస్తవాసితో తెలుగుదనాన్ని సంతరించుకుని బహుళ జనాదరణ పొందాయి.

అతి చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి వారి సంరక్షణకు, ప్రేమాభిమానాలకు నోచుకోని  తన చెల్లెలికి తానే తల్లితండ్రీ అయి అతి గారాబంగా, ఎన్నో కట్టుబాట్లుతో పెంచి  మితిమీరిన ప్రేమ బంధంతో ఆమెకు ఏవిధమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేసిన ఓ అన్నగారి మూర్ఖత్వం, మధ్యలో వచ్చిన ఆస్తి అంతస్తులు కల్పించిన  అహంకారం, అలాగే సన్నిహితులనుకున్నవారి స్వార్ధబుద్ధి వలన  ఆ అన్నాచెల్లెళ్ల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమై  విషాదాంతంగా ముగిసాయో చూపించే  ఒక ఉదాత్త చిత్రమే 'రక్తసంబంధం'. ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసి,  చలింపజేసే గుండెలను బరువెక్కింది ఏ చిత్రం 'రక్తసంబంధం'.

సుడిగాలులెన్ని వచ్చినా తెగిపోని మధురబంధంకలకాలం హృదయాలను కలిపివుంచే జన్మజన్మల బంధం అదే రక్తసంబంధం.


వచ్చేవారం, ఘంటసాల వారి మదిలో మెదిలే మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 33 - ఒల్లనోరి మామా నీ పిల్లనీ

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...