చిత్రం - జయభేరి
గానం - ఘంటసాల
రచన - మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం - పెండ్యాల
పల్లవి :
నీ దాన నన్నదిరా నిన్నే
నమ్మిన చిన్నదిరా... 2
చరణం 1:
తానే మధుకలశమని
మనసే నందనమని
వన్నెలతో చిన్నెలతో
మువ్వలతో నవ్వులతో
మోమాటముగా కులికి
!నీదాన!
చుక్క.... చుక్క....
చుక్కల కన్నా తానే
చక్కనిదాన నన్నదిరా.. చుక్క..
చక్కని సామీ... చక్కని సామి యని
పక్కనజేరి పలుకరించి నీ.. దాన నన్నదిరా
హ్హ హ్హ హ్హా
నిన్నే నమ్మిన చిన్నదిరా...
ఆ....
చుక్క...సుక్క...చుక్క... వినీలాకాశంలోని నక్షత్రాలను చుక్కలంటారు... అందమైన నవయవ్వనాంగినీ చుక్క అనే అంటారు. ఈ చుక్కల అయస్కాంత ఆకర్షణ , వ్యామోహం మనిషిని సదా వాటికి బానిసను చేస్తూనేవుంది. ఆ దివిలోని చుక్కలు, ఈ భువి పైని చుక్కలు తరతరాలుగా కవులందరికి కవితా వస్తువులై సౌందర్యపిపాసులను మైమరపించి మత్తెక్కిస్తూనే వున్నాయి. ఈ రెండు చుక్కలకు తోడు మరో 'సుక్క' అదీ చుక్కే. పౌరాణిక యుగాలలో సురాపానంగా, మదిరగా, ఆధునికకాలంలో కుషీని, నిషాను కలిగించే మత్తు 'మందు'. ఇది మనిషి శారీరక, మానసికారోగ్య వినాశనానికి హేతువని పండితుడి మొదలు పామరుడి వరకు తెలిసినా ఈ సుక్కకు చాలామంది లొంగిపోతారు. చుక్క+సుక్క సంపర్కానికి బానిసైతే ఆ మనిషి జీవితం సర్వనాశనమేనని ప్రముఖులెందరి చరిత్రలో చెపుతాయి.
సమాజంలో ఒక వ్యక్తి తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలకు గుర్తింపురావడం మొదలెడితే గౌరవం, పరపతి, అంతస్తు, ఆదాయం అన్నీ ఒకదానివెనక మరొకటిగా ఆ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానితోపాటు అంతకుముందు కనివిని ఎరుగని వ్యసనాలెన్నో అలవాటు అవుతాయి. రంభ వంటి అందగత్తెను తలదన్నే భార్య ఇంటిలో వున్నా పరస్త్రీ సావాసాలకు, మధుపానానికి బానిసై జీవితంలో పతనావస్థను అనుభవించిన ఒక గొప్ప సంగీత కళాకారుడి కథే 'జయభేరి' సినిమా కథ.
తనలోని విద్వత్తుకు, సంగీత ప్రతిభకు గొప్ప రాజాశ్రయం, గౌరవప్రతిష్టలు లభించగానే ఒక రాజనర్తకి వ్యామోహంలోబడి, మధుపానానికి కూడా దాసుడైన సందర్భంలో ఆలపించిన నిషా గీతం ఇది. ఎంత మత్తులో వున్నా శ్రుతిలయలు తప్పకుండా మృదుమధురంగా సాగే ఈ పాట ఎన్ని దశాబ్దాలైనా సజీవస్వరమే.
మధుకలశం వంటి ఒక లావణ్యవతి వన్నెచిన్నెలతో కాలి మువ్వల సవ్వడులతో, చిరునవ్వులు చిందిస్తూ మోమాటంగా కులుకుతూ చెంతచేరిన వైనాన్ని కథానాయకుని స్వగతంగా మల్లాది వారు ఎంత అద్భుతంగా వర్ణించారో! తననే నమ్మి వచ్చిన చిన్నదిగా భావించే అతను ఆమె తన పక్కకుజేరి చక్కని సామి అని ముద్దుముద్దుగా పలుకరించడంతో అతనికెంత మైమరపో, ఎంత ఆనందమో! పెండ్యాల గారి బాణి, ఘంటసాలవారి సుస్వరాలవాణి కథానాయకుని భావోద్వేగాలను ఎంత రసరమ్యంగా పలికించి మన హృదయాలను మత్తెక్కించిందో సంగీతాభిమానులందరికీ అనుభవమే.
ఈ పాటలో ఘంటసాలగారి కంఠమాధుర్యం, రాగాలాపనలు, సంగతులు, గమకాలు, భావప్రకటనలు, నవ్వులు అనితరసాధ్యంగా చాలా అలవోకగా జాలువారాయి. మాటల్లో చెప్పలేని అనుభూతి ఘంటసాలవారి గాత్రంలో వినిపిస్తుంది. మాండ్, రాగేశ్వరి రాగఛాయలలో వినిపించే ఈ గీతంలో సితార్, వైయొలిన్స్, ఫ్లూట్, తబలా వంటి తక్కువ వాద్యాలు మాత్రమే పెండ్యాల గారు ఉపయోగించారు.
సుప్రసిద్ధ హిందీ, మరాఠీ చిత్రాల దర్శక నిర్మాత వి.శాంతారాం గొప్ప భావుకుడు, కళాపిపాసి. భారతీయ కళాహృదయాన్ని ప్రతిబింబించే అద్భుత చిత్రాలనెన్నిటినో నిర్మించి భారతీయ సినీమాకు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చారు. 1947లో శాంతారాం మరాఠీ భాషలో తీసిన 'లోక్ షేర్ రామ్ జోషి', హిందీలోని 'మత్వాలా శాయర్ రామ్ జోషి' సినీమాల ఆధారంగా మన ప్రాంతీయతకు తగినట్లుగా ఆ కథకు మరింత మెరుగులుదిద్ది పి.పుల్లయ్యగారు 1959లో 'జయభేరి' చిత్రాన్ని తెలుగులో, 'కలైవాణన్'' తమిళ చిత్రాన్ని అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, రాజసులోచన, రేలంగి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా నిర్మించారు.
మరాఠా పీష్వాల కాలంలోని రామ జోషి అనే కవి, ప్రజాగాయకుని జీవితకథ ఇది. శారదా ఫిలింస్ బ్యానర్ మీద వాసిరెడ్డి నారాయణ రావు నిర్మించిన జయభేరిలో అగ్రకులం, నిమ్నకులాల ప్రసక్తి కొంచెం తీవ్రంగా చర్చించబడడం ఈ సినిమా పరాజయానికి కారణమయిందని పలువురి అభిప్రాయం. చిత్రం బాక్సాఫీస్ వద్ద జయభేరులు మ్రోగించకపోయినా గొప్ప కళాత్మక విలువలు కలిగిన సంగీత నృత్యభరిత చిత్రంగా తెలుగులో ఒక ఉత్తమ దృశ్యకావ్యంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. జయభేరిలో ఎన్నో పాటలు. అన్నీ ఆణిముత్యాలే.
జయభేరి అజరామరం గా నిలిచిపోవడానికి మల్లాది వారి సాహిత్యం, పెండ్యాలగారి సంగీతం, ఘంటసాల, సుశీల అపురూప గానం, అక్కినేని, అంజలీదేవి నటవైదుష్యం ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చును.
కొసమెరుపు -
ఆనాడు తెలుగు రాష్ట్రాలలో మద్యపాన నిషేధం వున్న కారణంగా 'జయభేరి' సినిమాలోని ఈ మందు నిషా పాట ' నీదాన నన్నదిరా' పాటను సెన్సార్ వారు తొలగించారట. కానీ, మేము స్టూడియోలో 'జయభేరి' సినిమా ప్రివ్యూ చూసినప్పుడు ఈ పాట వుండడం బాగా గుర్తు.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment