"మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ"
సాహిత్యం : సముద్రాల జూనియర్
రాగం -
చిత్రం - రేచుక్క పగటిచుక్క
సంగీతం - టి.వి.రాజు
పాట సాహిత్యం -
మనవి సేయవే... మనసార చెలికి నాదు ప్రేమ .. మనవి సేయవే
సందెవేళ సుందరాంగి చిందు వేయు వెన్నెలలో సందు చేసుకొని నీవు ,
చందమామ, చల్లగా ! మనవి సేయవే!
ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ
మారుతమా !
చెలియ మనసు తీరు తెలిసి , చెవిలోన
మెల్లగ ! మనవి సేయవే !
1959 లో వచ్చిన " రేచుక్క పగటిచుక్క" అనే జానపద చిత్రంలోని పాట యిది. ఎన్.ఎ.టి. సంస్థ, మరియు, విజయా ప్రొడక్షన్స్ కలసి స్వస్తిశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన భారీ జానపద చిత్రం. ఎన్..టి.ఆర్, జానకి, ఎస్.వి.రంగారావు, కన్నాంబ మొదలగు వారు నటించారు. ఈ సినిమాలో కొన్ని చాలా మంచి పాటలున్నా, సినీమా అపజయం పొందిన కారణంగా పాటలన్నీ కొన్ని దశాబ్దాల పాటు మరుగున పడిపోయాయి. ఈ పాటలకు పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని వందల ఏక గళ గీతాలలో ఈ పాటకు నిశ్చయంగా సముచిత స్థానం ఉంటుంది. ఈ సినీమా లోని పాటలన్ని సముద్రాల రామానుజంగారు రాసారు. టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించారు. కమలాకర కామేశ్వరరావు డైరెక్టర్. టి.వి.రాజుగారు, సముద్రాల జూనియర్ గారు ఎన్.టి.రామారావుగారికి ఆప్తమిత్రులు. రామారావుగారు హీరోగా నటించిన అనేక చిత్రాలకు ఈ ఇద్దరూ కలసి పని చేసేరు.
"మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవిసేయవే" - పాటలో ఆహా, ఓహో అని మెచ్చుకునే సాహిత్యమో, సంగీతమో కనపడదు. పాట మాటలలో సమాసభూయిష్ట పదాడంబరం లేదు. అయినా ఈ పాట శ్రోతల చెవులకు ఇంపుగానే వుంటుంది. అందుకు కారణం కేవలం మృదుమధురమైన, లాలిత్యంతో కూడిన ఘంటసాలవారి ప్రశాంతమైన గానం , సున్నితమైన వాద్యగోష్టి మాత్రమే ఈ పాటను ఆపాతమధురం చేసాయి.
చల్లని వెన్నెల రాత్రిలో ప్రశాంతమైన ఏకాంత వాతావరణం లో కథానాయకుడు తన మనోభావాలను తన ప్రియురాలికి తెలియజెప్పమని చంద్రుడిని, చల్లని పిల్లతెమ్మెరలను అర్ధిస్తూ పాడిన పాట. ఈ అడగడంలో అధికారమో, దర్పమో కనపడదు. సందెవేళ సుందరాంగి వెన్నెట్లో విహరించే సమయంలో "సందు చేసుకొని" అవకాశం చూసుకొని మాత్రమే మనవి చేయమని చందమామను కోరుతున్నాడు. అలాగే, మరో చరణంలో మలయమారుతంతో "ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ, మారుతమా! చెలియ మనసు తీరు తెలిసి, చెవిలోన మెల్లగా మనవి సేయవే అని అడుగుతున్నాడు. మొత్తం మీద ప్రియురాలి మనఃస్థితిని కనిపెట్టి సున్నితంగా ప్రేమ రాయబారం నెరపమని కధానాయకుడు విన్నపం చేస్తున్నాడు. *ఈ విషయాలను ప్రియురాలి సముఖంలో తానెంత సరళంగా, మృదువుగా చెప్పాలని భావిస్తున్నాడో అంత లాలిత్యంగా తన భావాలను వెల్లడిస్తున్నాడు*.
టి.వి.రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు హీరో ఎన్.టి.ఆర్ లో పరకాయ ప్రవేశం చేసి ఈ పాటను అత్యంత మనోహరంగా గానం చేసి ఈ పాటను అజరామరత్వం కల్పించారు. ఈ పాట చివరలో వచ్చే ఆలాపన మనలను చల్లని వెన్నెట్లో హాయిగా ఊయలలూపుతున్న భావన కలిగిస్తుంది. ఈ పాటలో టి.వి.రాజుగారు వైబ్రోఫోన్, ట్యూబోఫోన్, స్పానిష్ గిటార్, వయొలిన్స్, ఫ్లూట్ వంటి వాద్యాలను సముచితమైన రీతిలో ఉపయోగించారు. తెరమీద కధానాయకుని పాత్రలో ఎన్ టి రామారావు నిజంగానే ఓ రాజకుమారిడిలా ఎంతో అందంగా, హుందాగా తన హావభావాలను అలవోకగా ప్రదర్శించారు.
ఈ ఏకగళ ప్రేమగీతాన్ని ప్రత్యేకించి ఏ ఒక్క రాగంలోనో కాక పలు రాగాల ఛాయలు ధ్వనించేలా స్వరపర్చినట్లు తెలుస్తున్నది.
"రేచుక్క పగటిచుక్క" సినీమా ను తెలుగుతో పాటు తమిళంలో కూడా "రాజసేవై" అనే పేరుతో నిర్మించారు. తమిళ వెర్షన్ లో ఈ పాటను సోలోగా కాక ఒక డ్యూయెట్ గా ఎన్.టి.ఆర్, షావుకారు జానకిల మీద చిత్రీకరించారు. తమిళంలో కూడా ఈ పాటను ఘంటసాలగారే పి.సుశీలగారితో కలసి పాడారు.
లలితసంగీత వేదికల మీద ఈ పాట ఈనాటికి పలువురు గాయకుల కంఠస్వరాన వినిపిస్తూ శ్రోతల హర్షధ్వానాలు అందుకుంటునేవుంది. మనసుకు హాయిని, మంచి మూడ్ ను కలిగించే పాట " మనవి సేయవే". ఘంటసాల మాస్టారి కంఠంలో ఇటువంటి ఆణిముత్యాలెన్నో సరియైన ప్రచారం లభించక కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ పాటలన్నింటినీ ఘంటసాలవారి శత జయంతీ ఉత్సవాలలో భాగంగా వెలుగులోకి తీసుకురావలసిన భాధ్యత సంగీతాభిమానులందరి మీద ఉన్నదని భావిస్తున్నాను.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment