Saturday, 26 July 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైయొకటవ భాగం ఇక్కడ

92వ సజీవరాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

చిత్రం - ఆనందనిలయం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర

సంగీతం - పెండ్యాల

పల్లవి 

పదిమందిలో పాట పాడినా

అది అంకితమెవరో ఒకరికే

విరితోటలో పూలెన్ని పూచినా

గుడికి చేరేది నూటికి ఒకటే

                                        !పదిమందిలో!

చరణం 1:

గోపాలునికెంతమంది గోపికలున్నా

గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే...

ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా

అందాల జాబిల్లి అసలు ఒక్కడే

                                        !పదిమందిలో!

చరణం 2:

ఎడాదిలో ఎన్ని ఋతువులున్ననూ

వేడుక చెసే వసంతమొక్కటే - 2

నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్ననూ -2

ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే...

                                        !పదిమందిలో!

మన కర్ణాటక సంగీత రాగాలలో అతి ప్రాచీనమైన రాగం దేవగాంధారి.  ముత్తుస్వామి దీక్షితర్ సంగీత సంప్రదాయం లో అభేరిగా బహుళ ప్రచారం చెందింది.  అభేరి 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యరాగం. అరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతూండడంవలన అభేరిని ఔఢవ-సంపూర్ణ రాగంగా పరిగణిస్తారు. ఈ అభేరి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భీమ్ పలాస్. 

మన సినిమా సంగీత దర్శకుల పుణ్యమా అని అభేరి - భీమ్ పలాస్ రాగాలు సినీమా సంగీతాభిమానులందరికీ అత్యంత ప్రియతమ రాగాలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ రెండు రాగాలలో అసంఖ్యాకమైన తెలుగు సినిమా పాటలు రూపొందించబడి బహుళ జనాదరణ పొందాయి.  ఘంటసాలగారి మృదుమధుర కంఠస్వరం నుండి అలవోకగా జాలువారిన  ఒక ఆజరామర సినీ గీతమే ' పదిమందిలో పాట పాడినా' అనే గీతం. అదే ఈనాటి మన సజీవరాగం.

1971 లో వచ్చిన 'ఆనంద నిలయంఅనే ఒక సినిమా కోసం ఆరుద్రపెండ్యాలఘంటసాలకాంతారావుబి.ఎస్.నారాయణ, మొదలగువారు చేసిన  సమిష్టి కృషి ఫలితమే ' పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికేఅనే శ్రవణానందకరమైన గీతం.

ఈ పాటలో కథానాయకుడు తన మనసులోని భావాలను చాలా సున్నితంగా, సుస్పష్టంగా ఎవరి మనసులు నొచ్చుకోకుండా ఒక స్టేట్ మెంట్ లా బహిరంగపరుస్తాడు. అందుకుగాను  గుడికి చేరే విరితోటలోని పూలను; గోపికాలోలుడైన గోపాలుని గుండెల్లో గూడుకట్టుకున్న రాధనుఆకశాన వెలిగే అందాల జాబిల్లి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వసంత ఋతువును ఉదాహరణగా తీసుకుంటాడు. చివరగా, తన కన్నుల్లోని అన్ని వేల కాంతులకు కారణం, ఆ భాగ్యాన్ని కల్పించిన  తన ప్రేయసి ప్రేమ ఒక్కటే అని చాలా నిర్దిష్టంగా కథానాయకుడు తన మనోగతాన్ని వెల్లడిస్తాడు. ఆరుద్రగారి కలం ఈ పాటకు జీవం పోసింది. 

'ఆనంద నిలయంలో' ఎన్ని పాటలున్ననూ శ్రోతలనందరినీ రంజింపజేసినదీ గీతమొక్కటే' అనే రీతిలో అభేరి రాగంలో ఈ పాటను స్వరపర్చారు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాలగారి ప్రతిభనుఅభేరి రాగ మాధుర్యాన్ని పది రెట్లు ఇనుమడింపజేస్తూ అద్భుతంగా గానం చేసారు ఘంటసాల మాస్టారు.

పుట్టినరోజు వేడుకల సమయంలో వచ్చిన అతిథులందరినీ ఆనందపరుస్తూ కథానాయకుడు పియోనా వాయిస్తూ పాడే పాట ఇది. ఇలాటి శుభ సందర్భాలలోని పాటలకు వీణసితార్పియోనా వాద్యాలనే ఆలంబనగా చేసుకోవడం మన సంగీత దర్శకులందరికీ పరిపాటి. అందులోనూ పుట్టినరోజు  చేసుకునేవారి దర్జాదర్పంఅంతస్తు హైలెట్ చేస్తూ చూపించడానికి పియోనాను మించిన వాద్యం కనపడదు. అలాటి పియోనా పాటలలో తలమానికంగా భాసిల్లిన గీతం ఘంటసాలగారు గానం చేసిన 'పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే'. భావయుక్తమైన మాస్టారి గానం తెరమీద కథానాయకుడు కాంతారావు గారి హావభావాలకు రాణింపునిచ్చింది. అలాగే సూర్యకాంతం, ఉషాకుమారికృష్ణకుమారి కూడా ఈ పాట రాణింపుకు ఇతోధికంగా తోడ్పడ్డారు.

ఈ పాటలోని ప్రధాన వాద్యమైన పియోనా కోసం పెండ్యాలగారిచే స్వరపరచబడిన సంగీతం ఆద్యంతం శ్రోతలను మైమరపిస్తాయి. ఈ పాటలో పియోనాతో పాటు వైలిన్స్, తబలాడోలక్ వంటి వాద్యాలు ప్రధానంగా వినిపిస్తాయి. మొత్తం మీద ఏదో ఒక శాస్త్రీయ రాగాన్ని ఆధారంగా చేసుకొని స్వరపర్చిన గీతాలనే సామాన్య శ్రోతలు కూడా ఆదరించి అభిమానిస్తారని చెప్పడానికి ఇలాటి పాటలే చాలు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  

Saturday, 19 July 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 91వ భాగం - సుడిగాలి లోన దీపం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైయవ భాగం ఇక్కడ

91వ సజీవరాగం - సుడిగాలి లోన దీపం

చిత్రం - జీవితచక్రం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర

సంగీతం - 
శంకర్ జైకిషన్

పల్లవి

సుడిగాలి లోన దీపం

కడవరకు వెలుగునా ---2

 

చరణం 1: 

లోకాన పన్నీరు జల్లేవులే

నీకేమొ కన్నీరు మిగిలిందిలే

పెరవారి గాయాలు మాన్పేవులే

నీలోన పెనుగాయమాయేనులే

అణగారిపోవు ఆశ నీ వల్లను ఫలించె

                                                !సుడిగాలి!

చరణం 2: 

ఒక కన్ను నవ్వేటి వేళ లో

ఒక కన్ను చెమరించసాగునా

ఒకచోట రాగాలు వికసించునా

ఒకచోట హృదయాలు ద్రవియించునా

ఎనలేని ప్రాణదానం ఎద బాధ తీర్చునా

                                                !సుడిగాలి!

చరణం 3:

కల్లోల పవనాలు చెలరేగునా

గరళాల జడివాన కురిపించునా

అనుకోని చీకట్లు తెలవారునా

ఆనంద కిరణాలు ఉదయించునా-2

విధికేమొ లీలయైన మది బరువు మోయునా

                                                !సుడిగాలి!

ప్రేమ సాఫల్యానికి ప్రేమికులలో స్వార్ధపరత్వం తప్పనిసరి. తమ ప్రేమను నిర్భయంగా బాహాటంగా ప్రకటించకుండా పిరికితనమో లేక మెతకదనమో ప్రదర్శిస్తే ఆ ప్రేమికులు జీవితాంతం కలవనేలేరు. వారి ప్రేమ సుడిగాలి లో దీపంలా రెపరెపలాడుతూ ఏ క్షణాన్నైనా కొండెక్కిపోయి వారి కథ విషాదాంతమే అవుతుంది. పెద్దలమాటను కాదనలేకబంధుప్రీతిని చంపుకోలేక చావుబ్రతుకుల మధ్యనున్న మరదలి మెడలో తాళికట్టి, తాను మనసారా ప్రేమించిన యువతికి ద్రోహం చేయలేక, నిజం చెప్పలేక తనలో తానే కుమిలి కృంగిపోతూ ఇద్దరు యువతుల మధ్య నలిగిపోయే ఓ భగ్నప్రేమికుడు ఆలపించే విషాద గీతమే 'సుడిగాలి లోన దీపం...' నేటి మన సజీవరాగం.    


ఎగుడుదిగుళ్ళ బాటపై భగ్నప్రేమికుల జీవితచక్రం అపసవ్యంగానే తిరుగుతుంది. ఒకరి శాంతి మరొకరి అశాంతిఒకరి ఆనందం మరొకరి దుఃఖం. ఈరకమైన అల్లకల్లోల మనస్థితిలో కథానాయకుడు ఆలపించే ఈ గీతాన్ని 'జీవితచక్రం' సినిమా కోసం ఆరుద్ర వ్రాయగా  శ్రోతల మనసులు కరిగించేలా చాలా హృద్యంగా ఘంటసాల గానం చేశారు.  ఎన్.టి.ఆర్, శారదవాణిశ్రీల మీద నేపథ్యం నుండి వినిపించే  ఉద్విగ్నభరితమైన ఈ పాటను డైరెక్టర్ సి.ఎస్.రావు చిత్రీకరించారు. గంభీరమైన, ఉద్రిక్తతతో కూడిన విషాద నేపథ్యగీతాలు పాడాలంటే ఘంటసాలగారికి ప్రత్యమ్నాయ గాయకుడే లేడని దర్శక నిర్మాతలంతా గాఢంగా విశ్వసించిన కాలమది. ఘంటసాలగారు పాడినన్ని శోకమయ నేపథేయగీతాలను మరే గాయకుడు పాడలేదంటే అది అతిశయోక్తి కానేకాదు.

ముక్కోణ ప్రేమకధయైన జీవితచక్రం సినిమాకు గొప్ప ఆశాజ్యోతి శంకర్-జైకిషన్ ల సంగీతం. నిజానికి ఈ సినిమా సంగీత దర్శకుడు శంకర్. ఏవో కారణాల వలన వృత్తిపరంగా శంకర్ జైకిషన్ ల జోడీ ఏనాడో విడిపోయినా రాజ్ కపూర్ మీది గౌరవంతో వీరిద్దరిలో ఎవరు ఏ సినిమా చేసినా సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లు వుండేలా ఒప్పందం జరిగింది. ఆ రకంగా 'జీవితచక్రం' సంగీతం శంకర్ సమకూర్చారు. మొత్తం ఏడు పాటల్లో ఒక పాట రెండుసార్లు వేర్వేరు గొంతులతో వినిపిస్తుంది ఈ సినిమా లోని పాటలను ఆరుద్ర, సి.నా.రె. వ్రాయగా ఘంటసాల, హిందీ నేపథ్యగాయని శారదపి.సుశీలఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వసంతలు పాడారు. ఘంటసాలగారు ఈ సినిమాలో సుశీలగారితో ఒక పాటకూడా పాడకపోవడం ఒక విశేషం.

మాస్టారు ఈ సినిమాలో రెండు డ్యూయెట్లనురెండు సోలోలను పాడారు.  ఈ పాటల రికార్డింగ్  బొంబాయి (ఆనాడు) ఫిలిం సెంటర్ స్టూడియోలో జరిగింది. అందుకుగాను గాయనీగాయకులు అంతా మద్రాసు నుండి బొంబాయి వెళ్ళారు.

ఘంటసాలగారు పాడవలసిన నాలుగు పాటలకోసం ఒకవారం రోజులు షెడ్యూల్ చేశారు. ఘంటసాలగారికి పామర్తి-సంగీతరావులా; కెవిమహాదేవన్ కు పుహళేందిలారాజేశ్వరరావుగారికి రాజగోపాల్-కృష్ణన్ లా శంకర్ జైకిషన్ లకు చిరకాల సంగీత సహాయ దర్శకులు దత్తారాం-శెబాస్టియన్లు. శంకర్ జైకిషన్ ల స్వరకల్పనలో రూపొందిన పాటలన్నిటికీ హెవీ ఆర్కెష్ట్రా ను ఉపయోగించడం ఆనవాయితీ. ఆ అలవాటు ప్రకారం జీవితచక్రంలో ఘంటసాలగారు పాడిన పాటలన్నింటికీ 40-50 మందికి తక్కువలేకుండా వివిధ రకాలైన వాద్యాలను ఉపయోగించారు. ఏ హంగుఆర్భాటం లేకుండా సాదాసీదాగా కనిపించే ఈ 'మద్రాసి'ని (ఘంటసాల) అక్కడి ఆర్కెష్ట్రా ప్లేయర్స్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రెండు ఫైనల్ రిహార్సల్స్ చూసి ఘంటసాలగారు మైక్ ముందు నిల్చొని గళం విప్పేటప్పటికి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ఆ వాయిస్ లోని డెప్త్ కు, మెలోడికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంతవరకు ఘంటసాల అనే గాయకుడి మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏడు రోజుల్లో చేయాలనుకున్న ఆ నాలుగు పాటలను ఘంటసాలగారు మూడురోజుల్లోనే పాడి ముగించారు. ఆ నాలుగు పాటల కంపోజిషన్ తనకే ఇబ్బంది కలిగించలేదని, అవి పాడడంలో తానేమీ కష్టపడలేదనిఅలాటి పాటలు రోజుకు రెండు మూడైనా పాడవచ్చని ఘంటసాలగారు తమ సన్నిహితులకు చెప్పడం నాకు గుర్తుంది.  శంకర్-జైకిషన్ ల పాటలన్నీ ఎప్పుడో ఎక్కడో వారి పాత సినిమా లలో విన్నట్లనిపిస్తాయి. అలాగే జీవితచక్రంలోని పాటలన్నీ  శంకర్ జైకిషన్ ల హిందీ పాటల ఛాయల్లోనే వినిపిస్తాయి.

నేటి మన సజీవరాగం 'సుడిగాలిలోన దీపం' పాటను అన్యస్వరాలతో కూడిన హిందోళరాగంలో స్వరపర్చడం జరిగింది. అనేకమైన వైయొలిన్స్, పియోనాగిటార్, మేండలిన్స్ట్రంపెట్స్ వంటి వెస్ట్రన్ టైప్ ఆర్కెష్ట్రా తో ఈ పాటను మనసుకు హత్తుకుపోయేలా శంకర్ కంపోజ్ చేశారు. ఘంటసాలవారి కంఠంలో ఈ పాట మరింత రిచ్ గా వినిపించింది. ఘంటసాలగారి చేత మరెన్నో హిందీ చిత్రాలలో పాటలు పాడిస్తానని, ఫ్రెంచ్జర్మన్, ఇంగ్లీషు భాషలలో ప్రైవేట్ ఆల్బమ్స్  పాడిస్తానని కొన్ని నెలలు బొంబాయి లోనే వుండమని శంకర్ బలవంతం చేశారట. కానీమద్రాసు వాతావరణానికి అక్కడి వృత్తిపరమైన వ్యవహారశైలికి బాగా అలవాటు పడిన ఘంటసాల బొంబాయి లో వుండడానికి ఇష్టపడలేదు. తెలుగు సినిమాలకు సంబంధించినంతవరకు తాను ఉన్న ఉన్నతస్థాయి తనకు చాలని అంతకుమించిన ఆశలేదనే అభిప్రాయాన్ని సున్నితంగా వెల్లడించి మద్రాసు తిరిగి వచ్చేశారు. మొత్తం మీద శంకర్-జైకిషన్ ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన ఏకైక తెలుగు సినిమా ' జీవితచక్రం' లోని పాటలన్ని బాగానే హిట్ అయాయి. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



Saturday, 12 July 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 90వ భాగం - గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది చిత్రం - పవిత్రబంధం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైతొమ్మిదవ భాగం ఇక్కడ

90వ సజీవరాగం - గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది

చిత్రం - పవిత్రబంధం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర

సంగీతం - 
ఎస్.రాజేశ్వరరావు

పల్లవి : 

గాంధి పుట్టిన దేశమా ఇది

నెహ్రు కోరిన సంఘమా ఇది

సామ్యవాదం రామరాజ్యం

సంభవించే కాలమా 

                            !గాంధి..!

చరణం 1: 

సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం -2

ఉప్పొంగే నదుల జీవజలాలు

ఉప్పు సముద్రం పాలు

యువకుల శక్తికి భవితవ్యానికి

ఇక్కడ తిలోదకాలు

ఉన్నది మనకు ఓటు బ్రతుకుతెరువే లోటు 

                            !గాంధి..!

చరణం 2: 

సమ్మె ఘెరావు దొమ్మి బస్సుల దహనం లూటీ

శాంతి సహనం సమధర్మంపై విరిగెను గుండా లాఠీ

అధికారంకై పెనుగులాటలో అన్నదమ్ముల పోటీ

హెచ్చెను హింసాద్వేషం

ఏమౌతుందీ దేశం 

                            !గాంధి..!

 చరణం 3:

వ్యాపారాలకు పర్మిట్

వ్యవహారాలకు లైసెన్స్

అర్హతలేని ఉద్యోగాలు

లంచం ఇస్తే ఓ యెస్

సిఫార్సు లేనిదే శ్మశానమందు

దొరకదు రవంత చోటు

పేరుకు ప్రజలది రాజ్యం

పెత్తందార్లది భోజ్యం 

                            !గాంధి..!

మూడు వందల సంవత్సరాల తెల్లదొరల పరిపాలనానంతరం  1947లో మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. ప్రముఖ ప్రాచ్యపాశ్చాత్య దేశాల రాజ్యాంగ విధానాలలోని మంచి సిధ్ధాంతాలన్ని క్రోడీకరించి ప్రజాస్వామ్య పధ్ధతిలో నూతన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు గాంధినెహ్రూపటేల్అంబేద్కర్ వంటి  ఆనాటి  ప్రముఖ రాజకీయ నాయకులు. ఎంతో ఆదర్శవంతంగా రూపొందించబడిన మన దేశ సామ్యవాద సిధ్ధాంతం ఆచరణలోకి వచ్చేప్పటికి ఘోరంగా విఫలమయింది. స్వార్ధపరులైన పెత్తందారులదే పైచేయి అయింది. కులమతప్రాంతభాషా తత్త్వాల ప్రాతిపదికను తమకు అనుకూలంగా మలచుకొని స్వార్ధ రాజకీయ నాయకులు దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్నారు. పేదరిక నిర్మూలనం కాగితాలమీదే తప్ప వాస్తవంలో కనపడదు. అర్హులైన  లక్షలాది యువకులు నిరుద్యోగులుగా అణగారిపోతున్నారు. ఏ పూటకా పూట దినం గడవడమే గగనమై జీవించే లక్షలాది నిరుద్యోగులలో ఒక నిరుద్యోగి ఆక్రోశ గీతమే 'గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది' .ఇదే నేటి మన ఘంటసాల సజీవరాగం.

ఒకప్పుడు హిందూ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన అశోకుడి పేరు పెట్టుకున్న ఈ చిత్ర కథానాయకుడు అన్ని అర్హతలు గల ఒక పేదవాడు. ఉత్తరదక్షిణలకే ప్రాముఖ్యత నిచ్చే ఈ దారిద్ర్య వ్యవస్థలో అతనికి ఉద్యోగం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. అవమానాలతోఆకలితో అలమటించే ఈ అశోక్ చేతనున్న అర్ధరూపాయితో వేరుశనగలతో కడుపునింపుకోవాలనుకుంటున్న తరుణంలో చేతనున్న శనగల పొట్లాన్ని ముష్టెత్తుకునే ఓ నలుగురు అనాథ పిల్లలు కాకుల్లా మీదపడి ఎగరేసుకుపోయారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని శిలాసదృశంగా గాంధి తాత చూస్తూనే వున్నాడు. అశోక్ లో ఆవేశంఆక్రోశం పెల్లుబికింది... 'గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా' అని  ప్రస్తుత వ్యవస్థలోని అవకతవకలమీద ఆవేదనతో ఆలపించడం మొదలెట్టాడు. 

ఈ పాట 1971 లో వచ్చిన 'పవిత్రబంధంఅనే సినిమాలోనిది. అంటే దాదాపు ఏభైమూడు సంవత్సరాలయింది. మన దేశంలోని పేదరిక నిర్మూలన అన్న ఆశయం  ఆనాడు ఎలాగున్నదో ఈనాడు అలాగే ఆశయంగానే మిగిలి వుండడం మనకు తెలియనిది కాదు. శ్రీ శ్రీయోఆత్రేయోకొసరాజో వ్రాయవలసిన ఈ పాటను ఆరుద్ర వ్రాసారు. అరసంవిరసం వంటి ఉద్యమ సంస్థలతో ఎంతో కొంత సంబంధముండిన ఆరుద్ర --- 'సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం'; 'యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు': ' ఉన్నది మనకు ఓటు కానీ బ్రతుకుతెరువే లోటు'; 'శాంతి సహనం సమధర్మంపై గుండాల లాఠీ';  వంటి పదునైన పదాలనే ఉపయోగించారు. పేరుకే ప్రజల రాజ్యం కానీ భోజ్యం పెత్తందారులదే అని చెపుతూ చివరలో 'సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటుఅని అంటారు. అదే ఈ పాటకు హైలైట్. 

'పవిత్రబంధం' సినిమా సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు సన్నివేశానికి పరిపుష్టి కలిగేలా ఒక అద్భుతమైన వరసతో ఈ పాటను సమకూర్చారు. అందుకోసం ఆయన ఈ పాటకు 'భైరవి' రాగ స్వరాలను తీసుకున్నారు. భైరవి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణరాగమైనా మేళకర్త రాగంకాదు. రెండు రకములైన ధైవతాలు( ద) ఉండడం వలన ఈ భైరవిని భాషాంగరాగంగా పరిగణిస్తారు. ఇది 20వ మేళకర్త రాగమైన నఠభైరవి జన్యం. ఈ భైరవి రాగాన్ని హిందుస్థానీ బాణీలో 'తోడి' అంటారు. ఇటువంటి సంప్రదాయ రాగ లక్షణాలన్నింటిని పూర్తిగా జీర్ణించుకొని పరిపూర్ణ అవగాహన తో గానం చేసే అపురూప గాయకుడు మన ఘంటసాల మాస్టారు. సన్నివేశాన్నిసాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని భావగాంభీర్యంతో ఆలపించడం ఘంటసాలవారికి వెన్నతో పెట్టిన విద్య.

ఘంటసాల పాడిన పాటకు నటించడమంటే తెరమీది నటులకు నల్లేరు మీద బండి ప్రయాణమే. అందులోనూ ఎ.ఎన్.ఆర్.కైతే చెప్పనే అక్కరలేదు. ఆయనే ఈయనఈయనే ఆయన. ఆ రకంగా 'గాంధి పుట్టిన దేశమా' పాట ఎప్పటికీ సజీవ రాగమే.

రాజేశ్వరరావు గారు ఈ పాటలోని ప్రధాన వాద్యంగా ఎకార్డియన్ ను ఉపయోగించారు. ఎకార్డియన్ అనగానే మనకు చటక్కున జ్ఞాపకం వచ్చేది రాజ్ కపూర్, శంకర్-జైకిషన్లే.  ఆనాడు మన సౌత్ సినిమాలలో  వచ్చే ఎకార్డియన్ పాటలన్నింటిని ఎక్కువగా మంగళమూర్తి అనే ఆయన వాయించేవాడు. ఘంటసాలగారి ఆర్కెష్ట్రా లో కూడా తరుచూ కనిపించేవాడు. రాజేశ్వరరావుగారు ఎకార్డియన్ తో పాటు ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, పియోనా, తబలాడోలక్బాంగోస్ వంటి వాద్యాలను వినిపించారు.

ఈ పవిత్రబంధం సినిమాలోని ఎనిమిది పాటల్లో ఘంటసాల మాస్టారు రెండు డ్యూయెట్ లనుఈ సోలో సాంగ్ ను ఆలపించారు. ఈ మూడు పాటలు ఈనాటికీ ఇంకా వినిపిస్తూనేవున్నాయి. 

ఎ.ఎన్.ఆర్., హీరోయిన్ లు గా కాంచన, వాణిశ్రీ నటించిన పవిత్రబంధం సినిమాను వి.మధుసూదనరావు దర్శకత్వం వహించగా అశోక్ మూవీస్ టి.గోవిందరాజన్ నిర్మించారు.

మన దేశంలో రామరాజ్యం వచ్చి సామ్యవాదం కలకాలం నిలుస్తుందో లేదో తెలియదు కానీ ఘంటసాలగారి భావార్ద్ర కంఠం నుండి జాలువారిన ఇలాటి ఉద్వేగభరిత గీతాలు మాత్రం సదా తెలుగు హృదయాల తలుపులను తడుతూ చైతన్యవంతం చేస్తూనే వుంటాయి.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 5 July 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 89వ భాగం - చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయెనిమిదవ భాగం ఇక్కడ

89వ సజీవరాగం - చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి

చిత్రం - పెళ్ళినాటి ప్రమాణాలు
గానం - ఘంటసాల
రచన - పింగళి నాగేంద్రరావు

సంగీతం - ఘంటసాల

సాకీ - కావనగానే సరియా ఈ పూవులు నీవేగా దేవీ...

పల్లవి : 

చల్లగ చూడాలీ పూలను

అందుకు పోవాలి... దేవి 

                                    !చల్లగ!

 

చరణం 1: 

మల్లె సుగంధం మనసున జల్లి 

మళ్ళీ అల్లరి తగునా

                                    !చల్లగ!

 

చరణం 2: 

మలయానిలముల లాలనవలెనే

వలపులు హాయిగ కురిసీ -2

కలికి చూపులను చెలిమిని విరిసి

చిలిపిగ దాగుట న్యాయమా

                                    !చల్లగ!

చరణం 3:

తెలిమబ్బులలో జాబిలివలెనే

కళకళలాడుచు నిలిచి-2

జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి

పలుకక పోవుట న్యాయమా

                                    !చల్లగ!

సింప్లిసిటి - నిరాండబరత్వానికి మారుపేరు ఘంటసాల. గాయకుడిగా ఎంతో  ధనాన్ని కీర్తి ప్రతిష్టలను సంపాదించినా నిజజీవితంలో ఎటువంటి ఆడంబరం, దర్పం లేకుండా సగటు మనిషిలాగే చివరివరకు జీవించారు. తన విదేశ పర్యటనలలో కూడా తన సహజ కట్టు బొట్టు వేష భాషలను వదలని వ్యక్తి ఘంటసాల. ఘంటసాల మాట, నడతలాగే ఆయన స్వరకల్పనలలో రూపొందిన పాటలు కూడా చాలా సింపిల్ గానే ఉంటాయి. ఆయన చేసే పాట పల్లవులు, స్వరాలలోని సంగతులు, గమకాలు, వాద్యగోష్టి అన్నీ చాలా సింపిల్ గా సామాన్యశ్రోతకు అందుబాటులో వుంటాయి (సన్నివేశపరంగా మరీ అవసరమైతే తప్ప). పాట వరసలలో కాని, ఆర్కెస్ట్రేషన్ లో కానీ గందరగోళంగోలగజిబిజి ఉండవు. ఘంటసాల సంగీతంలో సౌలభ్యం ఎక్కువ అనేది జగమెరిగిన సత్యం. ఆయన చేసే పాటలలో  రెండు వందల శాతం మెలొడీ గ్యారంటీ గా వుంటుంది. 

గత వారాల సజీవరాగాలకు భిన్నంగా ఘంటసాలవారి ఈ వారపు  సజీవరాగం మన మనసులను గిలిగింతలు పెట్టే సలలితమైన సరదా ప్రేమగీతం. పాటలోని సాహిత్యం, సంగీతం, వాద్యగోష్టి అన్నీ పదికాలాలపాటు శ్రోతల హృదయాలలో నిలిచిపోయేలా రూపొందించబడిన గీతం. అదే - కె.వి.రెడ్డిగారి దర్శక నిర్మాణంలో అక్కినేని , జమున హీరో హీరోయిన్ లుగా నటించిన 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమా కోసం పింగళి నాగేంద్రరావుగారు రచించగా, స్వీయసంగీతంలో ఘంటసాలగారు ఎంతో మనోరంజకంగా ఆలపించిన 'చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి' ప్రేమగీతం.

ఓ మతిమరుపు పెద్దమనిషి సిఫార్సు లేఖ సృష్టించిన గందరగోళం మూలంగా పెళ్ళికొడుకు కావలసిన ఓ యువకుడు  ధనవంతులింటి వంటమనిషిగా మారి ఆ యింటి ఆడపడుచు అందానికి ఆకర్షితుడవుతాడు. ఆ యువతికి ఏదోవిధంగా చేరువకావాలని ఆశిస్తూంటాడు.  ఆ సుందరి జడలోనుండి జారిపడిన పూలమాలను ఆమెకే తిరిగి ఇస్తూ . 'చల్లగ చూడాలీ పూలను అందుకుపోవాలి' అంటూ సుశ్రావ్యంగా గీతాలాపన మొదలెడతాడు. అందమైన స్త్రీలను కవులు కుసుమకోమలులుగా వర్ణిస్తారు. పువ్వులంత సున్నితమైన మనస్సుగల కథానాయిక ఒక పరాయి మగవాడి ఎదుట ఎలాటి భావాలు ప్రదర్శిస్తుందో పింగళివారు ఈ పాటలో చాలా మనోజ్ఞంగా చూపించారు. ఆ అమ్మాయిలోని చిలిపితనం గురించి వర్ణిస్తూ 'మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళి అల్లరి తగునా' అంటారు. అలాగే మరో చరణంలో 'కలికి చూపులను చెలిమిని విరిసి చిలిపిగ దాగుట న్యాయమా' అని ప్రశ్నిస్తారు.  కథానాయికను తెలిమబ్బులలో దోబూచులాడే జాబిల్లితో పోలుస్తారు. 

పౌరాణిక, భక్తి, జానపద చిత్రాల మేటిగా ఖ్యాతి పొందిన కె.వి.రెడ్డిగారు సరస శృంగార సాంఘిక చిత్రాల నిర్మాణం లో కూడా అసమాన్యుడేనని 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమా నిరూపించింది. కె..విరెడ్డిగారికి చాలా ఇష్టమైన రాగం 'భీమ్ పలాస్' . అలాగే ఘంటసాల అంటే కూడా ఆయనకు అంత ఇష్టం.ఘంటసాల శక్తి సామర్ధ్యాలమీద అంత నమ్మకం. అందుకే తన సొంత చిత్రమైన ' పెళ్ళినాటి ప్రమాణాలు' సినీమా సంగీత దర్శకత్వ భాధ్యతలను ఘంటసాలగారికి అప్పగించారు కె.వి.రెడ్డిగారు. (వీరిద్దరి ఇళ్ళూ ఉస్మాన్ రోడ్ లోనే ఎదురెదురుగా ఉన్నా ఈ ఇద్దరు ఎప్పుడూ ఇళ్ళ దగ్గర కలుసుకోవడం నేను చూడలేదు. కె.వి.రెడ్డిగారు పోయినప్పుడు మాత్రం ఆయన మృతదేహానికి శ్రధ్ధాంజలి ఘటించడానికి ఘంటసాల మాస్టారుతోనేను వారింటికి వెళ్ళేను.)

కె.వి.గారి సినిమా అంటే అది పౌరాణికమైనాజానపదమైనాసాంఘికమైనా పాటలు మాత్రం ఆయన ఆస్థాన కవి పింగళి వ్రాయవలసిందే. కె.వి.రెడ్డి, పింగళిగార్ల అభిరుచులు,వ్యవహార సరళి క్షుణంగా ఎరిగిన ఘంటసాల 'పెళ్ళినాటి ప్రమాణాలు' లోని పద్యాలతోపాటు పది పాటలను చాలా రసరమ్యంగా స్వరపర్చారు. ఈ చిత్రంలోని చాలా పాటలను ఈనాటికీ అందరూ పాడుకుంటూనే వున్నారు. పింగళి రాసిన ఈ పాటలను ఘంటసాల, పి.లీలపి.సుశీల, మాధవపెద్ది ఆలపించారు.

ఈ నాటి మన సజీవరాగాన్ని కెవిరెడ్డి గారికి ఎంతో ప్రీతిపాత్రమైన 'అభేరీ/భీమ్ పలాస్' రాగంలోనే స్వరపర్చి అత్యంత మనోహరంగా ఆలపించారు ఘంటసాల. అభేరీ రాగం ఔఢవ సంపూర్ణరాగం. ఆరోహణలో ఐదు స్వరాలతోఅవరోహణంలో ఏడు స్వరాలతో నిండిన రాగం. కర్ణాటక సంగీత శైలిలో 22వ మేళకర్త  ఖరహరప్రియకు జన్యరాగం ఈ అభేరి. ఈ అభేరి అనే పేరును ముత్తుస్వామి దీక్షితులవారు పెట్టిన పేరు. ఈ రాగాన్నే దేవగాంధారి అని కూడా అంటారు. ఈ అభేరి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాలు రెండు - ఒకటి భీమ్ పలాస్మరొకటి ధనశ్రీ. పాడే పధ్ధతిని, శైలి నుడికారాన్ని బట్టి ఒక పాట అభేరి లో వున్నదా లేక భీమ్ పలాస్ లో వున్నదా అనేది నిర్ణయం జరుగుతుంది.

'చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి' పాటను ఘంటసాల మాస్టారు అభేరి రాగ పధ్ధతిలోనే స్వరపర్చి గానం చేశారు. పాట ప్రారంభమే ' కావనగానే సరియా ఈ పూవులు నీవేగా దేవీ...' అనే సంబోధనతో సాకీగా మొదలవుతుంది. సాకీలోనే అభేరి రాగ స్వరూపాన్ని మనకు కొంతవరకు వినిపించారు మాస్టారు. పాట సన్నివేశానికి తగిన స్వర గమకాలతో ఘంటసాలగారి గళం శ్రావ్యంగాసుమధురంగా సాగింది. పియానోవీణసితార్, ఫ్లూట్, క్లారినెట్, తబలాడోలక్, వంటి వాద్యాలను ఉపయోగించారు. తెరమీద నాయకనాయికలుగా అక్కినేని , జమున ఈ పాటను చాలా ముగ్ధమనోహరంగా అభినయించారు.

విలన్ పాత్ర అనేదే లేకుండా,  వినోదప్రధానంగా, సందేశాత్మకమైన చక్కటి కుటుంబగాధా చిత్రంగా 'పెళ్ళినాటి ప్రమాణాలు'  సినిమాను  తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించారు దర్శక నిర్మాత కె.వి.రెడ్డి. ఈ చిత్ర విజయానికి ఘంటసాలగారి సంగీతం ఎంతో దోహదం చేసింది.

సంగీతం వచ్చినవారు, రానివారు అందరూ సులభంగా పాడుకునే రీతిలో స్వరపర్చబడిన ఈ గీతం అప్పుడు, ఇప్పుడూ,ఎప్పుడూ సజీవరాగమై మన మనసులకు హాయిని కలిగిస్తూనేవుంటుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 28 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 88వ భాగం - ఆవేశం రావాలి ఆవేదన కావాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయేడవ భాగం ఇక్కడ

88వ సజీవరాగం - ఆవేశం రావాలి ఆవేదన కావాలి 

చిత్రం - మనసు మాంగల్యం
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - 
పెండ్యాల

పల్లవి : 

ఆవేశం రావాలి ఆవేదన కావాలి-2

చరణం 1:

గుండెలోని గాయాలు

మండించే గేయాలు

వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు

రగలాలి విప్లవాలు

                                !ఆవేశం!

చరణం 2:

నరజాతిని భవితవ్యానికి

నడిపేదే ఆవేశం

పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన

వేగంతో వేడిమితో 

సాగేదే జీవితం సాగేదే జీవితం 

                                !ఆవేశం!

చరణం 3

రణదాహం ధనమోహం కాలి

కూలిపోవాలి సమవాదం 

నవనాదం ప్రతియింటా పలకాలి

ప్రతి మనిషి క్రాంతి కొరకు

రుద్రమూర్తి కావాలి-2

                                !ఆవేశం!

 చరణం 4:

తరతరాల దోపిడీల ఉరితాళ్ళను

తెగతెంచీ నరనరాల అగ్నిధార

ఉప్పెనలా ఉరికించీ

మరో కొత్త ప్రపంచాన్ని 

మనిషి గెలుచుకోవాలి

                                !ఆవేశం!

చరణం 5

నిదురించిన  నా కవితకు

కదలించిన ఆవేశం

మరుగుపడిన నా మమతకు

చెరవిప్పిన ఆవేదన

కన్నుగప్పి వెళ్ళింది! 

నన్ను మరచిపోయిందీ - 2

                                !ఆవేశం!

హృదయాంతరాళాలలోనుండి తపనవేదనఆవేశం పెల్లుబికివచ్చినప్పుడే ఉత్తమమైన సాహిత్యం గానీసంగీతం గానీ ఆవిర్భవిస్తుంది. దేశ చరిత్రలను మార్చే విప్లవోద్యమాలుగానిశాంతియుత సమరాలుగానిమారణహోమాలుగాని సంభవించేది కూడా తీవ్రమైన ఆవేశంఆవేదనల నుండే. గొప్ప గొప్ప కవుల కవిత్వానికి, మహాగాయకుల సంగీతానికి ప్రేరణ ఆ ఆవేశమూఆవేదనలే. 

రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలనిసమవాదం నవనాదం ప్రతి యింటా పలకాలని, ప్రతి మనిషి క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలని తపించి ఆవేశం చెందే ఒక కవికి జరుగుతున్న సన్మాన సభ. ఆతని కవితలు వినాలని అభిలషించే అభిమానులెందరో కవిగానానికై ఎదురుచూస్తున్నారు. ప్రేమ వైఫల్యంతో త్రాగుడుకు బానిసైన ఆ కవి  ప్రేక్షకుల కోరికను కాదనలేక త్రాగుడు మైకంలోనే వేదికనెక్కి 'ఆవేశం రావాలి ఆవేదన కావాలిఅని అచ్చం  ఘంటసాలలా  ఆలపిస్తాడు. ఆ  ఉద్వేగ  ఆవేశభరిత గీతమే నేటి మన సజీవరాగం. 'మనసు-మాంగల్యం' అనే సినిమా కోసం 'తెలంగాణ కోటి రతనాల వీణ' గా భాసిల్లిన కవికోకిల దాశరథిగారి భావావేశాలనుండి ఉద్భవించిన సినీ గేయమిది. సినీగీత రచయితగా నవరసాలతో నిండిన పాటలెన్నింటినో సన్నివేశానుగుణంగా రచించారు. సామ్యవాదంతో నవప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలని ఈ గీతం ద్వారా పిలుపునిచ్చారు దాశరథి. చిత్రంలోని కథాపాత్ర త్రాగుడు మైకంలో వున్నందున అతని మనసు, ఆలోచనలకు తగినట్లుగానే దాశరథిగారి భావాలుపదజాలం కూడా కలగలుపుగా అనిపిస్తాయి.

'మనసు-మాంగల్యం' సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు. తెలుగు సినిమా అత్యుత్తమ సంగీత దర్శకులలో ప్రముఖులు. చేసేది సాంఘికమైనాపౌరాణికమైనాజానపదమైనా పెండ్యాలగారి ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. అక్కినేని కథానాయకుడిగాపెండ్యాల సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రాలెన్నింటిలోనో ఘంటసాలగారు అద్భుతమైన పాటలెన్నో పాడారు. అలాటివాటిలో ఈ 'ఆవేశం రావాలి ఆవేదన కావాలి' పాట కూడా మకుటాయమానంగా నిలుస్తుంది.

పెండ్యాలగారు ఈ పాటను సౌదామిని రాగ స్వరాలతోపాటు ఆ రాగంలో లేని రిషభాన్ని కూడా అన్య స్వరంగా చేర్చి మిశ్ర సౌదామినిగా మలచినట్లు భావించవచ్చును. అటు కర్నాటక సంగీతంలోగానిఇటు సినిమా సంగీతంలోగాని సౌదామిని రాగంలో వుండే కృతులుగాని, పాటలుగాని చాలా అరుదు. ఈ విషయంలో ఘంటసాలగారే ఆద్యుడని చెప్పాలి. 'బందిపోటు'లోని 'ఊహలు గుసగుసలాడే' పాట ద్వారా సౌదామిని రాగాన్ని తెలుగువారికి పరిచయం చేశారు.(అంతకుమించి ఎక్కువగా చర్చించడం ఇక్కడ సముచితం కాదు) సౌదామిని 57వ మేళకర్త రాగమైన సింహేంద్రమధ్యమ రాగానికి జన్యరాగం. పెండ్యాలగారు ఈ పాటను పూర్తిగా వైయొలిన్స్, సెల్లోట్రంపెట్స్, వైబ్రోఫోన్తబలాడోలక్ వంటి వాద్యాలతో స్వరపర్చారు.

తెరపైని అక్కినేని వారికి ఏ రకమైన మాడ్యులేషన్ తో ఏవిధమైన ఎక్స్పెషన్ తో పాడాలో  తెర వెనకని ఘంటసాల మాస్టారికి బాగా ఎరికే. సన్నివేశానికి కావలసిన ఆవేశాన్నంతా తన కంఠంలో పూరించి ఈ విప్లవ నినాదగీతాన్ని భావగాంభీర్యంతో ఆలపించి తెరమీది ఎ.ఎన్.ఆర్.కు దీటుగా నటించారు. చివరిలోని దగ్గు కూడా ఘంటసాలగారిదే.

ఘంటసాలగారు తన కచేరీలలో దేవదాసులోని జగమే మాయకు పరిచయ వాక్యాలు చెపుతూ 'చివరిలోని దగ్గు కూడా నాదే బాబూ! నాగేశ్వరరావు గారిది కాదు' అని చెప్పేవారు. అలాగే ఈ పాటలోని చివరి దగ్గు కూడా ఘంటసాలగారిదే ఎ.ఎన్.ఆర్.ది కాదు.

మనసు మాంగల్యం చిత్ర దర్శకుడు కె.ప్రత్యగాత్మ. ఎ.ఎన్.ఆర్. హీరోగా ప్రత్యగాత్మ అనేక విజయవంతమైన సినిమా లు అందించారు. నిర్మాత కోగంటి కుటుంబరావుగారు చిత్ర నిర్మాతగా కంటే మా పక్కింటాయనగా మాకు పరిచితులు. వారింటికి మా ఇంటికి మధ్య ఒక చిన్న పిట్టగోడ మాత్రమ అడ్డు. వారి అమ్మాయి ఆ గోడదూకి వచ్చి మా ఇంటి పిల్లలతో ఆటలాడుకునేది. నాకు తెలిసినంతవరకు కోగంటి కుటుంబరావు గారు  రెండే సినిమా లు తీసిన గుర్తు -  ఎ.ఎన్.ఆర్.తో 'మనసు మాంగల్యం', ఎన్,టి.ఆర్.తో 'దీక్ష'. ఘంటసాల మాస్టారు పాడిన ఆఖరి చిత్రాలలో దీక్ష కూడా ఒకటి. మనసు మాంగల్యం సినిమా లో  ఘంటసాలగారు  రెండు డ్యూయెట్ లు, రెండు సోలోలు పాడారు. వాటిల్లో దాశరథిగారు వ్రాసిన ' ఆవేశం రావాలి ఆవేదన కావాలి' పాట నేటికీ సజీవంగా నిలిచిపోయింది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...