అధ్యాయం - 2 - భాగం 30
గుండమ్మకథ – కనులు తెరచినా నీవాయే... నే కనులు మూసినా నీవాయే
దివాణంలో ఠాంగ్...ఠాంగ్ మని ఆరు గంటలు కొట్టడమేమిటి పక్కనున్న శ్రీరామా టాకీస్ లౌడ్ స్పీకర్ లోంచి ఘంటసాల 'నమో వెంకటేశా' పాట మొదలయింది. రెండవపాట 'ఏడూ కొండలసామి' పాటను వింటునే ఆ హాలులో ఆడుతున్న 'గుండమ్మకథ' సినీమాలోని పాటల కోసం ముచ్చటగా మూడవసారి బయల్దేరాము నేనూ, రమణ, గోపాలం.
'రమణా! ఈ సినిమా లో పాటలన్నీ చాలా బాగా చేశాడయ్యా ఘంటసాల. అన్నీ హాయిగా, హుషారుగా వున్నాయి కదూ... ఇందులో జమున పాడిన పాట ఏ రాగంలో చేసివుంటాడంటావు?... నేనైతే భూపాలమో, మలయమారుతమో అనుకుంటున్నాను' అని అన్నాడు గోపాలం సినిమా హాలు బయటనున్న టీ స్టాల్లో టీ తో పాటు సిగరెట్ కూడా తాగుతూ. 'నీ మొహం ఆ పాట భూపాలం కాదు, మలయమారుతం అంతకన్నాకాదు ... అది తోడి లేదా భైరవియో అయే అవకాశం వుంది' అన్నాడు రమణ వ్రేళ్ళమధ్య కాలుతున్న సిగరెట్ కు మరో సిగరెట్ ముట్టిస్తూ. రమణ , గోపాలం బ్యాంక్ ఉద్యోగులు. సంగీతం గురించి ఏమీ తెలియకపోయినా త్యాగరాజకీర్తనలన్నా, ఘంటసాల పాటలన్నా చాలా ఆసక్తిగా వింటూ వాటిమీద తెలిసీతెలియని చర్చలు చేస్తూంటారు. తమ సంగీతప్రియత్వం గుర్తించి తోటివారు మెచ్చుకుంటూంటే అది వారికి మహదానందం. వాళ్ళ కబుర్లు వినడం నాకొక కాలక్షేపం. వయసులో వాళ్ళు నాకంటే పెద్దే అయినా నేను ఎక్కువగా వాళ్ళతోనే తిరుగుతూండేవాడిని.
వీళ్ళిద్దరి సంగీత చర్చ ఇలా సాగుతుండగా కొంచెం దూరానా తన పిల్లలకేవో కొనిపెడుతూ సకుటుంబ సపరివార సమేతంగా సంగీతం మాస్టారు కనపడ్డారు. రమణ వారిస్తున్నా వినకుండా గోపాలం సంబరంతో మాస్టారివేపు నడిచి గుండమ్మకథ సినిమాలో జమున పాడిన పాటను పాడి వినిపిస్తూ ఆ పాట రాగం గురించి ఆరాలు తీయడం మొదలెట్టాడు. మాస్టారు ఆ సినిమాను అంతకుముందే చూడడంచేత ఒకసారి పాటను మననం చేసుకుని కొంతసేపు ఆలోచించి ఈ పాట సింధుభైరవి రాగంలో చేసినట్లుగా అనిపిస్తోంది' అన్నారు. అందుకు రమణ అడ్డుతగిలి 'అదేమిటండీ, మొన్నామధ్య ఇలాటిదే మరో పాట విషయంలో అది తోడి రాగంలో వుందన్నారు కదా' అని అన్నాడు.
నాయనా! 'పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా' చెప్పు వివరించి చెప్పడానికిది సమయం కాదు, రేపు సాయంత్రం 6.30కి వేణుగోపాలస్వామి కోవెలకు గురుదక్షిణతో సహా రండి ... అక్కడ సావకాశంగా మాట్లాడదాము.' అని గట్టిగా నవ్వుతూ తన పిల్లలతో సినిమా హాలులోకి నడిచారు సంగీతం మాస్టారు.
(ఈ నేపథ్యం సుమారు
65 ఏళ్ళ క్రితం నేను బొబ్బిలి హైస్కూలు లో చదువుతున్న కాలం నాటిది.)
