76వ సజీవరాగం - పూవై విరిసిన పున్నమి వేళా
చిత్రం - శ్రీ తిరుపతమ్మ కథ
గానం - ఘంటసాల
రచన - సి.నారాయణరెడ్డి
సంగీతం - పామర్తి - బి.శంకర్
పల్లవి :
పూవై విరిసిన పున్నమి వేళా
బిడియము నీకేలా బేలా 2
పూవై విరిసిన పున్నమి వేళా
చల్లని గాలులు సందడి చేసె
తొలి తొలి వలపులు తొందరచేసె 2
జలతారంచుల మేలిముసుగులో
తలను వాల్తువేలా బేలా
!పూవై విరిసిన !
చరణం 2:
మొదట మూగినవి మొలక నవ్వులు
పిదప సాగినవి బెదరు చూపులు 2
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదువేలా బేలా
!పూవై విరిసిన!
తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి 2
ఇరువుర మొకటై పరవశించగా
ఇంకా జాగేలా బేలా
!పూవై విరిసిన!
1963వ సంవత్సరంలో గానగంధర్వుడు ఘంటసాల గళం బలం కలిగిన సినీమాలు 30 వరకు విడుదలయ్యాయి. వాటిలో ఏకంగా 12 సినీమాలు - 'శ్రీకృష్ణార్జున యుధ్ధం' మొదలుకొని 'మంచి-చెడు' వరకు నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించినవే. సరాసరిన నెలకు ఒక సినిమా చొప్పున వచ్చాయి. వాటిల్లో 10వ చిత్రం 'శ్రీ తిరుపతమ్మ కథ'. 1963 అక్టోబర్ (10వ నెల) 4వ తేదీన రిలీజయింది. ఈ సినిమా శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ఒక భక్తురాలి జీవితగాధ ఆధారంగా తీయబడింది.
భార్యాభర్తల బంధం పరమ పవిత్రం. భర్త అనేవాడు సన్మార్గుడైనా, దుర్మార్గుడైనా ఆ భార్య అతన్నే అంటిపెట్టుకువుండాలి. పతియే ప్రత్యక్ష దైవం. బ్రతుకునైనా, చావునైనా భార్యాభర్తలు కలిసే వుండాలి. వారిది ఎన్నటికీ ఎవరూ, ఎప్పుడూ విడదీయరాని బ్రహ్మముడి అనే భావనలు ప్రజలలో బలంగా నాటుకుపోయిన రోజులవి. స్త్రీ అబల, పరాధీన. మంచైనా, చెడైనా పురుషుని ఆశ్రయంలో జీవించవలసిన వ్యక్తిగా ఈ సమాజం ఉన్న రోజులలోని కథ. స్త్రీ స్వాతంత్ర్యానికి, సొంత ఆలోచనలకు, వ్యక్తిత్త్వానికి చోటులేని కాలమది.
ఈ సినిమా లో ఘంటసాలగారు పాడిన అత్యంత శ్రావ్యమైన ఏకగళ గీతం, డా.సి.నారాయణరెడ్డి గారు వ్రాసిన 'పూవై విరిసిన పున్నమి వేళా బిడియము నీకేలా బేలా' - అదే నేటి మన సజీవరాగం.
ఒక యువకుడు ఒక పల్లెటూరి అందమైన యువతిని చూసి మోజుపడ్డాడు, వరించానన్నాడు. కోరుకున్న పిల్లనే పెళ్ళిచేసుకున్నాడు. మంచి కుటుంబంలో కట్టుబాట్ల మధ్య పెరిగి విచక్షణా జ్ఞానం సంపాదించుకున్న ఆ వధువు ఏం చేస్తుంది. పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ భర్త పాదాలవద్దే జీవించాలని అత్తింటికి చేరింది. వారిరువురికి మొదటిరాత్రి. పధ్ధతి ప్రకారం పడకగదికి చేరిన భార్యను లాలించి, మురిపించి వలపు మాటలతో తన మగసిరిని ప్రదర్శించి తన తొలిరేయి కోర్కెలను సఫలం చేసుకుంటాడు.
ఇలాటి తొలిరేయి శృంగార సన్నివేశానికి కావలసిన పడికట్టు మాటలెప్పుడు కైవసం ఉండే కవి నారాయణరెడ్డిగారు కథానాయకుడు నందమూరి వారిని, కథానాయిక కృష్ణకుమారిలను దృష్టిలోపెట్టుకొని ప్రేక్షకులకు మోహ పారవశ్యం కలిగేలా ఒక చక్కటి రొమాంటిక్ గీతాన్ని సమకూర్చారు. ఇదే పాట తర్వాతి సన్నివేశాలలో కథానాయిక పరంగా శ్రీమతి లీల గాత్రంలో శోక గీతంగా వస్తుంది.
ఘంటసాల స్కూల్ కు చెందిన సంగీత దర్శకుడు పామర్తి వెంకటేశ్వరరావు.
ఘంటసాల సంగీత సహాయకుడిగా పనిచేసినవారు. ఈ
పాట కోసం కళ్యాణి రాగాన్ని ఎంచుకొని సంపూర్ణంగా గురువుగారి బాణీనే అనుసరించి ఒక
సజీవరాగం సృష్టికి కారకులయ్యారు పామర్తి.
ఘంటసాలకు కళ్యాణికి గల రాగబంధం ఎలాటిదో తెలుగువారందరికీ సుపరిచితమే.
గాయకుడిగా ఘంటసాలవారి గాన మాధుర్యం
గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.
గత 75 వారాలుగా ఘంటసాలవారి గాన మాధుర్యాన్ని పలు కోణాలలో నుంచి ఆస్వాదిస్తున్న రసజ్ఞులకు, సందర్బం వచ్చింది కనుక, ఈ వారం ఘంటసాలగారి వ్యక్తిత్వం గురించి, వారి ఔదార్యం గురించి ఓ నాలుగు మాటలు చెప్పుకోవడం సముచితమైన విషయంగా భావిస్తున్నాను.
అదే ఘంటసాల వెంకటేశ్వరరావు - పామర్తి వెంకటేశ్వరరావుల మైత్రీబంధం. ఆ విషయాలను ముచ్చటించుకోవాలంటే మనం 1948 లనాటికి వెళ్ళాలి.
అవి స్వర్గసీమ, పల్నాటి యుధ్ధం, యోగి వేమన, రత్నమాల, బాలరాజు, కీలుగుర్రం వంటి సినిమాలు వచ్చి ఘంటసాల అంటే ఎవరో ఏమిటో తెలుగువారంతా తెలుసుకుంటున్న రోజులవి. కుచేల దశ నుండి బయటపడుతున్న ఘంటసాల తనలాటి కుచేలురను ఆదుకునే స్థితికి ఎదుగుతున్న రోజులవి.
పామర్తి గారిది ఘంటసాలగారి స్వస్థలమైన చౌటపల్లికి దగ్గరలోని సిధ్ధాంతం అనే గ్రామం. ఒకప్పుడు బాగా బ్రతికినవారే. ఘంటసాలగారితో తన ఆర్ధిక దుస్థితి గురించి చెప్పుకోగా ఘంటసాల ఆయనను మద్రాస్ రప్పించి తన దగ్గర ఆశ్రయమిచ్చారు. అప్పటికే ఘంటసాలగారి వివాహమయింది. అద్దెంటిలో కాపురం. పామర్తిగారిని కూడా తన సంగీతం లైన్లోనే పెట్టాలని ఘంటసాల ఆయనకు డోలక్ కొనిపెట్టారు. ముందు తను నేర్చుకొని తర్వాత పామర్తిగారికి నేర్పడం మొదలెట్టారు. వీరికి జీవనోపాధి అయిన సంగీతం ఆ ఇంటి యజమాన్లకు ఇబ్బందిగా తయారయింది. ఉదయాస్తమానం వీరు చేసే డోలక్ సాధన ఆ ఇంటివారు భరించలేక వెంటనే ఇల్లు ఖాళీ చేయమని ఘంటసాలగారిపై ఒత్తిడి తెచ్చి ఇళ్ళు ఖాళీచేయించగా వేరే ఇంటికి మారవలసి వచ్చిందట.
(ఘంటసాల సావిత్రమ్మగారి వ్యాసాల నుండి సేకరణ)
ఈ విధంగా తనను నమ్ముకున్న వ్యక్తికోసం ఎన్నో తిప్పలు పడిన సహృదయుడు ఘంటసాల. తర్వాత పామర్తి కొంత అనుభవం సంపాదించి ఘంటసాల గారి పాటలకు తబలా వాయించడం, ఆర్కెష్ట్రా కండక్ట్ చేయడం వంటి పనులు చేసేవారు. ఘంటసాలగారు సొంతిల్లు కొనుకున్నాక అందులోని ఔట్ హౌస్ లో పామర్తిగారు తన భార్యా పిల్లలతో కాపురముండేవారు. రెండు కుటుంబాలు కలసిమెలసి ఒకే కుటుంబంలా వుండేవారు. దాదాపు పది పన్నెండేళ్ళు పామర్తి ఘంటసాలగారి సహాయకుడిగా అనేక సినిమా లకు పనిచేశారు. అయితే ఆ జీవితం పామర్తిగారికి నచ్చలేదు. స్వతంత్రంగా సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే కాంక్ష పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా, ఘంటసాలగారు ఎంత వారించినా కాదని కుటుంబంతో అక్కడనుండి వెళ్ళిపోయి వేరే చోటుకు మకాం మార్చి తన ప్రయత్నాలు కొనసాగించారు.
పామర్తిగారి కుటుంబం ఘంటసాలవారి ఔట్ హౌస్ నుండి వెళ్ళిపోయాక 1955లో ఆ ఔట్ హౌస్ లోకి మా కుటుంబం ప్రవేశించగా, ఏకంగా 28 ఏళ్ళు '35 ఉస్మాన్ రోడ్డే' మా స్వంత ఇల్లంత గాఢమైన అనుబంధంతో మా జీవనయానం సాగింది.
పామర్తి గారు వెళ్ళిన
తర్వాత ఓ దశాబ్దకాలంలో ఓ పాతిక డబ్బింగ్
సినిమా లకు సంగీతం చేసివుంటారు. డబ్బింగ్ సినీమాల ద్వారా ఆదాయం అంటే ఒకప్పటి 'బ్రతకలేక బడిపంతులు' సామెతలాటిది. శ్రమతప్ప ఫలితం
శూన్యం. తన డబ్బింగ్ నిర్మాత స్నేహితులు స్ట్రైట్ సినిమా లు తీసినప్పుడు ఆ సినిమా
ల సంగీత దర్శకత్వం ఛాన్స్ తప్పక తనదేనని పామర్తి గాఢంగా విశ్వసించారు. అదే
విషయాన్ని ఘంటసాలగారితోనూ,ఇంట్లోవారితోనూ చాలా నమ్మకంగా చెప్పేవారు. అయితే 'ఎక్కడైనా బావ కాని వంగతోట
దగ్గర కాదు' అనే సామెతను ఋజువుపరుస్తూ పామర్తిగారి డబ్బింగ్ నిర్మాత మిత్రులు తాము
స్ట్రైట్ సినిమా లు తీసినప్పుడు
పామర్తిగారిని కాదని బాగా
పేరున్న పెద్జ మ్యూజిక్ డైరెక్టర్లను నియమించుకోవడం మొదలెట్టారు. ఇది పామర్తిగారిని బాగా కృంగదీసింది. సంసారం పెరిగి ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. మరల, ఘంటసాలవారినే ఆశ్రయించారు. అప్పటికే రాఘవులు తన పురోభివృద్ధి ని
వెతుక్కుంటూ ఘంటసాల మాస్టారిని వదలిపెట్టిపోవడంతో ఆ స్థానంలో సంగీత సహాయకుడిగా పామర్తిగారికి అవకాశాలు కల్పించి ఘంటసాల ఇతోధికంగా
తోడ్పడ్డారు. పామర్తిగారింటి వివాహాది శుభకార్యాలన్నింటిలో చేదోడువాదోడుగా వుంటూ ఆర్ధికంగా
తగు సహాయం అందించేవారు. మాస్టారింటిలోని వారంతా మంచి స్నేహంగానే ఉండేవారు. పామర్తిగారి అమ్మాయిలకు అడపాదడపా బృందగానాలలో
పాడే అవకాశాన్ని ఘంటసాల మాస్టారు కల్పించేవారు.
దాదాపు తన రెండున్నర దశాబ్దాల సినీజీవితంలో పామర్తిగారు స్వతంత్రంగా పనిచేసిన సినిమాలు ముచ్చటగా మూడే మూడు. అవి - సతీ తులసి, శ్రీ తిరుపతమ్మ కథ, బబృవాహన. ఈ మూడు సినిమాలు పామర్తిగారి పురోభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదనే చెప్పాలి. ఆఖరుగా1973లో వసంతకుమార్ రెడ్డిగారి 'పూలమాల' అనే సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ, ఆ సినిమా సగంలో వుండగానే పామర్తిగారు కాలం చేయడం జరిగింది. ఆ మిగిలిన సగం సినిమా పాటలను, రీరికార్డింగ్ ను ఘంటసాలగారే పూర్తిచేసి తనకు ఇచ్చిన పూర్తి పారితోషకాన్ని ఘంటసాలగారు పామర్తిగారి కుటుంబానికి అందజేసి వారిని ఆదుకున్నారు.
ఈవిధంగా ఘంటసాలవారు తనను నమ్మి వచ్చినవారెందరికో ఆశ్రయమిచ్చి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో ఆదుకున్నారు. ఘంటసాలగారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎంతటి ఉన్నతుడో మనసున్న మంచి మనిషిగా మరింత ఉన్నతుడు. కళాకారుడిగా అందరికీ ఆదర్శప్రాయుడు.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment