Saturday, 26 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 79వ భాగం - నే తాళలేనే ఓ చెలియా ... ఓ లలనా ఓ మగువా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయెనిమిదవ భాగం ఇక్కడ

79వ సజీవరాగం - నే తాళలేనే ఓ చెలియా ... ఓ లలనా ఓ మగువా      

చిత్రం - శ్రీకృష్ణావతారం
గానం - ఘంటసాల
రచన - సముద్రాల (సీ)

సంగీతం - టి.వి.రాజు

పల్లవి : తాత్త ఝం తదికిట ఝం

తద్దిగిణ కిటతక తా త్త ఝం

తరికిట ఝం తధ్ధిగిణతోం !!

 

తతత ఝణుత తతత ఝణుత

ఝణు తధంగిణత తధ్ధీం గిణత

తాంగిటతక తరికిటతోం తరికిటతో

తాత్తరికిటతో తధ్ధీం తధికిట తోం

తాధ్ధికిటతక తరికిటతోం...

 

ఆహా! నే తాళలేనే ఓ చెలియా

నే తాళలేనే ఓ చెలియా - 2

ఓ లలనా ఓ మగువా ఓ సఖియా

నే తాళలేనే ఓ చెలియా! ఆహా!

నే తాళలేనే...

ఆనందభైరవి  ప్రాచీన కర్ణాటక సంగీత రాగాలలో ఒకటి. ఇది 20వ మేళకర్త రాగమైన నఠభైరవికి జన్యరాగం. ఆనందభైరవి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణ రాగమైనా వక్రసంచారం వలనఅన్యస్వర ప్రయోగం వలన జన్యరాగంగానే పరిగణించబడుతున్నది.  రీతిగౌళ,హుసేనీ రాగాలు ఈ రాగాన్ని పోలివుంటాయి. సంగీత ముమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి మధుర రక్తిరాగంగా కొనియాడబడే ఆనందభైరవి రాగంలో అనేక రచనలు చేశారు. చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి సుప్రసిద్ధ జావళి ' మధురానగరిలో చల్లలమ్మబోదు' ఆనందభైరవి రాగంలోనే చేయబడింది.

ఆనందభైరవి రాగం గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది త్యాగరాజస్వామివారి గురించి తలచుకుంటారు. సాహేతుకమైన చారిత్రక ఆధారాలు లేని ఈ ఉదంతం వినడానికి ఆసక్తికరంగానే వుంటుంది.

ఒకసారి త్యాగరాజస్వామి వారి స్వస్థలమైన తిరువైయ్యారులో వీధి భాగవత మేళం జరిగిందట. ఆ మేళంలోని సంగీతకళాకారులు ప్రదర్శించిన ఆనందభైరవి రాగంలోని గీతం త్యాగరాజస్వామి వారిని ఎంతగానో ఆకట్టుకొవడంతో వారు ఆ భాగవత కళాకారులను ఎంతగానో ప్రశంసించి వారికి తగిన కానుక ఇవ్వాలని సంకల్పించారట. అందుకు ఆ భాగవతులు బ్రహ్మానందభరితులై త్యాగబ్రహ్మంగారు తమకు ఆనందభైరవి రాగాన్ని కానుకగా ఇచ్చి ఇకపై వారు ఆ రాగంలో ఏ కృతులు చేయరాదనే వింత కోరిక కోరారట. భవిష్యత్తు లో త్యాగయ్యగారు ఎందువలన ఆనందభైరవి రాగంలో రచనలు చేయలేదనే ప్రశ్న వస్తే  సంగీత ముమూర్తులలో ప్రముఖుడైన  త్యాగరాజస్వామి వారి వలన తమకు కలిగిన ప్రశంసను కూడా ప్రజలు  తలచుకుంటారని ఆ తృప్తే తమకు చాలని అందుకే ఈ కోరికను కోరినట్లు సవినయంగా విన్నవించుకున్నారట. సద్గురు త్యాగరాజస్వామి కూడా వారి కోరికను మన్నించి ఆనందభైరవి రాగాన్ని వారికి కానుకగా ఇచ్చి ప్రతిగా ఆ రాగంలో రచనలు చేయడం మానివేసారట.

ఇలాంటి కథలు ప్రచారమవడానికి  త్యాగయ్యగారు ఎక్కువ కృతులు రక్తిరస ప్రధానమైన ఈ ఆనందభైరవి రాగంలో స్వరపర్చకపోవడం ఒక కారణం కావచ్చును. వేలాది కృతులుకీర్తనలు వ్రాసిన త్యాగరాజస్వామి ఆనందభైరవి రాగంలో చేసినవి మాత్రం మూడే మూడు.

