Saturday, 8 August 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 27 - శ్రీకృష్ణకుచేల – పావన తులసీమాతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 27


శ్రీకృష్ణకుచేల – పావన తులసీమాతా


1952 లో 'ది న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్' అనే పత్రిక అంతర్జాతీయ కధల పోటీ నిర్వహించింది. 23 దేశాల నుండి వచ్చిన అనేక కథలలో 59 కధలను పోటీకి ఎంపిక చేశారు. అందులో భారతదేశపు కథలు మూడున్నాయి. అందులో తెలుగు కథ ఒకటి. ఆ అంతర్జాతీయ కథల పోటీలో ఆ తెలుగు కథ అనువాదం 'సైక్లోన్' కు ద్వితీయ బహుమతి లభించింది.  అకథ అప్పటికే ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో 'గాలివాన' పేరుతో ప్రచురించబడింది. ఈ కథా రచయిత కాకినాడ  పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీలో సైన్స్ లెక్చరర్. అంతర్జాతీయ సాహితీ ప్రపంచంలో తెలుగు కథకు విశిష్టస్థానం కల్పించిన  ఆ విశిష్ట రచయితను వెతుక్కుంటూ ఒక సుప్రసిద్ధ సినీ దర్శక నిర్మాత కాకినాడ వెళ్లారు. ఆయనే మల్లీశ్వరి దర్శకుడు బి.ఎన్.రెడ్డి. ఆ గాలివాన  కథా రచయితేపాలగుమ్మి పద్మరాజు. భావకవి దేవుపల్లి కృష్ణశాస్త్రి గారిని చిత్రసీమకు పరిచయంచేసిన బి.ఎన్.రెడ్డిగారే పద్మరాజుగారిని కూడా కథా రచయితగా తన బంగారు పాప సినీమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. దాదాపు 60 కథలు రాసి కేంద్ర సాహిత్య  అకాడమి అవార్డ్ పొందిన పాలగుమ్మి పద్మరాజుగారు గొప్ప హేతువాది.  ప్రముఖ విప్లవవాది, వేదాంతి, హేతువాది అయిన ఎమ్ ఎన్ రాయ్ సిద్ధాంతమును అనుసరించి ప్రచారం చేసినవారు.

పద్మరాజు గారు 1955 మొదలు 1983 వరకు సుమారు పాతిక ముప్పై సినిమాలకు కథ, మాటలుఅతి తక్కువ చిత్రాలకు పాటలు వ్రాశారు. అందులో రెండు పౌరాణికాలు వున్నాయి. ఒకటి భక్త శబరి, మరొకటి, శ్రీకృష్ణ కుచేల. రెండూ స్వార్థరహిత భక్తి తత్త్వాన్ని బోధించేవే.

అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు, కుచేలుడిగా లోకప్రసిద్ధుడైన సుదాముడు బాల్యస్నేహితులు. చిన్నతనంలో కలసి ఉజ్జయినిలో సాందీపముని వద్ద విద్యను అభ్యసించారు. ధనిక వర్గానికి కృష్ణుడు, నిరుపేద వర్గానికి కుచేలుడు ప్రతీకలు. అష్టైశ్వర్యాలతో, సకల భోగభాగ్యాలతో, ద్వారకాధీశుడిగా తులతూగే కృష్ణుడికి, ఏ పూటకు ఆ పూటే దినం గడవని పరిస్థితిలో వుండే  కుచేలుడికి మధ్య అంతస్థుల అంతరం ఎంతో వున్నది. బాల్యస్నేహాన్ని సాకుగా తీసుకుని కృష్ణుని యాచించి సహాయం పొందడానికి కుచేలుడి వ్యక్తిత్వం సుతారము అంగీకరించలేదు. అందుకే ఎంత కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా తన కష్టాలను తీర్చే భారాన్ని దైవానికే అప్పగించి దైవచింతనలో కాలంగడిపినవాడు కుచేలుడు. అతనికి తగ్గ ఇల్లాలు సుశీల. మహా పతివ్రత. భర్త అడుగుజాడలలోనే నడుస్తూ  అంతటి కష్టాలలోనూ భర్తకు చేదోడువాదోడుగా వుంటూ సంసారాన్ని గడుపుకువచ్చేది. కుచేలుడివలెనే ఆయన భార్య సుశీల కూడా దైవదైవచింతనలో వుంటూ ఏనాటికైనా తమ కష్టాలు తీర్చే భారం  మహాలక్ష్మీ స్వరూపమైన తులసి దేవత పైనే వుంచి ... 'పావన తులసీమాతా - మా పాలిటి కల్పలతా...' అంటూ భక్తిశ్రధ్ధలతో పూజించేది.

