Saturday, 1 November 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 106వ భాగం - ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటయైదవ భాగం ఇక్కడ

106వ సజీవరాగం - ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా...

చిత్రం - శ్రీకృష్ణమాయ
గానం - ఘంటసాల
రచన - 
రావూరు సత్యనారాయణ రావు
సంగీతం - టి.వి.రాజు

పల్లవి:

జీవా! జీవా! ఆ... ఆ...

ముక్తి మార్గమును కనలేవా

మాయా మోహమయ జీవా! 

                            !ముక్తి మార్గము!

 

చరణం 1:

భ్రాంతుడవై బహు మాయలబడి

యీ బ్రతుకే స్థిరమని నమ్మేవా-2

శాంతుడవై చని వెదకు మదేదో-2

శాశ్వతమగు త్రోవ.... జీవా! 

                            !ముక్తి మార్గము!

చరణం 2: 

సారము లేని సంసార జలధిబడి

సత్యానందము గనలేవా -2

దారాపుత్ర ధనధాన్యాధిక

మమకారపు జాడ్యము కొన్నావా... జీవా! 

                               !ముక్తి మార్గము!

చరణం 3: 

మిథ్యామయమౌ మాయాజగమిది-2

మది విడువుమురా జీవా-2

నిత్యసత్యమౌ పరంజ్యోతిగని

దరిజేరుమురా జీవా! 

                            !ముక్తి మార్గము!

 కనలేవా... జీవా...

"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపహః" అనే సామెత  ఎప్పుడైనా విన్నారాజపం విడచి లొట్టల్లోపడడంలాటిదే! దీని వెనుక చిన్న తమాషా కథ ఒకటి వుంది.

నీతి నియమాలు లేకుండా, చపలచిత్తంతో మాయామోహ సాగరంలో కొట్టుమిట్టాడే తొంభైతొమ్మిది శాతం గంజాయి సన్యాసులను ఉద్దేశించి శ్రీ రామకృష్ణ పరమహంస తన "కథామృతం" లో చెప్పిన పిట్టకథ.

ఊరికి దూరంగా ఉండే అడవిలో ఒక సన్యాసి  ఒంటరిగా తపస్సు చేసుకుంటూవుండేవాడు. జన్మరాహిత్యంతో కూడిన ముక్తిని పొంది పరమాత్ముని సన్నిధి చేరాలని అతని సంకల్పం. అలా ముక్కుమూసుకొని జపం చేసుకునే ఆ సన్యాసికి అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. బక్కచిక్కిన దేహాన్ని కప్పిపుచ్చే చాలీచాలని అంగవస్త్రాలను, కౌపీనాలను(గోచీలు) ఎలుకలు వచ్చి పాడుచేయడం మొదలెట్టాయి. ఆ ఎలుకల బెడదనుండి తప్పించుకునేందుకు ఆ సన్యాసి ఒక పిల్లిని పెంచడం మొదలెట్టాడు. ఆ పిల్లి ఆకలి తీర్చే పాలకోసం ఒక ఆవును తెచ్చి కూటీరంలోపెట్టాడు. ఆ ఆవును సంరక్షించడం కోసం ఒక పనివాడిని ఏర్పాటు చేయవలసివచ్చింది. ఆ కుర్రాడి ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక ఆడదిక్కు కావలసివచ్చింది. సన్యాసులుండే చోట ఆడవాళ్లు ఎలావుంటారు. తన గోచీలనుపిల్లినిఆవునుపని పిల్లవాడిని సరంక్షించేందుకు ఒక స్త్రీని పెళ్ళాడవలసి వచ్చింది. క్రమక్రమంగా తన లక్ష్యసాధనలో వెనకబడ్డాడు. ఇహలోక వాంఛలకు దూరంగావుంటూ ముక్తిని పొందాలనుకున్న ఆ సన్యాసి  సంసార జంఝాటంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు.

