Saturday, 8 November 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటయరవ భాగం ఇక్కడ

107వ సజీవరాగం - బలే మంచి రోజు

చిత్రం - జరిగిన కథ
గానం - ఘంటసాల
రచన - డా.సి.నారాయణరెడ్డి

సంగీతం - ఘంటసాల

పల్లవి:

బలే మంచిరోజు పసందైన రోజు

వసంతాలు పూచే నేటి రోజు

హా..య్.. వసంతాలు పూచే నేటి రోజు

చరణం 1:

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు

గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు ! గుండెలోని!

నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు 

                                                !బలే మంచి రోజు!

చరణం 2:

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు

తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు! చందమామ!

కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు 

                                                !బలే మంచి రోజు!

లలితసినిమా గీతాలకు తన కచేరీల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించిశాస్త్రీయ సంగీత కచేరీల పధ్ధతిలో లలిత సంగీతానికి కూడా  ఒక మర్యాదనువిశిష్టతను, ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టిన ఖ్యాతి గానగంధర్వుడు ఘంటసాలగారికే దక్కుతుంది. లలితసినీమా గీతాలతో సంగీత కచేరీలు చేసే సత్సాంప్రదాయం ఘంటసాలగారితోనే ప్రారంభమై ప్రజా బాహుళ్యంలో ఒక గుర్తింపును పొందిందని చెప్పవచ్చును.

ఘంటసాలవారు తన లలిత సంగీత కచేరీలకు ఒక నూతన ఒరవడిని, క్రమశిక్షణను ఏర్పర్చారు. తన కచేరీ వేదికకు ఒక మర్యాదను, పవిత్రతను కల్పించారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులులాగే పరిమిత వాద్యగోష్టితో  వేదికమీద కూర్చొనే పాడేవారు. ఒక చేత పాటల పుస్తకం, మరో చేయి చెవిమీద పెట్టుకొని పాడడం ఘంటసాలగారి అలవాటు. ఎన్నో వందల కచేరీల అనుభవం వుండీ కూడా ఆయన పుస్తకం చూడకుండా  ఏ పాటా పాడేవారు కాదు. గతం తరంలో అనేకమంది మహావిద్వాంసులంతా తమ కచేరీలను 'ఆది నాట అంత్య సురట' అనే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు. అంటే తమ కచేరీలను నాట రాగంతో ప్రారంభించి చివర సురటి రాగంతో ముగించేవారు. నాట, సురటి రెండు రాగాలు జన్యరాగాలే అయినప్పటికీ అత్యంత శుభప్రదమైన రాగాలుగా భావిస్తారు. అలాగేఘంటసాలవారు కూడా తన సినీ గీత కచేరీలలో ఒక క్రమపధ్ధతిని పాటించారు. తన కచేరీలో మొదటి గీతంగా 'వినాయకచవితి' సినిమా లోని 'దినకరా శుభకరా దేవా..' తో ప్రారంభించి ఆఖరున 'బ్రతుకుతెరువు' సినిమాలోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు.  'దినకరా' పాట లోకరక్షకుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పాడే పాట. పంతువరాళి లేక కామవర్ధని అనే రాగంలో ఘంటసాలవారే స్వరపర్చిన గీతం. ఈ రాగాన్నే హిందుస్థానీ బాణీలో పూర్యాధనశ్రీ అని అంటారు. ఆఖరు పాట 'అందమే ఆనందంహిందుస్థానీ భీంపలాస్ రాగంలో ఘంటసాలగారే చేశారు. దీనిని కర్ణాటక సంగీత శైలిలో అభేరి అంటారు. ఈ రెండు గీతాలు రెండు విధాలైన మూడ్స్ ను శ్రోతలలో రేకెత్తించి ఆనంద పరవశులను చేసేవి. (ఈ రెండు పాటలు రావడానికి ముందు ఘంటసాలగారు తన కచేరీలలో తమ గురువుగారి కృతులు పద్యాలతో, కరుణశ్రీజాషువాపద్యాలతో, జానపద గీతాలతో కచేరీలు చేసేవారని చెప్పగా విన్నాను). 

