Saturday 16 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 21వ భాగం - తకిట తకిటథిమి తబలా డగ్గ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైయవ భాగం ఇక్కడ

21వ సజీవరాగం - 

తకిట తకిటథిమి తబలా డగ్గ
అణిగిందిర తిక్క... భౌమని మొరిగిందిర కుక్కా...

"అలవాటు లేని ఔపాసన " అని మనకు ఒక సామెత వుంది. అది అక్షరాల నిర్మాత, దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి పట్ల నిజమయింది. వారి అభిరుచికి , భావాలకు విరుధ్ధంగా "రాజమకుటం" అనే  జానపద సినిమాను తీశారు. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినీమా ను కొంతవరకు ఆదరించినా , కేవలం వినోదాన్ని మాత్రమే ఆశించి జానపద సినీమా లు చూసే పామరజనాలను ఈ సినీమా  ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. 

ఎన్.టి.ఆర్.,  గుమ్మడి, కన్నాంబ, రాజసులోచన, రాజనాల వంటివారు తమ తమ పాత్రలకు జీవంపోసినా, మంచి కధాంశంతో బి.ఎన్ రెడ్డిగారు గొప్పగా స్క్రీన ప్లే రూపొందించి  ఈ సినీమా ను తీసినా ఆర్ధికంగా విజయం పొందలేకపోయింది.

మాస్టర్ వేణు సంగీతంలో దేవులపల్లి, బాలాంత్రపు, కొసరాజుగార్లు వ్రాసిన పాటలు బి.ఎన్.గారి అభిరుచి మేరకు చాలా మనోజ్ఞంగా చిత్రీకరించబడ్డాయి. "సడిసేయకోగాలి ", " ఊరేది పేరేది ఓ చందమామా", "చూడచక్కని చుక్కల రేడు", "ఏటి ఒడ్డునా మా ఊరు", "తకిట తకిటథిమి తబలా డక్క" వంటి పాటలు ఈ సినిమా రిలీజైన 63 సంవత్సరాల తర్వాత కూడా శ్రోతల మనసులలో పదిలంగా వున్నాయి.

ఆ విధంగా నేటి మన "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" లోని గీతం "తకిట తకిటథిమి తబలా డక్క" అనే పాట ఘంటసాల మాస్టారు పాడినది. ఇదొక situational song. కుట్రలు , కుతంత్రాలతో దుష్టుడైన పినతండ్రి చేసిన విషప్రయోగం నుండి తెలివిగా తప్పించుకొని మహారాజు మతిస్థిమితం లేనివాడిలా నటిస్తూ పాడిన పాట ఇది.  ఈ పాటలో ఘంటసాలవారి లోని నటుడు ఆద్యంతం కనిపిస్తాడు. మతిభ్రమణం చెందినవారు ఒక మాటకు మరొక మాటకు పొంతన లేకుండా మాట్లాడతారు. వారి చేష్టలు కూడా క్షణానికొక రకంగా మారిపోతూంటాయి. ఈ భావాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొసరాజు గారు రకరకాల అంశాలను జొప్పించి ఈ పాటను అద్భుతంగా రాసారు. ఈ పాటను ఘంటసాలగారు కాకుండా వేరెవరైనా పాడివుంటే ఈ పాట గురించి పనికట్టుకొని ఈ రోజు తల్చుకోవలసిన అవసరమే ఉండేదికాదు. మాస్టర్ వేణుగారి స్వరరచనకు ఘంటసాల మాస్టారు రెండువందల శాతం న్యాయం చేకూర్చి జీవంపోసారు. ఈ పాటలో కోపం, ఉద్రేకం, విషాదం, వైరాగ్యం, వేదాంతం వంటి భావోద్వేగాలన్నింటిని మాస్టారు నాలుగు నిముషాల పాటలో చూపించి శ్రోతలను దిగ్భ్రాంతికి గురిచేశారు. తెరవెనుక ఘంటసాలవారి లోని నటుడికి తెరమీది నటుడు ఎన్.టి.రామారావు తన హావభావాలతో పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

ఈ పాటలో ఎన్.టి.ఆర్. తో పాటు పద్మనాభం, గుమ్మడి, సురభి కమలాబాయి, తదితరులు పాల్గొని సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

పాట ప్రారంభంలో  వినపడే మృదంగ గతుల మీద మాస్టారి జతి, తర్వాత వచ్చే క్లారినెట్ బిట్ కు ఆయన స్వరాలు, వికటాట్టహాసం, ఎన్.టి.ఆర్. వాయిస్ కు మ్యాచ్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ ఎంత నిర్దుష్టంగా, ఖచ్ఛితంగా వుంటాయో ఈ పాట విన్నవారికే తెలుస్తుంది. ఒకేసారి అన్ని రసాలను తన గళం ద్వారా వినిపించి ఘంటసాల మాస్టారు శ్రోతలను సంభ్రమానికి గురి చేశారు.  ఈ పాటలో మాస్టర్ వేణుగారు మృదంగం, క్లారినెట్,  తాళాలు, ఫక్వాజ్,  ఛండ, టముకు, తాషామర్ఫా, వంటి వాద్యాలను అతి సమర్ధంగా ఉపయోగించారు.  ఈ పాటలో ఉపయోగించిన  వాద్యాలు కొన్ని  దేవాలయాలలో, రాజుల కోటల్లో వినపడేవి  నేను నా చిన్నతనం నుండి ఈ నాటి వరకు ఈ పాటను  తరచూ వింటూనే వున్నాను. ఈ పాట విన్నప్పుడల్లా నాలో ఏదో ఒకరకమైన గగుర్పాటును కలుగజేస్తుంది. ఏకకాలంలో ఘంటసాలగారు, ఎన్.టి.రామారావుగారు కళ్ళలో, మనసులో మెదులుతారు.








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...