ముక్తి సాధన కోసం మరొక జన్మ ఎత్తకా తప్పలేదేమో ఆ సన్యాసికి. 'మిథ్యామయమౌ మాయా జగమిది... నిత్య సత్యమౌ పరంజ్యోతిగని దరిజేరుమురా... ముక్తిమార్గమును కనలేవా... జీవా!' అని భూలోకవాసులను ఆశాపాశములనుండి సంరక్షించి ఉధ్ధరిస్తానని అహంకారంతో  ఒక సినీ  నారదుడు  ఆలపించిన గీతమే నేటి మన సజీవరాగం.

భారతీయ ఆథ్యాత్మిక, తాత్త్విక చింతనలో ప్రధానమైనది ముక్తి సాధన. అసలు ముక్తి అంటే ఏమిటి?దానిని పొందడానికి సనాతనాచారపరులు ఎందుకంత తాపత్రయపడతారు?

ముక్తి అంటే విముక్తి, అంటే విడుదల. జననమరణాలనుండిఇహలోక భవబంధాలనుండి, ఆశాపాశ వలయం నుండి శాశ్వత స్వాతంత్ర్యం. బాహ్యదృష్టికి అగోచరమై సకల ప్రాణులను తన ఆధీనంలో వుంచుకునే ఆ పరమాత్మలో లీనమై శాశ్వత ఆనందస్థితికి చేరుకోవడమే ముక్తి.

అయితే ఈ ముక్తి సాధన అంత సులభమైనది కాదు. పంచేంద్రియాలను తన ఆధీనంలో వుంచుకొనిఇహలోక వాంఛలకు, సుఖాలకు అతీతంగామనసావాచాకర్మేణా సత్య ధర్మాలను పాటిస్తూ సదా భగవత్చింతనలోనే కాలంగడపాలి. ఎన్నో జన్మల కర్మ పరిపక్వత చెందితేనే కానీ ముక్తి సాధ్యంకాదు. ముక్తి సాధనకై మన వేదాంతులు అనేక మార్గాలను సూచించారు. వాటిలో ప్రముఖమైనవి

సాలోక్యసారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తులు. వీటన్నిటి పరమార్థం మరుజన్మ లేకుండా పరమాత్మలో ఐక్యంకావడం.  మహామహా జ్ఞానులలైన బ్రహ్మర్షులు మొదలు సర్వ సామాన్య పామర జనాల వరకూ ప్రతీ ఒక్కరూ ముక్తిని కోరుకునేవారే. భక్తిమార్గం ద్వారా ముక్తిని పొందడానికి అందరూ భక్తిని ఆశ్రయిస్తారు. ముక్తి ద్వారా విముక్తిని ఆశించేవారు పరిపూర్ణంగా భగవంతుని పట్ల భక్తివిశ్వాసాలతో శరణాగతిని పాటించాలి.

 అలాకాకుండా ....

'నా తెలివి తేటలకు మెచ్చె నలువ యెపుడో

సిధ్ధపురుషుండ వీవని శివుడు నుడివె

మాయకందవు నీవనె మాధవుండు

ముగురయ్యలు నన్నెద పొగడిరెపుడో'

 (వారణాశి సీతారామశాస్త్రి గారి పద్యం)

అని తనంతటి జ్ఞాని, మహాయోగి  లేడని, త్రిమూర్తులే తన మాటలకు లొంగిపోతారని అహంకారంతో విర్రవీగే నారదుడు, సంసారబంధమనే మాయలో పడి  జన్మ నిరర్ధకం చేసుకుంటున్న మానవులను ఉధ్ధరిస్తానని 'దారాపుత్ర ధనధాన్యాధిక మమకారపు జాడ్యము కొన్నావా.. జీవా! ముక్తి మార్గమును కనలేవా!' అని  జాలిపడే నారదునికి శ్రీకృష్ణుడు తన మాయతో   భార్యపుత్రులను అంటగట్టి మాయా సంసారకూపంలో పడవేసి ఆ మోహంనుండి   బయటపడలేక అతి సామాన్య పామర గృహస్తులా అజ్ఞానంతో ప్రవర్తించే నారదుని అహం అణచి జ్ఞానోదయం కలిగించడం  'శ్రీకృష్ణమాయ' సినిమా లోని ఒక రసవత్తర ఘట్టం. శ్రీకృష్ణుడితోపాటు ప్రేక్షకులందరికీ వినోదాన్ని కలిగించే సన్నివేశం. డైరెక్టర్ సి.ఎస్.రావు ఈ సినిమాను ఆద్యంతం చాలా వినోదభరితంగా ఆసక్తికరమైన రీతిలో తెరకెక్కించారు.

ముక్కు తిమ్మనగారి పారిజాతోపహరణంలోని 'నను భవదీయదాసుని' పద్యం ఈ సినిమా లోనే ప్రథమంగా వినవచ్చింది. కాకపోతే ఆ పద్యం శ్రీకృష్ణ, సత్యభామల పరంగా కాక నారదుడుమాయలపై చిత్రీకరించారు సి.ఎస్.రావు. అలాగే పద్యం చివరలో వచ్చే 'అరాళకుంతలాఅనే విశేషణాన్ని 'వినీలకుంతలా' గా మార్పు చేయించారు.

స్వతహగా దర్శక నిర్మాత అయిన కడారు నాగభూషణంగారు ఈ సినిమాను తాను డైరక్ట్ చేయకుండా అల్లుడు సి.ఎస్.రావుగారికి ఆ బాధ్యత ను అప్పగించారు.

రావూరు సత్యనారాయణ రావుగారి సాహిత్యం, టి.వి.రాజుగారి సంగీతంఘంటసాలవారి అద్వితీయ గళమాధుర్యం, అక్కినేని, కె.రఘురామయ్యల నటనాకౌశలం‌, వీటన్నిటితో  'ముక్తిమార్గమును కనలేవా' గీతం సజీవరాగమై మనలను అలరిస్తోంది. 

ఇదే పాటను మరొక సన్నివేశంలో మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు (కె.రఘురామయ్యగారు) కూడా పాడడం ఒక విశేషం. ఈ పాట  పాతకాలపు రంగస్థల పౌరాణిక నాటకాల ధోరణిని స్ఫురింపజేస్తుంది.  ఒకరకంగా ఘంటసాల, రఘురామయ్యగార్ల మధ్య ఈ పాట పోటీ పాటగా అనిపిస్తుంది.

టి.వి.రాజుగారు 'ముక్తిమార్గమును కనలేవా' పాటను సింధుభైరవి రాగంలో చేశారు.  వాద్యగోష్ఠిలో పెద్ద హంగామా చేయకుండా గాయకుల గాత్రాన్ని అనుసరించిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను టి.వి.రాజు సమకూర్చారు.

సింధుభైరవి కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలో బహుళ ప్రచారంలో వున్న రాగం. కర్ణాటక శైలిలో 8వ మేళకర్త హనుమత్తోడికి జన్యరాగం. హిందుస్థానీ సంగీతంలో సింధుభైరవి అసావేరి థాట్ కు చెందిన రాగం. భక్తి, కరుణ,శోకంవిరహం వంటి రసాల ఆవిష్కరణకు చాలా అనువైన రాగం సింధుభైరవి. సింధుభైరవిలో అసంఖ్యాకంగా సినీమా పాటలు వచ్చాయి. ఘంటసాలగారు పాడిన సింధుభైరవి పాటలెన్నో ఈనాటికీ అజరామరంగా శ్రోతలకు వీనులవిందు చేస్తున్నాయి. 1950-65ల మధ్య ఘంటసాలవారి గళం గురించి చెప్పాలా! అమృతతుల్యమే.  తనకు సహజంగా అలవాటైన 1-1/2 శ్రుతిలోనే 'ముక్తి మార్గమును' పాటను ఘంటసాలగారు నల్లేరుమీద బండి వాటంగా చాలా సునాయాసంగా పాడారు.  అక్కినేని-నారదుడి కి ఘంటసాల-నారదుడు పాడిన మరో అద్భుత గీతం. రాగాధారిత గీతాలెప్పుడూ శ్రోతలకు శ్రవణానందకరమే.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...