Saturday, 22 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 70వ భాగం - ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైతొమ్మిదవ భాగం ఇక్కడ

70వ సజీవరాగం -  ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

చిత్రం - పుణ్యవతి
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.
సంగీతం - ఘంటసాల

పల్లవి : ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

అవి ఏనాడూ బాగుపడని అతుకులు

                            ఇంతేలే... ఇంతేలే -2

 

ఎండకు యెండి... వానకు తడిసీ

చలిలో వణకీ... వెన్నెలలో చివికీ

ఆరు ఋతువులందు... అన్ని యుగములందు

గతిలేని శ్రుతి లేని గతుకులు! 

                                    ఇంతేలే!

 

పుట్టగనే లేమి తలుపు తట్టింది

శని ఆపై తన పాదం పెట్టింది

పస్తులు లేని రోజే వుండదు

పండుగపూటైనా కడుపే నిండదు 

                                    ఇంతేలే!

 

కాళ్ళకు సంకెళ్ళు....

కళ్ళకు సంకెళ్ళు

నోటికి సంకెళ్ళు నుదుటి రాతకు సంకెళ్ళు

పేదలు ప్రాణమున్న పీనుగలు...

విధి చేతులలో తిరిగే గానుగలు 

                                    ఇంతేలే!

"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ" ... అంటూ ఇద్దరు మహాకవుల కవితాశైలిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత గుడిపాటి వేంకటా చలం గారు వ్యాఖ్యానించారు.

అలాటి శ్రీశ్రీ బాధలాటిదే 'విశ్వంభర' కవి సి.నారాయణ రెడ్డిగారు ఒక సినిమా పాట కోసం అనుభవించారు. అదే 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అవి ఏనాడూ బాగుపడని అతుకులు' - నేటి మన ఘంటసాల సజీవరాగం.

 

నిశీధి సమయాన మురికివాడలలోని నిరుపేదల  ఆకలి కష్టాలకు మనసు చలించి ఒక యువకుడు  వేదనతో పాడిన పాట. నిజానికి  పేదరికమంటే ఎరుగని ధనికవర్గ కుటుంబానికి చెందినవాడు. కానీధనం, ఆడంబర జీవితంఅహంకారం,   నాగరికతా వ్యామోహం వలన  ఇంటిలో తల్లిదండ్రుల మమతానురాగాలు, ఆప్యాయతలు కరువై వాటికోసం అలమటిస్తూ, త్రాగుడుకు అలవాటు పడి, కుటుంబంతో సంబంధంలేకుండా ఒంటరిగా నిరాశా నిస్పృహలతో బ్రతికే ఒక హృదయమున్న మనిషి యొక్క చీకటి విలాపం ఈ గీతం. 1967 లో వచ్చిన 'పుణ్యవతి' అనే సినిమా కోసం డా.సి.నారాయణరెడ్డిగారు వ్రాసిన ఉదాత్త గీతం.

ఎన్.టి.రామారావు, భానుమతి, ఎస్.వి.రంగారావు, కృష్ణకుమారి వంటి హేమాహేమీల మధ్య ఒక విలక్షణమైన యువకుడి పాత్రలో శోభన్ బాబు ఎంతో రాణించి తన పాత్రలో జీవించారు.  అందుకు సి.నా.రె.గారి కలం, ఘంటసాలవారి గళం ఎంతగానో దోహదం చేసాయి.

"ధనం మూలం  ఇదం జగత్". కలిమిలేని వాడి జీవితం ఎన్నటికీ అతుకు గతుకుల బాటే. పుట్టగనే లేమి తలుపు తడుతుంది. వెనువెంటనే శని తన పాదం పెడుతుంది. సమాజంలో ధనం లేనివాడికి  అధికారముఅంతస్తుస్వేఛ్ఛ ఏవీ వుండవు. కాళ్ళకు, కళ్ళకు, నోటికి, చివరకు విధాత నుదుటి వ్రాతకు కూడా సంకెళ్ళే. ప్రాణమున్న పీనుగలు, విధి చేతులలో తిరిగే గానుగలు ఈ పేదలు. ఏనాటికి మారని నిరుపేదల బ్రతుకింతే అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని నారాయణరెడ్డి ఈ పాటలో మనకు అందించారు.

కాపి రాగం  ఏ కలపడం లేని శుధ్ధమైన ఫిల్టర్ కాఫీ అంత మాధుర్యాన్ని, రసానుభూతిని కలిగిస్తుందని రసజ్ఞుల భావన. మన సంప్రదాయ, సినీ నృత్య జావళీ గీతాలు చాలావరకు ఈ కాపి రాగంలోనే స్వరపర్చబడివున్నాయి. ఈ కాపి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం 'పీలు'. అటువంటి సుఖసంతోషాలకు , మధురానందానికి అనువైన  పీలు రాగ స్వరాలను ఆధారంగా చేసుకొని 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు' పాటను శోకరస ప్రధానంగా, అతి గంభీరంగా, అంతే ఉదాత్తంగానూ స్వరపర్చి  ఆ  నిరుపేదల మనోభావాలు తనవిగా భావిస్తూ    ఘంటసాల మాస్టారు సంపూర్ణంగా  లీనమైపోయి    ఆ పాటకు ప్రాణప్రతిష్ట చేసారు. సన్నివేశ బలానికి  మంచి సంగీత సాహిత్యాలు తోడైతే ఆ పాట శ్రోతల హృదయాలలో పదికాలాలపాటు సజీవరాగమై నిలిచిపోతుందనడానికి "ఇంతేలే నిరుపేదల బ్రతుకులు" పాట ఒక నిదర్శనం.

'పుణ్యవతి' సినిమా నిర్మాతవాసూ స్టూడియో అధినేత వాసుదేవ మీనన్చిత్రదర్శకుడు దాదామిరాసి సంగీతం విషయం పూర్తిగా  ఘంటసాలగారికే వదలిపెట్టి పరిపూర్ణమైన స్వేఛ్ఛను ఇచ్చారు. అందువల్లనే ఈ పాటే కాకుండా ఈ సినిమా లోని  'మనసు పాడింది సన్నాయి పాట', 'ఎంత సొగసుగా వున్నావు', 'పెదవులపైన సంగీతం' వంటి ఇతర గీతాలు కూడా ఈ నాటివరకు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలచివున్నాయి. వాసుమీనన్ ఈ సినిమా ను ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో 'పుణ్యవతి',' పూవుంపొట్టుం', 'నయీ రోషిణి' గా వేర్వేరు ప్రముఖ నటీనటులు, వేర్వేరు సాంకేతిక నిపుణులతో భారీగా నిర్మించారు.

ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, భానుమతి, కృష్ణకుమారి, హరనాథ్, జ్యోతిలక్ష్మీ ; ఎ.వి.ఎమ్.రాజన్, నాగేష్, ముత్తురామన్, భారతి; అశోక్ కుమార్, బిశ్వజిత్, రాజ్ కుమార్, మాలాసిన్హా, తనూజ ; వంటి ప్రముఖ తారలంతా  ఈ మూడు భాషల్లో నటించారు. తెలుగు తమిళ చిత్రాలకు దాదామిరాసి, హిందీ వెర్షన్ కు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించారు.

తెలుగు, తమిళం, హిందీ ఈ మూడు భాషల్లో నటించిన పి.భానుమతికి కనీసం ఒక పాటైనా లేకపోవడం ఒక విశేషం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్

Saturday, 15 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 69వ భాగం - మగజాతికి నువు బలిపశువమ్మా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయెనిమిదవ భాగం ఇక్కడ

69వ సజీవరాగం -  మగజాతికి నువు బలిపశువమ్మా

చిత్రం - స్త్రీజన్మ
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - ఘంటసాల

పల్లవి : మగజాతికి బలిపశువమ్మా"

సాకీ -

ఎన్ని పూవులిలా నలగిపోయినవో

ఎన్ని బ్రతుకులిలా చెదరి రాలినవో...

పల్లవి:

మగజాతికి నువు బలిపశువమ్మా

నీ సొగసూ వయసే నీకు పగమ్మా

స్త్రీ ప్రకృతే నీ పాలిట శాపం

ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం

                                    !మగజాతికి!

అందం నీవే అంటారు

ఆనందానికి నెలవంటారు

ఆ రెంటిని పొందీ నిన్నాఖరుకు

అపవిత్రవని వెలివేస్తారు 

                                   !మగజాతికి!

అరిటాకమ్మా ఆడజన్మము

ముళ్ళకంచె యీ మూఢసంఘము

అమ్మా...ఆ....

ముళ్ళకెన్నడూ దండన లేదూ

చిరిగిన ఆకు విస్తరికాదు

                                    !మగజాతికి!

చిరిగిన ఆకు విస్తరి కాదు

నీ సొగసు వయసే నీకు పగమ్మా...


ఈ పాట రెండవ పార్శ్వం :

సాకీ - " తల్లీ! ఇది తరతరాల కథ చెల్లీ!

           అలాగే జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ!...

 

పల్లవి : మగజాతికి నువు బలిపశువమ్మా నీ మనుగడ

ఆరని కన్నీరమ్మా

మాతృత్వం నీ పాలిట శాపం

ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం

 

లోకుల నిందలు ఓర్చిన తల్లీ

నిను నీ నెత్తురె నిందించినదీ

 

సహనం కూడా సహించరానిదీ

నీ మరణమే దీన్ని మాపేది-2

మరణమే దీన్ని మాపేది....

అరిటాకు మీద ముల్లు పడినా

ముల్లు మీద అరిటాకు పడినా ఛేదము అరిటాకుకే. అదింక విస్తరిగా ఉపయోగపడదు. ఆడజన్మ అరిటాకు వంటిదైతే  పురుషాధిక్యత గల దుష్ట సమాజం ఒక ముళ్ళకంచె వంటిది. యుగయుగాలుగా, తరతరాలుగా ఆడది అబల అనే ముద్రతో పురుష జాతికి అణగిమణగి నిస్సహాయస్థితిలో బానిసలా బ్రతుకుతోంది.  సీత, సావిత్రి, దమయంతి, అహల్య, ద్రౌపది  వంటి మహా పతివ్రతలు, మహనీయమూర్తులు కూడా పురుషాహంకారానికి తీవ్రంగా బలి కావలసివచ్చింది.

ఈ నవీన యుగంలో  స్త్రీ జాతి అభివృధ్ధి చెందిందని, అన్ని రంగాలలో స్త్రీ పురుషుడికి సమానమని చెప్పబడుతున్నా స్త్రీ పురుషుల మధ్య వివక్ష పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజు పత్రికలలో, టీవిలలో కనపడే దారుణ మానభంగాలు, మానభంగ హత్యలు, ఆత్మహత్యలు, కాలేజీలలో ఆడపిల్లల పట్ల జరిగే అమానుషకృత్య వార్తలే ఇందుకు నిదర్శనం.

Man is a social animal అంటాడు అరిస్టాటిల్. పశువులకు మనిషికి గల తేడా బుధ్ధి. మనిషి ఒంటరిగా జీవించలేడు. జంతువులు లాగే సామూహికంగా, సమాజంలో బ్రతకవలసినవాడు. బుధ్ధిజీవి అయిన మనిషిలో పశుప్రవృత్తి పెచ్చుపెరిగితే పర్యవసానం, ఫలితాలు ఎంత దారుణంగా వుంటాయో చాటిచెప్పే గీతమే  -  "మగజాతికి నువు బలిపశువమ్మా" ఈనాటి ఘంటసాలవారి సజీవరాగం.

త్రాగుడు మైకంలో మనిషిలోని పశువాంఛకు బలైన స్త్రీ ఒకరైతే, ఆ స్త్రీని రక్షించబోయి కులటగా అవమానాలపాలైనది మరో అభ్యుదయ వనిత. ఒకే మనిషి వలన ఈ ఇద్దరి జీవితాలు దుర్భరమైపోయాయి. అటువంటి అభాగినుల దీనగాథే 'స్త్రీజన్మసినిమా.

ఇదొక anti-hero, ladies sentiment Story. పురుషాధిక్య మనోప్రవృత్తితో కథానాయకుడు తన భార్యపట్లతోడబుట్టిన అక్కపట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో చిత్రీకరించబడిన చిత్రమే 'స్త్రీజన్మ'. మంచితనానికి మారు రూపైన స్త్రీమూర్తులుగా కృష్ణకుమారి, అంజలీదేవి తమ తమ పాత్రలలో జీవించారు. anti-hero పాత్రను చేయడానికి  ఎన్.టి.ఆర్ వంటి అగ్రనటుడు అంగీకరించడం ఆయన ధైర్యానికి, నిబ్బరానికి దర్పణం. ఏ రకమైన పాత్రలనైనా అవలీలగా పోషించగలనని ఎన్.టి.రామారావు ఈ సినిమాలో నిరూపించారు.

వివిధ సందర్భాలలో  ఇద్దరు స్త్రీలు ఒకే వ్యక్తి వల్ల ఎలా వంచించబడి, అవమానాలపాలయ్యారో "మగజాతికి నువు బలిపశువమ్మా" పాట వివరిస్తుంది. ఈ నేపథ్య గీతం సినిమాలో రెండు కట్స్ గా వస్తుంది.  పాట ట్యూన్ ఒకటే అయినా చరణాల సాహిత్యంలో సందర్భోచితమైన మార్పులను తన సహజశైలిలో చూపించారు మనసుకవి ఆత్రేయ.  మొదటిది కథానాయిక కృష్ణకుమారి పరంగా, రెండవసారి కధానాయకుడి అక్క అంజలీదేవి మీద  వినిపిస్తుంది. చిత్ర దర్శకుడు కోవెలమూడి సూర్య ప్రకాశరావు. సీరియస్ సినిమాల చిత్రీకరణ లో నిష్ణాతుడు.

ఉద్వేగము, ఉద్రేకము, విషాదము నిండిన సన్నివేశాలు ఇవి. గీత రచయిత, సంగీతదర్శకుల వివేచనకు , ప్రతిభకు అగ్నిపరీక్ష ఈ పాట. ఆత్రేయగారి పాటంటే అందరికి తెలిసిన విషయమే. అనుకున్న వెంటనే కాగితంమీద పదాలు పడవు. అందువల్ల చేసిన మెట్టుకు చిత్రిక పట్టడానికి సంగీతదర్శకుడికి కావలసినంత సమయం. 'స్త్రీ జన్మ' కు సంగీత దర్శకుడు ఘంటసాల. సురేష్ కంబైన్స్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమాలకు ఘంటసాల పనిచేసిన ఏకైక చిత్రం. బహుశా సహ నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు జోక్యం కావచ్చును.

ఎట్టకేలకు సన్నివేశబలానికి తగినట్లుగా బరువైన పదజాలంతో వేర్వేరు సాకీలతో, చరణాలతో రెండు పాటలను  శ్రోతల హృదయాలకు హత్తుకుపోయేలా తనదైన బాణీలో  వ్రాసిచ్చారు ఆత్రేయ.

నఠభైరవి  రాగ స్వరాలు ఆధారంగా ఘంటసాల మాస్టారు ఈ పాటను శోకరసభరితంగా, మంచి ఉద్వేగంతో స్వరపర్చారు. నఠభైరవి రాగం కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త. ఏడు స్వరాలు గల సంపూర్ణరాగం. భైరవి, ఆనందభైరవి, సారమతి, వంటి రాగాలు ఈ నఠభైరవి కి జన్యరాగాలు. హిందుస్థానీ సంగీతంలో కూడా భైరవి అనే రాగం వుంది. దానికి సమానమైన కర్ణాటక రాగం తోడి.

పాట సంబంధిత వ్యక్తులందరి ఆమోదముద్ర పొంది రికార్డింగ్ దశకు చేరుకుంది. పాట చాలా బాగా వచ్చింది. సన్నివేశపరంగా పాటను  ఎమోషనల్ గా, చాలా హైపిచ్ లో పాడాలి. అది మాస్టారివల్ల కాకపోవచ్చు. అందుచేత ఈ రెండు పాటలను టి.ఎమ్.సౌందరరాజన్ తో పాడించే ఏర్పాట్లు చేయమని  నిర్మాత రామానాయుడు తాను స్వయంగా మాట్లాడకుండా సంగీత సహాయకుడు జె.వి.రాఘవులు ద్వారా ఘంటసాలగారికి కబురు పంపారు.  ఈ విషయం ఘంటసాలగారికి నొప్పి కలిగించిందనే చెప్పాలి. తాను పాడవలసిన పాటకు ఇతరులచేత పాడించమనే సలహాను ఆయన అంత తేలికగా భావించలేకపోయారు.

ఆయన ఉద్రేకపడకుండా,'అలాగే నాయనా! ముందు నేను ట్రాక్ పాడతాను. దానిని నాయుడుగారిని వినమను. ఆ తర్వాత ఆయనకు కావలసినవారితో ట్రాక్ మిక్స్ చేద్దాము' అని చెప్పి పంపారు.  

పాట ట్రాక్ రికార్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. మామూలుగా ఘంటసాలగారు తన పాటలను ఒకటి, ఒకటిన్నర శ్రుతులలో పాడతారు. ఈ పాట సన్నివేశానికి కావలసిన ఆవేశం, ఉద్రేకం, గాంభీర్యానికి తగినట్లుగా  ఈ పాటను రెండు శ్రుతిలో పాడారు. ఈ పాటలో ఆర్కెష్ట్రా కూడా ఘనంగానే వినిపిస్తుంది. తబలా, పక్వాజ్, డ్రమ్స్, షెహనాయ్, వైయొలిన్స్ వంటి వాద్యాల నడుమ  ఘంటసాలవారి కంఠం కంచులా ఎంతో ఆవేశపూరితంగా ధ్వనించింది. ఈ పాటను ఘంటసాల ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. పాట రికార్డింగ్ పూర్తయింది. ఘంటసాలగారి గాత్రబలాన్ని శంకించినవారందరి నోళ్ళు మూతబడ్డాయి. సినిమా రిలీజయ్యాక  ఆడిటోరియంలలో ఈ పాటకు ఘంటసాల కంఠమే ప్రతిధ్వనించింది. శ్రోతలంతా ఎంతో ఉద్విగ్నులయ్యారు.

స్త్రీ జన్మ సినిమాలో మంచి పాటలలో ఒకటి ' ఎడారిలో పూలు పూచె ఎందుకనీ'. ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, అంజలీదేవి, కాంతారావు, నాగయ్య, కృష్ణ, ఎల్.విజయలక్ష్మి, ప్రభాకరరెడ్డి మొదలగువారు నటించిన ఈ చిత్రంలోని  11పాటలను ఆత్రేయ, జూ.సముద్రాల, సి.నా.రె., దాశరధి, ఆరుద్ర, కొసరాజు  రచించగా ఘంటసాలతో పాటు పి.సుశీలఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది, స్వర్ణలత మొదలగువారు గానం చేసారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిథి కథ, మాటలు సమకూర్చి, ఆయన మేనల్లుడు, తరవాతి రోజుల్లో కేంద్రమంత్రి, పత్రికాధినేత 'మురసొలి'మారన్ నిర్మించిన  'పూమాలై' అనే ladies sentiment తమిళ చిత్రం ' స్త్రీ జన్మ' తెలుగు సినిమాకు మూలం.

ఇటువంటి  చిత్రవిచిత్ర  సినీప్రపంచంలోని ఆటుపోట్లన్ని అధిగమిస్తూ ఎంతో సంయమనంతో  మూడు దశాబ్దాల పాటు అగ్రగణ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగువారందరి మన్ననలు పొందిన  ఘంటసాలవారి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 8 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 68వ భాగం - జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయేడవ భాగం ఇక్కడ

68వ సజీవరాగం -  జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...! 

చిత్రం - అత్తా ఒకింటి కోడలే
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - పెండ్యాల

పల్లవి : 

జోడు గుళ్ళ పిస్తోలు ..ఠాఁ!

నేను ఆడితప్పనివాణ్ణి జీ..హా..! జోడు!

 

హద్దుమీరువారు శిక్షింపబడుదురు

బుధ్ధిమంతులెపుడు రక్షింపబడుదురు

                                                ! జోడు!

 ఆఫీసర్ భార్యననే అహం కూడదు

అధికారం చెలాయిస్తె ఇంక చెల్లదు

తొండ ముదిరితే ఊసరవెల్లి

అత్తా...హజం ముదిరితే హళ్ళికి హళ్ళీ 

                                                ! జోడు!

 కాకిపిల్ల కాకికి కడు ముద్దు

అది అందుచేత కాగూడదు మొద్దు

ఎవరి గొప్ప వాళ్ళ వద్ద ఆగకున్నచో

అత్తా ! దేహశుద్ధి కొండొకచో జరుగుట కద్దు 

                                                ! జోడు!

 

నోరు మంచిదైతేనే ఊరు మంచిది

పోరు నష్టము - ఎపుడూ పొందులాభము ఇది కోర్టుకెక్కితే

అంతా ఆభాసు అత్తా ... నీ జోరు

తగ్గకుంటేను కొంప కళాస్

! జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!


తెలుగు సినిమా ప్రపంచం‌లో ప్రముఖ మిత్రద్వయాలు చూస్తూంటాం. బాపు-రమణ, విశ్వనాథన్-రామ్మూర్తి. మా నాన్నాగారూ, శ్రీ ఘంటసాలగారు కూడా చిరకాల 'ఇద్దరు మిత్రులే'. ఘంటసాలగారు 1938 లో విజయనగరం వచ్చిననాటినుంచి ఆ మిత్రత్వం కొనసాగింది. ఇంకా మా కుటుంబాల మధ్య ఆ స్నేహబాంధవ్యాలు కొనసాగుతునే ఉన్నాయి. అటువంటి మిత్రద్వయం నాకు తెలిసినంతలో మరొకటి శ్రీ YN శర్మగారు శ్రీ అచ్యుతశాస్త్రిగారిది. శ్రీ యనమండ్ర నాగయజ్ఞశర్మగారు - ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మగారి తండ్రిగారు, శ్రీ హరి అచ్యుత రామశాస్త్రిగారు  వాగ్గేయకారుడు, ప్రముఖ వాయులీన విద్వాంసుడు శ్రీ హరి నాగభూషణంగారి కుమారుడు. శ్రీయుతులు శర్మశాస్త్రి ద్వయం పేరెన్నిక పొందిన వైయొలిన్ వాద్యకళాకారులు. సన్నిహిత మిత్రులు. ఒకరినొకరు అంటిపెట్టుకొని ఎక్కడ ఏ రికార్డింగ్ లో పాల్గొన్నా ఒక్కటిగా పక్కపక్కనే ఉండేవారు. ఎక్కడికైనా కలసిరావడంకలసివెళ్ళడం జరిగేది.  వారు  ఘంటసాలగారు సంగీతం నిర్వహించిన అనేక చిత్రాలలోని పాటలకు, ఘంటసాలగారి లలిత సంగీత కచేరిలలో తమ వైయొలిన్ వాద్య సహకారాన్ని అందించేవారు.  

అచ్యుత రామశాస్త్రిగారు మా తండ్రిగారు పట్రాయని సంగీతరావుగారు మద్రాసులో చేసిన ఒక కర్ణాటక సంగీత కచేరీలో  తమ వైయొలిన్ తో సహకరించారు కూడా. 

ఈ మిత్రద్వయం వివిధ రకాల సినీ సంగీత ప్రక్రియలలో మంచి అనుభవం సంపాదించడంవలన చిత్రరంగంలోని ప్రముఖ సంగీత దర్శకులందరి వద్దా రోజుకు రెండు మూడు పాటలకు  పనిచేస్తూ చాలా బిజీగా వుండేవారు.

ఈ వైయొలిన్ మిత్రద్వయంలోని శ్రీ హరి అచ్యుత రామశాస్త్రిగారు ఒక వ్యాసంలో ఘంటసాలగారి గాన ప్రతిభను  వర్ణిస్తూ ఒక పాట గురించి చెప్పిన తమాషా ఉదంతమే నేటి మన సజీవరాగం. అదే "జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!".

అది భరణీ స్టూడియో రికార్డింగ్ ధియేటర్. మధ్యాహ్నం 2 టు 9 కాల్షీట్. పి.వి.కోటేశ్వరరావు సౌండ్ ఇంజనీర్. అనుపమ ఫిలింస్ "అత్తా ఒకింటి కోడలే" చిత్రంలోని " జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!" అనే పాట రికార్డింగ్. పెండ్యాల సంగీత దర్శకుడు, కె.బి.తిలక్ దర్శక నిర్మాత. గాయకుడు ఘంటసాల. ఆర్కెష్ట్రా నొటేషన్ టేకింగ్, ప్లేయర్స్ ప్లేస్మెంట్స్, మైక్ సెట్టింగ్స్ఆర్కెష్ట్రా రిహార్సల్స్సౌండ్ రికార్డిస్ట్ ల పేరామీటర్స్ ... ఇవన్ని అయేప్పటికి సాయంత్రం 7 గంటలు. పాట పాడేందుకు మాస్టారు వచ్చారు.

ఒక త్రాగుబోతు పాడే పాట.  హెవీ ఆర్కెష్ట్రా. పూర్తి  వెస్ట్రన్  టైప్ సాంగ్. పెండ్యాల గారి రికార్డింగ్ అంటే అందరికీ భయమే. పాటనీ  ఒక పట్టాన ఓకే చేయరని, టేకుల మీద టేకులు తీసుకుంటేకానీ తృప్తిపడరని అందరికీ తెలుసు. రికార్డింగ్ పూర్తి అయి ఇళ్ళకు వెళ్ళడానికి ఎంత రాత్రవుతుందోనని భయం.

ఘంటసాలగారు రిహార్సల్స్ సమయంలో మైక్ లేకుండా పాడుతున్నప్పుడు మామూలుగా, అందరూ పాడుతున్నట్లుగానే వినిపిస్తుంది. అదే మైకు ముందుకు రాగానే ఆ కంఠస్వరం పూర్తిగా మారిపోతుంది. ఆ గాంభీర్యానికి ధియేటర్ అంతా వైబ్రేట్ అవుతుంది. ఆ గాత్ర మాధుర్యానికి, శ్రావ్యతకు ప్రతీ ఒక్కరు మెస్మరైజ్ అవుతారు. అది ఏ గాయకులకు లభించని గొప్ప వరం. ఆర్కెష్ట్రా, సింగర్ తో రిహార్సల్స్ చేసి ఒకటి రెండు మానిటర్లు చూశారు. సాంగ్ టేక్ అన్నారు పెండ్యాల.  ఒక టేక్ అయింది. ఆనవాయితీగా రెండో టేక్ కు సిద్ధపడుతున్న సమయంలో డైరెక్టర్ తిలక్ గారు కలగజేసుకొని మరో టేక్ అవసరం లేదని ఫస్ట్ మానిటర్ రిహార్సల్స్ లోనే పాట ఓకే అయిపోయిందని, అది రికార్డు చేయడం జరిగిందని మాస్టారు చాలా అద్భుతంగా పాడారు, ఇంక మరిన్ని టేకుల అవసరం లేదని ఎనౌన్స్ చేశారు. ఇది మా ఆర్కెష్ట్రా వారందరికీ చాలా ఆనందం, ఆశ్చర్యం కలిగించిన విషయం. నిజంగానే ఘంటసాలగారు ఆ పాటను అంత రసవత్తరంగా పాడారని అచ్యుత రామశాస్త్రిగారు అభివర్ణించారు.

'కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువే'. మనిషికి వుండే కొన్ని ఫోబియాలతో, బలహీనతలతో ఎంతటి బలశాలియైనా, కరకు దుర్మార్గుడైనా కొన్ని సందర్భాలలో లొంగక తప్పదు. ఒక పరమ గయ్యాళి అత్తగారికి త్రాగుబోతుల ఫోబియా. త్రాగుబోతులను చూస్తేనే హడలు. ఆవిడలోని ఆ బలహీనతను, భయాన్ని అవకాశంగా తీసుకొని ఆవిడను మార్చడానికి కూతురి సహకారంతో అల్లుడు ఒక త్రాగుబోతుగా నటిస్తాడు. ఆ సందర్భంలో వచ్చే పాటే ' జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...!

సూర్యకాంతం , జగ్గయ్య , గిరిజలు పాల్గొన్న ఈ హాస్య సన్నివేశం , అందులో వచ్చే ఈ పాట ఆనాడు , ఈనాడు కూడా ప్రేక్షకులను ఎంతో అలరిస్తూనే వుంది. 

"జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ!" -- ఈ పాటలో ఒక తమాషా వైవిధ్యం వుంది.

ఈ నిషా పాట ట్యూన్ పూర్తిగా వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్. ఆర్కెష్ట్రా కకూడా వెస్ట్రన్ బ్యాండ్ . అంటే ట్రంపెట్స్, కెటిల్ డ్రమ్స్, బ్రషెస్ డ్రమ్స్, డబుల్ బాస్, వైలిన్స్, వయోలాలు మొదలైనవి. పాటలోని  సాహిత్యం మాత్రం పూర్తి విరుధ్ధంగా తెలుగుదేశ గ్రామీణ వాతావరణానికి చెందిన పదజాలాన్ని వాడారు కవి ఆరుద్ర.

త్రాగుబోతు వాడి మాట తుపాకీ గుండంత సూటిగా నిఖార్స్ గా వుంటుందనే అభిప్రాయమేమో. గయ్యాళి అత్తకు బుధ్ధి వచ్చేలా చేయడానికి ఈ నిషా పాటలో  హీరో నోట పాత తెలుగు సామెతలతో పాటుకొన్ని నీతి సూత్రాలను కూడా వల్లింపజేసారు. దుష్టశిక్షణ , శిష్టరక్షణఅధికారముందని అహం కూడదుతొండ ముదిరితే ఊసరవెల్లికాకిపిల్ల కాకికి ముద్దునోరు మంచిదైతే ఊరు మంచిది; పోరు నష్టము- పొందు లాభమువంటి పదాలు ఉపయోగించి సినిమా పాట సామాజిక స్పృహ కలిగివుండాలనే నినాదాన్ని దర్శక నిర్మాత కె.బి.తిలక్ ప్రజలకు అందించారు. ప్రేక్షకులు ఆదరించారు.

ఫేక్ త్రాగుబోతుగా ఈ పాటలో జగ్గయ్య, గయ్యాళి అత్తగా సూర్యకాంతం రాణించడానికి పూర్తిగా దోహదపడింది ఘంటసాలవారి గాన నటనా పటిమ.  ఘంటసాలగారు ఈ పాటకు ముందు గతంలో కొన్ని నిషా పాటలు పాడినా అవన్నీ గాంభీర్యం కలవివేదనాపూరితమైనవి. ఈ పాట అలాటిది కాదు, హాస్యం, వినోదం ప్రధానాశయంగా కలిగిన పాట. అది ఘంటసాలవారి గాత్రంలో పాట ఆద్యంతం ధ్వనిస్తుంది. జగ్గయ్యగారికి ఘంటసాలగారు పాడిన మొదటి మందు పాట " జోడుగుళ్ళ పిస్తోలు ఠాఁ...! " జగ్గయ్యగారే స్వయంగా పాడుతున్నట్లు అనిపించే ఈ పాట ఎప్పటికీ సజీవరాగమే.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...