నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నది...
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు నాలోన కలిగించింది... నిన్న!!
మరచిపోలేను ఆ చూపు ఏనాటికీ
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటీ
తలచుకొనగానే ఏదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు
నాచేత పాడించింది..... నిన్న!!
సొగసు కనులారా చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించే ఇంపారగా
నడచిపోయింది ఎంతో నాజూకుగా
విడచి మనజాలను విరహతాపాలు
మోహాలు రగిలించింది... నిన్న !!
ప్రేమ అనే రెండక్షరాలు కలిగించే మత్తు, మహిమ అంతా ఇంతాకాదు. తొలిసారిగా ప్రేమలో పడినవాడికి ఎటువంటి మధురానుభూతులు కలిగిస్తాయో ఈ పాట చెపుతుంది. ప్రేమ మైకంలో ఉన్నవాడికి కనిపించే ప్రతీ మగాడు తన ప్రేయసిలాగే కనిపిస్తాడు. ఆ పరవశత్వంలో తానేంజేసేది తనకే తెలియనంత మోహంలో మునిగిపోతాడు. సాలూరి వారు ,ఘంటసాలవారు కలసి ఆపాతమధురాలెన్నో సృష్టించారు. అలాగే ఆరుద్ర , ఘంటసాల కాంబినేషన్లో కూడా ఆణిముత్యాలవంటి పాటలు అనేకం మనలను రంజింపజేసాయి.
పదకర్త ఆరుద్రగారికి, స్వరకర్త సాలూరి రాజేశ్వరరావుగారికి, గాత్ర ప్రదాత ఘంటసాలవారికి మైలురాయిలా, కలికితురాయిలా నిలిచిపోయే మధుర విరహగీతం, 'రాణీ రత్నప్రభ' చిత్రంలోని "నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నది... "
ఏపాటనైనా మృదువుగా, భావయుక్తంగా హృదయాలను తాకి మైమరపించేలా స్వరపర్చడంలో సిధ్ధహస్తుడు రసాలూరించే రాజేశ్వరరావు గారు. భీంప్లాస్, ఖరహరప్రియ ఈ రెండు చాలా సుప్రసిద్ధ రాగాలు కర్ణాటక సంగీతంలోని అభేరి హిందుస్తానీ సంగీతంలో భీంప్లాస్. అలాగే, హిందుస్తానీ కాపి రాగం కర్నాటక సంగీతంలో ఖరహరప్రియ. ఈ రాగాలు రెండింటిని మిళితం చేసి రాజేశ్వరరావుగారు రూపొందించిన ఈ అద్భుతమైన ఏకగళ గీతానికి ఘంటసాలవారి గాత్రంలోని గమకాల మాధుర్యం, మాటల విరుపులు, భావ గాంభీర్యం మరింత నిండుదనాన్ని, హుందాతనాన్ని చేకూరిస్తే తెరమీద ఎన్.టి.రామారావుగారి అద్భుత హావభావాలు ఈ పాటకు శాశ్వతత్వాన్ని చేకూర్చింది.
పాట పల్లవి మొదలు, చరణాలంతం వరకు ఆరుద్రగారు అల్లిన సొంపైన , ఇంపైన సుమాక్షరాలు శ్రోతల హృదయాలలో మల్లెలు పూయిస్తుంది. మూగకోరికలేవేవో రేకెత్తిస్తుంది. పాట ఆద్యంతమూ రాజేశ్వరరావుగారి బాణీ మనలను పరవశింపజేస్తుంది. ఈ పాటలో పియోనా, ఫ్లూట్, క్లారినెట్ వంటి మరెన్నో వాద్యాలున్నా వాటన్నింటికీ మిన్నగా పిఠాపురం సత్యం (షెహనాయ్ సత్యం) గారి షెహనాయ్ వాద్యమే సంగీతాభిమానులకు పులకరింతలు కలిగిస్తుంది.
మహారాజు స్వగతంలా సాగే ఈ విరహగీతంలో హీరో ఎన్.టి.రామారావు , హీరోయిన్ అంజలీ దేవి, విదూషకులు రేలంగి, సీతారాం, మంత్రి సి.ఎస్.ఆర్.,లు కూడా కనిపించి ప్రేక్షకులంతా మనసారా హాయిగా నవ్వుకునేలా ఒక్కింత హాస్యాన్ని కూడా జోడించారు. బి ఎ సుబ్బారావు నిర్మాణ, దర్శకత్వంలో 1960 మే నెలలో విడుదలైన 'రాణి రత్నప్రభ' మంచి విజయాన్నే సాధించింది.
ఈ సినీమా లో హీరో ఎన్.టి.ఆర్ కు ఘంటసాలగారు పాడింది ఈ ఒక్క పాటే. కానీ రేలంగి పాత్రకు మూడు పాటలు పాడి తన గాత్ర వైవిధ్యాన్ని నిరూపించారు ఘంటసాల.
కలకాలం గుర్తుండిపోయే ఘంటసాలవారి ఆహ్లాదకరమైన గీతం "నిన్న కనిపించింది నన్ను మురిపించింది" పాట.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment