Saturday, 15 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 34వ భాగం - వాతాపి గణపతిం భజే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై మూడవ భాగం ఇక్కడ  

34వ సజీవరాగం - వాతాపి గణపతిం భజే
చిత్రం - వినాయకచవితి
గానం - ఘంటసాల 
సంగీతం - ఘంటసాల  

వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం శ్రీ  ! వాతాపి!

భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం ! వాతాపి

పురా కుంభసంభవ  మునివర 
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రస్థితం పరారి చత్వారి
వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజవామకర విధృతేక్షు దండం

కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం 
హరాది గురుగుహతోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంభం
! వాతాపి !

దైవంపట్ల విశ్వాసం, భక్తి కలిగివున్నవారంతా ఏదైనా కొత్త కార్యం తలపెట్టినప్పుడు మున్ముందుగా  విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి తమ పనులు మొదలెడతారు. కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు రచించి, హంసధ్వని రాగంలో స్వరపర్చిన "వాతాపి గణపతిం భజే" కీర్తన నేటి మన ఘంటసాల సజీవరాగం.

ముత్తుస్వామి దీక్షితుల జన్మస్థలమైన తిరువారూర్ జిల్లా తిరుచెంగట్టన్కుడిలో వున్న ఉత్తరపతీశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్టింపబడిన వాతాపి గణపతిని స్తుతిస్తూ గానం చేసిన కీర్తన. ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూర్ చుట్టుప్రక్కలగల పదహారు వినాయక మూర్తులను స్తుతిస్తూ షోడశ గణపతి కీర్తనలను వ్రాసారు. వాటిలో ప్రముఖమైనది ఈ "వాతాపి గణపతిం భజే" కీర్తన .

ఈ వాతాపి గణపతి వాతాపి ( బాదామి) నుండి  తిరుచెంగట్టన్కుడికి రావడం వెనుక ఒక చారిత్రక కథ వున్నది. పల్లవ నరసింహవర్మ సైన్యాధిపతి పరంజ్యోతి యుధ్ధంలో వాతాపి చాళుక్య రాజులపై (అనాటి వాతాపి ఈనాడు కర్ణాటక రాష్ట్రంలోని బాదామి ప్రాంతం) విజయం సాధించి విజయ చిహ్నంగా వాతాపిలోని ఈ గణపతి శిలను తన వూరికి తీసుకువచ్చాడు. తర్వాత పరంజ్యోతి తన ఘాతుక చర్యలకు పశ్చాత్తాపం చెంది వైరాగ్యంతో శైవమతాన్ని స్వీకరించి 63 నాయన్మర్ లలో ప్రముఖుడైన సిరుతొండై నాయన్మార్ గా లోకప్రసిధ్ధుడైనాడు. ఆ పరంజ్యోతి తీసుకువచ్చి ప్రతిష్టించిన వాతాపి గణపతిని ఉద్దేశించి ముత్తుస్వామి దీక్షితులవారు "వాతాపి గణపతిం భజే" కీర్తనను వ్రాసారు. దీక్షితులవారి కీర్తనలనేకం సంస్కృత భాషలోనే వున్నాయి.

త్రిమూర్తులు, కుమారస్వామి, చంద్రుడువంటి దేవతలచేత, అగస్థ్యాది మునివరులచేత పూజించబడుతూ త్రికోణ మధ్యం (శ్రీచక్రం)లో అధిష్టించబడివున్న గణపతిని, వ్యాసునికి చతుర్వేదాలు వ్రాసిపెట్టిన గణేశుని దీక్షితులవారు హంసధ్వని రాగంలో స్తుతించారు.

ఇక ఈ నాటి మన సజీవరాగం విషయానికొస్తే....

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు, ఆయన భార్య, ప్రముఖ నటి సురభి బాలసరస్వతి నిర్మాతలుగా మారి తమ తొలి ప్రయత్నంగా  అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద "వినాయకచవితి" చిత్రాన్ని తీయ సంకల్పించి కథ, మాటలు, పాటలు వ్రాసే బాధ్యతతోపాటు చిత్ర దర్శకత్వాన్ని కూడా సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. దర్శకుడిగా సీనియర్ సముద్రాలవారికిది మొదటి చిత్రం. సంగీత దర్శకుడు ఘంటసాలవారు. ఎన్.టి.రామారావు  మాయాబజార్ తరువాత నాలుగైదు మాసాల వ్యవధిలో మరల కృష్ణునిగా తెలుగు ప్రజలను అలరించిన చిత్రం 'వినాయకచవితి'.  సినీమా అంతా సంగీతమయం. అనాదిగా వున్న శ్లోకాలు, ఆచార్యులవారు వ్రాసిన పద్యాలు, పాటలు అన్నీ కలిపి ఓ పాతిక ఉన్నాయి. వీటిని ఘంటసాల మాస్టారు, లీల, సుశీల, కోమల, కె రాణి, మాధవపెద్ది, ఎమ్.ఎస్.రామారావు, మొదలగువారు ఆలపించారు.  వీటన్నిటికీ మాస్టారు సందర్భోచిత మృదుమధుర సంగీతాన్ని సమకూర్చారు. 

సినీమా నిర్విఘ్నంగా ముగిసి విజయవంతం కావాలనే ఆకాంక్షతో ముందుగా విఘ్నేశ్వరుని స్తుతిస్తూ సినీమా టైటిల్స్ మీద 'శుక్లాంబరధరం విష్ణుం' శ్లోకాన్ని, వెనువెంటనే ముత్తుస్వామి దీక్షితులవారి "వాతాపి గణపతిం భజే" కీర్తనను రసోద్దీపనం కలిగిస్తూ  ఘంటసాలవారు ఆలపించి శ్రోతలను భక్తి తన్మయత్వం లో ఓలలాడించారు.

"శుక్లాంబర ధరం విష్ణుం" శ్లోకం మహావిష్ణువు కు సంబంధించినదిగా చెప్పుకోవడం వుంది. అయితే, ఈ శ్లోకంలోని విశేషణాలన్ని గమనిస్తే ఈ శ్లోకం వినాయకుడికే వర్తింపజేసేలా వుంది. 

ఈ శ్లోకం  తంబురా శ్రుతి, బేస్ డ్రమ్, ట్రయాంగిల్ బెల్ ధ్వనులతో ప్రారంభమవుతుంది. అవుతూనే బేస్ డ్రమ్, ట్రయాంగిల్ బెల్ మీద ఒక చిన్న బ్యాంగ్ ఇచ్చి "వాతాపి గణపతిం భజే" కీర్తనను ఎత్తుకుంటారు. సంప్రదాయ హంసధ్వని రాగంలో మృదంగం , ఘటం, మోర్సింగ్ , తాళాలు , వైలిన్స్ సహకారంతో ఘంటసాల మాస్టారు తదాత్మ్యం చెంది ఒక చిన్న కచేరీనే శ్రోతలకు ఏర్పాటు చేసారు. మూడే మూడు నిముషాలలో హంసధ్వని రాగ స్వరూపాన్నంతా చూపించడం అంత సులభమైన విషయం కాదు. అందుకు ఎంతో విద్వత్తు, ప్రతిభ కావాలి.

కర్నాటక సంగీతం అభ్యసించేవారికి ప్రారంభ దశలో సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు మొదలైనవాటిని విళంబకాలం, మధ్యమకాలం, దృతకాలం అనే మూడు కాలాలలో విద్యార్థులు చేత సాధనచేయిస్తారు. వీటినే ఒకటవకాలం, రెండవకాలం, మూడవకాలం అని కూడా అంటారు. విలంబకాలంలో పాట చాలా నెమ్మదిగా సాగుతుంది. దానిప్రకారం మధ్యమకాలం, దృతకాలంలో వేగం అధికమవుతుంది.  ఈ రకమైన అభ్యాసం వున్నవారు ఏరకమైన పాటనైనా సునాయాసంగా ఆలపించగలరు. సాధారణంగా ఈ కీర్తన మధ్యమకాలంలో ఆలపించడం సంప్రదాయం. కానీ మూడు నిముషాల టైటిల్స్ లోపలే ఈ కీర్తన ముగించవలసిన నిర్బంధం వలన ఘంటసాల మాస్టారు ఈ కీర్తనను దృతకాలం పాడినట్లు అనిపిస్తుంది.

దీక్షితులవారి కీర్తనకు,  సినీమా లోని కీర్తనకు మధ్య సాహిత్యంలో చిన్న పాఠ్య భేదాలు కనిపిస్తాయి.  అసలు కీర్తనలోని "త్రికోణ మధ్యగతం" కు బదులు " త్రిభువన మధ్యగతం" అనే మాటను వాడారు సముద్రాలవారు. దీక్షితులవారు గొప్ప సంగీతవేత్తే కాదు, మంత్రశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడు. మానవ దేహంలోని శక్తి కేంద్రాలైన మూలాధార నుంచి సహస్రార మధ్యంలో వుండే వినాయకుడిగా వర్ణించారు. ఆ మాటకు బదులు త్రిభువనాలు అంటే మూడులోకాల మధ్య పూజింపబడుతున్నవాడనే అర్ధంతో ఆచార్యులవారు మార్చివుండాలి.

"వాతాపి గణపతిం భజే" కీర్తనకు ముత్తుస్వామి దీక్షితులవారు నిర్దేశించిన రాగం హంసధ్వని. ఆ రాగంలోనే ఘంటసాలవారు కూడా శాస్త్రోక్తంగా  గానం చేసి సూక్ష్మంలో మోక్షం చూపించారు.

హంసధ్వని ఔఢవరాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణ రాగ జన్యం. ఆరోహణ, అవరోహణలలో సరిగపని, సనిపగరి అనే ఐదు స్వరాలతో కూడిన రాగం.  షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలినిషాధం స్వరాలు పలుకుతాయి.హంసధ్వని రాగాన్ని ముత్తుస్వామి దీక్షితులువారి తండ్రి రామస్వామి దీక్షితులు సృష్టించినట్లు చెపుతారు. కాలక్రమేణా హంసధ్వని రాగం హిందుస్థానీ సంగీతంలో కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. మనసుకు ఏకాగ్రతను, హాయిని కలిగించే ఈ రాగంతోనే గాయకులు తమ సంగీత కచేరీలను ప్రారంభిస్తారు.

వినాయకచవితి సినిమాలో ఏ నటుడి మీద కాకుండా వినాయకుడి విగ్రహం మీద పేర్లను వేస్తూ ఈ వాతాపి గణపతిం భజే కీర్తనను నేపథ్యంలో వినిపించడం ఒక విశేషం.

కర్నాటక సంగీతంలో విశేష కృషి చేసి విద్వాన్ పట్టం పొందిన ఘంటసాలవారు తన జీవితకాలంలో సినీమాలలో, సంగీత ముమూర్తుల రచనలలో, పాడిన ఏకైక  కీర్తన ఇది ఒక్కటే అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

ఘంటసాలవారి గాత్రాన జాలువారిన ఈ కీర్తన జన బాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అందరికీ తెలిసిందే.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...