Saturday, 1 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 67వ భాగం - మల్లియలారా! మాలికలారా! మౌనముగా ఉన్నారా!

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయారవ భాగం ఇక్కడ

67వ సజీవరాగం -  మల్లియలారా! మాలికలారా! మౌనముగా ఉన్నారా! 

చిత్రం - నిర్దోషి
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.
సంగీతం - ఘంటసాల



పల్లవి :

మల్లియలారా మాలికలారా

మౌనముగా ఉన్నారా!

మా కధయే విన్నారా ! !మల్లియలార!

చరణం 1

జాబిలిలోనే జ్వాలలు రేగె

వెన్నెలలోనే చీకటిమూగె! - 2

పలుకగలేక పదములు రాక

పలుకలేక పదములే రాక

బ్రతుకే తానే బరువై సాగే

                                !మల్లియలారా!

చరణం 2

చెదరిన వీణా రవళించేనా

జీవనరాగం చివురించేనా -2

కలతలుపోయి వలపులు పొంగి-2

మనసే లోలో పులకించేనా

                                                                                !మల్లియలారా!

మాటకు మెట్టా? లేక  మెట్టుకు మాటా? అనే సందేహం శ్రోతలలో చాలామందికి కలుగుతూంటుంది. వ్రాసి యిచ్చిన సాహిత్యానికి వరస కూర్చడమే కష్టమని కొందరు భావిస్తే, కాదు పాట వరసకు సాహిత్యం మకూర్చడమే ఘనతని మరికొందరు అనుకుంటారు. సినీగీతాలు రూపొందించడంలో ఈ రెండు విధాల ప్రక్రియలకు బాగా అలవాటు పడవలసిన అవసరం అటు రచయితలకు, ఇటు సంగీత దర్శకులకు ఇద్దరికీ వుంది. కధాపరంగా సన్నివేశానికి తగినట్లుగా సందర్భోచితమైన సాహిత్యము, దానికి సముచితమైన సంగీతాన్ని సమకూర్చడమే రచయితలకు, సంగీత దర్శకులకు లక్ష్యంగా వుంటుంది తప్ప పాట వరస ముందా ? సాహిత్యం ముందా అనే విషయాల మీద కాదు. తద్వారా ఒక కవి లేదా సంగీత దర్శకుని ప్రతిభావ్యుత్పత్తులను నిర్ణయించడం సముచితం కాదు. సంగీత దర్శకుడు, గీత రచయితల అందుబాటుసౌలభ్యం, పరస్పర అవగాహన మేరకు పాట స్వరకల్పన జరుగుతుంది. 

ఉదాహరణకు సుప్రసిద్ధ కవి, సినీ గీత రచయిత డా.సి.నారాయణరెడ్డిగారినే తీసుకుందాము. ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ సినీమాలకు పాటలు వ్రాసేవారు. అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసులో వుండడం వలన పాటల రికార్డింగ్ వ్యవహారమంతా మద్రాసు లోనే సాగేది. నారాయణరెడ్డిగారు ప్రతీ నెల కొన్ని రోజులు మద్రాసు వచ్చి దాదాపు పది పదిహేను పాటల రచన చేసి తన పని పూర్తికాగానే హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. సంగీతదర్శకుడితో రోజుల తరబడి కూర్చొని పాటలు వ్రాసే అవకాశం వుండేదికాదు. నారాయణరెడ్డిగారు ముందుగానే  పాట సన్నివేశం గురించి తెలుసుకొని అందుకు తగిన సాహిత్యాన్ని తనకు తోచిన మీటర్ లో వ్రాసుకువచ్చేవారు. అవి దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకునికి ఆమోదయోగ్యంగా వుండేవి. అవసరాన్నిబట్టి చిన్న చిన్న మార్పులతో ఆ పాటలనే ఓకే చేసేవారు. ఘంటసాల, నారాయణరెడ్డిగారి కలయికలో వచ్చిన పాటలెన్నో ఈవిధమైన పరస్పర సౌలభ్యం మేరకే జరిగేవి. కానీ కొన్ని పాటల విషయంలో ఘంటసాలవారి కోరిక మేరకు ట్యూన్ కే సాహిత్యం వ్రాయవలసి వచ్చేది.

అలాటి సంగీత, సాహిత్య ప్రాధాన్యత కలిగిన  ఘంటసాలగారి ఒక పాటే నేటి మన సజీవరాగం. అదే 'మల్లియలారా మాలికలారా' అనే 'నిర్దోషి' సినీమా లోని ఏకగళ విరహగీతం.

"మల్లియలారా! మాలికలారా! మౌనముగా వున్నారా! మా కధయే విన్నారా!" పాట పుట్టుక గురించి, ఘంటసాల స్వర సరళి గురించి ఆ పాట రచయిత డా.సి.నారాయణరెడ్డిగారు ఏమన్నారో ఒకసారి ఈ క్రింది ఆడియో లో వినండి.