తర్వాతి కాలంలో అంటే 1969లో తన స్వీయసంగీతంలో ఆలపించిన 'జరిగినకథ' చిత్రంలోని సి.నారాయణరెడ్డిగారి 'బలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజుఅనే పాట బహుళ జనాదరణ పొంది ఘంటసాలవారి కచేరీలలో ఆఖరి వరస పాటలలో చోటు చేసుకుంది. 'అందమే ఆనందం' లేదా 'బలే మంచిరోజు' ఈ రెండు పాటలలో ఏదో ఒక పాటతో మాస్టారు తన కచేరీని ముగించేవారు.

అటు ఘంటసాల మాస్టారికి, ఇటు కోట్లాది తెలుగువారికి హృదయరంజకమైన 'బలే మంచి రోజు పసందైన రోజు' పాటే ఈ ధారావాహికకు ముగింపు సజీవరాగం గా మీకు సమ‌ర్పిస్తున్నాను.

యువక దశ దాటి నడివయసులో వున్న ధనిక కథానాయకుడు తన ఇంట ఆశ్రయంకోరి వచ్చిన ఓ పేద పిల్లను చూసి మనసుపడి ఆమెను వివాహం చేసుకునే తలపులో పడి మహదానంతో 'బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు అని పరవశించి పాడిన పాట. అయితే తన ప్రేమ ఫలించదని, తన తమ్ముడుఆ అమ్మాయి పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలిసి మౌనంగా తన ప్రేమను తమ్ముడి సుఖసంతోషాలకోసం త్యాగం చేసిన ఒక అన్నగారి కథే 'జరిగినకథ' సినిమా.

డా. సినారాయణరెడ్డిగారు వ్రాసిన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు 'శుధ్ధ ధన్యాసి' రాగ స్వరాలతో చేశారు. ఈ రాగాన్నే 'ఉదయరవిచంద్రిక' అని కూడా అంటారు. ఇది కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త యైన 'ఖరహరప్రియ'కు జన్యం. ఐదు స్వరాలు కలిగిన ఔడవరాగం. ప్రపంచదేశాలన్నిటిలో ఈ స్వరాలు కలిగిన స్కేల్స్ ప్రచారం లో వున్నాయి. వెస్ట్రన్ సంగీతంలో ఈ రాగాన్ని 'మైనర్ పెన్టానిక్ స్కేల్' అని, ఈస్టర్న్ కంట్రీస్ లో 'చైనీస్' స్కేల్ ' అని అంటారట.  అందుకే జనరంజకమైన రాగంలో  ఘంటసాలగారు స్వరపరిచిన 'బలే మంచి రోజు' పాట ఈనాటికీ సంగీతాభిమానులను మురిపించి మైమరపిస్తూనే వుంది. ' అందమే ఆనందం' పాటలాగే ఈ పాటకూడా పియానోను ప్రధాన వాద్యంగా చేసుకొని రూపొందించిన గీతం. పియానోతో పాటు సితార్, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్డబుల్బేస్తబలాడోలక్, తాళవాద్యాలను ఈ పాటలో ఉపయోగించారు. ఇక పాట పాడిన ఘంటసాలగారి గాత్రమాధుర్యం గురించి ఏం చెప్పగలం! తనివితీరా విని ఆనందించడం తప్ప. పాట మధ్యలో వచ్చే హమ్మింగ్స్, గమకాలు, సందర్భోచితమైన భావప్రకటనలు కేవలం ఘంటసాల మాస్టారికే సాధ్యం. అతి సునాయాసంగా, అలవోకగా ఆలపించారు.

1970లో జరిగిన కథ సినిమాను కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా 'నన్న తమ్మ' పేరుతో నిర్మించారు. తెలుగు వెర్షన్ కు డైరక్ట్ చేసిన కె.బాబూరావే కన్నడం సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వాన్ని ఘంటసాలగారే నిర్వహించారు. అయితే ఆయన ఈ సినిమా లో ఒక పాట కూడా పాడకపోవడం విశేషం. ' 'బలే మంచిరోజు' వరసలోనే చేసిన కన్నడం పాటను పి.బి.శ్రీనివాస్ ఆలపించారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తన మధుర గీతాలతో  ఆనందప్రదమైన ఎన్నో  మంచిరోజులను పంచి ఇచ్చిన గానగంధర్వుడి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మరపురాని మధుర క్షణాలను మనం మననం చేసుకుందాము.

'బలే మంచిరోజు పసందైన రోజు' 1969 లో వచ్చింది.

అంతకుముందు ఘంటసాలవారి జీవితంలో చోటుచేసుకున్న మధుర క్షణమంటే అది సావిత్రమ్మగారితో 1944 మార్చ్ లో జరిగిన వివాహమే. ఆ వివాహం జరిగిన శుభముహుర్త బలం శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారి పరిచయ భాగ్యం కలిగి సినిమా రంగంలో బంగారు భవిష్యత్తు కు బాటలు వేసింది.

1969 - తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయక పదవి.

1970 జనవరి లో భారత ప్రభుత్వ 'పద్మశ్రీ' బిరుదు ప్రదానం.

1970 ఫిబ్రవరి 1 న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లో జరిగిన అతి బ్రహ్మాండమైన 'ఘంటసాల

సినీ సంగీత రజతోత్సవం.

1971 అక్టోబర్- నవంబర్ లలో యూరప్, యు.ఎస్.కెనడా దేశాల సంగీత పర్యటన. అదే పర్యటనలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సంగీత కచేరీలో శాంతి పతకం బహుకరణ.

1972-73 లో అతి పవిత్రమైన,  ప్రతిష్టాత్మకమైన తెలుగు తాత్పర్య సహిత భగవద్గీతా గానం.

ఇవి ఘంటసాలగారు సజీవులైవుండగా  వారి జీవితం లో చోటుచేసుకున్న కొన్ని మధుర స్మృతులు, నవ వసంతాలు విరిసిన బలే మంచి రోజులు.

నిజానికి ఘంటసాల సంగీతం అనంత రసవాహిని. ఎన్ని యుగాలైనా ఈ విశ్వంలో ధ్వని అనేది వున్నంతవరకు ఘంటసాల గళం నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తూనే వుంటుంది. ఘంటసాల పాట ఏది విన్నా ఏదో ఒక స్ఫూర్తిని, ఒక గమ్యాన్ని సూచిస్తునేవుంటుంది. ఘంటసాల గీతం కలిగించే దివ్యానుభూతి తో ప్రతీరోజు ఆనందప్రదమైన రోజుగా మనసుకు హాయిని కలిగిస్తుంది.

ప్రపంచంలో ఏ ఇతర గాయకుడు పొందనంత అపరిమిత ప్రజాభిమానాన్నిగౌరవ మర్యాదలను పొందిన అద్వితీయ గాయకుడు మన ఘంటసాల. గత రెండేళ్లుగా వారి శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిర్విరామ లలిత సంగీతోత్సవాలే అందుకు నిదర్శనం. వేలాది గాయనీగాయకులుసాంస్కృతిక సంస్థలు అత్యద్భుతమైన సంగీతోత్సవాలు జరుపుతూ ఘంటసాలవారి పట్ల తమకుగల భక్తిప్రపత్తులను ప్రకటిస్తున్నారు.

ఘంటసాల శత జయంతి సందర్భంగా నేను మొదలు పెట్టిన 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగంధారావాహిక  ప్రారంభమై నేటికి 107 వారాలు అయింది. నేను గాయకుడినో లేక భాషాజ్ఞానమున్న రచయితనో కాదు. కేవలం ఘంటసాలవారి సంగీతం పట్ల గల శ్రధ్ధాసక్తులతో 'ఘంటసాల సజీవరాగాలు' శీర్షికను మీ అందరి ప్రోత్సాహంతో, ఆదరాభిమానాలతో కొనసాగించగలిగాను. ఘంటసాల సంగీతం అనంతం. ఎందరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా మనసుకందని భావాలెన్నో ఆ పాటలలో నిగూఢమైయ్యే వుంటాయి.

నాకున్న పరిమిత జ్ఞానానికి ఎక్కడో చోట, ఏదో దగ్గర ముగింపు (.) పెట్టక తప్పని పరిస్థితి. చాలామందిలాగే నాకు ఒక చిన్న ఆశ. ఘంటసాల సజీవరాగాలు అందరూ 'బాగానే వుంది' అని అనకుండా 'బాగుంది' అనే స్థాయిలోనే ముగించాలనేది నా కోరిక.  'బాగుంది', 'బాగానే వుంది' అనే మాటల మధ్య గల వ్యత్యాసం ఏమిటో మీ అందరికీ బాగా తెలిసిందే.