ఈ ఉదంతంలో ముడిపెట్టబడిన మరో ఆసక్తికరమైన  విషయం ఏమంటే త్యాగరాజస్వామి వారి వద్దనుండి ఆనందభైరవి రాగాన్ని కానుకగా పొందిన కళాకారులు ఆంధ్రదేశ కృష్ణాతీర కూచిపూడి భాగవుతులని చెప్పుకోవడం కద్దు.

ప్రాచీన భారతీయ సంప్రదాయ నృత్య కళా రీతులలో పేరెన్నిక పొందినది కూచిపూడి నృత్యం. క్రీ.శ. రెండవ శతాబ్దం నుండే కూచిపూడి నృత్యకళకు సంబంధించిన మూలాలు వున్నట్లు చెపుతారు. 14 వ శతాబ్దానికి చెందిన సిధ్ధేంద్రయోగి కూచిపూడి నాట్యాన్ని మరింత అభివృద్ధి పరచి ఈ నృత్యశైలికి మరింత ప్రాశస్త్యాన్ని తీసుకువచ్చారు. శాతవాహనులు, విజయనగరం రాజులు, తంజావూరు రాజుల పోషణలో కూచిపూడి నాట్యకళ ఎంతో ప్రసిధ్ధికెక్కింది.

కృష్ణాతీర కూచిపూడి గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాల పురుషులచేత మాత్రమే అభ్యసించబడిన ఈ కూచిపూడి నృత్యకళ 19వ శతాబ్దం ప్రథమార్ధం నుండి మరింత నూతనత్వాన్ని సంతరించుకుంది.  శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీ వెంపటి వెంకటనారాయణశాస్త్రిచింతా వెంకట్రామయ్య వంటి కూచిపూడి దిగ్దంతలు కూచిపూడి నాట్యకళకు నూతనత్వాన్ని, నవతేజాన్ని తీసుకువచ్చారు. అంతవరకు పురుషులకు మాత్రమే పరిమితమై వున్న కూచిపూడి నృత్యకళ స్త్రీలకు కూడా అందుబాటులోకి వచ్చింది.

శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారి శిష్యుడైన శ్రీ వెంపటి చిన సత్యంగారి అవిశ్రాంత కృషి ఫలితంగా కూచిపూడి నృత్యకళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిధ్ధికెక్కింది. సంగీతసాహిత్య, నృత్య సమాహారంగా అనేక నూతన నృత్యరూపకాలకు రూపకల్పన చేసి దేశ విదేశాలకు చెందిన వేలాది స్త్రీ పురుషులకు కూచిపూడి నృత్యంలో శిక్షణనిచ్చి కూచిపూడి నాట్య విశిష్టతకు  ఎనలేని సేవ చేసిన కళాప్రపూర్ణుడు, పద్మభూషణ్ డా.వెంపటి చిన సత్యం. 

శ్రీ వెంపటి చిన సత్యం కూచిపూడి నృత్యరంగంలోనే కాదు చలనచిత్ర సీమలో కూడా తనదైన ముద్రవేసారు. సినిమాలలో వచ్చే సత్సాంప్రదాయ నృత్య సన్నివేశాలెన్నింటికో ప్రాణ ప్రతిష్ట చేసిన ఘనత ఆయనకు వుంది. డా. వెంపటి చిన సత్యం నిర్దేశకత్వంలో ఆనందభైరవి రాగంలో రూపొందించబడి గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారిచే అద్భుతంగా గానం చేయబడిన  ఒక చిన్న కూచిపూడి నృత్య దరువే ఈనాటి మన సజీవరాగం.

నిజానికి ఈ గీతంలో సాహిత్యమంటూ చెప్పుకోవడానికి ఏమీలేదు. 'తాళలేనే,  చెలియాలలనామగువాసఖియాఅంటూ ఐదే ఐదు పదాలతో ఈ పదాన్ని ముగించారు సముద్రాలవారు. ఇందులో మనకు ఎక్కువగా వినపడేది కూచిపూడి నృత్య జతులే. అయితే నృత్యదర్శకుడుసంగీతదర్శకుడుగాయకుడు, నటీనటులు  దీనిని ఆవిష్కరించిన విధానం వలన ఈ చిన్ని నృత్య సన్నివేశం ప్రేక్షకులను ఎంతో ఆకర్షించి అలరించింది. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య లకు గల ఉత్తమాభిరుచుల ఫలితంగా మంచి కళాత్మక విలువలతో  శ్రీకృష్ణావతారం భారీ పౌరాణిక చిత్రం తెలుగువారి సొంతమయింది. మహాభారతంమహాభాగవతం గ్రంథాలలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఘట్టాలన్నింటిని పొందుపరచి శ్రీకృష్ణావతారం గా రూపొందించారు. ఈ చిత్రం పూర్తిగా నటరత్న ఎన్.టి.రామారావు భుజస్కంధాలపై నడిచిన సినిమా. రామారావు గారి నటవైదుష్యం, ఘంటసాలవారి గానం శ్రీకృష్ణావతారం చిత్రానికి ఆయువుపట్టులు.

ఈనాటి సజీవరాగం ఈ చిత్రంలో హాస్యరస ప్రధానంగా చిత్రీకరించబడింది. కలహభోజనుడైన నారదుడు శ్రీకృష్ణుని అష్టభార్యల మధ్య తంపులు పెట్టి ఆనందించాలని ఎక్కే గుమ్మం,దిగే గుమ్మంగా ప్రతీ అంతఃపురానికి వెళ్ళి అక్కడ కృష్ణునిపైఇతర సవతుల మీద అవాకులు చెప్పాలనుకునేలోపలే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై తన భార్యతో సఖ్యంగా వుండడం చూసి చల్లగా అక్కడనుండి జారుకోవడం ఇందులోని ఇతివృత్తం. అందులో భాగంగా శ్రీకృష్ణుడు (ఎన్.టి.రామారావు) తన అష్టభార్యలలో ఒకరైన కాళింది (ఎల్.విజయలక్ష్మి) తో  ఆనందంగా నృత్య సంగీతాలతో గడుపుతూంటాడు.  ఈ సందర్భంలో కూచిపూడి నృత్య భంగిమలతో ఆనందభైరవి రాగంలో ఈ చిన్న గీతాన్ని ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ సన్నివేశం లో ప్రధానంగా మనలను ఆకట్టుకునేది కూచిపూడి జతులతో కూడిన ఘంటసాలవారి గంధర్వగానంలాస్య కృష్ణునిగా ఎన్.టి.రామారావు నటన, సహజంగానే మంచి నర్తకి అయిన ఎల్.విజయలక్ష్మి నృత్యాభినయం.

ఈ గీతంలో ఘంటసాల మాస్టారికి ఇతర కళా ప్రక్రియల పట్ల గల సంపూర్ణ అవగాహన, దానిని సంపూర్ణంగా ప్రయోగించగలిగే సమర్ధత కనిపిస్తుంది. పరిపక్వత చెందిన నాట్యాచార్యుడు ఉచ్ఛరించే పధ్ధతిలో ఈ పాటలోని జతులను సుస్పష్టంగా భావయుక్తంగా పలకడం ఘంటసాల మాస్టారి గానప్రతిభకు దర్పణం పడుతుంది. గాయకుడి విశిష్టత తెలియడానికి ఒక పాట నాలుగైదు చరణాల సాహిత్యంతో, రాగమాలిక రాగాలలో ఎన్నో ఆవృత్తాల స్వరకల్పనలతోనే నిండివుండాలన్న నిర్బంధం ఏమీలేదు. 'నే తాళలేనే ఓ చెలియా' వంటి చిరుగీతం కూడా సంప్రదాయ పధ్ధతిలో గానం చేయబడితే అది కూడా శ్రోతల హృదయాలను తాకి పది కాలాలపాటు సజీవరాగం గా నిలిచిపోతుంది.

శ్రీకృష్ణావతారం సినిమా పాటలు, పద్యాలన్నీ  ఘంటసాలవారి గాన పటిమకు గీటురాళ్ళే. ఈ చిత్ర నిర్మాణ సమయంలో  ఘంటసాల మాస్టారికి సైనస్ ఆపరేషన్ జరిగింది. అందువలన ఘంటసాలగారు రికార్డింగ్ లకు హాజరు కాలేని పరిస్థితి. షూటింగ్ కు అంతరాయం కలగకుండా పద్యాలన్నీ ట్రాక్ పాడిద్దామని నిర్మాత సంకల్పించి ఆ విషయాన్ని ఘంటసాలగారికి చెప్పగా పాటల విషయంలోలా పద్యాలకు ట్రాక్ తీయడమనేది అనుకూలంకాదని పద్యాలను ఒక ఒరవడిలో లైవ్ లోనే రికార్డ్ చేయాలని అందుచేత తానే వచ్చి పాడతానని చెప్పి ఓ రెండు రోజుల తర్వాత పద్యాలన్నీ లైవ్ లో రికార్డ్ చేసారు. ఘంటసాలగారి నిర్యాణం తర్వాత ఆయన శైలిలో నిర్దిష్టంగా పద్యాలు చదివే గాయకులే కరువై పౌరాణిక చిత్రాలలో పద్యాలు పెట్టడమనదే మానేసారు. దానితో పౌరాణిక చిత్ర నిర్మాణం కూడా పూర్తిగా తగ్గిపోయింది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...