Saturday, 14 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 86వ భాగం - జో లాలీ... లాలీ నా చిట్టి తల్లీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయయిదవ భాగం ఇక్కడ

86వ సజీవరాగం - జో లాలీ... లాలీ నా చిట్టి తల్లీ   

చిత్రం - ధర్మదాత
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.

సంగీతం - టి.చలపతిరావు

పల్లవి : 

జో లాలీ... జో లాలీ ...

లాలీ నా చిట్టి తల్లీ

లాలీ ననుగన్న తల్లీ

లాలీ బంగారు తల్లీ

లాలీ నా కల్పవల్లీ

జో లాలీ.... జో లాలీ...

చరణం 1:

చిరునవ్వు కిరణాలు

చిందించు మోము

కన్నీరు మున్నీరుగా చూడలేను-2

నిను గన్న నీ తల్లి కనుమూసె గానీ-2

నిను వీడి క్షణమైన నేనుండగలనా-2

                                                !జో లాలీ!

చరణం 2: 

రతనాల భవనాల నిన్నుంచలేను

ముత్యాల ఉయ్యాల లూగించలేను-2

కనుపాపలా నిన్ను కాపాడుకోనా-2

నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా-2

                                                !జో లాలీ!

బంగారుతూగుటుయ్యాలలో మెత్తని పరుపుల మధ్య శయనించే కోటీశ్వరుల బిడ్డయినాపూరిగుడిసెలో లేదా ఆరుబయట చెట్టుకొమ్మలకు వేలాడదీసిన పాత చీర ఉయ్యాలలోని పేదవారి శిశువైనా ఆశించేది అమ్మ వెచ్చని ఒడిలో పరుండి చనుబాలు త్రాగడంమమతానురాగపూరితమైన కమ్మని జోలపాటలలో మైమరచి నిదురపోవడం. ఇంతకుమించిన వైభోగం మరేది ఆ పసిహృదయాలకు తృప్తిని కలిగించవు. అయితే అలాటి భాగ్యానికి నోచుకోని పసివారికి నాన్నే అమ్మ. అమ్మ ద్వారా పొందే  సకల ప్రేమాభిమానాలు ఆ తండ్రే పంచుతాడుఅన్ని సేవలు చేసి పెంచి పెద్దజేస్తాడు. పసివయసులోనే తల్లినిఅష్టైశ్వర్యాలను పోగొట్టుకొన్న తన ముగ్గురు బిడ్డలకు  తల్లిలేని కొఱతదీరుస్తూ  అన్నీ తానేగా వారిని  పెంచి పెద్దజేసే ఓ మమతానురాగమూర్తి గుడ్డ ఉయ్యాలలోని తన ఆఖరు బిడ్డనుద్దేశించి పాడే లాలి పాటే ఈనాటి మన సజీవ రాగం. 

ముల్లోకాలను సంరక్షించే దేవదేవునే పసిబిడ్డగా భావించి మధురమైన లాలిపాటలతో అలరించాడు మాతృహృదయంగల పరమభక్తుడు త్రాళ్ళపాక అన్నమాచార్యుడు. ఆ భక్తశిఖామణి పదకవితలే తప్ప ఆయన గాత్రమాధుర్యం ఎట్టిదో మనెవరికీ ఎఱుకలేదు. ఈ  తరంవారికి ఆ కొఱతను దీర్చిన అసలుసిసలు తెలుగు గాయకశిఖామణి ఘంటసాల. నవరసాలు నిండిన ఆ హృదయంలో అమృతతుల్యమైన మాతృత్వం కూడా నిండివుంది.  ఇందుకు నిదర్శనంగా ఆయన పాడిన 'శేషశైలావాసా', 'చిలిపి కృష్ణునితోని చేసేవు పోటీ', ఆయన స్వరకల్పనలోని 'ఏడుకొండలవాడా వెంకటా రమణ', 'తెల్లవార వచ్చె తెలియకనా సామి (మేలుకొలుపు), 'చినపాప లాలి, కనుపాప లాలి' వంటి పాటలను, కుంతీకుమారి పద్యాలుపాపాయి పద్యాలను చెప్పుకోవచ్చు. ఆ కోవలోకి చెందిన మరో మంచి పాట ' జో లాలీ.... లాలీ నా చిట్టి తల్లీ...'  

'ధర్మదాత' చిత్రంలో అక్కినేనివారికోసం ఘంటసాల ఆలపించిన ఆ మృదు మధుర గీతమే నేటి మన సజీవరాగం.