అందుకే ఈనాటి ఈ 'బలే మంచి రోజుపసందైన రోజుతో  ఘంటసాలవారికి భక్తిప్రపత్తులతో నివాళులు సమర్పించుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.



ప్రణవ స్వరాట్


Saturday, 1 November 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 106వ భాగం - ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటయైదవ భాగం ఇక్కడ

106వ సజీవరాగం - ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా...

చిత్రం - శ్రీకృష్ణమాయ
గానం - ఘంటసాల
రచన - 
రావూరు సత్యనారాయణ రావు
సంగీతం - టి.వి.రాజు

పల్లవి:

జీవా! జీవా! ఆ... ఆ...

ముక్తి మార్గమును కనలేవా

మాయా మోహమయ జీవా! 

                            !ముక్తి మార్గము!

 

చరణం 1:

భ్రాంతుడవై బహు మాయలబడి

యీ బ్రతుకే స్థిరమని నమ్మేవా-2

శాంతుడవై చని వెదకు మదేదో-2

శాశ్వతమగు త్రోవ.... జీవా! 

                            !ముక్తి మార్గము!

చరణం 2: 

సారము లేని సంసార జలధిబడి

సత్యానందము గనలేవా -2

దారాపుత్ర ధనధాన్యాధిక

మమకారపు జాడ్యము కొన్నావా... జీవా! 

                               !ముక్తి మార్గము!

చరణం 3: 

మిథ్యామయమౌ మాయాజగమిది-2

మది విడువుమురా జీవా-2

నిత్యసత్యమౌ పరంజ్యోతిగని

దరిజేరుమురా జీవా! 

                            !ముక్తి మార్గము!

 కనలేవా... జీవా...

"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపహః" అనే సామెత  ఎప్పుడైనా విన్నారాజపం విడచి లొట్టల్లోపడడంలాటిదే! దీని వెనుక చిన్న తమాషా కథ ఒకటి వుంది.

నీతి నియమాలు లేకుండా, చపలచిత్తంతో మాయామోహ సాగరంలో కొట్టుమిట్టాడే తొంభైతొమ్మిది శాతం గంజాయి సన్యాసులను ఉద్దేశించి శ్రీ రామకృష్ణ పరమహంస తన "కథామృతం" లో చెప్పిన పిట్టకథ.

ఊరికి దూరంగా ఉండే అడవిలో ఒక సన్యాసి  ఒంటరిగా తపస్సు చేసుకుంటూవుండేవాడు. జన్మరాహిత్యంతో కూడిన ముక్తిని పొంది పరమాత్ముని సన్నిధి చేరాలని అతని సంకల్పం. అలా ముక్కుమూసుకొని జపం చేసుకునే ఆ సన్యాసికి అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. బక్కచిక్కిన దేహాన్ని కప్పిపుచ్చే చాలీచాలని అంగవస్త్రాలను, కౌపీనాలను(గోచీలు) ఎలుకలు వచ్చి పాడుచేయడం మొదలెట్టాయి. ఆ ఎలుకల బెడదనుండి తప్పించుకునేందుకు ఆ సన్యాసి ఒక పిల్లిని పెంచడం మొదలెట్టాడు. ఆ పిల్లి ఆకలి తీర్చే పాలకోసం ఒక ఆవును తెచ్చి కూటీరంలోపెట్టాడు. ఆ ఆవును సంరక్షించడం కోసం ఒక పనివాడిని ఏర్పాటు చేయవలసివచ్చింది. ఆ కుర్రాడి ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక ఆడదిక్కు కావలసివచ్చింది. సన్యాసులుండే చోట ఆడవాళ్లు ఎలావుంటారు. తన గోచీలనుపిల్లినిఆవునుపని పిల్లవాడిని సరంక్షించేందుకు ఒక స్త్రీని పెళ్ళాడవలసి వచ్చింది. క్రమక్రమంగా తన లక్ష్యసాధనలో వెనకబడ్డాడు. ఇహలోక వాంఛలకు దూరంగావుంటూ ముక్తిని పొందాలనుకున్న ఆ సన్యాసి  సంసార జంఝాటంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు.

ముక్తి సాధన కోసం మరొక జన్మ ఎత్తకా తప్పలేదేమో ఆ సన్యాసికి. 'మిథ్యామయమౌ మాయా జగమిది... నిత్య సత్యమౌ పరంజ్యోతిగని దరిజేరుమురా... ముక్తిమార్గమును కనలేవా... జీవా!' అని భూలోకవాసులను ఆశాపాశములనుండి సంరక్షించి ఉధ్ధరిస్తానని అహంకారంతో  ఒక సినీ  నారదుడు  ఆలపించిన గీతమే నేటి మన సజీవరాగం.

భారతీయ ఆథ్యాత్మిక, తాత్త్విక చింతనలో ప్రధానమైనది ముక్తి సాధన. అసలు ముక్తి అంటే ఏమిటి?దానిని పొందడానికి సనాతనాచారపరులు ఎందుకంత తాపత్రయపడతారు?

ముక్తి అంటే విముక్తి, అంటే విడుదల. జననమరణాలనుండిఇహలోక భవబంధాలనుండి, ఆశాపాశ వలయం నుండి శాశ్వత స్వాతంత్ర్యం. బాహ్యదృష్టికి అగోచరమై సకల ప్రాణులను తన ఆధీనంలో వుంచుకునే ఆ పరమాత్మలో లీనమై శాశ్వత ఆనందస్థితికి చేరుకోవడమే ముక్తి.

అయితే ఈ ముక్తి సాధన అంత సులభమైనది కాదు. పంచేంద్రియాలను తన ఆధీనంలో వుంచుకొనిఇహలోక వాంఛలకు, సుఖాలకు అతీతంగామనసావాచాకర్మేణా సత్య ధర్మాలను పాటిస్తూ సదా భగవత్చింతనలోనే కాలంగడపాలి. ఎన్నో జన్మల కర్మ పరిపక్వత చెందితేనే కానీ ముక్తి సాధ్యంకాదు. ముక్తి సాధనకై మన వేదాంతులు అనేక మార్గాలను సూచించారు. వాటిలో ప్రముఖమైనవి

సాలోక్యసారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తులు. వీటన్నిటి పరమార్థం మరుజన్మ లేకుండా పరమాత్మలో ఐక్యంకావడం.  మహామహా జ్ఞానులలైన బ్రహ్మర్షులు మొదలు సర్వ సామాన్య పామర జనాల వరకూ ప్రతీ ఒక్కరూ ముక్తిని కోరుకునేవారే. భక్తిమార్గం ద్వారా ముక్తిని పొందడానికి అందరూ భక్తిని ఆశ్రయిస్తారు. ముక్తి ద్వారా విముక్తిని ఆశించేవారు పరిపూర్ణంగా భగవంతుని పట్ల భక్తివిశ్వాసాలతో శరణాగతిని పాటించాలి.

 అలాకాకుండా ....

'నా తెలివి తేటలకు మెచ్చె నలువ యెపుడో

సిధ్ధపురుషుండ వీవని శివుడు నుడివె

మాయకందవు నీవనె మాధవుండు

ముగురయ్యలు నన్నెద పొగడిరెపుడో'

 (వారణాశి సీతారామశాస్త్రి గారి పద్యం)

అని తనంతటి జ్ఞాని, మహాయోగి  లేడని, త్రిమూర్తులే తన మాటలకు లొంగిపోతారని అహంకారంతో విర్రవీగే నారదుడు, సంసారబంధమనే మాయలో పడి  జన్మ నిరర్ధకం చేసుకుంటున్న మానవులను ఉధ్ధరిస్తానని 'దారాపుత్ర ధనధాన్యాధిక మమకారపు జాడ్యము కొన్నావా.. జీవా! ముక్తి మార్గమును కనలేవా!' అని  జాలిపడే నారదునికి శ్రీకృష్ణుడు తన మాయతో   భార్యపుత్రులను అంటగట్టి మాయా సంసారకూపంలో పడవేసి ఆ మోహంనుండి   బయటపడలేక అతి సామాన్య పామర గృహస్తులా అజ్ఞానంతో ప్రవర్తించే నారదుని అహం అణచి జ్ఞానోదయం కలిగించడం  'శ్రీకృష్ణమాయ' సినిమా లోని ఒక రసవత్తర ఘట్టం. శ్రీకృష్ణుడితోపాటు ప్రేక్షకులందరికీ వినోదాన్ని కలిగించే సన్నివేశం. డైరెక్టర్ సి.ఎస్.రావు ఈ సినిమాను ఆద్యంతం చాలా వినోదభరితంగా ఆసక్తికరమైన రీతిలో తెరకెక్కించారు.

ముక్కు తిమ్మనగారి పారిజాతోపహరణంలోని 'నను భవదీయదాసుని' పద్యం ఈ సినిమా లోనే ప్రథమంగా వినవచ్చింది. కాకపోతే ఆ పద్యం శ్రీకృష్ణ, సత్యభామల పరంగా కాక నారదుడుమాయలపై చిత్రీకరించారు సి.ఎస్.రావు. అలాగే పద్యం చివరలో వచ్చే 'అరాళకుంతలాఅనే విశేషణాన్ని 'వినీలకుంతలా' గా మార్పు చేయించారు.

స్వతహగా దర్శక నిర్మాత అయిన కడారు నాగభూషణంగారు ఈ సినిమాను తాను డైరక్ట్ చేయకుండా అల్లుడు సి.ఎస్.రావుగారికి ఆ బాధ్యత ను అప్పగించారు.

రావూరు సత్యనారాయణ రావుగారి సాహిత్యం, టి.వి.రాజుగారి సంగీతంఘంటసాలవారి అద్వితీయ గళమాధుర్యం, అక్కినేని, కె.రఘురామయ్యల నటనాకౌశలం‌, వీటన్నిటితో  'ముక్తిమార్గమును కనలేవా' గీతం సజీవరాగమై మనలను అలరిస్తోంది. 

ఇదే పాటను మరొక సన్నివేశంలో మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు (కె.రఘురామయ్యగారు) కూడా పాడడం ఒక విశేషం. ఈ పాట  పాతకాలపు రంగస్థల పౌరాణిక నాటకాల ధోరణిని స్ఫురింపజేస్తుంది.  ఒకరకంగా ఘంటసాల, రఘురామయ్యగార్ల మధ్య ఈ పాట పోటీ పాటగా అనిపిస్తుంది.

టి.వి.రాజుగారు 'ముక్తిమార్గమును కనలేవా' పాటను సింధుభైరవి రాగంలో చేశారు.  వాద్యగోష్ఠిలో పెద్ద హంగామా చేయకుండా గాయకుల గాత్రాన్ని అనుసరించిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను టి.వి.రాజు సమకూర్చారు.

సింధుభైరవి కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలో బహుళ ప్రచారంలో వున్న రాగం. కర్ణాటక శైలిలో 8వ మేళకర్త హనుమత్తోడికి జన్యరాగం. హిందుస్థానీ సంగీతంలో సింధుభైరవి అసావేరి థాట్ కు చెందిన రాగం. భక్తి, కరుణ,శోకంవిరహం వంటి రసాల ఆవిష్కరణకు చాలా అనువైన రాగం సింధుభైరవి. సింధుభైరవిలో అసంఖ్యాకంగా సినీమా పాటలు వచ్చాయి. ఘంటసాలగారు పాడిన సింధుభైరవి పాటలెన్నో ఈనాటికీ అజరామరంగా శ్రోతలకు వీనులవిందు చేస్తున్నాయి. 1950-65ల మధ్య ఘంటసాలవారి గళం గురించి చెప్పాలా! అమృతతుల్యమే.  తనకు సహజంగా అలవాటైన 1-1/2 శ్రుతిలోనే 'ముక్తి మార్గమును' పాటను ఘంటసాలగారు నల్లేరుమీద బండి వాటంగా చాలా సునాయాసంగా పాడారు.  అక్కినేని-నారదుడి కి ఘంటసాల-నారదుడు పాడిన మరో అద్భుత గీతం. రాగాధారిత గీతాలెప్పుడూ శ్రోతలకు శ్రవణానందకరమే.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...