పావన తులసీ మాతా - మా పాలిటి కల్పలతా

 హరిగళమాలా కరుణాలవాల

సిరిగల జవరాలా సేవాలోలా

తిరముగ మాయింటి దీపము నీవై

నిరతము వెల్గుము నీరాజన మిదిగో! పావన !

 

మగువల మనసుల మాధుర్య మీవే

మంగళధాత్రివి దేవీ నీవే

జగముల జనయిత్రి నీకిదే హారతి

అగపడు దైవము నీవేనని వేడితి ! పావన!


సనాతన ఆచారవ్యవహారాలను పాటించే హిందువులు  తులసి మాతను శ్రీమహాలక్ష్మి మరురూపంగా భావించి పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన తులసి మొక్క ప్రతీ గృహంలో వుండడం వల్ల ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సత్చింతనలతో కూడిన అనుకూలవాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. దైవికశక్తిగా భావించే తులసి సకల పాపహరిణి. ఎన్నో ఔషధ గుణాలు ఇమిడివున్నాయి. నిత్యము తులసికోటలో దీపము వెలిగించి భక్తితో పూజించిన సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీకమాస శుద్ధ ద్వాదశి నాడు విష్ణుప్రియగా కొలవబడే తులసిమాతకు, మహావిష్ణువు అవతారమైన కృష్ణునికి వివాహోత్సవం జరుపుతారు.

అనునిత్యమూ ప్రాతఃకాలసమయాన గృహిణులు తులసికోట వద్ద బృందావని, వృంద, విశ్వపూజిత, పుష్పసార, నందిని, కృష్ణజీవనివిశ్వపావని, తులసి అనే నామావళితో తులసి మాతను పూజించేఆచారం నేటికీ వున్నది.

ఔను. ఇది సినిమాలో వచ్చిన భక్తిగీతమే. 1961లో వచ్చిన 'శ్రీకృష్ణ కుచేల' సినీమాకోసం విశిష్ట రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు వ్రాసిన పాట. ఇదే నేటి మన ఘంటసాలగారి సజీవరాగం.

భగవంతుని ఉనికిని ప్రశ్నించే హేతువాదులు, విప్లవ రచయితలు ఇలాటి భక్తి గీతాలు వ్రాయడం విశేషమే. ఇక్కడేవృత్తి ధర్మం వేరు, వ్యక్తిగత సిధ్ధాంతం వేరు అనే భావనకు రావలసివస్తుంది. ఘంటసాలగారి సంగీతం, సి.ఎస్యఆర్., కన్నాంబల సహజసిద్ధమైన హావభావాలే శ్రీకృష్ణకుచేల సినిమాకు జీవం.

ఘంటసాలగారు  ఈ మంగళహారతి గీతాన్ని తోడి రాగ స్వరాలతో వరస కట్టారు. కర్ణాటక సంగీతంలో హనుమత్తోడి 8వ మేళకర్త. దీని జన్య రాగం తోడి. ఎంతో ప్రాచీనమైన ఈ రాగం గంభీరత్వము, గాఢత్వం కలిగివుంటుంది. భక్తి, కరుణరసప్రధాన రాగం. తోడి రాగంలోని క్లిష్టతరమైన గమకాలు గాయకులకు ఎప్పుడూ పెనుసవాలే.  హిందుస్థానీ సంగీతంలో కూడా ఒక తోడి వుంది. రెండింటికి స్వరాలు ఒకటే అయినా పాడే విధానంలో చాలా తేడా వుంది. కర్ణాటక తోడికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవి థాట్. అలాగే, హిందుస్థానీ తోడికి సమానమైన కర్ణాటక రాగాన్ని శుభపంతువరాళి అని అంటారు. అటువంటి ప్రాచీనమైన, సంప్రదాయసిద్ధ తోడి రాగంలో ఘంటసాల ఈ పావన తులసీ మాతా గీతాన్ని అద్భుతంగా మలిచారు. కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలైన పి.లీల ఈ పాట పాడించి సన్నివేశానికి రసస్ఫూర్తి కలిగించారు ఘంటసాల.

సశాస్త్రీయమైన రీతిలో వాద్య సహకారాన్ని అందించిన -- వీణ, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, కంజిరా, తాళాలు, తంబరిన్ వాద్య కళాకారులు ఈ భక్తిగీతం సజీవమై నిలవడానికి ఎంతగానో దోహదపడ్డారు. నేపథ్యంలో పి లీల పాడిన ఈ గీతాన్ని తెరమీద  కుచేలుడి భార్య సుశీలగా నటించిన కన్నాంబ పై చిత్రీకరించారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా భక్తి ఉట్టిపడేలా చాలా సహజంగా నటించారు కన్నంబ.

శ్రీ కృష్ణకుచేల సినిమాలో  ఉన్న మొత్తం 17 పాటలు పద్యాలను ఘంటసాల, పి లీల, రఘురామయ్య, కోమల, వైదేహి లు గానం చేశారు. వీటన్నింటిని పాలగుమ్మి పద్మరాజుగారే వ్రాశారు.

తెలుగు టాకీ తొలిదశ దర్శక నిర్మాతలలో ప్రముఖులు చిత్రపు నారాయణమూర్తిగారు, కడారు నాగభూషణంగారు. పౌరాణిక సినీమాల మహత్తును తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయంచేసినది వీరే. కడారు నాగభూషణం  గారి సతీమణి పసుపులేటి కన్నాంబ. ఆనాటి

సుప్రసిద్ధ కథానాయకి, నేపధ్యగాయని. తన పాత్రల పాటలు తానే పాడుకునేవారు. చాలా మంచి గాయని. ఎంతటి సుదీర్ఘమైన సంభాషణలైనా ధారాప్రవాహంగా, సుస్పష్టంగా ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ సహాయం  లేకుండా కంచు కంఠంతో అనర్గళంగా చెప్పగల నటీమణి. ఆవిడ పక్కన నిలబడి  దీటుగా డైలాగులు చెప్పడానికి ఆనాటి ప్రముఖ తమిళ తెలుగు నటీనటులంతా జంకేవారు.  అలాటి మరో ఉద్దండ నటుడు చిలకలపూడి  సీతారామాంజనేయులుగారుక్లుప్తంగాసి.ఎస్.ఆర్. అనాటి ప్రముఖ రంగస్థల, సినీ నటుడు మాత్రమే కాదు- గాయకుడు కూడా. తనపాటలు, పద్యాలు  తానే పాడుకునేవారు. మాయాబజార్ శకునిగా మాత్రమే మనము గుర్తించిన సి.ఎస్.ఆర్.  తెరమీది మొట్టమొదటి వేంకటేశ్వరస్వామి పాత్రధారి.

ఈ శ్రీకృష్ణకుచేల సినిమాలో 'నిలుపన్ జాలను నెమ్మనమ్ము...' అనే  పద్యాన్ని ముందు సి.ఎస్.ఆర్.గారిచేతే   పాడించి రికార్డు చేశారు ఘంటసాల. కానీ  సి.ఎస్.ఆర్. గారికి తాను పాడినది సంతృప్తినివ్వక, ఘంటసాలగారినే మరల పాడమని కోరడంతో ఘంటసాలగారు పాడి సి.ఎస్.ఆర్,గారి మీద చిత్రీకరించడం జరిగింది.

ఈ సినిమాలో ఒకచోట పాండవుల రాజసూయ యాగ ఘట్టం కూడా పెట్టారు. అందులోని విశేషమేమంటే ఆ సన్నివేశంలో నటించినవారంతా ఆనాటి పౌరాణిక నాటక నటులే. కృష్ణుడిగా రఘురామయ్య, ధర్మరాజుగా అద్దంకి శ్రీరామమూర్తి ఇత్యాదులు నటించారు. అంతేకాదు ఆ సందర్భంలో వచ్చే పద్యాలను ఆయా నటులే స్వరకల్పన చేసుకుని పాడగా ఘంటసాలగారి ఆధ్వర్యంలో రికార్డింగ్ చేయడం జరిగింది.

అలాటి లబ్దప్రతిష్టులైన సి.ఎస్.ఆర్., కన్నాంబ, కళ్యాణం రఘురామయ్య, చిత్రపు నారాయణమూర్తి, ఘంటసాల, పాలగుమ్మి పద్మరాజుల సమ్మేళనంలో తయారైన ఉదాత్త భక్తిచిత్రం శ్రీకృష్ణకుచేల. ఇది చిత్రపు నారాయణమూర్తి గారి స్వంతచిత్రం. ఉదాత్తమైన కథాంశం గల అనేక సినీమాల లాగే, ఈ శ్రీకృష్ణకుచేల కూడా మన తెలుగు ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. మంచి సినీమా అనే పత్రికా ప్రశంసలు మాత్రమే లభించాయి.

కొసమెరుపు....

ఈ శ్రీకృష్ణకుచేల సినీమా తెలుగులో వచ్చినకాలంలోనే పొరుగునెక్కడో వున్నమలయాళం వారు మన సి.ఎస్.ఆర్.గారితో  నిర్మించిన 'భక్త కుచేల' అనే సినిమా ఈనాడు యూట్యూబ్ లో ప్రేక్షక వీక్షణకు అందుబాటులో వుంది. కానీ ఉత్తమ విలువలతో నిండిన మన తెలుగు శ్రీకృష్ణకుచేల సినిమా మాత్రం  దూర్భిణీ వేసి వెతికినా కనపడదు. ఎక్కడుంది లోపం??

 

వచ్చే వారంసదా మదిలో మెదిలే ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

Saturday, 1 August 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 26 - పెళ్ళిసందడి – రావే ప్రేమలతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 26


పెళ్ళిసందడి – రావే ప్రేమలతా ...


గతమొక చరిత్ర, తిరిగిరానిదిభవిష్యత్ ఎవరూ చెప్పలేరు, మన చేతిలో లేనిదివర్తమానమే మనది; ఈ క్షణమే శాశ్వతం. అందుచేత భూత భవిష్యత్ కాలాల గురించి ఆలోచించక మనకున్న ఈ కొద్ది క్షణాలు  సద్వినియోగం చేసుకుని జీవితాన్ని  సార్ధకపర్చుకోవాలి. ఇది వేదాంత సూక్తి. పరిమిత జ్జానంతో ఈ సూక్తిని ఎవరికివారు  తమకు కావలసినరీతిలో అన్వయించుకుని ఆచరిస్తున్నారు. ముక్తి సాధన కోసం కొందరైతేజ్ఞాన సముపార్జనకోసం కొందరు; ధనార్జన, పదవులు, అధికారాల కోసం; మదిర మగువల కోసం మరికొందరు అమూల్యమైన ఈ క్షణాన్ని(వర్తమానం) వినియోగించుకుంటున్నారు.

కానీ, ఇక్కడ, ఓ భావుకుడైన యువకుడు  మాత్రం తనకున్న కొద్ది క్షణాలను  తన ప్రియురాలి సమక్షంలో ఈ ప్రపంచాన్నే మరచి మధురాతిమధురంగా ఆనందమయం చేసుకోవాలని భావిస్తున్నాడు. ప్రేమించిన యువతిని ప్రేమలతగా, మనసులోని భావాల కవితగా తన చెంతకు ఆహ్వానిస్తున్నాడు...

పద్యం:

ఆహా చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞగీతికా

లాపనసేయు  కూర్మి  జవరాలోకవైపు మరొక్క వైపునన్

ఈ పసి కమ్మతెమ్మెరలు  ఈ పువుదోటల శోభలున్నచో

రేపటి ఆశ నిన్న వేతలేటికి నేటి సుఖాల తేలుమా! ఆ....ఆ....

యుగళగీతం:

అతడు: 

రావే ప్రేమలతా నీవే నా కవితా 

కిన్నెర మీటుల కిలకిలవే  

పలు వన్నెల మెరపుల మిలమిలవే

ఆమె:

ఓహో కవిరాజా నేడే నెలరాజా 

ఎందులకోయీ  పరవశము 

నీకెందులకోయీ కలవరము

అ: 

పూవులలో  నును తీవెలలో 

ఏ తావున  నీవే  వనరాణీ -2

ఆ: 

అందవతి కనిపించినచో 

కవులందరి  చందమిదేలే ! ఓహో!

అ: 

పరువులిడే  సెలయేరువలే  

నిను చేరగ కోరును నా మనసూ

ఆ: 

ఊహలతో  ఉలికించకుమా 

నవమోహన ఈ చెలి మదినే


అ: రావే ప్రేమలతా నీవే నా కవితా


ఆ: 

ముచ్చటగా  మనముండినచో 

మన మచ్చికకు  జగమేమనునో

అ: 

లోకముతో  మనకేమి పనీ 

మనసేకమయీ మనముంటే

ఆ: 

నేనే నీ కవితా

అ: రావే ప్రేమలతా ....

ఇద్దరూ కలసి : హమ్మింగ్...


హేమలత, స్వర్ణలత, సుమలత, ప్రేమలత, తనూలత ... యివన్నీ  యవ్వనంలో వున్న అందమైన యువతులకు పర్యాయ పదాలు, విశేషణాలు. అందుకే భావకుడైన కథానాయకుడు తన ప్రేయసిని 'ప్రేమలతా' అని సంబోధిస్తూ పూవులలో, నును తీవెలలో నిండిన వనరాణి యని వర్ణిస్తున్నాడు. అందుకు ఆ అమ్మాయి ఏమీ ఉబ్బి తబ్బిబ్బు అవలేదు. తనలాటి ' అందవతి'  కనిపిస్తే  కవులందరి తీరు ఇంతేనని ఎత్తిపోడుస్తోంది.  తన అందంమీద ఎంతవిశ్వాసం లేకపోతే తనను తానే 'అందవతి' అని పొగుడుకుంటుంది!  అంతలోనే ఆమెకు చిన్న భయం...  తమ అన్యోన్య స్నేహానికి లోకం ఏమనుకుంటుందోనని. 'మన మనసులు కలిసినపుడు లోకంతో ఏం పని అని అతని భరోసా. ఇలా ఈప్రేమ పక్షులు సుందరనందనోద్యానంలోకువకువలాడుతూ చూడముచ్చట గొలుపుతాయి.

ఈ చక్కటి యుగళగీతాన్ని జూనియర్ సముద్రాల (రామానుజం) గారు  1959లో వచ్చిన పెళ్ళిసందడి  సినీమా కోసం వ్రాశారు. ఘంటసాలగారు సంగీతం చేసిన సినీమాలలో పాటకు ముందు చిన్న సాకీయో లేక పద్యమో వుండడం ఆనవాయితీ. అలాగే ఈ పాటకు ముందు కూడా చందోబద్ధంగా ఒక మనోజ్ఞమైన పద్యాన్ని పెట్టారు రామానుజంగారు.

ఇంత  ముచ్చటైన ప్రేమ గీతంలో, బహుశా పారవశ్యంలో కాబోలు, దొర్లిన ' అందవతి' పదప్రయోగం ఆనాటి కొంతమంది తెలుగుభాషా ప్రియులకు పంటి క్రింద రాయిలా, కంటిలో నలుసులా ఇబ్బందిపెట్టింది. ఈ మాట తెలుగు నిఘంటువులలో కనపడదు.   సినీమా పాట కదా అలాగే వుంటుంది మరి అని అన్నవాళ్లు ఉన్నారు .

19-20  శతాబ్దాలకు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఒక సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. ఈనాటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహార్ సంస్థాన ఆస్థాన విద్వాంసుడు.  సరోద్, వయొలిన్, పక్వాజ్, మృదంగం  వంటి వాద్యాలలో, పాశ్చాత్య సంగీతంలో నిష్ణాతుడు. సంగీతమంటే గాత్ర సంగీతమే సంగీతమని భావిస్తున్న రోజులలో వాద్య సంగీతానికి కూడా అంతటి ప్రాశస్త్యాన్ని తెచ్చిపెట్టిన గొప్ప కళాకారుడు అల్లావుద్దీన్ ఖాన్. పద్మవిభూషణ్ బిరుదు గ్రహీత. కుమార్తె అన్నపూర్ణాదేవి, పండిట్ రవిశంకర్, నిఖిల్ బెనర్జీ, పన్నాలాల్ ఘోష్, వి.జి.జోగ్ వంటి అంతర్జాతీయ కళాకారులంతా అల్లాఉద్దీన్ ఖాన్ శిష్యులే.

అంతటి లబ్దప్రతిష్టుడైన అల్లావుద్దీన్ ఖాన్ చే ప్రచుర్యంలోనికి తీసుకురాబడిన రాగమే హేమంత్. బిలావల్ థాట్ కు చెందిన ఔఢవ  సంపూర్ణరాగం.  అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణ లో ఏడు స్వరాలు వుంటాయి. ఆరోహణ క్రమంలో లేని రిషభ పంచమ స్వరాలు అవరోహణ లో వుంటాయి.   కౌశికధ్వని  అనే రాగానికి అదనంగా కొన్ని స్వరాలు చేర్చి హేమంత్  అనే కొత్త రాగాన్ని అల్లావుద్దీన్ ఖాన్  తయారుచేశారు. హేమంత ఋతువంత  ఆహ్లాదకరమైన రాగం హేమంత్.

మనసుకు ప్రశాంతిని చేకూర్చే రాగం. అటువంటి హేమంత్  రాగ స్వరాలతో ఈనాటి ఘంటసాల సజీవరాగం ... ' రానే ప్రేమలతా  నీవే నా కవితా' యుగళగీతం రూపొందించబడింది.

తెలుగు చిత్రసీమ తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతిగారు. అలాగే, ఆలిండియా రేడియో తొలి లలితసంగీత గాయని కూడా ఆవిడే. ఆ తర్వాతే ఘంటసాలగారి రంగప్రవేశం. ఘంటసాలగారు సంగీతదర్శకుడైన తర్వాత బాలసరస్వతిగారితో ఎన్నో పాటలు పాడారు పాడించారు. ఆ ఇద్దరు కలసి పాడిన యుగళ గీతమే మన ఈనాటి సజీవరాగం. సరళమైన శ్రావ్యమైన గీతాలు పాడడంలో ఒకరిని మించినవారు మరొకరు. వీరి గాత్ర మాధుర్యంతో 'రావే ప్రేమలతా' పాట పెళ్లిసందడి సినిమాకు గొప్ప పెన్నిధి అయింది. ఈ పాటకు మరో పెద్ద ఆకర్షణ ఘంటసాలగారు సమకూర్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకనో చిన్నప్పుడు నేర్చుకున్న జంటస్వరాలు, అలంకారాలు గుర్తుకు వస్తాయి.  ఓ పదిమంది హేమంత్ రాగంలో అలంకారాలు పాడినా వాయించినా ఇలాగే వుంటుందని ఒక ఊహ.  ఒక చిన్న మాండోలిన్ బిట్ తో పాట పల్లవి ప్రారంభమవుతుంది. పల్లవి తర్వాత, చరణాలు తర్వాత వచ్చే బిజిఎమ్స్  మనసుకు హాయిని కలిగిస్తాయి.  చరణం చరణానికి మార్పు లేకుండా పాటంతటికి ఒకే బిజిఎమ్ ను ఉపయోగించడం వలన పాట శాశ్వతంగా గుర్తుండిపోతుంది. 

ఘంటసాలగారు ఈ పాట కోసం మేండోలిన్, యూనివోక్స్ (క్లేవయొలిన్), వయొలిన్, పియానో, ఫ్లూట్, క్లారినెట్, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా, చిటికెలు, బ్రషెస్ వంటి వాద్యాలను ఉపయోగించారు.   పాటకు ముందు కేవలం ఒక తంబురా శ్రుతితో ఘంటసాల గారు పాడిన  పద్యం ఈ సన్నివేశానికి గొప్ప హైలెట్.

తెలుగు సినిమా సంగీత స్వర్ణయుగంలో నీవే నేను,  నేనే నీవు అన్నట్లుగా మమేకమైపోయిన  అక్కినేని, ఘంటసాల ల కాంబినేషన్లో వచ్చిన అద్భుతగీతం 'రావే ప్రేమలతా ... నీవే నాకవితా...' . ఏదో డామ్ పరిసరాల్లో సుందర ప్రకృతి దృశ్యాలతో నిండిన  ఉద్యానవనంలో  ఎ.ఎన్.ఆర్., అంజలీదేవిల మీద చిత్రీకరించబడిన చక్కటి హుషారైన యుగళగీతం.

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బి.ఎ.సీతారాం నిర్మించిన మొదటి చిత్రం పెళ్లిసందడి. డి.యోగానంద్ డైరక్షన్లో వచ్చిన ఈ సినీమా హీరో, హీరోయిన్ లు అక్కినేని, అంజలీదేవి కాగా యితర పాత్రలలో బి.సరోజాదేవి, చలం, గుమ్మడి, రమణారెడ్డి, డా.శివరామకృష్ణయ్య, మొదలగువారు నటించారు.

ఘంటసాల గారి సంగీతంలో ఎన్నో మంచి పాటలతో నిండిన పెళ్లిసందడి ప్రేక్షకులలో మంచి సందడి నే సృష్టించి మంచి విజయాన్ని పొందింది.


వచ్చే వారం ఘంటసాల గారి మరో సజీవరాగంతో మరల  కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

Saturday, 25 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 25 - భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 25

భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు, కళా సంస్కృతికి దర్పణాలు మన ప్రాచీన దేవాలయాలు. విజ్ఞాన వికాసాలను అందించిన విద్యాలయాలు. శిల్ప, సంగీత, నృత్యాది కళలు మన దేవాలయాల నుండే అభివృద్ధి చెందాయి. భారతీయ దేవాలయ సంస్కృతి 12 వ శతాబ్దం నాటికే దక్షిణాసియా దేశాల వరకు  వ్యాపించింది. 

ప్రాచీన కాలంలో ఆలయాల్లోని దేవుని పూజా విధానంలో భాగంగా దేవుని సేవ కోసమై కొంతమంది  స్త్రీలు భగవంతుని పరంగా నృత్యాలు చేసేవారు. వారిని దేవదాసీలనేవారు. వంశపారంపర్యంగా వారు దేవుని సేవ కోసమే అంకితమైపోయినవారు. ఈ దేవదాసీ నృత్యాలు కాలక్రమేణా  ఈనాడు మనం చూస్తున్న శాస్త్రీయ నృత్యాలుగా పురోభివృద్ధి చెందాయి.

తమిళనాడుకు చెందిన భరతనాట్యం, ఆంధ్రపదేశ్ కు చెందిన కూచిపూడి, ఒరియాకు చెందిన    ఒడిస్సీ, కేరళకు చెందిన మోహినియాట్టం, కర్ణాటక యక్షగానం, అస్సాం సత్త్రియ నాట్యం మొదలైనవన్నీ దేవాలయాల వరప్రసాదమే.

గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచమంతా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆధునీకరణ, నవీనత్వంపేరిట అన్ని రంగాలలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. ఆ  మార్పు శాస్త్రీయ సంగీత, నృత్యరంగాలలో కూడా బాగా కనిపిస్తుంది. సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడం కోసం  చేపడుతున్న కొత్త ప్రక్రియలు ఎన్నో.  ఇందువలన  ఈనాటి సంగీత నృత్య కళలలో మన ప్రాచీన శాస్త్రీయ దృక్పథం కొరవడుతున్నదనే భావన కలుగుతున్నది . ఇది మంచికా, చెడుకా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఈనాటి మన సజీవరాగం గత తరం సంగీతాభిమానులు మెచ్చిన ఒక పాతకాలపు సినిమాలోని శాస్త్రీయ నృత్య గీతం... అదే మన ఘంటసాలవారి స్వంత చిత్రం భక్తరఘునాథ్ లోని 'జయ మురళీలోల గోపాలా ...'


జయ మురళీ లోల గోపాలా - 2

మా ఎద మురిపాల జ్యోతుల చేసి

ప్రియమున కొలిచేము నిలిచేము స్వామి 

                                                !జయ!

 

మదవతులా మది దోచిన రాగీ

మౌనుల హృదయాల భాసించు యోగీ

కాళీయ ఫణిజాల తాండవలోలా

గైకొను మానంద  నీరాజనాలా 

                                                !జయ!

సాధారణంగా మన సినిమాలలోని శాస్త్రీయ నృత్యగీతాలు... దేవుని పరంగా కావచ్చు లేదా రాజు మహరాజుల పరంగా కావచ్చు, అవి శృంగార తత్త్వంతో నిండివుంటాయి. కానీ, ఈ నర్తకి మా త్రం కేవలం కృష్ణస్వామి నామ సంకీర్తనంతో  నృత్యం చేస్తూ  తన భక్తిప్రపత్తులు తెలియజేస్తోంది. సంకీర్తనం ద్వారా నర్తకి, శ్రవణం ద్వారా ఆలయంలోని భక్తులు దేవుని సేవించుకుంటున్నారు.

భక్త రఘునాథ్ సినీమాలో ఒక ఆలయ నృత్య సన్నివేశంకోసం  శ్రీ సముద్రాల రాఘవాచార్యులువారు వ్రాసిన చిన్నగీతం ఇది.  సాహి త్యందృష్ట్యా కేవలం ఒక చిన్న పల్లవి రెండేరెండు చరణాలతో ముగించారు. సముద్రాల వారు ఆరితేరిన శ్రీవైష్ణవ  కవి అయినా క్లిష్టమైన 'మదవతుల మది  దోచిన రాగి; మౌనుల హృదయాల భాసించు  యోగి అని శ్రీకృష్ణుని  సంబోధించడంలో సముద్రాలవారి కవితా శైలి స్పష్టమవుతుంది. సంగీత సాహిత్య నృత్య సమన్విత గీతంలో  సాహిత్యం ఎంతవరకు వుండాలో అంతవరకే ఉపయోగించుకున్నారు దర్శక రచయిత సముద్రాల. సన్నివేశానికి అనుగుణ్యమైన సంగీత నృత్యాలను సమకూర్చే  భాధ్యతను సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్య దర్శకుడు వెంపటి పెద సత్యంకు  వదిలేశారు. సంస్కృత సమాసాల జోలికి పోకుండా సరళమైన చిన్న చిన్న పదాలనే సమర్థవంతంగా వాడారు.

ఘంటసాల మాస్టారు ఈ నృత్య గీతాన్ని శ్రీరంజని రాగంలో మలచారు. కర్ణాటక సంగీతంలో 22 వ మేళకర్త  ఖరహరప్రియకు జన్యరాగం. ఆరోహణ అవరోహణ క్రమంలో ఆరు స్వరాలు మాత్రమే వుండే షాఢవ రాగం. పంచమ స్వరం వుండదు. శృంగార భక్తి రసాలను వెల్లడించడానికి చాలా అనువైన రాగం శ్రీరంజని. అందుకే మాస్టారు ఈ రాగంలో ఈ నృత్య గీతాన్ని చేయడానికి సంకల్పించారు.  కర్ణాటక సంగీతంలో మంచి అనుభవం గల ఎ.పి.కోమలగారితో  ఈ పాటను పాడించారు పాటలో వచ్చే చిన్నచిన్న ఆలాపనలు, స్వరకల్పనలు, గమకాలు, సంగతులు అన్నీ కోమల గళంలో సలక్షణంగా పలికి శ్రోతలను రంజింపజేశాయి. మృదంగం, మోర్సింగ్ ల తాళగతులతో ఆరంభమయ్యే ఈ నృత్య గీతంలో ప్రధాన వాద్యంగా వీణను ఎన్నుకున్నారు ఘంటసాల గారు. రికార్డింగ్ లో ఈ పాటకు వీణను వాయించిన సంగీతరావుగారే తెరపై కూడా వీణ వాయిస్తూ కనపడడం ఒక విశేషం. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే విద్యార్థులకు అభ్యాస గీతంగా ఘంటసాలగారు కర్నాటక సంగీత శాస్త్ర మర్యాదలననుసరించి స్వరపర్చిన అనేక గీతాలను నేర్పడం ఎంతైనా సముచితమని శ్రీ సంగీతరావుగారి నిశ్చితాభిప్రాయం. అటువంటి గీతాలలో శాస్త్రీయత ఉట్టిపడే ఈ 'జయమురళీలోలా' ఒకటి. 

భక్తరఘునాథ్ సినిమాకు వెంపటి పెదసత్యం, చిన్నిలాల్, సంపత్ లాల్ లు నృత్య దర్శకులుగా  వ్యవహరించారు. ఈ శాస్త్రీయ నృత్య గీతాన్ని మాత్రం వెంపటి వారే రూపొందించారు.  అప్పుడే  సినీమా రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన నర్తకి  సోదరీమణులు స్వర్ణ, మణిలలో స్వర్ణ చేత ఈ నృత్యాన్ని చేయించి ఆ కొత్త నటికి ప్రోత్సాహాన్ని అందించారు ఘంటసాల. ఆ నాటి ఆ మణియే తర్వాతి కాలంలో గీతాంజలిగా బహు భాషా చిత్ర నటిగా ప్రఖ్యాతి చెందారు.

సంగీతభరిత భక్తి చిత్రంగా ఘంటసాలగారు నిర్మించిన భక్తరఘునాథ్ ఈనాడు సినీమాగా  గాని వీడియోగా గాని మనకు అందుబాటులో లేకపోవడం చాలా విచారకరం.


వచ్చే వారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 27 - శ్రీకృష్ణకుచేల – పావన తులసీమాతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...