Saturday, 18 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 24 - సరియా మాతో సమరాన నిలువగలడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 24

దీపావళి - సరియా మాతో సమరాన నిలువగలడా

సనాతన ధర్మాన్ని గౌరవించే భారతీయులందరికీ దీపావళి అత్యంత ప్రధానమైన, విశిష్టత కలిగిన పర్వదినం. మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వెలుగు-చీకటి మధ్య సమన్వయపర్చే ప్రయత్నమే దీపావళి పండగ. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగి చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇళ్ల ముంగిళ్ళలో దీపాలను  వెలిగించి పండగ జరుపుకుంటారు. అంతర్ముఖంగా అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగులను ప్రసరింపజేయడమే దీపావళి పరమార్థం.

ఈ దీపావళి పండగ వెనుక రెండు అతి ముఖ్యమైన పురాణ యితిహాసాలు వున్నాయి.  ఒకటి రామాయణం; మరొకటి భాగవతము. శ్రీరాముడు రావణాసురుని వధించి సీతాదేవితో అయోధ్యకు వచ్చిన రోజున,  లోక కంటకుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధంలో వధించిన రోజున ఈ దీపావళి పండగను జరుపుకుంటారు.

అసమాన వరప్రసాద బలంతో ముల్లోకాధిపత్యం సంపాదించి మితిమీరిన కండకావరంతో అసురుడిగా మారిన నరకుని హింసలనుండి    సాధు సజ్జనులను కాపాడమని  వచ్చిన మునులకు, భక్తులకు నరకుని రణరంగంలో సంహరిస్తానని అభయమిస్తాడు శ్రీకృష్ణుడు. అంతఃపురంలో వున్న సత్యభామ ఈ వార్తను విని యదుమౌళి ప్రియ సతిగా, తాను గీచిన గీటు దాటి చరించని (అమాయకపు భ్రమ)  తన పతికి తోడుగా రణరంగాన నరకునితో పోరాడి విజయం కట్టబెట్టి   తీరుతానని ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది సత్యభామ. ఆ సమరోత్సాహంలో విల్లంబులు అందుకుని నరకుడు తమతో సరిసాటిగా సమరాన నిలువగలడా అంటూ ఒక పాట రూపంలో తన సుకుమార రూపలావణ్యాలను, వీర శౌర్య ప్రతాపాలను ప్రదర్శిస్తుంది ...


సరియా మాతో సమరాన నిలువగలడా 

                                                        !సరియా !

 పెదవుల వలపు సింగార మొలక

 కన్ను కొనల  కోపానల మెలయ

యదుపతి మురియ

నరకుడూ వెరవ చలము, బలము చూపేగా 

                                                        !సరియా!

దురమునా ప్రబల దానవకోటీ 

పరువుమాపి యిల గూల్చిన మేటి !దురమునా!

నరహరీ యెదుర నరకునీ తరమ

దురుసు పలుకులాడేనా

                                                        !సరియా!

కన్నెలు మదిని సమ్మోదపడగా దనుజ

లోకము కంపిలిపోవా !కన్నెలు!

ధనువుగొనీ మనోహరునీ 

సరసన నిలచి నరకునీ గెలిచి

బిరుదు గొనక మానేనా 


                                                        !సరియా!

సమరాన నిలువ,

సమరాన నిలువ,

సమరాన నిలువగలడా 


సత్యభామ నైజాన్ని బాగా గుర్తెరిగిన కృష్ణుడు ఆమె నిర్ణయాన్ని నిరుత్సాహపరుస్తాడు. రణరంగమంటే కోకిలాలాప కుసుమపరాగ వనవిహారం కాదని భీకరధ్వనులతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో భయానకంగా వుంటుందని అది సత్యభామ వంటి కుసుమకోమలులకు తగిన స్థలం కాదని హితవు పలుకుతాడు. కానీ సత్యభామ తన మంకుతనాన్ని మరింత పెంచి నరకునితో యుధ్ధం చేసే తీరుతానని భీష్మించుకుని కృష్ణుడితో రణభూమికి తరలి వెడుతుంది. ఈ సందర్భం కోసమే కృష్ణుడు ఎదురుచూస్తున్నాడు. నరకాసురవధలో సత్యభామే ప్రధాన పాత్రధారియని జగన్నాటక సూత్రధారి యైన కృష్ణుడికి మాత్రమే తెలుసు. నరకాసురుడు తన మరణం  తల్లి ద్వారా మాత్రమే సంభవించేలా వరం పొందాడు. భూదేవి, వరాహస్వామి (విష్ణువు) కి జన్మించి అసురుడుగా మారినవాడే నరకుడు. దుర్మార్గుడైన నరకుని సంహరించడానికి అవతరించిన భూదేవియే సత్యభామ. నరకాసురవధతో ముల్లోకాలకు పట్టిన పీడ తొలగిపోయింది. ప్రజలంతా మహదానందంతో దీపాలను వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ వృత్తాంతమే  'దీపావళి' సినిమా గా 1960 లో మన ముందుకు వచ్చింది.

