Saturday, 2 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 6వ భాగం - అందమె ఆనందం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!



మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఐదవ భాగం ఇక్కడ 


ఘంటసాల - మదిలో సదా మెదిలే సజీవరాగం

6 వ పాట - ' అందమె ఆనందం '

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం!! అందమె!!

పడమట సంధ్యారాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే  మధురానురాగం

పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన సారంగం
సుడిగాలి లో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం !! అందమె!!

              
హీరోయిన్ పాడినది :

" చల్లని సాగర తీరం 
మదిజిల్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగ యోగం !!
అందమె ఆనందం !!

                 
"బ్రతుకు  తెరువు" సినీమా వచ్చింది , నాకు బ్రతుకు తెరువు నిచ్చింది " అని సదా చెప్పుకున్న సముద్రాల రామానుజాచార్యులు వ్రాసిన తొలి సినీ గీతం ఇది. 

ఈ పాట విన్నాక ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనుషుల మనసులు , ప్రేమలు , ద్వేషాలు ఒకేలా ఉంటాయనిపిస్తుంది. 

 సుప్రసిద్ధ ఆంగ్లకవి జాన్ కీట్స్  'ఎండిమియన్"  అనే పద్య కావ్యాన్ని
 "A thing of beauty is a joy forever" 
అనే మాటలతో ప్రారంభిస్తాడు.
ఈ పద్యంలోని ఈ వాక్యాన్ని,
 విలియం షేక్స్పియర్ మాటలు ( "జీవితమే ఒక నాటకరంగం") ను స్ఫూర్తిగా తీసుకొని తన తొలి సినీ గీతాన్ని వ్రాసారు జూనియర్ సముద్రాల.

పాటలో ఒక దగ్గర "సుర నందనవనం మాకందం" అనే మాటను కవి ప్రయోగించగా ఆ మాటకు బదులుగా వేరొక పదం చెప్పమన్నారట సంగీత దర్శకుడు ఘంటసాల. అప్పుడు రామానుజంగారు " జీవితమే ఒక నాటక రంగం" అనే పాదం వ్రాసిచ్చారట".

ఘంటసాలవారు ముందుగా ట్యూన్ కంపోజ్ చేసి తర్వాత దానికి మాటలు వ్రాయగా తయారైన అద్భుతమైన పాట " అందమె ఆనందం ".

ఈ పాటను ఘంటసాలవారు భీంప్లాస్ స్వరాలతో ట్యూన్ కట్టారు. హిందుస్థానీ రాగమైన భీంప్లాస్ కు సమాంతరమైన కర్ణాటక రాగం దేవగాంధారి. ఇదే ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయం లో అభేరి గా పేరు పొందింది.
అభేరి 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ యొక్క జన్యరాగం. 

ఈ భీంప్లాస్ రాగంలో అసంఖ్యకమైన పాటలు వచ్చాయి. అయిన " అందమె ఆనందం" పాట అందమే వేరు. ఈ పాటలోని  మెలడి , రిథిమ్ ఆబాలగోపాలంలో హుషారును , ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి.

 పాట నిర్మాత, దర్శకులకు నచ్చింది.
 సంగీత దర్శకుడి రైమ్ కు రిథిమ్ కు సరిపోయింది.  ఈ పాట రికార్డింగ్ ను అతి తక్కువ కాలంలో అంటే ఏడు గంటల కాలంలో ముగించవలసిన పాటను కేవలం రెండు గంటల లోపుగానే  తాను పాడి ,  లీల చేత పాడించి ముగించారట.

బ్రతుకు తెరువులోని ఈ పాట ఆ కాలపు యువతను ఉర్రూతలూగించింది. అక్షర జ్ఞానం లేని పశులకాపర్ల దగ్గర నుండి కాలేజి ప్రొఫెసర్ల వరకూ అందరూ ఈ పాటనే పాడుకున్నారు.

"అందమె ఆనందం" తన మనసుకు నచ్చిన పాటగా ఈ బ్రతుకు తెరువు కధానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు పలుసార్లు చెప్పడం జరిగింది.

అంతకు మించి ఈ పాట పుట్టి   ఏడు దశాబ్దాలైనా ఇంకా తెలుగు హృదయాలలో పదిలంగా నిత్యనూతనంగా మెదులుతూనే వుంది.

మొదట ఈ సినీమా కు  సి ఆర్ సుబ్బరామన్  సంగీత దర్శకుడు. ఆయన ఒకే ఒక పాట స్వరపర్చారు. కానీ , ఆ తర్వాత ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆయనకు సహాయకుడిగా వున్న ఘంటసాలవారు మిగిలిన పాటలు స్వరపర్చి ముగించారు.

ఈ సినీమా లో ఘంటసాలవారు పాడిన ఏకైక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈ అందమె ఆనందం. ఘంటసాలవారి ప్రతి కచేరీలో  ఆఖరున  విధిగా "అందమె ఆనందం"  పాటే పాడి అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తన కచేరీ ముగించేవారు. 

ఘంటసాలవారి విదేశీ పర్యటనలోకూడా ప్రతీ కచేరీలో ఈ పాట పాడారంటే అందమె ఆనందం ఆయనకు ఎంతిష్టమో అర్ధమవుతుంది.

సినీమాలో ఈ పాట రెండుసార్లు ఘంటసాల , పి.లీల గళాలలో విన వస్తుంది.  పియానో వాయిస్తూ మొదట హీరో అక్కినేని , తర్వాత హీరోయిన్ సావిత్రి ఈ పాటను ఆలపిస్తారు.

ఈ పాటకోసం పియోనా , ఫ్లూట్ , క్లారినెట్ ,వైలిన్స్,  స్పానిష్ గిటార్ , తబల , డోలక్ వంటి వాద్యాలు ఉపయోగించారు. ఈ పాట ఘంటసాలవారి గళంలో ఎంతో శ్రావ్యంగా తేలియాడింది. ముఖ్యంగా ఈ పాటలోని హమ్మింగ్స్ మనసుకు హాయిని , పరవశత్వాన్ని కలుగజేస్తాయి.

 ఈ సినీమా ను తమిళంలో డబ్ చేసినప్పుడు కూడా ఈ పాట చాలా హిట్టయింది.

బ్రతుకు తెరువు కు దర్శకుడు భరణీ రామకృష్ణ గారు. నిర్మాత - కోవెలమూడి భాస్కరరావుగారు.  భాస్కరరావు గారు , ఘంటసాలవారు మంచి మిత్రులు.

ఈ సినీమా తర్వాత భాస్కరరావు గారు వరసగా తీసిన ఐదారు చిత్రాలకు ఘంటసాలవారే సంగీత దర్శకుడు.

 1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు'  కధ హిందీలో  జితేంద్ర ,తనూజ , సంజీవ్ కుమార్  లతో 
" జీనే కి రాహ్ "గా,  తమిళంలో ఎమ్జియార్ , కె ఆర్ విజయ , కాంచన లతో 'నాన్ ఏన్  పిరన్దేన్'  గా వచ్చి విజయం పొందింది.

ఇదే కధను  మళ్ళీ పి ఎ పి సుబ్బారావు మరల 1972 లో తెలుగులో ' భార్యాబిడ్డలు' గా నిర్మించగా అక్కినేని , జయలలిత , కృష్ణకుమారి నటించారు.

కెవిమహాదేవన్ సంగీతదర్శకత్వంలో వచ్చిన ఈ సినీమా లో ఘంటసాల మాస్టారు సోలోలు , డ్యూయెట్లు కలిపి ఆరు పాటలు పాడారు.

కథాకథనం బాగుంటే ఆ సినీమా , ఆ సినీమా లోని పాటలు కలకాలం గుర్తుండిపోతాయనడానికి 'బ్రతుకు తెరువు' ఒక నిదర్శనం. 

మదిలో సదా మెదిలే ఘంటసాలవారి మరో సజీవ రాగంతో మళ్ళీ వచ్చే ఆదివారం ...

💐🙏ప్రణవ స్వరాట్🙏💐

అందమె ఆనందం - ఘంటసాల


అందమె ఆనందం - పి. లీల ఆలాపన


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...