ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం 10 వ పాట
"తెల్లవార వచ్చె తెలియకనా సామీ"
రాగం - మోహన
చిత్రం : 'చిరంజీవులు'
తెల్లవార వచ్చె తెలియకనా స్వామి
మళ్ళి పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతు వుండేవు
మారాము చాలింక లేరా .. తెల్లవార వచ్చె...
కలకలమని పక్షిగణములు చెదిరేను
కళ్యాణ గుణధామ లేరా ..
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా ...
నల్లనయ్య రార నను కన్నవాడ
బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా, వెన్న తిందువుగాని రారా ....
తెల్లవార వచ్చె తెలియకనా స్వామి ...
సినీమా లో ఇదొక సుప్రభాత భక్తిగీతం. కధానాయిక ఒక దేవాలయంలో కృష్ణుని పరంగా పాడిన మేల్కొల్పు పాట. ఈ పాటలో మనకు ఒక రాధ, ఒక ఆండాళ్, ఒక యశోద గోచరిస్తారు.
మొదటి పల్లవిలో ఒక ప్రియ సఖి యొక్క మందలింపుతో కూడిన అదలింపు; చరణంలోని 'కళ్యాణ గుణధామ', 'దైవరాయ నిదురలేరా' అనే చోట భక్తురాలి వేడుకోలు ; ఆఖరి చరణంలో 'నల్లనయ్య, 'బుల్లితండ్రి', 'బుజ్జాయి', 'వెన్న తిందువుగాని రారా' వంటి మాటలలో తల్లి మనసు తెలియజేస్తుంది.
కలకలారావాలతో చెదరిపోయే పక్షిగణాలు, ప్రాతఃకాలంలో స్త్రీలంతా మట్టికుండలలో కవ్వాలు పెట్టి పెరుగు చిలకడం వంటి ప్రాచీన సంస్కృతి, వాతావరణం మరల మనకు గుర్తు చేస్తుంది ఈ పాట. ఈనాటి కాంక్రీటు జంగిల్స్ లో వారికి కారు హారన్లు, కిచెన్లలోని మిక్సీ గ్రైండర్ రొదలు తప్ప ఇలాటి సహజ వాతావరణం ఏనాడైనా చూసుంటారా! సందేహమే. అర్ధరాత్రి దాటేవరకు బయట కాలంగడిపి వచ్చేవారికి ప్రాతఃకాలం, సూర్యోదయం, సుప్రభాతం వంటివి తమ అనుభవంలోనివి కావు.
తేట తేట తెలుగు మాటలను సరళమైన రీతిలో ఒక ప్రక్క పసిపిల్లలకు కూడా అర్ధమయ్యేలా, మరొకప్రక్క ఆధ్యాత్మిక భావాలను మనసుకు హత్తుకునేలా వ్రాసారు అసలు సిసలు తెలుగు కవి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు.
ఇంతటి భావయుక్తమైన సుప్రభాత పూజాగీతిని స్వరపర్చడానికి ఘంటసాల మాస్టారు మోహన వంటి సమ్మోహన రాగాన్ని ఎన్నుకొని ఈ భక్తిగీతానికి చిరంజీవత్వం ప్రసాదించారు. మోహన రాగానికి హిందుస్థానీ సంగీతంలో సమాంతర రాగం ' భూప్'. ఈ రెండు రాగాలను సమన్వయపరుస్తూ ఘంటసాలగారు రూపొందించిన అపూర్వగీతం 'తెల్లవార వచ్చె'. ఈ సినీమా వచ్చి 66 సంవత్సరాలైనా ఈ సినీమాలోని పాటలన్నీ నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తున్నాయి.
మోహన రాగం, 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగానికి జన్యం. ఈ రాగంలో ఐదు స్వరాలే పలకడం వలన దీనిని సంగీత సంప్రదాయం లో ఔఢవ రాగం అంటారు. 'సరిగమపదని' అనే సప్తస్వరాలలో 'మ' మధ్యమం, 'ని' నిషాదం అనే రెండు స్వరాలు ఈ రాగంలో వినిపించవు. కేవలం సరిగపద అనే ఐదు స్వరాలతో లాలిత్యంతో కూడిన ముగ్ధమనోహరమైన భక్తిగీతాన్ని స్వరపర్చి ,దానిని తాను పరిపూర్ణంగా అనుభవించి ఆ పాటను నేపధ్యగాయని లీలకు నేర్పి అత్యద్భుతంగా ఆమె చేత పాడించారు.
లీల పాడిన అనేక గీతాలలో ఉత్తమోత్తమైనది , అజరామరత్వం పొందిన భక్తిగీతం 'తెల్లవారవచ్చె'. ఈ పాటలో లీల గళంలోని మార్దవం, ప్రేమ, భక్తి తత్త్వాలు శ్రోతలను పరవశులను చేస్తుంది. ఈ పాటలోని ప్రతీ పదంలో, భావప్రకటనలో ఘంటసాలగారే దర్శనమిస్తారు.
ఈ పాటలో ఘంటసాల మాస్టారు యూనివాక్స్, ట్యూబోఫోన్, బెల్స్, తబలా, వైలిన్స్ వంటి వాద్యాలను చాలా సమర్ధవంతంగా వీనులవిందుగా ఉపయోగించారు.
చిరంజీవులు చిత్రం లోని పాటలు, సంగీతం అన్నీ తెలుగులోని సహజత్వాన్ని సంతరించుకున్నవే. వినోదా పిక్చర్స్ బ్యానర్ మీద డి ఎల్ నారాయణ 'దేవదాసు' , 'కన్యాశుల్కము' సినీమా ల తర్వాత ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడిలతో తీసిన విషాదాంత ప్రేమకధా చిత్రం చిరంజీవులు.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన అపురూప చిత్రం 'చిరంజీవులు' . నటుడిగా ఎన్.టి.రామారావుకు , గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు చిరస్థాయి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన చిత్రం 'చిరంజీవులు'. ఈ చిత్రంలోని అన్ని పాటలు సందర్భోచితంగా, సహజత్వానికి దగ్గరగా తెలుగు వాతావరణం ప్రతిబింబిస్తూ రూపొందాయి.
1948 లో వాడియా ఫిలింస్ నర్గీస్, దిలీప్ కుమార్ లతో 'మేళా' అనే హిందీ సినీమా వచ్చింది. ఆ సినీమా కథ మాత్రమే ఆధారంగా తీసుకొని 1956 లో 'చిరంజీవులు' సినిమాను నిర్మించారు.
చిరంజీవులు చిత్రం లో గుడ్డివాడిగా నటించడానికి ఎన్ టి రామారావు కృత్రిమ కనుగుడ్లు పెట్టుకొని రోజులతరబడి నటించడంతో నిజంగానే ఆయన దృష్టికి నిజంగానే సమస్య ఏర్పడి వైద్యచికిత్స పొందిన తర్వాత కాని సహజస్థితికి రాలేదు. రామారావుగారి కమిట్మెంట్ కు, మొండితనానికి ఒక నిదర్శనం ఈ చిరంజీవులు.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్