Saturday 30 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 23వ భాగం - కలకానిది నిజమైనదీ బ్రతుకూ...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైరెండవ భాగం ఇక్కడ

23వ సజీవరాగం -   


"కలకానిది నిజమైనదీ బ్రతుకూ కన్నీటి
ధారలలోనే బలి చేయకూ..."

కాపి రాగం(కర్నాటక శైలి) 
పాట సాహిత్యం : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల
గానం ఘంటసాల

" కలకానిది నిజమైనది బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవుల తీగ నేలవాలి పోగా
జాలివీడి యటులే దాని వదిలి వైతువా
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా

అలముకున్న చీకటిలోనే అలమటించనేల 
కలతలకే లొంగిపోయి కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన అణిముత్యమున్నటులే శోకాల
మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే
ధీరగుణం !! కలకానిది !!

బ్రతుకంటే కొన్ని క్షణాలలో చెదరిపోయే కలకాదు. మనిషి జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితాన్ని మనోదౌర్బల్యంతో కృంగిపోతూ కన్నీళ్ళతో వృధాచేయకూడదు. కలతలకు లొంగిపోకూడదు. మన జీవితంలోని వెలుగునీడలను, కష్టాలను, దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.కష్టాల కడలిలో మునిగిపోతున్నవారికి చేయూతనివ్వాలి. మనిషికి ఏదీ దానంతట అది చిక్కదు. వెతికి, శోధించి, సాధించాలి అదే ధీరుల లక్షణం అని మహాకవి శ్రీశ్రీ గారు ఈ పాట ద్వారా జనాలకు సందేశమిచ్చారు.

"కలకానిది విలువైనది" పాట సన్నివేశ పరంగా శోకభరితమే. కానీ ఆ పాటలో ఆణిముత్యాల వంటి సందేశాలను పొదిగారు శ్రీశ్రీ గారు. వెలుగు నీడలు సినీమా కోసం వ్రాసిన ఈ పాటతో పాటు ఆ సినీమా లోని పాటలన్నీ శ్రీశ్రీ గారే వ్రాసారు. ఈ చిత్ర సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ట్యూన్ కే శ్రీశ్రీ సాహిత్యం అందించినట్లు తెలుస్తున్నది. 

ఉదాత్త భావన, గాంభీర్యం, శోకం మిళితమైన ఈ పాటను  పెండ్యాల కర్నాటక కాపీ రాగంలో స్వరపర్చినట్లు తెలుస్తున్నది.. కాపి రాగం  22వ మేళకర్త ఖరహరప్రియకు  జన్యరాగం. కాపి ఔఢవ-సంపూర్ణ వక్ర సంచార రాగం. ఈ రాగం ఆరోహణలో ఐదు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. అన్యస్వర ప్రయోగం కూడా ఉన్నందున కాపి భాషాంగరాగంగా కూడా చెపుతారు. ఈ కర్నాటక కాపి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం పీలు. 

సాహిత్య పరంగాను, సంగీతపరంగానూ మనసుకు పట్టిపోయే "కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు" అంటూ ఘంటసాల మాస్టారు అతి గంభీరంగా, గళంలో విషాదాన్ని ధ్వనింపజేస్తూ , ఎంతో భావయుక్తంగా గానం చేశారు. ఘంటసాలవారి తెరవెనుక గానానికి దీటుగా తెరపై కధానాయకుడు అక్కినేని అద్భుతమైన నటనను కనపర్చి ఆ గీతం అజరామరం కావడానికి ఎంతో దోహదం చేశారు.

"వెలుగునీడలు" సినీమాను అన్నపూర్ణ పిక్చర్స్ తమిళంలో "తూయ ఉళ్ళం" పేరుతో తీయగా "కలకానిది" పాట ఒక్కటి మాత్రం తమిళంలో కూడా అక్కినేనికి ఘంటసాలగారి చేతే పాడించారు. ఆ పాట తమిళంలో కూడా మంచి హిట్టయింది. ఈ పాట  రేడియోలోనుండి వినిపించేదవడంతో పాట చిత్రీకరణ నేపధ్యంలో రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్, గాయకుడిగా హీరో అక్కినేని, వాద్యబృంద నిర్వాహకుడిగా సంగీత దర్శకుడు పెండ్యాల, మరికొంతమంది సినీ సంగీత వాద్యకళాకారులు ఈ పాటలో కనిపిస్తారు. పెండ్యాలగారు అంతకు ముందు ఏడాది వచ్చిన 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం' లోని 'శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాటలో కూడా కనిపిస్తారు. ఈ రెండు పాటలు పెండ్యాలగారే స్వరపర్చగా ఘంటసాలవారే ఆలపించడం ఒక విశేషం.

జీవితంమీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిన ఒక యువకుడు "కలకానిది విలువైనది" పాట  విని ఆ పాట ఇచ్చిన స్ఫూర్తితో తన ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నట్లు శ్రీశ్రీగారికి ఉత్తరం వ్రాసినట్లు శ్రీశ్రీగారు తన సినీగీతాల సంకలనంలో తెలియజేశారు. 

అక్కినేని, సావిత్రి, జగ్గయ్య,  ఎస్.వి.రంగారావు, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, రాజసులోచన మొదలగువారు నటించారు.

ఆత్రేయ, శ్రీశ్రీల మాటల, పాటల బలంతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణం లో వచ్చిన అన్నపూర్ణా వారి "వెలుగునీడలు" ఘన విజయాన్నే సాధించింది. వెలుగునీడలలో మరెన్నో మంచి పాటలు, సందేశాత్మక గీతాలున్నాఘంటసాల మాస్టారు గళంలోనుండి వచ్చిన "కలకానిది" పాట సంగీతాభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 23 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 22వ భాగం - జయత్వదభ్ర విభ్రమధ్భ్రమద్భుజంగ మస్ఫురాత్

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైయొకటవ భాగం ఇక్కడ

22వ సజీవరాగం -   
"జయత్వదభ్ర విభ్రమధ్భ్రమద్భుజంగ మస్ఫురాత్"
చిత్రం : సీతారామ కల్యాణం

కార్యసాధకుడు సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదేని ఒక దానిని తన ఆయుధంగా ఉపయోగించి తన కార్యాన్ని సాధించుకుంటాడు. ఇక్కడ అసుర లక్షణాలు కలిగిన రావణుడు  తన దర్పంతో, అహంకారంతో నందిని ఎదిరించి పరమేశ్వరుని దర్శించాలనుకుంటాడు. అది సానుకూలపడదని తెలుసుకొని, శివుడున్న కైలాస పర్వతాన్నే పెకిలించి లంకానగరానికి తీసుకుపోవాలనుకుంటాడు. అక్కడ కూడా భంగపాటుకు గురై భక్తిపూర్వకంగా వేడుకుంటాడు. అప్పటికి ఈశ్వరకటాక్షం లభించకపోవడంతో ఆత్మార్పణానికి సిధ్ధపడి తన కడుపును చీల్చుకుని, ప్రేవులను వీణాతంత్రులుగా మార్చి తన వీణా వాదనంతో శివుని మెప్పిస్తాడు. ఈనాటి సజీవరాగం లోని సూక్ష్మ సారాంశం.

భక్తితో, శక్తితో, జ్ఞానంతో ముల్లోకాలను జయించినా, తనలోని అహంకారాన్ని, రాజస లక్షణాలను జయించలేకపోవడంతో రావణబ్రహ్మ రావణాసురుడై తన నాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. 

ఈ పరిచయ వాక్యాలు చదివిన తర్వాత ఈ నాటి సజీవరాగం  'సీతారామ కళ్యాణం' అనే అద్భుత కళాఖండంలోనిదనే విషయం మీకు అర్ధమయేవుంటుంది. దాదాపు పదమూడు నిముషాలపాటు ఏకబిగిన ఉత్కంఠతతో సాగే దృశ్యం. ఈ దృశ్యంలో ఒక పాట, ఒక దండకం, ఒక పద్యం, అంతిమంగా హృదయవిదారకమైన వీణావాదనం వినిపిస్తాయి.  ఈ దృశ్యం ఆద్యంతం నందమూరి తారక రామారావు, ఘంటసాల వేంకటేశ్వరరావు అనే  ఇద్దరే ఇద్దరు కళాకారులు  కళ్ళెదుట నిల్చి మనలను దిగ్భ్రాంతులను చేస్తారు. ఇక్కడ  ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం, ఘంటసాల అసమాన్య గానవిద్యా కౌశలం ఈ సినీమాకు, ఈ దృశ్యఖండికలోని సంగీతానికి అజరామరత్వాన్ని చేకూర్చాయి. వీరిరువురితో పాటు ఈ మిని దృశ్య కావ్యానికి ప్రాణప్రతిష్ట చేసినవారు. చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గాలి పెంచలనరసింహారావు, సుప్రసిధ్ధ వైణిక విద్వాంసుడు శ్రీ ఈమని శంకరశాస్త్రి.

ఈ సినీమా సంగీతం గురించి చెప్పుకునే ముందు, సాలూరు రాజేశ్వరరావుగారి గురించి కూడా చెప్పకతప్పదు. ఈ దృశ్యంలో వినవచ్చే పాటలను, మండోదరి కోసం, తర్వాత దృశ్యాలలో వచ్చే  'పాడవే రాగమయీ వీణా' అనే పి.సుశీల పాడిన వీణ పాటను సాలూరివారు స్వరపర్చినట్లు చెప్పుకుంటారు. తర్వాత,  ఆయన అలవాటు ప్రకారం నందమూరి సోదరులతో వచ్చిన విభేదాల వలన  మధ్యలో ఈ చిత్రం నుండి తొలగిపోతే, అంతవరకూ అజ్ఞాతవాసంలో వున్న మొదటి తరం సంగీత దర్శకుడు గాలి పెంచలనరసింహారావుగారిని రప్పించి వారికి అవకాశం కల్పించి మిగిలిన సినిమా సంగీతం పూర్తి చేయించారు.

అధికారదర్పంతో మహేశ్వరుని దర్శించవచ్చిన రావణాసురుని(ఎన్టీఆర్) లోనికి వెళ్ళకుండా నంది (రాజారెడ్డి) అడ్డగించడంతో  కలహానికి దిగిన రావణుడు బలప్రయోగం మంచిదికాదన్న నారదుని (కాంతారావు) సలహాతో "కానరార కైలాసనివాస" అని భక్తి మార్గంలో శివుని ప్రార్ధిస్తాడు. శంకరాభరణం (29వ మేళకర్త - ధీరశంకరాభరణం జన్యం) రాగంలోని శుధ్ధశాస్త్రీయతను పాటిస్తూ స్వరపర్చబడిన ఈ  శివభక్తి గీతాన్ని పరమ శ్రీవైష్ణవాచార్యుడైన సముద్రాల రాఘవాచార్యులు గారు అత్యద్భుతంగా వ్రాయగా ఆ పాటను భక్తిప్రపత్తులతో  పరమ శాంతంగా ఘంటసాల ఆలపించారు. పాట, పాట మధ్యలో వినవచ్చే నేపధ్య సంగీతం మీద కైలాసంలోని శివపార్వతుల (వెంపటి పెద సత్యం) శృంగారలాస్యం మనలను ఆనంద పరవశులనుజేస్తుంది. తన భక్తి పార్వతీపతిని మెప్పించకపోవడంతో రావణుడు క్రోధంతో, ఆవేశపూరితుడై, అహంకారంతో "జయత్వద భ్రవిభ్రమత్ భ్రమద్భుజంగ మస్ఫుర" అనే దండకంతో శివుని స్తుతిస్తూ శివపార్వతుల లాస్యానికి భంగపాటు కలిగిస్తూ రావణుడు కైలాసపర్వతాన్నే పెకలించబోతాడు. ఈ దండకానికి కూర్చిన వరస , దానిని ఘంటసాలగారు  ఆలపించిన విధానం అనితరసాధ్యం, అనన్యసామాన్యం. ఈ దండకం పాడేప్పుడు ఘంటసాలవారి స్పష్టమైన ఉచ్ఛారణ, భావప్రకటన, రసస్ఫూర్తి మాటలకు అతీతం. ఆయన గాన గంధర్వుడని చెప్పడానికి, గాన వైదుష్యానికి ఈ దండకం ఒక్కటే చాలు.

(నిజం చెప్పొద్దూ - నా 78 ఏళ్ళ కాలంలో ఒక్కసారి కూడా నేను ఈ దండకాన్ని తడబడకుండా, స్పష్టంగా పలకలేకపోయాను. నడకే ప్రధానమైన ఈ దండకంలోని భావార్ధం తెలిసిన వారెందరో మరి?)

ఈ సన్నివేశంలో ఎన్.టి.ఆర్ ప్రతీ కదలిక, హావభావాలు, ఆ పాత్ర పట్ల గల పరిపూర్ణ అవగాహన నటుడిగా ఆయనను శిఖరాగ్రాలకు చేర్చాయి.

కైలాస పర్వతం పెకలించేప్పుడు పది తలలతో రావణుడు కనిపించే ఆ ఒక్క సీన్ మాత్రం షూట్ చేయడానికి కెమేరామన్ రవికాంత్ నగాయిచ్ కు దాదాపు ఐదారు గంటల సమయం పట్టిందట.  షూటింగ్ మధ్యలోలంచ్ బ్రేక్ సమయంలో టెక్నీషియన్స్ అందరూ బయటకు వెళ్ళిపోయినా రామారావుగారు మాత్రం అదే పొజిషన్లో ఆ పది తలలతో నిశ్చలంగా అలాగే కూర్చొని ఆ సీన్  షూటింగ్ పూర్తయి కెమేరామన్ ఓకే చెప్పిన తర్వాతగాని ఆ చోటునుండి కదలలేదని, మేకప్  తీయలేదని రవికాంత్ నగాయిచ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎన్.టి.రామారావుగారికి తన వృత్తిపట్ల గల కమిట్మెంట్, డివోషన్.

రావణవిరచితంగా చెప్పబడే ఈ దండకం తర్వాత ఒక పద్యం. ఈ సందర్భానికి హంసధ్వని, మలయమారుతం, మోహన, సింధుభైరవి రాగాలను సందర్భోచితంగా ప్రయోగించారు.

రావణుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఖిన్నుడై ఆత్మత్యాగానికి సిధ్ధమైన తన పొట్టను చీల్చి అందులోని ప్రేవులను తంత్రులుగాజేసి తన వీణావాదనంతో శివుని మెప్పించాలని ఆశిస్తాడు. ఈ దృశ్యానికిదే పరాకాష్ట. ఈ సన్నివేశ చిత్రీకరణలో డైరెక్టర్ గా ఎన్.టి.రామారావు చూపిన ప్రతిభ, అభిరుచి ఎంతైనా కొనియాడదగ్గది. ఈ సందర్భంలో వీణను వాయించడానికి ఈమని శంకరశాస్తి వంటి సుప్రసిధ్ధ సంగీత విద్వాంసుడిని ఎన్నుకోవడంలో రామారావుగారి ప్రజ్ఞ, విజ్ఞత గోచరమవుతాయి. ఈ రావణ వీణావాదనానికి వేద మంత్రాలు పఠించడానికి ఉపయోగించే స్వరాలనే ప్రయోగించారు. వేద మంత్రాలు ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే మూడు మాత్రమే కాక కింద పంచమం కూడా కలిపి నాలుగు స్వరాలలో గానం చేస్తారని దానికి ప్రత్యేకించి రాగం పేరు ఉండదని గతంలో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చే తానాన్ని ముఖారి రాగంలో స్వరపర్చగా ఈమనివారు అమోఘంగా తన వీణా గాన వైదుష్యాన్ని చూపించారు.  ముఖారి రాగం శోకరస ప్రధాన రాగం. ఇది 22వ మేళకర్త ఖరహరప్రియ జన్యరాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి.

రావణబ్రహ్మ ఆత్మత్యాగం చేసి పరమేశ్వరుని కరుణాకటాక్షాలతో అమోఘ వరాలు పొందడంతో ఈ దృశ్యం పూర్తి అవుతుంది. 

ఈ సినీమాలో ఎన్.టి.రామారావుగారు కానీ, ఘంటసాలగారు కానీ, ప్రశంసలకు, బిరుదులకు అతీతమైన కళా ప్రతిభను కనపర్చి చలనచిత్రసీమలో  లక్షలాది ప్రజల హృదయాలలో సుస్థిరమైన, శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవత కావ్యాలలాగే ఎన్.టి.రామారావుగారి సీతారామకల్యాణం, అందులోని ఘంటసాలవారి పాటలు, పద్యాలు తెలుగువారికి చిరస్మరణీయంగా వుంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చును.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 16 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 21వ భాగం - తకిట తకిటథిమి తబలా డగ్గ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైయవ భాగం ఇక్కడ

21వ సజీవరాగం - 

తకిట తకిటథిమి తబలా డగ్గ
అణిగిందిర తిక్క... భౌమని మొరిగిందిర కుక్కా...

"అలవాటు లేని ఔపాసన " అని మనకు ఒక సామెత వుంది. అది అక్షరాల నిర్మాత, దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి పట్ల నిజమయింది. వారి అభిరుచికి , భావాలకు విరుధ్ధంగా "రాజమకుటం" అనే  జానపద సినిమాను తీశారు. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినీమా ను కొంతవరకు ఆదరించినా , కేవలం వినోదాన్ని మాత్రమే ఆశించి జానపద సినీమా లు చూసే పామరజనాలను ఈ సినీమా  ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. 

ఎన్.టి.ఆర్.,  గుమ్మడి, కన్నాంబ, రాజసులోచన, రాజనాల వంటివారు తమ తమ పాత్రలకు జీవంపోసినా, మంచి కధాంశంతో బి.ఎన్ రెడ్డిగారు గొప్పగా స్క్రీన ప్లే రూపొందించి  ఈ సినీమా ను తీసినా ఆర్ధికంగా విజయం పొందలేకపోయింది.

మాస్టర్ వేణు సంగీతంలో దేవులపల్లి, బాలాంత్రపు, కొసరాజుగార్లు వ్రాసిన పాటలు బి.ఎన్.గారి అభిరుచి మేరకు చాలా మనోజ్ఞంగా చిత్రీకరించబడ్డాయి. "సడిసేయకోగాలి ", " ఊరేది పేరేది ఓ చందమామా", "చూడచక్కని చుక్కల రేడు", "ఏటి ఒడ్డునా మా ఊరు", "తకిట తకిటథిమి తబలా డక్క" వంటి పాటలు ఈ సినిమా రిలీజైన 63 సంవత్సరాల తర్వాత కూడా శ్రోతల మనసులలో పదిలంగా వున్నాయి.

ఆ విధంగా నేటి మన "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" లోని గీతం "తకిట తకిటథిమి తబలా డక్క" అనే పాట ఘంటసాల మాస్టారు పాడినది. ఇదొక situational song. కుట్రలు , కుతంత్రాలతో దుష్టుడైన పినతండ్రి చేసిన విషప్రయోగం నుండి తెలివిగా తప్పించుకొని మహారాజు మతిస్థిమితం లేనివాడిలా నటిస్తూ పాడిన పాట ఇది.  ఈ పాటలో ఘంటసాలవారి లోని నటుడు ఆద్యంతం కనిపిస్తాడు. మతిభ్రమణం చెందినవారు ఒక మాటకు మరొక మాటకు పొంతన లేకుండా మాట్లాడతారు. వారి చేష్టలు కూడా క్షణానికొక రకంగా మారిపోతూంటాయి. ఈ భావాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొసరాజు గారు రకరకాల అంశాలను జొప్పించి ఈ పాటను అద్భుతంగా రాసారు. ఈ పాటను ఘంటసాలగారు కాకుండా వేరెవరైనా పాడివుంటే ఈ పాట గురించి పనికట్టుకొని ఈ రోజు తల్చుకోవలసిన అవసరమే ఉండేదికాదు. మాస్టర్ వేణుగారి స్వరరచనకు ఘంటసాల మాస్టారు రెండువందల శాతం న్యాయం చేకూర్చి జీవంపోసారు. ఈ పాటలో కోపం, ఉద్రేకం, విషాదం, వైరాగ్యం, వేదాంతం వంటి భావోద్వేగాలన్నింటిని మాస్టారు నాలుగు నిముషాల పాటలో చూపించి శ్రోతలను దిగ్భ్రాంతికి గురిచేశారు. తెరవెనుక ఘంటసాలవారి లోని నటుడికి తెరమీది నటుడు ఎన్.టి.రామారావు తన హావభావాలతో పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

ఈ పాటలో ఎన్.టి.ఆర్. తో పాటు పద్మనాభం, గుమ్మడి, సురభి కమలాబాయి, తదితరులు పాల్గొని సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

పాట ప్రారంభంలో  వినపడే మృదంగ గతుల మీద మాస్టారి జతి, తర్వాత వచ్చే క్లారినెట్ బిట్ కు ఆయన స్వరాలు, వికటాట్టహాసం, ఎన్.టి.ఆర్. వాయిస్ కు మ్యాచ్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ ఎంత నిర్దుష్టంగా, ఖచ్ఛితంగా వుంటాయో ఈ పాట విన్నవారికే తెలుస్తుంది. ఒకేసారి అన్ని రసాలను తన గళం ద్వారా వినిపించి ఘంటసాల మాస్టారు శ్రోతలను సంభ్రమానికి గురి చేశారు.  ఈ పాటలో మాస్టర్ వేణుగారు మృదంగం, క్లారినెట్,  తాళాలు, ఫక్వాజ్,  ఛండ, టముకు, తాషామర్ఫా, వంటి వాద్యాలను అతి సమర్ధంగా ఉపయోగించారు.  ఈ పాటలో ఉపయోగించిన  వాద్యాలు కొన్ని  దేవాలయాలలో, రాజుల కోటల్లో వినపడేవి  నేను నా చిన్నతనం నుండి ఈ నాటి వరకు ఈ పాటను  తరచూ వింటూనే వున్నాను. ఈ పాట విన్నప్పుడల్లా నాలో ఏదో ఒకరకమైన గగుర్పాటును కలుగజేస్తుంది. ఏకకాలంలో ఘంటసాలగారు, ఎన్.టి.రామారావుగారు కళ్ళలో, మనసులో మెదులుతారు.








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 9 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 20వ భాగం - శేషశైలావాస శ్రీ వేంకటేశా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పంధొమ్మిదవ భాగం ఇక్కడ

20వ సజీవరాగం - 

సాహిత్యం : "శేషశైలావాసా శ్రీ వేంకటేశా"
రాగం - రీతిగౌళ
చిత్రం - శ్రీ వెేంకటేశ్వర మహత్మ్యం
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు

పాట సాహిత్యం - 

పల్లవి : శేషశైలావాసా శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా
శేషశైలావాసా శ్రీ వేంకటేశా...

చరణం : శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకూ..
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా చేర్చి
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి
శేషశైలావాసా శ్రీ వేంకటేశా....

చరణం 2 : 
పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి-2
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
!!పట్టు!
చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోము - 2
కరువుతీరా కాంచి తరియింతుము మేము !శేషశైలావాసా శ్రీ వేంకటేశా !
   
'మనసు కవి' గా తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆచార్య ఆత్రేయ చాలా ఎక్కువగా సాంఘిక సినీమాలకు, అతి తక్కువగా పౌరాణిక చిత్రాలకు పాటలు వ్రాసారు. అలా ఆత్రేయ  అతి తక్కువ పాటలు వ్రాసిన వాటిలో శాశ్వతత్వం సంతరించుకొని, ఆ సినీమా విడుదలైన 63 సంవత్సరాల తర్వాత కూడా అందులోని ఒక భక్తి గీతం తెలుగువారందరిలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి దోహదం చేస్తూనే వుంది. ఆ పాటే 1960లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా లోని " శేషశైలావాసా శ్రీ వేంకటేశా" అనే ఏకాంత సేవ గీతం. అదే నేడు  సదా మన మదిలో మెదిలే సజీవరాగం.

వాస్తవానికి  ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి నటించిన అత్యద్భుత పౌరాణిక చిత్రరాజం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం. సినీమా కథకు ఈ ఏకాంత సేవ గీతానికి ఏ సంబంధము లేదు. తిరుమల స్వామివారి ఆలయంలో జరిగే వివిధ పూజలు, ఉత్సవాలు,  సేవా కార్యక్రమాలలో భాగంగా స్వామి వారి ఏకాంతసేవా గానంలో భాగంగా ఈ గీతాన్ని చూపించడం జరిగింది.

తెలుగునాట శ్రీవేంకటేశ్వర మహత్మ్యం సృష్టించిన సంచలన విజయం మనందరికీ బాగా తెలిసినదే. ఈ చిత్రం విడుదలైన ప్రతీ ఊరిలో  ఆయా థియేటర్ ప్రాంగణంలో ఒక మినీ వేంకటేశ్వరస్వామి ఆలయం వెలసి ఆ సినీమా ఆడినన్నాళ్ళు నిత్య దీప ధూప ఆరాధనలతో ఒక పవిత్ర వాతావరణమే ఏర్పడింది.  సినీమా చూచేందుకు కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేక్షకులంతా అక్కడ ఏర్పాటు చేసిన హుండీలలో తమ కానుకలు సమర్పించుకొని కలియుగదైవమైన వేంకటేశ్వరునిపై తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా నటించిన ఎన్.టి.రామారావు  అపర వేంకటేశ్వరుడిగా తెలుగు ప్రజలందరిచేతా ఆరాధించబడ్డారు.

పెండ్యాల నాగేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమాలో పాటలన్నీ విపరీత జనాదరణ పొందాయి. వాటన్నిటిలో మకుటాయమానంగా, కలికి తురాయిగా ఎన్ని యుగాలకైనా శాశ్వతంగా నిలిచిపోయే భక్తిగీతం మాత్రం గంధర్వగాయకుడు ఘంటసాలవారు ఆలపించిన  " శేషశైలావాసా శ్రీ వేంకటేశా". ఘంటసాలవారి భక్తిరస ప్రధాన గీతాలలో ఈ పాట నిరంతరం మన హృదయాలలో మెదులుతూనే వుంటుంది.  ఘంటసాలగారే సినీమా లో కూడా  ఈ పాటను పాడుతూ తెరపై కనపడడం ఒక అపురూప విషయం. ఘంటసాల గాయకుడిగా గుర్తింపబడని రోజుల్లో సీతారామ జననం , త్యాగయ్య , యోగి వేమన వంటి సినీమాలలో చిన్న చిన్న వేషాలు వేసినా తర్వాతి కాలంలో గొప్ప గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఘంటసాలవారు పాట పాడుతూ తెరపై కనిపించింది శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా లో మాత్రమే. దర్శక నిర్మాత పి.పుల్లయ్యగారి బలవంతం మీద ఆ సినీమా లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినీమా తర్వాత అనేకమంది నిర్మాతలు తమ చిత్రాలలో నటించమని ఎంతగానో ఒత్తిడి చేసినా ఘంటసాలగారు అంగీకరించలేదు. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా తనకు లభిస్తున్న ప్రజాభిమానమే చాలని, నటుడిగా ఇతర నటుల జీవనోపాధికి అడ్డంకిగా మారడం సుతారము ఇష్టంలేదని తనకు నటుడిగా వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం లో తప్ప తర్వాత మరే ఇతర సినీమా లో నటించలేదు.

"శేషశైలావాసా" పాటను వాహినీ స్టూడియోలో వేసిన సెట్ మీద చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ కు ఘంటసాలవారి సతీమణి సావిత్రమ్మగారు , వారి పెద్దబ్బాయి విజయకుమార్ లతో పాటు నేనూ వెళ్ళేను. మధ్యాహ్నం రెండు గంటలనుండి అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పాట షూటింగ్ ను మేము సాయంత్రం ఏడు గంటల వరకు చూసి తిరిగి వచ్చేసాము. ఈ పాట చిత్రీకరణ లో ఘంటసాల మాస్టారితో పాటు సంగీత దర్శకుడు పెండ్యాలగారు, ఆయన సహాయకుడు బాబూరావు (తంబురాతో), వాహినీ సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాం (మృదంగంతో), ప్రముఖ ఫ్లూటిస్ట్ నంజుండప్ప (ఫ్లూట్ తో ) తెరపై కనపడడం ఒక విశేషం. (అనంతరకాలంలో నంజప్పగారు, ఘంటసాలగారి వాద్యబృందంలో సభ్యుడు కూడా విదేశ కచేరీ పర్యటనలో పాల్గొన్నారు).

ఈ సినీమా 1960 జనవరిలో విడుదలైనా ఈ పాట రికార్డింగ్, షూటింగ్ 1959 లో జరిగింది. ఈ సంఘటన జరిగిన మరో పదేళ్ళకు నిజంగానే తిరుమల-తిరుపతి దేవస్ధానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన సంగీతవిద్వాంసుడిగా మూడేళ్ళపాటు నియమించడం ఒక అపూర్వ విషయం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడి పదవి పొంది గౌరవింపబడిన మొట్టమొదటి చలన చిత్ర గాయకుడు, మన గానగంధర్వుడు ఘంటసాలవారు.

(శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా కోసం తయారు చేయబడిన  వేంకటేశ్వరస్వామి వారి నిలువెత్తు (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాన్ని, స్వామివారి అలంకారాభరణాలను పి.పుల్లయ్యగారు 1981 లో మా భారత్ కల్చురల్ ఇంటగ్రేషన్ కమిటీ బాలాజీ సంగీత్ కళ్యాణోత్సవాలకు గాను తన కానుకగా మాకు అప్పజెప్పారు. అదంతా వేరే చరిత్ర).

"శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాటను పెండ్యాలగారు రీతిగౌళ రాగంలో అతి శ్రావ్యంగా స్వరపర్చారు. రీతిగౌళ రాగం కర్నాటక సంగీతంలో 22 వ మేళకర్త రాగమైన ఖరహరప్రియకు జన్యరాగము. ఈ రాగం ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉండడం వలన దీనిని షాఢవ-సంపూర్ణ రాగమని, ఈ రాగ సంచారం వక్రగతులలో నడుస్తూండడం వలన రీతిగౌళను వక్ర -షాఢవ-సంపూర్ణ రాగమని కూడా అంటారు. ఈ రాగం అనురక్తిని, భక్తి భావాన్ని ప్రకటించడానికి చాలా అనువైన రాగం.

శేషశైలావాసా పాట ఒక రకమైన జోల పాట కావడం వలన ఆద్యంతం సుతిమెత్తగా చాలా ప్రశాంతంగా, సుశ్రావ్యంగా నడుస్తుంది. అందుకు తగినట్లుగానే ఈ పాటలో జలతరంగ్, ట్యూబోఫోన్, ఫ్లూట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను  మాత్రమే పెండ్యాలగారు ఉపయోగించారు. ఈ పాటను ఘంటసాల మాస్టారు చాలా లలితంగా ఆలపిస్తూనే,శుధ్ధ శాస్త్రీయతను తన గాత్రంలో ధ్వనింపజేసారు.

ఘంటసాలవారి అజరామర గీతాలలో "శేషశైలావాసా శ్రీ వేంకటేశా" ఎప్పటికీ నిస్సందేహంగా ప్రముఖంగా నిలిచే వుంటుంది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 2 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 19వ భాగం - మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పద్ధెనిమిదవ భాగం ఇక్కడ

19వ సజీవరాగం - 
"మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ"

సాహిత్యం : సముద్రాల జూనియర్
రాగం - 
చిత్రం - రేచుక్క పగటిచుక్క
సంగీతం - టి.వి.రాజు

పాట సాహిత్యం - 

మనవి సేయవే... మనసార చెలికి నాదు ప్రేమ .. మనవి సేయవే

సందెవేళ సుందరాంగి చిందు వేయు వెన్నెలలో సందు చేసుకొని నీవు ,
చందమామ, చల్లగా ! మనవి సేయవే!

ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ
మారుతమా !
చెలియ మనసు తీరు తెలిసి , చెవిలోన 
మెల్లగ ! మనవి సేయవే !

1959 లో వచ్చిన " రేచుక్క పగటిచుక్క" అనే జానపద చిత్రంలోని పాట యిది. ఎన్.ఎ.టి.  సంస్థ, మరియు, విజయా ప్రొడక్షన్స్ కలసి స్వస్తిశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన భారీ జానపద చిత్రం. ఎన్..టి.ఆర్, జానకి, ఎస్.వి.రంగారావు, కన్నాంబ మొదలగు వారు నటించారు. ఈ సినిమాలో కొన్ని చాలా మంచి పాటలున్నా, సినీమా అపజయం పొందిన కారణంగా పాటలన్నీ కొన్ని దశాబ్దాల పాటు మరుగున పడిపోయాయి. ఈ పాటలకు పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని వందల ఏక గళ గీతాలలో ఈ పాటకు నిశ్చయంగా సముచిత స్థానం ఉంటుంది. ఈ సినీమా లోని పాటలన్ని సముద్రాల రామానుజంగారు రాసారు. టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించారు. కమలాకర కామేశ్వరరావు డైరెక్టర్. టి.వి.రాజుగారు, సముద్రాల జూనియర్ గారు ఎన్.టి.రామారావుగారికి ఆప్తమిత్రులు. రామారావుగారు హీరోగా నటించిన అనేక చిత్రాలకు ఈ ఇద్దరూ కలసి పని చేసేరు.

"మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవిసేయవే" - పాటలో ఆహా, ఓహో అని మెచ్చుకునే సాహిత్యమో, సంగీతమో కనపడదు. పాట మాటలలో సమాసభూయిష్ట పదాడంబరం లేదు. అయినా ఈ పాట శ్రోతల చెవులకు ఇంపుగానే వుంటుంది. అందుకు కారణం కేవలం మృదుమధురమైన, లాలిత్యంతో కూడిన ఘంటసాలవారి ప్రశాంతమైన గానం , సున్నితమైన వాద్యగోష్టి మాత్రమే ఈ పాటను ఆపాతమధురం చేసాయి. 

చల్లని వెన్నెల రాత్రిలో ప్రశాంతమైన ఏకాంత వాతావరణం లో కథానాయకుడు తన మనోభావాలను తన ప్రియురాలికి తెలియజెప్పమని చంద్రుడిని, చల్లని పిల్లతెమ్మెరలను అర్ధిస్తూ పాడిన పాట. ఈ అడగడంలో అధికారమో, దర్పమో కనపడదు. సందెవేళ సుందరాంగి వెన్నెట్లో విహరించే సమయంలో "సందు చేసుకొని" అవకాశం చూసుకొని మాత్రమే మనవి చేయమని  చందమామను కోరుతున్నాడు. అలాగే, మరో చరణంలో మలయమారుతంతో "ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ, మారుతమా! చెలియ మనసు తీరు తెలిసి, చెవిలోన మెల్లగా మనవి సేయవే అని అడుగుతున్నాడు. మొత్తం మీద ప్రియురాలి మనఃస్థితిని కనిపెట్టి సున్నితంగా ప్రేమ రాయబారం నెరపమని కధానాయకుడు విన్నపం చేస్తున్నాడు. *ఈ విషయాలను ప్రియురాలి సముఖంలో తానెంత సరళంగా, మృదువుగా చెప్పాలని భావిస్తున్నాడో అంత లాలిత్యంగా తన భావాలను వెల్లడిస్తున్నాడు*. 

టి.వి.రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు  హీరో ఎన్.టి.ఆర్ లో పరకాయ ప్రవేశం చేసి ఈ పాటను అత్యంత మనోహరంగా గానం చేసి ఈ పాటను అజరామరత్వం కల్పించారు. ఈ పాట చివరలో వచ్చే ఆలాపన మనలను చల్లని వెన్నెట్లో హాయిగా ఊయలలూపుతున్న భావన కలిగిస్తుంది. ఈ పాటలో టి.వి.రాజుగారు వైబ్రోఫోన్, ట్యూబోఫోన్, స్పానిష్ గిటార్, వయొలిన్స్, ఫ్లూట్ వంటి వాద్యాలను సముచితమైన రీతిలో ఉపయోగించారు. తెరమీద కధానాయకుని పాత్రలో ఎన్ టి రామారావు నిజంగానే ఓ రాజకుమారిడిలా ఎంతో అందంగా, హుందాగా తన హావభావాలను అలవోకగా ప్రదర్శించారు.

ఈ ఏకగళ ప్రేమగీతాన్ని ప్రత్యేకించి ఏ ఒక్క రాగంలోనో కాక పలు రాగాల ఛాయలు ధ్వనించేలా స్వరపర్చినట్లు తెలుస్తున్నది. 

"రేచుక్క పగటిచుక్క" సినీమా ను తెలుగుతో పాటు  తమిళంలో కూడా "రాజసేవై" అనే పేరుతో నిర్మించారు. తమిళ వెర్షన్ లో ఈ పాటను సోలోగా కాక ఒక డ్యూయెట్ గా  ఎన్.టి.ఆర్, షావుకారు జానకిల మీద చిత్రీకరించారు. తమిళంలో కూడా ఈ పాటను ఘంటసాలగారే పి.సుశీలగారితో కలసి పాడారు. 

లలితసంగీత వేదికల మీద ఈ పాట ఈనాటికి పలువురు గాయకుల కంఠస్వరాన వినిపిస్తూ శ్రోతల హర్షధ్వానాలు అందుకుంటునేవుంది. మనసుకు హాయిని, మంచి మూడ్ ను కలిగించే పాట " మనవి సేయవే". ఘంటసాల మాస్టారి కంఠంలో ఇటువంటి ఆణిముత్యాలెన్నో సరియైన ప్రచారం లభించక కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ పాటలన్నింటినీ ఘంటసాలవారి శత జయంతీ ఉత్సవాలలో భాగంగా వెలుగులోకి తీసుకురావలసిన భాధ్యత సంగీతాభిమానులందరి మీద ఉన్నదని భావిస్తున్నాను.







వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...