"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
సృష్ట్యాదిన అంధకారబంధురమై నిశబ్దమయంగా వున్న ఈ జగతిన ముందుగా శబ్ధం, ఆ శబ్దం నుండి ఓంకార ప్రణవనాదం, వేదాలు, సంగీత నాట్యాది కళలు ఉద్భవించాయి. వీటన్నిటికీ మూలాధారమైన సృష్టి స్థితి లయకారుడైన సర్వేశ్వరుడే, ఆ విశ్వేశ్వరుడే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపాలలో ఈ విశ్వాన్ని తన ఆధీనంలో వుంచుకొని పరిపాలిస్తున్నాడు.
అటువంటి చంద్రచూడ, చర్మాంబర మాణిక్య మంజీరధారియైన నటరాజు, ప్రమథ గణాలు తనను వివిధ రీతులలో నృత్య గానాలతో స్తుతిస్తూండగా పార్వతీదేవి తో కలసి చేసిన ఆనందతాండవ నృత్య గీతమే "జయ జయ జయ నటరాజా రజతశైల రాజా " అనే మృదు మధుర గీతం. అదే నేటి "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం".
1963 లో విడుదలైన "వాల్మీకి" పౌరాణిక చిత్రంలోని ఈ పాటను సముద్రాల రాఘవాచార్యులవారు అత్యద్భుతంగా వ్రాసారు. ఈ పాటలో ఆచార్యులవారు ప్రయోగించిన సంస్కృత విశేషణాలు వారి కవితాశైలికి దర్పణం.
ఘంటసాలవారి సంగీత విద్వత్ కు మరో మచ్చుతునక ఈ గీతం. సంగీతదర్శకుడిగా, గాయకుడిగా అద్భుత ప్రజ్ఞ కనపర్చి రూపొందించిన గీతం ఇది. ఆనాటి ఈ పాటలో వందలాది వాద్యాలు గానీ, డాల్బీ సౌండ్ ఎఫెక్ట్స్ గానీ, పాట చిత్రీకరణలో కళ్ళు చెదిరే రంగు రంగుల సెట్లుకాని, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన గ్రాఫిక్స్ గాని కానరావు. అయినా ఈ పాట ఎప్పుడు విన్నా ఇందులోని వాద్యగోష్టి అమరికకు నా ఒడలు జలదరిస్తుంది. ఈ పాటలో మాస్టారు ఉపయోగించిన భావ రాగ తాళాలు, జతులు వారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు నిదర్శనం. ఈ పాటలో మాస్టారితో కలసి గళం కలిపిన కోరస్ బృందం కూడా తమ విజ్ఞతను చక్కగా కనపర్చారు.
భారతీయ సంగీతంలో కనపడే ప్రాచీన శంఖనాదాలతో, మృదంగ, ఛండ, తబలా, తరంగాది తాళవాద్యాలతో, క్లిష్టమైన నృత్య జతులతో ఘంటసాల మాస్టారు ఈ పాటకు గొప్ప ఔన్నత్యాన్ని కల్పించారు. తెరమీద శివ పార్వతులుగా ధర్మరాజు, శకుంతల చూపిన సశాస్త్రీయ నృత్యాభినయం రసజ్ఞులను ఎంతగానో అలరిస్తుంది.
ఘంటసాల మాస్టారు ఈ పాటను రూపొందించడానికి 'హంసానందిని' ( సోహినీ) మరియు 'హిందోళం' (మాల్కౌంస్) రాగాలను ఉపయోగించారు. పాట చివరలో వినవచ్చే వాద్య సంగీతం ' హిందోళం'లో' స్వరపర్చారు . 'హంసానందిని' 53వ మేళకర్త రాగమైన "గమనశ్రమ" కు జన్యరాగం. హంసానందినిలో 'ప' స్వరం వుండదు. ఆరు స్వరాలు మాత్రమే కలిగిన హంసానందిని ఒక షాఢవరాగం. శ్రావ్యత కలిగిన ఈ రాగం లలితగీతాలకు , నృత్యగీతాలకు చాలా అనువైన రాగం. ఇక ' హిందోళ' రాగం 20వ మేళకర్త రాగమైన నటభైరవి జన్యమే ఈ హిందోళం. ఈ రాగంలో రిషభం, పంచమ స్వరాలు లేవు. ఐదు స్వరాలు మాత్రమే కలిగిన ఈ ఔఢవ రాగం హిందోళం చాలా ప్రసిధ్ధిపొందినరాగం. హిందోళం (మాల్కౌంస్) రాగంలో వందలాది సినీమా పాటలు రూపొందాయి. ఘంటసాల మాస్టారు రూ పొందించిన గుండమ్మకధ లోని ఎల్.విజయలక్ష్మి నృత్య సంగీతం కూడా ఈ హిందోళ రాగంలో చేసినదే. అయితే ఆ నృత్యగీతానికి, ఈ వాల్మీకి పాటలోని ఆఖరి నృత్య వాద్య సంగీతం మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఉపయోగించే రాగం ఒకటే అయినా సన్నివేశం, సందర్భాన్నిబట్టి దాని రూపురేఖలలో వైవిధ్యం కనిపిస్తుంది. ఆ విధమైన వైవిధ్యం చూపి శ్రోతలను రంజింపజేయడంలో ఘంటసాల మాస్టారు అద్వితీయులు.
జూపిటర్ పిక్చర్స్ హబీబుల్లా నిర్మాతగా, సి.ఎస్.రావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, రాజసులోచన, లీలావతి రఘురామయ్య, రాజనాల నటించిన ఈ వాల్మీకి సినీమాలో 16 పాటలు పద్యాలున్నాయి. వాటిని ఘంటసాల, రఘురామయ్య, మాధవపెద్ది, పి.సుశీల, కోమల, ఎస్.జానకి ఆలపించారు. ఈ సినీమాలో ఘంటసాలగారు ఆలపించిన ఏకగళ గీతాలు, యుగళగీతాలు, పద్యాలు ఒకదానితో ఒకటి సంబంధంలేకుండా పాత్రౌచిత్యంతో విభిన్నంగా వుంటాయి.
వాల్మీకి సినీమాను జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్ వాల్మీకిగా ఆ పాత్రలో జీవించగా కన్నడంలో ఆ పాత్రలో రాజ్ కుమార్ సంపూర్ణంగా లీనమై నటించారు. తెలుగుకు సంగీత దర్శకత్వం, వహించి గానంచేసిన ఘంటసాల మాస్టారే కన్నడంలో కూడా సంగీతదర్శకుడిగా, గాయకుడిగా మంచి ప్రశంసలందుకున్నారు.
దేవాలయాలలో జరిగే కచేరీలలో, పీఠాధిపతుల సమక్షంలో జరిగే కచేరీలలో ఈ "జయ జయ జయ నటరాజా" గీతాన్ని ఘంటసాల మాస్టారు తప్పక పాడేవారు.
శ్రుతి ,రాగ , తాళ , భావాలకు అధిక ప్రాధాన్యం కలిగిన ఈ గీతం ఎన్నటికీ మదిలో మెదిలే సజీవరాగమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
తెలుగు పౌరాణిక నాటక రంగం మీద మరాఠీ నాటక రంగ ప్రభావం వుండేదన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు పౌరాణిక నాటక పద్య సంగీతమంతా మరాఠీ సంగీత బాణీనే అనుకరించి అనుసరించింది. 1940ల నాటి తెలుగు సినీమాలు కూడా రంగస్థల బాణీలోనే సాగాయి.
సుప్రసిధ్ధ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు పౌరాణిక నాటక రంగం నుండి వచ్చినవారు. ఆనాటి రంగస్థలనటుడు, గాయకుడు, రచయిత అయన దైతా గోపాలంగారి ప్రభావం పెండ్యాలగారి మీద ఎంతైనా వున్నది. గంధర్వ గాయకుడు ఘంటసాలవారి సహకారంతో పెండ్యాల గారు పౌరాణిక సినీమా సంగీతం మీద ఎన్నటికీ చెరపలేని చిరస్థాయి ముద్ర వేశారు.
1960 వ దశకం తెలుగు సినీ సంగీతానికి ఒక సువర్ణాధ్యాయం. ఆ దశాబ్దంలో వచ్చిన సినీమా సంగీతమే ఆపాతమధురమై కోట్లాది తెలుగు హృదయాల సంగీత పిపాసను ఈనాటికీ తీరుస్తున్నది. ఆ విధంగా 1962 లో వచ్చిన రసరమ్య సంగీతభరిత పౌరాణిక చిత్రరాజమే కె.వి.రెడ్డిగారి "శ్రీకృష్ణార్జున యుధ్ధం".
అలనాటి సుప్రసిధ్ధ నాటక , కథా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసిన "గయోపాఖ్యానం" పౌరాణిక నాటకం ఆధారంగా కె.వి.రెడ్డిగారు ఈ "శ్రీకృష్ణార్జునయుధ్ధం" సినీమాను తీశారు. ఈ సినీమా నాటికి అగ్రనటులిద్దరి మధ్యా అంతర్లీనంగా విరోధం కొనసాగుతున్నా ఇద్దరూ మంచి సంస్కారం గలవారు, వృత్తి ధర్మాలను నిక్కచ్చిగా పాటించేవారు, దర్శకుడు మీద గల భక్తిశ్రధ్ధల కారణంచేతనూ ఈ సినీమా నిర్మాణంలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా సినీమా సాఫీగా సాగిపోయింది. దిగ్గజాలవంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన సినీమా కావడం వలన శ్రీకృష్ణార్జున యుధ్ధం ఘన విజయం సాధించి రజతోత్సవాలు జరుపుకుంది.
శ్రీకృష్ణార్జున యుధ్ధంలో కృష్ణార్జునులైన ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్.ల తర్వాత తెర వెనుక ప్రముఖ పాత్రను పోషించింది అమరగాయకుడు ఘంటసాలవారే. పెండ్యాలగారి సంగీతంలో, పింగళివారి రచనలో రూపొందిన 19 పాటలు, పద్యాలలో పదకొండింటికి గాత్రదానం చేసింది ఘంటసాల మాస్టారే. శ్రీకృష్ణుడు ఎన్.టి.ఆర్, అర్జునుడు ఎ.ఎన్.ఆర్., నారదుడు కాంతారావు, ఈ మూడు పాత్రలకు సంబంధించిన పాటలను, పద్యాలను పాడడంలో ఘంటసాలవారు చూపించిన వైవిధ్యం, అద్వితీయ గాన ప్రతిభ అనన్యసామాన్యం. ఏ పాటకు ఆ పాటే, ఏ పద్యానికి ఆ పద్యమే ఆ నటులే ఆలపిస్తున్నారా అనే అనుభూతి ని ప్రేక్షకులలో కల్పించడం ఒక్క ఘంటసాలగారికి మాత్రమే సాధ్యం. తెరమీద ఆంగిక, వాచకాభినయాలతో ఎ.ఎన్.ఆర్., కాంతారావు లు అలరిస్తే ఘంటసాల తన గళబలంతో తెరవెనుక తన నటనా ప్రాభవాన్ని చాటిచెప్పారు.
శ్రీకృష్ణార్జున యుధ్ధంలో నారద పాత్రధారి కాంతారావుగారికి ఘంటసాల మాస్టారు పాడిన పాటే ఈ వారం "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవ రాగం". అదే "దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ" పాట. పింగళి నాగేంద్రరావుగారు - 'సకల భువన సంచాలక, 'అఖిల దనుజ సంహారక', 'దీన సుజన పరిపాలా', 'ముని సన్నుత గుణజాల' అనే పదప్రయోగాలతో తన కవితా పటిమను చాటుతూ దేవదేవుడైన నారాయణుని మహిమలను పొగిడారు.
నిజానికి ఈ పాట సినీమా లో టైటిల్స్ మీద వచ్చే పాట. ఆఖరి చరణంలో ఆలాపనలు ముగిసి 'ధరణినేమి మహిమ చాట ద్వారకలో నుంటివో' అన్న పదంమీద నుండి మాత్రమే నారద పాత్రధారి కనిపిస్తాడు.
టైటిల్ మ్యూజిక్ నిండుగా వినిపించడానికి కావలసిన వాద్యాలన్నీ ఈ పాట నేపథ్యంలో పెండ్యాలగారు ఉపయోగించారు. వీణ, సితార్, వైయొలిన్స్, తబలా, పక్వాజ్, మృదంగం వంటి వాద్యాల సహకారంతో ఘంటసాలవారు ఓ మూడున్నర నిముషాలపాటు ఈ పాటలో విజృంభించారు. తన సంగీత వైదుష్యాన్ని ప్రదర్శించారు. పెండ్యాల, ఘంటసాల కలయికలో ఈ పాట ఆనాటి పౌరాణిక నాటక సంగీతప్రియులను, ఆధునిక సంగీతప్రియులను సమానంగా అలరించింది. సినీమాలో ఒక పాటకు గానీ, ఒక పద్యానికి గాని ఆలాపన అనేది ఎంతవరకు వుండాలి, అందుకు కావలసిన రాగభావాలు ఎంతవరకు, ఎలావుండాలి అనే విషయంలో ఘంటసాలవారు చాలా నిర్దిష్టంగా ఒక ప్రామాణికతను మనకు ఏర్పర్చారు.
పెండ్యాల గారు ఈ పాటను కె.వి.రెడ్డిగారికి చాలా అభిమాన రాగమైన "అభేరి" ( హిందుస్థానీ భీంఫ్లాస్) రాగంలో స్వరపర్చారు. కర్ణాటక దేవగాంధారి అనే రాగమే శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి సంప్రదాయం లో అభేరి అనే పేరుతో ప్రచారమయింది. అభేరి ఔఢవ- సంపూర్ణ రాగం. 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగానికి జన్యరాగం. ఈ అభేరి/ భీంప్లాస్ రాగాలలో లెఖ్ఖలేనన్ని సూపర్ హిట్ సినీమా పాటలను మన సంగీత దర్శకులు రూపొందించారు. ఈ రాగంలో ఘంటసాల మాష్టారు కూడా తన వంతుకు అనేక ఆణిముత్యాలను ఏర్చి కూర్చి మనకు అందించారు.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
మధ్యమావతి రాగంలో రెండు ఆవర్తాల ఆలపన... తర్వాత సుమారు ఏడున్నర ఆవర్తాల స్వరాలాపనతో ఘంటసాలవారు ఈ గీతాన్ని అజరామరం చేశారు.
నాదోపాసన దైవీకమైనది. యుగయుగాలుగా సంగీతం భారతీయ సంస్కృతిలో కలసిపోయివున్నది. సంగీతాన్ని బాహ్యదృష్టితో చూస్తే శ్రవణాలకు ఆనందాన్ని కలిగిస్తూ మానసికోల్లాసాన్ని కలిగించడమే దాని ప్రధాన లక్ష్యం. కానీ అనాదిగా ఎందరో మహానుభావులు నాదోపాసనను పరమేశ్వరుని చేరుకునే పరమసాధనగా భావించారు. ఋషులు, యోగులు సుదీర్ఘ కాలం తపస్సుచేసి మహాశక్తులెన్నింటినో తమ స్వాధీనం చేసుకున్నట్లే, ఎందరో మహానుభావులైన నాదోపాసకులు సంగీతాన్ని మహా తపస్సుగా భావించి అనేక అతీతశక్తులను సంపాదించి లోకకళ్యాణం కోసం వినియోగించేవారు. నాదబ్రహ్మను తమ కైవసం చేసుకున్న మహాపురుషులు ఘటనాఘటన సమర్ధులు. ఋషులు, మునులలాగే నాదోపాసకులు కూడా ఈ లోకంలో శాంతిభధ్రతలకు, న్యాయ ధర్మాలకు విఘాతం కల్పించేవారిని తమ సంగీతంతో శపించేవారు, శిక్షించేవారు.
ఈ రకమైనటువంటి నేపథ్యంతో గతంలో మన తెలుగులో కొన్ని జానపద చిత్రాలు వచ్చాయి. అలాటి ఒక గొప్ప సంగీత కళాకారుడికి జరిగిన అన్యాయం, అపరాధం కధావస్తువుగా 1962 లో ఒక జానపద చిత్రం వచ్చింది. అదే అంజలీ పిక్చర్స్ వారి "స్వర్ణమంజరి" సంగీతరసభరిత చిత్రం. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినీమాలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి, నాగయ్య, రాజనాల ముఖ్య పాత్రధారులు.
సంగీత సరస్వతియొక్క అపార కటాక్షవీక్షణాలు పొందిన సంగీత కళాకారుడికి ఒక రాజాస్థానంలో జరిగిన ఘోర అవమానానికి తీవ్రంగా క్షోభించి ఆవేశ ఆక్రోశాలతో "రావే ప్రణవరూపిణి రావే" అని ఆలపిస్తూ ఒక ప్రళయాన్నే సృష్టిస్తాడు. సంగీతసాహిత్యపు విలువలు కలిగిన ఆ పాటే నేటి మన సజీవరాగం.
జగతికి జీవాధారమైన లలితకళలకు ఒక రాజ్యంలో తీరని అపచారం జరుగుతూంటే అది కళోపాసికి తీరని అవమానం. శాంతి నెలకొనడానికి ధర్మపరిరక్షణ కోసం ఈ లోకాన విలయాన్ని సృష్టించమని ఆగ్రహావేశాలతో ఆ గాయకుడు ఓంకార ప్రణవరూపిణిని వేడుకుంటున్నాడు.
సముద్రాల రాఘవాచార్యులవారి బలమైన సాహిత్యానికి ఈ చిత్ర నిర్మాత, సంగీత దర్శకుడు అయిన పి.ఆదినారాయణరావుగారు మధ్యమావతి రాగంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక పాటను స్వరపర్చారు. మధ్యమావతి 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ జన్యరాగం. ఔఢవరాగమే అయినా విస్తారమైన రాగసంచారానికి అవకాశం గల రాగం. సాధారణంగా గాయకులు ఈ మధ్యమావతి రాగ కీర్తన ఆలపనతో తమ కచేరీలను ముగించడం ఆనవాయితీ. మధ్యమావతి కి సరిపోలే హిందుస్థానీ రాగం మేఘ్ మల్హర్ గా చెపుతారు.
"రావే ప్రణవ రూపిణీ రావే" గీతాన్ని ఘంటసాల మాస్టారు చాలా ఆవేశంతో ఒక వృధ్ధుడు పాడుతున్నట్లే రసోద్దీపన కలిగిస్తూ పాడారు. తెరమీద ఈ పాటకు నటించే నాగయ్యగారిని తన మనసులో పెట్టుకొని ఘంటసాలవారు ఈ పాటకు అవసరమైన ముసలివయసు ప్రకంపనలను తన గొంతులో పలికించారు. ఈ పాటను ఆడియోలో విన్నా ఈ పాటను నాగయ్యగారే పాడివుంటారనే భావన మనకు కలుగుతుంది. ఈ పాట చివరలో వినిపించే తొమ్మిది ఆవర్తాల రాగాలాపన, స్వరకల్పనలు ఘంటసాలవారి సంగీతప్రతిభకు దర్పణం పడతాయి.
ఆదినారాయణ రావు గారు ఈ పాటకు సితార్, ఫ్లూట్, తబలా, పక్వాజ్, తబలాతరంగ్, మొదలైన వాద్యాలు ఉపయోగించారు. స్వరకల్పనలలో డ్రమ్స్, సింబల్స్, మెటల్ షీట్స్( ఉరుములు, మెరుపుల ఎఫెక్ట్స్ కోసం) వంటి వాద్యాలుపయోగించి శ్రోతల ఒడలు గగుర్పొడిచేలా చేశారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతశాస్త్రం పట్ల సదవగాహన, వివిధ రాగాలలో పట్టుగల అతి కొద్దిమంది సినీమా సంగీత దర్శకులలో అగ్రగణ్యులు ఆదినారాయణరావుగారు. ఆర్ధికంగా వారు చేసిన కొన్ని చిత్రాలు పరాజయం పొందినా ఏ ఒక్క సినిమా కూడా సంగీతపరంగా సంగీతాభిమానులను నిరాశపర్చలేదు.
స్వర్ణమంజరి సినీమాలో అధ్భుతమైన గీతాలు ఓ పదివరకూ వున్నా ఆర్ధికంగా ఈ సినీమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. స్వర్ణమంజరిలో ఘంటసాలవారు పాడిన ఐదు పాటలు వారికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. వాటిలో సదా మదిలో మెదిలే సజీవరాగం " రావే ప్రణవరూపిణి రావే".
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
1962 తెలుగు చిత్ర సంగీతానికి సంబంధించినంతవరకు స్వర్ణవత్సరంగా చెప్పుకోవాలి. ఆ ఏడాది అత్యధిక సంఖ్యలో సినీమాలు రావడమూ, వాటిలో అధికసంఖ్యాకం ఘనవిజయం సాధించడం జరిగింది. ఆ ఏ ఏడాది అగ్రనటులైన ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల సినీమాలు కూడా అత్యధిక సంఖ్యలో పోటాపోటీగా విడుదలై అత్యధిక సంఖ్యలో ఘనవిజయాన్ని సాధించాయి. ఆ ఏడాది విడుదలైన సినీమాలలోని పాటలన్నీ ఈ నాటికీ సజీవంగా నిల్చివున్నాయి. అంతేకాదు ఆ సంవత్సరం అగ్రనటులిద్దరూ కలసి నటించి, రజతోత్సవం జరుపుకున్న చిత్రం "గుండమ్మ కథ". ఈ సినీమా ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్. ఇద్దరికీ మైలురాయి. గుండమ్మకథ తెలుగు వెర్షన్ ఎన్.టి.రామారావు నూరవచిత్రమైతే, ఆ సినీమా తమిళ వెర్షన్ "మణిదన్ మారవిల్లై" అక్కినేని నాగేశ్వరరావుకు నూరవచిత్రంగా చెపుతారు.
గుండమ్మకథ లోని 8 పాటలు సూపర్ హిట్ పాటలుగా ఈనాటికీ తెలుగునాట మార్మోగుతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా గుండమ్మకథలోని అక్కినేని వారి ఏకగళ గీతం "మౌనముగా నీ మనసు పాడిన వేణుగానము వింటిలే" పాటను నేటి ఘంటసాల సజీవరాగంగా తీసుకోవడం జరిగింది.
గుండమ్మకధ విజయావారికి కత్తిమీద సాము. అవి ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల మధ్య ప్రఛ్ఛన్నయుధ్ధం సాగుతున్న రోజులు. ఆ ఇద్దరూ కలసి నటిస్తున్న సినిమా అంటే దర్శక నిర్మాతలకు గుండెలమీద కుంపటే. అదీకాక ఈ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావుకు విజయా సంస్థలో లభించిన రెండవ అవకాశం. ఆ సంస్థలొ దర్శకుడిగా లభించిన తొలి భారీ చిత్రం " చంద్రహారం" చావుదెబ్బకొట్టింది. పర్యవసానం, ఎనిమిదేళ్ళపాటు కమలాకర విజయాకు దూరమయ్యారు. పౌరాణిక చిత్రాలకు అలవాటుపడ్డ కామేశ్వరరావుగారికి ఈ సాంఘిక చిత్రాన్ని, అందునా హాస్యరస ప్రధానమైన సినిమాను డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఇది పూర్తిగా చక్రపాణిగారి సినీమా కావడంవలన చక్కన్న చెప్పిందే వేదం. ఆ చక్రాయుధానికి తిరుగులేదు. ఓ కన్నడ సినీమా కథను తీసుకొని దాని రంగు, రుచి, వాసన అన్నీ మార్చేసి హాస్య రస ప్రధానమైన ట్రీట్మెంట్ తో టైటిల్ రోల్ ను సూర్యకాంతానికి ఇచ్చి "గుండమ్మకథ" ను నిర్మించారు విజయావారు.
గుండమ్మకధ సంగీత నిర్వహణా భాధ్యత లను ఘంటసాలవారి కి అప్పగించారు. మాయాబజార్ తర్వాత ఘంటసాల విజయాకు సంగీతం చేసిన తెలుగు, తమిళ చిత్రం "గుండమ్మ కథ". గుండమ్మకధ లో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్, సావిత్రి , జమున. తమిళం వెర్షన్ " మణిదన్ మారవిల్లై" లో ఎన్టీఆర్ కు బదులు సావిత్రి జోడీగా జెమినీ గణేశన్ నటించారు. తెలుగులోని ట్యూన్లే తమిళంలో ఉపయోగించారు. గాయకులు వేరే.
పాటల పంపకం విషయంలో చక్రపాణి, కమలాకర, పింగళి, ఘంటసాల చాలా జాగ్రత్తగా వ్యవహించారు. ఒకరికి అట్టు ఒకరికి ముక్క అని కాకుండా ఉన్న ఎనిమిది పాటలను అక్కినేని, ఎన్.టి.ఆర్., సావిత్రి, జమునల మధ్య సరిమానంగా పంచారు. అందరికీ చెరి ఒక సోలో, రెండేసి డ్యూయెట్ల చొప్పున ఏ హెచ్చుతగ్గులు లేకుండా పంచారు. ఘంటసాలవారి సంగీతంలో పాటలన్నీ అమృతప్రాయంగా రూపొందాయి. ఈ చిత్రంలో ఘంటసాల ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల మధ్య వారధిలా నిల్చారనడంలో సందేహమేలేదు. తన కంఠస్వరాన్ని ఏక కాలంలో ఇద్దరి హీరోలకు ఎరువిచ్చి,ఆ పాటలను వారే పాడుతున్నారా అనే అనుభూతిని కల్పించారు. "కోలు కోలోయన్న కోలో నా సామి" పాటలో ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ఇద్దరికి ఘంటసాలవారి గాత్రం వినిపిస్తుంది. ఆ ఇద్దరు నటుల మధ్య కంబైన్డ్ షాట్స్ లేకపోయినా ఆ పాటను వేర్వేరు సమయాలలో షూట్ చేసి ఒకే సన్నివేశంలో ఇద్దరు హీరోలను, ఇద్దరు హీరోయిన్ లను రసవత్తరంగా చూపిన ఘనత కెమేరామెన్ మార్కస్ బార్ట్ లీ కే దక్కుతుంది.
"మౌనముగా నీ మనసు పాడిన" పాటలో అటు ఎ.ఎన్.ఆర్ ను , ఇటు జమునను ఇద్దరినీ ముగ్ధమనోహరంగా చూపించారు బార్ట్ లీ. ఆ పాటను మధురాతిమధురంగా ఆలపించి తేనెల వానలో మత్తెక్కి మైమరచిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించారు ఘంటసాల మాస్టారు.
మోహన రాగ సమ్మోహనత్వాన్ని అంతా రెండు చరణాల అంతంలో వచ్చే తన ఆలాపనలోనే నింపారు ఘంటసాలగారు. రెండవ ఆలాపనలో మూడు స్థాయిలలో మోహన రాగ స్వరూపాన్నంతా చూపించిన విధానం ఘంటసాలవారికి మాత్రమే సాధ్యం. మోహనరాగ సున్నితత్వం, లాలిత్యం అంతా ఘంటసాలవారి గళంలో, వాద్యబృంద నిర్వహణలో గోచరిస్తుంది. ఘంటసాల మాస్టారు ఈపాటలో సితార్, ఫ్లూట్, పియానో, డబుల్ బేస్, వైయొలిన్స్, తబలా, డోలక్ వంటి చాలా తక్కువ వాద్యాలను మాత్రమే ఉపయోగించారు. ఒక పాట పదికాలాలపాటు ప్రజలకు గుర్తుండాలంటే పాట సాహిత్యం, సంగీతం సరళంగా, సులభంగా వుండాలి. వాద్యగోష్టి సున్నితంగా గాయకుడిని అనుసరించిపోవాలే తప్ప, అఖ్ఖరలేని జోరు , హోరుతో గాత్రాన్ని అధిగమించి పోకూడదనేది ఘంటసాలవారు పాటించిన సూత్రం.
"గుండమ్మకథ", తమిళ వెర్షన్ "మణిదన్ మారవిల్లై" రెండూ ఒకేసారి తీశారు విజయావారు. ఘంటసాలగారే తమిళ చిత్రనికి కూడా సంగీత దర్శకుడు. జెమినీ గణేశన్ పాటలను శీర్కాళి గోవిందరాజన్, అక్కినేని పాటలను ఎ.ఎల్.రాఘవన్ పాడారు. ఇందులో ఓ విశేషం ఏమంటే హీరోల పాటల్లో వినవచ్చే రాగాలాపనలు అన్నీ ఘంటసాలగారు తెలుగుకోసం పాడిన ఆలాపనలే. తమిళంలో కూడా ఈ పాటలన్నీ మంచి జనాదరణ పొందాయి. ఆ పాటలన్నీ ఇప్పటికీ టివి ఛానల్స్ లో దర్శనమిస్తాయి.
ఆరు దశాబ్దాలుగా శ్రోతలను సమ్మోహనపరుస్తున్న ఘంటసాలవారి ఈ మోహనరాగం సజీవంగా సదా మీ మదిలో మెదులుతూ అక్కినేని వారి శత జయంతి సందర్భంగా మిమ్మల్నందరిని ఆనందపరుస్తుందనే భావిస్తున్నాను.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.