Saturday, 29 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 36వ భాగం - కరుణా జూడవయా వరమూ జూపవయా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఐదవ భాగం ఇక్కడ  

36వ సజీవరాగం - కరుణా జూడవయా వరమూ జూపవయా
చిత్రం - దీపావళి
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల

కరుణా జూడవయా వరమూ జూపవయా మురళీ మోహన వినీల మేఘ శ్యామా..." (  2 భాగాలు)

పల్లవి:
కరుణా జూడవయా పరమూ జూపవయా
మురళీ మోహనా వినీల మేఘశ్యామా...

అలుకా మానవయా జాలీ పూనవయా
నరకాధీశ్వరా త్రిలోకజీవపాలా ... అలుకా ...

చరణం:
మృతికీ భీతిలని భుజబలసారము
అదికి కుండలముల దోచుకొనే బీరమూ
కలిగెను నీకీ జగతీ భళాభళీ ... అలుకా మానవయా ...

(స్వరకల్పన) ... అలుకా మానవయా ...

కరుణా జూడవయా పరమూ జూపవయా
మురళీ మోహనా వినీల మేఘశ్యామా...


చరణం:
మనసూ నీపయినా మరలిన చాలుగా
పులులే జింకలయీ లెంకలుగా మారుగా
నిరుపమ లీలా నిలయా దయామయా ... కరుణా ...

మదిలో నీ స్మరణ సలిపిన హాయిగా
బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా
త్రిభువన పావనా చరణా సనతానా

బృందం - రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ
కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ 
రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ
రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ ... నోర్ముయ్ ...

ఘంటసాల మాస్టారిలో వున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు, నటనాపటిమకు దర్పణం పట్టే ఈ పాట సదా నా మదిలో మెదులుతూనే వుంటుంది.

1960 లో విడుదలైన " దీపావళి" చిత్రంలోనిది ఈ పాట.  ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, కాంతారావు, గుమ్మడి, రమణారెడ్డి, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, వంటి అగ్రనటుల నటనా వైదుష్యం ఈ చిత్రంలో అణువణువునా కనిపిస్తుంది. రజనీకాంత్ సబ్నవీస్ దర్శకత్వంలో అశ్వరాజ్ ప్రొడక్షన్స్ కె.గోపాలరావు నిర్మించిన మంచి పౌరాణిక చిత్రం. మాయాబజార్, వినాయకచవితి సినీమాల తర్వాత ఎన్.టి.రామారావు మూడవసారి కృష్ణుడిగా తన నటకౌశలాన్ని సమగ్రంగా చూపించిన చిత్రం దీపావళి.

పౌరాణిక సినీమాలంటేనే పాటలకు, పద్యాలకు పెట్టింది పేరు. అందులోనూ ఘంటసాలవారి సంగీతమంటే తప్పక సుశ్రావ్యమైన సంగీతానికి కొదవేముంటుంది.  ఇందులో ఎ.పి.కోమల  " సరియా మాతో సమరాన నిలువగలడా" అని సత్యభామ సావిత్రికి పాడిన పాట ఎన్నటికీ వన్నె తరగని రత్నమే. దీపావళి చిత్రంలోని  సుమారు పదిహేను పాటలు, పది పద్యాలు సంగీతాభిమానుల వీనులకు విందునే చేసాయి.  ఈ సినీమాలో పద్యాలు, పాటలు అన్నింటినీ సముద్రాల పెద్దాయనే వ్రాసారు. 

ఈ పాట మొదటిభాగంలో  నరకాసురుని ఉద్దేశించి -
"నరకాధీశ్వరా త్రిలోకజీవపాలా" ;
"మృతికి భీతిలని భుజబలసారము";
అదితి కుండలముల దోచుకునే బీరము" అనే మాటలు, 

రెండవ భాగంలో కృష్ణుని పరంగా -
"పులులే జింకలయీ లెంకలుగా
మారురా( లెంకలు అంటే సేవకులు);
"నిరుపమలీలా నిలయా దయామయా";
"త్రిభువన పావనా చరణా సనాతనా" ;
వంటి పద ప్రయోగాలు సముద్రాలవారి రచనా చాతుర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి.

నేటి సజీవరాగమైన "కరుణా జూడవయా వరమూ జూపవయా" గీతం , సాహిత్యంలో స్వల్ప మార్పులతో  సినీమాలో రెండుసార్లు వస్తుంది.  ఈ రెండు సన్నివేశాలలో నారదుడిగా కాంతారావు హాస్యరసాన్ని అద్భుతంగా పండించారు. కాంతారావు, ఘంటసాల మాస్టారి మధ్య అపారమైన అవగాహన వుందని ఈ పాట చెప్పకనే చెపుతుంది. కాంతారావు గారి హావభావాలను, నటనా శైలిని ముందే ఊహించి అందుకు తగ్గట్లు ఈ పాటలో తానే నటించి చూపారు ఘంటసాల.

దీపావళి సినీమాలో చక్కని వినోదాన్ని , హాస్యాన్ని  పంచిపెట్టిన పాట ఇది. మొదటి భాగంలో  ఎస్.వి.రంగారావు, కాంతారావుగార్ల ఏక్షన్ - రియాక్షన్ లు, రెండవ భాగంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రమణారెడ్డిల పరస్పర హావభావాలను ముందుగానే ఊహించుకొని తనలో తాను నటిస్తూ ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చారనిపిస్తుంది. మాస్టారు, కాంతారావుల మధ్య perfect synchronization ఈ పాటలో సుస్పష్టంగా కనిపిస్తుంది.

ఈ  సంగీతభరిత హాస్యగీతాన్ని మలచడానికి ఘంటసాల మాస్టారు హిందోళరాగాన్ని తీసుకున్నారు. హిందోళం ఐదు స్వరాలు మాత్రమే కలిగిన జన్యరాగం. ఈ రాగం నటభైరవి, మరియు, హనుమతోడి రాగాల జన్యంగా భావించబడుతున్నది. ఈ రెండు రాగాలలోని రిషభ, పంచమ స్వరాలు తీసేసి పాడితే హిందోళమే అవుతుందని శాస్త్రకారుల ఉవాచ. కర్నాటక సంగీతంలోని హిందోళ రాగం హిందుస్థానీ శైలిలో మాల్కౌంస్ రాగానికి సమాంతరం. 

ఘంటసాల మాస్టారు  అన్యస్వరాలు చేర్చి హిందోళరాగానికి ఒక సరికొత్త మాధుర్యాన్ని తీసుకువచ్చారు. అలాటి పాటల కోవకే " కరుణా జూడవయా" పాట  చేరుతుంది. ఈ పాటలో ఘంటసాల మాస్టారు చేసిన స్వరసంచారం, స్వరకల్పనలు, పక్కపక్క గమకాలు స్వరకర్తగా, గాయకుడిగా ఘంటసాలవారి విద్వత్  ను, రసస్ఫూర్తిని,   ప్రతిభను చాటి చెపుతాయి.  గాత్రాన్ని అనుసరిస్తూ వీణ, ఫ్లూట్,  వయొలిన్స్, క్లారినెట్, తబలా వంటి వాద్యాలు ఈ పాటకు నిండుదనాన్ని చేకూర్చాయి. 

దీపావళి సినీమా డివిడి రూపంలో మార్చేటప్పుడు టైటిల్స్ లో సంగీత దర్శకుడిగా ఘంటసాలవారి పేరు మిస్సయింది. ఎలా  ఆ పొరపాటు జరిగిందో తెలియదు.  ఒరిజినల్ సినీమా  ప్రింట్ లో సహాయకులు కార్డ్ లో సంగీతం - సంగీతరావు అని వుంటుంది. దానిని చూసి ఓ ప్రముఖ టివి ఛానల్ వారు దీపావళి సినీమాలోని పాటలను ప్రసారం చేసేటప్పుడు సంగీతం సంగీతరావు అని క్రెడిట్స్ లో చూపించేవారు. ఈ పొరపాటు చాలా కాలం కొనసాగింది. 

దీపావళి సినీమా అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   


Saturday, 22 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 35వ భాగం - శ్యామలా దండకం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై నాలుగవ భాగం ఇక్కడ  

35వ సజీవరాగం - శ్యామలా దండకం
చిత్రం - మహాకవి కాళిదాసు
గానం - ఘంటసాల 
సంగీతం - పి.సూరిబాబు/పెండ్యాల

శ్లోకం : 
మాణిక్యవీణా ముఫలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి

శ్లోకం :
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే జగదేకమాతః..... 2

శ్లోకం:
మాతా మరకతశ్యామా మాతంగీ
మధుశాలినీ కుర్యాత్కటాక్షం కళ్యాణీ
కదంబ వనవాసినీ 

జయ మాతంగ తనయే 
జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే
జయ లీలాశుక ప్రియే....

దండకం :
జై జననీ ! 
సుధా సముద్రాంత
రుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ
మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీత సంభావనా
సంభ్రమాలోల నీపస్రగాబధ్ధ
చూళీసనాధత్రికే సానుమత్పుత్రికే
శేఖరీభూత శీతాంసు రేఖా మయూఖావళీ నధ్ధ సుస్నిగ్ధ నీలాలక
శ్రేణి శృంగారితే లోక సంభావితే
కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా
పుష్ప సందేహ కృఛ్ఛారు గోరోచనా
పంక కేళీ లలాభిరామే సురామే రమే
సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే 
సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మకే
సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే
సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
జగన్మాతృకే....
పాహిమాం... పాహిమాం.. పాహిమాం!
       

సుప్రసిద్ధ  పౌరాణిక రంగస్థల, సినీ నటుడు, శ్రీ పువ్వుల సూరిబాబు,  నటి శ్రీమతి శ్రీరంజనిగారి భర్త అయిన కె.నాగుమణిగారితో కలసి నిర్మించిన చిత్రం "మహాకవి కాళిదాసు". అంతే కాదు, ఈ చిత్రంలోని శ్లోకాలు, పద్యాలకు సంగీతం సమకూర్చింది పి.సూరిబాబేగారే. పాటలకు వరసలు కూర్చి, రీరికార్డింగ్ ను సమకూర్చినవారు పెండ్యాలగారు. ఈ యిద్దరు ప్రముఖ కళాకారుల మేలు కలయికలో మహాకవి కాళిదాసు చిత్ర సంగీతం అపూర్వము, అపురూపము అయింది.  ఆ చిత్రం ద్వారా తెలుగునాట అజరామరంగా నిలిచిపోయిన శ్యామలా దండకమే నేటి 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం.

ఈ శ్యామలా దండకం కాళిదాస కవి విరచితం. 'కుమారసంభవం', 'రఘువంశం' అనే కావ్యాలను, 'అభిజ్ఞాన శాకుంతలం', 'మాళవికాగ్నిమిత్రం', 'విక్రమోర్వశీయం', అనే నాటకాలను  'మేఘదూతం' అనే ఖండకావ్యాన్ని కూడా సంస్కృతంలో వ్రాసినట్లు ప్రచారంలో వుంది.  అయితే కాళిదాస కవి జీవితకాలానికి, ప్రాంతానికి సంబంధించిన విషయాలు వేటికీ ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. కాళిదాసు జీవితాకాలం వివాదాస్పదంగానే వుంది. కాళిదాసు  విక్రమాదిత్యునికి సమకాలికుడని చెప్పుకోవడం వుంది. అయితే విక్రమాదిత్యులు పేరుతో ఎంతోమంది రాజులున్నారని కూడా చెప్పబడుతున్నది. రెండవ చంద్రగుప్తుని కాలంనాటి వాడని మరో వాదన. ఇది ఇలావుండగా 13- 14 శతాబ్దాలకు చెందిన భోజరాజు ఆస్థానకవి కాళిదాసుగా మరొక ప్రచారం వుంది. పై కావ్యాలలన్నీ ఒకే కాళిదాసు కవి వ్రాసినవి కావని ఆ పేరుతోనే మరో ముగ్గురు నలుగురు సంస్కృత కవులు వుండేవారని కూడా తెలుస్తున్నది. కాళిదాసు వ్రాసిన కావ్యాలలోని వర్ణనలు ఆధారంగా ఆయన హిమాలయాల ప్రాంతంవాడని, ఉజ్జయిని ప్రాంతానికి చెందినవాడని పలు అభిప్రాయాలు ప్రచారంలో వున్నాయి.

అటువంటి కాళిదాస కవిని మహాకవి కాళిదాసుగా తెలుగువారి కవిగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం  ఈ కథా రచయిత పింగళి నాగేంద్రరావుగారికి, డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావుగారికి , కాళిదాసుగా అద్వితీయంగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారికి మాత్రమే దక్కుతుంది.

1974ల వరకూ ఏదైనా తెలుగు సినీమా సంగీతపరంగా  విజయవంతమైనదంటే అందులో ఘంటసాలవారి పాత్ర కూడా ఎంతో కొంత తప్పక వుండేదనే చెప్పాలి. 1960లో వచ్చిన యీ మహాకవి కాళిదాసు తెలుగువారందరికీ మరింత ఆత్మీయుడు కావడానికి కారణం ఈ చిత్రంలోని ఘంటసాలవారి గానమే అంటే సత్యదూరం కాదు. ఆదిలో వెర్రి వెంగళాయిలా వుండే కాలుడు పాడిన లోల్లాయి పదాలైనా, కాళికామాత అనుగ్రహంతో సకలశాస్త్రా పారంగతుడైన కళిదాసు ఆలపించిన సమాసభూయిష్టమైన దండకాలు, శ్లోకాలైనా అవి ఘంటసాలవారి గళంలో జీవాన్ని, చిరంజీవత్వాన్ని సంతరించుకున్నాయి. ఈ  సినీమాలో ఘంటసాలవారి  గాత్రం, సంగీత విద్వత్ వారిని శిఖరాగ్రాలకు చేర్చింది. మాస్టారు గానం చేసిన శ్యామలా దండకం నిత్యనూతనం. అజరామరం. ఈ దండకం గానం చేయడంలో మాస్టారికి భాషపట్ల గల శ్రధ్ధాభక్తులు, ఆవేశం, భావోద్వేగం, గాన ప్రతిభ అనన్యసామాన్యం. 

మాస్టర్ గారిని అనుకరిస్తూ వేదికలమీద అనేకమంది గాయకులు యీ శ్యామలా దండకాన్ని  గానం చేయడానికి ఆసక్తిచూపుతూంటారు. ఇది గాయకులందరికీ పెను సవాలు. ఈ శ్యామలా దండకం పాడినప్పుడు ఘంటసాలవారి కంఠంలోని తీవ్రత, భావోద్వేగం, శృతిశుధ్ధి, గమకశుధ్ధి, రాగాలపట్ల గల సంపూర్ణ అవగాహన అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. భగవద్దత్తమైన గాత్రం, విద్వత్తు వారి సొత్తు.

ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు పి.సూరిబాబు, సుప్రసిధ్ధ సంగీత దర్శకుడు పెండ్యాల సమ్మేళనంలో రూపొందిన ఈ శ్యామలా దండకంలోని మొదటి శ్లోకాలను 
వరసగా కళ్యాణి, కేదారగౌళ, కళ్యాణి, శంకరాభరణం రాగాలలోను చివరి దండకాన్ని కళ్యాణి, కానడ, పంతువరాళి, మధ్యమావతి రాగాలలో అత్యద్భుతంగా స్వరపరచేరు . ఈ రాగాలన్నీ కర్నాటక సంగీతంలోని సుప్రసిధ్ధ రాగాలే. 

రికార్డింగ్ సమయంలో శ్లోకాలను, దండకాన్ని విడివిడిగా రికార్డు చేద్దామని సంగీత దర్శకుడు పెండ్యాలగారు సూచించినా, వద్దని పట్టుబట్టి మొత్తం నాలుగు నిముషాల శ్లోకాలు, దండకం ఒకే స్ఫూర్తితో పాడేస్తానని ఘంటసాల మాస్టారు మైక్ ముందుకు వెళ్ళారట. ఆ సమయంలో  ఘంటసాలగారిలో ఏ దైవం ఆవహించిందో,  మాస్టారిలోని ఆవేశాన్ని, ఉద్వేగాన్ని చూసి తాను నిశ్చేష్టుడినై అలా వుండిపోయానని, అదొక అద్భుత సన్నివేశమని, ఆనందంతో పులకించిపోయి, మైమరపుతో ఘంటసాలవారిని కౌగిలించుకొన్నానని పెండ్యాలగారు తన ఇంటర్వ్యూలలో  చెప్పేవారు.

ఈ చిత్రం ముందు కన్నడంలో, ఆ తర్వాత తమిళంలో వేరే నటులు, గాయకులతో నిర్మించబడినా తెలుగువారి కాళిదాసుకు సాటిరాలేదనే నా భావన.

1959 లో ఈ శ్యామలా దండకం రికార్డింగ్ అయిన రోజులలోనే ఘంటసాలవారి పెద్ద కుమార్తె జన్మించడం, తర్వాత  అమ్మవారి పేరు మీద శ్యామల అని నామకరణం చేయడం జరిగింది.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

Saturday, 15 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 34వ భాగం - వాతాపి గణపతిం భజే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై మూడవ భాగం ఇక్కడ  

34వ సజీవరాగం - వాతాపి గణపతిం భజే
చిత్రం - వినాయకచవితి
గానం - ఘంటసాల 
సంగీతం - ఘంటసాల  

వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం శ్రీ  ! వాతాపి!

భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం ! వాతాపి

పురా కుంభసంభవ  మునివర 
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రస్థితం పరారి చత్వారి
వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజవామకర విధృతేక్షు దండం

కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం 
హరాది గురుగుహతోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంభం
! వాతాపి !

దైవంపట్ల విశ్వాసం, భక్తి కలిగివున్నవారంతా ఏదైనా కొత్త కార్యం తలపెట్టినప్పుడు మున్ముందుగా  విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి తమ పనులు మొదలెడతారు. కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు రచించి, హంసధ్వని రాగంలో స్వరపర్చిన "వాతాపి గణపతిం భజే" కీర్తన నేటి మన ఘంటసాల సజీవరాగం.

ముత్తుస్వామి దీక్షితుల జన్మస్థలమైన తిరువారూర్ జిల్లా తిరుచెంగట్టన్కుడిలో వున్న ఉత్తరపతీశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్టింపబడిన వాతాపి గణపతిని స్తుతిస్తూ గానం చేసిన కీర్తన. ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూర్ చుట్టుప్రక్కలగల పదహారు వినాయక మూర్తులను స్తుతిస్తూ షోడశ గణపతి కీర్తనలను వ్రాసారు. వాటిలో ప్రముఖమైనది ఈ "వాతాపి గణపతిం భజే" కీర్తన .

ఈ వాతాపి గణపతి వాతాపి ( బాదామి) నుండి  తిరుచెంగట్టన్కుడికి రావడం వెనుక ఒక చారిత్రక కథ వున్నది. పల్లవ నరసింహవర్మ సైన్యాధిపతి పరంజ్యోతి యుధ్ధంలో వాతాపి చాళుక్య రాజులపై (అనాటి వాతాపి ఈనాడు కర్ణాటక రాష్ట్రంలోని బాదామి ప్రాంతం) విజయం సాధించి విజయ చిహ్నంగా వాతాపిలోని ఈ గణపతి శిలను తన వూరికి తీసుకువచ్చాడు. తర్వాత పరంజ్యోతి తన ఘాతుక చర్యలకు పశ్చాత్తాపం చెంది వైరాగ్యంతో శైవమతాన్ని స్వీకరించి 63 నాయన్మర్ లలో ప్రముఖుడైన సిరుతొండై నాయన్మార్ గా లోకప్రసిధ్ధుడైనాడు. ఆ పరంజ్యోతి తీసుకువచ్చి ప్రతిష్టించిన వాతాపి గణపతిని ఉద్దేశించి ముత్తుస్వామి దీక్షితులవారు "వాతాపి గణపతిం భజే" కీర్తనను వ్రాసారు. దీక్షితులవారి కీర్తనలనేకం సంస్కృత భాషలోనే వున్నాయి.

త్రిమూర్తులు, కుమారస్వామి, చంద్రుడువంటి దేవతలచేత, అగస్థ్యాది మునివరులచేత పూజించబడుతూ త్రికోణ మధ్యం (శ్రీచక్రం)లో అధిష్టించబడివున్న గణపతిని, వ్యాసునికి చతుర్వేదాలు వ్రాసిపెట్టిన గణేశుని దీక్షితులవారు హంసధ్వని రాగంలో స్తుతించారు.

ఇక ఈ నాటి మన సజీవరాగం విషయానికొస్తే....

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు, ఆయన భార్య, ప్రముఖ నటి సురభి బాలసరస్వతి నిర్మాతలుగా మారి తమ తొలి ప్రయత్నంగా  అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద "వినాయకచవితి" చిత్రాన్ని తీయ సంకల్పించి కథ, మాటలు, పాటలు వ్రాసే బాధ్యతతోపాటు చిత్ర దర్శకత్వాన్ని కూడా సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. దర్శకుడిగా సీనియర్ సముద్రాలవారికిది మొదటి చిత్రం. సంగీత దర్శకుడు ఘంటసాలవారు. ఎన్.టి.రామారావు  మాయాబజార్ తరువాత నాలుగైదు మాసాల వ్యవధిలో మరల కృష్ణునిగా తెలుగు ప్రజలను అలరించిన చిత్రం 'వినాయకచవితి'.  సినీమా అంతా సంగీతమయం. అనాదిగా వున్న శ్లోకాలు, ఆచార్యులవారు వ్రాసిన పద్యాలు, పాటలు అన్నీ కలిపి ఓ పాతిక ఉన్నాయి. వీటిని ఘంటసాల మాస్టారు, లీల, సుశీల, కోమల, కె రాణి, మాధవపెద్ది, ఎమ్.ఎస్.రామారావు, మొదలగువారు ఆలపించారు.  వీటన్నిటికీ మాస్టారు సందర్భోచిత మృదుమధుర సంగీతాన్ని సమకూర్చారు. 

సినీమా నిర్విఘ్నంగా ముగిసి విజయవంతం కావాలనే ఆకాంక్షతో ముందుగా విఘ్నేశ్వరుని స్తుతిస్తూ సినీమా టైటిల్స్ మీద 'శుక్లాంబరధరం విష్ణుం' శ్లోకాన్ని, వెనువెంటనే ముత్తుస్వామి దీక్షితులవారి "వాతాపి గణపతిం భజే" కీర్తనను రసోద్దీపనం కలిగిస్తూ  ఘంటసాలవారు ఆలపించి శ్రోతలను భక్తి తన్మయత్వం లో ఓలలాడించారు.

"శుక్లాంబర ధరం విష్ణుం" శ్లోకం మహావిష్ణువు కు సంబంధించినదిగా చెప్పుకోవడం వుంది. అయితే, ఈ శ్లోకంలోని విశేషణాలన్ని గమనిస్తే ఈ శ్లోకం వినాయకుడికే వర్తింపజేసేలా వుంది. 

ఈ శ్లోకం  తంబురా శ్రుతి, బేస్ డ్రమ్, ట్రయాంగిల్ బెల్ ధ్వనులతో ప్రారంభమవుతుంది. అవుతూనే బేస్ డ్రమ్, ట్రయాంగిల్ బెల్ మీద ఒక చిన్న బ్యాంగ్ ఇచ్చి "వాతాపి గణపతిం భజే" కీర్తనను ఎత్తుకుంటారు. సంప్రదాయ హంసధ్వని రాగంలో మృదంగం , ఘటం, మోర్సింగ్ , తాళాలు , వైలిన్స్ సహకారంతో ఘంటసాల మాస్టారు తదాత్మ్యం చెంది ఒక చిన్న కచేరీనే శ్రోతలకు ఏర్పాటు చేసారు. మూడే మూడు నిముషాలలో హంసధ్వని రాగ స్వరూపాన్నంతా చూపించడం అంత సులభమైన విషయం కాదు. అందుకు ఎంతో విద్వత్తు, ప్రతిభ కావాలి.

కర్నాటక సంగీతం అభ్యసించేవారికి ప్రారంభ దశలో సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు మొదలైనవాటిని విళంబకాలం, మధ్యమకాలం, దృతకాలం అనే మూడు కాలాలలో విద్యార్థులు చేత సాధనచేయిస్తారు. వీటినే ఒకటవకాలం, రెండవకాలం, మూడవకాలం అని కూడా అంటారు. విలంబకాలంలో పాట చాలా నెమ్మదిగా సాగుతుంది. దానిప్రకారం మధ్యమకాలం, దృతకాలంలో వేగం అధికమవుతుంది.  ఈ రకమైన అభ్యాసం వున్నవారు ఏరకమైన పాటనైనా సునాయాసంగా ఆలపించగలరు. సాధారణంగా ఈ కీర్తన మధ్యమకాలంలో ఆలపించడం సంప్రదాయం. కానీ మూడు నిముషాల టైటిల్స్ లోపలే ఈ కీర్తన ముగించవలసిన నిర్బంధం వలన ఘంటసాల మాస్టారు ఈ కీర్తనను దృతకాలం పాడినట్లు అనిపిస్తుంది.

దీక్షితులవారి కీర్తనకు,  సినీమా లోని కీర్తనకు మధ్య సాహిత్యంలో చిన్న పాఠ్య భేదాలు కనిపిస్తాయి.  అసలు కీర్తనలోని "త్రికోణ మధ్యగతం" కు బదులు " త్రిభువన మధ్యగతం" అనే మాటను వాడారు సముద్రాలవారు. దీక్షితులవారు గొప్ప సంగీతవేత్తే కాదు, మంత్రశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడు. మానవ దేహంలోని శక్తి కేంద్రాలైన మూలాధార నుంచి సహస్రార మధ్యంలో వుండే వినాయకుడిగా వర్ణించారు. ఆ మాటకు బదులు త్రిభువనాలు అంటే మూడులోకాల మధ్య పూజింపబడుతున్నవాడనే అర్ధంతో ఆచార్యులవారు మార్చివుండాలి.

"వాతాపి గణపతిం భజే" కీర్తనకు ముత్తుస్వామి దీక్షితులవారు నిర్దేశించిన రాగం హంసధ్వని. ఆ రాగంలోనే ఘంటసాలవారు కూడా శాస్త్రోక్తంగా  గానం చేసి సూక్ష్మంలో మోక్షం చూపించారు.

హంసధ్వని ఔఢవరాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణ రాగ జన్యం. ఆరోహణ, అవరోహణలలో సరిగపని, సనిపగరి అనే ఐదు స్వరాలతో కూడిన రాగం.  షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలినిషాధం స్వరాలు పలుకుతాయి.హంసధ్వని రాగాన్ని ముత్తుస్వామి దీక్షితులువారి తండ్రి రామస్వామి దీక్షితులు సృష్టించినట్లు చెపుతారు. కాలక్రమేణా హంసధ్వని రాగం హిందుస్థానీ సంగీతంలో కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. మనసుకు ఏకాగ్రతను, హాయిని కలిగించే ఈ రాగంతోనే గాయకులు తమ సంగీత కచేరీలను ప్రారంభిస్తారు.

వినాయకచవితి సినిమాలో ఏ నటుడి మీద కాకుండా వినాయకుడి విగ్రహం మీద పేర్లను వేస్తూ ఈ వాతాపి గణపతిం భజే కీర్తనను నేపథ్యంలో వినిపించడం ఒక విశేషం.

కర్నాటక సంగీతంలో విశేష కృషి చేసి విద్వాన్ పట్టం పొందిన ఘంటసాలవారు తన జీవితకాలంలో సినీమాలలో, సంగీత ముమూర్తుల రచనలలో, పాడిన ఏకైక  కీర్తన ఇది ఒక్కటే అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

ఘంటసాలవారి గాత్రాన జాలువారిన ఈ కీర్తన జన బాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అందరికీ తెలిసిందే.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్ 

Saturday, 8 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 33వ భాగం - దినకరా శుభకరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై రెండవ భాగం ఇక్కడ  

33వ సజీవరాగం - దినకరా శుభకరా
చిత్రం - వినాయకచవితి
గానం - ఘంటసాల 
సంగీతం - ఘంటసాల

పల్లవి : 
దినకరా.. దినకరా.. హే.. శుభకరా..
దినకరా శుభకరా - 2
 దేవా దీనాధారా తిమిర సంహార ! దినకరా!

అనుపల్లవి :
సకలభువన సుఖకారణ కిరణా
మౌనిరాజ పరిపూజిత చరణా -2
నీరజాతముఖ శోభనకారణ -2
దినకరా శుభకరా -2

చరణం :
పతిత పావన మంగళదాతా
పాప సంతాప లోకహితా -2
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా - రాగాలాపన
బ్రహ్మ విష్ణు....
వివిధ వేద విజ్ఞాని నిధానా .. బ్రహ్మ..
వినతలోక పరిపాలక భాస్కర - దినకరా
దినకరా. హే.. దినకరా ప్రభో
దినకరా... శుభకరా 

గతం తరం తెలుగు పౌరాణిక చిత్రాలలో సూర్య భగవానుడు మీద శ్లోకాలు , పద్యాలు అనేకం వినవచ్చాయి , కానీ సూర్యుడిని వర్ణిస్తూ చేసిన పాటలు బహు అరుదు. అలాటివాటిలో తలమానికంగా నిలిచే పాట "దినకరా శుభకరా దేవా దీనాధారా తిమిరసంహార" అనే పాట. ఈ పాటే ఈనాటి ఘంటసాల సజీవరాగం.

"దినకరా శుభకరా" పాట 1957 లో వచ్చిన " వినాయకచవితి" సినీమా లోనిది. పేరుకు వినాయకచవితే అయినా అధికశాతం కథంతా చవితి చంద్రుడిని చూసినందువలన శ్రీకృష్ణునికి కలిగిన నీలాపనిందలు, శమంతకమణి ఉపాఖ్యానం,  జాంబవతి, సత్యభామా పరిణయాల మీదనే నడుస్తుంది.

