Saturday, 22 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 35వ భాగం - శ్యామలా దండకం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై నాలుగవ భాగం ఇక్కడ  

35వ సజీవరాగం - శ్యామలా దండకం
చిత్రం - మహాకవి కాళిదాసు
గానం - ఘంటసాల 
సంగీతం - పి.సూరిబాబు/పెండ్యాల

శ్లోకం : 
మాణిక్యవీణా ముఫలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి

శ్లోకం :
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే జగదేకమాతః..... 2

శ్లోకం:
మాతా మరకతశ్యామా మాతంగీ
మధుశాలినీ కుర్యాత్కటాక్షం కళ్యాణీ
కదంబ వనవాసినీ 

జయ మాతంగ తనయే 
జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే
జయ లీలాశుక ప్రియే....

దండకం :
జై జననీ ! 
సుధా సముద్రాంత
రుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ
మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీత సంభావనా
సంభ్రమాలోల నీపస్రగాబధ్ధ
చూళీసనాధత్రికే సానుమత్పుత్రికే
శేఖరీభూత శీతాంసు రేఖా మయూఖావళీ నధ్ధ సుస్నిగ్ధ నీలాలక
శ్రేణి శృంగారితే లోక సంభావితే
కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా
పుష్ప సందేహ కృఛ్ఛారు గోరోచనా
పంక కేళీ లలాభిరామే సురామే రమే
సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే 
సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మకే
సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే
సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
జగన్మాతృకే....
పాహిమాం... పాహిమాం.. పాహిమాం!
       

సుప్రసిద్ధ  పౌరాణిక రంగస్థల, సినీ నటుడు, శ్రీ పువ్వుల సూరిబాబు,  నటి శ్రీమతి శ్రీరంజనిగారి భర్త అయిన కె.నాగుమణిగారితో కలసి నిర్మించిన చిత్రం "మహాకవి కాళిదాసు". అంతే కాదు, ఈ చిత్రంలోని శ్లోకాలు, పద్యాలకు సంగీతం సమకూర్చింది పి.సూరిబాబేగారే. పాటలకు వరసలు కూర్చి, రీరికార్డింగ్ ను సమకూర్చినవారు పెండ్యాలగారు. ఈ యిద్దరు ప్రముఖ కళాకారుల మేలు కలయికలో మహాకవి కాళిదాసు చిత్ర సంగీతం అపూర్వము, అపురూపము అయింది.  ఆ చిత్రం ద్వారా తెలుగునాట అజరామరంగా నిలిచిపోయిన శ్యామలా దండకమే నేటి 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం.

ఈ శ్యామలా దండకం కాళిదాస కవి విరచితం. 'కుమారసంభవం', 'రఘువంశం' అనే కావ్యాలను, 'అభిజ్ఞాన శాకుంతలం', 'మాళవికాగ్నిమిత్రం', 'విక్రమోర్వశీయం', అనే నాటకాలను  'మేఘదూతం' అనే ఖండకావ్యాన్ని కూడా సంస్కృతంలో వ్రాసినట్లు ప్రచారంలో వుంది.  అయితే కాళిదాస కవి జీవితకాలానికి, ప్రాంతానికి సంబంధించిన విషయాలు వేటికీ ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. కాళిదాసు జీవితాకాలం వివాదాస్పదంగానే వుంది. కాళిదాసు  విక్రమాదిత్యునికి సమకాలికుడని చెప్పుకోవడం వుంది. అయితే విక్రమాదిత్యులు పేరుతో ఎంతోమంది రాజులున్నారని కూడా చెప్పబడుతున్నది. రెండవ చంద్రగుప్తుని కాలంనాటి వాడని మరో వాదన. ఇది ఇలావుండగా 13- 14 శతాబ్దాలకు చెందిన భోజరాజు ఆస్థానకవి కాళిదాసుగా మరొక ప్రచారం వుంది. పై కావ్యాలలన్నీ ఒకే కాళిదాసు కవి వ్రాసినవి కావని ఆ పేరుతోనే మరో ముగ్గురు నలుగురు సంస్కృత కవులు వుండేవారని కూడా తెలుస్తున్నది. కాళిదాసు వ్రాసిన కావ్యాలలోని వర్ణనలు ఆధారంగా ఆయన హిమాలయాల ప్రాంతంవాడని, ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడని పలు అభిప్రాయాలు ప్రచారంలో వున్నాయి.

అటువంటి కాళిదాస కవిని మహాకవి కాళిదాసుగా తెలుగువారి కవిగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం  ఈ కథా రచయిత పింగళి నాగేంద్రరావుగారికి, డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావుగారికి , కాళిదాసుగా అద్వితీయంగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారికి మాత్రమే దక్కుతుంది.

1974ల వరకూ ఏదైనా తెలుగు సినీమా సంగీతపరంగా  విజయవంతమైనదంటే అందులో ఘంటసాలవారి పాత్ర కూడా ఎంతో కొంత తప్పక వుండేదనే చెప్పాలి. 1960లో వచ్చిన యీ మహాకవి కాళిదాసు తెలుగువారందరికీ మరింత ఆత్మీయుడు కావడానికి కారణం ఈ చిత్రంలోని ఘంటసాలవారి గానమే అంటే సత్యదూరం కాదు. ఆదిలో వెర్రి వెంగళాయిలా వుండే కాలుడు పాడిన లోల్లాయి పదాలైనా, కాళికామాత అనుగ్రహంతో సకలశాస్త్రా పారంగతుడైన కళిదాసు ఆలపించిన సమాసభూయిష్టమైన దండకాలు, శ్లోకాలైనా అవి ఘంటసాలవారి గళంలో జీవాన్ని, చిరంజీవత్వాన్ని సంతరించుకున్నాయి. ఈ  సినీమాలో ఘంటసాలవారి  గాత్రం, సంగీత విద్వత్ వారిని శిఖరాగ్రాలకు చేర్చింది. మాస్టారు గానం చేసిన శ్యామలా దండకం నిత్యనూతనం. అజరామరం. ఈ దండకం గానం చేయడంలో మాస్టారికి భాషపట్ల గల శ్రధ్ధాభక్తులు, ఆవేశం, భావోద్వేగం, గాన ప్రతిభ అనన్యసామాన్యం. 

మాస్టర్ గారిని అనుకరిస్తూ వేదికలమీద అనేకమంది గాయకులు యీ శ్యామలా దండకాన్ని  గానం చేయడానికి ఆసక్తిచూపుతూంటారు. ఇది గాయకులందరికీ పెను సవాలు. ఈ శ్యామలా దండకం పాడినప్పుడు ఘంటసాలవారి కంఠంలోని తీవ్రత, భావోద్వేగం, శృతిశుధ్ధి, గమకశుధ్ధి, రాగాలపట్ల గల సంపూర్ణ అవగాహన అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. భగవద్దత్తమైన గాత్రం, విద్వత్తు వారి సొత్తు.

ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు పి.సూరిబాబు, సుప్రసిధ్ధ సంగీత దర్శకుడు పెండ్యాల సమ్మేళనంలో రూపొందిన ఈ శ్యామలా దండకంలోని మొదటి శ్లోకాలను 
వరసగా కళ్యాణి, కేదారగౌళ, కళ్యాణి, శంకరాభరణం రాగాలలోను చివరి దండకాన్ని కళ్యాణి, కానడ, పంతువరాళి, మధ్యమావతి రాగాలలో అత్యద్భుతంగా స్వరపరచేరు . ఈ రాగాలన్నీ కర్నాటక సంగీతంలోని సుప్రసిధ్ధ రాగాలే. 

రికార్డింగ్ సమయంలో శ్లోకాలను, దండకాన్ని విడివిడిగా రికార్డు చేద్దామని సంగీత దర్శకుడు పెండ్యాలగారు సూచించినా, వద్దని పట్టుబట్టి మొత్తం నాలుగు నిముషాల శ్లోకాలు, దండకం ఒకే స్ఫూర్తితో పాడేస్తానని ఘంటసాల మాస్టారు మైక్ ముందుకు వెళ్ళారట. ఆ సమయంలో  ఘంటసాలగారిలో ఏ దైవం ఆవహించిందో,  మాస్టారిలోని ఆవేశాన్ని, ఉద్వేగాన్ని చూసి తాను నిశ్చేష్టుడినై అలా వుండిపోయానని, అదొక అద్భుత సన్నివేశమని, ఆనందంతో పులకించిపోయి, మైమరపుతో ఘంటసాలవారిని కౌగిలించుకొన్నానని పెండ్యాలగారు తన ఇంటర్వ్యూలలో  చెప్పేవారు.

ఈ చిత్రం ముందు కన్నడంలో, ఆ తర్వాత తమిళంలో వేరే నటులు, గాయకులతో నిర్మించబడినా తెలుగువారి కాళిదాసుకు సాటిరాలేదనే నా భావన.

1959 లో ఈ శ్యామలా దండకం రికార్డింగ్ అయిన రోజులలోనే ఘంటసాలవారి పెద్ద కుమార్తె జన్మించడం, తర్వాత  అమ్మవారి పేరు మీద శ్యామల అని నామకరణం చేయడం జరిగింది.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...