ఎన్నో నియమ నిబంధనలతో, మార్గదర్శకాలతో కూడిన శాస్త్రీయ సంగీత కృతుల యొక్క రాగాలను గుర్తించడం కన్నా సినిమా పాటలలోని రాగాలను కనిపెట్టడం మరింత కష్టమని సినిమా సంగీత విశ్లేషకుల భావన. శాస్త్రీయ సంగీత రాగ స్వరాల ఆధారంగా కొన్ని సినీమాలలోని పాటలు స్వరపర్చబడినా జనరంజకత్వం కోసం కొంత, కొంతమంది సంగీతదర్శకులకు సరైన రాగజ్ఞానం లేకపోవడం వలన మరికొంత, కొన్ని పాటల్లో అన్యస్వరాలు ప్రయోగించడంతో ఆ యా పాటల రాగ స్వరూపమే మారిపోయి ఇదమిధ్దంగా ఫలానా రాగమని చెప్పడానికి సినిమా సంగీత విశ్లేషకులు, ఔత్సాహిక సంగీత కళాకారులు చాలా శ్రమపడుతూంటారు.
శాస్త్రీయ సంగీత కృతులలోని రాగాలనుగానీ, లేదా సినిమా పాటలలోని రాగాలనుగానీ గుర్తించడానికి శాస్త్ర సంబంధమైన కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవలసిన ఆవశ్యకత వుందని ఘంటసాల భగవద్గీతలోని శ్లోకాలకు రాగవిశ్లేషణ చేసిన ప్రముఖ సంగీతజ్ఞుడు, ఘంటసాలవారి సంగీత సహాయకుడు అయిన 'కలైమామణి' శ్రీ పట్రాయని సంగీతరావుగారు ఇలా అభిప్రాయపడ్డారు.
రాగ నిర్ణయం అనేది అరోహణ, అవరోహణ, గ్రహ, న్యాస, అంశ స్వరాలమీద ఆధారపడివుంటుంది. గ్రహ, న్యాస, అంశ స్వరాల వివరణ : గ్రహ స్వరం మీద పాట మొదలవుతుంది, న్యాస స్వరం అనేది విరామస్వరం. రాగాలాపన చేసేటప్పుడు, ఒక స్వరం మీద ఆపి రాగాలాపన చేయడం జరుగుతుంది. దీనిని న్యాస స్వరం అంటారు. అంశ స్వరం అంటే జీవ స్వరం. అంటే ఆస్వరాన్ని పాడిన తీరుని బట్టి అదేరాగమో వెంటనే స్ఫురిస్తుంది.
ఇలాటి మీమాంసలకు, చర్చలకు దోహదం చేసే రాగం 'సింధుభైరవి'. అలాటి సింధుభైరవి రాగ స్వరాలతో గుండమ్మకథ సినిమా కోసం ఘంటసాలగారు స్వరపర్చిన 'సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే' అనే పాటే నేటి మన ఘంటసాల సజీవస్వరం.
భక్తి, కరుణ, శోక, విరహ రస భావాలను ప్రకటించడానికి అనువైన రాగం సింధుభైరవి. సింధుభైరవి హిందుస్తానీ రాగం. కర్నాటిక్ సంగీతంలో కూడా అనుకరింపబడుతున్నరాగం. సింధుభైరవి రాగం, భైరవి థాట్ కి చెందినరాగం. భైరవిథాట్ కర్నాటిక్ హనుమతోడికి సమానమైన రాగం. హిందుస్తానీ శుద్ధభైరవి అన్నీ కోమల స్వరాలు కలిగి వుంటుంది. ఈ కోమల స్వరాలనే కర్నాటిక్ సంగీతంలో శుద్ధ స్వరాలంటాము. హిందుస్తానీ సంగీతంలో మిశ్ర భైరవిలో శుద్ధ స్వరాల (కోమల స్వరాల)తో పాటు, అన్ని తీవ్ర స్వరాలుకూడా వినిపిస్తాయి. అంటే చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతిమధ్యమం, చతుశ్రుతి ధైవతం, కాకలి నిషాదం. కాబట్టి ఈరాగాన్ని భాషాంగరాగంగా పరిగణించచ్చు. సింధుభైరవికి, మిశ్ర భైరవి కి చెప్ప బడిన అన్ని లక్షణాలు అన్వయించబడతాయి. మరి ఈ రెండు రాగాలకి తేడా ఎక్కడొస్తుందంటే, సింధుభైరవికి మధ్యమాన్ని basic noteగా చేసుకుని పాడవలసివుంటుంది.
సింధుభైరవి రాగం పదవ మేళకర్త నాటకప్రియకు జన్యమని భావించేవారు కొందరున్నారు.
ఇక ఈనాటి మన పాట విషయానికొస్తే అందులో సింధుభైరవి simple shades తో వినిపిస్తోంది.
ఇప్పుడు, సుశీలగారు అత్యంత
శ్రావ్యంగా ఆలపించిన ఆ పాటను మరోసారి విందామా....
సాకీ...
సన్నగ వీచే
చల్లగాలికీ కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల
పానుపుపై ఆ... కలలో వింతలు కననాయే...
పల్లవి: సన్నగ వీచే చల్లగాలికీ...
సాకీ...
అవి తలచిన ఏమో
సిగ్గాయే
కనులుతెరచినా నీవాయే నే కనులుమూసినా నీవాయే! కనులు తెరచినా నీవాయె
నిదురించిన నా
హృదయము నెవరో
కదిలించిన సడి
విననాయే
!నిదురించిన!
కలవరపడి నే కనులు
తెరువ నా కంటి పాపలో నీవాయే
సాకీ...
ఎచట చూచినా
నీవాయే!కనులు!
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని
పిలుపులు విననాయే
!మేలుకొనిన!
ఉలికిపాటుతో కలయవెదక
నా హృదయ ఫలకమున నీవాయే
కనులు తెరచినా
నీవాయే కనులు మూసినా నీవేనాయే!
నిద్రిస్తున్న హృదయాన్ని ఎవరో కదిలిస్తున్నట్లై కలవరపాటుతో కళ్ళుతెరవగా తన కంటిపాపలో ప్రియుడున్నాడట. ఎక్కడ చూసినా అతడే అగుపిస్తున్నాడట; అంతేనా... మేల్కొన్న మనస్సులో మెల్లని పిలుపులేవో వినిపించడంతో వెదికిచూస్తే ఆ యువతి హృదయఫలకం మీద కూడా అతనే వున్నాడట...
ఎంతటి మధుర భావన.
ప్రేమ పారవశ్యంలో తేలియాడుతున్న ప్రేమికులకు ప్రకృతి అంతా ఎంతో సుందరంగా, చల్లగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పరిసరాలన్ని మరచిపోయి బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా సర్వత్రా తామేగా ఊహల్లో విహరిస్తూంటారు. అటువంటి మనఃస్థితిలో వున్న ఒక ప్రేమిక పాడుతున్న పాట. అంతరంగంలో సరిగ్గా ఇలాటి మనోభావాలే గల మరొక యువతి కూడా ఈ పాటను తనకు అన్వయించుకుని ఆనందించడం ఒక విశేషం.
సరళమైన చిన్న చిన్నమాటలతో కొండంత భావుకత వుట్టిపడే పాటలు వ్రాయడం పింగళివారికి, ఆ మాటలకు సుతిమెత్తని స్వరాలు జోడించి పిల్లవాయువు ధ్వనిలాంటి శ్రావ్యమైన గీతాలను మలచి మృదుమధురంగా పాడించడం ఘంటసాల మాస్టారికి వెన్నతో పెట్టిన విద్య.
కవితాత్మక దృష్టిగలవాడవడంచేత పింగళి నాగేంద్రరావుగారు బ్రహ్మచారే అయిన అనురక్తి గల శృంగారగీతాలను సృష్టించడంలో ప్రజ్ఞావంతులయ్యారు. అందుకే విజయావారు పింగళిగారిని తమ ఆస్థానకవిగా నియమించుకుని అసంఖ్యాకమైన అజరామర గీతాలను తమ సినీమాలకోసం వ్రాయించుకున్నారు. అలాటి తీయని శృంగారగీతమే నేటి మన సజీవరాగం. అదే, గుండమ్మకథలోని 'సన్నగవీచే చల్లగాలికి' పాట.
సింధుభైరవి రాగంలో ఘంటసాలగారు అపురూపంగా సృష్టించిన ఈ గీతాన్ని పి.సుశీలగారు కోకిలస్వరంకన్నా మధురంగా ఆలపించి అజరామరం చేశారు. ఘంటసాలగారిలోని రాగభావాలను, లాలిత్యాన్ని, మాటల సుస్పష్టతను తన కంఠంలో యథాతథంగా పలికించి ఈ పాటకు శాశ్వతత్త్వాన్ని కలిగించారు శ్రీమతి పి.సుశీల.
హార్ప్, సితార్, ఫ్లూట్, వైబ్రోఫోన్, వయొలిన్స్, తబలా, డోలక్, తంబోరిన్ వంటి తక్కువ వాద్యాలతో అతి సున్నితంగా ఈ పాట నేపథ్య సంగీతాన్ని సమకూర్చి సన్నగ వీచే చల్లగాలి అనుభూతిని మనలో కలిగించారు ఘంటసాల. సుశీలగారి అమృతపేయమైన కంఠం, ఫ్లూట్ వైబ్రేషన్స్ (గమకాలు), వినిపించి వినిపించనట్లుండే తబలా, డోలక్, రిథిమ్స్ ఈ పాటను అజరామరం చేశాయి. పల్లవి ముందు, చరణాలముందు సుశీలగారు ఆలపించిన సాకీలు సింధుభైరవి రాగ స్వరూపాన్ని, ఘంటసాలగారి ముద్రను సుస్పష్టం చేశాయి. సాకీల మీద నేపథ్యసంగీతం లేకుండా పూర్తిగా సుశీలగారి శక్తిసామర్ధ్యాల మీదే పాటను సనసన్నగా వినిపించారు.
ఈ పాటలో ఒక వైవిధ్యం వుంది. ఈ పాట సినిమా లో రెండుసార్లు వస్తుంది. పాట సాహిత్యం, వరస ఒకటే. కానీ చిత్రీకరణలో తన దర్శకత్వ ప్రతిభనంతా కనపర్చారు కమలాకర కామేశ్వరరావు.
మొదటిసారి వచ్చే పాట
ఇన్డోర్ లో ఒక టెర్రస్ మీద చల్లని వెన్నెల వాతావరణం లో జమున పాడుతున్నా పాటలోని
భావాలకు ఎక్కువగా స్పందించి ఆ అనుభూతిని పొందేది
క్రిందనెక్కడో వున్న సావిత్రి. అప్పుడప్పుడు ఎన్.టి.ఆర్. కూడా
కనిపిస్తారు. జమునలోని ఈ శృంగారభావాలకు
కారకుడైన ఆమె ప్రియుడు ఎ.ఎన్.ఆర్. అసలు కనపడరు.
సినిమా ఆఖరు భాగంలో వచ్చే రెండవసారి పాటలో ఒక చమత్కారం చేశారు. సన్నగవీచే చల్లగాలి పాటలోని సాకీలను రెండవసారి పాటలో పూర్తిగా తీసివేసి పల్లవికి ముందు వచ్చే సాకీనే పల్లవిగా మార్చి సుశీలగారిచేత పాడించారు. అలాగే పాట లొకేషన్ ను ఇన్డోర్ లో నుండి ఔట్ డోర్ గార్డెన్స్ కు మార్చారు. మొదటిసారి పాట చిత్రీకరణలో కనపడని ఎ.ఎన్.ఆర్ ఈ రెండవపాటలో పూర్తిగా తన హావభావాలతో ప్రేక్షకులను అలరించారు. పాటంతా జమున, ఎ.ఎన్.ఆర్.లు మాత్రమే కనిపిస్తారు. సావిత్రి, ఎన్.టి.ఆర్.లకు ఈ రెండవ పాటలో స్థానం కల్పించలేదు. ఈ పాట సినిమాలో రెండుసార్లు వచ్చినా ప్రేక్షకులలో ఎలాటి విసుగు భావన కలగని రీతిలో డైరెక్టర్ గారు ఈ పాటను చాలా హృద్యంగా చిత్రీకరించారు.
'సన్నగ వీచే చల్లగాలికి' పాట ఇంతటి కీర్తి పొందడానికి కారకులైన పింగళి, ఘంటసాల, పి.సుశీల తో పాటు గుండమ్మకథ సినిమాకు ఛాయాగ్రహకుడైన మార్కస్ బార్ట్లీ, ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే లను కూడా తలచుకోకతప్పదు. ఈ పాట చిత్రీకరణ లో కనిపించే చందమామ, చల్లటి పిల్లవాయువులకు కదిలే లతలు, పూలమొక్కలు , ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కెమేరామెన్, కళాదర్శకుల అపూర్వ సృష్టే.
ఒక మంచి సినీమా రూపొందాలంటే నిర్మాత, దర్శకులకు మంచి అభిరుచి, కళాత్మక దృష్టి, సామాజికస్పృహ వుండాలి. అలాటి సలక్షణాలన్నీ సక్రమంగా అమరిన వినోదభరిత చిత్రమే విజయావారి 'గుండమ్మకథ'.
ఈ సినిమాలో వున్న ఎనిమిది పాటలూ ఎల్.విజయలక్ష్మి (హిందోళం) డాన్స్ మ్యూజిక్ తో వేటికవే ఆణిముత్యాలుగా అమరి గుండమ్మకథ అనేక కేంద్రాలలో రజతోత్సవాలు జరుపుకుని తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్., సావిత్రి, జమున, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతం, రమణారెడ్డి, ఛాయాదేవి, ఎల్.విజయలక్ష్మి, హరనాథ్, మిక్కిలినేని, రాజనాల, హేమలత మొదలగువారు నటించిన ఈ విజయావారి చిత్రం గురించి చెప్పుకోవడానికి ఎంతైనా వుంది. ఆ విశేషాలన్నీ గుండమ్మకథ మరో పాటలో...
వచ్చేవారం, ఘంటసాలవారి మదిలో మెదిలే మరో సజీవరాగం తో మరల కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
