అధ్యాయం - 2 - భాగం 27
శ్రీకృష్ణకుచేల – పావన తులసీమాతా
1952 లో 'ది న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్' అనే పత్రిక అంతర్జాతీయ కధల పోటీ నిర్వహించింది. 23 దేశాల నుండి వచ్చిన అనేక కథలలో 59 కధలను పోటీకి ఎంపిక చేశారు. అందులో భారతదేశపు కథలు మూడున్నాయి. అందులో తెలుగు కథ ఒకటి. ఆ అంతర్జాతీయ కథల పోటీలో ఆ తెలుగు కథ అనువాదం 'సైక్లోన్' కు ద్వితీయ బహుమతి లభించింది. అకథ అప్పటికే ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో 'గాలివాన' పేరుతో ప్రచురించబడింది. ఈ కథా రచయిత కాకినాడ పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీలో సైన్స్ లెక్చరర్. అంతర్జాతీయ సాహితీ ప్రపంచంలో తెలుగు కథకు విశిష్టస్థానం కల్పించిన ఆ విశిష్ట రచయితను వెతుక్కుంటూ ఒక సుప్రసిద్ధ సినీ దర్శక నిర్మాత కాకినాడ వెళ్లారు. ఆయనే మల్లీశ్వరి దర్శకుడు బి.ఎన్.రెడ్డి. ఆ గాలివాన కథా రచయితేపాలగుమ్మి పద్మరాజు. భావకవి దేవుపల్లి కృష్ణశాస్త్రి గారిని చిత్రసీమకు పరిచయంచేసిన బి.ఎన్.రెడ్డిగారే పద్మరాజుగారిని కూడా కథా రచయితగా తన బంగారు పాప సినీమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. దాదాపు 60 కథలు రాసి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ పొందిన పాలగుమ్మి పద్మరాజుగారు గొప్ప హేతువాది. ప్రముఖ విప్లవవాది, వేదాంతి, హేతువాది అయిన ఎమ్ ఎన్ రాయ్ సిద్ధాంతమును అనుసరించి ప్రచారం చేసినవారు.
పద్మరాజు గారు 1955 మొదలు 1983 వరకు సుమారు పాతిక ముప్పై సినిమాలకు కథ, మాటలు, అతి తక్కువ చిత్రాలకు పాటలు వ్రాశారు. అందులో రెండు పౌరాణికాలు వున్నాయి. ఒకటి భక్త శబరి, మరొకటి, శ్రీకృష్ణ కుచేల. రెండూ స్వార్థరహిత భక్తి తత్త్వాన్ని బోధించేవే.
అవతార పురుషుడైన
శ్రీకృష్ణుడు, కుచేలుడిగా లోకప్రసిద్ధుడైన సుదాముడు బాల్యస్నేహితులు. చిన్నతనంలో కలసి
ఉజ్జయినిలో సాందీపముని వద్ద విద్యను అభ్యసించారు. ధనిక వర్గానికి కృష్ణుడు, నిరుపేద వర్గానికి కుచేలుడు
ప్రతీకలు. అష్టైశ్వర్యాలతో, సకల భోగభాగ్యాలతో, ద్వారకాధీశుడిగా తులతూగే కృష్ణుడికి, ఏ పూటకు ఆ పూటే దినం గడవని పరిస్థితిలో వుండే
కుచేలుడికి మధ్య అంతస్థుల అంతరం ఎంతో వున్నది. బాల్యస్నేహాన్ని సాకుగా
తీసుకుని కృష్ణుని యాచించి సహాయం పొందడానికి కుచేలుడి వ్యక్తిత్వం సుతారము
అంగీకరించలేదు. అందుకే ఎంత కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా తన కష్టాలను తీర్చే
భారాన్ని దైవానికే అప్పగించి దైవచింతనలో కాలంగడిపినవాడు కుచేలుడు. అతనికి తగ్గ
ఇల్లాలు సుశీల. మహా పతివ్రత. భర్త అడుగుజాడలలోనే నడుస్తూ అంతటి కష్టాలలోనూ భర్తకు చేదోడువాదోడుగా వుంటూ
సంసారాన్ని గడుపుకువచ్చేది. కుచేలుడివలెనే ఆయన భార్య సుశీల కూడా దైవదైవచింతనలో
వుంటూ ఏనాటికైనా తమ కష్టాలు తీర్చే భారం
మహాలక్ష్మీ స్వరూపమైన తులసి దేవత పైనే వుంచి ... 'పావన తులసీమాతా - మా పాలిటి కల్పలతా...' అంటూ భక్తిశ్రధ్ధలతో
పూజించేది.
పావన తులసీ మాతా - మా పాలిటి
కల్పలతా
హరిగళమాలా కరుణాలవాల
సిరిగల జవరాలా సేవాలోలా
తిరముగ మాయింటి దీపము నీవై
నిరతము వెల్గుము నీరాజన
మిదిగో! పావన !
మగువల మనసుల మాధుర్య మీవే
మంగళధాత్రివి దేవీ నీవే
జగముల జనయిత్రి నీకిదే హారతి
అగపడు దైవము నీవేనని వేడితి
! పావన!
సనాతన ఆచారవ్యవహారాలను పాటించే హిందువులు తులసి మాతను శ్రీమహాలక్ష్మి మరురూపంగా భావించి పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన తులసి మొక్క ప్రతీ గృహంలో వుండడం వల్ల ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సత్చింతనలతో కూడిన అనుకూలవాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. దైవికశక్తిగా భావించే తులసి సకల పాపహరిణి. ఎన్నో ఔషధ గుణాలు ఇమిడివున్నాయి. నిత్యము తులసికోటలో దీపము వెలిగించి భక్తితో పూజించిన సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీకమాస శుద్ధ ద్వాదశి నాడు విష్ణుప్రియగా కొలవబడే తులసిమాతకు, మహావిష్ణువు అవతారమైన కృష్ణునికి వివాహోత్సవం జరుపుతారు.
అనునిత్యమూ ప్రాతఃకాలసమయాన
గృహిణులు తులసికోట వద్ద బృందావని, వృంద, విశ్వపూజిత,
పుష్పసార, నందిని, కృష్ణజీవని, విశ్వపావని, తులసి అనే నామావళితో తులసి మాతను పూజించేఆచారం నేటికీ వున్నది.
ఔను. ఇది సినిమాలో వచ్చిన భక్తిగీతమే. 1961లో వచ్చిన 'శ్రీకృష్ణ కుచేల' సినీమాకోసం విశిష్ట రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు వ్రాసిన పాట. ఇదే నేటి మన ఘంటసాలగారి సజీవరాగం.
భగవంతుని ఉనికిని ప్రశ్నించే హేతువాదులు, విప్లవ రచయితలు ఇలాటి భక్తి గీతాలు వ్రాయడం విశేషమే. ఇక్కడే, వృత్తి ధర్మం వేరు, వ్యక్తిగత సిధ్ధాంతం వేరు అనే భావనకు రావలసివస్తుంది. ఘంటసాలగారి సంగీతం, సి.ఎస్యఆర్., కన్నాంబల సహజసిద్ధమైన హావభావాలే శ్రీకృష్ణకుచేల సినిమాకు జీవం.
ఘంటసాలగారు ఈ మంగళహారతి గీతాన్ని తోడి రాగ స్వరాలతో వరస కట్టారు. కర్ణాటక సంగీతంలో హనుమత్తోడి 8వ మేళకర్త. దీని జన్య రాగం తోడి. ఎంతో ప్రాచీనమైన ఈ రాగం గంభీరత్వము, గాఢత్వం కలిగివుంటుంది. భక్తి, కరుణరసప్రధాన రాగం. తోడి రాగంలోని క్లిష్టతరమైన గమకాలు గాయకులకు ఎప్పుడూ పెనుసవాలే. హిందుస్థానీ సంగీతంలో కూడా ఒక తోడి వుంది. రెండింటికి స్వరాలు ఒకటే అయినా పాడే విధానంలో చాలా తేడా వుంది. కర్ణాటక తోడికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవి థాట్. అలాగే, హిందుస్థానీ తోడికి సమానమైన కర్ణాటక రాగాన్ని శుభపంతువరాళి అని అంటారు. అటువంటి ప్రాచీనమైన, సంప్రదాయసిద్ధ తోడి రాగంలో ఘంటసాల ఈ పావన తులసీ మాతా గీతాన్ని అద్భుతంగా మలిచారు. కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలైన పి.లీల ఈ పాట పాడించి సన్నివేశానికి రసస్ఫూర్తి కలిగించారు ఘంటసాల.
సశాస్త్రీయమైన రీతిలో వాద్య సహకారాన్ని అందించిన -- వీణ, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, కంజిరా, తాళాలు, తంబరిన్ వాద్య కళాకారులు ఈ భక్తిగీతం సజీవమై నిలవడానికి ఎంతగానో దోహదపడ్డారు. నేపథ్యంలో పి లీల పాడిన ఈ గీతాన్ని తెరమీద కుచేలుడి భార్య సుశీలగా నటించిన కన్నాంబ పై చిత్రీకరించారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా భక్తి ఉట్టిపడేలా చాలా సహజంగా నటించారు కన్నంబ.
శ్రీ కృష్ణకుచేల
సినిమాలో ఉన్న మొత్తం 17 పాటలు పద్యాలను
ఘంటసాల, పి లీల, రఘురామయ్య, కోమల, వైదేహి లు గానం చేశారు. వీటన్నింటిని పాలగుమ్మి పద్మరాజుగారే వ్రాశారు.
తెలుగు టాకీ తొలిదశ దర్శక
నిర్మాతలలో ప్రముఖులు చిత్రపు నారాయణమూర్తిగారు, కడారు నాగభూషణంగారు. పౌరాణిక
సినీమాల మహత్తును తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయంచేసినది వీరే. కడారు
నాగభూషణం గారి సతీమణి పసుపులేటి కన్నాంబ.
ఆనాటి
సుప్రసిద్ధ కథానాయకి, నేపధ్యగాయని. తన పాత్రల పాటలు తానే పాడుకునేవారు. చాలా మంచి గాయని. ఎంతటి సుదీర్ఘమైన సంభాషణలైనా ధారాప్రవాహంగా, సుస్పష్టంగా ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ సహాయం లేకుండా కంచు కంఠంతో అనర్గళంగా చెప్పగల నటీమణి. ఆవిడ పక్కన నిలబడి దీటుగా డైలాగులు చెప్పడానికి ఆనాటి ప్రముఖ తమిళ తెలుగు నటీనటులంతా జంకేవారు. అలాటి మరో ఉద్దండ నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులుగారు, క్లుప్తంగా, సి.ఎస్.ఆర్. అనాటి ప్రముఖ రంగస్థల, సినీ నటుడు మాత్రమే కాదు- గాయకుడు కూడా. తనపాటలు, పద్యాలు తానే పాడుకునేవారు. మాయాబజార్ శకునిగా మాత్రమే మనము గుర్తించిన సి.ఎస్.ఆర్. తెరమీది మొట్టమొదటి వేంకటేశ్వరస్వామి పాత్రధారి.
ఈ శ్రీకృష్ణకుచేల సినిమాలో 'నిలుపన్ జాలను నెమ్మనమ్ము...' అనే పద్యాన్ని ముందు సి.ఎస్.ఆర్.గారిచేతే పాడించి రికార్డు చేశారు ఘంటసాల. కానీ సి.ఎస్.ఆర్. గారికి తాను పాడినది సంతృప్తినివ్వక, ఘంటసాలగారినే మరల పాడమని కోరడంతో ఘంటసాలగారు పాడి సి.ఎస్.ఆర్,గారి మీద చిత్రీకరించడం జరిగింది.
ఈ సినిమాలో ఒకచోట పాండవుల రాజసూయ యాగ ఘట్టం కూడా పెట్టారు. అందులోని విశేషమేమంటే ఆ సన్నివేశంలో నటించినవారంతా ఆనాటి పౌరాణిక నాటక నటులే. కృష్ణుడిగా రఘురామయ్య, ధర్మరాజుగా అద్దంకి శ్రీరామమూర్తి ఇత్యాదులు నటించారు. అంతేకాదు ఆ సందర్భంలో వచ్చే పద్యాలను ఆయా నటులే స్వరకల్పన చేసుకుని పాడగా ఘంటసాలగారి ఆధ్వర్యంలో రికార్డింగ్ చేయడం జరిగింది.
అలాటి లబ్దప్రతిష్టులైన సి.ఎస్.ఆర్., కన్నాంబ, కళ్యాణం రఘురామయ్య, చిత్రపు నారాయణమూర్తి, ఘంటసాల, పాలగుమ్మి పద్మరాజుల సమ్మేళనంలో తయారైన ఉదాత్త భక్తిచిత్రం శ్రీకృష్ణకుచేల. ఇది చిత్రపు నారాయణమూర్తి గారి స్వంతచిత్రం. ఉదాత్తమైన కథాంశం గల అనేక సినీమాల లాగే, ఈ శ్రీకృష్ణకుచేల కూడా మన తెలుగు ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. మంచి సినీమా అనే పత్రికా ప్రశంసలు మాత్రమే లభించాయి.
కొసమెరుపు....
ఈ శ్రీకృష్ణకుచేల సినీమా
తెలుగులో వచ్చినకాలంలోనే పొరుగునెక్కడో వున్నమలయాళం వారు మన సి.ఎస్.ఆర్.గారితో నిర్మించిన 'భక్త కుచేల' అనే సినిమా ఈనాడు యూట్యూబ్ లో ప్రేక్షక వీక్షణకు అందుబాటులో వుంది. కానీ ఉత్తమ
విలువలతో నిండిన మన తెలుగు శ్రీకృష్ణకుచేల సినిమా మాత్రం దూర్భిణీ వేసి వెతికినా కనపడదు. ఎక్కడుంది లోపం??
వచ్చే వారం, సదా మదిలో మెదిలే
ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్