అందులో సత్యభామ ఆలపించిన ' సరియా మాతో సమరాన నిలువగలడా....' అనే గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం.

పౌరాణిక చిత్రాలకు కథ, మాటలు, పాటలు వ్రాయడంలో నిష్ణాతుడైన తెలుగు టాకీ తొలితరం సినిమా కవి సముద్రాల  రాఘవాచార్యులు. సీనియర్ సముద్రాలగా లబ్దప్రతిష్టులు. తెలుగు సినిమాలలో తొలి రోజులనాటి గ్రాంధిక పరిభాషకు స్వస్తి చెప్పి, తెలుగు భాషలోని సాహిత్యపు విలువలు విడనాడకుండా  వ్యవహారిక భాషలో మాటలు, పాటలు వ్రాయడం మొదలెట్టిన తొలి  కవి సముద్రాల సీనియర్.

దీపావళి సినిమా లోని మొత్తం 22 పాటలు, పద్యాలను  సముద్రాలగారే జనరంజకంగా వ్రాశారు. 'సరియా మాతో సమరాన నిలువగలడా' పాటను వీర శృంగార రసాలను సమపాళ్లలో మేళవించి తన కవితా పటిమను చాటిచెప్పారు సముద్రాల.   ఈ పాటలో వినపడే... 'ఎలయ', 'మురియ', 'వెరవ', 'చలము', 'సమ్మోదము',  'దురము', 'దురుసు', 'కంపిలి' వంటి సినీమాలలో అరుదైన పదాలు సముద్రాల వారి పాండిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.

దీపావళి చిత్రం ఆద్యంతం వైవిధ్యభరితమైన సంగీతాన్ని వినిపించిన ఘంటసాలవారు 'సరియా మాతో'...' అన్నట్లుగా  స్వరకల్పనలో తనకు తానే సాటిగా ఈ పాటను  మాల్కౌన్స్ రాగ స్వరాలతో అద్భుతంగా స్వరపర్చారు. హిందుస్థానీ మాల్కౌన్స్ రాగానికి సమాంతరమైన కర్ణాటక సంగీత రాగం హిందోళం. మాల్కౌన్స్ భైరవి థాట్ కు చెందిన ఔడవరాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణాక్రమంలో 'స గ మ ద ని' అనే ఐదు స్వరాలు మాత్రమే వినిపిస్తాయి. 'రి, ప' స్వరాలు ఈ రాగానికి వుండవు.

అతి ప్రాచీనము, సుప్రసిద్ధము అయిన ఈ మాల్కౌన్స్ రాగంలో  సుప్రసిద్ధ సంగీత విద్వాంసుల గీతాలే కాక వందలాది  సినిమా పాటలు కూడా వివిధభాషలలో రూపొంది ఆపాతమధురాలుగా నిలిచిపోయాయి.

'సరియా మాతో....' పాటలోని సంగతులు, గమకాలు, భావాలు గాయకులందరికీ పెను సవాలు. శృంగార, వీర రసానుభూతులనులను  ఒకే సమయంలో అతి సమర్ధవంతంగా గాయని గళంలోనుండి పలికింపజేయడంలో ఘంటసాల తన విద్వత్ ను ప్రదర్శించారు. తనకు సాటిగా ఈ పాటను మరెవ్వరూ పాడలేరన్న రీతిలో పాడి అటు సంగీతదర్శకుడు ఘంటసాలను, ఇటు శ్రోతలను మెప్పించిన కోమల గాయని  కోమల. సెమి క్లాసికల్ సాంగ్ అనగానే ఘంటసాలగారి మొదటి ఛాయిస్ ఆలిండియా రేడియో నిలయ విద్వాంసురాలు  ఆర్కాట్ పార్ధసారధి కోమలగారే. దీపావళి సినిమాలో హీరోయిన్ పాటలు పద్యాలన్నింటినీ ఎ.. కోమలే అద్వితీయంగా పాడారు.

ఘంటసాలగారు ఈ పాటకోసం వయొలిన్స్, వీణ, సితార్, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, డబుల్ బేస్, తబలా, పక్వాజ్, డోలక్, మువ్వలు వంటి వాద్యాలను దురిత గమనప్రధానంగా ఉపయోగించి పాటను రక్తి కట్టించారు. ఈ చిత్రంలోని ఇతర గీతాలను ఘంటసాల, మాధవపెద్ది, ఎస్.వరలక్ష్మి,  జె.వి.రాఘవులు, జమునారాణి ఆపించారు.

సత్యభామ అనగానే తెలుగు కళాప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది స్థానం నరసింహారావువేదాంతం సత్యనారాయణ శర్మ, ఎస్.వరలక్ష్మి, జమున, సావిత్రి గార్లే.  నవరసాలను అత్యద్భుతంగా పోషించగల నవరస కథానాయకి సావిత్రి మాత్రమే. దీపావళి సినిమాలో సత్యభామగా సావిత్రి ఈ పాటలో అసమానంగా నటించారు.

దీపావళి సినిమాలో ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వీ.రంగారావురమణారెడ్డి, కాంతారావు, గుమ్మడి, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, వంటి హేమాహేమీ నటులు పోటాపోటీగా నటించి దీపావళి సినిమా దిగ్విజయానికి దోహదం చేశారు.

పూర్తిస్థాయి శ్రీకృష్ణుడిగా ఎన్.టి.రామారావుకు మూడవ చిత్రం దీపావళి. మాయా కృష్ణునిగా నరకాసురుడు గోపికలను అల్లరిపెట్టే సన్నివేశంలో ఎస్.వి.రంగారావు మేనరిజమ్స్ ను  ఎన్.టి.ఆర్. బహు చక్కగా అభినయించి మంచి వినోదం కలిగించారు.  

మ్యూజికల్ హిట్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల అమోదాన్ని పొందిన దీపావళి  సినిమా అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు  జరుపుకుంది. ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయబడింది.

చాలా తక్కువ సినీమాలకు మాత్రమే దర్శకుడిగా పనిచేసిన సబ్నవిస్ రజనీకాంత్ డైరక్ట్ చేసిన దీపావళి సినీమాను, వినాయకచవితి సినీమాను  తీసిన కె.గోపాలరావు గారే అశ్వరాజ్  ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు.

కొసమెరుపు: 

ఈనాడు మనకు ఆందుబాటులో వున్న దీపావళి సినిమా వీడియో టైటిల్స్ విషయంలో  ఏదో తారుమారు  జరిగింది. అవి ఒరిజినల్ టైటిల్స్ కావు.  మొదట్లోని కొన్ని  పేర్లు  మళ్ళా ప్రింట్ చేసి అతికించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. టైటిల్ మ్యూజిక్ లో కూడా జర్క్ కనిపిస్తుంది. ఆ గడబిడలో సంగీతదర్శకుడిగా  ఘంటసాలగారి పేరు మాయమైపోయింది. ఈ పొరపాట్లను గమనించని  టివి ఛానల్స్ సంగీతం సంగీతరావు అని  కూడా ప్రకటించడం జరిగింది. ఈ పొరపాటు ఏనాటికైనా  సవరించబడేనా!!


వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 11 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 23 - తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 23

అభిమానం - తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా

భారతీయ సనాతన ధర్మంలో తల్లి స్థానం చాలా  పవిత్రమైనది, మరియు, అద్వితీయమైనది. తల్లి తన సంతానానికి ప్రప్రథమ గురువు కూడా. పసిపిల్లల ఆటాపాటా, నడవడిక, నైతికవిలువలు, సంస్కారం మొదలైనవాటిని అమ్మ ఒడిలోనే  ఆరంభమవుతాయి. తన సంతానం  భవిష్యత్  కోసం నిస్స్వార్ధంగా తన సకలసుఖాలను త్యాగం చేసే ఏకైక వ్యక్తి  తల్లి మాత్రమే. అందుకే  'తైత్తిరీయ ఉపనిషత్తు' లో 'మాతృదేవోభవ పితృదేవోభవ' అని అన్నారు. అంటే జన్మనిచ్చిన  తల్లితండ్రులను దైవంతో సమానంగా భావించి పూజించాలి  అని అర్ధం.

మనము  తల్లిదండ్రులను ఎంత భక్తితో పూజించి ఆరాధిస్తామో  అంత గాఢముగా ప్రకృతి  శక్తులను కూడా  భక్తితో  కొలుస్తాము. ప్రకృతి శక్తులు మన సుఖ జీవనానికి  ఎంతగానో  దోహదపడుతున్నాయి.  దాహాన్ని తీర్చే జలాన్ని  గంగామాతగా,  ఆకలి తీర్చే పంట ధాన్యాలను సమకూర్చే భూమిని భూమాతగా, పాడిపంటలతో మనలను  కాపాడుతున్న పశువులను గోమాతగానూ  భావించి భక్తితో పూజిస్తున్నాము. ఇది అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి.

ఈ ఆధునికయుగంలో విదేశీ నాగరికతా వ్యామోహంతో  సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు మనం దూరంగా జరిగిపోకుండా అప్పుడప్పుడు మన పాత సినీమాలు, అందులోని పాటలు మనకు కర్తవ్యబోధ చేస్తూ సామాజికస్పృహను కలిగిస్తూవచ్చాయి.

శ్రీశ్రీ వంటి గొప్ప విప్లవకవి కూడా మన సనాతన ధర్మాలను గౌరవిస్తూ ఎన్నో మంచి పాటలను  వ్రాశారు.  అమృతతుల్యమైన ఘంటసాలవారి సుస్వరాలను అద్దుకుని శ్రోతలకెంతో  ఆహ్లాదాన్ని కలిగించిన 'తల్లిని మించి ధారుణి వేరే దైవము లేదుగా...' అనే గీతం ఆ కోవలోకే వస్తుంది.

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ఒక మంచి అమ్మాయి తెల్లవారుజాముననే లేచి  ప్రత్యక్ష దైవమైన తన తల్లిని తలచుకుంటూ ఓ చక్కటి గీతాన్ని అలపిస్తూ తన నిత్యకృత్యాలను ఉత్సాహంగా ఆరంభించింది. ఆ ప్రభాతగీతంలో తల్లితో సమానమైన గోమాత, భూమాత,  తులసిమాతల ఔన్నత్యాన్ని కూడా వర్ణిస్తున్నది. 

తేనెలొలుకు తేట తెలుగు పదాలతో తీయతీయగా  రూపొందిన  శ్రీశ్రీ గారి ఈ మధురగీతమే  నేటి  మన ఘంటసాల సజీవరాగం.

1960 లో వచ్చిన 'అభిమానం' సినిమా లోని ఈ హృద్యమైన గీతాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు రచించగా ఘంటసాల స్వరపర్చి శ్రీమతి జిక్కిగారిచేత అద్భుతంగా పాడించారు. చిత్రకథనం ప్రకారం ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఇంటి ఆడపడుచు, రెండవ కధానాయికయైన  కృష్ణకుమారి ఈ పాటను ముగ్ధమనోహరంగా అభినయించి 'అభిమానం' సినిమాకు శుభారంభం చేశారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను గోరఖ్ కళ్యాణ్ రాగ స్వరాలతో చేసినట్లు అనిపిస్తోంది. గోరఖ్ కళ్యాణ్ ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రాగం. ఖమాస్ థాట్ కు చెందిన ఔడవ రాగం. ఇందులో ఐదు స్వరాలు మాత్రమే వినిపిస్తాయి. గాంధార, పంచమ స్వరాలు రెండూ ఈ రాగంలో వుండవు. మృదువైన భావనలను వెలిబుచ్చడానికి అనువైనరాగం. ఈ రాగం పేరులో కళ్యాణ్ ఉన్నా కళ్యాణి రాగ లక్షణాలేవీ ఈ రాగానికి లేవనే తెలుస్తున్నది. మాస్టారు ఈ పాటకోసం సితార్, మేండొలిన్, ఫ్లూట్, క్లారినెట్,  వయొలిన్స్, డబుల్ బేస్, పియోనా, తబలా, డోలక్, కబాష్ వంటి వాద్యాలను ఉపయోగించారు. పి.జి.కృష్ణవేణి (జిక్కి) ఈ పాటను తనదైన బాణీలో చక్కగా పాడారు.  ఒకానొక కాలంలో జిక్కి, లీల, సుశీల మధ్య గట్టి పోటీయే వుండేది.

ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన అభిమానం సినిమాలో ఈ పాటే కాకుండా మరో తొమ్మిది మంచి పాటలు,  రెండు పద్యాలు వున్నాయి. డైరెక్టర్ సి.ఎస్.రావుకు పద్యాలంటే మోజు, అభిమానం. సాంఘిక సినిమాలలో ఎక్కువగా పద్యాలను ఉపయోగించిన దర్శకుడు సి.ఎస్.రావు. ఈ సినిమాలోని పాటలను జూనియర్ సముద్రాల, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజుగార్లు వ్రాయగా వాటిని ఘంటసాలపి.సుశీల, జిక్కి, ఎ.పి.కోమల, ఎస్.వరలక్ష్మి,  మాధవపెద్ది, జె.వి.రాఘవులు పాడారు.

అభిమానం సినిమా కూడా సుందర్ లాల్ నహతాగారిదైనా హిందీ/తమిళ గీతాలకు ఎక్కువ చోటివ్వలేదు. 'ఓహో బస్తీ దొరసానీ' (హిందీ వరస) పాట తప్ప మిగిలిన పాటలన్నింటిలో ఘంటసాల ముద్రే కనపడుతుంది.

'అభిమానం' ఒక కుటుంబ గాధా చిత్రం. పేదరికమే నేపథేయంగా గల ఒక యువకుడు అందముఆస్తి ఐశ్వర్యము గల ఓ గొప్పింటి అమ్మాయి పరస్పరం ప్రేమించి పెళ్ళిచేసుకున్నా పేదా గొప్ప ఆంతర్యాలవల్ల  భార్యాభర్తల మధ్యా, అత్తా, ఆడపడుచు, కోడళ్ళ మధ్య అనుక్షణం ఏర్పడే భేదాభిప్రాయాల చిచ్చుతో ఆ కుటుంబం ఎలా ఛిన్నాభిన్నమవుతుందో, ఎవరికి వారే ఎంత మంచివాళ్ళైనా ఎన్ని కష్టాలు, నష్టాలు కలుగుతాయో ఈ సినిమా చూపిస్తుంది.

అక్కినేని, సావిత్రి, కన్నాంబ, కృష్ణకుమారి, చలం, కె.వి.ఎస్.శర్మ, రేలంగి, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, అల్లు రామలింగయ్య, తదితరులు నటించిన 'అభిమానం' సినిమా ను శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుందర్ లాల్ నహతా, టి.అశ్వత్థనారాయణ నిర్మించారు.

 

కొసమెరుపు:-

మా నాన్నగారు పట్రాయని సంగీతరావుగారు ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో 1952 నుండీ పనిచేస్తున్నా 1955ల నుండి సంగీత సహాయకుడిగా వున్నా మొట్టమొదటి సారిగా  టైటిల్స్ లో సంగీతరావుగారి పేరును మాత్రం వేసిన సినీమా  'అభిమానం'.

అయితే ఆయన ఏనాడు టైటిల్స్ లో తన పేరు రావడంపట్ల ఎటువంటి ఆసక్తి కనపర్చలేదు. సినిమా రంగంలో తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించిన వ్యక్తి సంగీతరావుగారు.


వచ్చే వారం మరల, ఘంటసాలవారి మరో సజీవరాగం తో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

Saturday, 4 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 22 - రాగాలా సరాగాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 22

శాంతినివాసం - రాగాలా సరాగాలా

నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలకు భారతీయ సనాతనధర్మం ఆదర్శప్రాయంమార్గదర్శి. ప్రాచీన సంస్కృత నీతి శాస్త్ర గ్రంధాలలో ఆదర్శ గృహిణి యొక్క ఆరు  లక్షణాలను, ధర్మాలను ఇలా ఈ శ్లోక రూపంలో బోధించారు:

 

"కార్యేషు దాసి కరణేషు మంత్రీ

భోజ్యేషు మాతా శయనేషు రంభా

రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ

షట్ ధర్మయుక్తా కులధర్మపత్నీ"

అంటే ... ఒక ఆదర్శనీయమైన గృహిణి - 

తన దైనందిక ఇంటిపనులను నడుమువంచి పనిమనిషిలా శ్రధ్ధగా చేస్తుంది.  

. భర్త కార్యకలాపాలలో సమస్యలెదురైతే  తన తెలివితేటలు ఉపయోగించి ఒక మంత్రిలా చక్కటి సలహాలు, సన్మార్గాలు సూచిస్తుంది.

. భోజన సమయంలో కుటుంబంలోని వారందరికీ ప్రేమానురాగాలతో ఒక మాతృమూర్తిగా కడుపునిండా తినిపిస్తుంది.

. విశ్రాంతి సమయంలో పడకగదిలో అప్సరసలా అలంకరించుకుని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మహాలక్ష్మీ దేవిలా నిరంతరం కళకళలాడుతూ  అందాలరాశిలా వుంటుంది.

సహనానికి మారుపేరైన భూదేవి యంత సహనాన్ని, ఓర్మిని కలిగివుంటుంది.

ఈ ప్రాచీన సంస్కృత శ్లోకాన్ని తులసీదాసు తన రామాయణ కావ్యం అరణ్యకాండలో  అత్రిమహర్షి సతీమణి అనసూయాదేవి సీతాదేవికి ధర్మపత్ని లక్షణాలను ఉపదేశించే  సందర్భంలో ఉపయోగించుకున్నారని చెపుతారు.

అలాగే, సనాతన నీతిశాస్త్రంలో ఉత్తమ భర్త యొక్క ధర్మాలు, కర్తవ్యాలు, బాధ్యతల వివరణ కూడా ఉంది - 

. భర్త భార్యను తనలో సగభాగంగా ఆమె అవసరాలన్నీ తీరుస్తూ, జీవితాంతం ఆమె పోషణ, రక్షణ బాధ్యతలను వహించాలి

. భార్యను ఎట్టి పరిస్థితులలోనూ శారీరకంగా, మానసికంగా హింసించకూడదు.

. భార్య సముచిత సలహాలను, సూచనలను పాటిస్తూ ఆమె ఆలోచనలను గౌరవించాలి.

. భార్యాభర్తలిద్దరూ ఒకరిపట్ల మరొకరు  పరస్పర నమ్మిక కలిగి అనురాగంతో జీవితాన్ని సాగించాలి.

. భర్త పరకాంతా వ్యామోహంలో పడకుండా శ్రీరాముడివలే ఒక్క భామతోనే తన ప్రేమను పంచుకోవాలి.

పతినే  ప్రత్యక్ష దైవంగాభర్త పాదసేవే మహాయోగంగా భావించే స్త్రీలుభార్య సౌభాగ్యాలన్నీ తన భాగ్యమేనని ధర్మనిరతితో ఆమె యెడల ప్రేమానురాగాలు కలిగివుండి సంసారజీవితాన్ని సుఖమయంగా భూలోకస్వర్గముగా  చేసుకునే భర్తలు పురాణకాలంలోనే కాదు ఈ ఆధునిక యుగంలో కూడా వున్నారు.

నిదర్శనం కావాలా!

1960ల నాటి   ఈ సినిమా పాటే...


భార్య: 

'రాగాలా సరాగాలా 

హాసాలా విలాసాలా 

సాగే సంసారం హాయ్

సుఖ జీవనసారం 

                                !రాగాలా!

 

పతి పదసేవయే యోగముగా

నాతికి పతియే దైవముగా !పతి 2!

భర్త: 

సతి సౌభాగ్యాలే  తన భాగ్యమనే

భావనయే పతి ధర్మముగా -2

                                 !రాగాలా!

భార్య: 

మాయని ప్రేమల కాపురమే

మహిలో వెలసిన స్వర్గముగా -2

భర్త: 

జతబాయని కూరిమి జంటగ

మెలిగే దంపతులే ఇల ధన్యులుగా - 2

ఇద్ధరు : 

రాగాలా సరాగాలా

హాసాలా విలాసాలా 

సాగే  సంసారం హా...య్

సుఖజీవనసారం... హా..య్ సుఖజీవన సా...రం


రాగాలను, సరాగాలను మేళవించి ఘంటసాలగారు స్వరపర్చిన ఈ యుగళగీతమే సదా మదిలో మెదిలే సజీవరాగం.

జీవితాంతం సంసారం సుఖజీవనసారంగా సాగిపోతూంటే చూసేవాళ్ళకి ఏ థ్రిల్లు, ఎక్సైట్మెంట్ వుండదనేది సినిమా సిధ్ధాంతం. అందుకోసం కుటుంబ సభ్యుల మధ్య  ఈర్ష్యాసూయలుభార్యాభర్తల మధ్య అపనమ్మిక, అపార్ధాలు, సంసారం అస్తవ్యస్తం కావడం, కష్టాలు, కన్నీళ్ళు , చివరకు తన తప్పిదాన్ని భర్త తెలుసుకుని భార్యను క్షమాపణలు కోరి ఆ ఇరువురు ఒకటవడంతో సుఖాంతం కావడమనే తెలుగు సినిమా ఫార్ములాను నూటికి నూరుపాళ్ళు విజయవంతంగావినోదాత్మకంగా పండించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను, కాసులను పంటను పుష్కలంగా పొందిన సినిమా 1960ల నాటి 'శాంతినివాసం'.

జనరంజకమైన గీతాలతో చిత్రాన్ని ఆద్యంతం  మూడు డాన్సులు ఆరు పాటలుగా వినోదభరితంగా చూపిస్తూనే సనాతన ధర్మసూత్రాలను కథలో అంతర్లీనంగా ప్రవేశపెట్టి ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించారు కధారచయిత జూనియర్ సముద్రాల, దర్శకుడు సిఎస్ రావు.

ఏదో సామెత కోసం ' మూడు డాన్సులు ఆరు పాటలు ' అని అన్నానే తప్ప శాంతినివాసం సినిమాలో ఎనిమిది పాటలు, ఆరు పద్యాలు వున్నాయి. డ్యూయెట్స్ అన్నీ  ఆటా పాటా మిశ్రమమే. ఇవికాక, పూర్తిగా నృత్యగీతం ఒకటి వుంది.  వీటన్నిటినీ కథ, మాటలు సమకూర్చిన సముద్రాల రామానుజాచార్యులుగారే వ్రాశారు.

అసలు శాంతినివాసం సినిమా టైటిల్ మ్యూజిక్కే ఒక పాట. సద్గురు త్యాగరాజస్వామి సామ రాగంలో రచించిన 'శాంతములేక సౌఖ్యము లేదూ...' అనే కీర్తనను   సినిమా నేపథ్యాన్ని ప్రేక్షకులకు తెలియజేసేలా ఘంటసాలగారు సందర్భోచితంగాసింబాలిక్ గా ఉపయోగించారు. సినీమాలోని మొదటి సీనుకు లీడ్ ను ఇస్తూ  ప్రేక్షకులను భక్తి అనుభూతిలోకి ముందుగానే తీసుకువెళ్ళారు ఘంటసాల.

ఈ సినిమా లో ఐదు పాటలు హిందీ బాణీలను అనుసరించి చెసినవే. పద్యాలు, ఒక మూడు పాటలు (కలనైనా నీ తలపే- పి.లీల, శ్రీరఘురాం జయ రఘురాం - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, రాగాలా సరాగాలా - పి. సుశీల-ఘంటసాల) మాత్రం ఘంటసాలగారి సొంత స్వరరచనలు.

అలాటి ఘంటసాలగారి సొంత స్వరకల్పనలోని  'రాగాలా సరాగాలా...గీతమే నేటి మన సజీవరాగం.

భార్యభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు లేకుండా పరస్పర నమ్మికతో చల్లగా కాపురం చేసుకోవాలని, అలాకాకుండా అసూయాపరులు చెప్పే చెప్పుడుమాటలకు లొంగిపోయి భార్య సౌశీల్యాన్ని అనుమానిస్తే ఆ కుటుంబం ఎంత అతలాకుతలం అవుతుందో చాటిచెప్పే కథ 'శాంతినివాసం' కథాపరంగా ఆ ఇంటి పెద్దకొడుకు, కోడలే నాయికా నాయకులు. వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న ఆ ఇద్దరిమధ్యా సాగే ప్రణయ సరాగరాగాలే నేటి మన సజీవరాగం.

పి.సుశీల, ఘంటసాలగారు ఆలపించిన ఈ సుశ్రావ్య యుగళగీతాన్ని శాంతినివాసపు పెద్దకోడలు, పెద్దకొడుకులైన దేవిక, కాంతారావుల మీద వారి పడకగదిలో ముచ్చటగొలిపే విధంగా చిత్రీకరించారు డైరెక్టర్ సి.ఎస్. రావు.

ఒక చిన్న గిటార్ వ్యాంపింగ్, మేండొలిన్ బిట్ మీద సుశీలగారి హమ్మింగ్ తో  హుషారుగా ప్రారంభమయే ఈ పాట బ్యాక్గ్రౌండ్ లో గిటార్, మేండొలిన్, పియోనా, డబుల్ బేస్, సితార్, ఫ్లూట్, క్లారినెట్, వయొలిన్స్, తబలా, తదితర రిథిమ్స్ ను ఘంటసాల ఉపయోగించారు.

ఈ పాటలో కేదార రాగ స్వరాలు వినిపిస్తాయి. కేదారం 29 వ మేళకర్త ధీరశంకరాభరణానికి జన్యరాగం. కేదార రాగ   ఆరోహణాక్రమంలో వక్ర సంచారంతో ఐదు స్వరాలు ( 'రి, '' స్వరాలు వుండవు) అవరోహణలో  ఆరు స్వరాలు ('' వుండదు) వుండడంవలన ఈ రాగాన్ని  వక్ర ఔఢవ- షాఢవ రాగంగా పరిగణిస్తారు.

ఇలాటి హృద్యమైన రాగంలో సుశీల, ఘంటసాలగార్ల వంటి అసమాన్య గాయకులు ఆలపించిన ఈ పాటలో రాగభావా

నుభూతులకు ఏం కొదవ. శ్రోతలను మైమరపించి ఆనందామృతంలో ఓలలాడించారు. మనకు పరభాషా గీతాల అనుసరణేమాత్రం అవసరం లేదని ఈ పాట ద్వారా నిరూపించారు ఘంటసాల.

శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా& టి అశ్వత్థనారాయణ నిర్మించిన ఈ వినోదాత్మక శాంతినివాసం సినిమాలో అక్కినేని, రాజసులోచన, కాంతారావు, దేవిక, కృష్ణకుమారి, రేలంగి, సూర్యకాంతం, సురభి బాలసరస్వతి, రమణారెడ్డి, నాగయ్య, కె.వి.ఎస్.శర్మ, తదితరులు నటించగా సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు.

అత్యంత విజయవంతమైన ఈ శాంతినివాసం చిత్రానికి మూలం పాలగుమ్మి పద్మరాజుగారి 'శాంతినివాసం' నాటకం. ప్రముఖ హాస్య నటుడు బి.పద్మనాభం నాటక సంస్థ రేఖ & మురళీ ఆర్ట్స్ కోసం ఒక తమిళ నాటకం ఆధారంగా వ్రాసిన నాటకం.

వినోదం, సెంటిమెంట్ రెండూ పుష్కలంగా వున్న శాంతినివాసం సినీమా అనేక చోట్ల శతదినోత్సవాలను జరుపుకుంది. ఈ కథ హిందీలో రెండుసార్లు సినిమాగా వచ్చింది. మొదట 'ఘరానా', తర్వాత, 'ఘర్ ఘర్ కి కహానీ'.

శాంతినివాసంలో వున్న తెలుగేతర బాణీలకు అవసరమైన  తెలుగుదనం అద్ది అసలు కన్నా నకలే మిన్న అనిపించారు ఘంటసాల.


కొసమెరుపు :

మైసూర్ బృందావనం గార్డెన్స్ లో ఔట్ డోర్ షూటింగ్. ఎ.ఎన్నా.ఆర్., రాజసులోచన, కెమేరా, టెక్నికల్ యూనిట్ అందరూ మైసూరు వెళ్ళిపోయారు. ఒక డ్యూయెట్ సాంగ్ పిక్చరైజేషన్ మొదలెట్టారు. అటువంటి ఆఖరి నిముషంలో మరొక పాట కూడా అక్కడే షూట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. అర్జంట్ గా 24 గంటల్లో పాట రికార్డు చేసి టేప్ బృదావన్ గార్డెన్స్ కు పంపమని ఒక హిందీ పాట గ్రామఫోన్ రికార్డుతో సహా ఘంటసాలగారికి కబురుచేశారు. వెంటనే రికార్డింగ్ థియేటర్ బుక్ చేసి సింగర్ కు  ఆర్కెష్ట్రా వారికి ఆఘమేఘాలమీద తెలియజేశారు. ఆ మధ్యాహ్నం లోపల సముద్రాల జూనియర్ గారు రావడం హిందీ పాటకు మాటలు ఇవ్వడంఘంటసాలగారు తగిన చేర్పులు మార్పులు చేసి 2 to 9 కాల్షీటులో ఆ పాటను రికార్డు చేసి రాత్రికి రాత్రే ఆ తెలుగు పాటను మైసూర్ బృందావన్ గార్డెన్స్ కు పంపడంతో ఎట్టి అవాంతరాలు లేకుండా అనుకున్న సమయానికి కొత్త పాట షూటింగ్ కూడా జరిగిపోయింది. శాంతినివాసం లో రెండు  హుషారైన డ్యూయెట్లును బృందావన్ గార్డెన్స్ లో అక్కినేని, రాజసులోచనల మీద చిత్రీకరించారు. ఆఖరి నిముషంలో చేసిన ఆ పాట ఏదో ఇప్పుడు జ్ఞాపకం లేదు.

ఇన్స్టెంట్ కాఫీలా తయారు చేయడం కోసమే నిర్మాతలు ఇలాటి హిందీ/తమిళ సినిమా పాటలను   రెడీగా వుంచుకుంటారేమో! 

వచ్చేవారం, మరల, ఘంటసాలగారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 24 - సరియా మాతో సమరాన నిలువగలడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...