Saturday, 12 September 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 32 - హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 32


వాల్మీకి - హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా


ఒకసారి జనసంచారం లేని అరణ్యమార్గంగా నారదమహర్షి పయనిస్తూండగా ఒక దొంగ తారసపడి  నారదునివద్ద వున్న వస్తువులను  బలవంతాన తస్కరించబోయాడు. నారదుడు ఆ దొంగను మాటలతో మభ్యపెట్టి అతను దొంగతనాలకు పాల్పడడానికి కారణమడిగాడు. అప్పుడా దొంగ తన భార్య కోరికలు, ముచ్చట్లు తీర్చడానికి, కుటుంబసభ్యులను పోషించడానికి అరణ్యంలో సంచరించే బాటసారులను హింసించి దోచుకుంటున్నాని చెప్పాడు. దొంగతనం, ఇతరులను హింసించడం పాపకార్యమని, పాపకర్మల ద్వారా వచ్చిన ధనంతో సుఖసంతోషాలననుభవిస్తున్న దొంగ కుటుంబం అతని పాపాలను కూడా పంచుకుంటుందో లేదో తెలుసుకోమని నారదుడు ఆ దొంగకు సలహా ఇచ్చాడు. ఆ దొంగ తన భార్యను, కుటుంబ సభ్యులను   తన సంపాదనను అనుభవిస్తున్నట్లు గానే పాపాలలో కూడా భాగం పంచుకుంటారు కదా అని అడిగాడు. భార్యా పిల్లలను, కుటుంబాన్ని పోషించడం అతని బాధ్యత, కర్తవ్యమని అందుకోసం అతను చేసే పాపకార్యాలతో తమకేమాత్రం సంబంధం లేదని, అందుచేత అతని పాపాలను పెంచుకునే ప్రసక్తే లేదని నిష్కర్షగా తేల్చిచెప్పేశారు.

ఈ సంఘటనతో జీవితంపట్ల విరక్తి చెంది కర్తవ్యవిమూఢుడైన ఆ దొంగ మరల నారదుని దర్శించి తనకు తరుణోపాయం ఉపదేశించమని కోరుకున్నాడు. అప్పుడు నారదమహర్షి ఆ దొంగతో 'రామ'నామ బీజాక్షరి మంత్రాన్ని తదేక ధ్యానంతో జపిస్తే అతనిలోని అజ్ఞానం తొలగి సాత్విక లక్షణములు అలవడి మానసిక శాంతిని, సంతోషాన్ని పొందగలవని ఉపదేశిస్తాడు. అజ్ఞానం వలన, విద్యావిహీనత వలన 'రామ' శబ్దాన్ని ఉచ్ఛరించడానికి ఇబ్బందిపడుతున్న ఆ దొంగను 'మర మర' యని జరిపించమని సలహాయిచ్చి నారదుడు వెళ్ళిపోతాడు. ఆ దొంగ ఏకాగ్రచిత్తంతో 'మర మర' అని జపించడం ప్రారంభిస్తాడు 'మర మర' అనే నామం క్రమక్రమంగా 'రామ'నామ బీజాక్షరిగా అతని నోట జపించబడింది. అతను తన పరిసరాలను, ఇహలోకాన్ని  పూర్తిగా మరచి తపోనిష్టలో మునిగిపోయాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అతని చుట్టూ దట్టమైన పుట్టలు పెరిగిపోయాయి.

రామనామం ఎంతో మహిమ కలది. అష్టాక్షరీ  మంత్రంలోని 'రా' ను, పంచాక్షరీ మంత్రం లోని '' కలిసి 'రామ' శబ్దంగా మారింది. 'రా' అంటే అగ్ని బీజం. శరీరాన్ని , మనసును ఉత్తేజపరుస్తుంది. '' అంటే అమృతబీజం. మనశ్శాంతిని చేకూరుస్తుంది. రామనామ జపం వలన సర్వపాపాలు తొలగిపోయి జ్ఞానం, మనశ్శాంతి, ముక్తి సిద్ధిస్తాయని పండితులు చెపుతారు.

ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సు తర్వాత పుట్టలోని మనిషికి భగవదనుగ్రహం లభించింది. మహామనీషియై బ్రహ్మజ్ఞానం పొందాడు. సుదీర్ఘ తపోనిష్టలోనుండి బయటకు వచ్చాడు. పుట్టకు సంస్కృతంలో వాల్మీకం అని పేరు. అందులోనుండి బయటకు వచ్చినవాడు కనుక వాల్మీకియైనాడు. ఆ పుట్ట పరిసరాల్లోనే ఒక ఆశ్రమం నిర్మించుకుని సాత్విక జీవనం చేయసాగాడు.

ఒకరోజు ఉదయం వాల్మీకి నదీస్నానం ముగించుకుని తిరిగివస్తూండగా ఒక చెట్టుమీద మోహపరవశత్వంలో వున్న జంట క్రౌంచపక్షులలో ఒకదానిని బోయవాడొకడు బాణంతో కూల్చడం చూసాడు. వాల్మీకి హృదయం కరుణతో ద్రవించి పోయింది. ఆక్రోశం తో ఆశువుగా ఒక శ్లోకం ఆయన నోట వెలువడింది. అదే....

 ఆదిశ్లోకం:

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః

యత్ క్రౌంచ మిధునాదేక మవధీ కామమోహితమ్

'ఓ కిరాతకుడా! కామమోహితమై యున్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని నీవు చంపావు కాబట్టి శాశ్వత కాలం సత్కీర్తిని అనుభవించలేవు' అని శపించారు.


నిజానికి ఇక్కడ వేటగాడి రూపంలో వచ్చినది మహావిష్ణువు. క్రౌంచ పక్షుల రూపంలో సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులను వధించడానికి మారు రూపం ధరించాడు. ఈ శాప ఫలితంగా వేటగాడి రూపంలో వున్న మహావిష్ణువు  తన రామావతారకాలంలో  సీతాదేవిని కోల్పోయి సుదీర్ఘమైన భార్యావియోగాన్ని అనుభవించాడు.

ఆధ్యాత్మిక విశ్లేషకులు ఈ శ్లోకానికి రామాయణం పరంగా మరోలా అర్ధం చెపుతారు.

'మా' అంటే లక్ష్మీదేవి.'నిషాద' అంటే లక్ష్మీదేవికి నివాసమైన వాడు మహావిష్ణువు (శ్రీరాముడు). ఓ! లక్ష్మీనివాసుడైన శ్రీరామా నీవు ఈ లోకాన శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు అందుకుంటావు. ఎందువలన అంటే ... క్రౌంచ పక్షుల జంటలాంటి రావణాసుర, మండోదరీ దంపతుల్లో కామమోహితుడైన అసురుడు రావణుని నీవు వధించి లోకకళ్యాణం చేశావు. వాల్మీకి నోటమ్మట ఆయనకు తెలియకుండానే 'మా' (లక్ష్మి) అనే అక్షరంతో ప్రారంభమై శ్రీరాముని కీర్తించే మంగళ శ్లోకం వెలువడింది. శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు బీజం పడింది. భారతీయులందరికీ ఆదికవి వాల్మీకి. ఆది శ్లోకం 'మా నిషాద..' ఆదికావ్యం శ్రీమద్రామాయణం.

 వాల్మీకి మహర్షి జన్మ వృత్తాంతం విషయంలో ఒక్కొక్క పురాణం ఒక్కొక్కలా వర్ణించింది. కచ్చితమైన చారిత్రకాధారాలు వున్నట్లు కనపడదు.

శ్రీరామచరిత్ మానస్ (తులసీ రామాయణం)ను వ్రాసిన 16 వ శతాబ్దపు భక్తుడు, కవియైన శ్రీ తులసీదాస్ వాల్మీకి అవతారంగా ఉత్తర భారతీయులు విశ్వసిస్తారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తన దివ్యదృష్టితో దర్శించగల బ్రహ్మజ్ఞాని వాల్మీకి.

శ్రీరాముడు ఈ భువిని జన్మించడానికి ముందే రామకథను రామాయణ మహాకావ్యంగా వ్రాసి లోకానికి గొప్ప ఉపకారం చేశాడు. పితృవాక్య  పరిపాలకుడు, ఏకపత్నీ వ్రతుడు, ధర్మనిరతికి మారుపేరు అయిన రాముడు ఏ యుగానికైనా, ఏ ప్రాంతంవారికైనా ఆదర్శప్రాయుడు, పూజనీయుడు.  అటువంటి శ్రీరాముని సృష్టించిన వాల్మీకి గొప్ప మహనీయుడు. అంతేకాదు, రామాయణ గాధతో ప్రత్యక్ష సంబంధం గలవాడు వాల్మీకి. పరుల చెప్పుడు మాటలనే జనవాక్యంగా తలదాల్చి మహాపతివ్రత, గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టి నప్పుడు ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి ఆమెకు జన్మించిన లవకుశులను పెంచి పెద్ద చేసి రఘువంశ రాజుల వారసులుగా తీర్చిదిద్దిన ఆచార్యదేవుడు వాల్మీకి.

లభ్యమైవున్న పౌరాణిక గాధల ఆధారంగా కవి సముద్రాల రాఘవాచార్యులు వారు తయారుచేసిన కధను 'వాల్మీకి' పేరుతో జూపిటర్ పిక్చర్స్ వారు 1963 లో తెలుగు, కన్నడ భాషల్లో సినీమాగా తీసి విడుదల చేశారు. ఆదికవి వాల్మీకి పాత్రలో తెలుగులో ఎన్.టి.రామారావు , కన్నడంలో రాజ్ కుమార్  తమ అత్యుత్తమ  నటనతో జీవంపోసారు. రెండు భాషల్లోనూ సి.ఎస్.రావుగారు  చిత్రదర్శకుడు కాగా సంగీత దర్శకత్వాన్ని ఘంటసాల గారు నిర్వహించారు.

లోకకళ్యాణార్ధం మహావిష్ణువు శ్రీరామునిగా ఈ భువిని అవతరించే సంఘటనను భవిష్యద్దర్శనం చేస్తూ వాల్మీకి గానం చేసిన 'హరియే వెలయునుగా భువిని...' అనే గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం.

వాల్మీకి:

హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా !హరి!

పరిపాలింప సాధుల పరిమార్ప దనుజుల !హరి!

యజ్ఞ కుండములు ఆరక వెలుగు హోమధూమములు

మింటను చెలగు వేదగీతి వనవీధుల మ్రోగు ఆ...

శిష్య బృందం:

ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్

వాల్లీకి:

వేదగీతి వనవీధుల మ్రోగు

యాగ యోగములు సాగు !హరి!

సకల జీవులకు సంతతి సౌఖ్యము సిరిసంపదలు చేకూరు

పుడమిని ధర్మము నాల్గు పాదములా ఆ...!పుడమిని!

నడిపించును జగదానందముగా !హరి!

ఎక్కడైతే యజ్ఞ యాగాదులు సక్రమంగా నిర్వర్తించ బడతాయో ఆ ప్రదేశమంతా సశ్యశ్యామలమై సుభిక్షంగా వుంటుంది. ప్రకృతి సమతుల్యంగా వుంటుంది. ప్రజలంతా మనశ్శాంతితో సుఖసంతోషాలతో హాయిగా వుంటారని శాస్త్రపురాణాలు చెపుతాయి. అందుకే ఆచార్యులు గారు 'యజ్ఞకుండములు ఆరకవెలుగు హోమధూమములు మింటను చెలగు వేదగీతి వనవీధుల మ్రోగు' అనే ఆశాభావాన్ని వాల్మీకి మహర్షి నోటమ్మట పలికించారు. అంతేకాదు, శ్రీహరి రామావతారం దాల్చితే ఈ భూమి మీద ధర్మము నాలుగు పాదాల నడుస్తుందనే ఆకాంక్ష ను కూడా వ్యక్తంచేయించారు. సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ 'లోకా సమస్తాః సుఖినోభవన్తు' అనే ఆర్యోక్తికి దర్పణం పట్టే మంచి పాట 'హరియే వెలయునుగా...'

ఘంటసాల మాస్టారు ఈ పాటను ఆరభి రాగంలో చేశారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర గల అతి ప్రాచీనమైన రాగం ఆరభి. కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త అయిన ధీర శంకరాభరణానికి జన్యం. ఔడవ-సంపూర్ణ రాగం. శుద్ధసావేరీ (5 స్వరాలు), శంకరాభరణం (7 స్వరాలు) రాగాల సమ్మేళనమే ఆరభి రాగం. ఘనరాగ పంచకాలలో మూడవ రాగం ఆరభి. ఎంతో శుభప్రదమైన ఈ రాగంలోనే సద్గురు త్యాగరాజస్వామి వారి  'సాధించెనే ఓ మనసా' పంచరత్న కీర్తన వుంది. నేటి మన సజీవరాగం 'హరియే వెలయునుగా' అనే గీతానికి  అతి పురాతనమైన ఆరభి రాగాన్ని ఎంచుకోవడంలో ఘంటసాలగారు ఎంతో ఔచిత్యాన్ని కనపర్చారు. వాల్మీకి లోని సాత్విక, భక్తి, కరుణరసాలను ప్రస్ఫుటం చేస్తూ అత్యంత భక్తిభావంతో  గానం చేసి ఆరభి రాగ స్వరూపాన్నంతా  ఘంటసాలగారు ఈ పాటలో కనపర్చారు.  మాస్టారు ఈ పాటలో వీణ (సంగీతరావుగారు వాయించారు), వయొలిన్స్, ఫ్లూట్, తబలా, తాళ వాద్యాలను సందర్భోచితంగా ఉపయోగించారు.

జానపద, పౌరాణిక సమ్మిళితం 'వాల్మీకి' సినిమా. ఈ సినిమా లో మొత్తం 17 పాటలు శ్లోకాలు వున్నాయి. వాటిని ఘంటసాల, రఘురామయ్య (నారదుడు), సుశీల, జానకి, కోమల, మాధవపెద్ది, జె.వి.రాఘవులు గానం చేశారు. వాల్మీకి సినిమాకు తలమానిక గీతాలు మూడు. అవి - 'శ్రీ రామాయణ కావ్యకథా జీవన తారక మమ”, జయ జయ జయ నటరాజా రజతశైల రాజాఠ, మరియు, హరియే వెలయునుగా”. ఈ మూడు గీతాలను ఘంటసాల గారే అద్భుతంగా ఆలపించి వాటికొక సార్ధకత ఏర్పరిచారు.

వాల్మీకి తెలుగు సినిమాలో వాల్మీకిగా ఎన్.టి.ఆర్., కన్నడంలో రాజ్ కుమార్ నటించగా ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన రఘురామయ్య, రాజసులోచన, లీలావతి,  కాంతారావు, రాజనాల, శారదా  కన్నడంలో కూడా నటించారు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో తెలుగులోని పాటల వరసలనే కన్నడంలో కూడా ఉపయోగించారు.

వాల్మీకి తెలుగు కన్నడ సినిమాలను నిర్మించిన జూపిటర్ పిక్చర్స్ తమిళ సంస్థకు రామాయణ కావ్యమంత చరిత్ర వుంది. తమిళ సినీమా పురోభివృద్ధిలో జూపిటర్ పిక్చర్స్ ప్రధానపాత్ర పోషించింది. 1934 మొదలు 1964 వరకు ముఫ్ఫై సంవత్సరాల కాలంలో తమిళ, తెలుగు(5), కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40 సినీమాల కు పైగా నిర్మించారు. కోయంబత్తుర్ లోని సెంట్రల్ స్టూడియో కేంద్రంగా అనేక తమిళ సినీమాలను తీసిన జంటనిర్మాతలు ఎమ్.సోమసుందరం & ఎస్.కె.మొహిద్దీన్ 1950 తర్వాత తమ స్థావరాన్ని మద్రాసుకు మార్చారు. రాజా అణ్ణామలైపురంలో (ప్రస్తుత  దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్/ ఆంధ్ర మహిళా హాస్పిటల్ కు ఎదురుగా) ఆర్కాట్ నవాబ్ లకు చెందిన స్థలంలో కట్టబడిన నెప్ట్యూన్ స్టూడియోను కొని తమ చిత్రనిర్మాణాన్ని కొనసాగించారు. ఎమ్.జి.ఆర్. నటించిన అనేక పాత బ్లాక్ బస్టర్ లను నిర్మించిన జూపిటర్ సోము, మొహిద్దీన్ తదనంతరం మొహిద్దీన్ కుమారుడు ఎస్.కె.హబిబుల్లా ఆధ్వర్యంలో 1965 లో వరకు సినీమా లు తీసారు. జూపిటర్ తీసిన ఆఖరి మూడు సినిమాలు వాల్మీకి తెలుగు, కన్నడం; మర్మయోగి తెలుగు. ఈ  ఆఖరి మూడు సినీమాల కు ఘంటసాలగారే సంగీత దర్శకులు.

ఆ తర్వాత నెప్ట్యూన్ స్టూడియో ను ఎమ్.జి.ఆర్. కొనుగోలు చేసి తన తల్లి పేరు మీద సత్యా స్టూడియోగా మార్చి తాను నిర్మించిన, నటించిన సినీమాలను అక్కడే షూటింగ్ జరిపేవారు. ఎమ్.జి.ఆర్.  మరణానంతరం సత్యా స్టూడియో ఆయన గౌరవ  చిహ్నంగా వేల్స్ యూనివర్సిటీ  నిర్వహణలో డా. ఎమ్.జి.ఆర్. - జానకి ఉమెన్స్ కాలేజీ గా రూపాంతరం చెందింది.

 

నేటి ఈ సుదీర్ఘ పురాణాన్ని ఇక్కడితో ముగించడం సముచితం.

 

వచ్చేవారం, మరో ఘంటసాల సజీవరాగంతో మరల కలుద్దాము.

