Saturday, 29 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 75వ భాగం - మనిషైతే మనసుంటే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైనాలుగవ భాగం ఇక్కడ

75వ సజీవరాగం -  మనిషైతే మనసుంటే
చిత్రం - అమాయకుడు
(మూలం -'అనారి1959 హిందీ చిత్రం)
గానం - ఘంటసాల

రచన - దేవులపల్లి
సంగీతం - బి.శంకర్ (హైదరాబాద్)

పల్లవి :

మనిషైతే మనసుంటే -2

కనులు కరగాలిరా కరిగి కరుణ

కురియాలిరా కురిసి జగతి నిండాలిరా

చరణం 1: 

ఆగి ఆగి సాగిపోరా సాగిపోతూ చూడరా !ఆగి ఆగి!

వేగిపోయే వెన్నెన్ని బ్రతుకులో

వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో వేచియున్నాయిరొ 

                                            ! మనిషైతే!

చరణం 2: 

తేలిపోతూ నీలిమేఘం జాలి జాలిగ కరిగెరా !తేలిపోతూ!

కేలుచాపి ఆ దైవమే తన కేలుచాపి

ఆకాశమే ఈ నేలపై ఒరిగెరా 

                                            !మనిషైతే!

 చరణం 3:

మనిషైతే మనసుంటే మనసుంటే

మనిషైతే వైకుంఠమే ఒరుగురా

నీకోసమే కరుగురా - 3

                                            !మనిషైతే!

జీవితంలో ఏ ఆశయంలక్ష్యం లేకుండా బ్రతకడం ఒక్కటే ముఖ్యమనుకునేవారికి ఏ ఇబ్బంది లేదు. ఏదో రకంగా బ్రతికేస్తారు. అలా కాకుండా నీతినిజాయితీలతో నిక్కచ్చిగా జీవించాలనుకునేవారికి అడుగడుగునా అడ్డంకులే,అందరూ విరోధులే.

తన చుట్టూవున్న సమాజంలోని కుళ్ళు,కుత్సితాలకు  క్షోభించి మనసు ద్రవించి కళ్ళు కరిగి బరువెక్కిన హృదయంతో ఓ యువకుడు పాడుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆ పాటే - "మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా కురిసి జగతి నిండాలిరా...". అదే నేటి మన సజీవరాగం. అతి కరుణరసాత్మకంగా ఘంటసాలవారి గళం నుండి మృదుమధురంగా జాలువారిన గీతం.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చాలా సున్నితమనస్కుడు. తన బాధలకే గాదు యితరుల బాధలకు కూడా యిట్టే చలించిపోతారు. సమాజపు ఆటుపోట్లకుఅగ్నిజ్వాలలకు తట్టుకోలేక ఎన్నెన్ని బ్రతుకులు వేగివేసారిపోతున్నాయో,ఆసరాకోసం ఎన్నెన్ని చేతులు వేచియున్నాయో ఒక్కసారి ఆగి చూడమంటున్నారు. మనసున్న మనిషైతే వారి కష్టాలకు చలించి కనులు కరిగి కరుణ కురిపించమంటున్నారు. మనసున్న మనిషికోసం దైవం తన అభయహస్తాలతో వైకుంఠాన్నే నేలకు దింపుతాడని భరోసా కల్పిస్తున్నారు. కృష్ణశాస్త్రి గారి భావుకతకు తగినట్లుగానే వారి పదజాలం కూడా విలక్షణమైన రీతిలో వుంటుంది.

సాహిత్యానికి దీటుగా  మంచి సంగీతాన్ని సమకూర్చారు బి.శంకర్. తోడి రాగ స్వరాలు ఆధారంగా ఈ పాట మలచబడింది. కర్ణాటక సంగీతంలోని 8వ మేళకర్త రాగం తోడి. సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవి. ఈ రెండు రాగాలకు స్వరాలు ఒకటే అయినా గమక ప్రయోగంలో రెంటికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. హిందుస్థానీ సంగీతంలో కూడా ఒక తోడి వుంది. దానికి సమాంతరమైన కర్ణాటక రాగాన్ని శుభపంతువరాళి (45వ మేళకర్త) అంటారు. తోడి రాగాన్ని పాడి మెప్పించడం చాలా కష్టమని, ఎంతో పాండిత్యప్రకర్ష కలవారికి మాత్రమే సాధ్యమనే భావన సంగీతప్రపంచంలో వుంది. కొత్త సంగీత దర్శకుడైన బి.శంకర్ గారి నిర్దేశకత్వంలో 'అమాయకుడు' సినిమా లోని పాటలన్నీ చాలా వైవిధ్యభరితంగా అమరాయి. ఘంటసాల మాస్టారు పాడిన ఈ పాటలోని orchestration  శంకర్-జైకిషన్ స్టైల్ నుఆ  రిచ్ నెస్ ను గుర్తుకు తెస్తుంది. సహజమే. అందుకు కారణం లేకపోలేదు. 'అమాయకుడు' సినిమా కు మూలం హృషికేశ్ ముఖర్జీ గారి 'అనారి' హిందీ చిత్రం(1959). రాజ్ కపూర్, నూతన్ లు నటించిన ఈ చిత్రానికి సంగీతం నిర్వహించింది రాజ్ కపూర్ ఆప్త మిత్రులు శంకర్-జైకిషన్లే. అందుచేత అదే బాణీ తెలుగులోనూ కనిపించింది. ఎన్నో వైయొలిన్స్సెల్లోలుఎకార్డియన్స్కాంగో డ్రమ్స్బ్యాంగోస్డబుల్ బాస్, గిటార్స్, పియానో, యూనివాక్స్తార్ షెనాయ్, ఫ్లూట్తబలాలు వంటి భారీ వాద్యాలు ఈ పాటకు  చాలా నిండుదనాన్నిచ్చాయి. మంద్రతారస్థాయిలలో ఘంటసాల మాస్టారి కంఠం ఖంగున మ్రోగడమే కాక ఆ సన్నివేశానికి అవసరమైన కరుణరసాన్ని కూడా సమృద్ధిగా కురిపించింది.  తన  మాడ్యులేషన్ కూడా హీరో కృష్ణకు తగినట్లుగా మార్చారు మాస్టారు.

అందుకే ఈ 'మనిషైతే మనసుంటే' పాట ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సజీవరాగమై నిలిచింది. బి.శంకర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు చాలా తక్కువ.  అయినా మంచి పాటలనే అందించారు. బి.శంకర్బొంబాయి శంకర్ - ఈ ఇద్దరూ హైదరాబాద్ కు చెందినవారే. 

జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, మొదలగువారు నటించిన చిత్రం 'అమాయకుడు'. ఈ సినిమాను తమిళంలో కూడా జెమినీ గణేశన్, బి.సరోజినీదేవీలతో 'పాశముమ్-నేశముమ్' అనే పేరుతో నిర్మించి 1964 లో విడుదల చేశారు. హీరో కృష్ణకు తన తొలినాళ్ళ చిత్రాలలో మంచి గుర్తింపునుగౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమా లో ఘంటసాల మాస్టారు పాడిన ఈ సోలో,  సుశీల గారితో పాడిన మరొక డ్యూయెట్ ('చందమామ రమ్మంది చూడు) కృష్ణగారి పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి.

కృష్ణశాస్త్రి గారి కలం బలం, ఘంటసాల మాస్టారి గళం బలం ఈ పాటను అజరామరం చేసాయి.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



Saturday, 22 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 74వ భాగం - ధనమేరా అన్నిటికీ మూలం

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైమూడవ భాగం ఇక్కడ

74వ సజీవరాగం -  ధనమేరా అన్నిటికీ మూలం
చిత్రం - లక్ష్మీనివాసం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి :

ధనమేరా అన్నిటికీ మూలం

ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం

                                        !ధనమేరా!

 

మానవుడే ధనమన్నది సృజియించెనురా 

దానికి తానే తెలియని దాసుడాయెరా! మానవుడే!

ధనలక్ష్మిని అదుపులో పెట్టినవాడే

గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా 

                                        !ధనమేరా!

 ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు

చేయరా లేనినాడు ఒడలువంచి కూడబెట్టరా !ఉన్ననాడు!

కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే-2

అయో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే

                                        !ధనమేరా!

 కూలివాని చెమటలో ధనమున్నదిరా

పాలికాపు కండల్లో ధనమున్నదిరా -2

శ్రమజీవి కి జగమంతా లక్ష్మీనివాసం-2

 శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

                                        !ధనమేరా!

If we command our wealth, we shall be rich and free; if our

Wealth commands us,we are poor indeed. - Edmund Burke

Anglo-Irish Philosopher

 

డబ్బు నీ ఆధీనంలో వున్నంతవరకు నువ్వు మహాధనవంతుడివిసర్వస్వతంత్రుడివి. ఎప్పుడైతే నువ్వు డబ్బుకు లోబడిపోయావో అప్పుడు నీ యంత దరిద్రుడు మరొకడు వుండడు.

"ధనం మూలం ఇదం జగత్" అన్నారు. గ్రహాలన్నీ సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయో లేదో తెలియదు కాని ఈనాటి యావత్ప్రపంచం మాత్రం నిర్విరామంగా డబ్బనే పదార్ధం చుట్టూ పరిభ్రమిస్తూనే వుంది. డబ్బు ఎంత విలువైనదో అంత చెడ్డది. డబ్బు సంబంధాలు పెంచనూ గలదువాటిని త్రెంచనూ గలదు. ఆప్తమిత్రుల మధ్యరక్తసంబంధీకుల మధ్య తరాలపాటు ఆరని చిచ్చూ పెట్టగలదు. ధనాన్ని సృష్టించిన మనిషి నేడు దానికి పూర్తిగా బానిసైపోయాడు.

ధనమే అన్నిటికీ మూలం; ఆ ధనము విలువ తెలుసుకొని మానవత్వంతో ప్రవర్తించడం మానవధర్మం. ఈ రకమైన భావజాలంతో రూపొందించబడిన "ధనమేరా అన్నిటికీ మూలం" అనే ఆరుద్రగారి గీతమే నేటి మన సజీవరాగం. ఈ పాటలో మనసులను రంజింపజేసేంత గొప్ప సంగీతం లేదు. అయినా సజీవరాగమే. మానవతా విలువలు చాటిచెప్పే గొప్ప సాహిత్యానికి తగిన సందర్భోచితమైన సంగీతం గల గీతం "ధనమేరా అన్నింటికీ మూలం".

ధనాధిదేవత లక్ష్మీదేవి చంచల. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. నిరంతరంగా నిలకడగా ఒకే దగ్గర వుండదు. అందుకూ కారణం మనిషే. మనిషిలోని స్వార్ధచింతనే లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తుంది.

ఇంత విలువైన తత్త్వాన్ని కేవలం మూడే మూడు నిముషాల పాటతో మనకు అవగతం చేశారు కవి ఆరుద్ర.  పాట తత్త్వానికి అనువైన మెట్టునే అమర్చారు సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్. ఈ రకమైన గీతాలు ఎక్కువగా ఘంటసాలఎస్.వి.రంగారావుగార్ల కోసమే అన్నట్లు రూపొందిచబడినాయి. ఇద్దరిలోనూ అసమాన్యమైన నటనాపాటవం వుండడంవలన ఆయా పాటలు సజీవరాగాలుగా ఈనాటికీ మనలను అలరిస్తున్నాయి. తెర వెనుక ఘంటసాలగారు పాడిన ఈ పాటకు తెరపై రంగారావుగారి హావభావాలు దానికి అంజలీదేవిగారి రియాక్షన్ ఈ పాట సన్నివేశాన్ని అజరామరం చేసింది.

మన తెలుగు సినీమాలలో వేదాంతతాత్త్విక సంబంధ గీతాలకు హరికాంభోజి రాగాన్ని ఉపయోగించడం పరిపాటి. ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలో ఈ రాగం ఎక్కువ వినిపిస్తుంది. హరికాంభోజి రాగం కర్ణాటక సంగీతంలో 28 వ మేళకర్త రాగం. అంటే ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణ రాగం. జంఝూటితిలంగ్ రాగాలు రెండు హరికాంభోజికి జన్యరాగాలు. అలాగే, శంకరాభరణం రాగం 29 వ  మేళకర్త రాగం. హరికాంభోజికి, శంకరాభరణం రాగానికి ఉన్న తేడా అంతా ఒక్క నిషాదం స్వరంలోనే. హరికాంభోజి రాగంలో కైశికి నిషాదం పలికితే శంకరాభరణం రాగంలో కాకాలి నిషాదం పలుకుతుంది. ఈ ఒక్క తేడా తప్ప మిగిలిన స్వరాలన్నీ ఈ రెండు రాగాలకు ఒకటే. ఈ రకమైన స్వర సంబంధాలు కలిగి వుండడం వలన హరికాంభోజిజంఝూటితిలంగ్, శంకారభరణం రాగాలలో మలచబడిన సినిమా పాటలు అంతకుముందు ఎప్పుడో ఎక్కడో విన్న పాటలాగే ఉందే అన్న భ్రమ సామాన్య శ్రోతలో కలగడం సహజం. అయితే రాగాలతో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వారికి  ఆయా పాటలలో వుండే తేడా తెలుస్తుంది. ఈనాటి మన సజీవరాగం ' ధనమేరా అన్నిటికీ మూలం' పాటలో  జంఝూటీతిలంగ్ రాగ లక్షణాలు రెండూ వున్నట్లు తెలుస్తున్నది.

1966 లో దర్శక నిర్మాత నటుడు అయిన బి ఆర్ పంతులు తన పద్మినీ పిక్చర్స్ బ్యానర్ లో 'దుడ్డే దొడ్డప్పఅనే చిత్రాన్ని కన్నడంలో నిర్మించారు. టి.జి.లింగప్ప సంగీత దర్శకుడు. తమిళంలో కూడా 'నమ్మ వీట్టు మహాలక్ష్మి' గా అదే సంవత్సరం లో విడుదలయింది. ఇదే కథను 1968లో వీనస్-పద్మినీ పిక్చర్స్ కంబైన్డ్ గా వి.మధుసూదనరావు దర్శకత్వంలో 'లక్ష్మీ నివాసంగా' నిర్మించారు. కన్నడంలో బి.ఆర్.పంతులుఎమ్.వి.రాజమ్మ పోషించిన పాత్రలను తెలుగులో ఎస్.వి.రంగారావు, అంజలీదేవి ధరించారు. ఇతర పాత్రలలో కృష్ణ,శోభన్ బాబు, భారతినాగయ్యరామ్మోహన్పద్మనాభం మొదలగువారు నటించారు. కె.వి.మహాదేవన్ సంగీతం నిర్వహించారు.

తొమ్మిది పాటలున్న లక్ష్మీనివాసం లో ఘంటసాల మాస్టారు పాడిన ఏకైక గీతం 'ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం' పాట ఒక్కటే మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. సామాన్య శ్రోతలంతా కూడా చాలా సౌకర్యంగాసులభంగా పాడుకునే రీతిలో మలచారు మహాదేవన్. దానిని అంత సులభసాధ్యంగానూ, పామరులకు కూడా అర్ధమయేలా సుశ్రావ్యంగా పాడారు ఘంటసాల. గిటార్మేండలిన్పియానోవైబ్రోఫోన్సితార్కీబోర్డ్, వైయొలిన్స్తబలా, ఘటసింగారి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి.

ఏ పాటైనా సంగీతపరంగాసాహిత్య పరంగా పదికాలాలపాటు ప్రజల హృదయాలలో నిలవాలంటే కథలో సత్తాసన్నివేశంలో సారం వుండాలనే సత్యాన్ని నేటి సజీవరాగం నిరూపిస్తుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 15 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 73వ భాగం - రారా కృష్ణయ్యా! రా రా కృష్ణయ్యా!

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైరెండవ భాగం ఇక్కడ

73వ సజీవరాగం -  రారా కృష్ణయ్యా!  రా రా కృష్ణయ్యా! 
చిత్రం - రాము
గానం - ఘంటసాల
రచన - దాశరధి
సంగీతం - ఆర్.గోవర్ధనం

సాకీ :

     దీనులను కాపాడుటకు దేవుడే

     ఉన్నాడు

     దేవుని నమ్మినవాడు ఎన్నడూ

     చెడిపోడు

     ఆకలికి అన్నము,వేదనకు ఔషధం

     పరమాత్ముని సన్నిధికి రావే ఓ

     మనసా !

పల్లవి :

రారా క్రిష్ణయ్యా.. రారా క్రిష్ణయ్యా

దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా -2

 

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా

ఎదురుచూచు కన్నులలో

కదిలేనయ్యా ! మా పాలిటి!

 

పేదల మొరలాలించే విభుడవు నీవే

కోరిన వరములనొసగే వరదుడవీవే

!పేదల !

అజ్జానపు చీకటికి దీపము నీవే

అన్యాయము నెదిరించే ధర్మము నీవే

నీవే కృష్ణా,నీవే కృష్ణా,నీవే కృష్ణా

!రారా క్రిష్ణయ్యా!

 

కుంటివాని నడిపించే బృందావనం

గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం

! కుంటివాని!

మూఢునికి జ్ఞానమొసగు బృందావనం

మూగవాని పలికించే బృందావనం

!మూఢునికి!

అందరినీ ఆదరించు సన్నిధానం

అభయమిచ్చి దీవించే సన్నిధానం

! అందరినీ!

సన్నిధానం దేవుని సన్నిధానం

సన్నిధానం ! 

                            ! రారా కృష్ణయ్యా! 

కృష్ణా...కృష్ణా...కృష్ణా...కృష్ణా..

 కరుణించే చూపులతో కాంచవయ్యా

శరణొసగే కరములతో కావవయ్యా

! కరుణించే!

మూగవాని పలికించి బ్రోవవయ్యా

కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా

!మూగవాని!

నిన్ను చూసి బాధలన్ని మరచేనయ్యా

ఆధారము నీవేరా రారా కృష్ణా

!నిన్ను చూసి!

కృష్ణా... కృష్ణా... రారా....కృష్ణా

                            ! రారా కృష్ణయ్యా! 

'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' - జీవితంలో పడరాని కష్టాలన్నీ పడి మానవప్రయత్నంగా చేసే కార్యాలేవీ ఫలించకపోగా అవి వికటించినప్పుడు మనిషి విరక్తి చెంది దైవం మీద విశ్వాసం కోల్పోతాడు. దేవుడనేవాడున్నాడ,ఉంటే కళ్ళుమూసుకుని ఒక మూలన శిలయైకూచున్నాడా?తనను మాత్రం ఎందుకు కరుణించడంలేదని దేవుని నిందించడం,సర్వేశ్వరుని ఉనికినే శంకించడం మొదలెడుతాడు. భగవంతుడు తన సృష్టిలోని జీవులను పరీక్షిస్తాడేతప్ప ఎన్నటికి శిక్షించడు. ఏదో మార్గాంతరం చూపిస్తాడు. సుదూరంగా ఎక్కడినుండో హరినామ సంకీర్తనం చెవులబడుతుంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. శరణాగతి తప్ప తనకు వేరే మార్గంలేదని తెలుసుకొని దేవుడుండేచోటికి చేరుకొని తనను కాపాడమని వేడుకుంటాడు. మనిషి సదా సత్చించనతో సన్మార్గంలో పయనించడానికి మన పూర్వీకులు నవవిధ భక్తి మార్గాలను సూచించారు. అవి - శ్రవణంకీర్తనంస్మరణంపాదసేవనంఅర్చనంవందనందాస్యం, సఖ్యంఆత్మనివేదనం. ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏ ఒక్కదానినైనా మనస్ఫూర్తిగాభక్తిశ్రధ్ధలతో పాటిస్తే ఆ మనిషి జీవితం సుఖమయమై ఆనందప్రదమవుతుంది.

ఘంటసాలవారి ఈనాటి సజీవరాగం నవవిధ భక్తిమార్గాలలో ఒకటైన 'కీర్తనంఆధారంగా రూపొందించబడింది. 'రారా క్రిష్ణయ్యా,రారా క్రిష్ణయ్యా దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యాఅని 'రాము' చిత్రంకోసం ఘంటసాలవారు ఆలపించిన కృష్ణ నామసంకీర్తనం గత ఐదున్నర దశాబ్దాలకు పైగా తెలుగునాట బహుళప్రచారం పొందింది. సన్నివేశ ప్రాధాన్యత కలిగిన ఈ గీతం చిత్తూరు వి.నాగయ్యఎన్.టి రామారావు వంటి అగ్రనటుల నటవైదుష్యానికి ప్రతీకగా నిల్చింది.  ఈ పాటలో ఈ ఇద్దరు ప్రముఖులకు ఘంటసాలగారే గాత్రదానం చేశారు. ఈ పాట మూడొంతుల భాగం నాగయ్యగారు పాడగాఆఖరి చరణం ఎన్.టి.రామారావుగారిమీద సాగుతుంది. పాట చివరలో ఇద్దరు కలసి పాడుతారు.

ప్రముఖ గేయరచయిత దాశరధి గారు వ్రాసిన ఈ గీతానికి ఆర్.గోవర్ధనం సంగీతం సమకూర్చారు. ఈ పాట హిందుస్థానీ రాగమైన 'యమన్' లో  స్వరపర్చబడింది. కర్ణాటక సంగీతంలో 'యమన్' కు సమానమైన రాగం 'కళ్యాణి'. 65 వ మేళకర్త రాగం. సంపూర్ణరాగం. దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారు. ఈ కళ్యాణి/యమన్ రాగాలు ఘంటసాలగారి పేటెంట్ అని సంగీతాభిమానులంతా కొనియాడడం అందరికీ తెలిసినదే. ఈ రెండు రాగాలలో ఘంటసాల మాస్టారు ఆలపించి బహుళ జనాదరణ పొందిన అసంఖ్యాకమైన గీతాలు ఈనాటికి లలితసంగీత గాయకులందరినోట వినవస్తూనేవున్నాయి.

మంగళప్రదమైన యమన్ లో భావోద్వేగంవిషాదం మిళితమైవున్న 'రారా క్రిష్ణయ్యా' పాటను స్వరపర్చి మెప్పించడం  ఎమ్మెస్వి వంటి ప్రతిభాశాలికి మాత్రమే సాధ్యం. ఎన్,టి.ఆర్నాగయ్యగార్ల గాత్ర ధర్మాన్ని కాచి వడబోసిన ఘంటసాలగారు ఈ పాటలో ఎంతో వైవిధ్యాన్ని కనపర్చారు.

ఈ పాటలోని ఘంటసాలగారి గాన వైదుష్యం తలచుకునేముందు  'రాము' సినీమా నేపథ్యం గురించి కొంత తెలుసుకోవాలి.

1958లో 'ది ప్రౌడ్ రెబెల్' అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆధారంగా 1964లో కిశోర్ కుమార్ అన్నీ తానే అయి 'దూర్ గగన్ కి చాహోఁ' అనే సినిమా ను తీశారు. మంచి సినిమాగా పేరు పొందినా ఆర్ధికంగా ఘోరపరాజయం పొందింది.

కమలహాసన్రోజారమణికుట్టిపద్మిని వంటి బాలనటులను చిత్రసీమకు పరిచయం చేసి బాలల ప్రాధాన్యత కలిగిన సినీమాలెన్నో తీసిన   ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారికి ఈ కథ తెగ నచ్చి, ఆ హిందీ సినిమా కథతో 1966లో 'రాము' పేరిట తమిళంలో నిర్మించారు. రాజ్ కుమార్ (అసలు పేరు యోగీంద్రకుమార్) అనే బాలనటునికి అవకాశమిచ్చారు.(ఇతని తండ్రి హనుమంతాచారిగారు కూడా మంచి గాయకుడు, కన్నడ చిత్రాలలో హాస్యనటుడు. ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో రెగ్యులర్ గా యూనివాక్స్ అనే వాద్యాన్ని వాయించేవారు. ఘంటసాలవారి బృందంతో పాటు ఈయన కూడా విదేశాలలో పర్యటించారు).

జెమినీ గణేశన్కె.ఆ. విజయపుష్పలతనాగయ్య, రంగారావు మొదలగువారు ప్రధాన తారాగణంగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీత దర్శకత్వం వహించి అజరామరమైన గీతాలతో చిత్రవిజయానికి ముఖ్యకారకులయ్యారు.

ఈ సినిమాను మరల ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారే  1968 తెలుగులో ''రాము' గా ఎన్.టి.ఆర్జమున, పుష్పలతనాగయ్యఎస్.వి.రంగారావురేలంగి, రాజనాల మొదలగువారితో నిర్మించారు. తమిళంలో నటించి రాష్ట్రపతి అవార్డు పొందిన ఆ బాలనటుడే (రాజ్ కుమార్) లుగులో కూడా నటించేడు. ఎమ్.ఎస్.విశ్వనాధన్ కు సహాయకుడైన ఆర్.గోవర్ధనంకు తెలుగు రాము సంగీత దర్శకుడిగా బాధ్యత లు అప్పగించారు. పాటలన్నీ యథాతథంగా తమిళ వరసలనే తెలుగులో కూడా ఉపయోగించారు. తమిళంలో పి.బి.శ్రీనివాస్, శీర్కాళి గోవిందరాజన్, టి.ఎమ్.సౌందరరాజన్ పాడిన పాటలన్నీ తెలుగులో ఘంటసాలగారు పాడారు. తమిళతెలుగు భాషలలో ఘనవిజయం పొందిన 'రాము' 1975 లో మలయాళంలో కూడా తీయబడింది.

'రాము' చిత్రంలో ఘంటసాలగారు గారు పాడిన మరో మంచి పాట 'మంటలు రేపే నెలరాజా'. భాగేశ్వరి రాగంలో చేయబడిన ఈ పాటను తమిళంలో పి.బి.శ్రీనివాస్ పాడారు. ఈ పాటవిని  ఘంటసాల మాస్టారు పి.బి.ఎస్,ను ఎంతో మెచ్చుకున్నారు.

యమన్ రాగంలో చేయబడిన నేటి సజీవరాగం ' రారా క్రిష్ణయ్యాపాట తమిళం  వెర్షన్ లో నాగయ్యగారికి శీర్కాళి గోవిందరాజన్, జెమినీ గణేశన్ కు టిఎమ్ సౌందరరాజన్ పాడారు. ఘంటసాలకు ఘంటసాలే సాటి అని భావించిన ఎ.వి.ఎమ్.వారు తెలుగులో  నాగయ్యఎన్.టి.ఆర్ లు నటించిన రెండు పాత్రలకు ఘంటసాలగారి చేతే పాడించారు. మాస్టారు కూడా ఈ పాటను ఎంతో వైవిధ్యంతో పాడి పాటకు జీవంపోసారు. 

ఈ పాట కోసం సితార్వైయొలిన్స్సెల్లొ, ఫ్లూట్వైబ్రోఫోన్తబలా, కోల్, బెల్స్కబాష్, వంటి వాద్యాలను ఉపయోగించారు. నాగయ్యగారి పోర్షన్ ను ఒక ట్రాక్ మీద, ఎన్టీఆర్ గారి పోర్షన్ ను వేరే ట్రాక్ మీద ఒకే కాల్షీట్ లో ఘంటసాలగారి చేత పాడించి ఫైనల్ గా రెంటిని ఒకే ట్రాక్ మీద మిక్స్ చేసి ఇద్దరు వేర్వేరు గాయకులు ఒకేసారి పాడిన ఎఫెక్ట్ ను రాబట్టినట్లు ఎ.వి.ఎమ్. సౌండ్ ఇంజనీర్ జె.జె.మాణిక్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఘంటసాల గాత్రానికి రాణింపునిస్తూ తెరమీద నాగయ్యగారు, రామారావుగారు, మాస్టర్ రాజ్ కుమార్ లు అద్భుతంగా నటించారు.

ఘంటసాలవారి సినీ సంగీత ప్రస్థానంలో ఆసక్తిగొలిపే ఇలాటి సజీవరాగాలు అసంఖ్యాకం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్

ఘంటసాలవారికి గురుతుల్యులుప్రీతిపాత్రులు, బహుభాషా నటులు, నిర్మాత, దర్శకులు  విశేషానుభవశాలి అయిన చిత్తూరు వి.నాగయ్యగారికి వారి 121వ జయంతి  సందర్భంగాఈ సజీవరాగాన్ని సవినయంగా సమర్పిస్తున్నాము.

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...