Saturday, 26 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 53వ భాగం - పాడుతా తీయగా చల్లగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయొకటవ భాగం ఇక్కడ

53వ సజీవరాగం - పాడుతా తీయగా చల్లగా
చిత్రం - మూగమనసులు
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి: 
పాడుతా తీయగా సల్లగా -2
పసిపాపలా నిదరపో
బంగారు తల్లిగా  !! పాడుతా !!

కునుకుపడితె మనసు కాస్త
కుదుటపడతది
కుదుటపడ్డ మనసు
తీపి కలలు కంటది - ! కునుకు!
కలలె మనకు మిగిలిపోవు
కలిమి సివరకు - 2
ఆ కలిమి కూడా దోచుకునే
దొరలు ఎందుకు !! పాడుతా !!

గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు 
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు -2
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
!! పాడుతా !!

మణిసిపోతె మాత్రమేమి 
మనసు వుంటది
మనసుతోటి మనసెపుడో 
కలసిపోతదీ - 2
సావు పుటక లేనిదమ్మ
నేస్తమన్నది జనమ జనమకదీ
మరీ గట్టిపడతది !! పాడుతా !!

'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు' అని అనడంలో మన భారతీయ సంస్కారం ఎంత గొప్పదో చాటి చెప్పారు కవి ఆత్రేయ. మన కళ్ళెదటలేని, గతించిపోయిన వ్యక్తుల గురించి అనౌచిత్య ప్రస్తావనలు సముచితం కాదని అందరిలోనూ మంచితనాన్నే చూడాలనే నీతిని పరోక్షంగా నేర్పే గీతం "పాడుతా తీయగా చల్లగా". అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

'మనసులు' తో అంతమయ్యే అనేక సినీమాలలో  సాదాసీదా మాటలతో పాషాణ హృదయాలను కూడా కరిగించి కలకాలం గుండెల్లో హత్తుకుపోయేలా గీతాలను రచించి 'మనసు కవి' గా తెలుగువారి మన్ననలందిన గీత రచయిత ఆత్రేయ. ఆత్రేయ వ్రాసిన 'పాడుతా తీయగా' పాట తెలుగు శ్రోతల మనసులలో ఎంతటి సంక్షోభాన్ని, సంచలనాన్ని సృష్టించిందో తెలుగు సినిమా అభిమానులందరికీ తెలుసు. గుండెలను పిండే  రాగభావాలతో, శోకరసాభినయాలతో నిండిన ఈ పాట ప్రతి తెలుగుల నోట ఈనాటికీ స్మరించబడుతూనే వుంది. అందుకు కారణభూతులైనవారు ఒకరా, ఇద్దరా! ఆత్రేయ, కె.వి.మహాదేవన్, ఘంటసాల, ఆక్కినేని, సావిత్రి, ఆదుర్తి  - అందరూ తెలుగు సినిమా  పరిశ్రమలో పట్టుకొమ్మలే. నిత్య స్మరణీయులే. 

గోపి, రాధ, గౌరీ -  ఈ మూడు బాధాతప్త హృదయాల మౌనవేదనే మూగ మనసులు సినీమా. గత జన్మ వాసనల వల్లన జరిగిన కథను గుర్తుకు తెచ్చుకున్న ఓ యువ జంట. దీనంతటికి  నిండుకుండలాటి గోదావరియే సాక్షి.

అంతరాంతరాల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు వున్నా పైకి చెప్పలేని మూగబాధ. దానికి కారణం అంతస్తులలోని అంతరాలు. గొప్పింటి అమ్మాయి, పేదింటి అబ్బాయిల మధ్య గల పవిత్ర మూగ ప్రేమను గుర్తించి వారి అనురాగబంధాన్ని వివాహబంధంతో ముడివేయగల పెద్దలే కరువయ్యారు. అమ్మాయిగారు వేరొకరికి సొంతమైనా తాళి కట్టిన  కొద్ది క్షణాలలోనే ఆ భర్త గోదావరికి బలి అవడం, దానితో అమ్మాయిగారిని విధవరూపంలో చూడవలసిరావడం ఎంతటి బాధాకరం. ఆ అమ్మాయిగారిని మౌనంగా ఆరాధించి, అభిమానించే పడవలవాడు గోపి మానసికంగా కృంగిపోతాడు. అమ్మాయిగారి హృదయానికి స్వాంతన కలిగేలా మంచి మాటలతో మరపించడానికి ప్రయత్నిస్తూంటాడు. ఆమె తన బాధలను మరచి నిదురపోయేలా జోలపాడతాడు. ఆ పాటే 'పాడుతా తీయగా చల్లగా'.

కథ, కథనం బాగా వుంటే సాహితి , సంగీతపు విలువలున్న మంచి పాటలు పుడతాయనడానికి మూగమనసులు సినీమాయే సాక్ష్యం. ఈ సినీమా విజయానికి కె.వి.మహాదేవన్ సంగీతం ఎంతో దోహదం చేసింది.

 ఈ సినీమా లో వున్న ఎనిమిది పాటలనూ ఆత్రేయ వ్రాయగా వాటిని ఘంటసాల, సుశీల, జమునారాణి ఆలపించారు.  ప్రతీ ఒక్క పాట ఆపాతమధురమే. ఘంటసాలగారు మూడు డ్యూయెట్లు, రెండు సోలోలు పాడారు. సన్నివేశపరంగా ఘంటసాలగారు పాడిన రెండు సోలో గీతాలు చిత్రంలో చాలా కీలకమైనవి, ఉదాత్తమైనవి. ఆత్రేయగారి రచన వైదుష్యానికి, మహాదేవన్ స్వరకల్పన ప్రతిభకు, ఘంటసాల గాన రాగ భావనా పటిమకు గీటురాళ్ళుగా నిలిచిపోయాయి. అందులో మొదటిది 'ముద్దబంతి పూవులో', రెండవది 'పాడుతా తీయగా చల్లగా'.

కష్టాల్లో వున్న మనిషికి  మనసుకు ఊరట కలిగించే అనునయం, సానుభూతి ఎంతో అవసరం. అది తన మనసెరిగిన వ్యక్తి ద్వారా పొందడం వలన హృదయానికి ఎంతో శాంతిని కలిగిస్తుంది. ఈ పాటను ఆత్రేయగారు చాలా సరళమైన భాషలో మనశ్శాంతి ని కలిగించే జోలపాటలా వ్రాస్తూనే, కొన్ని జీవితసత్యాలను, వేదంత విషయాలను మనసుకు హత్తుకునేలా వ్రాశారు.

సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ ను తెలుగువారికి అత్యంత సన్నిహితుడిని చేసింది 'పాడుతా తీయగా చల్లగా' పాటేనంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మహాదేవన్ పాటల ఆర్కెస్ట్రేషన్ కు ఒక ప్రత్యేకత వుంది. ఆ ముద్ర ఆయన పాటలన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది.  ఈ పాటలో మహాదేవన్ సితార్,  ఫ్లూట్, వైయొలిన్స్, గిటార్, తబలా, డోలక్, బాంగోస్, కబాష్ వంటి వాద్యాలను చాలా సమర్ధంగా ఉపయోగించారు. ఈ పాటలో పహడి, కాపి, పీలు రాగాల ఛాయలున్నాయి. ఈ మూడు రాగాలు సున్నితమైన భావాలను, శోక రసాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ రాగ లక్షణాలన్నింటినీ మనసున నింపుకొని మహా ఆర్ద్రతతో ఎలాటి మనస్తాపాన్నైనా తొలగించి మనసారా ప్రశాంతంగా నిదురపోయేలా ఘంటసాల మాస్టారు చాలా భావోద్వేగంతో ఈ పాటను పాటను పాడారు. మధ్య మధ్య సావిత్రి గారి 'గోపి, గోపి' అనే పిలుపులు ఈ పాటకు మరింత  రససిధ్ధి కలిగించాయి. ఈ పాటకు ఘంటసాల మాస్టారిని తప్ప వేరొక గాయకుడిని ఊహించుకోలేము. ఇక తెరమీద నాగేశ్వరరావుగారు, సావిత్రిగారు  ఈ పాటలో నటించలేదు, పరిపూర్ణంగా జీవించారు. తద్వారా ఆత్రేయ, కె.వి.మహాదేవన్, ఘంటసాల, అక్కినేని, సావిత్రి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

జమున, గుమ్మడి, పద్మనాభం, సూర్యకాంతం, నాగభూషణం, అల్లురామలింగయ్య, పువ్వుల లక్ష్మీకాంతమ్మ, ఇంకా మరెందరో మూగమనసులు ఘనవిజయానికి ఇతోధికంగా దోహదం చేశారు. తెలుగులో సిల్వర్ జూబ్లీ సినీమాగా నమోదైన మూగమనసులు సినీమాను ఎల్.వి.ప్రసాద్ గారు, ఆదుర్తి దర్శకత్వంలో 'మిలన్' గా నిర్మించి గొప్ప ఆర్ధిక విజయంతో పాటు  అవార్డ్లు సంపాదించారు.

1971లో 'మూగ మనసులు' సినీమాను నటి సావిత్రి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో  తమిళంలో 'ప్రాప్తం'  విడుదల చేశారు. శివాజీ గణేశన్,  సావిత్రి,  ఎమ్.ఎస్.విశ్వనాధన్ వంటి ఉద్దండులు పనిచేసినా కూడా 'ప్రాప్తం' సావిత్రికి అశనీపాతం అయింది. ఆవిడ పతనావస్థకు ముఖ్య కారణమయింది.

ఘంటసాలవారి సజీవరాగం గా కోట్లాది తెలుగు హృదయాలలో నిలిచిపోయిన 'పాడుతా తీయగా' ను  బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా చిత్ర గాయక చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు తర్వాతి కాలంలో  తన సంగీతకార్యక్రమాలకు మకుటంగా చేసుకొని సాధించిన ఘనవిజయం లోకవిదితమే.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  

Saturday, 19 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 52వ భాగం - నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయొకటవ భాగం ఇక్కడ

52వ సజీవరాగం - నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో 
చిత్రం - పూజాఫలం
గానం - ఘంటసాల 
రచన - డా.సి. నారాయణరెడ్డి
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

పల్లవి: 
నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో!! 
                                నిన్నలేని !!

పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో
                            నిన్నలేని !!

తెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
                           నిన్నలేని...!!

పసిడి యంచు పైట జార... ఆ... ఓ... - 2

పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే  పరవశించెనే..
                            నిన్నలేని !!  

మునిపల్లె రాజుగారు రక్షణశాఖోద్యోగి. ఉద్యోగకాలంలో రచన ఆయన ప్రవృత్తి. తర్వాతి కాలంలో వృత్తి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. మునిపల్లె రాజుగారు వ్రాసిన ' పూజారి' నవల బి.ఎన్.రెడ్డిగారి దర్శకత్వంలో  "పూజాఫలం" సినీమాగా 1964లో విడుదలయింది. అక్కినేని, సావిత్రి, జమున, జగ్గయ్య మొదలగువారు నటించారు. 

ఆ సినీమాలో ఘంటసాలగారు ఆలపించిన  "నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో" అనే  సుశ్రావ్యగీతమే నేటి మన సజీవరాగం.

కొత్తగా ప్రేమాంకురం మొలకెత్తిన హృదయంలో కదలాడే ఊహలకే కన్నులుంటే... అరుణోదయం నవనవోన్మేషంగా వుంటుంది. నిన్నటివరకు లేని  కొత్త  కొత్త అందాలేవో నిద్రలేచినట్లనిపిస్తుంది. ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. హృదయతంత్రులు తెలియరాని తీయని రాగమేదో పలికిస్తాయి. పసిడి అంచు పైట జారిన మేఘబాల అరుణారుణ కాంతిరేఖలకు పరవశించిపోతుంది. ఎంతటి మధురమైన భావన. 

అంతవరకు ఆడగాలి సోకని ఆ అమాయక యువకుని జీవితంలో ఒక అందమైన సుందరితో పరిచయం ఏర్పడగానే కదలాడే మధురోహలు, సుతిమెత్తని మధురభావనలు. ఇంతటి భావుకతతో మనసు పరవశించేలా గీతాలను రాయడంలో అందెవేసిన కలం  కవి డా.సి. నారాయణరెడ్డిగారిది.

బి.ఎన్.రెడ్డిగారు కమర్షియల్ సినీమా డైరెక్టర్ కాదు.  ఆయన తన వాహినీ బ్యానర్ మీద అనేక ఉదాత్త,  కళాత్మక చిత్రాలను నిర్మించారు. బయట నిర్మాతలకు ఆయన చేసిన సినీమాలు బహు అరుదు. ఆయన అభిరుచి, సంస్కారాన్ని అర్ధంచేసుకొని ఆయనతో సినీమా లు తీసిన నిర్మాతలు ఇద్దరు మాత్రమే . ఒకరు "భాగ్యరేఖ" నిర్మాత పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి; మరొకరు శంభూ ఫిలింస్ దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి. ఈయన నిర్మించిన చిత్రమే "పూజాఫలం".

బి.ఎన్.రెడ్డిగారి మనసెరిగిన సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మూల్యమైన అమృతగుళికలవంటి పాటలు తెలుగువారిని అలరించాయి. అలాగే "పూజాఫలం"లోని పాటలన్నీ మధురాతిమధురంగా, ఉదాత్తమైన రీతిలో మలచబడ్డాయి. ఈ సినీమాలో స్త్రీ పాత్రలకే ఎక్కువ పాటలు. ఆ ఏడు పాటలను పి.సుశీల, ఎస్.జానకి , బి.వసంత పాడారు. హీరో అక్కినేని కి ఒకే ఒక్క పాట " నిన్నలేని అందమేదో" పాట.

రాజేశ్వరరావుగారి సిగ్నేచర్ కనిపించే గీతం. రాజేశ్వరరావు , ఘంటసాల ఇద్దరూ ఆరితేరిన సంగీతకళాకారులు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉండేది. మల్లీశ్వరి నుండి యశోదాకృష్ణ వరకు మధ్య వచ్చిన ఎన్నో సినీమాలలో మరపురాని మంజులగీతాలెన్నో వీరి కలయిక లో రూపొందాయి  లలిత సంగీతానికి సరికొత్త భాష్యం చెప్పాయి. వారి వారి ప్రతిభలు వీరి కీర్తి ప్రతిష్టలకు పరస్పరం దోహదపడ్డాయి.

"నిన్నలేని అందమేదో" పాటను ఘంటసాల చాలా మనోజ్ఞంగా, సున్నితంగా  ఆలపించారు. ఆ కథానాయకుడికి తాను తప్ప మరొకరు నప్పరనే రీతిలో పాడి శ్రోతలను ఒప్పించారు. ఇది రాజేశ్వరరావు బాణియని చెప్పకనే చెప్పే గీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రాజేశ్వరరావుగారి ముద్ర సుస్పష్టంగా తెలిపే పాట. "పసిడి అంచు పైట జార" తర్వాత వచ్చే ఆలాపన  ఘంటసాల బాణీకి దర్పణం. ఈ పాటలో వినిపించే  ఫ్లూట్, వైబ్రోఫోన్, సితార్, డబుల్ బేస్, వైయొలిన్స్, తబలాలు, బర్డ్స్ ఎఫెక్ట్స్ ఈ పాటకు కొత్త సొబగులు చేకూర్చాయి. 

ఈ పాట శుద్ధసావేరి రాగలక్షణాలతోనే ఉన్నట్టుగా భావించవచ్చు. ఆరభి లక్షణాలు కొందరికి వినిపించినా, అవరోహణలో గాంధార ప్రయోగం లేదన్నది, నిషాదం కూడా అల్పప్రయోగంగా వినిపిస్తున్నది అన్నది గమనించగలం*. అయినా, సినిమా సంగీత దర్శకుడుకి నిత్యం కొత్తదనాన్ని సృష్టించవలసిన అవసరం ఉన్నది కనుక, రాగలక్షణాల విషయంలో ఎంతో కొంత స్వంతత్రంగా వ్యవహరించడం సినిమా సంప్రాదాయం.  సినీమా పాటలు పరిపూర్ణంగా శాస్త్రీయ రాగాధారితంగానే వుండాలన్న నియమ నిబంధనలేవీ లేకపోవడం వల్ల ఈ పాటను సుస్వరాజేశ్వర గీతంగా భావించి, మనసారా విని ఆనందిద్దాము. రాగం ఏదైతేనేం, గత ఆరు దశాబ్దాలుగా ఈ పాట సంగీతాభిమానుల హృదయాలలో సజీవరాగంగా ఇంకా నిలిచేవుంది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 
*Disclaimer: ఈ వ్యాసాల్లో అప్పుడప్పుడు రాగాల గురించి ప్రస్తావించే విషయాలు నా స్వంత రాగ పరిజ్ఞానం కావు. అనుభవజ్ఞులనుండి తెలుసుకున్నవినికిడి జ్ఞానమేనని గ్రహించగలరు.

Saturday, 12 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 51వ భాగం - ఎవరివో నీవెవరివో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయవ భాగం ఇక్కడ

51వ సజీవరాగం -  ఎవరివో నీవెవరివో
చిత్రం - పునర్జన్మ
గానం - ఘంటసాల 
రచన - శ్రీశ్రీ
సంగీతం - టి.చలపతిరావు

పల్లవి: 
ఓ.... సజీవ శిల్పసుందరీ
నా జీవనరాగ మంజరీ...

ఎవరివో నీవెవరివో - 3

నా భావనలో నా సాధనలో - 2
నాట్యము చేసే రాణివో !! ఎవరివో!!

చరణం:
దివినే వదలి భువికేతెంచిన 
తేనెల వెన్నెల సోనవో ! దివినే!
కవితావేశమే కలలై అలలై
కురిసిన పూవుల వానవో ... ఎవరివో!

చరణం:
నవ వసంతమున 
నందనవనమున ఆ.... ! నవ !
కోయిల పాడిన పాటవో ! నవ వసంతమున!
వలపు కొలనులో  కలకల విరిసిన
కలువల కన్నుల కాంతివో .. ఎవరివో

చరణం:
నీ కరకంకణ నిక్వణమా అది
వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిస్వనమా అది
జలధి తరంగ మృదంగ నాదమా
రావే మోహన రూపమా
రావే నూతన తేజమా
రావే... రావే.... 

Cigarette smoking is injurious to health (in the long run and at times it can cause instant damage and loss of memory in a cinematic way and of course therefore dangerous to life)!

ఘంటసాలవారి సజీవరాగం అని చెప్పి స్టాట్యూటరీ వార్నింగ్ ఇస్తున్నానేమిటా ? అని అనుకుంటున్నారా ?

ఒక కాల్చి పారేసిన సిగరెట్ పీక నాలుగు భాషల్లో మూడు గంటల సినీమాకు మూలకారణమయింది.  అదే 1963ల నాటి 'పునర్జన్మ' తెలుగు సినీమా. అందులోని ఘంటసాలగారు ఆలపించిన ' ఎవరివో నీవెవరివో'' పాట ఈ వారం మన సజీవరాగం.

కళాకారులు చాలా సహృదయులుగాను, అతి సున్నిత మనస్కులుగాను వుంటారని లోక ప్రతీతి. అలాటివారి మనసు వికలం చెందేలా ఏ సంఘటన జరిగినా దానికి వారు తీవ్రంగా స్పందించి ఉన్మాదులవుతారు. వారి జీవిత సరళీయే మారిపోతుంది.  అలాటి ఒక శిల్పకళాకారుని కథయే 'పునర్జన్మ'.

చక్కని కథాంశంగల సినీమాలో చిక్కని సన్నివేశం లభించినప్పుడు ఏదైనా పాటను తయారు చేయాలంటే రచయిత, సంగీతదర్శకుడు, గాయకుడు, నటుడు, దర్శకుడు అందరికీ ఆనందమే. అలాటి పాటలలో మంచి సాహిత్యానికి, శ్రావ్యమైన సంగీతానికి ఎక్కువ అవకాశం వుంటుంది. ఘంటసాలవారి పరిభాషలో పదికాలాలపాటు ప్రజల హృదయాలలో  నిల్చిపోతుంది. " ఎవరివో నీవెవరివో" పాటకు అలాటి అదృష్టం లభించింది.

తన స్వహస్తాలతో రూపొందించిన శిల్పసుందరికి ప్రాణప్రతిష్టచేయాలని సంకల్పిస్తాడు ఆ శిల్పి. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి,  ఆరిన దీపాలు వెలుగుతాయి, మ్రోళ్ళు చిగురిస్తాయి, మేఘాలు వర్షిస్తాయి. అలాటి శక్తివంతమైన సంగీతంతో తన శిల్ప స్వప్నసుందరిని నిజమైన సజీవసుందరిగా ఆమె నాట్యం చేస్తే చూసి ఆనందించాలని  తన చేతిలోని సగం కాలిన సిగరెట్ ను గిరాటేసి పక్కనున్న సితార్ ను చేతిలోకి తీసుకొని తన గానం ప్రారంభిస్తాడు.

సన్నివేశం బలంగా ఉంటే పాటలోని సాహిత్యము, సంగీతము కూడా ఉదాత్తంగా మనసుకు హత్తుకునేలా రూపొందుతాయి. శ్రీశ్రీ వంటి మహాకవి మనసు పెట్టి " ఓ సజీవ శిల్ప సుందరీ, నా జీవనరాగ మంజరీ.. ఎవరివో నీవెవవరివో " అనే పల్లవిని అందించారు. భావనలో, సాధనలో నాట్యం చేసే రాణివా, లేక , దివిని వదలి భువికి వచ్చిన తేనెల వెన్నెల సోనవా? అంటూ ప్రశ్నించారు. కవితావేశంతో పూవుల వాన కురిపించి నవవసంత నందనవనంలో కోయిలపాటలు పాడించారు. వలపు కొలనులో కలువకన్నుల కాంతిని నింపారు. తన్నెదుట  సజీవంగా నిల్చి (భ్రమలో) నవసోయగాలతో నాట్యమాడే ఆ సుందరి కరకంకణ నిక్వణాలను, వీణా నినాదాలను, ఆమె పద నూపుర నిస్వనాలను జలధి తరంగ మృదంగ నాదాలుగా అభివర్ణిస్తూ మోహావేశం ఉప్పొంగగా ఆ సమ్మోహన రూపంలో మైరచిపోతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి శిల్పస్వప్నసుందరి దగ్ధమైపోతుంది  అక్కడితో శ్రీశ్రీ గారి మనోజ్ఞ భావనా చెదరిపోయింది.  అప్పుడే సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారు కవిగారి ఉదాత్త భావనలకు స్వరాలుకల్పించారు. పాటను ప్రధానంగా కళ్యాణి రాగంలో చేస్తూ, మోహన, హంసధ్వని (రెండు మధ్యమ స్వరాలు వలన) రాగ ఛాయలు కూడా ధ్వనింపజేస్తూ ఈ పాటను సుశ్రావ్యంగా మలచారు. నృత్య ప్రధానగీతం కావడం వలన అనేక తాళ వాద్యాలను ముక్తాయింపులతో సమర్ధవంతంగా ఉపయోగించారు. 

మిట్ట జనార్దన్ గారి సితార్ వాదనం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. హార్ప్, ట్యూబోఫోన్ , వైబ్రోఫోన్ , తబలా, డోలక్ ,  తబలాతరంగ్ , వంటి తాళవాద్య సమ్మేళనంతో ఈ పాట చాలా హృద్యంగా సాగింది.

ఇక ఈ పాటను ఆలపించిన ఘంటసాలవారి గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పగలను. పాట ఆరంభంలో వచ్చే సాకీలోనే ఘంటసాల ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెరమీద కనిపించేది నాగేశ్వరరావు గారు కావడాన అందుకు కావలసిన లాలిత్యం, భావోద్రేకం, మాధుర్యం ఘంటసాలవారి గళంలో అలవోకగా పలికాయి. తెరమీద అక్కినేని గానానికి, దివినుండి దిగి వచ్చిన అప్సరసలా ఎల్.విజయలక్ష్మి చేసిన నృత్యం ఈ పాటకే జీవం, ప్రధానాకర్షణ.

సుప్రసిధ్ధ రచయిత గుల్షన్ నందా వ్రాసిన "పత్థర్ కె హోన్ట్" కథ  ఆధారంగా నిర్మించబడిన 'పునర్జన్మ'  తెలుగు సినిమాలో అక్కినేని, కృష్ణకుమారి, వాసంతి, గుమ్మడి, ప్రభాకరరెడ్డి మొదలగువారు ప్రధాన తారగణం. ఈ సినీమా ఘనవిజయంతో ఈ కథ హిందీలో 'ఖిలోనా' గా, తమిళంలో "ఎంగిరిన్దో వన్దాళ్"  మలయాళం లో "అమృతవాహిని" గా ఆయా సినీమాలు మంచి విజయం పొందాయి.

1970 లో జరిగిన బ్రహ్మాండమైన ఘంటసాల సీనీజీవిత రజతోత్సవ సంగీత విభావరిలో ఘంటసాల మాస్టారు ఈ పాటను అక్కినేని వంటి ప్రముఖుల,  వేలాది ప్రేక్షకుల సమక్షంలో సంగీత దర్శకుడు టి.చలపతిరావు పర్యవేక్షణలో  అద్భుతంగా పాడి అందరి హర్షధ్వానాలు పొందారు.

ఇంతమంది హేమాహేమీల ప్రతిభావంతమైన కృషివలన ఘంటసాలవారు ఆలపించిన "ఎవరివో నీవెవరివో" పాట  పునర్జన్మ  సినీమా వచ్చిన 60 ఏళ్ళ తర్వాత కూడా సజీవరాగం గా నిల్చివుంది.

ఈ సినీమా లో ఏడు పాటలుండగా ఒక్కటి కూడా డ్యూయెట్ లేకపోవడం విశేషం. ఐదు సోలోలను పి.సుశీల పాడగా రెండు సోలోలను ఘంటసాల పాడారు. అందులో ఒకటి "ఎవరివో నీవెవరివో".

కొసమెరుపు :
సినీమాకు ముందే విడుదలైన ఈ పాటను గ్రామఫోన్ లో వింటూ పునర్జన్మ సినీమా ప్రివ్యూ కోసం ఎదురుచూస్తూన్నం. ఒకరోజు పిఎపి సుబ్బారావుగారి ఆఫీస్ నుండి  ఘంటసాల వారింటికి వర్తమానం వచ్చింది, ఫలానా స్టూడియోలో ఫలానా టైముకు ప్రివ్యూ వుంది, మాస్టారి కుటుంబం అంతా రమ్మనమని. ఎప్పటిలాగే ఆలస్యంగా ఇంటికి చేరిన మాస్టారు మమల్నందరిని తీసుకొని, కోడంబాక్కం రైల్వేగేట్ అవాంతరాలన్నీ దాటి స్టూడియోలో ప్రివ్యూ థియేటర్ చేరేసరికి సినీమా మొదలెట్టేసారు. మేము సీట్లలో కూర్చోని తెరవేపు చూసేసరికి, మేము ఎంతో ఆసక్తితో చూడాలనుకున్న ఘంటసాల మాస్టారి "ఎవరివో నీవెవరివో" పాట అయిపోయి,  ఎల్.విజయలక్ష్మి మాయమై, విగ్రహం ఏదో పూర్తిగా మంటల్లో కాలిపోవడం కనిపించింది. అప్పటికి దాదాపు పావుగంట సినీమా అయిపోయిందని తెలిసింది.  మళ్ళీ ప్రివ్యూ వేస్తారుకదా, అప్పుడు వద్దురుగాని అని ఇంట్లోవారిని సముదాయించారు. ఘంటసాల మాస్టారికి తాను పాడిన సినీమాలు చూడడంలోగాని, తన పాటలు తిరిగి రిపీటెడ్ గా వినడంలో కాని పెద్ద ఆసక్తి వుండేది కాదు.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday, 5 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 50వ భాగం - సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ సీతమ్మా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైతొమ్మిదవ భాగం ఇక్కడ

50వ సజీవరాగం -  సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ సీతమ్మా
చిత్రం - లవకుశ
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల

పల్లవి: 
సందేహించకుమమ్మా
రఘురాము ప్రేమను సీతమ్మా
సందేహించకుమమ్మా

చరణం:
ఒకే బాణము ఒకటే మాట
ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా
వ్రతభంగమ్ము కానీడమ్మా !!
    సందేహించకుమమ్మా

చరణం:
రఘుకులేశుడే ధర్మమువీడి
మరో భామతో కూడిననాడూ
నాదు జపము తపము
నా కావ్యమ్మె వృధయగునమ్మ
         సందేహించకుమమ్మా !!

"శారధా... నువ్వు పాడుతున్న రాగమేమిటి, నువ్వు అంటున్న స్వరమేమిటి? శుధ్ధ హిందోళంలో ఆ రిషభం ఎలా వచ్చింది!  చెప్పు.. హిందోళానికి ఆరోహణ ఏమిటి... "సగమదనిస", అవరోహణం ! "సనిదమగస" "మరి ఆ రిషభం ఎక్కడనుంచొచ్చింది , స్వర సంకరం చేయడానికి బుధ్ధిలేదుటే !" అని హూంకరించే శంకరశాస్త్రి  గదమాయింపు  సన్నివేశ చిత్రీకరణకు ఘంటసాలవారి హిందోళరాగమే కె.విశ్వనాథ్ గారికి  స్ఫూర్తిని ఇచ్చివుంటుందని నాలాటి కొందరు భావించడంలో తప్పులేదేమో ! 

లలితగీతాలలో శ్రావ్యతను, మాధుర్యాన్ని పెంపొందించి వాటిని జనరంజకం చేయడానికి ఘంటసాలగారు ఎంతో సాహసంతో శాస్త్రీయ సంగీత రాగాలలో చేసిన అన్యస్వర ప్రయోగాలు సంగీత ప్రపంచంలో అంతటి ఆసక్తిని రేకెత్తించింది. ఛాందస విద్వాంసుల ప్రత్యక్ష, పరోక్ష విమర్శలనెప్పుడూ ఘంటసాలగారు పట్టించుకోలేదు, భయపడలేదు. భావప్రకటన కోసం, ఔచిత్యం కోల్పోకుండా ఔడవరాగమైన  హిందోళంలో రిషభ, పంచమాలను  అన్యస్వరాలుగా ప్రయోగించి హిందోళరాగానికి ఒక నూతనత్వాన్ని ఆపాదించారు ఘంటసాల. ఈ విషయం గురించి ఒక  ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ఘంటసాల మాస్టారు ఇలా వివరించారు :-

"నేను నా సంగీత దర్శకత్వంలో వచ్చిన అనేక గీతాలకు శాస్త్రీయ సంగీత రాగాలనే ఎన్నుకున్నాను. ఎప్పుడైనా ఒక మంచి ఎఫెక్ట్ కోసం ఆ రాగంలో లేని అన్య స్వరం వాడినా దానిని ఒక సంచార క్రమంలోనే, ఎప్పుడు వాడవలసి వచ్చినా అదే క్రమంలో ఉపయోగిస్తూవచ్చాను. అన్యస్వరం ఉపయోగించినా అది మన సంగీతంలాగే, మన దేశీయత కోల్పోకుండా వినిపిస్తుంది గాని పరాయి సంగీతంలా వినిపించదు. నిజానికి అలాటి అన్యస్వర ప్రయోగ రాగాలకు వేరే కొత్తపేరు పెట్టి నేను కనిపెట్టిన రాగంగా ప్రకటించుకోవచ్చును. కానీ నేను అలా చేయలేదు. కర్ణాటక సంగీతంలోనే అన్యస్వరాలున్న రాగాలు అనేకం వున్నాయి. హిందోళ, అభేరి, ఖమాస్, కళ్యాణి, మోహన వంటి కొన్ని రాగాలు అటు హిందుస్థానీ సంగీతంలో, ఇటు కర్ణాటక సంగీతంలోనూ వున్నాయి. అందువల్ల ఇతివృత్తాన్ని బట్టి నేను చేసిన పాటలలో రెండు శైలుల సంగీత నుడికారాలు వినిపిస్తాయి" అని తన సంగీత సరళి గురించి ఘంటసాల విశ్లేషించారు.

ఆ విధంగా సంగీతలోకంలో సంచలనం సృష్టించిన అన్యస్వర హిందోళ రాగ  "సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా"... గీతమే నేటి మన సజీవ రాగం. లవకుశ చిత్రంలోని అజరామ గీతం.

లవకుశుల గాథ ఉత్తర రామచరిత్రలో వస్తుంది. ఆదికవి వాల్మీకి సృష్టించిన శ్రీమద్రామాయణం  సనాతన ధర్మాన్ని పాటించేవారికి గొప్ప ఆధ్యాత్మిక, ఆదర్శ గ్రంథం. పరమ పూజనీయం. యుగాలు మారి, యుగధర్మాలు మారినా రామాయణం పట్ల, రామాయణ కావ్యంలోని పాత్రలపట్ల భారతీయుల మనోభావాలు, భక్తిశ్రధ్ధలు ఇంచుకైనా తగ్గలేదు. వాల్మీకి శెలవిచ్చినట్లుగా ఈ లోకంలో గిరులు, నదీనదాలు ఎంత శాశ్వతమో రాముడి కథ కూడా అంత శాశ్వతంగానూ నిలిచివుంటుంది. ఆటువంటి మహనీయ రామాయణ కావ్యాన్ని ప్రపంచ భాషలన్నింటిలో అనేకమంది కవులు వ్రాసారు. వాటికి అనేక భాష్యాలు వెలువడ్డాయి. రామాయణం నృత్య, నాటక, చలనచిత్ర రూపంలో అనేక పర్యాయాలు వెలువడి భారతీయులను ప్రభావితం చేస్తూనేవుంది.

శ్రీమద్రామాయణం పూర్వార్ధ చరిత్ర ప్రాచుర్యం పొందినంతగా ఉత్తరార్ధ చరిత్ర ప్రచారం కాలేదు. కారణం, ఆ భాగమంతా కరుణరస ప్రధానం, విషాదాంతం కావడమేనని చాలామంది విమర్శకుల అభిప్రాయం. ఉత్తర రామచరిత్రను 8వ శతాబ్దం నాటి భవభూతి కవి సంస్కృతంలో వ్రాయగా దానిని 18వ శతాబ్దంలో కంకంటి పాపరాజు అనే కవి తెలుగులో వ్రాసారు.  

ఈ ఉత్తర రామచరిత్ర కథ ఆధారంగానే 1934లో సి పుల్లయ్యగారు పారుపల్లి సుబ్బారావు , సీనియర్ శ్రీరంజనిలతో మొదటిసారి గా 'లవకుశ' సినీమా ను తీసి గొప్ప ఆర్ధిక విజయాన్ని పొందారు. మరల 1958లో నిర్మాత ఎ.శంకరరెడ్డి లవకుశ సినీమాను తెలుగు, తమిళ భాషలలో తీయ సంకల్పించి దర్శకత్వ భాధ్యతలను సి.పుల్లయ్యగారికే అప్పగించారు.  అలాగే తెలుగు, తమిళ భాషలలో సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు.

వాల్మీకి రామాయణానికి ఎంత చరిత్ర వుందో  ఎ.శంకరరెడ్డి లలితా శివజ్యోతి 'లవకుశకు కూడా అంత చరిత్రవుంది. ఇప్పుడదంతా పునశ్చరణ చేస్తే జపం విడచి లొట్టల్లోపడడమే అవుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే లవకుశ చిత్రాన్ని తెలుపు నలుపులలో కాక రంగులలో నిర్మించాలనుకోవడం వలన నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయి నిర్మాణం ఆగిపోయింది. దర్శకుడు  సి.పుల్లయ్యగారి అనారోగ్య కారణంగా ఆయన స్థానే ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకుడయ్యారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 1958లో మొదలైన సినీమా 1963 నాటికి కానీ విడుదలకు నోచుకోలేదు. సినీమా పంపిణీ హక్కులను, నెగెటివ్ రైట్స్ ను సుందర్లాల్ నహతాకు అప్పగించిన తర్వాత ఆయన ఆర్ధిక సహాయం తో సినీమా పూర్తయింది. 

ఈ నిర్మాణంలో జాప్యాన్ని  ఘంటసాలగారు చక్కగా సద్వినియోగపర్చుకున్నారు.  పాటల రచయిత సముద్రాల రాఘవాచార్యులవారితో కూర్చొని సావకాశంగా ఒకటికి పది ట్యూన్లు అనుకొని ఒక్కొక్క పాటకు, పద్యానికి ప్రాణ ప్రతిష్ట చేసారు. అలాగే లవకుశలో  ముఖ్యమైన పాటలు, పద్యాలు పాడిన నేపధ్యగాయనీమణులు పి.లీల, సుశీలల చేత పలుమార్లు రిహార్సల్స్ చేయించి రికార్డింగ్ చేయడం జరిగింది. లవకుశలో లీల, సుశీల నువ్వా! నేనా ! అన్నట్లు  తమ సంగీత విద్వత్ నంతా ప్రదర్శించి పోటీ పడి గానంచేసారు. అలాగే లవకుశలో ఘంటసాలవారి  సంగీతం గురించి వ్రాయాలంటే అదొక పెద్ద పి.హెచ్.డీ థీసిస్సే అవుతుంది.  ఈ సినీమా లోని ఒక్కొక్క పాట వైశిష్ట్యాన్ని వివరించాలంటే ఒక్కొక్క ప్రత్యేక వ్యాసమవుతుంది.

ఈ శీర్షిక లో ఘంటసాలవారి ఏకగళ గీతాలనే ప్రస్తావించడం వలన ఈ రోజు " సందేహించకుమమ్మా" పాటను స్వీకరించడం జరిగింది.  ఈ పాటను ఘంటసాల మాస్టారు వాల్మీకి పాత్రధారి నాగయ్యగారికి పాడారు. సహజంగా నాగయ్యగారు అద్భుతమైన నట గాయకుడు. తన పాత సినీమా లలో తన పాటలు తానే పాడుకునేవారు. కానీ 1960ల నాటికి వారి గాత్రం సహకరించక ఇతర గాయకుల మీద ఆధారపడ్డారు. లవకుశలోని నాగయ్యగారి పాటలు, పద్యాలన్నింటినీ ఘంటసాల మాస్టారు ఎంతో హృద్యంగా ఆలపించారు. లవకుశలో నాగయ్యగారి కరుణరసాత్మక నటనకు ఘంటసాలవారి గాత్రం ఎంతగానో సహకరించింది.

"సందేహించకుమమ్మా" పాటలో సాహిత్యం కూడా ఎంతో గంభీరమైనది. రాముడి శీలాన్ని శంకించవద్దని  సీతను ఓదారుస్తున్నా వాల్మీకి మనసులో ఎక్కడో చిన్నగా సందేహం, రఘుకులేశుడు తన ఏకపత్నీ వ్రతము విడనాడి వేరొక స్త్రీని చేపడితే... తన తపస్సు, సకలగుణాభిరాముడైన రామునిపట్ల తనకు గల విశ్వాసం, తన రామాయణ కావ్యం ఏమౌతాయి... ఈ ద్వందీ భావాలను  రచయిత సముద్రాలగారు, గాయకుడు ఘంటసాలగారు, వాల్మీకి పాత్రధారి నాగయ్యగారు, సీతమ్మ పాత్రధారిణి అంజలీదేవి చాలా అద్భుతంగా పండించారు. అలాగే కరుణరస భావాలను విశదీకరించడానికి అనువైన హిందోళరాగాన్ని ఘంటసాల మాస్టారు తన గళంలో అపూర్వంగా వినిపించారు. ఈ పాటలోని భావరాగాలెన్నటికీ శ్రోతల హృదయాలలో సజీవంగానే నిల్చివుంటాయి.

లవకుశలో దాదాపు 38 పాటలు, పద్యాలు, శ్లోకాలు వున్నాయి. వీటన్నిటికీ  అనన్యసామాన్యం అనే రీతిలో ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. అలాగే లవకుశ రీరికార్డింగ్ లో ఘంటసాలవారి సంగీత ప్రతిభ అణువణువునా గోచరిస్తుంది.

ఇప్పుడు లవకుశ లోని కొన్ని ముఖ్యమైన పాటలకు ఘంటసాల మాస్టారు నిర్దేశించిన శాస్త్రీయ రాగాలను చూద్దాము : -

సందేహించకుమమ్మా - హిందోళం
ఏ నిముసానికి ఏమి జరుగునో - జోగియా
ఇది మన ఆశ్రమంబు(పద్యం) - బేగడ
ఊరకే కన్నీరు నింప - భీంప్లాస్/ అభేరి
జగదభిరాముడు శ్రీరాముడే - దర్బారీ కానడచ
నవరత్నజ్వాల కాంతివంతమౌ ( పద్యం) - శంకరాభరణం
రామకధను వినరయ్యా - హిందోళం
లేరు కుశలవుల సాటి -  దేశికర్
విరిసే చల్లని వెన్నెల - కళ్యాణి
వినుడు వినుడు రామాయణగాథా - కీరవాణి
శ్రీరాముని చరితమును -  శివరంజని
సప్తాశ్వరధమారూఢం శ్లోకం - తిలాంగ్
శ్రీరామ సుగుణధామా - భాగేశ్వరి

స్థలాభావం వలన కొన్నిమాత్రమే పేర్కొనడం జరిగింది.

లవకుశ సంగీత విజయానికి ఈ చిత్ర గీత రచయితలు - కంకంటి పాపరాజు, దువ్వూరి రామిరెడ్డి( పద్యాలు), సముద్రాల,  సదాశివబ్రహ్మం , కొసరాజు ల సాహిత్యం, పి లీల, సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, ఎల్.ఆర్.ఈశ్వరి, వైదేహి, జిక్కి , కె.రాణి, ఎస్ వరలక్ష్మి ల - గళ మాధుర్యం లవకుశ సంగీత ఘన విజయానికి ఎంతో దోహదపడ్డాయి.

ఉన్న ఇబ్బందులు చాలవన్నట్లు సీనీమా సగంలో తమిళ డిస్ట్రిబ్యూటర్ లు సినీమాలో తమ తమిళుల కన్నా తెలుగువారి ప్రాబల్యమే ఎక్కువగా వుందని అందువల్ల తమకు తమ ప్రాంతంలో పేరుపొందిన సంగీత దర్శకుడే కావాలని పట్టుబట్టడంతో తమిళంలో  కె.వి.మహాదేవన్ కొన్ని పాటలకు, ముఖ్యంగా మూడు రామాయణం పాటలకు సంగీతం నిర్వహించారు. మిగిలిన పాటలు, రీరికార్డింగ్ ఘంటసాలగారు చేసారు.

ఇలా ఎన్నో అవాంతరాలు దాటుకొని సినీమా మొదలెట్టిన ఐదేళ్ళకు 1963లో తెలుగు తమిళ రంగుల లవకుశ సినీమా విడుదలయింది. మొదటి రెండువారాలు కలెక్షన్స్ డల్. మూడోవారం నుండి ట్రెండ్ మారింది. టాక్ మారింది. సినీమా హిట్ అనే మాట విపడింది. 62 కేంద్రాలలో శతదినోత్సవాలు, 18 కేంద్రాలలో స్వర్ణోత్సవాలు జరుపుకొని అక్షరాల కోటి రూపాయల కలెక్షన్స్ (1963లో) సంపాదించిన తొలి తెలుగు చిత్రంగా లవకుశ ఒక అపూర్వ చరిత్ర సృష్టించింది.

లవకుశ అపూర్వ విజయానికి ఘంటసాల సంగీతమే  మూలకారణమని సినీ ప్రముఖులు, విమర్శకులు, సంగీతాభిమానులు ఈనాటికీ కొనియాడుతున్నారు.

లవకుశలోని సీతారాములు అంజలీదేవి, ఎన్.టి.రామారావు కోట్లాది తెలుగుల ఆరాధ్యదైవాలయ్యారు. వారి చిత్రపటాలు అనేక గృహాల పూజా మందిరాలను అలంకరించాయి. లవకుశ లోని ప్రతీ పాటా, పద్యమూ ఈ నాటికీ, ఏనాటికీ సజీవమే.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...