 

కొసమెరుపు:

1952 లో ఘంటసాల గారు పాకిస్థానీ గాయని జొహ్రాబాయి తో కలసి పాడిన ఏకైక హిందీ గీతం గల 'రాణి' హిందీ సినిమా ను తీసినది ఈ జూపిటర్ పిక్చర్స్  వారే.

 

ప్రణవ స్వరాట్


Saturday, 5 September 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 31 - రక్తసంబంధం - ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 31


రక్తసంబంధం - ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే


తల్లితండ్రులు లేని సంసారాలలో పెద్దన్నలు, పెద్దక్కలే తమ తోబుట్టువుల సంరక్షణా భారం వహించి వారి ఉన్నతి కోసం జీవితాంతం కష్టపడతారు. తమ తోబుట్టువులు సంపూర్ణంగా తమ మాటకు కట్టుబడి ఎల్లవేళలా  తమ ఆధీనంలోనే వుండాలని కోరుకుంటారు.

రక్తసంబంధీకుల మధ్య మమతానురాగాలుబంధాలు,  అనుబంధాలు దృఢంగా, బలీయంగా వుండవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కానీ, అవి మితిమీరి రాక్షస ప్రవృత్తికి దారితీయకూడదు. రక్తసంబంధీకులకు, సన్నిహితులకు హాని కలిగించకూడదు.

అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళ పరస్పర ప్రేమానుబంధాలు, రాగద్వేషాలకు సంబంధించిన ఇతివృత్తాలతో మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే over possessiveness (ఈ మాటకు సరైన తెలుగు పదం నాకు తట్టలేదు) వల్ల సర్వనాశనమైన కుటుంబగాధా చిత్రాలు వచ్చాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసినది  ఎన్.టి.రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా జీవించి చిరంజీవత్వం కలిగించిన 'రక్తసంబంధం' సినీమా. అందులో వదినా మరదళ్ళ మధ్య సాగే  ఒక సరససల్లాప గీతమే (పి.సుశీల గానం) నేటి మన ఘంటసాల సజీవరాగం.


ఒహో వయ్యారి వదినా ఉలుకెందుకే

నీ వగలన్నీ ఒకేసారి చూపకే

అహా వుప్పొంగే ఉబలాటం దాచవే

ఇది ఒకనాటితో అయ్యేది కాదులే


నిజమే తొలిరేయీ భావాలు నిలుపలేనట్టి భావాలు

అయినా ఒక్కింతా ఆగాలీ -    ఆగాలీ

అనువైన నునుసిగ్గు జవరాలు చూపాలీ

ఎంత సాహసివైనా ఇంత తొందరపడితే

హవ్వ! నలుగురిలో నగుబాట్లు తప్పవే  -

నీ వలపెంతో గొప్పదని చాటకే  !!ఒహో!!

 

మరలరాదంటూ ఈ రోజూ మదిలో శ్రుతిమించె నీజోరూ

అసలే అన్నయ్యది వెన్నలాంటి మనసు

అలాగనీ గడుసుదేరి చేయకమ్మ అలుసు

మగడు చెంతకు చేరీ మేను తాకిన చాలూ

ఆ గడుసుదినం గాలికెగిరిపోవునే

నీ పడుచుదనం పరవశించి పండును !!ఒహో!! 

 

వైవాహిక జీవితంలో  అంతో యింతో అనుభవం సంపాదించిన ఆ యింటి ఆడపడుచు శోభనం నాటి రాత్రి చెప్పవలసిన హితోపదేశాలను కొంత అల్లరి, కొంత చిలిపితనాన్ని మేళవించి ఒదినగారిని ఆట పట్టించే గీతం ఇది. ఆరుద్రగారు ఎంతో శ్రమించి ఈ పాటను వ్రాసారని ఈ పాట కంపోజింగ్ లో పాల్గొన్న ఘంటసాల మాస్టారి సహాయకులు శ్రీ సంగీతరావుగారు చెప్పడం జరిగింది. పరభాషా గీతాలు జోలికి పోకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాస్టారు ఇచ్చిన ట్యూన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ చూపిన దర్శకుడు వి.మధుసూదన రావుగారు  పాట సాహిత్యం విషయంలో  మాత్రం అడుగడుక్కు సొడ్లు పెడుతూవచ్చారట. ఆరుద్ర గారు కూడా ఏమాత్రం విసుగు, కోపం ప్రదర్శించకుండా ఎంతో ఓపికతో పల్లవి మీద మీద పల్లవి వరుసగా ముఫ్ఫై పల్లవులు వ్రాయగా  మధుసూదనరావుగారు చివరకు ఈ 'ఓహో! వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్నీ ఒకేసారి చూపకే అహా వుప్పోంగే ఉబలాటం దాచవే ఇది ఒకనాటి తో అయ్యేది కాదులే...' మొట్టమొదటగా రాసిన పల్లవికే ఆమోదముద్ర వేసారట.  పాట పల్లవిని బట్టే మిగిలిన చరణాలు రూపం సంతరించుకుంటాయి. సంగీతసాహిత్య రంగాల్లో ఎంత ఆరితేరినా సినీమా రంగంలో అవేవీ చెల్లుబాటు కావని అక్కడ దర్శక నిర్మాతల ఇష్టాయిష్టాలు ప్రకారమే పనులు జరుగుతాయని ఇలాంటి ఉదంతాలు  చెప్పకచెపుతాయి.

ఘంటసాల మాస్టారు ఈ పాటను హరికాంభోజి రాగం స్వరాలతో చేశారు. కర్ణాటక సంగీతంలో హరికాంభోజి 28వ మేళకర్త. అంటే సంపూర్ణ రాగం. ముత్తుస్వామి దీక్షితార్ సంప్రదాయంలో ఈ రాగాన్ని హరికేదారగౌళగా వ్యవహరిస్తారు. కాంభోజి, మోహన, ఖమాస్, శహన, సురటి రాగాలు హరికాంభోజికి జన్య రాగాలు. హిందుస్థానీ సంగీతంలో హరికాంభోజికి సమాంతరమైనది ఖమాస్ థాట్. వెస్ట్రన్ మ్యూజిక్ లో దీనిని మిక్సోలిడియన్ మోడ్ అంటారు. అతి ప్రాచీనమైన రాగాలలో ఈ హరికాంభోజి ఒకటి. ఈ రాగంలో  ప్రసిద్ధి చెందిన అనేక శాస్త్రీయ సంగీత కృతులు, వివిధ భాషల్లో సూపర్హిట్  సినీమా పాటలు వున్నాయి. ఘంటసాలగారి సంగీతం సరళిని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న పి.సుశీలగారు ఈ పాటను  సందర్భోచిత భావప్రకటనతో మనోజ్ఞంగా ఆలపించారు. తెరమీద వదినా మరదళ్ళుగా సావిత్రి, దేవిక, శోభనం పెళ్ళికొడుకుగా ఎన్.టి.ఆర్. ఔచిత్యమైన  హావభావాలతో ఈ మొదటిరాత్రి సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఘంటసాలగారు ఈ పాటను చాలా ఆహ్లాదకరంగా స్వరపరిచారు. పాట నేపథ్యంలో వినపడే స్పానిష్ గిటార్, సితార్, పియోనా, వయొలిన్స్, హార్ప్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ వంటి వాద్యాల ఎఫెక్ట్స్  ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి మంచి హుషారును కలిగిస్తాయి.

రక్తసంబంధం సినిమాలోని ఎనిమిది పాటలను చేరో రెండేసి పాటలు చొప్పున ఆరుద్ర, సి.నా.రె., అనిశెట్టి, ఒక పాటను దాశరథి, ఒక పాటను కొసరాజు వ్రాయగా ఘంటసాల సంగీత దర్శకత్వంలో వాటిని ఆయనతోపాటు పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి పాడారు.

రక్తసంబంధం సినీమాకు మూలం కె.పి.కొట్టార్కర అనే మలయాళ రచయిత వ్రాసిన కథ ఆధారంగా తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రిలు అన్నాచెల్లెళ్లుగా నటించిన 'పాశమలర్' అనే తమిళ చిత్రం. తమిళ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సిల్వర్ జూబ్లీ సినిమా. ఈ సినిమాలోని అన్నాచెల్లెళ్ల రక్తపాశానికి తమిళ ప్రేక్షకులు ఎంతగా ప్రభావితులైనారంటే ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు శివాజీ, సావిత్రిలు కలిసి నటించినా  ప్రేమికులుగా మరే సినీమాలోనూ నటించలేదని చెప్పుకుంటారు. పాశమలర్ అఖండ విజయం ఈ కథను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, సింహళీ భాషలలో సినీమాలను తీయడానికి ప్రేరేపించింది.

తెలుగులో ఈ కథను రక్తసంబంధం పేరుతో రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా, డూండీలు నిర్మించారు. సుందర్లాల్ గారి ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని  ఒకటి రెండు తప్ప మిగిలిన పాటలన్నీ తమిళ సినిమా పాటల వరసలనే ఉపయోగించుకున్నారు. తమిళ వాసనలేని ఆ ఒక్క పాటే ఘంటసాలగారు స్వరపరిచిన 'ఒహో! వయ్యారి వదినా ఉలుకెందుకే' నేటి మన సజీవరాగం.

వీరమాచినేని మధుసూదనరావుగారి దర్శకత్వంలో నిర్మించబడిన 'రక్తసంబంధం' సినిమాలో అన్నాచెల్లెళ్లుగా జీవించిన ఎన్.టి.ఆర్., సావిత్రితోపాటు కాంతారావు, దేవిక, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, ప్రభాకరరెడ్డి, సూర్యకాంతం, మొదలగువారు ఈ సినిమా ఘన విజయానికి ఎంతో దోహదం చేశారు. ఈ సినిమాలోని  పాటల ట్యూన్సన్నీ చాలావరకు తమిళంవే అయినా, ఘంటసాల గారి హస్తవాసితో తెలుగుదనాన్ని సంతరించుకుని బహుళ జనాదరణ పొందాయి.

అతి చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి వారి సంరక్షణకు, ప్రేమాభిమానాలకు నోచుకోని  తన చెల్లెలికి తానే తల్లితండ్రీ అయి అతి గారాబంగా, ఎన్నో కట్టుబాట్లుతో పెంచి  మితిమీరిన ప్రేమ బంధంతో ఆమెకు ఏవిధమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేసిన ఓ అన్నగారి మూర్ఖత్వం, మధ్యలో వచ్చిన ఆస్తి అంతస్తులు కల్పించిన  అహంకారం, అలాగే సన్నిహితులనుకున్నవారి స్వార్ధబుద్ధి వలన  ఆ అన్నాచెల్లెళ్ల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమై  విషాదాంతంగా ముగిసాయో చూపించే  ఒక ఉదాత్త చిత్రమే 'రక్తసంబంధం'. ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసి,  చలింపజేసే గుండెలను బరువెక్కింది ఏ చిత్రం 'రక్తసంబంధం'.

సుడిగాలులెన్ని వచ్చినా తెగిపోని మధురబంధంకలకాలం హృదయాలను కలిపివుంచే జన్మజన్మల బంధం అదే రక్తసంబంధం.


వచ్చేవారం, ఘంటసాల వారి మదిలో మెదిలే మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 29 August 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 30 - గుండమ్మకథ – కనులు తెరచినా నీవాయే... కనులు మూసినా నీవాయే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 30


గుండమ్మకథ – కనులు తెరచినా నీవాయే... నే కనులు మూసినా నీవాయే


దివాణంలో ఠాంగ్...ఠాంగ్ మని ఆరు గంటలు కొట్టడమేమిటి పక్కనున్న శ్రీరామా టాకీస్  లౌడ్ స్పీకర్ లోంచి  ఘంటసాల 'నమో వెంకటేశా' పాట మొదలయింది. రెండవపాట 'ఏడూ కొండలసామి' పాటను వింటునే ఆ హాలులో ఆడుతున్న 'గుండమ్మకథ' సినీమాలోని పాటల కోసం ముచ్చటగా మూడవసారి బయల్దేరాము నేనూ, రమణగోపాలం.

'రమణా! ఈ సినిమా లో పాటలన్నీ చాలా బాగా చేశాడయ్యా ఘంటసాల. అన్నీ హాయిగా, హుషారుగా వున్నాయి కదూ... ఇందులో జమున పాడిన పాట ఏ రాగంలో చేసివుంటాడంటావు?... నేనైతే భూపాలమో, మలయమారుతమో  అనుకుంటున్నాను' అని అన్నాడు గోపాలం సినిమా హాలు బయటనున్న టీ స్టాల్లో టీ తో పాటు సిగరెట్ కూడా తాగుతూ. 'నీ మొహం  ఆ పాట భూపాలం కాదు, మలయమారుతం అంతకన్నాకాదు ... అది తోడి  లేదా భైరవియో  అయే అవకాశం వుంది' అన్నాడు రమణ వ్రేళ్ళమధ్య కాలుతున్న సిగరెట్ కు మరో సిగరెట్ ముట్టిస్తూ. రమణ , గోపాలం బ్యాంక్ ఉద్యోగులు. సంగీతం గురించి ఏమీ తెలియకపోయినా త్యాగరాజకీర్తనలన్నా, ఘంటసాల పాటలన్నా చాలా ఆసక్తిగా వింటూ వాటిమీద తెలిసీతెలియని చర్చలు చేస్తూంటారు. తమ సంగీతప్రియత్వం గుర్తించి తోటివారు మెచ్చుకుంటూంటే అది వారికి మహదానందం. వాళ్ళ కబుర్లు వినడం నాకొక కాలక్షేపం. వయసులో వాళ్ళు నాకంటే పెద్దే అయినా నేను ఎక్కువగా వాళ్ళతోనే తిరుగుతూండేవాడిని.

వీళ్ళిద్దరి సంగీత చర్చ ఇలా సాగుతుండగా కొంచెం దూరానా తన పిల్లలకేవో కొనిపెడుతూ సకుటుంబ సపరివార సమేతంగా  సంగీతం మాస్టారు కనపడ్డారు.  రమణ వారిస్తున్నా వినకుండా గోపాలం  సంబరంతో  మాస్టారివేపు నడిచి గుండమ్మకథ సినిమాలో జమున పాడిన పాటను పాడి వినిపిస్తూ ఆ పాట రాగం గురించి ఆరాలు తీయడం మొదలెట్టాడు.  మాస్టారు ఆ  సినిమాను అంతకుముందే చూడడంచేత ఒకసారి పాటను మననం చేసుకుని కొంతసేపు ఆలోచించి ఈ పాట సింధుభైరవి రాగంలో చేసినట్లుగా అనిపిస్తోంది' అన్నారు. అందుకు రమణ అడ్డుతగిలి 'అదేమిటండీ, మొన్నామధ్య ఇలాటిదే మరో పాట విషయంలో అది తోడి రాగంలో వుందన్నారు కదా' అని అన్నాడు.

నాయనా! 'పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా' చెప్పు వివరించి చెప్పడానికిది సమయం కాదు, రేపు సాయంత్రం 6.30కి వేణుగోపాలస్వామి కోవెలకు గురుదక్షిణతో సహా రండి ... అక్కడ సావకాశంగా మాట్లాడదాము.' అని  గట్టిగా నవ్వుతూ  తన పిల్లలతో సినిమా హాలులోకి నడిచారు సంగీతం మాస్టారు. 

(ఈ నేపథ్యం సుమారు 65 ఏళ్ళ క్రితం నేను బొబ్బిలి హైస్కూలు లో చదువుతున్న కాలం నాటిది.)

ఎన్నో నియమ నిబంధనలతో, మార్గదర్శకాలతో  కూడిన శాస్త్రీయ సంగీత కృతుల యొక్క రాగాలను గుర్తించడం కన్నా సినిమా పాటలలోని రాగాలను కనిపెట్టడం మరింత కష్టమని సినిమా సంగీత విశ్లేషకుల భావన. శాస్త్రీయ సంగీత రాగ స్వరాల ఆధారంగా కొన్ని సినీమాలలోని పాటలు స్వరపర్చబడినా జనరంజకత్వం కోసం కొంత,  కొంతమంది సంగీతదర్శకులకు సరైన రాగజ్ఞానం లేకపోవడం వలన మరికొంత,  కొన్ని పాటల్లో  అన్యస్వరాలు ప్రయోగించడంతో ఆ యా పాటల రాగ స్వరూపమే మారిపోయి ఇదమిధ్దంగా ఫలానా రాగమని చెప్పడానికి  సినిమా సంగీత విశ్లేషకులు, ఔత్సాహిక సంగీత కళాకారులు చాలా శ్రమపడుతూంటారు.

శాస్త్రీయ సంగీత కృతులలోని రాగాలనుగానీ, లేదా సినిమా పాటలలోని రాగాలనుగానీ గుర్తించడానికి శాస్త్ర సంబంధమైన కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవలసిన ఆవశ్యకత వుందని ఘంటసాల భగవద్గీతలోని శ్లోకాలకు రాగవిశ్లేషణ చేసిన ప్రముఖ సంగీతజ్ఞుడు, ఘంటసాలవారి సంగీత సహాయకుడు  అయిన 'కలైమామణి' శ్రీ పట్రాయని సంగీతరావుగారు ఇలా అభిప్రాయపడ్డారు.

రాగ నిర్ణయం  అనేది అరోహణ, అవరోహణ,  గ్రహ, న్యాస, అంశ స్వరాలమీద ఆధారపడివుంటుంది. గ్రహ, న్యాస, అంశ స్వరాల వివరణ : గ్రహ స్వరం మీద పాట మొదలవుతుంది, న్యాస స్వరం అనేది విరామస్వరం. రాగాలాపన  చేసేటప్పుడు, ఒక స్వరం మీద ఆపి రాగాలాపన చేయడం  జరుగుతుంది. దీనిని న్యాస స్వరం అంటారు. అంశ స్వరం అంటే జీవ స్వరం. అంటే  ఆస్వరాన్ని పాడిన తీరుని బట్టి అదేరాగమో   వెంటనే స్ఫురిస్తుంది.

ఇలాటి మీమాంసలకు, చర్చలకు దోహదం చేసే రాగం 'సింధుభైరవి'. అలాటి సింధుభైరవి రాగ స్వరాలతో గుండమ్మకథ సినిమా కోసం  ఘంటసాలగారు స్వరపర్చిన 'సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే' అనే పాటే నేటి మన ఘంటసాల సజీవస్వరం.

భక్తి,  కరుణ, శోక, విరహ రస భావాలను ప్రకటించడానికి అనువైన రాగం సింధుభైరవి. సింధుభైరవి హిందుస్తానీ రాగం. కర్నాటిక్ సంగీతంలో కూడా అనుకరింపబడుతున్నరాగం. సింధుభైరవి రాగం, భైరవి థాట్ కి చెందినరాగం. భైరవిథాట్ కర్నాటిక్ హనుమతోడికి సమానమైన రాగం. హిందుస్తానీ శుద్ధభైరవి అన్నీ కోమల స్వరాలు కలిగి వుంటుంది. ఈ కోమల స్వరాలనే కర్నాటిక్ సంగీతంలో శుద్ధ స్వరాలంటాము. హిందుస్తానీ సంగీతంలో మిశ్ర భైరవిలో శుద్ధ స్వరాల (కోమల స్వరాల)తో పాటు, అన్ని తీవ్ర స్వరాలుకూడా వినిపిస్తాయి.  అంటే చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతిమధ్యమం, చతుశ్రుతి ధైవతం, కాకలి నిషాదం. కాబట్టి ఈరాగాన్ని భాషాంగరాగంగా పరిగణించచ్చు. సింధుభైరవికి,  మిశ్ర భైరవి కి  చెప్ప బడిన అన్ని లక్షణాలు అన్వయించబడతాయి. మరి ఈ రెండు రాగాలకి తేడా  ఎక్కడొస్తుందంటే, సింధుభైరవికి మధ్యమాన్ని basic noteగా చేసుకుని పాడవలసివుంటుంది.

సింధుభైరవి రాగం పదవ మేళకర్త నాటకప్రియకు జన్యమని భావించేవారు కొందరున్నారు.

ఇక ఈనాటి మన పాట విషయానికొస్తే  అందులో సింధుభైరవి simple shades తో వినిపిస్తోంది.

ఇప్పుడు,   సుశీలగారు అత్యంత శ్రావ్యంగా ఆలపించిన ఆ పాటను మరోసారి  విందామా....


సాకీ...

సన్నగ వీచే చల్లగాలికీ కనులు మూసినా కలలాయే

తెల్లని వెన్నెల పానుపుపై ఆ... కలలో వింతలు కననాయే...


పల్లవి: సన్నగ వీచే చల్లగాలికీ...

 

సాకీ...


అవి తలచిన ఏమో సిగ్గాయే


కనులుతెరచినా నీవాయే నే కనులుమూసినా నీవాయే! కనులు తెరచినా నీవాయె


నిదురించిన నా హృదయము నెవరో

కదిలించిన సడి విననాయే

                                        !నిదురించిన!


కలవరపడి నే కనులు తెరువ నా కంటి పాపలో నీవాయే


సాకీ...

ఎచట చూచినా నీవాయే!కనులు!


మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని 

పిలుపులు విననాయే 

                                            !మేలుకొనిన!


ఉలికిపాటుతో కలయవెదక నా హృదయ ఫలకమున నీవాయే

 

కనులు తెరచినా నీవాయే కనులు మూసినా నీవేనాయే!

 

నిద్రిస్తున్న హృదయాన్ని ఎవరో కదిలిస్తున్నట్లై కలవరపాటుతో కళ్ళుతెరవగా తన కంటిపాపలో ప్రియుడున్నాడట. ఎక్కడ చూసినా అతడే అగుపిస్తున్నాడట; అంతేనా... మేల్కొన్న  మనస్సులో మెల్లని పిలుపులేవో వినిపించడంతో వెదికిచూస్తే ఆ యువతి హృదయఫలకం మీద కూడా అతనే వున్నాడట...

ఎంతటి మధుర భావన.

ప్రేమ పారవశ్యంలో తేలియాడుతున్న ప్రేమికులకు ప్రకృతి అంతా ఎంతో సుందరంగా, చల్లగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పరిసరాలన్ని మరచిపోయి బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా సర్వత్రా తామేగా ఊహల్లో విహరిస్తూంటారు. అటువంటి మనఃస్థితిలో వున్న ఒక ప్రేమిక పాడుతున్న పాట.  అంతరంగంలో సరిగ్గా ఇలాటి మనోభావాలే గల మరొక యువతి కూడా ఈ పాటను తనకు అన్వయించుకుని ఆనందించడం ఒక విశేషం.

సరళమైన చిన్న చిన్నమాటలతో కొండంత భావుకత వుట్టిపడే పాటలు వ్రాయడం పింగళివారికి, ఆ మాటలకు సుతిమెత్తని స్వరాలు జోడించి పిల్లవాయువు ధ్వనిలాంటి శ్రావ్యమైన గీతాలను మలచి మృదుమధురంగా పాడించడం ఘంటసాల మాస్టారికి వెన్నతో పెట్టిన విద్య.

కవితాత్మక దృష్టిగలవాడవడంచేత  పింగళి నాగేంద్రరావుగారు బ్రహ్మచారే అయిన అనురక్తి గల శృంగారగీతాలను సృష్టించడంలో ప్రజ్ఞావంతులయ్యారు. అందుకే విజయావారు పింగళిగారిని తమ ఆస్థానకవిగా నియమించుకుని అసంఖ్యాకమైన అజరామర గీతాలను తమ సినీమాలకోసం వ్రాయించుకున్నారు. అలాటి తీయని శృంగారగీతమే నేటి మన సజీవరాగం. అదే, గుండమ్మకథలోని 'సన్నగవీచే చల్లగాలికి' పాట. 

సింధుభైరవి రాగంలో ఘంటసాలగారు అపురూపంగా  సృష్టించిన  ఈ గీతాన్ని పి.సుశీలగారు కోకిలస్వరంకన్నా మధురంగా ఆలపించి అజరామరం చేశారు.  ఘంటసాలగారిలోని రాగభావాలను, లాలిత్యాన్ని, మాటల సుస్పష్టతను  తన కంఠంలో యథాతథంగా పలికించి ఈ పాటకు శాశ్వతత్త్వాన్ని కలిగించారు శ్రీమతి పి.సుశీల.

హార్ప్, సితార్, ఫ్లూట్, వైబ్రోఫోన్, వయొలిన్స్, తబలాడోలక్, తంబోరిన్ వంటి  తక్కువ వాద్యాలతో అతి సున్నితంగా  ఈ పాట నేపథ్య సంగీతాన్ని సమకూర్చి సన్నగ వీచే చల్లగాలి అనుభూతిని మనలో కలిగించారు ఘంటసాల.  సుశీలగారి అమృతపేయమైన కంఠం, ఫ్లూట్ వైబ్రేషన్స్ (గమకాలు), వినిపించి వినిపించనట్లుండే తబలా, డోలక్, రిథిమ్స్ ఈ పాటను అజరామరం చేశాయి. పల్లవి ముందు, చరణాలముందు సుశీలగారు ఆలపించిన సాకీలు సింధుభైరవి రాగ స్వరూపాన్ని, ఘంటసాలగారి ముద్రను సుస్పష్టం చేశాయి. సాకీల మీద నేపథ్యసంగీతం లేకుండా  పూర్తిగా సుశీలగారి శక్తిసామర్ధ్యాల మీదే పాటను సనసన్నగా వినిపించారు.

ఈ పాటలో ఒక వైవిధ్యం వుంది. ఈ పాట సినిమా లో రెండుసార్లు వస్తుంది. పాట సాహిత్యం, వరస ఒకటే. కానీ చిత్రీకరణలో తన దర్శకత్వ ప్రతిభనంతా కనపర్చారు కమలాకర కామేశ్వరరావు.

మొదటిసారి వచ్చే పాట ఇన్డోర్ లో ఒక టెర్రస్ మీద చల్లని వెన్నెల వాతావరణం లో జమున పాడుతున్నా పాటలోని భావాలకు ఎక్కువగా స్పందించి ఆ అనుభూతిని పొందేది  క్రిందనెక్కడో వున్న సావిత్రి. అప్పుడప్పుడు ఎన్.టి.ఆర్. కూడా కనిపిస్తారు. జమునలోని ఈ శృంగారభావాలకు కారకుడైన ఆమె ప్రియుడు ఎ.ఎన్.ఆర్. అసలు కనపడరు.

సినిమా ఆఖరు భాగంలో వచ్చే రెండవసారి పాటలో ఒక చమత్కారం చేశారు. సన్నగవీచే చల్లగాలి పాటలోని సాకీలను రెండవసారి పాటలో పూర్తిగా తీసివేసి పల్లవికి ముందు వచ్చే సాకీనే పల్లవిగా మార్చి సుశీలగారిచేత పాడించారు. అలాగే పాట లొకేషన్ ను ఇన్డోర్ లో నుండి ఔట్ డోర్ గార్డెన్స్ కు మార్చారు. మొదటిసారి పాట చిత్రీకరణలో కనపడని ఎ.ఎన్.ఆర్  ఈ రెండవపాటలో పూర్తిగా తన హావభావాలతో ప్రేక్షకులను అలరించారు. పాటంతా జమునఎ.ఎన్.ఆర్.లు మాత్రమే కనిపిస్తారు. సావిత్రిఎన్.టి.ఆర్.లకు ఈ రెండవ పాటలో స్థానం కల్పించలేదు. ఈ పాట సినిమాలో రెండుసార్లు వచ్చినా ప్రేక్షకులలో ఎలాటి విసుగు భావన కలగని రీతిలో డైరెక్టర్ గారు ఈ పాటను చాలా హృద్యంగా చిత్రీకరించారు.

'సన్నగ వీచే చల్లగాలికి' పాట ఇంతటి కీర్తి పొందడానికి  కారకులైన పింగళి, ఘంటసాల, పి.సుశీల తో పాటు గుండమ్మకథ సినిమాకు ఛాయాగ్రహకుడైన మార్కస్ బార్ట్లీ, ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే లను కూడా తలచుకోకతప్పదు. ఈ పాట చిత్రీకరణ లో కనిపించే చందమామ, చల్లటి పిల్లవాయువులకు కదిలే లతలు, పూలమొక్కలు , ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కెమేరామెన్, కళాదర్శకుల అపూర్వ సృష్టే.

ఒక మంచి సినీమా రూపొందాలంటే నిర్మాత, దర్శకులకు మంచి అభిరుచి, కళాత్మక దృష్టి, సామాజికస్పృహ వుండాలి.  అలాటి సలక్షణాలన్నీ సక్రమంగా అమరిన వినోదభరిత చిత్రమే విజయావారి 'గుండమ్మకథ'.

ఈ సినిమాలో వున్న ఎనిమిది పాటలూ ఎల్.విజయలక్ష్మి (హిందోళం) డాన్స్ మ్యూజిక్ తో వేటికవే ఆణిముత్యాలుగా అమరి గుండమ్మకథ అనేక కేంద్రాలలో రజతోత్సవాలు జరుపుకుని   తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా  నిలిచిపోయింది.

 

ఎన్.టి.ఆర్ఎ.ఎన్.ఆర్., సావిత్రి, జమున, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతం, రమణారెడ్డి, ఛాయాదేవి, ఎల్.విజయలక్ష్మి, హరనాథ్, మిక్కిలినేని, రాజనాల, హేమలత మొదలగువారు నటించిన ఈ విజయావారి చిత్రం గురించి చెప్పుకోవడానికి ఎంతైనా వుంది. ఆ విశేషాలన్నీ గుండమ్మకథ మరో పాటలో...

 


వచ్చేవారం, ఘంటసాలవారి మదిలో మెదిలే మరో సజీవరాగం తో మరల కలుసుకుందాము.

 

ప్రణవ స్వరాట్

 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 32 - హరియే వెలయునుగా భువిని హరియే వెలయునుగా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...