"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
చిత్రం - చంద్రహారం
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల
"ఏమిటీ! సినిమాలలో పాటలు పాడడానికి ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చావా! ఇంతకీ 'సాపాసా'లు పట్టగలవా! ఈ మాట తరచూ నా చిన్నప్పుడు పాండీబజార్లో వినిపించేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడలాటి బాదరబందీయేమీ లేదు సినిమా లో పాటలు పాడడానికి.
సంప్రదాయ సంగీతంలోని ప్రాథమిక సూత్రాలను (basics) నిత్య సాధన ద్వారా అధ్యయనం చేయడం. 'సరిగమ పదనిస'; 'సనిదప మగరిస' సప్త స్వరాలు. ఈ సప్తస్వరాలను అనేక కాంబినేషన్లలో వివిధ స్థాయిలలో, వివిధ కాలగతులలో శ్రుతిలయలను సమన్వయపర్చుకుంటూ సాధన చేయడం. ఇందుకుగాను 16 వ శతాబ్దానికి చెందిన కర్ణాటక దేశపు పురందరదాసులవారు అభ్యాస సంగీతానికి కావలసిన సిలబస్ ను రూపొందించారు. సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, గీతాలతో ప్రారంభించి క్రమక్రమేణా స్వరజతులు, వర్ణాలు, కీర్తనలు, కృతులు, జావళీలు, తిల్లానా, ఇత్యాది శాస్త్ర గ్రంథం నేర్చుకోవడానికి కావలసిన విధివిధానాలను ఏర్పరిచినది పురందరదాసులవారే. ఈనాడు మనం నేర్చుకుంటున్న, వింటున్న సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు అన్నీంటిని పురందరదాసులవారు 'మాయామాళవగౌళ రాగం'లో నిర్దేశించారు.
'సరిమా గరి సరి గరిస
రిమ పద మప దప మగరిస'
లంబోదర లకుమికర
అంబాసుత అమరవినుత'
అని సంగీత విద్యార్థులంతా ప్రప్రథమంగా నేర్చుకునే పురందరదాసు గీతం కూడా మాయామాళవగౌళ రాగ జన్యమే. మలహరి రాగం. మాయామాళవగౌళ అతి ప్రాచీనమైన రాగం. దీని పూర్వనామం మాళవగౌళ. 72 మేళకర్త రాగ చట్రం రూపొందినప్పుడు మాళవగౌళ రాగానికి ముందు 'మాయా' అనే మాటను చేర్చి 15వ మేళకర్త గా 'మాయామాళవగౌళ' అనే నూతన నామాన్ని సృష్టించడం జరిగింది. సంగీత ప్రపంచమంతా సదా స్మరించుకోదగ్గ మహనీయులు ముగ్గురే ముగ్గురు - 13వ శతాబ్దంలో కాశ్మీర దేశంలో పుట్టి మహారాష్ట్ర దేశానికి వలసపోయిన సారంగదేవుడు; రెండవవారు 16వ శతాబ్దానికి చెందిన కర్ణాటక దేశ సంగీత విద్వాంసుడు, శ్రీవైష్ణవ భక్తుడు అయిన పురందరదాసులవారు; మూడవవారు 17 వ శతాబ్దంలో తంజావూరు సంస్థాన మంత్రి, సంగీత విద్వాంసుడు, పండితుడైన వెంకటమఖి.
సారంగదేవుని 'సంగీత రత్నాకరం', పురందరదాసులవారి అభ్యాస సంగీతం, రాగవిభజన చేస్తూ వెంకటమఖి వ్రాసిన 'చతుర్దండి ప్రకాశిక అనే సంగీతగ్రంధం. ఆనాటినుండి ఈనాటివరకు ఎంతటి ఘనమైన సంగీతవిద్వాంసులైనా పరమపవిత్రంగా, మార్గదర్శకంగా, ఆదర్శనీయంగా భావిస్తూ అనుసరిస్తూ వస్తున్న ఉత్కృష్ట సంగీత గ్రంధాలు. కర్ణాటక సంగీతమంటే కర్ణాటక దేశంలో పుట్టిన సంగీతమని అర్ధంకాదు. కర్ణం అంటే చెవి. చెవికి ఇంపుగా, శ్రావ్యంగా వినిపించే సంగీతం కర్ణాటక సంగీతంగా భావించాలి. అటువంటి కర్ణాటక సంగీతాన్ని అభ్యసించేవారంతా ముందుగా నేర్చుకునే రాగం - 15వ మేళకర్త యైన 'మయామాళవ గౌళ'. ఈ రాగంలోనే ప్రాథమికంగా నేర్చుకోవలసిన సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు స్వరపర్చబడ్డాయి. గురువులు వాటిని ఎలా నేర్పుతారో సంక్షిప్తంగా ఈ క్రింది ఆడియో లలో విందాము. కర్ణాటక సంగీత విద్యార్థి తన ప్రాథమిక సంగీతాన్ని మాయామాళవగౌళ రాగంతో నేర్చకోవడం ప్రారంంభిస్తాడు. ఈ రాగంలో స్వరస్థానాల అమరిక, అంటే స్కేల్ పూర్వాంగ, ఉత్తరాంగాలు సమతుల్యం కలిగి వుండడం, రెండు, రాగంలో ఎక్కడా వివాది స్వరాలు లేక పోవడం, మొదలైన విషయాలు ప్రాథమిక సంగీత శిక్షణకి మాయామాళవగౌళ రాగమే అత్యంత అనుకూలమైన రాగంగా మన సంగీతజ్ఞులు భావించారు. మాయామాళవగౌళ రాగం శాంత, శోక, వైరాగ్య రసాలను ప్రకటించడానికి అనువైనరాగం. ఉదయ, సాయంసంధ్యా సమయాలలోనే కాక అన్ని వేళలా ఆలపించదగ్గ రాగం. మాయామాళవగౌళ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం. 'భైరవ్' . 'బౌళి', 'గౌళ', 'రేవగుప్తి', 'లలిత', 'మలహరి', 'నాదనామక్రియ' వంటి రాగాలు 15వ మేళకర్త మాయామాళవగౌళకు జన్యరాగాలుగా ప్రసిధ్ధి పొందాయి.
అటువంటి ఘన చరిత్ర కలిగిన మాయామాళవగౌళ రాగంలో ఘంటసాలగారు ఆలపించిన ఒక అద్భుతమైన గీతమే ఈనాటి మన సజీవరాగం. అదే చంద్రహారం చిత్రంలోని 'ఏనాడు మొదలిడితివో ఓ విధీ! ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి' అనే పింగళివారి గీతం. పింగళి సాహిత్యానికి స్వీయ సంగీత నిర్దేశకత్వంలో ఘంటసాల గానం.
పల్లవి:
ఏనాడు మొదలిడితివో ఓ విధీ!
ఏనాటికయ్యెనీ నాటక
సమాప్తి -2
చరణం 1:
జనన మరణాలతో
సుఖ దుఃఖములతో -2
ప్రాణులను ఆడించి
పీడింతువేమయ్యా-2
ఎన్నెన్నొ వేడుకల ఈ
సృష్టి కల్పించి-2
కనుమూయునంతలో మాయజేసేవయ్య
!ఏనాడు!
చరణం 2:
నేను నాదను ఆశ
గగనానికెక్కించి-2
అంతలో పాతాళమున
దింతువేమయ్య
!అంతలో!
తనువు శాశ్వతమంటు
మైమరువజేసి-2
తనువును జీవిని
విడదీతువేమయ్య
ఏనాడు మొదలిడితివో ఓ
విధీ
ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి "
జీవితం ఒక నాటకరంగం. ఒక్క జీవితమనేమిటి! ఈ విశ్వమంతా నిత్యనూతన నాటకరంగం. జీవులంతా అందులోని చిత్రవిచిత్ర పాత్రధారులు. సర్వసాక్షియైన పరమాత్మే ఈ జగన్నాటకానికి సూత్రధారి. విధి చేసే వింతలన్నీ మతిలేని చేష్టలుగా కనిపించినా, విధివిలాసాన్ని తప్పించే దుస్సాహసాన్ని ఎవరూ చేయలేరు. కన్నుతెరిస్తే జననం; కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలమే నీ సొంతం. ఆ మూణ్ణాళ్ళ ముచ్చటను కూడా సంపూర్ణంగా అనుభవించకుండా రకరకాల కష్టనష్టాలను కల్పించి జీవుడు దుఃఖపడుతూంటే తాను నడిపించే నాటకాన్ని వినోదంగా చూసి ఆనందించే ఈశ్వరుడితో ఏ విధంగా మొరపెట్టుకోగలడు ' ఏనాడు మొదలిడితివో ఓ విధీ ఏనాటికయ్యెనీ
నాటక సమాప్తి' అని దైన్యంగా కుమిలిపోవడం తప్ప.
చందనదేశపు భావి మహారాజు చందనరాజును (ఎన్.టి.ఆర్) ఐదేళ్ళ ప్రాయం నుండే తన సంరక్షణలో కంటికి రెప్పగా పెంచి పెద్దచేసి అన్ని విద్యలలో ఆరితేరినవాడిగా చేస్తాడు మాలి (ఎస్.వి.రంగారావు). ఒక దేవకన్య మోహానికి, శాపానికి గురియై అల్పాయుష్కుడైన యువరాజు దుస్థితిని తలచుకొని విరక్తిగా మాలి పాడిన పాట ఇది.
చంద్రహారం లోని ' ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరి' పాటను గతంలోనే సజీవరాగంగా వినిపించేను. చంద్రహారం సినిమాలోని అన్ని పాటలు ఆపాతమధురాలే. నాకు ఎనిమిది సంవత్సరాల వయసులో విజయనగరం లో 'చంద్రహారం' సినీమా చూసేను. ఆ వయసులో అందులోని ఎన్నో పాటలు నన్ను ఆకర్షించి వుండవచ్చు కాని అలా జరగలేదు. వివిధ భావావేశాలతో ఘంటసాలగారు సమ్మోహనకరంగా ఆలపించిన ఓ మూడు పాటలు మాత్రం ఆనాటినుండి ఈనాటివరకు నా మెదడులో స్థిరోభవా గా నిలిచిపోయాయి. అవి 'విజ్ఞానదీపమును వెలిగింపరారయ్యా', 'ఇది నా చెలి ఇది నా సఖి', 'ఏనాడు మొదలిడితివో ఓ విధీ' అనే పాటలు.
ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి మాయామాళవగౌళ రాగాన్ని ఎన్నుకోవడంలో ఎంతో ఔచిత్యాన్ని, విజ్ఞతను పాటించారనిపిస్తుంది. కారణం , మాయామాళవగౌళ సంపూర్ణరాగం. శాంత, శోక రసాల ప్రకటనకు చాలా శ్రేష్టమైనది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ రాగంలో ఎక్కడా వివాది స్వరాలు లేకపోవడం, ఆరోహణ, అవరోహణ క్రమంలో స్వరస్థానాల అమరిక సమతుల్యం కలిగివుండడం వలన ఈ గీత స్వరరచన అద్భుతంగా సాగింది. ఈపాట ఆద్యంతం ఘంటసాలవారి గళంలో ధ్వనించిన ఆర్ద్రత, నైరాశ్యం అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో! నాదం పెదవుల మధ్యనుండి కాదు, నాభిస్థానం నుండి హృదయాంతరాళాలనుండి రావాలనే గురువుల బోధనా సూత్రాన్ని ఘంటసాలగారు తు.చ. తప్పకుండా తన జీవితాంతం ఆచరించారు.
తగుమాత్రపు వాద్యాలు మాత్రమే ఈ పాటలో వినిపిస్తాయి. అందుకుగాను వైలిన్స్, ఏక్ తార, హేమండ్ ఆర్గన్, కోల్, ఫ్లూట్, క్లారినెట్ వంటి వాద్యాలను ఉపయోగించుకున్నారు ఘంటసాల.
చంద్రహారం సినీమా డైరెక్టర్ కమలాకర కామేశ్వరావుగారి మొట్టమొదటి సినిమా. సూపర్ విజన్ ఎల్విప్రసాద్. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మితమైన చిత్రం చంద్రహారం. తమిళం వెర్షన్ కు ఘంటసాలగారే సంగీతం నిర్వహించి కొన్ని పాటలు కూడా పాడారు.
1954 ల నాటికే అక్షరాల 25 లక్షల రూపాయలను దిగమ్రింగి నిర్మాత ల మాడు పగలగొట్టిన భారీ జానపద తెలుగు చిత్రం చంద్రహారం. అందుకు వారి రెండవ చిత్రమైన పాతాళభైరవిలోని ఎన్.టి.ఆర్, ఎస్.వి.రంగారావు సృష్టించిన ఇమేజే పెద్ద కారణమయిందని చెప్పుకోవడం జరిగింది. సామాన్య ప్రేక్షకుడు ఆశించే కత్తియుధ్ధాలు, సాహసాలు, థ్రిల్స్ ఏవీ లేకుండా 'ఎన్టీఓడు' పది రీళ్ళపాటు కళ్ళుమూసుకు పడుక్కునే వుంటే సినీమా ఏం ఆడుద్దని' చక్కన్నగారు అభిప్రాయపడ్డారట.
బాక్సాఫీస్ దగ్గర జయాపజయాల విషయం పక్కన పెడితే చంద్రహారం ఉన్నత విలువలతో నిర్మించబడిన ఉత్తమ సంగీతభరిత చిత్రం. అందులోని ఎన్నో పాటలు ఈనాటికీ సజీవ రాగాలే.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment