Saturday, 27 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 40వ భాగం - ఝణ ఝణ కింకిణీ చరణ చారణ లాస్య మధూదయమ్ములో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై తొమ్మిదవ భాగం ఇక్కడ  

40వ సజీవరాగం -  
ఝణ ఝణ కింకిణీ చరణ చారణ 
లాస్య మధూదయమ్ములో 

చిత్రం - కన్నకొడుకు
గానం - ఘంటసాల
రచన - జగ్గయ్య
సంగీతం - ఎస్.పి.కోదండపాణి

ఝణ ఝణ కింకిణీ చరణ చారణ లాస్య మధూదయమ్ములో
తొణికెడు నీ తనూలతిక దోరగ పూచిన యవ్వనాలు నా
మనసున నింపెనే వలపు మంచుల చల్లదనాలు కోరికల్
పెనగొను స్వప్నలోకముల వెన్నెల మేడల  వెల్గెనో చెలీ

లలిత శరదిందు రేఖల పలుకరించి
కన్నె విరజాజి తావుల కలలు పండి
వలపు సెలయేటి కెరటాల పులకరించి
ఎగిరి వచ్చిన వనకన్యవేమొ నీవు

నీ మధురాధరాలు, కుసుమించిన 
హాసవసంత శోభనై
నీ మధుభాషణాల రవళించిన 
మోహన వేణునాదమై
నీ మదిలోని భావమై నిన్నెడబాయని నీలినీడవై
మామక జీవితమ్మె రసమంజరిగా తరియింతునో చెలీ... 

ఘంటసాల చిత్రజగత్తులో కాలుపెట్టాక సినీమా సంగీత కళామతల్లి నూతన కింకిణీ ధ్వనులు వినిపించడం మొదలెట్టింది - కొంగర జగ్గయ్య, సినీ నటుడు తెరమీద విలన్ గా వికటాట్టహాసం చేస్తూ ఆడపిల్లల మనసులలో భయాందోళనలు కలిగించే జగ్గయ్యగారిలో గొప్ప భావుకత కూడా వుంది. ఆయన హృదయంలోనుండి ఉద్భవించి ఘంటసాల కంఠాన ప్రతిధ్వనించిన కింకిణీ ధ్వనులే నేటి మన సజీవరాగం.

1961లో కృష్ణారావు అనే ఆయన దర్శకత్వంలో 'కన్నకొడుకు' అనే సినీమా వచ్చింది. జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి, రాజనాల, మొదలగువారు నటించిన ఈ చిత్రంలోని ఒక వైవిధ్య భరితమైన గీతాన్ని జగ్గయ్య వ్రాయగా ఘంటసాల ఆలపించారు. చిత్రంలో ఓ పదకొండు పాటలుండగా ఘంటసాలవారు ఆలపించిన ఈ ఏకైక గీతమే మకుటాయమానంగా నిలిచింది.

ఈ 'కన్నకొడుకు" స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎస్.పి.కోదండపాణిగారి తొలి చిత్రం. సుసర్ల దక్షిణామూర్తిగారి సహాయకుడిగా  అనేక సినీమాలలో పనిచేసి గడించిన అనుభవంతో ఈ కన్నకొడుకు పాటలను ఆయన స్వరపర్చారు. ఈ సినీమాలో వున్న పదకొండు పాటలను ఆనాడువున్న ప్రముఖగాయకులందరిచేతా తలా ఓ పాట పాడించారు.  ఘంటసాల, ఎ.ఎ. రాజా, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, సుశీల, కె.రాణి, ఎస్. జానకి, స్వర్ణలత ఈ చిత్రంలోని పాటలు పాడారు. 

ఈ సినీమాలో ఘంటసాల మాస్టారు పాడిన ఈ ఏకైక గీతం నన్నెంతో ఆకర్షించింది.

ఈ పాటను వ్రాసినవారు ఈ చిత్ర కధానాయకుడు కె.జగ్గయ్య. నటనలోనే కాక కవిగా కూడా చాలా  విలక్షణమైనవారని చాలా కొద్దిమందికే ఎరిక. వైవిధ్యభరితమైన కవితలెన్నో ఆయన కలంనుండి జాలువారాయి. రబీంద్రనాథ్ టాగోర్ గీతాంజలిని తెనుగులో అనువదించి బహు ప్రశంసలు పొందారు. సినీమాలలో నటిస్తూనే రాజకీయాలలో ప్రవేశించి నాలుగవ లోక్ సభకి ఒంగోల్ నియోజకవర్గ నుంచి ఎన్నికై, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సినీమా నటుడిగా ఖ్యాతి పొందారు. ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని  ప్రారంభించి,  నాటకాల ద్వారా సినీమాలకు వచ్చిన విద్యాధికుడు. 

నేటి మన ప్రహేళిక గీతాన్ని కోదండపాణి కళ్యాణి, భాగేశ్వరి, హిందోళ రాగాలలో స్వరపఱచగా అనన్యసామాన్యంగా ఘంటసాల మాస్టారు గానం చేసి జీవం పోసారు. ఈ రాగాలు 'యమన్', 'భాగేశ్రీ', 'మాల్కౌంస్' గా హిందుస్థానీ సంగీతంలో కూడా బహు ప్రసిధ్ధికెక్కిన రాగాలు. ఈ గీతంలో సితార్, ఫ్లూట్, ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్, వైయొలిన్స్, తబలా వాద్యాలు అతి సున్నితంగా గాత్రాన్ని అనుసరించి  మనోరంజకంగా సాగాయి. 

ఈ పాట ఒక నూతన పంథాలో వినిపిస్తుంది. సాహితీ పరంగా, సంగీతపరంగా ముందు ఒక గజల్ లా అనిపించినా సాకీల ప్రక్రియలో మిగిలిన భాగం కొనసాగింది. ఈ పాటను ఘంటసాల మాస్టారి చేత మాత్రమే పాడించడంలో సంగీత దర్శకుడు, దర్శక నిర్మాతలు ఎంతో ఔచిత్యాన్ని పాటించారనే చెప్పాలి. ఈ తరహా గీతాలు ఘంటసాలవారి గంభీర నాదంలోనే  సజీవమై శ్రోతల హృదయాలను తట్టి కుదుపుతూంటాయి.

ముఖ్యంగా పై స్వరస్థాయిలలో సాగే ఈ గీతం ' వనకన్యవేమో' అనే చోట ఘంటసాల మాస్టారు ఇచ్చిన భావప్రకటనకు, స్వరప్రస్తారానికి సంగీతజ్ఞానంలేని పామరశ్రోత కూడా  'వహవ్వా'  అనకతప్పదు. అలాగే పాట ఆఖరున వచ్చే ఆలాపన  ఆయనకు మాత్రమేసాధ్యం, అది వారికే సొంతం.

గత దశాబ్దాలలోని హిందుస్థానీ గజల్ విద్వాంసుల గానానికి ఏమాత్రం తీసిపోని తెలుగు గజల్ గా ఘంటసాలవారి  ఈ గీతం కలకాలం నిలిచిపోతుంది.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

Saturday, 20 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 39వ భాగం - సుందరి నీవంటి దివ్యస్వరూపమ్ము

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఎనిమిదవ భాగం ఇక్కడ  

39వ సజీవరాగం -  సుందరి నీవంటి దివ్యస్వరూపమ్ము

చిత్రం - మాయాబజార్
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల

పల్లవి:


సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
ఎందెందు వెదకిన లేదు కదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి.. ఓహో సుందరి.. ఆహా సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా



చరణం 1:

దూరం దూరం...ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా


అయ్యో.. సుందరి....

ఆహా సుందరి.. ఓహో సుందరి
సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా


చరణం 2:

రేపటి దాకా ఆగాలి... ఆ...

అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
ఊ....
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేకదా


సుందరి.. ఓహో సుందరి.. ఆహ సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ వగల నా విరహము హెచ్చేకదా


చరణం 3:

హెచ్చితే ఎలా? పెద్దలున్నారు...
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి..
ఊ.. ఆ...


పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా..ఆ...
ఆ.. 

పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా.....
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా


సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా...
ఊ.. అహ...సుందరి ...సుందరి ఓహో సుందరి ..
ఒహొ సుందరి... ఊ.. ఒహొ...సుందరి ....ఓహో సుందరి
"


కె.వి.రెడ్డి గారి ఇంద్రజాల, మహేంద్రజాల అపూర్వ, అపురూప సృష్టి  "మాయాబజార్" సినీమా. వ్యాస భారతంతో సంబంధం లేని కొన్ని పాత్రలతో ఒక అద్భుతమైన కథను సృష్టించి అది మహాభారత కథేనేమో అనే భ్రమను కల్పించి, పౌరాణికతను ఆపాదించిన ఘనత కె.వి. రెడ్డిగారిది. 

1957 లో విజయావారి మాయాబజార్ రావడానికి ఇరవై సంవత్సరాల ముందే వేల్ పిక్చర్స్ వారు మాయాబజార్  సినీమాను తీసారు."శశిరేఖా పరిణయం" ఒక జానపద కథ ఆధారంగా తీయబడింది. సురభి నాటక సమాజం వారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ శశిరేఖా పరిణయం నాటకాన్ని మాయాబజార్ గా ప్రదర్శిస్తూ ఆ కథకు జనబాహుళ్యంలో మంచి ప్రాచుర్యాన్ని కల్పించారు. అంతకుముందుగా పదకొండుసార్లు మూకీ చిత్రంగా నిర్మించబడిన ఈ కథ తమిళంలో "వత్సలా కళ్యాణం" గా తీశారు. తెలుగువారి శశిరేఖ, తమిళులకు వత్సల. కానీ, కె.వి.రెడ్డిగారి అపూర్వ మేథాశక్తితో, నిబధ్ధతతో, సాంకేతిక నైపుణ్యంతో విజయావారి మాయాబజార్ యొక్క విజయదుందుభులు దిగంతాలలో మార్మోగాయి. స్క్రీన్ ప్లే ను మహాభగవద్గీత యంత పవిత్రంగా భావించి అందులోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని, సంభాషణలను తు.చ. తప్పకుండా యదాతధంగా తెరకెక్కించడంలో కెవి రెడ్డిగారికి గల  క్రమశిక్షణ, శ్రధ్ధాభక్తులు అనితరసాధ్యం. కళ, వ్యాపారం రెండింటి సమన్వయ స్వరూపమే సినీమా మాథ్యమం అని మనసారా నమ్మిన వ్యక్తి కె.వి.రెడ్డి. పండిత, పామరుల అభిరుచుల నాడిని గట్టిగాబట్టి సంభాషణలలో, పాటలలో ఒక నవ్యత్వాన్ని తీసుకువచ్చి తన సినిమాలను విజయవంతం చేసారు.

మాయాబజార్ లో కృష్ణుడు, ఘటోత్కచుడు తర్వాత అంతటి ప్రముఖమైన పాత్ర లక్ష్మణకుమారునిది. మహాభారతం లోని లక్ష్మణకుమారుడు సుయోధన చక్రవర్తి కుమారుడు, గొప్ప వీరుడు. కురుక్షేత్ర సంగ్రామంలో  పోరాడి వీరస్వర్గం పొందాడు. అంతకుమించి అతనికి పెద్ద కథేమీ వున్నట్లు కనపడదు.

అదే కె.వి.రెడ్డిగారి కల్పనలో లక్ష్మణకుమారుడు భీరువు, విదూషక లక్షణ సమన్వితుడు. హాస్య రసాన్ని పోషించడం కోసం మలచబడిన కథాపాత్ర. ప్రాచీన సంస్కృత నాటకాలలో, కావ్యాలలో హాస్యానికి, వినోదానికి ఎంతో ప్రాధాన్యత కల్పించబడింది. అలంకారికులు హాస్యాన్ని పలురకాలుగా వర్ణించారు. వాటన్నిటి ఆధారంగా మాయాబజార్ లోని లక్ష్మణ కుమారుడి  పాత్ర హాస్యరస ప్రధానంగా రూపొందించబడింది.

లక్ష్మణకుమారుడికి శశిరేఖ మీద పెద్ద ప్రేమగానీ వ్యామోహంగాని లేవు. తనకు దాయాది, విరోధియైన అభిమన్యుడు  శశిరేఖను పెళ్ళిచేసుకోకుండా అడ్డుతగలడమే అతని ధ్యేయం. అందుకోసమే  తనకు గల సాహితీ, సంగీత పాటవాన్ని శశిరేఖ అనుకొని ఘటోత్కచుడు ఆవహించిన మాయా శశిరేఖ ముందు "సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా"  అంటూ ప్రదర్శించి అపహాస్యం పాలవుతాడు.   ఈ సన్నివేశం లో శశిరేఖగా సావిత్రి, లక్ష్మణకుమారుడిగా రేలంగి పొటాపోటీగా నటించి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు.  ఈ పాట సన్నివేశంలో రేలంగి, సావిత్రిల మధ్య సాగిన ఏక్షన్ - రియాక్షన్, శృంగార హాస్యరస ప్రదర్శన అద్వితీయం. లక్ష్మణకుమారుడి (రేలంగి) వెఱ్ఱిబాగులతనం, అమాయకత్వాన్ని ఆసరాగాతీసుకొని  పాట ఆద్యంతం శశిరేఖ (సావిత్రి) ప్రదర్శించిన అవహేళన, వెక్కిరింత ఈ పాట సజీవం కావడానికి ఎంతో దోహదపడ్డాయి.

ఈ పాట రచనకు ముందే  కవి పింగళి, సంగీతదర్శకుడు  ఘంటసాల, డైరెక్టర్ కె.వి.రెడ్డి  చేసిన కసరత్తు మూలంగా ఈ పాట చిత్రీకరణ సమయంలో ఎక్కువ కష్టపడకుండా నటీనటుల నుండి తనకు కావలసిన ఎఫెక్ట్ ను అద్భుతంగా రాబట్టుకోగలిగారు.  తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి నిర్మించబడిన మాయాబజార్ లో సావిత్రి కి నలుగురు బావలు. తెలుగు శశిరేఖ గా అక్కినేని, రేలంగిలతోనూ, తమిళ వత్సలగా జెమినీ గణేశన్, కె.ఎ.తంగవేలుతోనూ సావిత్రి ఆడిన ప్రేమ సయ్యాటలు రెండు ప్రాంతాల ప్రేక్షకులకు మహదానందాన్ని కలుగజేసాయి. 

మాయాబజార్ సంగీత రసభరితం కావడంలో ఘంటసాల ప్రముఖ పాత్ర వహించారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను కనపర్చారు.  చిత్రం ఆద్యంతం పాటలు, పద్యాల వరసల కూర్పులో, రీ-రికార్డింగ్ విషయంలో ఘంటసాల తన విశ్వరూపం చూపించి మాయాబజార్  మ్యాజికల్ మ్యూజికల్ హిట్ కావడంలో  ఎంతో తోడ్పడ్డారు.

"సుందరి నీవంటి దివ్య స్వరూపంబు" పాట అంతగా జనాకర్షణ పొందడానికి ఆ పాటలో గొప్ప కవిత్వంతో కూడిన సాహిత్యం లేదు. పాట మెట్టులో శుధ్ధ శాస్త్రీయతా లేదు. పాటంతటిని చిన్న చిన్న సరళమైన మాటలుపయోగించి పింగళివారు హాస్యరస ప్రధానంగా వ్రాయగా, ఘంటసాల తన సంగీతంలో కూడా హాస్యాన్నిజొప్పించి పండిత పామరులంతా హర్షించేలా పాడారు. ఖమాస్ రాగ స్వరాలతో స్వరపర్చిన  ఈ పాట మొదలుపెట్టి, పూర్తి అయేంతవరకు ఘంటసాల, నటి సావిత్రి చూపిన ఎఫెక్ట్స్, కౌంటర్ ఎఫెక్ట్స్ ఆ పాటకు చిరంజీవత్వాన్ని ప్రసాదించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  అలాగే ఈ పాటకు ఉపయోగించిన వాద్యగోష్టి కూడా హాస్యాన్ని పండించడంలో కృతకృత్యులయ్యారు.

ఖమాస్  28 వ మేళకర్త హరికాంభోజికి జన్యరాగం.శృంగారభావాలను ప్రకటించడానికి అనువైన ఈ రాగం ఆరోహణలో రిషభం లేకుండా ఆరు స్వరాలు, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతాయి.

అసలు "సుందరి నీవంటి దివ్యస్వరూపంబు" పాటను ఘంటసాలవారు పాడవలసిన పాట కాదు. తెలుగులో ఈ పాటను రేలంగికి పిఠాపురం నాగేశ్వరరావు, సావిత్రి లచేత , తమిళంలో ఎస్ సి కృష్ణన్ ,సావిత్రి ల చేత పాడించాలనే నిర్ణయం చేసి పాడించి రికార్డింగ్ ముగించారు. తమిళం పాట ఏ అభ్యంతరం లేకుండా అందరి ఆమోదం పొందింది. కాని తెలుగు వెర్షన్ కె.వి.రెడ్డిగారికి , చక్రపాణిగారికి అంత సంతృప్తి కలిగించలేదు.  ఆశించిన జీవం  పాటలో ధ్వనించలేదనే భావన వారిలో కలిగింది.  ఆ పాట ఘంటసాల పాడితేనే బాగుంటుందని  నిర్ణయించి  మరల  ఘంటసాల, సావిత్రిల చేత ఆ పాటను పాడించారు. తన స్వీయసంగీతంలో వచ్చిన "మన దేశం" సినీమాలో ఘంటసాల తొలిసారిగా రేలంగికి ఒక పాట, జిక్కితో కలసి పాడారు. అది యుగళ గీతం. ఆ తర్వాత "పెద్ద మనుషులు"  సినీమాలో రేలంగికి పాడిన రెండు పాటలతో ఆ ఇద్దరి కాంబినేషన్ స్థిరపడింది. రేలంగి  నటనకు ఘంటసాల గళమే తప్పనిసరని మాయాబజార్ లోని ఈ పాట మరోసారి నిరూపించింది.  ఘంటసాల గాత్రంలో మంచి నటుడు కూడా వున్నాడనే విషయాన్ని తెలుగువారంతా  కూడా నిర్ద్వంద్వంగా ఆమోదించారు. 

అందుకే ఘంటసాలవారి గళం నుండి జాలువారిన అనేక లలిత, శాస్త్రీయ గీతాలు ఈనాటికీ సజీవమై తెలుగు హృదయాలలో సదా మెదులుతూనే వుంటాయి.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

Saturday, 13 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 38వ భాగం - శిలలపై శిల్పాలు చెక్కినారూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఏడవ భాగం ఇక్కడ  

38వ సజీవరాగం - శిలలపై శిల్పాలు చెక్కినారూ
చిత్రం - మంచి మనసులు
గానం - కె.వి.మహాదేవన్
రచన - ఆత్రేయ
సంగీతం - ఘంటసాల

సేలమ్ మోడర్న్ ధియేటర్స్ చాలా పాత నిర్మాణ సంస్థ. ఏక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. 1935 నుండి 1982 వరకు సేలమ్ లో వారి సొంత స్టూడియోలోనుండి అనేక విజయవంతమైన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, సింహలీస్, ఇంగ్లీషు భాషలలో దాదాపు 150 సినీమాలు నిర్మించారు. ఆ మోడర్న్ ధియేటర్స్ వారు "కుముదమ్" అనే ఫ్యామిలీ సెంటిమెంట్  సినీమాను నిర్మించారు. 

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, కె.వి.మహాదేవన్ సంగీత నిర్దేశకత్వంలో వచ్చిన ఈ సినీమా  సంగీతపరంగా , ఆర్ధికపరంగా ఘన విజయం సాధించింది. కెవి మహాదేవన్ కు 'మామ' ముద్దుపేరును కట్టబెట్టిన "మామ మామ మామా" పాట ఈ "కుముదం"లోనిదే. అందులో బాగా హిట్టయిన మరో పాట శీర్కాళి గోవిందరాజన్ పాడిన " కల్లిలే కలై వన్నమ్ కన్డాన్" అనే పాట. ఆ పాటకు తెలుగు సేత "శిలలపై శిల్పాలు చెక్కినారు.." అదే ఈనాటి మన సజీవరాగం.

చక్రవర్తి అయ్యంగార్ అనే తమిళ నిర్మాత  వరసగా తెలుగులో సినీమాలు తీయడానికి సంకల్పించి బాబూ మూవీస్ బ్యానర్ ను స్థాపించి ఈ "కుముదం" తమిళ చిత్రాన్ని తమ తొలి ప్రయత్నం గా మొదలుపెట్టారు. తమిళ చిత్రానికి పనిచేసిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు, సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ లనే తెలుగు వెర్షన్ చేయడానికి వినియోగించుకున్నారు.

ఆక్కినేని, సావిత్రి, ఎస్.వి.రంగారావు, షావుకారు జానకి, గుమ్మడి, నాగభూషణం, వాసంతి మొదలగు నటులతో "మంచి మనసులు" పేరిట 1962 లో విడుదలై అన్నివిధాలా ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా తమిళం వరసలనే  దాదాపు అన్ని పాటలకు ఉపయోగించినా , తిరుగులేని సంగీతదర్శకుడిగా కొన్ని దశాబ్దాలపాటు  ఇతర సంగీత దర్శకులను వెనుకకు నెట్టి  కెవి మహాదేవన్ తెలుగు చిత్రసీమలో తన విజయపతాకం ఎగురవేయడానికి "మంచిమనసులు" పాటలు మంచి దోహదం చేసాయి. ఆరు దశాబ్దాల తర్వాత కూడా  ఆ పాటలన్నింటినీ ఈనాటికి సంగీతాభిమానులు పాడుకుంటున్నారంటే సంగీత దర్శకుని ప్రతిభతోపాటు ఆ పాటలను పాడిన ఘంటసాల, పి.సుశీల, జమునారాణి, మొదలగువారి శ్రావ్యమైన గానమాధుర్యం కూడా ముఖ్య కారణమని చెప్పకతప్పదు.

ఇక నేటి ఘంటసాలవారి సజీవరాగానికి వస్తే....

ఏడు, ఎనిమిది శతాబ్దాలనాటి పల్లవ రాజుల కళాసంస్కృతిని ఈనాటికి ప్రతిబింబింపజేస్తూ విరాజిల్లుతున్న మామల్లపురం( మహాబలిపురం) శిల్పాల నేపధ్యంతో కన్నదాసన్ తమిళంలో ఒక అద్భుతమైన గీతాన్ని రచించగా, మహాదేవన్ ఆ పాటను జోన్పురి రాగంలో స్వరపర్చి శీర్కాళి గోవిందరాజన్ చేత పాడించారు. గోవిందరాజన్ సినీగాయకుడిగా కంటే కర్నాటక సంగీత విద్వాంసుడిగా బాగా పేరుపొందారు. హిందీలో శాస్త్రీయ గీతాలను పాడేందుకు మన్నాడేకు ఎలాటి ప్రాధాన్యతనిచ్చేవారో అలాగే తమిళంలో శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం వున్న పాటలను శీర్కాళి గోవిందరాజన్ చేతనే పాడించేవారు.  "కల్లిలే కలై వన్నమ్ కన్డాన్" అనే పల్లవితో ప్రారంభమయే ఆ పాట తమిళనాట ఈనాటికీ సూపర్ హిట్ పాటగానే చెలామణి అవుతూవుంది.

అదే సన్నివేశానికి దాదాపు అదే భావజాలంతో ఆత్రేయగారు తెలుగులో  " అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవారాయా..."అనే మకుటంతో వ్రాసిన పాట. అక్కడ తమిళంలో కన్నదాసన్  పల్లవుల కళావైభవాన్ని చాటిచెపితే , ఇక్కడ తెలుగులో ఆత్రేయగారు 15వ శతాబ్దానికి చెందిన విజయనగరం (హంపీ) 'మూరు రాయర గండడు ' శ్రీకృష్ణ దేవరాయల కాలంనాటి సంగీత, సాహిత్య, శౌర్య వీర్య ప్రతాపాలను, శిల్పకళా ప్రాభవాన్ని ఘనంగా వర్ణించారు.  ఇందుకుగానూ ఆదుర్తివారు తెనాలి రామకృష్ణ చిత్రంలోని ఎన్.టి.ఆర్, అక్కినేనిల స్టాక్ షాట్స్ ను సందర్భోచితంగా ఉపయోగించి సన్నివేశాన్ని రక్తి కట్టించడంతోపాటూ ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్. అభిమానుల ఆదరాభిమానాలను కూడా మూటకట్టుకున్నారు.

"శిలలపై శిల్పాలు చెక్కినారు 
మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు"

పాట మెట్టు కట్టడం విషయంలో మహాదేవన్ కొంత అదనపు కృషిని చేసారు. తమిళం పాటకు తెలుగు పాటకు మధ్య చాలా మార్పునే చేసారు. పాట ఔన్నత్యాన్ని గుర్తించి మహాదేవన్ ఈ పాటను రాగప్రధానంగా చేయ సంకల్పించి రాగమాలికలో స్వరపర్చారు. అందుకుగాను  శుధ్ధ శాస్థ్రీయ రాగాలైన శుధ్ధ ధన్యాసి, పడ్దీప్ (కర్నాటక సంగీతంలో గౌరీ మనోహరి), నఠభైరవి , ఖరహరప్రియ రాగాలను సమర్ధవంతంగా , సందర్భోచితంగా ప్రయోగించారు. సంగీత దర్శకుడికి, గాయకుడికి కూడా సంగీత రాగాల విషయంలో సరైన అవగాహన వున్నప్పుడే రాగమాలిక గీతాలు శ్రవణానందం కలిగిస్తాయి. ఒక రాగం లో నుండి మరో రాగంలోకి మారాలంటే ఏ స్వరం మీద, ఏ స్థాయి దగ్గర మార్పు చేస్తే సహజంగా, సున్నితంగా వుంటుందో బాగా ఆలోచించి చేయవలసివుంటుంది. అందరూ రాగమాలికలలో పాటలు చేస్తారు, పాడతారు. కానీ వాటికి సార్ధకత కలిగేది ఏ కొద్దిమంది గాత్రాలలో మాత్రమే. అందుకే ఈ పాట ఘంటసాలవారిని మాత్రమే వరించింది.

ఈ పాటను సాకీతో ప్రారంభించి, సాకీతోనే ముగించడం ఒక విశేషం.

కె.వి.మహాదేవన్ పాటలు పాడడమంటే ఘంటసాల మాస్టారికి నల్లేరు మీది బండి వాటమే. మంచి మనసులు చిత్రంతో ప్రారంభమైన మహాదేవన్- ఘంటసాలల స్వరప్రస్థానం ఓ పుష్కరం పాటు నిరాటంకంగా కొనసాగింది. వారిద్దరి మధ్య చక్కటి సంగీతావగాహన, సాన్నిహిత్యం వుండేది.  క్వాలిటీ, పెర్ఫెక్షన్ అంటూ గాయనీగాయకులను తీవ్రంగా శ్రమపెట్టే నైజం మహాదేవన్ కు లేదు. ఒకటి, రెండు టేకులలోనే తనకు కావలసిన నాణ్యతను గాయకులనుండి రాబట్టుకునేవారు. అందువల్ల మహాదేవన్ రికార్డింగ్ అంటే ఘంటసాల మాస్టారు ఎప్పుడూ హాయిగా, ఆనందంగా ఫీల్ అయ్యేవారు. అందువల్లే 'శిలలపై శిల్పాలు " పాట ఘంటసాలవారి గళంలో అమోఘంగా పలికింది. చెక్కు చెదరని శ్రుతిలయలు , భావగాంభీర్యం, మంద్ర,  తార స్థాయిలలో కూడా ఒకేరకమైన నాదానుభూతిని  కలిగిస్తూ, సుశ్రావ్యంగా  ఈ పాటను అనితర సాధ్యంగా ఘంటసాల ఆలపించారు.

విజయనగరరాజుల కళా ప్రాభవాన్ని మనకళ్ళెదట చూపించారు. కళ్ళులేనివారు కూడా ఈ పాటను వింటూ ఆనాటి దృశ్యాలను అనుభవించే విధంగా ఈ పాటను మాస్టారు వినిపించారు. ఒకే సమయంలో అనేక రసాలను తన గళం ద్వారా పోషించి తెర మీది నటుల హావభావాల ప్రకటనకు దోహదం చేసారు.

ఈ పాట సన్నివేశం చిత్రంలో చాలా కీలకమైనది. అంధురాలైన భార్యకు ప్రకృతిలోని అందాలన్నీ కళ్ళకుకట్టేలా వర్ణిస్తూ  ఓ మంచి మనసున్న భర్త పాడే పాట ఇది. ఈ పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి ఎంతో ఉదాత్తంగా నటించారు.

శ్రీకృష్ణ దేవరాయల వారి పాగాలో కలికితురాయిలా, ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక మణిమకుటంగా "శిలలపై శిల్పాలు చెక్కినారు" పాట తెలుగు చరిత్ర వున్నంతవరకూ శాశ్వతంగా నిలిచిపోతుంది. 








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

Saturday, 6 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 37వ భాగం - ముక్కోటి దేవతలు ఒక్కటైనారూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఆరవ భాగం ఇక్కడ  

37వ సజీవరాగం - ముక్కోటి దేవతలు ఒక్కటైనారూ
చిత్రం - బావామరదళ్ళు
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - పెండ్యాల

అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన
రక్ష, రక్ష జనార్దన

నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు. నీ శరణు కోరుతున్నాను. దయతో నన్ను రక్షించు అని ఆ దేవదేవుని చరణాలనాశ్రయిస్తే తప్పక రక్షించి చింతలన్నీ తొలగిస్తాడు. భార్యావియోగంతో ఒంటరితనంతో వేదనలపాలై తల్లిలేని తన పసిపాపడికి మీరే దిక్కని తెలుగుదేశంలోని పవిత్ర దేవాలయాలలోని దేవుళ్ళ దగ్గర మొరపెట్టుకుంటున్న ఒక దీనుడి అంతరంగ ప్రార్ధన ఈ గీతం. 

ఆ దేవుడనేవాడు సతీవియోగ బాధనెరిగిన తిరుపతి వెంకన్న గావచ్చు, లేదా  నెల్లూరు శ్రీరంగనాయకుడు కావచ్చు, లేదా తల్లి రూపంలో లోకాలనేలే కనకదుర్గమ్మ కావచ్చు,  కంచర్ల గోపన్నను ఆదుకున్న భద్రాద్రి రామన్నైనా, బాల ప్రహ్లాదుని కాపాడిన సింహచలేశ్వరుడైనా, ఏ రూపంలో వున్నా ఎక్కడ వున్నా ముక్కోటి దేవతలంతా ఒక్కటై  తన చిన్నారి బాలునికి రక్షణ కల్పించమని ఈ కథానాయకుడు అర్థిస్తునాడు.

ఎవరూ లేనివారికి దేవుడే దిక్కు. ఆ దేవుని నమ్మినవారెవరూ చెడిపోరు అనే సూక్తి ఆధారంగా ఈగీతాన్ని ఎంతో బరువుగా, వేదనాభరితంగా, ఆర్ద్రతతో ఆరుద్రగారు రచించారు. పి.ఎ.పద్మనాభరావు నిర్మాత, దర్శకుడిగా రూపొందించిన ఒక చక్కటి కుటుంబగాధా చిత్రం "బావా మరదళ్ళు"  లో ఒక ఉద్విగ్నభరిత సన్నివేశం కోసం ఈ పాటను నేపథ్యగానంగా రూపొందించి కధానాయకుడు రమణమూర్తి మీద చిత్రీకరించారు. ఆతని భార్యగా కుసుమ కుమారి (మాలిని), మరదలుగా కృష్ణకుమారి నటించారు.

బావామరదళ్ళు సినీమాకు పెండ్యాల నాగేశ్వరరావుగారు అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆరుద్ర వ్రాసిన "నీలిమేఘాలలో గాలికెరటాలలో",  "హృదయమా ఓ బేల హృదయమా", "ముక్కోటి దేవతలు"; శ్రీశ్రీ  వ్రాసిన "పయనించే మన వలపుల" వంటి పాటలు ఆపాతమధురాలై, ఆరు దశాబ్దాల తర్వాత కూడా సంగీతాభిమానులందరిచేతా మననం చేసుకోబడుతున్నాయి. ఈ పాటలను పాడిన ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి చిరస్మరణీయ గాయకులుగా తెలుగువారందరిచేతా ఆరాధించబడుతున్నారు.

"ముక్కోటి దేవతలు ఒక్కటైనారు" అనే ఈ గీతంలో పల్లవితో పాటు ఆరు చరణాలున్నాయి. ఒక్కొక్క చరణం ఒక్కొక్క దేవుని కీర్తిస్తూ వ్రాసారు ఆరుద్ర. గ్రామఫోన్ రికార్డులో లేని  ఆఖరిచరణం పూరి జగన్నాధస్వామి పరంగా వ్రాసి, ఆ దేవుని గురించి మనం ఊహించని ఒక చమత్కారాన్ని మనకు తెలియజేసారు ఆరుద్ర. పూరి జగన్నాధ స్వామి ఆలయాలలో, చిత్రపటాలలో మొండిచేతులవాడిగానే మనకు దర్శనమిస్తూంటాడు. దానికి కారణం చేతికి ఎముకలేకుండా భక్తులకు, దీనార్తులకు దానాలు చేయడమేనని ఆరుద్ర ఒక గొప్ప వ్యాఖ్యానం చేసారు.

పెండ్యాలగారు ఈ పాటను శుధ్ధ శాస్త్రీయ పధ్ధతిలో రాగమాలికలో స్వరపర్చగా తన సహజసిధ్ధమైన భావగాంభీర్యంతో, అపూర్వ గానపటిమతో, నవరసాలను గమకయుక్తంగా  తన గళంలో పలికిస్తూ శ్రోతలలో భక్తి పారవశ్యాన్ని కలుగజేసారు గానగంధర్వుడు ఘంటసాల. ఈ అపురూప గీతంలో - కాంభోజి, కానడా, కీరవాణి, మయామాళవగౌళ, నాటకురంజి వంటి శుధ్ధ కర్నాటక (కానడా తప్ప)  సంగీత రాగాలను పెండ్యాల అతి సమర్ధవంతంగా ప్రయోగించారు. అలాగే వాద్యబృందాన్ని కూడా పరిమితంగా   కర్ణాటక శైలిలో గమక ప్రాధాన్యతనిచ్చి ఉపయోగించారు. సదా మన మదిలో మెదిలే సజీవరాగం "ముక్కోటి దేవతలు ఒక్కటైనారు" రాగమాలిక.

"బావామరదళ్ళు" సినీమా ఆనాడు, ఈనాడు కూడా కేవలం పాటల ఔన్నత్యంతో మాత్రమే తెలుగువారికి గుర్తుండిపోయింది.  ఆర్ధిక పరాజయం పొందడంతో  ఈ సినీమా కాలగర్భంలో కలిసిపోయింది. 






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...