Saturday, 30 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 10 వ భాగం - తెల్లవార వచ్చె తెలియక నా సామీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొమ్మిదవ భాగం ఇక్కడ 

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 10 వ పాట  

"తెల్లవార వచ్చె తెలియకనా సామీ"
రాగం -  మోహన 
చిత్రం :  'చిరంజీవులు'

తెల్లవార వచ్చె తెలియకనా స్వామి
మళ్ళి పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతు వుండేవు
మారాము చాలింక లేరా .. తెల్లవార వచ్చె...

కలకలమని పక్షిగణములు చెదిరేను
కళ్యాణ గుణధామ లేరా ..
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా ...

నల్లనయ్య రార నను కన్నవాడ
బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా, వెన్న తిందువుగాని రారా ....
తెల్లవార వచ్చె తెలియకనా స్వామి ...

సినీమా లో ఇదొక సుప్రభాత భక్తిగీతం. కధానాయిక ఒక దేవాలయంలో కృష్ణుని పరంగా పాడిన మేల్కొల్పు పాట. ఈ పాటలో మనకు ఒక రాధ, ఒక ఆండాళ్, ఒక యశోద గోచరిస్తారు. 

మొదటి పల్లవిలో ఒక ప్రియ సఖి యొక్క మందలింపుతో కూడిన అదలింపు; చరణంలోని 'కళ్యాణ గుణధామ', 'దైవరాయ నిదురలేరా' అనే చోట భక్తురాలి వేడుకోలు ; ఆఖరి చరణంలో 'నల్లనయ్య, 'బుల్లితండ్రి', 'బుజ్జాయి', 'వెన్న తిందువుగాని రారా' వంటి మాటలలో తల్లి మనసు తెలియజేస్తుంది.

కలకలారావాలతో చెదరిపోయే పక్షిగణాలు, ప్రాతఃకాలంలో స్త్రీలంతా మట్టికుండలలో కవ్వాలు పెట్టి పెరుగు చిలకడం వంటి ప్రాచీన సంస్కృతి, వాతావరణం మరల మనకు గుర్తు చేస్తుంది ఈ పాట. ఈనాటి కాంక్రీటు జంగిల్స్ లో వారికి కారు హారన్లు, కిచెన్లలోని మిక్సీ గ్రైండర్ రొదలు తప్ప ఇలాటి సహజ వాతావరణం ఏనాడైనా చూసుంటారా! సందేహమే. అర్ధరాత్రి దాటేవరకు బయట కాలంగడిపి వచ్చేవారికి ప్రాతఃకాలం, సూర్యోదయం, సుప్రభాతం వంటివి తమ అనుభవంలోనివి కావు. 

తేట తేట తెలుగు మాటలను సరళమైన రీతిలో  ఒక ప్రక్క పసిపిల్లలకు కూడా అర్ధమయ్యేలా, మరొకప్రక్క ఆధ్యాత్మిక భావాలను మనసుకు హత్తుకునేలా వ్రాసారు అసలు సిసలు తెలుగు కవి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు.

ఇంతటి భావయుక్తమైన సుప్రభాత పూజాగీతిని స్వరపర్చడానికి ఘంటసాల మాస్టారు మోహన వంటి సమ్మోహన రాగాన్ని ఎన్నుకొని ఈ భక్తిగీతానికి చిరంజీవత్వం ప్రసాదించారు. మోహన రాగానికి హిందుస్థానీ సంగీతంలో సమాంతర రాగం ' భూప్'.  ఈ రెండు రాగాలను సమన్వయపరుస్తూ ఘంటసాలగారు రూపొందించిన అపూర్వగీతం 'తెల్లవార వచ్చె'. ఈ సినీమా వచ్చి 66 సంవత్సరాలైనా ఈ సినీమాలోని పాటలన్నీ నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తున్నాయి.

మోహన రాగం, 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగానికి జన్యం. ఈ రాగంలో ఐదు స్వరాలే పలకడం వలన దీనిని సంగీత సంప్రదాయం లో ఔఢవ రాగం అంటారు. 'సరిగమపదని' అనే సప్తస్వరాలలో 'మ' మధ్యమం, 'ని' నిషాదం అనే రెండు స్వరాలు ఈ రాగంలో వినిపించవు. కేవలం సరిగపద అనే ఐదు స్వరాలతో లాలిత్యంతో కూడిన ముగ్ధమనోహరమైన భక్తిగీతాన్ని స్వరపర్చి ,దానిని తాను పరిపూర్ణంగా అనుభవించి ఆ పాటను  నేపధ్యగాయని లీలకు నేర్పి అత్యద్భుతంగా ఆమె చేత పాడించారు.

లీల పాడిన అనేక గీతాలలో ఉత్తమోత్తమైనది , అజరామరత్వం పొందిన భక్తిగీతం  'తెల్లవారవచ్చె'. ఈ పాటలో లీల గళంలోని మార్దవం, ప్రేమ, భక్తి తత్త్వాలు శ్రోతలను పరవశులను చేస్తుంది. ఈ పాటలోని ప్రతీ పదంలో, భావప్రకటనలో ఘంటసాలగారే దర్శనమిస్తారు.

ఈ పాటలో ఘంటసాల మాస్టారు యూనివాక్స్, ట్యూబోఫోన్, బెల్స్, తబలా, వైలిన్స్ వంటి వాద్యాలను చాలా సమర్ధవంతంగా వీనులవిందుగా ఉపయోగించారు.

చిరంజీవులు చిత్రం లోని పాటలు, సంగీతం అన్నీ  తెలుగులోని సహజత్వాన్ని సంతరించుకున్నవే. వినోదా పిక్చర్స్ బ్యానర్ మీద డి ఎల్ నారాయణ 'దేవదాసు' , 'కన్యాశుల్కము' సినీమా ల తర్వాత ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడిలతో తీసిన విషాదాంత ప్రేమకధా చిత్రం చిరంజీవులు.

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన అపురూప చిత్రం 'చిరంజీవులు' . నటుడిగా ఎన్.టి.రామారావుకు , గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు చిరస్థాయి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన చిత్రం 'చిరంజీవులు'. ఈ చిత్రంలోని అన్ని పాటలు సందర్భోచితంగా, సహజత్వానికి దగ్గరగా తెలుగు వాతావరణం ప్రతిబింబిస్తూ రూపొందాయి.

1948 లో వాడియా ఫిలింస్ నర్గీస్, దిలీప్ కుమార్ లతో 'మేళా' అనే హిందీ సినీమా వచ్చింది. ఆ సినీమా కథ మాత్రమే ఆధారంగా తీసుకొని 1956 లో  'చిరంజీవులు' సినిమాను నిర్మించారు. 

చిరంజీవులు చిత్రం లో గుడ్డివాడిగా నటించడానికి ఎన్ టి రామారావు కృత్రిమ కనుగుడ్లు పెట్టుకొని రోజులతరబడి నటించడంతో నిజంగానే ఆయన దృష్టికి నిజంగానే సమస్య ఏర్పడి వైద్యచికిత్స పొందిన తర్వాత కాని సహజస్థితికి రాలేదు. రామారావుగారి కమిట్మెంట్ కు, మొండితనానికి ఒక నిదర్శనం ఈ చిరంజీవులు.







వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్



Saturday, 23 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 9 వ భాగం - రాజా మహారాజా రవికోటి విభ్రాజ సురలోక పూజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనిమిదవ భాగం ఇక్కడ 

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 9వ పాట  

" రాజా మహారాజా
రవికోటి విభ్రాజ సురలోక పూజా"
రాగం : హుసేనీ

రాజా మహరాజా - 2
రవికోటి విభ్రాజ సురలోక పూజా 
రాజా మహరాజా - 2

తేజోవికారా దివ్యమంగళహారా -2
శ్రీకర సదయా మానస నిలయా - 2
రాజా మహారాజా 

మానిష శుభగుణ సాధుజనావనా-2
భక్తజనాళి కనవే కరుణా -2
పావనభావా దేవనాయకదీవా
కావవె కరుణా దేవాధిదేవా

రాజా మహరాజా రవికోటి విభ్రాజ సురలోక పూజా - 2
తేజో వికారా ... స్వరకల్పనలు
తేజోవికారా దివ్యమంగళహారా.... "


1952 లో విడుదలైన 'టింగు రంగా'  అనే సినీమా లోనిది ఈ మధురగానం. నిర్మాత పి.ఎస్.శేషాచలం చెట్టియార్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన చిత్రం ఇది. తెలుగులో 'టింగు రంగా' పేరుతో తమిళంలో 'శ్యామల' అనే పేరుతో ఈ జానపద చిత్రాన్ని 1952 లో విడుదల చేశారు. 

తెలుగు వారందరికీ చిరపరిచితుడైన బి ఎ సుబ్బారావు రెండు భాషల్లోనూ దర్శకుడు.  అలాగే, ఎస్.వరలక్ష్మి తెలుగు తమిళాలలో హీరోయిన్. రేలంగి , కనకం, కూడా ఉన్నారు. తెలుగు వెర్షన్ హీరోగా మంత్రవాది శ్రీరామమూర్తి, తమిళ చిత్రంలో ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ హీరోలు. త్యాగరాజ భాగవతార్ నట గాయకుడు. ఆ కాలపు సూపర్ స్టార్.

ఈ శ్యామల టింగు రంగా చిత్రానికి జి.రామనాధన్, టి.వి.రాజు, ఎస్.బి.దినకర్ రావు సంగీత దర్శకులు.  ఆదినారాయణ రావుకు సహాయకుడైన టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'టింగు రంగా'. ఈ చిత్రంలోని పాటలన్నీ తాపీ ధర్మారావు నాయుడు వ్రాశారు.


జి రామనాధన్ తమిళంలో చేసిన పాటనే తెలుగులో కూడా ఉపయోగించారు.  ఈ శాస్త్రీయ గీతాన్ని హుసేనీ రాగంలో స్వరపర్చారు రామనాధన్.  హుసేనీ రాగం 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ రాగ జన్యం.  ఈ హుసేనీరాగంలో సద్గురు త్యాగరాజస్వామి , ముత్తుస్వామి దీక్షితర్,స్వాతి తిరునాళ్ కొన్ని కీర్తనలు రచించారు. సద్గురు త్యాగరాజస్వామి వారి  దివ్యనామ కీర్తనలు కొన్ని హుస్సేనీ రాగంలో చేసినవే. 

టింగు రంగాలో ఈ పాటను  మొదట్లో ఎవరిచేత పాడించాలనే మీమాంస,తర్జనభర్జనలు జరిగాయట . ఎవరైనా  తమిళ శాస్త్రీయ సంగీత విద్వాంసుడి చేత  పాడించాలనే భావనలో కూడా ఉన్నారు. అప్పుడు, ఘంటసాల కర్ణాటక సంగీత నేపథ్యం తెలిసిన టి.వి.రాజు చొరవ తీసుకొని ఈ పాటను ఘంటసాలగారి చేత పాడిద్దామని పట్టుపట్టి నిర్మాతను ఒప్పించారు. పాట అనితరసాధ్యంగా రూపొందింది. ఈ గీతంలో ఘంటసాలవారి గళం శుధ్ధ శాస్త్రీయ పద్ధతిలోనే సాగింది. ఇందులోని సంగతులు, గమకాలు, స్వరకల్పనలు రాగ, భావ, తాళాల మీద  పూర్తి అవగాహన, తగినంత ఆధిపత్యం కలవారు మాత్రమే సంగీత రసజ్ఞుల ప్రశంసలు పొందే విధంగా గానం చేయగలుగుతారు. టి.వి.రాజుగారు తన మీద ఉంచిన నమ్మకానికి  నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చి టి.వి.రాజు  సంగీత భవిష్యత్ కు దోహదం చేశారు ఘంటసాల.

కధానాయిక వీణ వాయిస్తూండగా, ఎదురుగా కూర్చొని హీరో పాడే పాట ఇది. పూర్తి కర్ణాటక సంగీత బాణి. వీణ పాటలలో ఉత్తమ గీతంగా చెప్పుకోవచ్చు. రెండు చరణాల తరువాత వచ్చే స్వరకల్పనలే ఈ పాటకు జీవం. ఈ పాటలో పక్క వాద్యాలు గా వీణ, మృదంగం, ఘటం, మోర్సింగ్ లు సలక్షణంగా వినిపిస్తాయి.

ఘంటసాలవారు పూర్తి శాస్త్రీయ బాణీలో పాడిన ప్రప్రథమ గీతం " రాజా మహారాజా". దురదృష్టవశాత్తు ఈ సినిమా కానీ, ఇందులోని పాటలు కానీ యూట్యూబ్ లో లేవు.  కానీ తమిళంలో వచ్చిన "శ్యామల" సినీమా, కొన్ని పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి.

ఘంటసాలగారు ఈ పాట  పాడిన ఆరేళ్ళ తర్వాత  వచ్చినవే జయభేరిలోని 'రసికరాజా'  లేదా 'మదిశారదా దేవి మందిరమే', ఆ తరువాత వచ్చిన జగదేకవీరుని కథ లోని 'శివశంకరీ శివానంద లహరి' మొదలగు పాటలు.
 
సరియైన ప్రచారంలేకనో,  లేక సినీమా విజయవంతం కాకనో ఒక అద్భుతమైన గీతాన్ని సంగీతాభిమానులు నిర్లక్ష్యం చేశారు. ఘంటసాలవారి  కర్ణాటక సంగీత ప్రతిభకు,  గాన వైదుష్యానికి మచ్చుతునక ఈ పాట.

ఘంటసాలగారు  ఈ పాటను తనకంటే చాలా పట్టుగా, శాస్త్రబధ్ధంగా, ఉన్నతంగా పాడారని, తమిళంలో ఈ పాట పాడిన త్యాగరాజ భాగవతార్ ఘంటసాలవారిని మనఃపూర్వకంగా అభినందించారట.

కనీసం ఇప్పుడైనా మన గాయకులు ఈ పాటకు సరియైన గౌరవము, స్థానము కల్పించి తమ సంగీత కార్యక్రమాలలో గానం చేస్తారని ఆశిస్తాను.

ఇప్పుడు, ఘంటసాలవారి ఆలాపనలో 
" రాజా మహరాజా " విందాము.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday, 16 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 8వ భాగం - దేవీ శ్రీదేవీ మొరలాలించి పాలించి నన్నేలినావే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏడవ భాగం ఇక్కడ 

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 8వ పాట  
'దేవీ శ్రీదేవీ మొరలాలించి పాలించి నన్నేలినావే'
చిత్రం : సంతానం - 1955.

అనిశెట్టి రచన 
సుసర్ల దక్షిణామూర్తి సంగీతం
                     

దేవీ శ్రీదేవీ ....
మొరలాలించి పాలించి నన్నేలినావే !! దేవీ !!

మదిలో నిన్నే మరువను దేవీ
నీ నామ సంకీర్తనే నే జేసెద !! దేవీ!!

నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించరావే
ఇలదేవతగా వెలసితివీవే
ఈడేరె నా కోర్కెలీనాటికీ
దేవీ.... శ్రీదేవీ...

                 

భక్తిగీతంలా ఉండే ఈ పాట రక్తిని కలిగించేదే. కొంత స్వయంప్రతిభ, అంతకు మించిన మాటకారితనం, పాటకారితనంతో ఒక ధనవంతుని, ఆతని కుమార్తెల సానుభూతిని, ఆదరణను సంపాదించి వారింట్లో స్థానం సంపాదించుకున్న హీరో అక్కినేని, హీరోయిన్ సావిత్రి ని ఉద్దేశించి  పాడిన పాట "దేవీ శ్రీదేవీ". తలుపుకు ఒకవేపు వంటలవాడిగా హీరో, తలుపుకు మరొక ప్రక్క హీరోయిన్. వీరిరువురి మధ్య ఈ మనోరంజకమైన పాట. పాట పూర్తయేసరికి పొయ్యి మీది పాలు పొంగిపోయి ఉంటాయి. దృశ్యం చూడకుండా, కేవలం పాటను మాత్రమే వినేవారికి ఇదొక శాస్త్రీయ భక్తి గీతంలా తోస్తుంది.

అనిశెట్టిగారు వ్రాసిన గీతాన్ని సుసర్ల దక్షిణామూర్తిగారి సుసంపన్న స్వరాలతో ఘంటసాలగారు ఈ పాటను అత్యద్భుతంగా, మహా శాస్త్రోక్తంగా గానం చేసారు.  ఘంటసాల మాస్టారి 3-1/2 ఆక్టేవ్ ల గాత్ర పటిమ ఈ పాటలో అనితరసాధ్యంగా నిరూపితమయింది. ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత సాధన ఈ గీతాన్ని ఆలపించడంలో ఎంతో ఉపకరించింది.

పాట మధ్యలో వచ్చే ఆలాపనలు, సంగతులు, 'ఇలదేవతగా వెలసితివీవే' అనే పదాన్ని తారస్థాయిలో ఏమాత్రం గాంభీర్యం, స్థాయి తగ్గకుండా మాస్టారు పాడిన విధానం గగుర్పాటును, పరవశత్వాన్ని కలుగజేస్తాయి. ఈ పాటను వింటూంటే ఏదో సంగీత కచేరీ వింటున్న అనుభూతి కలుగుతుంది. దానికి తగినట్లుగా ఈ పాటకు వీణ, వైలిన్స్, మృదంగం, ఘటం, మోర్సింగ్  లను పక్క వాద్యాలుగా ఉపయోగించి దక్షిణామూర్తి ఈ పాటకు శుధ్ధ శాస్త్రీయతను ఆపాదించారు.

సుసర్ల దక్షిణామూర్తి గారు ఈ పాటను షణ్ముఖప్రియ రాగంలో స్వరపర్చారు. కర్ణాటక సంగీతానికి చెందిన ఈ రాగం 56వ మేళకర్త, సంపూర్ణరాగంగా ప్రసిధ్ధిపొందింది. పరమేశ్వరునికి, షణ్ముఖునికి సంబంధించిన అనేక భక్తి గీతాలు, కీర్తనలు ఈ షణ్ముఖప్రియ ప్రియ రాగంలో మలచబడ్డాయి.

సంతానం సినీమాలోని పాటలన్ని ఆపాతమధురాలే. లతామంగేష్కర్ పాడిన మొట్టమొదటి తెలుగు పాట ' నిదురపోరా తమ్ముడా', మాస్టారు పాడిన ' చల్లని వెన్నెలలో', పాండవోద్యోగవిజయాలులోని కొన్ని పద్యాలు  67 ఏళ్ళ తర్వాత కూడా ఈనాటికీ నిత్యనూతనంగా సంగీతప్రియులను అలరిస్తున్నాయంటే ఆ పాటలకు ఉన్న విలువ అర్ధమవుతుంది.

ఘంటసాలవారి గానమాధుర్యానికి మచ్చుతునక ' దేవీ శ్రీదేవీ'.

ఎస్.వి.రంగారావు, రేలంగి, శ్రీరంజని, చలం, అమర్నాథ్, కుసుమ, రమణారెడ్డి, మొదలగువారు నటించారు.

సాధనా ఫిలింస్ సి.వి.రంగనాధ దాస్ దర్శక, నిర్మాణంలో రూపొందిన అద్భుత కుటుంబ గాథా చిత్రం ' సంతానం'.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్




Saturday, 9 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 7వ భాగం - ఏడుకొండలవాడా వేంకటా రమణా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఆరవ భాగం ఇక్కడ 

 ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం7 వ పాట -
' ఏడుకొండలవాడా వేంకటా రమణా '

( ఘంటసాలవారి స్వరరచనలో పి.లీల పాడిన పాట)

ఏడుకొండలవాడా వెంకటా రమణా
సద్దు సేయక నువు నిద్దురపోవయ్యా

పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపులుగా
కనులనొలికె వలపు పన్నీటిజల్లుగా
అన్ని అమరించె నీ అలివేలుమంగా 
!!ఏడు కొండలవాడా!!

మా పాలి దైవమని నమ్ముకున్నామయ్యా
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్యా
చాటుచేసుకు ఎటులో చెంత చేరెదనయ్యా

ఏడు కొండలవాడా వెంకటా రమణా
సద్దు శాయక... దొంగా....
నిదురపోవయ్యా ....!!ఏడుకొండలవాడా!!

                   

"ఏడు కొండలవాడా
వెంకటా రమణా
సద్దు సాయక నీవు
నిదుర పోవయ్యా"

ఈ పాట వినగానే ఆలయాలలో భగవంతునికి సలిపే ఏకాంతసేవలో ఆలపించే భక్తిగీతమేమో అనే భావన మనలో కలుగుతుంది. 

కానీ ఈ పాట  ఫక్తు హాస్యరస ప్రధాన కుటుంబ గాధా చిత్రం 'పెళ్ళిచేసి చూడు' సినీమాలో భార్యభర్తల మధ్య నడిచే సున్నితమైన శృంగారానికి ప్రతీకగా ఉంటుంది.

పాట వినగానే ఇది ఏ రాగమో తెలిసిపోతుంది. భక్తి , కరుణరస ప్రధానమైన రాగం. అదే చక్రవాక రాగం. కర్ణాటక సంగీత మేళకర్త రాగాలలో  16వ మేళకర్త రాగం. ఈ రాగానికి జన్య రాగాలుగా  మలయమారుతం , వలజి మొదలైన రాగాలను చెప్పుకోవచ్చును. సంగీత ముమూర్తులలో ప్రముఖుడైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి సంప్రదాయంలో ఈ రాగాన్ని  తోయవేగవాహిని అని అంటారట. హిందుస్థానీలో చక్రవాకానికి సరిపోలిన రాగం అహిర్ భైరవి.

ఘంటసాలవారు పెళ్ళిచేసి చూడు సినిమాలో మొదటిసారిగా చక్రవాక రాగాన్ని లలిత సంగీత ప్రియులకు పరిచయం చేశారు. అంతకు పూర్వం దక్షిణాది సినీమాలలో చక్రవాక రాగాన్ని ఏ సంగీతదర్శకుడు ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని సుప్రసిధ్ధ రచయిత, సంగీతప్రియుడు అయిన  శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు తమ వ్యాసాలలో ధృవీకరించారు.

పెళ్ళిచేసి చూడు సినీమాలో ఏకాంత సమయంలో రాత్రిపూట కధానాయిక, తన  మనోనాయకుని (రమణ) నిద్రపుచ్చే ప్రయత్నంగా ఏడుకొండలవాడి పరంగా ఈ పాటను ఎంతో మధురంగా, లలిత శృంగార భావాలు కురిపిస్తూ ఆలపిస్తుంది. శ్లేషార్ధాలు ధ్వనింపజేస్తూ పింగళివారు వ్రాసిన ఈ భక్తి, శృంగారగీతాన్ని ఘంటసాల మాస్టారు అత్యద్భుతంగా స్వరపర్చి పి.లీల చేత పాడించారు.

ఆరుబయట పండు వెన్నెల రాత్రిలో అల్లరిచేసే భర్తను నిద్రపుచ్చడానికి భార్య చేసే ప్రయత్నం లో ఈ గీతం ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. నాయికని అలిమేలు మంగగాను, ఆమె భర్త రమణను ఏడుకొండల వెంకట రమణగానూ, మామగారిని బీబి నాంచారమ్మగానూ పోలుస్తూ గీత రచయిత పింగళి నాగేంద్రరావుగారు చేసిన రచనా చమత్కృతి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది.

"పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపులుగా
కనులనొలికె వలపు పన్నీటిజల్లుగా
అన్ని అమరించె నీ అలివేలుమంగా"

ఎంతటి మధురమైన భావన. పింగళివారి లాలిత్యంతో కూడిన పదాలకు ఘంటసాలవారి అమృతతుల్యమైన స్వరరచన ఈ శృంగార భక్తిగీతానికి అజరామరత్వం కల్పించింది. పాట పాడింది పి. లీలే అయినా అణువణువునా ఘంటసాలవారే గోచరిస్తారు. తెలుగు భాషతో పరిచయంలేని మలయాళ గాయని పి.లీల చేత  ప్రతీ పదాన్ని అంత భావయుక్తంగా, సుస్పష్టంగా పలికించడంలో ఘంటసాలవారి కృషి, ప్రతిభ గోచరిస్తుంది. శాస్త్రీయ రాగాలను లలితగీతాలుగా మలచినప్పుడు ఏ మాటను ఎలా పలకాలో, గమకాలను ఎంతవరకు ఉపయోగించాలో, ఆ రాగభావాన్ని ఎంత సున్నితంగా, శ్రావ్యంగా ప్రయోగించాలనే విషయంలో ఘంటసాలవారిని మించిన సంగీత దర్శకుడు మరొకరు లేరంటే అది అతిశయోక్తి కాదు.

చక్రవాక రాగంలో చేసిన ఈ 'ఏడుకొండలవాడా వెంకట రమణ' పాటలో నేపధ్య సంగీతానికి వీణ, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను మాత్రమే ఘంటసాల మాస్టారు ఉపయోగించారు.


ఏడుకొండలవాడి సాక్షిగా ఈ పాట ఏనాటికీ ఆపాతమధురమే. అపురూప, అపూర్వగీతమే. దృశ్యపరంగా కాకుండా కేవలం  పాటగా విన్నప్పుడు ఇదొక భక్తి పరమైన ఏకాంతసేవ గీతంగా తోస్తుంది.

ముందు ఈ పాటను జిక్కితో పాడించారు. అది గ్రామఫోన్ రికార్డ్ గా కూడా వచ్చింది. తరువాత,  ఎందుకనో పాట అనుకున్నంత ఎఫెక్ట్ తో రాలేదన్న భావన స్వరకర్త, దర్శక నిర్మాతలకు కలిగి మరల ఆ పాటను లీలతో పాడించి షూటింగ్ ముగించారు. పాట గొప్ప హిట్టయింది. 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట నిత్యనూతనంగా సజీవరాగంగా సంగీతాభిమానులకు పరవశత్వం కలిగిస్తూనే ఉంది.

ఘంటసాలవారి  శాస్త్రీయ సంగీత ప్రతిభకు ఒక మచ్చు తునక ఈ సుశ్రావ్య గీతం.

సినీమా లో ఈ పాటను జి.వరలక్ష్మి, ఎన్.టి.రామారావు, డా.శివరామకృష్ణయ్య, బాలకృష్ణల మీద చిత్రీకరించారు. 

ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు, సావిత్రి, జోగారావు, సూర్యకాంతం, పుష్పలత, దొరస్వామి, డా.శివరామకృష్ణయ్య, మొదలగువారు నటించిన ఈ చిత్రం బాలలను, పెద్దలను కూడా అలరించిన చక్కని కుటుంబగాధా చిత్రం. డైరక్టర్ ఎల్.వి.ప్రసాద్. నాగిరెడ్డి- చక్రపాణి లు నిర్మాతలు. ఇది ఒక విజయావారి చిత్రం.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్




Saturday, 2 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 6వ భాగం - అందమె ఆనందం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!



మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఐదవ భాగం ఇక్కడ 


ఘంటసాల - మదిలో సదా మెదిలే సజీవరాగం

6 వ పాట - ' అందమె ఆనందం '

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం!! అందమె!!

పడమట సంధ్యారాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే  మధురానురాగం

పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన సారంగం
సుడిగాలి లో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం !! అందమె!!

              
హీరోయిన్ పాడినది :

" చల్లని సాగర తీరం 
మదిజిల్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగ యోగం !!
అందమె ఆనందం !!

                 
"బ్రతుకు  తెరువు" సినీమా వచ్చింది , నాకు బ్రతుకు తెరువు నిచ్చింది " అని సదా చెప్పుకున్న సముద్రాల రామానుజాచార్యులు వ్రాసిన తొలి సినీ గీతం ఇది. 

ఈ పాట విన్నాక ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనుషుల మనసులు , ప్రేమలు , ద్వేషాలు ఒకేలా ఉంటాయనిపిస్తుంది. 

 సుప్రసిద్ధ ఆంగ్లకవి జాన్ కీట్స్  'ఎండిమియన్"  అనే పద్య కావ్యాన్ని
 "A thing of beauty is a joy forever" 
అనే మాటలతో ప్రారంభిస్తాడు.
ఈ పద్యంలోని ఈ వాక్యాన్ని,
 విలియం షేక్స్పియర్ మాటలు ( "జీవితమే ఒక నాటకరంగం") ను స్ఫూర్తిగా తీసుకొని తన తొలి సినీ గీతాన్ని వ్రాసారు జూనియర్ సముద్రాల.

పాటలో ఒక దగ్గర "సుర నందనవనం మాకందం" అనే మాటను కవి ప్రయోగించగా ఆ మాటకు బదులుగా వేరొక పదం చెప్పమన్నారట సంగీత దర్శకుడు ఘంటసాల. అప్పుడు రామానుజంగారు " జీవితమే ఒక నాటక రంగం" అనే పాదం వ్రాసిచ్చారట".

ఘంటసాలవారు ముందుగా ట్యూన్ కంపోజ్ చేసి తర్వాత దానికి మాటలు వ్రాయగా తయారైన అద్భుతమైన పాట " అందమె ఆనందం ".

ఈ పాటను ఘంటసాలవారు భీంప్లాస్ స్వరాలతో ట్యూన్ కట్టారు. హిందుస్థానీ రాగమైన భీంప్లాస్ కు సమాంతరమైన కర్ణాటక రాగం దేవగాంధారి. ఇదే ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయం లో అభేరి గా పేరు పొందింది.
అభేరి 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ యొక్క జన్యరాగం. 

ఈ భీంప్లాస్ రాగంలో అసంఖ్యకమైన పాటలు వచ్చాయి. అయిన " అందమె ఆనందం" పాట అందమే వేరు. ఈ పాటలోని  మెలడి , రిథిమ్ ఆబాలగోపాలంలో హుషారును , ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి.

 పాట నిర్మాత, దర్శకులకు నచ్చింది.
 సంగీత దర్శకుడి రైమ్ కు రిథిమ్ కు సరిపోయింది.  ఈ పాట రికార్డింగ్ ను అతి తక్కువ కాలంలో అంటే ఏడు గంటల కాలంలో ముగించవలసిన పాటను కేవలం రెండు గంటల లోపుగానే  తాను పాడి ,  లీల చేత పాడించి ముగించారట.

బ్రతుకు తెరువులోని ఈ పాట ఆ కాలపు యువతను ఉర్రూతలూగించింది. అక్షర జ్ఞానం లేని పశులకాపర్ల దగ్గర నుండి కాలేజి ప్రొఫెసర్ల వరకూ అందరూ ఈ పాటనే పాడుకున్నారు.

"అందమె ఆనందం" తన మనసుకు నచ్చిన పాటగా ఈ బ్రతుకు తెరువు కధానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు పలుసార్లు చెప్పడం జరిగింది.

అంతకు మించి ఈ పాట పుట్టి   ఏడు దశాబ్దాలైనా ఇంకా తెలుగు హృదయాలలో పదిలంగా నిత్యనూతనంగా మెదులుతూనే వుంది.

మొదట ఈ సినీమా కు  సి ఆర్ సుబ్బరామన్  సంగీత దర్శకుడు. ఆయన ఒకే ఒక పాట స్వరపర్చారు. కానీ , ఆ తర్వాత ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆయనకు సహాయకుడిగా వున్న ఘంటసాలవారు మిగిలిన పాటలు స్వరపర్చి ముగించారు.

ఈ సినీమా లో ఘంటసాలవారు పాడిన ఏకైక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈ అందమె ఆనందం. ఘంటసాలవారి ప్రతి కచేరీలో  ఆఖరున  విధిగా "అందమె ఆనందం"  పాటే పాడి అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తన కచేరీ ముగించేవారు. 

ఘంటసాలవారి విదేశీ పర్యటనలోకూడా ప్రతీ కచేరీలో ఈ పాట పాడారంటే అందమె ఆనందం ఆయనకు ఎంతిష్టమో అర్ధమవుతుంది.

సినీమాలో ఈ పాట రెండుసార్లు ఘంటసాల , పి.లీల గళాలలో విన వస్తుంది.  పియానో వాయిస్తూ మొదట హీరో అక్కినేని , తర్వాత హీరోయిన్ సావిత్రి ఈ పాటను ఆలపిస్తారు.

ఈ పాటకోసం పియోనా , ఫ్లూట్ , క్లారినెట్ ,వైలిన్స్,  స్పానిష్ గిటార్ , తబల , డోలక్ వంటి వాద్యాలు ఉపయోగించారు. ఈ పాట ఘంటసాలవారి గళంలో ఎంతో శ్రావ్యంగా తేలియాడింది. ముఖ్యంగా ఈ పాటలోని హమ్మింగ్స్ మనసుకు హాయిని , పరవశత్వాన్ని కలుగజేస్తాయి.

 ఈ సినీమా ను తమిళంలో డబ్ చేసినప్పుడు కూడా ఈ పాట చాలా హిట్టయింది.

బ్రతుకు తెరువు కు దర్శకుడు భరణీ రామకృష్ణ గారు. నిర్మాత - కోవెలమూడి భాస్కరరావుగారు.  భాస్కరరావు గారు , ఘంటసాలవారు మంచి మిత్రులు.

ఈ సినీమా తర్వాత భాస్కరరావు గారు వరసగా తీసిన ఐదారు చిత్రాలకు ఘంటసాలవారే సంగీత దర్శకుడు.

 1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు'  కధ హిందీలో  జితేంద్ర ,తనూజ , సంజీవ్ కుమార్  లతో 
" జీనే కి రాహ్ "గా,  తమిళంలో ఎమ్జియార్ , కె ఆర్ విజయ , కాంచన లతో 'నాన్ ఏన్  పిరన్దేన్'  గా వచ్చి విజయం పొందింది.

ఇదే కధను  మళ్ళీ పి ఎ పి సుబ్బారావు మరల 1972 లో తెలుగులో ' భార్యాబిడ్డలు' గా నిర్మించగా అక్కినేని , జయలలిత , కృష్ణకుమారి నటించారు.

కెవిమహాదేవన్ సంగీతదర్శకత్వంలో వచ్చిన ఈ సినీమా లో ఘంటసాల మాస్టారు సోలోలు , డ్యూయెట్లు కలిపి ఆరు పాటలు పాడారు.

కథాకథనం బాగుంటే ఆ సినీమా , ఆ సినీమా లోని పాటలు కలకాలం గుర్తుండిపోతాయనడానికి 'బ్రతుకు తెరువు' ఒక నిదర్శనం. 

మదిలో సదా మెదిలే ఘంటసాలవారి మరో సజీవ రాగంతో మళ్ళీ వచ్చే ఆదివారం ...

💐🙏ప్రణవ స్వరాట్🙏💐

అందమె ఆనందం - ఘంటసాల


అందమె ఆనందం - పి. లీల ఆలాపన


Saturday, 25 November 2023

సదా మదిలో మెదిలే సజీవరాగం - 5వ భాగం - కుడియెడమైతే - దేవదాసు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నాలుగవ భాగం ఇక్కడ 

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదక, మునకే సుఖమనుకోవోయ్

మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ
కొండలే రగిలే వడగాలి.... నీ సిగలో పూవేలోయ్?

చందమామ మసకేసి పోయె
ముందుగా కబురేలోయ్?
లాహిరి నడి సంద్రములోన 
లంగరుతో పనిలేదోయ్  


గాయకుడిగా ఘంటసాలవారికి అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టిన  ఈ పాట అర్ధం గురించి పలువురు పలు రకాలుగా విమర్శించడం జరిగింది, విశ్లేషించడమూ జరిగింది.

"త్రాగుబోతు వాడి మాటకీ పాటకి అర్ధమేముంటుంది" అని అన్నవారే,  ఆలోచించే జిజ్ఞాసాపరులకు తగిన వేదాంతార్ధం ఈ పాటలో లభిస్తుందని కూడా శెలవిచ్చారు.

మనిషి జన్మ దుఃఖం, మనిషి మరణం దుఃఖం ......అనే వేదాంత సూక్తిని గుర్తు చేసే పాట 'కుడి ఎడమైతే'.

సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఈ పాట గురించి ఆయనే తర్వాత ఎప్పుడో ఎవరికో చెప్పినట్లు ఆయన కుమారుడు,  సినీగీత రచయిత సముద్రాల రామానుజాచార్యులు (సముద్రాల జూ.) చెప్పిన అర్ధం యొక్క సారాంశం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

" కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. అది జీవితంలో  సహజం. అంతమాత్రాన ఓడిపోయాననుకోకు.

పార్వతి తనదే అనుకున్నాడు దేవదాసు. కానీ, ఆమె అతనికి దక్కలేదు. ఆ బాధను మర్చిపోవడానికి త్రాగుడు ప్రారంభించాడు.  ఇది ఒక సుడిగుండం. అలవాటు పడితే బయటపడడం కష్టం అని తెలిసికూడా ఈ త్రాగుడనే సుడిగుండంలో దూకాడు. ఇప్పుడింక ఎందురీత తెలివితక్కువ. 
ములిగిపోవడమే సుఖం. ఇలా తప్పతాగుతూనే జీవితం ముగించుకో. 

పార్వతి మేడపైనున్న బంగారు బొమ్మ.  నీ చేతికి చిక్కదు. నీవంటే ప్రాణాలిచ్చే చంద్రముఖి నీ నీడలోనే వుంది. కానీ నీ స్థితి ఏమిటి ? కొండల్నే రగిల్చే వడగాలి వీస్తోంది. నీ గుండెలో సుకుమారమైన ప్రాణాలు ఎంతకాలం నిలుస్తాయి. ఎందుకీ ప్రాణాలు ? తప్పతాగి జీవితం చాలించు. చావడానికి నిర్ణయించుకున్నాక ఎవరికీ కబురు చెప్పవలసిన పనిలేదు.

చందమామ లాటి నీ బ్రతుకు మసకేసిపోయింది. నడి సముద్రాన వున్న నావలా వుంది నీ బ్రతుకు, ములిగిపోవడానికి సిధ్ధంగా. ఒడ్డున వుండేవాడికి లంగరు గానీ, నడి సముద్రంలో నీరుపట్టిన నావకు లంగరు ఎందుకు ?

ఇది దేవదాసు మానసిక పరిస్థితి.

దేవదాసు మానసిక స్థితిని ఇంత సింబాలిజంతో పాటను వ్రాసి కవిగా తన సుపీరియారిటిని, సీనియార్టీని నిరూపించుకున్నారు కవివరేణ్యులు సీనియర్ సముద్రాల. కవి ఆవేశాన్ని అర్ధం చేసుకొని పాటను స్వరపర్చారు సి.ఆర్.సుబ్బురామన్ దగ్గర సహాయకులుగా పనిచేసిన విశ్వనాథన్ - రామమూర్తిలు. (సి.ఆర్.సుబ్బురామన్ ఆకస్మిక మరణంతో దేవదాసు రెండు పాటలు - 'జగమేమాయ', 'కుడిఎడమైతే'  పాటలను విశ్వనాథన్ - రామమూర్తిల చేత చేయించారట. ఈ రెండు పాటలను మరింత ఆ‌ర్తితో, భావోద్వేగంతో  అనుభవించి  పాడారు ఘంటసాల.

దేవదాసు లోని ' కుడి ఎడమైతే' పాట,  గత వారం ఈ శీర్షిక లోని ' ఆ మనసులోనా'  పాట  రెండు కూడా కళ్యాణి రాగంలో మలచబడినవే. రాగం ఒకటే అయినా ఈ రెండుపాటల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆ వైవిధ్యానికి కారణం ఘంటసాలవారి గాన ప్రతిభే. తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మించబడిన దేవదాసు లోని పాటలన్నీ ఘంటసాలవారే పాడారు. ఈ ఒక్క సినిమా లోని పాటలతోనే కోట్లాది తమిళులు ఈనాటికీ ఘంటసాలవారి ని గుర్తుపెట్టుకొని ఆ పాటలను నిరంతరం మననం చేసుకుంటూనే ఉన్నారు.

1917 లో శరత్ బాబు (శరత్చంద్ర ఛటర్జీ) వ్రాసిన దేవదాసు బెంగాలీ నవల ఆధారంగా ఇప్పటికీ వివిధ భాషలలో 14 సార్లు దేవదాసు ను సినీమాగా తీసారు. ఇన్నిసార్లు ఇన్ని భాషలుగా రూపొందినా 1953లో అక్కినేని నటించిన తెలుగు దేవదాసే ఉత్తమమైనదని ఆ పాత్రలో తన కంటే అక్కినేని నాగేశ్వరరావు నటనే పరాకాష్ట కు చేరుకున్నదని హిందీ దేవదాసు కధానాయకుడు, సుప్రసిధ్ధ నటుడు దిలీప్ కుమార్ అక్కినేని ని ప్రశంసలతో ముంచెత్తారు.

దేవదాసు చిత్రనిర్మాణ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అహర్నిశలు కష్టపడి పనిచేసారు. ముఖ్యంగా అక్కినేని తాగుబోతుగా నటించడానికి కావలసిన మూడ్ రావడానికి ఆ సీన్లు అర్ధరాత్రి సమయంలో నిద్రకు కళ్ళు బరువెక్కి మూతలు పడుతూండగా ఆ నిద్రమత్తు కళ్ళతోనే షూటింగ్ జరిపేవాళ్ళమని అందుకే ఆ సీన్లలో  తన ముఖంలో ఆ త్రాగుబోతు లక్షణాలు కనపడడానికి దోహదపడ్డాయని అక్కినేని తరచూ తన ఇంటర్వ్యూలలో చెప్పేవారు.

తెలుగునాట 'దేవదాసు' ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ సినీమా వచ్చిన కొత్తల్లో ఊరూవాడా ఎక్కడ చూసినా ఘంటసాల దేవదాసు పాటలే. ప్రేమలో విఫలమైన ప్రతీ భగ్నప్రేమికుడు అక్కినేని లాగే పైజమా జుబ్బాలతో, చింపిరిజుట్టు, మాసిన గెడ్డం, చేతిలో సిగరెట్ తో వీధికి ఒకరు చొప్పున లైట్ స్థంభాలక్రింద ఈ పాటలు పాడుతూ దర్శనమిచ్చేవారు.

కళ్యాణి రాగంలో చేయబడిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' పాటలో చాలా తక్కువ వాద్యగోష్టి వినిపిస్తుంది. తబలా, క్లారినెట్, వైలిన్స్ మాత్రమే ప్రధానంగా వినపడే వాద్యాలు. ఈ పాటలో  వినవచ్చే పదాలు ఓడిపోలేదోయ్,  సుఖమనుకోవోయ్, చిలకమ్మా, పూలేలోయ్, లంగరుతో పనిలేదోయ్ అనేచోట  వచ్చే సంగతులు, గమకాలు, ఎదురీదకా, కబురేలో  తర్వాత వచ్చే ఆలాపనలు కళ్యాణి రాగ మాధుర్యానికి మచ్చుతునకలు. ఆ రాగ స్వరూపాన్ని అంత నిర్దిష్టంగా రసభావానికి తగినట్లుగా ఆలపించడం ఒక్క ఘంటసాలవారికే సాధ్యం. అలాగే ఈ పాటను సంగీతపరంగా విశ్లేషించాలన్నా సంగీతం బాగా తెలిసినవారికే సాధ్యం. నాలాటి వాళ్ళు ఆయా గమకాలను, సంగతులను విని ఆనందించగలరే తప్ప వివరణాత్మక విశ్లేష చేయలేరు.

ఒక గాయకుడి ప్రతిభను మరో గాయకుడు లేదా గాయని మాత్రమే చక్కగా చెప్పగలరు. దేవదాసు సినీమాలోని 'కుడిఎడమైతే' పాట విన్నాక ఘంటసాలవారి తీవ్ర అభిమానిగా మారిపోయానని , అలాటి  గొప్ప గాయకుడు మరల పుట్టడని ,అలాటి గాయకునితో కలసి అనేక పాటలు పాడే భాగ్యం తనకు కలిగిందని గాయని ఎల్.ఆర్.ఈశ్వరి ఎంతో భావోద్వేగాలతో మాట్లాడడం నేను విన్నాను.

ఎన్ని యుగాలైనా  'కుడిఎడమైతే పొరపాటు లేదోయ్'  పాట, 'దేవదాసు' లోని ఇతర పాటలు, వాటి ఆవిర్భావానికి కారణభూతులైన సీనియర్ సముద్రాల, సి.ఆర్.సుబ్బురామన్,  విశ్వనాధన్ రామమూర్తి, ఘంటసాల, అక్కినేని, సావిత్రి,  వేదాంతం రాఘవయ్య, డి.ఎల్.నారాయణలు తెలుగువారి గుండెలలో సజీవంగా నిల్చిపోయేవుంటారు. 

మదిలో సదా మెదిలే ఘంటసాలవారి మరో సజీవ రాగంతో మళ్ళీ వచ్చే ఆదివారం ...


💐🙏💐ప్రణవ స్వరాట్💐🙏💐



Saturday, 18 November 2023

సదా మదిలో మెదిలే సజీవరాగం - 4వ భాగం - ఆ మనసులోనా - పల్లెటూరు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

ఘంటసాల -
సదా మదిలో మెదిలే సజీవరాగం!! 
మూడవభాగం ఇక్కడ



'ఆ మనసులోనా'
ఆ మనసులోన‌, ఆ చూపులోన
పరుగులెత్తే మృదుల భావనామాలికల
అర్ధమేమిటో తెల్పుమా, ఆశ ఏమిటో చెప్పుమా !

ఆ నడతలోన, ఆ నడకలోన
దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు
అంతరార్ధము తెల్పుమా, ఆశయము వివరింపుమా !

ఆ కులుకులోన, ఆ పలుకులోన
పెనవేసికొని యున్న, వెలికి రాలేకున్న 
తలపులేవో తెల్పుమా, వలపులేవో చెప్పుమా !

ఆ సొగసులోన , ఆ నగవులోన;
తొగరు వాతెరగప్పి చిగురించు కోరికల :
మరుగదేమిటో తెల్పుమా , తెరగదేమిటో చెప్పుమా !

ఆ హృదిలో, ఈ మదిలో
పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని 
పరిమళించునె తెల్పుమా !
ఫలితమిచ్చునె చెప్పుమా !!

                                                                                   🌷🔔🌷

నా చిన్నప్పుడు నేను విజయనగరంలో ఉన్నప్పుడు ఈ పాట గ్రామఫోన్లు ఉన్న ప్రతీ ఇంట్లో, కాఫీ హోటల్స్ లో, పబ్లిక్ పార్క్ రేడియో లో ఉదయాస్తమానం తెగ వినిపించేది. సంగీతాభిమానులంతా కూడా మనసారా ఈ పాటను పాడుకునేవారు. ఈ పాట  విన్నప్పుడల్లా నాకు మాత్రం గుర్తుకు వచ్చే మాటలు రెండే రెండు - ఒకటి  - చెప్పు, మరొకటి ఉప్మా (చెప్పుమా). ఆ వయసులో నాకున్న లోకజ్ఞానం అంతే.

ఘంటసాలవారి అసలైన గాత్రధర్మం , సంగీత ప్రతిభ 1950 ల నుండి 1965 మధ్య వచ్చిన సినీమాలలోనే ద్యోతకమవుతుంది.  అలాటి పాటలలో ప్రముఖ స్థానం వహించేది పల్లెటూరు సినీమా లోని పాటలు.

సుప్రసిద్ధ  దర్శకుడు తాతినేని ప్రకాశరావుగారు తొలిసారిగా దర్శకత్వం వహించిన సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రం 'పల్లెటూరు'. పీపుల్స్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ మీద నిర్మించిన పల్లెటూరు చిత్రం తాతినేని వారికి మాత్రమే కాక వి మధుసూదనరావు, అట్లూరి పుండరీకాక్షయ్య, అచ్చయ్యచౌదరీ వంటి యువ కళాకారులకు కూడా మొదటి చిత్రం. వారంతా తెరవెనుకే కాక తెరమీద కూడా  అభ్యుదయ వాదియైన కధానాయకుడు ఎన్.టి.రామారావు మిత్రబృందంలో కనిపిస్తారు.

దేశభక్తి, సోషలిజం, సంఘ విద్రోహక చర్యలు, ప్రేమ వంటి  వివిధ అంశాలతో ఈ సినీమాను రూపొందించారు.

 నవసమాజోధ్ధరణలో భాగంగా కొన్ని దశాబ్దాలపాటు  సామాజిక నాటక ప్రదర్శనలు నిర్వహించిన సుంకర సత్యనారాయణ- వాసిరెడ్డి భాస్కరరావు జంటకవులు ఈ సినీమాకు మాటలు, పాటలు వ్రాసారు.

పల్లెటూరు సినీమాలో వీరు వ్రాసిన పదకొండు పాటలతో పాటు, అంతకుముందే సినీమాలతో సంబంధం లేకుండా వ్రాయబడిన  మహాకవి శ్రీశ్రీ గారి 'పొలాలనన్ని హలాల దున్ని'  అనే విప్లవగీతం, వేములపల్లి శ్రీకృష్ణగారి 'చేయెత్తి జైకొట్టు తెలుగోడా' అనే ప్రబోధగీతం కూడా ఈ సినీమా ఔన్నత్యానికి దోహదం చేసాయి.

ఈ రెండు పాటల్లో ఘంటసాలవారితో పాటు బృందగానం చేసినవారిలో మా నాన్నగారు - సంగీతరావుగారు కూడా ఉన్నారు. 

విప్లవధోరణికి అలవాటు పడిన కవులు  కవిత్వ  గుబాళింపులతో లాలిత్యమైన ప్రేమ భావగీతాలను జనరంజకంగా వ్రాయగలగడం చాలా ఆశ్చర్యకరం. 

అలాటి మృదు మధురభావ ప్రేమ గీతమే "ఆ మనసులోన, ఆ చూపులోన" పాట.

పల్లెటూరు చిత్రానికి అత్యద్భుతమైన, సందర్భోచితమైన సంగీతాన్ని ఘంటసాలవారు సమకూర్చారు. వాటిలో మకుటాయమానంగా చెప్పదగినది ఈ ప్రేమగీతం.

'మృదుల భావనామాలిక
నడత, నడక
నునుసిగ్గు దొంతరలు, మొగ్గు
కులుకు, పలుకు
తలపులు, వలపులు
తొగరు, వాతెరగప్పి
మరుగు, తెరగు
పొటమరింపు,
దిటవుగా పాదుకొని
పరిమళింపు
అనే పదాలు వాసిరెడ్డి - సుంకరిగార్ల కవితా ప్రతిభను చాటి చెపుతాయి.

'తొగరు వాతెరగప్పి' వంటి పదాలకు సరైన అర్ధం తెలియాలంటే తెలుగుభాషతో అంతో ఇంతో ప్రవేశం ఉండకతప్పదు.

1960లకు ముందు ఘంటసాలవారు అనేక పాటలను  కళ్యాణి రాగంలో స్వరపర్చి పాడారు.  కళ్యాణి ఘంటసాల అభిమాన రాగం అనే ఖ్యాతిని కూడా పొందారు.

సంపూర్ణరాగమైన "కళ్యాణి " మనసుకు హాయిని , ఆహ్లాదాన్ని కలిగించే రాగం. ఈ ప్రేమ భావగీతానికి కూడా ఘంటసాలగారు కళ్యాణి రాగాన్నే ఎన్నుకొని తన సంగీత ప్రతిభను చాటారు.

"ఆ మనసులోన, ఆ చూపులోనా"  అంటూ  పల్లవి కి ముందు మంద్రస్థాయిలో సాకీ లా మొదలెట్టిన విధం సైగల్ ను గుర్తుకు తెస్తుంది.

పల్లవిలో "భావనా మాలిక" అనే చోట ఘంటసాలవారు ఇచ్చిన గమకస్ఫూర్తి,  స్థాయికి ఒకరకమైన పరవశం కలుగుతుంది. అలాగే 'తెల్పుమా ' అనే చోట కనపర్చిన వైవిధ్యం అనన్య సామాన్యం. 

చరణంలో 'కులుకు', 'పలుకు' అన్న మాటలకు మాస్టారు ఇచ్చిన భావప్రకటన శ్రోతలలో చెప్పలేని పెనవేసుకుపోయిన తలపులను, వలపులను, మరెన్నో మధురభావాలను రేకెత్తిస్తాయి. 

"చిగురించు కోరికల" తర్వాత వచ్చే ఆలాపన ఘంటసాల  బ్రాండ్ కళ్యాణి కి దర్పణం. ఆ రాగమాధుర్యమంతా ఆ చిన్ని ఆలాపనలోనే వ్యక్తీకరించారు.

ఇక ఆఖరి చరణంలో  'ఆ హృదిలో ,  'ఈ మదిలో' అనే చోట ఘంటసాలవారు పాడిన విధానం మనం ఊయలలో మెల్లగా పైకీ, క్రిందికి ఊగుతున్న భావన కలిగిస్తుంది.

ఇక ఆఖరున 'ఆ.. మనసులోన'అంటూ ముగించిన తీరుకు శ్రోతల మనసులు ఎక్కడో విహరిస్తాయి.

ఈ పాటలో ఎక్కడా వాద్యాల హోరు మచ్చుకైనా కనపడదు. గాయకుడి గాత్రానికి వాద్యాలు సున్నితంగా సహకరించాలే తప్ప గాయకుడి పాటను - డామినేట్ - అధిగమించకూడదు.

ఇదే ఘంటసాలవారు చివరి వరకు అనుసరించిన వాద్యగోష్టి నిర్వహణా విధానం. ఈ పాటలో కేవలం ఫ్లూట్, వీణ, వైలిన్స్, తబలా, రిథిమ్స్ మాత్రమే పాట ఔచిత్యాన్ని ఇనుమడింపజేస్తూ వినిపిస్తాయి.

ఈ పాట చిత్రీకరణ కూడా చాలా సహజ వాతావరణం లో ఎన్.టి.రామారావు, సావిత్రిల సున్నిత హావభావాలతో ఏ హంగు ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది.

ఈ విధమైనటువంటి భావ సౌందర్యం గల అచ్చ తెనుగు పాటలకు, గాయకులకు ఈనాడు మనము దూరమయ్యాము.

సంగీత, సాహిత్యాలలో తగిన ప్రవేశం లేని కారణంగా నేను  ఈ పాట ఔన్నత్యాన్ని తగు రీతిలో ఇంకా బాగా విశ్లేషించలేకపోయానని భావిస్తున్నాను.

మదిలో సదా మెదిలే మరో ఘంటసాల సజీవరాగం తో మళ్ళీ వచ్చే ఆదివారం ..

అంతవరకు ఈ శీర్షిక నుండి శెలవు.

 -ప్రణవ స్వరాట్






Saturday, 11 November 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" 3వ భాగం - ఎంత ఘాటు ప్రేమయో - పాతాళభైరవి




"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

రెండవభాగం ఇక్కడ
          
" ఎంత ఘాటు ప్రేమయో 
  ఇంత లేటు వయసులో "
వంటి పారడీ గీతాలకు అవకాశం కల్పించిన పాట.    "ఘాటు ప్రేమ" పద ప్రయోగం శ్రీశ్రీ వంటి మహాకవి చేత కూడా ఏదో సందర్భంలో ఆలోచింపజేసిందట.

పింగళి నాగేంద్రరావు గారు వ్రాసిన ఈ పాట విజయావారి   మొట్టమొదటి అత్యద్భుత మాయాజాల జానపద చిత్రమైన
 " పాతాళభైరవి " సినీమాలోనిది.

వివిధ రసాలతో కూడిన  ఎన్నోపాటలకు ఘంటసాలవారు మనోరంజకమైన, వైవిధ్యభరితమైన సంగీతాన్ని సమకూర్చారు. పి. లీల అనే మలయాళ గాయనికి పాతాళభైరవి పాటలు  తెలుగునాట సుస్థిరమైన స్థానాన్ని అనన్య సామాన్యమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. 

💥  నాయిక : ఎంత ఘాటు ప్రేమయో
      ఎంత తీవ్ర వీక్షణమో...

కన్ను కాటు తిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే  - 2 !! ఎంత!!

నాయకుడు : ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో !
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే - 2 !! ఎంత లేత!!

 నాయిక :
ఈ జాబిలి.. ఈ వెన్నెల.. ఈ మలయానిలము... -2
విరహములో వివరాలను విప్పి చెప్పెనే..
!! ఎంత ఘాటు!!


నాయకుడు : ఓ జాబిలి... ఓ వెన్నెల.. ఓ మలయానిలమా..! - 2
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే !! ఎంత లేత !! 💥

వాహినీ స్టూడియో లో రకరకాల పూలమొక్కలు , లతలు జెయింట్ ఫాన్ల గాలికి తలలూపుతూండగా , ఫౌంటెన్ల్ వెదజల్లే  చలచల్లనినీటి తుంపరలతో  , గగనతలంలో వెలిగిపోతున్న చందమామ తో   అంతా  నిజమని భ్రమింపజేసేలా బ్రహ్మాండమైన రాజభవనం సెట్ లో నాయికా నాయకులు మాలతి , ఎన్ టి రామారావు  ఎంతో అందంగా సహజంగా ఈ పాటను అభినయించారు.

పింగళి నాగేంద్రరావుగారు ఈ పాటలో ప్రయోగించిన ' కన్నుకాటు' పదం అప్పటికీ ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా నే ఉంది. పింగళి వారు ఈ పాటలో నాయిక భావాలను లాలిత్యంతో కూడినవిగా , నాయకుని భావాలు సుస్పష్టంగా తెలిసేలాగును వ్రాసారు.
 
ఇక ఘంటసాలవారు పాతాళభైరవి సినీమా కు ఆపాతమధుర సంగీతాన్ని సమకూర్చారు.  ఈ యుగళగీతాన్ని ఘంటసాలవారు రాగేశ్వరి అనే హిందుస్థానీ రాగంలో మనసుకు హాయిగొలిపేలా సుశ్రావ్యంగా మలచి పి.లీలతో గానం చేసారు.

ఈ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వైలిన్స్ తో, పియోనా వ్యాంపింగ్ తో , స్పానిష్ గిటార్ నోట్స్ తో ఎంతో మనోహరంగా ప్రారంభమవుతుంది. ప్రతి పదం చివరలో వచ్చే సంగతులను , గమకాలను లీల , ఘంటసాల గార్లు చాలా స్పష్టంగా మనసుకు హాయిగొలిపేలా ఆలపించారు. శాస్త్రీయ సంగీత నేపధ్యమో లేక అసమాన్య గ్రహణశక్తో ఉంటే తప్ప ఘంటసాలవారి పాటలలోని గమకాలను కఛ్ఛితంగా ఆలపించడం బహు కష్టం. 

రెండవ బ్యాక్ గ్రౌండ్ లో కూడా వెస్ట్రన్ వాద్యమైన  పియోనాతో పాటు ట్రంపెట్స్ ను కూడా సున్నితంగా మన వాతావరణానికి తగినట్లు సందర్భోచితంగా  ఉపయోగించారు ఘంటసాల.

చరణంలో వచ్చే 
 ' ఓ జాబిలి , ఓ వెన్నెల , ఓ మలయా నిలమా ' అనే మాటలను ఒక్కోదాన్ని ఒక్కో స్థాయిలో లీల , ఘంటసాలగారు ఎంతో నిర్దుష్టంగా ఆలపించిన తీరు అనితరసాధ్యం. 

ఈ పాట పుట్టి 72 ఏళ్ళు కావస్తున్నా ఈనాటికీ ఈ గీతం నిత్యనూతనంగాను , ఉత్తేజభరితంగానూ సంగీతప్రియులను అలరిస్తూనేవుంది.


" ఎంత ఘాటు ప్రేమయో " పాట వైశిష్ట్యం గురించి ప్రముఖ  బహుభాషా నేపధ్యగాయకుడు శ్రీ పి బి శ్రీనివాస్ గారు ఎంతగానో కొనియాడారు.

1985-86 ప్రాంతాలలోనే మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఘంటసాలవారి సంస్మరణార్ధం  సకలగాయక సంగీతోత్సవాలను ఘనంగా చేయడం మొదలుపెట్టింది. అలాటి ఒక ఉత్సవంలో శ్రీ పిబి శ్రీనివాస్ గారు ఘంటసాలవారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ  "ఎంత ఘాటు ప్రేమయో" పాటను ఆలపించారు. 
తానే గనక ఏ భోజరాజో లేక , శ్రీకృష్ణ దేవరాయలో అయినట్లతే  ' ఓ జాబిలి , ఓ వెన్నెల , ఓ మలయానిలమా' అనే పదాలను  ఒక్కో స్థాయిలో ఒక్కో రకంగా  ఆలపించిన తీరుకు లక్ష వరహాల చొప్పున మూడు లక్షల వరహాలను బహుమానంగా అందజేసి ఉండేవాడినని చాలా ఉద్వేగంతో ఘంటసాలవారిని ఎంతో ఘనంగా కీర్తించారు. పిబిశ్రీనివాస్ గారి ఆ మాటలకు  వేలాది ప్రేక్షకులు చేసిన కరతాళ ధ్వనులు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.

వచ్చే వారం  సదా మదిలో మెదిలే మరో సజీవ రాగంతో మళ్ళీ కలుద్దాము.....

💐🙏  ప్రణవ స్వరాట్🙏💐














Saturday, 4 November 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" 2వ భాగం - పలుక రాదటే చిలుకా - షావుకారు

                                                                         


"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

  మొదటిభాగం ఇక్కడ 

 






                                                                      

నాకు ఊహ తెలుస్తున్న తొలిరోజులలో నేను విన్నట్లుగా గుర్తుండిపోయిన మొదటి పాట "పలుకు రాదటే చిలకా".

నాగావళీ ఏటి తరంగాలపై నుండి తేలియాడుతూ వచ్చి నా చెవులకు సోకిన పాట. ఆ పాట ఎవరు పాడారో, ఎక్కడినుండి వినిపిస్తోందో నాకు తెలిసే వయసుకాదు. అంత చిన్న వయసులో ఆ పాట నాకు గుర్తుండి పోవడానికి కారణం మేమున్న ఇంటికి బయట చుట్టుపక్కల బోలెడన్ని బాదంచెట్లు. చెట్లనిండా పచ్చని, ఎర్రని బాదంకాయలు, పళ్ళతో వాటిని తినడానికి వచ్చే ఆకుపచ్చని ఎర్రముక్కుల  రామచిలకల కలకలారావాలతో ఆ చెట్లు పచ్చగా కళకళలాడుతూ చూడడానికి చాలా సంతోషంగా ఉండేది. చిలకలు ఎప్పుడూ ఏ కాయను, పండును పూర్తిగా తినవు. సగం సగం కొరికి పోస్తాయి . అలా ఆ బాదంకాయలు కొరికి పారేయడం చూసి ఆ చిలకలకు   పాపం బాదం పలుకులు ఒల్చుకు తినడం రావట్లేదని నాకు విచారంగా ఉండేది.  అటువంటి వాతావరణంలో అశరీరవాణిగా  తరచూ వినిపించే ' పలుకరాదటే చిలకా' పాట 'పలుకు రాదటే చిలకా' గా నా కోసమే పాడుతున్న భావన కలిగేది.

ఎన్నో మధుర భావాలతో మనసుకు హత్తుకుపోయేలా ఆకర్షించి సదా మదిలో మెదిలే పాట "పలుకరాదటే చిలుకా".  ఆ పాట పాడినవారి పేరుఘంటసాల అని ఆ పాట "షావుకారు"అనే సినిమాలో వినిపిస్తుందని నాకు తెలియడానికి చాలా ఏళ్ళే పట్టింది. అదే పాటను మరికొన్నేళ్ళ తర్వాత అదే ఘంటసాలవారింట్లోని గ్రామఫోన్ లోనూ, ఓ పాతకాలపు రేడియోలోను రోజూ వినడం జరిగేది. 

అయితే, శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఈ పాటలో విశ్లేషించడానికి ఎన్నో విషయాలు దాగివున్నాయనే సంగతి అర్ధమవడానికి చాలా కాలమే పట్టింది.

నాగిరెడ్డి-చక్రపాణి ల విజయావారి మొదటి చిత్రం షావుకారు. హీరోగా ఎన్.టి.రామారావు కు మొదటి సినిమా షావుకారు. హీరోయిన్ గా శంకరమంచి జానకికి మొదటి సినీమా షావుకారు. విజయావారి ఆస్థాన సంగీత దర్శకునిగా ఘంటసాలవారికి మొదటి సినీమా షావుకారు. షావుకారు సినీమాలో కధానాయక పాత్రధారి నోటమ్మట వినిపించే మొదటి పాట 'పలుకరాదటే చిలుకా'. ఈ పాటతోనే ఎన్.టి.రామారావు, ఘంటసాలల సినీజీవిత ప్రస్థానం ప్రారంభమై రెండు దశాబ్దాలపాటు నిరాటంకంగా విరాజిల్లింది. షావుకారు సినీమాలో ఆ చిన్నారి రామచిలక (జానకి)  చెప్పడానికి మొహమాట పడిన ఆ తేట తెనుగు మాటలను చూద్దాము.

విజయావారి సినీమాలకు పాటల రచయితగా సముద్రాల సీనియర్ గారు పనిచేసిన ఏకైక చిత్రం షావుకారు. ఈ సినీమాలో వచ్చే వైవిధ్యభరితమైన పాటలన్నీ వారి కలం నుండి వెలువడినవే. 'పలుకరాదటే చిలుకా' పాటలోని మాటలన్నీ చాలా సరళంగా రామచిలుక పలుకుల్లాగే ముద్దులొలుకుతూంటాయి.

సన్నివేశపరంగా యౌవ్వనంలోకి వచ్చాక తొలిసారిగా కథానాయిక, కథానాయకుని ఇంటికి వస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలిసినవాళ్ళే. పక్కపక్క ఇళ్ళవారే. సమయం కలిసొస్తే ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు కావాలని పెద్దలంతా నిర్ణయించుకున్నదే. అయినా పట్నంలో చదువుతున్న ఆ యువకుడిని చూసి ధైర్యంగా, ముఖాముఖిని మాట్లాడేందుకు ఆ గ్రామీణ యువతి సంకోచపడుతుంది. అది ఆ కాలపు పెద్దల పెంపకపు తీరు. పక్కనున్న పనివాడిని అడ్డుపెట్టుకొని తను చెప్పదల్చుకున్నది మొగమాటంతో ఆ యువకుడికి తెలియజేస్తుంది. పట్నంలోని నాగరికతకు అలవాటు పడిన కధానాయకుడు ధైర్యంగా మాట్లాడమంటునే తన మనసులోని భావాలను పంజరంలో ఉన్న చిలుకను ఉద్దేశించి చెపుతున్నట్లుగా తన పక్కింటి పిల్లకు పాట రూపంలో చెపుతాడు.

పాట పల్లవిలో "సముఖములో రాయబార మెందులకే పలుకరాదటే చిలుకా" అంటాడు.
ఎదురెదురుగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోకుండా ఇతరుల ప్రమేయమెందుకు? 

చరణంలో - ఎరుగని వాళ్ళము కాదు, మొగమెరుగని వాళ్ళం అంతకన్నా కాదు. అలాటప్పడు ధైర్యంగా సరదాగా మాట్లాడుకుంటే తప్పేమిటి ? ఇక్కడ ఆచార్యులవారు 'పలికిన నేరమటే?
పలుకాడగ నేరవటే' అని రెండు మాటలు ఉపయోగించారు 'నేరమటే', 'నేరవటే' అని. నేరమటే అంటే తప్పా? ద్రోహమా అనే అర్ధంలో. ' నేరవటే' అంటే నేర్చుకోలేదా, తెలియదా అని. ఈ రెండు మాటలు చాలా సింపిల్ గా వుంటాయి. 'ఇరుగుపొరుగు వారలకీ అరమరికలు తగునటనే' అని మరో మాట. పక్కపక్క ఇళ్ళలో స్నేహంగా, సన్నిహితంగా  ఉంటూ  అక్కరలేని అడ్డుగోడలు అవసరమా అని ప్రశ్నిస్తాడు.

రెండో చరణంలో - మనసులో తొణికే మమకారాన్ని , కళ్ళలో మెరిసే నయగారాన్ని, ప్రేమను  సూటిగా, ఏ అడ్డులు లేకుండా సహజంగా పలుకమంటాడు.

గొప్ప కవితాధోరణి, సమాసభూయిష్టమైన పదజాలమేదీ లేకుండా స్పష్టమైన, సున్నితమైన చిన్న చిన్న మాటలతోనే అందరికీ అర్ధమయే భాషలో ఈ పాటను సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు.

ఇక షావుకారు సినీమా కు సంగీత దర్శకత్వం చేపట్టిన ఘంటసాలవారు 'పలుకరాదటే చిలుకా' పాటను స్వరపర్చడానికి కళ్యాణి రాగాన్ని ఎన్నుకున్నారు. కళ్యాణి సంపూర్ణరాగం.  అంటే ఆరోహణ, అవరోహణలలో  'సరిగమపదని' ఏడు స్వరాలు పలుకుతాయి.  కర్ణాటక సంగీతంలో కళ్యాణి 65వ మేళకర్త మేచకల్యాణి జన్యం. దీనినే హిందుస్థానీ సంగీత శైలిలో 'యమన్' అంటారు. ఈ కళ్యాణి, యమన్ రాగాలలో లెఖ్ఖలేనన్ని సినీమా గీతాలు రూపొందించబడ్డాయి.

ఘంటసాల మాస్టారికి కళ్యాణి రాగం చాలా ఇష్టమైన రాగమని సంగీతాభిమానులు అనుకోవడం కద్దు. అయితే ఆ విధంగా ఘంటసాలవారు ఎప్పుడూ ఎక్కడా ప్రకటించలేదు. భీంప్లాస్, సింధుభైరవి, దేశ్  వంటి రాగాలలో కూడా అధిక సంఖ్యాకమైన పాటలు స్వరపర్చారు. కళ్యాణిలో తాను స్వరపర్చిన పాటలతోపాటు ఇతరులు స్వరపర్చిన కళ్యాణి రాగ గీతాలను  తన సొంతం చేసుకొని ఘంటసాలవారు అద్భుతంగా గానం చేయడం వలన సంగీతాభిమానుల దృష్టిలో ఘంటసాలవారికి, కళ్యాణి రాగానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.

"పలుకరాదటే చిలుకా" పాటలో ఘంటసాలవారు కనపర్చిన రాగ, హావభావాలు, గంభీరమైన తన కంఠస్వరంలో పలికించిన గమకాలు, హాయిగొలిపే ఆలాపనలు అనితరసాధ్యం అంటే అది అతిశయోక్తి కానేకాదు. ఈ పాటలో పియోనా , హేమండ్ ఆర్గన్ , ట్రంపెట్స్ , వైలిన్స్ , ఫ్లూట్ ,క్లారినెట్ వంటి వాద్యాలు చాలా సౌమ్యంగా వినిపిస్తాయి. 

ఇదే పాటను ఈ సినిమా లో మరోసారి 'తెలుపవేలనే చిలుకా తెలుపవేలనే' అని రావు బాలసరస్వతి ముగ్ధమనోహరంగా ఆలపిస్తారు. ఈ రెండు పాటల మధ్య వాద్యగోష్టిలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. రెండో పాటలో జలతరంగ్ వంటి వాద్యాలు కూడా వినిపిస్తాయి.

ఈ పాటలో పది పన్నెండుసార్లు 'ట' కారాక్షరంతో కూడిన మాటల ప్రయోగం జరిగింది. అలాగే మరో దశాబ్దంన్నర తర్వాత వచ్చిన 'రేపంటి రూపం కంటి' పాటలో దాదాపు 55 'ట' కారపు పదాలు వినిపిస్తాయి.

"పలుకరాదటే చిలుకా"  పాటనాటికి ఎన్టీఆర్, జానకి ఇద్దరూ కొత్తవారే. ఇద్దరూ ఏ భేషజము ప్రదర్శించకుండా చాలా సహజంగా నటించారు. జానకి అయితే ఆనాటి గ్రామీణ యువతులలో ఉండే అమాయకత్వాన్ని, వేషభాషలను చక్కగా కనపర్చారు.  కధానాయకుడు ఎన్ టి రామారావు ఎంతో అందంగా, ఏ కృత్రిమత్వం లేకుండా సహజంగా ముఖంలోని హావభావాలను ప్రకటించారు.

ఘంటసాలవారి సంగీత ప్రతిభకు మచ్చుతునక 'పలుకరాదటే చిలుకా' పాట.

మదిలో మెదిలే మరో సజీవ రాగంతో
మళ్ళీ వచ్చే ఆదివారం...

🌺🙏ప్రణవ స్వరాట్🙏🌺






Saturday, 28 October 2023

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవ రాగం - మొదటి భాగం - మొదటిభాగం-జయ జననీ - మన దేశం


"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

 "నీ గుణ గానము

 నీ పద ధ్యానము

 అమృత పానము రాధేశ్యామ్..." 

ఘంటసాలవారు ఆలపించిన ఈ భక్తిగీతంలోని పలుకులు అక్షరాల వారిపట్ల సార్ధకమయినవి. ఘంటసాలవారి గుణగణాలను తలచుకుంటూ, వారి పాటలను మననం చేసుకోవడం అమృతపానము వంటిది. ఆ అదృష్టం రసజ్ఞత తెలిసినవారికి తప్ప అన్యులకు లభ్యము కాని మహద్భాగ్యం. 

సంగీత కుటుంబం లో జన్మించడంవలన రాగ, తాళ, శృతిబధ్ధమైన సుశ్రావ్య సంగీతాన్ని ఆస్వాదించే రసజ్ఞత సహజంగానే నాలో ఏర్పడింది. 

నా చిన్నతనంలో అంటే ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్న రోజులనుండి ఒక పాటను మా మాస్టర్లు పాడగలిగిన పిల్లలతో ప్రార్ధనాగీతంగా రోజూ స్కూల్లో పాడించేవారు. మిగతా పిల్లలంతా కూడా పెదవులు కదిపేవారు. రిపబ్లిక్ డే అయినా, ఆగస్ట్ 15 అయినా, గాంధీజయంతి అయినా ఆ పాట తప్పక వినిపించేది. వినడానికి, పాడడానికి చాలా ఉత్సాహంగా, హాయిని కలిగించేదిగా ఆ గీతం ఉండేది. 

 ఆ పాటే "జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ" అనే ప్రబోధగీతం. 

స్కూల్ ఫంక్షన్స్ లోనూ, లౌడ్ స్పీకర్లలోనూ ఈ పాట వినిపించేది. చాలాకాలం వరకు ఆ పాట జాతీయగీతమనే అనుకునేవాడిని. టెలివిజన్ లలో సినీమాలు వేయడం ప్రారంభించేక ఒకసారి 'మన దేశం' అనే అతిపాత సినీమా ను చూడడం తటస్థించింది. ఆ సినీమా ప్రారంభంలో టైటిల్స్ మీద " జయ జననీ పరమ పావని" అనే ఈ ప్రబోధగీతం వినవచ్చింది. అప్పుడే తెలిసింది ఇదొక సినీమా గీతమని. 

పాఠశాల విద్యార్ధులను ఎంతో ప్రభావితం చేసిన ఈ ప్రబోధగీతాన్ని శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు. ఘంటసాల, సి.కృష్ణవేణి, బృందం కలసి ఈ పాట పాడారు. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంగా తీసుకొని నటి, గాయని, మీర్జాపురం రాజావారి సతీమణి శ్రీమతి సి కృష్ణవేణి నిర్మించిన చిత్రం 'మనదేశం'.

 బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్.టి.రామారావును తెలుగువారికి పరిచయం చేసిన చిత్రం 'మనదేశం'.


                                                           


"జయ జననీ పరమ పావని" పాట ద్వారా తెలుగు ప్రజలందరిలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, దేశభక్తిని పురిగొల్పారు రచయిత శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు. ఈ పాటలో ఆసేతు హిమాచల పర్యంతం గల సస్యశ్యామలమైన మన భారతదేశం గురించి, భౌగోళిక వైశిష్ట్యాన్ని గురించి ఔన్నత్యం గురించి ఆచార్యులవారు వర్ణించి చెప్పారు. నైసర్గికంగా అమరిన పర్వతశ్రేణులను అద్భుతంగా వర్ణించారు.  "శీతశైల మణి శృంగ కీరీటా ..... వింధ్య మహీధర మహా మేఖలా విమల కాశ్మీర కస్తూరి రేఖా... అంటూ సముద్రాలవారు ప్రయోగించిన పదజాలం వీనులకు విందు చేకూరుస్తుంది.

అలాగే మరో చరణంలో భారత దేశంలో ప్రవహిస్తున్న జీవ నదుల గురించి వర్ణిస్తూ ... "గంగా సింధూ మహానది గౌతమి, కృష్ణ, కావేరీ జీవసార పరిపూజిత కోమల సస్య విశాలా శ్యామలా..." అంటూ భరతమాత ఔన్నత్యాన్ని కీర్తిస్తూ అటువంటి ఉత్కృష్ట దేశంలో జన్మించడం మన అదృష్టమని ప్రజల హృదయాలలో చైతన్యం రేకెత్తించారు శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు.

ముత్యాలసరాల వంటి సరళ పదజాలానికి లాలిత్యంతో కూడిన సంగీతం సమకూర్చి శ్రీమతి సి.కృష్ణవేణి బృందంతో గానం చేసిన శ్రీ ఘంటసాలవారి గళంలోని మార్దవం, శ్రోతలను పరవశులను చేస్తుంది. ఆయన గురించి ఎందరు ఎన్ని నోళ్ళ పొగిడినా తక్కువే. తెలుగు భాషలోని సౌందర్యమంతా ఘంటసాలవారి సుస్పష్టమైన ఉచ్ఛారణలో, అనన్యసాధ్యమైన గాత్రధర్మంలో, భావ ప్రకటనలో, సుశ్రావ్యమైన గానంలో ప్రకటితమయింది. 

ఈ గీతం ఘంటసాలవారి తొలి మూడు చిత్రాలలో ఒoకటైన "మన దేశం" లోనిది. "కీలుగుఱ్ఱం", "మనదేశం", "లక్ష్మమ్మ" సినీమాలతో ఘంటసాల పేరు యావదాంధ్ర దేశమంతా మార్మోగింది. ఇంతితై వటుడింతై అనే రీతిలో ఘంటసాలవారి సంగీత విశ్వరూపం అనతి కాలంలోనే దిగంతాలకు ప్రాకింది. 

"జయ జననీ పరమ పావనీ" అనే ఈ గీతాన్ని ఘంటసాలవారు 'శుధ్ధ సావేరీ' రాగంలో స్వరపర్చారు. 'శుధ్ధ సావేరి' కర్ణాటక మేళకర్త రాగమైన "ధీరశంకరాభరణం" యొక్క జన్య రాగం. ఈ రాగంలో కేవలం ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. శుద్థ సావేరీ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'దుర్గ' అంటారు. ఘంటసాలవారు ఈ పాటకు వైలిన్స్, ట్యూబోఫోన్, జలతరంగ్, సాక్సోఫోన్, తబలా మొదలగు వాద్యాలను నేపథ్యంలో ఉపయోగించినట్లు గమనించగలం.

తెనుగు భాషలో, తెలుగువారిచే రూపొందించబడిన గీతమనే కొరత తప్ప (ప్రాంతీయ దురభిమానులకు) అన్యధా ఈ గీతం సర్వ విధాలా ఇతర జాతీయగీతాల జాబితాలో చేర్చదగ్గ ఉత్తమ జాతీయగీతం. పెద్దలంతా ఈ తరం పిల్లలందరికీ తప్పక నేర్పవలసిన ఉత్తేజభరిత గీతం. మదిలో మెదిలే ఘంటసాలవారి మరో మధురగీతంతో మళ్ళీ వచ్చేవారం..... 

 

🌺🙏ప్రణవ స్వరాట్🙏🌺

 జయజననీ పరమ పావనీ గీతం  ఇక్కడ  వినండి.


 


                                               



ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...