తాతినేని చలపతిరావు గారి సంగీతనేతృత్వంలో వెలువడిన ఒక సంగీతాణిముత్యం ' జో లాలి.... జో లాలీ.. లాలీ నా చిట్టితల్లీ...' డా.సి.నారాయణ రెడ్డిగారి సాహిత్యం. హృదయాలకు హత్తుకునే సరళమైన మాటలు. తన గత జీవిత వైభవాన్ని, ప్రస్తుత దుర్భర పేదరికాన్ని ఊయలలోని పసిపాపకు మాతృత్వం ఉట్టిపడేలా లాలిత్యంతో వర్ణించిన తీరు హృద్యంగా వుంటుంది. చలపతిరావు గారు శ్రీరాగంలో చేసిన ఈ లాలిపాటకు ఘంటసాల జీవంపోసారు. లాలిత్యం, మాధుర్యం నింపిన గళంతో ఘంటసాల ఈ పాటలో ఒక అమృత మాతృమూర్తిగా మనకు దర్శనమిస్తారు.

ఈ పాట వినగానే మధ్యమావతి రాగమేమో అనే భావన కలిగే అవకాశం లేకపోలేదు. మధ్యమావతి, శ్రీరాగం రెండింటికి ఆరోహణా క్రమం స్వరాలు ఒక్కటే. కానీ , శ్రీరాగం అవరోహణలో 'రిగరిస' అనే స్వరాలు అదనంగా వుండి మధ్యమావతి తో గల తేడాను చూపిస్తుంది. శ్రీ రాగంమధ్యమావతి రాగం - ఈ రెండూ ఖరహరప్రియ రాగ జన్యాలే కావడం వలన ఈ మూడు రాగాలలో చేసిన సినిమా పాటలు సాధారణ శ్రోతకు  ఒకేలా వినిపించే అవకాశం ఉంది. శ్రీరాగ మాధుర్యమంతా మన హృదయాలలో నిండేలా ఘంటసాల ఈ పాటను పాడారు. జో...జో లాలీ అనే పదాలను ఘంటసాల ఎంతో వేరియేషన్ తో చాలా సరళంగా లాలిత్యంతో ఆలపించారు.

'ధర్మదాత' సినీమాలోని తొమ్మది పాటల్లో ఏడు పాటలను (ఒక శ్లోకంతో సహా) ఘంటసాలగారే ఆలపించారు. ఈ చిత్రంలో అక్కినేని తండ్రీ కొడుకుల వేషాలలో ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి పాత్ర సోలోలను, కొడుకు పాత్ర డ్యూయెట్లను ఘంటసాలగారే గానం చేసి అక్కినేనికి తనకు మధ్యగల రాగబంధాన్ని మరింత పటిష్టం చేశారు. ధర్మదాత చిత్రంలోని పాటలలో కొన్ని తమిళ వాసనలు కలిగివుండక తప్పలేదు. కారణం ఈ సినిమాకు మూలం శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం ' ఎంగ ఊరు రాజాఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతంలోని ఆ పాటల వరసలే తెలుగులో కొన్ని పాటలకు ఉపయోగించడం జరిగింది. అయితే, ఈనాటి మన సజీవరాగం మాత్రం సంపూర్ణంగా తెలుగుగీతమే. ఈ గీతం తమిళంలో లేదు. చలపతిరావుగారు ఈ పాటను మనసుకు హత్తుకుపోయేలా స్వరపర్చారు. శ్రీరాగంలో చేసిన ఈ పాట కోసం  ఫ్లూట్, క్లారినెట్సితార్, పియోనావైయొలిన్స్తబలాడోలక్ వంటి వాద్యాలను ఉపయోగించారు.

తమిళంలో 'ఎంగ ఊరు రాజా' తెలుగులో ధర్మదాతై తర్వాత హిందీలో 'దిల్ కా రాజా' గా1972 లో దర్శనమిచ్చింది. రాజ్ కుమార్వహీదారెహ్మాన్లీనా చందవర్కర్ నటించిన ఈ చిత్రానికి ఆర్.డి.బర్మన్ సంగీతం నిర్వహించారు. మూడు భాషలలో విజయవంతంగా నడచిన సినిమా. ధర్మదాత తెలుగు వెర్షన్ అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడమే కాక ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా సంపాదించుకున్నది. ఇందుకు చలపతిరావుగారి సంగీతం, ఘంటసాలగారి గానం, ఎ.ఎన్.ఆర్.గారి ద్విపాత్రాభినయం ఎంతో దోహదం చేశాయనే చెప్పాలి. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...