"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
చిత్రం - పెళ్ళిచేసి చూడు
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల
రాధనురా ! నీ
రాధనురా -2
రాసలీలల ఊసే తెలియని
!రాధనురా!
చరణం 1:
కసుగాయల కారాధననురా
- రాసలీలల
వలపున కుమిలే
ప్రణయజీవులకు
వల్లమాలిన బాధనురా
!రాధనురా!
చరణం 2:
ఎంతో తెలిసిన
వేదాంతులకే
అంతుదొరకని గాధనురా
మధురానగరి
మర్మమెరిగిన
మాధవ నీకే సుబోధనురా!
!రాధనురా!అన్నీ తెలిసిన వేదాంతులకే అంతుదొరకని గాధ రాధ... మధురానగరి మర్మమెరిగిన మాధవునికే సుబోధ రాధ... ఎవరీ రాధ?
సంఘంలో సనాతనధర్మ పరిరక్షణ కోసం, పామర జనాలలో ఆధ్యాత్మిక, భక్తిభావనలు పెంపొందించి వారు భగవంతుని సన్నిధిని చేరి ముక్తిని పొందే మార్గం కోసం మహానుభావులెందరో యుగయుగాలుగా అన్వేషణ సాగిస్తూనేవున్నారు. కలియుగంలో కూడా నాగరికత పెరిగినకొలది భగవంతుని ఉనికికి సంబంధించిన జిజ్ఞాస అమితంగా పెరిగింది. ధర్మపరిరక్షణ కోసం పరమాచార్య త్రయం -- జగద్గురు ఆదిశంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిధ్ధాంతాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఈ మూడు సిధ్ధాంతాలతోపాటు ద్వైతాద్వైత , శుధ్ధాద్వైత సంప్రదాయాలు కూడా ఉద్భవించాయి. జీవాత్మ, పరమాత్మ ఒకటేనా? లేక , వేర్వేరా? వాటి ఉనికిని గురించి, అనుసంధానం గురించి, జీవి పరమాత్మలో లీనమై ముక్తిని సాధించడానికి సంబంధించిన తార్కిక, వేదాంత బోధనలు, చర్చలు, వాద ప్రతివాదాలు కొనసాగుతునేవున్నాయి. ఈ వివిధ మార్గాల సిధ్ధాంతాలలో ఉత్తమమైనదేది అనే విషయంలో ఏకగ్రీవ నిర్ణయం సాధించలేక వేదాంతులు, మఠాధిపతులు, సాధు సత్పురుషులు వారి వారికి నచ్చిన మార్గాన్ని అనుసరించసాగారు.
వీటన్నిటికి తోడుగా మరొక సిధ్ధాంతం కూడా ప్రాచుర్యంలోకి తీసుకురాబడింది. అదే - రాధా మాధవ ప్రణయ భక్తి తత్వం. పరమాత్మ సృష్టించిన స్త్రీమూర్తి యొక్క రెండు అంశలలో ఒకటి శ్రీలక్ష్మిగా మహావిష్ణువును చేరగా, మరొక అంశ రాధగా గోకులాన జన్మించి కృష్ణుని ప్రాణ సఖిగా రాధామాధవ ప్రణయభక్తి సిధ్ధాంతానికి మూలపురుషులైయ్యారు. మహాభాగవత పురాణంలో అక్కడక్కడ రాధ ప్రసక్తి కనిపించినా రాధాకృష్ణుల ప్రణయ సంబంధం విషయమై వేదాంతులకే అంతుచిక్కని రహస్యాలెన్నో నిక్షిప్తమై వున్నాయనే భావిస్తారు. రాధామాధవ తత్త్వం అలౌకికమైన ప్రణయ తత్త్వం. జీవాత్మ, పరమాత్మల ఆత్మీయతానుబంధ తత్త్వం. కృష్ణుని కోసమే పుట్టిన రాధ తన ఆత్మను పరమాత్మ యైన కృష్ణునికే అర్పించుకున్నది. రాధది మధురభక్తి. అన్నమాచార్య, జయదేవ కవుల భక్తి శృంగార రచనలెన్నో రాధాకృష్ణుల మధురప్రేమ తత్త్వానికి ప్రతీకలు.
అలౌకికమైన రాధమాధవ ప్రణయం పరమ పవిత్రం, రసవత్తరం, ఆదర్శవంతం అని భావించి తరించే భక్తులెందరో. అలాటి ఒక ప్రణయారాధకుడు తనను తాను రాధగా ఊహించుకొని తన మనోభావాలను ఒక మధురగీతంగా ఆలపిస్తున్నాడు. ఆ గీతమే నేటి ఘంటసాలవారి సజీవరాగం...
ఆజన్మ బ్రహ్మచారి పింగళి నాగేంద్రరావుగారి హాస్య, చమత్కార, శృంగార గీతం - 'రాధనురా నీ రాధనురా' 1952ల నాటి 'పెళ్ళిచేసి చూడు' చిత్రంలోనిది. కొత్తగా పెళ్ళయి మనుగుడుపులకోసం అత్తవారింటికి చేరిన కొత్త పెళ్ళికొడుకు భార్య, బావమరదుల సమక్షంలో మనసువిప్పి, కులాసాగా హాయిగా పాడుతున్న పాట. మనోజ్ఞమైన స్వీయ స్వరకల్పనలో బల్ హుషారుగా ఘంటసాల మాస్టారు గానం చేసిన గీతం. 1952 లోని 'పెళ్ళిచేసి చూడు' సినీమానాటికే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాలగారు ఎంత ప్రాచుర్యం పొందారో పింగళివారి ఈ కితాబు చూస్తేనే తెలుస్తుంది. పెళ్ళిచేసి చూడు సినిమా ట్రైలర్ లో ఘంటసాలగారిని గురించి ఇలా అన్నారు...."ఇంట ఇంటను గంట గంటకు ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ". సినిమా పబ్లిసిటీ కోసం పెళ్ళి పిలుపుగా రాసిన ఈ పాటను పాడింది కూడా ఘంటసాలగారే. "రసపట్టులెరిగి, భావోచితరాగ సరళిని శబ్దోచిత రమ్యతనూ సమకూర్చి బాణీలు కట్టుటలో ఘంటసాల గానకళా పట్టభద్రుడే" అని అన్న పింగళి వాక్కులు అక్షరలక్షలే.
పెళ్ళిచేసి చూడు సినిమా ద్వారా అంతవరకు ఏ సినిమా సంగీతదర్శకుడు ఉపయోగించని చక్రవాకం, చారుకేశి వంటి సంప్రదాయ రాగాలను శ్రోతలకు పరిచయం చేశారు ఘంటసాల. శ్రీ కొడవటిగంటి కుటుంబరావు అంతటి రచయిత, విమర్శకుడు ఈ చిత్ర సంగీతం పై సమగ్ర వ్యాసాలు ప్రచురించి ఘంటసాల సంగీతప్రతిభను ఎంతగానో కొనియాడారు. పెళ్ళిచేసి చూడు లోని ప్రతీ పాటా ఒక ఆణిముత్యం. శ్రావ్యమైన ఘంటసాల గళం సంగీతాభిమానులకు తన్మయత్వాన్ని కలిగించింది. హీరో ఎన్.టి.రామారావుకు ఘంటసాల గాత్రం తప్పనిసరి అనే భావన ప్రజలలో కలిగించిన సినిమా పెళ్ళిచేసి చూడు. అభ్యుదయ వాదియైన కథానాయకుడు మంచి సంగీతాభిలాషి కూడా. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుకునే అలవాటు. కానీ, కథానాయకుడు ఎన్.టి.ఆర్ కు హార్మోనియం పట్టుకోవడమే తెలియదు. అందువల్ల ఘంటసాలగారు వాహినీ స్టూడియోలో పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన అనుమతితో పక్కనే కూర్చొని హార్మోనియం ఎలా వాయిస్తారో క్షుణ్ణంగా పరిశీలించి, ఆకళింపుచేసుకొని ఆ పాటల షూటింగ్ లో పాల్గొన్నట్లు చెపుతారు. ఆనాటి కళాకారులలో వుండే sincerity, commitment అలాంటిది.
'రాధనురా నీ రాధనురా' పాట కూడా హీరో హార్మోనియం వాయిస్తూ పాడేదే. బావమరది పాత్రధారి నటుడు జోగారావు తబలిస్ట్. ఈ ఇద్దరు కలసి చేసిన గానాబజానా ఆ కాలపు పెళ్ళింటి వాతావరణాన్ని మన కళ్ళముందుంచుతుంది. ఘంటసాలగారు ఈ పాటకు నఠభైరవి రాగాన్ని ఉపయోగించారు. నఠభైరవి కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త. అంటే, ఆరోహణ, అవరోహణ క్రమంలో ఏడు స్వరాలు గల సంపూర్ణరాగం. హిందుస్థానీ బాణీలో నఠభైరవి ని అసావేరి థాట్ గా చెపుతారు. నఠభైరవి భక్తిరస ప్రధాన రాగం. 'రాధనురా నీ రాధనురా' పాట మంద్రస్థాయిలో ఒకదగ్గర కాకలినిషాదం, మరోదగ్గర ప్రతిమధ్యమం అన్యస్వరాలుగా ప్రయోగం చేసినా అది నఠభైరవి రాగ స్వరూపానికి ఇబ్బందికరం కాని రీతిలో ఘంటసాల ఈ పాటను నడిపించారు. ఈ నాడు వస్తున్న పాటలతో పోలిస్తే చాలా చిన్న పాట. పల్లవి ఓ రెండు చిన్న చరణాలు మాత్రమే గల పాట. అయినా, కవిగా పింగళి, స్వరకర్త గాయకుడిగా ఘంటసాల తమ తమ ముద్రలను ప్రస్ఫుటం చేసి ఈ పాటను సజీవరాగం చేశారు. ఘంటసాలవారి కంఠంలోని మార్దవం, మధురత్వం శ్రోతలకు మైమరపును కలిగిస్తుంది.
ఈ పాటకోసం
ఘంటసాలగారు ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, హార్మోనియం, పియోనా, తబలా, డోలక్, మువ్వల వంటి
వాద్యాలను ఉపయోగించారు.
తెరపై ఎన్.టి.ఆర్.,
జోగారావు, జి వరలక్ష్మి, మాస్టర్ కుందు, బాలకృష్ణ, పద్మనాభం చక్కని హావభావాలు కనపర్చి అలనాటి పెళ్ళింటి వాతావరణాన్ని జ్ఞప్తికి
తెచ్చారు.
డెభ్భై ఎనభై ఏళ్ళ క్రితం మన సమాజంలో వ్రేళ్ళు తన్నుకుపోయిన వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ అభ్యుదయ భావాలతో నిర్మించబడిన హాస్యరస కుటుంబకథా సాంఘిక చిత్రం 'పెళ్ళిచేసి చూడు'. ఈ సినిమా పెద్దలకు మాత్రమే కాదు చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లల పాత్రలకే నాలుగు పాటలను పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు.
ఒక సినిమా విజయానికి స్టార్ వాల్యూ కంటే స్టోరీ వాల్యూయే ముఖ్యమని నిరూపించిన సినిమా పెళ్ళిచేసి చూడు. ఈ సినిమా హీరో అయిన ఎన్.టి.రామారావు పాత్ర సినిమా ప్రారంభమైన అరగంట తర్వాతే ప్రవేశమౌతుంది. దీనినిబట్టి చూస్తే ఆనాటి దర్శక నిర్మాతలు చక్కని కథాకథనానికి శ్రావ్యమైన పాటలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది.
విజయా ప్రొడక్షన్ చక్రపాణిగారికి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారికి హాస్యరసమంటే మక్కువ అనే విషయం వారి సినీమాలన్నీ నిరూపిస్తాయి. అసభ్యత, వెకిలితనం లేని హాస్యం విజయా వారి చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు.
ఎల్.వి.ప్రసాద్ దర్శకుడిగా, ఘంటసాల సంగీత దర్శకుడిగా వచ్చిన చిత్రాలు ముచ్చటగా మూడు మాత్రమే. 'మనదేశం', 'షావుకారు', 'పెళ్ళిచేసి చూడు'. సంగీతపరంగా ఈ చిత్రాలన్నీ బహూళజనాదరణ పొందాయి. అయితే ఎల్.వి.ప్రసాద్ గారికి ఘంటసాలగారిపట్ల కలిగిన విముఖత కారణంగా ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రముఖులు కలసి ఏ సినిమాకు పనిచేయలేదు, విజయావారి 'అప్పుచేసి పప్పుకూడు' లో మాత్రం ప్రసాద్ గారికి ఘంటసాలగారి చేత పాడించక తప్పలేదు. ప్రసాద్ గారి సొంత చిత్రాలైన 'ఇలవేల్పు', 'ఇల్లాలు', లో ఘంటసాలగారి పాటలే లేవు. చిత్ర విచిత్ర మనస్తత్త్వాలతో నిండిన ఈ చిత్రసీమలో ఇలాటి రాగద్వేషాలను సర్వసాధారణంగానే పరిగణించి ఎవరి బాటలో వారు పయనం సాగిస్తారు.
ప్రణవ స్వరాట్

అధ్బుతమైన పాట, పెళ్లి చేసి చూడు చిత్రం లోని ఈ పాట.చాలా అరుదుగా మాత్రమే వినిపించే పాట వింటుంటే మనసుకు హత్తుకుని ఏదో లోకంలో విహరింప చేస్తుంది ఆ మహా గాయకులు శ్రీ ఘంటసాల గారి ని తెరవెలుగుగా అనిపిస్తుంది మనసుకు.చాలా చాలా ధన్యవాదములండీ ప్రణవ స్వరాట్ గారూ!
ReplyDelete