రోజుకు ఎనిమిది బారువల (బారువ అనే తూనిక ఈనాటి కిలోలు, టన్నులు, క్వింటాళ్ళు, రాకపూర్వం. అప్పుడు తూనిక ప్రమాణాలు తులాలు, ఫలాలు, వీశెలు, మణుగులు లెక్కలో వుండేవి. ఒక బారువ అంటే సుమారుగా 224 కిలోలు.  ఒక రోజుకు 8 బారువలంటే 1792 కిలోలు. సంవత్సరానికి 6 లక్షల 55 వేల కిలోల బంగారం. నేను లెక్కల్లో చాలా చాలా వీక్. నా యీ లెక్కలో తప్పులుంటే మన్నించండి).

బంగారం మీది వ్యామోహంతో సత్యభామా మణి తండ్రి సత్రాజిత్తు సూర్యోపాసన చేసి సూర్యభగవానుడిని మెప్పించి రోజుకు 8 బారువల బంగారాన్ని ప్రసాదించే శమంతకమణిని పొందుతాడు. అంత ధనం ఒక వ్యక్తి దగ్గర వుందంటే అది పరులకంట పడకుండా కాపాడుకోవడంకోసం  ఎంత కథైనా జరుగుతుంది కదా. అలాటి కథే "వినాయకచవితి" సినీమా కథ.

సూర్యోపాసకుడైన సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధిస్తూ సముద్రపుటొడ్డున పాడిన పాటే "దినకరా శుభకరా" పాట. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారికి అనర్ఘమణిగా భాసిల్లిన గీతం "దినకరా శుభకరా". ఈ పాటను సినిమాలో సత్రాజిత్తు పాత్రధారి గుమ్మడి మీద చిత్రీకరించారు. ఈ పాటను వ్రాసినవారు శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారు. లోకపాలకుడైన సూర్యదేవుని గుణగణాలను వర్ణిస్తూ ఈపాటకు ఆచార్యులవారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు.   ఆయనే వినాయకచవితి సినీమా కు దర్శకత్వం వహించి, మాటలు, పాటలు, పద్యాలు వ్రాసారు.

చాలామంది సంగీతాభిమానులకు తెలియని ఒక విశేషం ఈ పాటలో వుంది. ఆచార్యులవారు ఈ పాటను వ్రాసినప్పుడు పల్లవి తర్వాత ఒక అనుపల్లవి , తర్వాత చరణాలు  వ్రాయడం జరిగింది. (చూడుడు పాట సాహిత్యం). ఘంటసాల మాస్టారు కూడా అత్యంత శ్రవణపేయంగా ఈ గీతాన్ని పంతువరాళి లేదా కామవర్ధని అనే రాగంలో స్వరపర్చారు. అయితే ఏ కారణం చేతనో ఈ పాటలోని అనుపల్లవి  సినీమా లోనూ లేదు, గ్రామఫోన్ రికార్డులోనూ లేదు. పాటలో పల్లవి, చరణాలు మాత్రమే వినిపిస్తాయి. ఘంటసాలవారి  సంగీత కచేరీలను ప్రత్యక్షంగా చూసిన నాలాటి శ్రోతలకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది.

ఘంటసాలవారి ప్రతీ సంగీత కచేరీ ఈ "దినకరా శుభకరా" పాటతోనే ప్రారంభమయేది. ఆయన రికార్డులో లేని ఈ అనుపల్లవితో సహా ఈ పాటను కడు రమ్యంగా ఆలపించేవారు. కచేరీ సందర్భం , స్థలాలనుబట్టి ఈ పాటను శాస్త్రీయ సంగీత కచేరీ కీర్తనలా  రాగాలపన చేసి, సంగతులు, నెరవులు వేసి ఘంటసాలగారు  సుమారు ఎడెనిమిది నిముషాలపాటు పాడేవారు. ఇప్పుడు మీరంతా కూడా విని ఆనందించడానికి వీలుగా వాషింగ్టన్ కచేరీలో ఘంటసాల మాస్టారు పాడిన పాటను, వినాయకచవితి  సినీమాలోని పాటను మీకు సమర్పిస్తున్నాను.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి ఎంచుకున్న రాగం - పంతువరాళి. దీనికే  కామవర్ధని అని మరో పేరు వుంది.  హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో పంతువరాళి రాగాన్ని 'పూర్యాధనశ్రీ'  అంటారు. కర్నాటక సంగీతంలో అత్యంత ప్రాచీనమైన రాగం పంతువరాళి. అయినా మేళకర్తరాగ వర్గీకరణ జరిగేప్పుడు ఈ రాగాన్ని 51 వ మేళకర్త రాగంగా నిర్ణయించారు.  పంతువరాళి/కామవర్ధని రాగం ఆరోహణ , అవరోహణలలో - షడ్జమం, శుధ్ధరిషభం, అంతర గాంధారం, ప్రతిమధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలినిషాధం అనే ఏడు స్వరాలు వినవస్తాయి. త్యాగయ్యగారి 'శివ శివ యనరాదా',' అప్ప రామభక్తి' అనే సుప్రసిధ్ధ కీర్తనలు పంతువరాళి రాగంలో చేసినవే. అలాగే, కంచెర్ల గోపన్న (రామదాసు ) కీర్తన  'ఎన్నగాను రామ భజన' కూడా పంతువరాళి రాగంలోనే చేశారు.

శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా తమ కచేరీలలో కామవర్ధని రాగ కృతులను విధిగా గానం చేస్తారు. శ్రోతల మనసులను రంజిఃపజేసే సుప్రసిద్ధ రాగం పంతువరాళి. ఈ రాగంలో స్వరపర్చబడిన "దినకరా శుభకరా" పాటను ఘంటసాలవారు ఎంత మనోజ్ఞంగా పాడారో, ఆ పాట ఎంతటి జనాదరణను పొందిందో అందరికీ తెలిసిందే. ఘంటసాల మాస్టారు మంచి  రసస్ఫూర్తితో  ఆత్మానందం పొందుతూ పాడిన ఈ పాట అరవైఆరేళ్ళ తర్వాత కూడా సంగీతాభిమానుల హృదయాలను రంజింపజేస్తూ, మేనులను పులకరింపజేస్తూనేవుంది. లలిత సంగీత గాయకులంతా తమ కచేరీలలో  తప్పక పాడే పాట "దినకరా శుభకరా". ఘంటసాలవారి ఉత్తమశ్రేణి గీతాలలో ప్రధమ వరసలో నిలిచే గీతం " దినకరా శుభకరా".

ఘంటసాల మాస్టారి అపూర్వ సృష్టి అయిన 108 శ్లోకాల భగవద్గీత లోని ప్రప్రథమ శ్లోకమైన "పార్ధాయ ప్రతిబోధితాం నారాయణీ..." కూడా కామవర్ధని/పంతువరాళి రాగంలోనే సముచిత రీతిని స్వరపర్చడం వారి రాగ పరిజ్ఞానానికి, గానప్రతిభకు ఒక నిదర్శనం. ఈ రాగంలో ఇంత నిర్దిష్టంగా రూపొందిన సినిమా పాట మరొకటి లేదంటే అది అతిశయోక్తి కాదు.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్ 

Saturday, 1 June 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 32వ భాగం - మోహనరూపా గోపాలా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై ఒకటవ భాగం ఇక్కడ  

32వ సజీవరాగం - మోహనరూపా గోపాలా
చిత్రం - కృష్ణప్రేమ
గానం - ఘంటసాల 
సంగీతం - పెండ్యాల

పల్లవి :
మోహనరూపా గోపాలా - 2
ఊహాతీతము నీ లీలా - 2

చరణం :
వలదని నిన్ను వారించువారిని
వదలక వెంట తిరిగెదవయ్యా ! వలదని!
వేణువునూదుచు వేడుక చేయగ
వేడినవారికి దరిశనమీయవు - మోహనరూపా గోపాలా 

రెండవ చరణం :
అవనిభారము అమితముకాగా
అవతరించితివి ఎన్నిసారులో... 
కృష్ణా.... రాగాలాపన
అవని భారము...
అన్నిటికన్నా అపురూపమైనది
కన్నులవిందగు ఈనాటి రూపము ..
మోహనరూపా గోపాలా..
రాగాలాపన.. 

శ్రీకృష్ణుడు లీలామానుష రూపధారి. మూర్తీభవించిన అలౌకికానందం. సచ్చిదానంద స్వరూపం. రాధ పట్ల,గోపికల పట్ల కృష్ణుడు కనపర్చిన ప్రేమానురాగాలు బాహ్యమైన మోహానికి అతీతమైనవి. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలకు అతీతమైనవారికే కృష్ణుని ప్రేమ అర్ధమవుతుంది.

తనంటే నమ్మకంలేనివారికి, తనను ద్వేషించేవారికి తరచూ కనిపిస్తూ వారిని కల్లోలపరుస్తాడు. తననే నమ్మి తన దివ్య దర్శనం కోసం తపించి , ఆరాటపడేవారి కంటపడకుండా దూరంగా వుంచుతూ మురిపిస్తూంటాడు  ఆ కృష్ణుడు.  కృష్ణ శబ్దంలోనే నల్లనివాడు అనే అర్ధముంది. ఆ నీలమేఘశ్యాముని సౌందర్యం స్త్రీ పురుషులనే కాదు సకలజీవులను సమ్మోహనపరుస్తుంది. సామాన్య మానవులకు అర్ధం కానిది కృష్ణతత్త్వం. మహావిష్ణువు అవతారాలలోని ఎనిమిదవ పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఆ భగవత్స్వరూపుని అర్ధంచేసుకోవాలని నారదాది మహర్షులు, మునిపుంగవులు, మహాభక్తులెందరో నిరంతరం స్మరించి, జపించి, తపించి, తరించారు.

నిత్య హరినామ స్మరణతో నారదుడు లోకకళ్యాణ కార్యక్రమాలెన్నింటినో ఆ దేవదేవుని అండదండలతో నిర్వహించాడు. "మోహనరూపా గోపాలా , ఊహాతీతము నీ లీల" అంటూ  అనిర్వచనీయమైన కృష్ణుని ప్రేమతత్త్వాన్ని సామాన్య పామరాజనాలకు బోధపరుస్తాడు నారదుడు "కృష్ణప్రేమ" చిత్రంలో. 

సంగీతాభిమానులందరినీ సమ్మోహనపర్చే ఈ భక్తిగీతాన్ని ఆరుద్ర ఎంతో భావయుక్తంగా వ్రాసారు. "వలదని నిన్ను వారించువారిని", "వేడుకచేయగ వేడినవారికి దరిశనమీయవు" అనే పదాలను తరచిచూస్తే ఎంతటి గొప్ప అర్ధమైనా స్ఫురిస్తుంది. ఎవరెంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆ కృష్ణుడు వివిధ కోణాలలో గోచరిస్తాడు.

ఈ పాటలో వున్నవి రెండే  చిన్న చిన్న చరణాలు. ఉన్న మూడు నిముషాల పాటా సినీమా లో ఒకేసారి రాదు. నారదుడు లోకసంచారికదా, అక్కడో పల్లవి, ఇక్కడో చరణం అని సందర్భానుసారం రెండు మూడు కట్ల్ గా "కృష్ణప్రేమ" సినీమా లో ఆలపిస్తాడు.

ఈ చిత్రానికి  దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. సాంఘిక చిత్రాల నిష్ణాతుడైన ఆదుర్తి బహు అరుదుగా పౌరాణిక చిత్రాలకు డైరక్ట్ చేసారు. బహుశా "కృష్ణప్రేమ" ఒక్కటేనేమో వారి పౌరాణికం. కృష్ణుడుగా బాలయ్యను ఎన్నుకోవడం ఆదుర్తిలాటివారికే సాధ్యం. సత్యభామ గా గిరిజ , రాధగా ఎస్.వరలక్ష్మి,  కృష్ణ ద్వేషిణి అయిన ఆమె చెల్లెలు చంద్రగా జమున నటించారు.  నారదుడు పద్మనాభం. 

కృష్ణుడి పాటలు, పద్యాలు పి.బి.శ్రీనివాస్ గారు పాడగా, నారదుడి రెండు పాటలు, కొన్ని పద్యాలు ఘంటసాల పాడారు.

ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెండ్యాల. పెండ్యాలగారు ఆషామాషీ సంగీతదర్శకుడు కాదు. రాగప్రధానమైన పాటలను స్వరపర్చడంలో అసమాన్యుడు. ఆయనకు నల్లేరుమీద బండి నడకే. అందులోనూ ఈ పాటను పాడేది ఘంటసాలగారేనని తెలిసాక ఊరకే ఉంటారా, ఆ పాట అంతుచూడక వదులుతారా చెప్పండి. "మోహనరూపా గోపాలా" పాటను అద్భుతంగా స్వరపర్చి ఆ పాట ఘంటసాల కోసమే పుట్టిందన్నట్లు మెట్టుకట్టారు. 

ఈ పాటకు పెండ్యాల గారు ఎంచుకున్న రాగం హిందోళం. హిందోళం నఠభైరవి రాగం యొక్క జన్యరాగం. షడ్జమం(స), సాధారణ గాంధారం(గ), శుధ్ధ మధ్యమం(మ), శుధ్ధ ధైవతం (ద), కైశికి నిషాదం(ని) ... సగమదని అనే ఐదు స్వరాలే ఆరోహణా, అవరోహణా క్రమంలో వినిపిస్తాయి. ఇదొక ఔడవరాగం. కర్ణాటక శైలిలోని హిందోళ రాగానికి సమానమైన హిందుస్థానీ సంగీత రాగాన్ని మాల్కౌంస్ అంటారు. ఈ రెండు రాగాలలో అనేక వందల సినీమా పాటలు అన్ని భాషలలో వెలువడ్డాయి. హిందోళ రాగంలోని త్యాగరాజకీర్తన 'సామజవరగమన' లోకప్రసిద్ధం. చైనా వంటి ప్రాచ్యదేశలలో కూడా ఐదు స్వరాలుతో కూడిన హిందోళం , మోహన రాగ ఛాయలుగల సంగీతం వినవస్తూంటుంది.

హిందోళరాగ ప్రస్తావన వచ్చింది కనుక ఈ పాటకు సంబంధంలేకపోయినా ఒక విషయం ప్రస్తావించడంలో తప్పులేదని భావిస్తున్నాను. "శంకరాభరణం"లో శంకరశాస్త్రి "శుద్ధహిందోళం"లో రిషభం ఎలా వచ్చిందని రంకెలు వేసినా అన్యస్వర లేదా భాషాంగస్వర ప్రయోగాల్ని సంప్రదాయ శాస్త్రీయ కర్నాటక సంగీతం భాషాంగరాగాలుగా గుర్తించి అంగీకరించింది. ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలో ఉద్దేశపూర్వకంగానే హిందోళలో రిషభ, పంచమాలు ప్రయోగించిన సందర్భాలున్నాయి. అయితే కర్నాటక సంప్రదాయ సంగీతంలో ఆ ప్రయోగ ఫలితంగా రూపుదిద్దుకున్న రాగానికి స్వరప్రస్తారసాగరం వంటి గ్రంథాలలో ఏ పేరూ కనబడదు. ఒకవేళ అటువంటి ప్రయోగాలకి ఏ పేరు లేకపోతే "మనం దానికి ఒకపేరు పెట్టుకుందాం" అని ఘంటసాలగారే ఒక AIR ఇంర్వ్యూలో అన్నారు. అంతేకాక ఆ రాగం ఎప్పుడు వినియోగించుకున్నా ఆ విశేష ప్రయోగంతోనే ఆ సంచారాన్ని వినియోగించేను అని అన్నారు. "సందేహింపకుమమ్మా" "కలనైనా నీ పిలుపే" లాంటి పాటలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  సినిమా సంగీతదర్శకుడి మనోధర్మనికి సంప్రదాయ శాస్త్రీయ సంగీతజ్ఞుడికున్నన్ని బందికట్లులేవు. 

రచయితకి, దర్శకుడికి సంగీతంలో ప్రాథమిక ప్రవేశంలేకపోతే ఆ శాస్త్రానికి అనుగుణ్యమైన jargon - పారిభాషిక జ్ఞానం కూడా అలవడదు. శుద్ధసావేరీ, శుద్ధధన్యాసిలాగ శుద్ధహిందోళం అని అనడం అపభ్రంశం. అందులోనూ శంకరశాస్త్రిలాంటి ఓ గొప్ప శుద్ధ కర్నాటక సంగీతజ్ఞుడు ఆ పద ప్రయోగం చెయ్యడం హాస్యాస్పదం.

'మోహనరూపా గోపాలా' పాట విషయంలో ఘంటసాల పూర్తిగా పెండ్యాల స్వరకల్పనలనే అనుసరించి ఆ పాటకు జీవం పోసారు. తెరమీద నారద పాత్రధారి పద్మనాభం కూడా చాలా హుందాగా నటించారు.

ఈ పాటలో వీణ, ఫ్లూట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను ఉపయోగించారు.  శుధ్ధ శాస్త్రీయమైన ఈ పాటలోని ఛాయాస్వరాలు ఆలపించడంలో ఘంటసాలవారి ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నాదాన్ని నాభిస్థానం నుండి పలికించడమంటే ఏమిటో, దానికి ఎంత దమ్ము పట్టాలో, అదెంత కష్టసాధ్యమో ఈ రకమైన పాటలు వినడం, పాడడం ద్వారా తెలుస్తుంది. ఘంటసాలవారి ఈ పాట గాయకులందరికీ ఒక పెద్ద టెస్ట్ వంటిది.

ఈ పాటను పాడడంలో ఎంతవరకూ సఫలీకృతులయ్యారో ఎవరికి వారు తమ మనస్సాక్షి ప్రకారం నిక్పక్షపాతంగా తేల్చుకోవలసిన విషయం.  

ఘంటసాలవారి ఈ గీతం సదా మదిలో మెదిలే సజీవరాగమే.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...