                                       మల్లియలారా పాట గురించి సినారె


ప్రేయసీ ప్రియులునవదంపతులు తమకు సంబంధించిన మరపురాని మధురాతి మధుర  వలపు కథలనుఆ వలపు వికటించినపుడు కలిగే విషాద, విరహ బాధలను చల్లని జాబిల్లికి, మనసుకు సేదను తీర్చే పరిమళభరిత మల్లె సుమాలకు మనసారా చెప్పుకుంటారు. అలాగే ఈ గంభీరమైన సన్నివేశంలో కథానాయకుడైన ఎన్.టి.రామారావు తన మనోవేదనను మల్లెమాలికలకు వెల్లడిస్తాడు. కథానాయిక సావిత్రితో పాటు  తొలిరేయికోసం అలంకరించిన మెత్తని పూలపాన్పు, మల్లెమాలలు, చల్లని జాబిల్లి అన్ని పరమ ఆప్తులలాగే ఆ విరహవేదనలను మౌనంగా ఆలకిస్తూంటాయి. పాట ప్రారంభంలో స్వల్ప వాద్యసంగీతం మీద నిర్వేదంతో కూడిన నవ్వు, 'మల్లియలారా, మాలికలారా' అనే మాటలమీద ఎక్కువ stress చేయకుండా 'ఉన్నారా''విన్నారా' అనే మాటలమీద నోట్ ను sustain చేస్తూ ఆలపించడంలో మిగతా పాటల కన్నా ఒక విధమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఘంటసాలగారికి ఏ పాటైనా పల్లవి ఒక వరసలో, తర్వాత వచ్చే చరణాలన్ని ఒక వరసలో  ట్యూన్ చేయడమే పరిపాటి. అప్పుడే అందరూ సులభంగా పాడుకోవడానికి వీలవుతుందని ఆయన అనేవారు. చరణం, చరణానికి tune లో వేరియేషన్,  అవసరం లేకపోయినా గజిబిజి గా వుండే lengthy background musical bits ను వినిపించడం ఘంటసాలగారి పద్ధతి కాదు. ఈ పాటలో ఆయన వేసిన సంగతులు, గమకాలు ఇతర గాయకుల నోట అంత నిర్దిష్టంగా, అంత భావోద్వేగంతో పలకవు అంటే అది అతిశయోక్తి కానేరదు.

ఈ పాటకోసం మాస్టారు సితార్, ఫ్లూట్, వైలీన్స్, సెల్లో, స్పానిష్ గిటార్, వైబ్రోఫోన్, బ్యాంగోస్ వంటి వాద్యాలను అతి సరళమైన రీతిలో ఉపయోగించారు. ఫలానా రాగం ఫలానా రసానికి మాత్రమే అనే concept ను ఘంటసాలవారు నమ్మినట్లుగా తోచదు. నవరసాలలో ఏ రసానికైనా ఏ రాగమైన ఉపయోగించుకోవచ్చనే నమ్మకం గల వ్యక్తి ఘంటసాల.

 ఉదాహరణకు ఈ పాటనే తీసుకుంటే, ఘంటసాలగారు ఈ పాటను స్వరపర్చడానికి మధ్యమావతి రాగాన్ని ఎన్నుకున్నారు. 22 వ మేళకర్త ఖరహరప్రియ జన్యం. ఐదు స్వరాలు (సరిమపని) స్వరాలు మాత్రమే కల ఔఢవరాగం. గ, ద  స్వరాలు లేని ఐదు స్వరాల రాగం మధ్యమావతి. ఈ రాగానికి హిందుస్థానీలో సమాంతరమైన రాగం మేఘ్ మల్హర్. మధ్యమావతి రాగం చాలా మంగళకరమైన రాగమని భావిస్తారు. సాధారణంగా సంప్రదాయ కర్ణాటక సంగీత కచ్చేరీలలో తమ కార్యక్రమాన్ని మధ్యమావతి రాగంలో వున్న కీర్తనతో కానీ, లేదా పాటతో కానీ ముగిస్తారు. 

అలాటి మధ్యమావతి రాగాన్ని ఘంటసాలగారు 'మల్లియలారా' వంటి వేదనాభరిత విషాదరస గీతానికి సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. 57 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట సజీవమై నిలచివుందంటే అది ఘంటసాలవారి  సంగీత వైదుష్యానికి గీటురాయిగా భావించవచ్చును.

దాదామిరాసి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, సావిత్రి ప్రధాన తారాగణంగా గౌతమీ పిక్చర్స్ నర్రా రామబ్రహ్మం నిర్మించిన క్రైమ్ , సెంటిమెంట్ 'నిర్దోషి' సినీమా. ఘంటసాల సంగీతం, ఎన్.టి.ఆర్, సావిత్రి ల అద్భుత నటన నిర్దోషి సినీమా విజయానికి దోహదపడ్డాయి. 'మల్లియలారా' పాటను ఘంటసాలగారు తన ప్రతి కచ్చేరీలో పాడేవారు. 

1951 లో హెచ్.ఎమ్.రెడ్డి అంజలీదేవి, జి.వరలక్ష్మి, ముక్కామల, కోన ప్రభాకరావులతో 'నిర్దోషి' అనే సినీమా తీసారు. దానికి కూడా ఘంటసాలగారే సంగీత దర్శకత్వం వహించారు. అందులో నటించిన ముక్కామల, అంజలీదేవి ఈ కొత్త నిర్దోషి సినీమా లో తండ్రి కూతుళ్ళుగా నటించడం ఓ విశేషం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్



No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...