చిత్రం - పండంటి కాపురం
గానం - ఘంటసాల
రచన - దాశరథి
సంగీతం - ఎస్.పి.కోదండపాణి
'బాబూ! వినరా!
అన్నాతమ్ముల కధ ఒకటి - ప్రధమార్ధ గీతం.
'ఒక్క మాటపై ఎపుడూ నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి
నడిచారు వారు
కలతలు లేని నలుగురు సాగించారు పండంటి కాపురం....
ఆ నలుగురు నలభై కావచ్చు, నాలుగు వందలు, నాలుగు వేలు, లక్షలు, కోట్లు కావచ్చు. బుధ్ధిజీవియైన మనిషి తన శ్రేయస్సు కోసం,సమాజ శ్రేయస్సు కోసం తనకున్న పరిధిలో కొన్ని సూత్రాలను, నియమాలను ఏర్పర్చుకొని క్రమబధ్ధమైన జీవనాన్ని ప్రారంభించాడు.
సనాతన ధర్మానికి మూల సూత్రం సర్వే జనా సుఖినోభవంతు. ఈ సనాతన ధర్మాన్ని తుచ తప్పక ఆచరించినవారు ఆథ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించిన మన భారతీయులు. సమిష్టి జీవనానికి, ఉమ్మడికుటుంబ వ్యవస్థకు జీవంపోసి వృధ్ధి చేసినవారు భారతీయులు. వారికి వారి కుటుంబం ఒక స్వర్గసీమ, పవిత్ర దేవాలయం. తల్లిదండ్రులు వారికి ప్రత్యక్ష దైవాలు. వారి చెప్పిందే వేదవాక్కుగా వారు సూచించిన అడుగుజాడల్లో నడుస్తూ వారి సంతానమంతా సుఖమయ జీవితాలను గడిపారు. కలసివుంటేనే కలదు సుఖమని నిరూపించారు. తల్లిదండ్రులు లేని కుటుంబానికి అన్నగారే పెద్ద దిక్కు. అన్నే వారికి దేవుడు.
అలాటి ఒక అన్నగారి ప్రాపకంలోని ఒక సమిష్టి కుటుంబం తన కాలంలోనే తన కళ్ళముందే కక్షలు కార్పణ్యాలతో ఛిన్నాభిన్నమైనప్పుడు, అందరూ తలో దారిగా విడిపోయినప్పుడు మనసు వికలమై ఆవేదనతో క్షోభ పడే ఆ అన్నగారి విలాపమే ....' బాబూ! వినరా ! అన్నాతమ్ములా కథ ఒకటి...'
--- అదే నేటి ఘంటసాలవారి
సజీవరాగం.
అన్నదమ్ముల్లా
సమిష్టిగా, ఉమ్మడి కుటుంబంలా
మద్రాసు తమ గృహసీమగా వేలాది సినిమాలను
నిర్మించిన తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల సినీ కళాకారులు భాషా ప్రాతిపదికన విభేదాలు ఏర్పడి ఏ భాషకు ఆ భాషవారు
తలో కుంపటి పెట్టుకొని వేరింటి కాపురాలకు పోయినప్పుడు దక్షిణాదిచిత్రసీమలో అందరికి కావలసినవాడుగా ఆప్తుడు, పెద్దన్నగారిలాంటి ఘంటసాలగారు కూడా ఈ పాటలోని
పెద్దన్నగారిలాగే తీవ్రంగా చలించి విలపించి వుంటారేమోననిపిస్తుంది.
ఆశలు ఆశయాలు మాటల్లో చెప్పినంత సులభంకాదు ఆచరణలో పెట్టడం. ఒక వయసు వచ్చేవరకే అన్నదమ్ములైనా, సంతానమైనా. సొంత సంపాదన వచ్చాక స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్ర్యమంటూ రెక్కలు విప్పుకొని ఎగిరిపోయే ప్రయత్నాలు చేస్తారు. చేతివ్రేళ్ళు ఐదింటికి ఏవో విశిష్టతలున్నా వాటిలోని అసమానత్వమే అందరికీ కొట్టొచ్చినట్లు కనపడతాయి. సమిష్టి కుటుంబంలోని అందరి గుణగణాలు, విద్యాబుధ్ధులు, సంపాదన ఒకేలా వుండవు. వాటివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే అసమానత్వాలు, అహం, ఈర్ష్యాద్వేషాల వలన స్వర్గధామంలా వుండిన ఆ కుటుంబం నరకంలా మారుతుంది. ఒకే ఇంట్లో అందరూ కలిసివున్నా ఎవరికీ సుఖసంతోషాలు వుండవు. అందరూ కృత్రిమంగా జీవిస్తూంటారు. ఈ రకమైన మనోభావాలన్నీ ఘంటసాల మాస్టారు పాడిన 'బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటీ' పాటలో మనం అనుభవిస్తాము.
ప్రధమార్థంలోని పండంటి కాపురం ద్వితీయార్థంలో కృంగి కృశించే ఎండుటాకు. పండంటి కాపురం సినిమా కాన్సెప్ట్ కు ఘంటసాలగారు పాడిన ఈ పాటే జీవం. సన్నివేశపరంగా పెద్దన్నగారు ఎస్.వి.రంగారావుగారి నోట ఘంటసాలగారి హృదయాంతరాళాలలో నుండి వెలువడిన రెండవ శోకగీతం శ్రోతల గుండెలను పిండేస్తుంది. పాట వరస ఒకటేయైనా కవి దాశరథిగారి సాహిత్యం లోని వైవిధ్యం, బరువు మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. మొదటి పాటకు, రెండవ పాటకు మధ్య గల అంతరాన్ని, వైవిధ్యాన్ని ఘంటసాల మాస్టారిలా భావోద్వేగాలతో పలికించగలిగే గాయకులు లేరంటే అది అతిశయోక్తి కానేకాదు. అలాటి మహా గాయకుడి సుమధుర గాత్రాన్ని తన ట్యూన్ కు అనుకూలంగా మలచుకున్నారు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి.
1955లో గాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఎస్.పి.కోదండపాణిగారు సుసర్ల దక్షిణామూర్తి, కె.వి.మహాదేవన్ వంటి అనుభవజ్ఞుల వద్ద పనిచేసి సినీ సంగీత మెళకువలన్నీ తన కైవసం చేసుకున్నారు. కన్నకొడుకు చిత్రం ద్వారా 1961లో సంగీతదర్శక హోదాను పొందారు. తొలుత విఠలాచార్య జానపద చిత్రాల సంగీత దర్శకుడిగా ముద్ర పడిన కోదండపాణి గారు తర్వాతి కాలంలో అన్ని రకాల సినీమాలకు సంగీతం సమకూర్చి తన ప్రజ్ఞను చాటుకున్నారు. ఈ శ్రీపతిపండితారాధ్యుడు మరో శ్రీపతిపండితారాధ్యునికి గాయకుడిగా తొలి అవకాశమిచ్చి అతనికి ఆరాధ్యదైవమయ్యారు. ఈ పండంటికాపురం సినీమాలో హీరో పాడే మూడు పాటలను శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చేతనే పాడించారు.
సినిమా లో ఒకసారి సంతోషకరంగా, మరొకసారి విషాదభరితంగా వినవచ్చే 'బాబూ వినరా అన్నతమ్ములా కథ ఒకటి' అన్న ఒక్క థీమ్ పాటను మాత్రం ఘంటసాలగారు అసమానంగా ఆలపించి తన స్థాయి తనదేనని ఎలుగెత్తిచాటారు.
కోదండపాణి గారు ఈ పాటను బిలాస్ఖానీ తోడిరాగ ఛాయలలో స్వరపర్చినట్లు తెలుస్తోంది. బిలాస్ఖానీ తోడి భైరవి థాట్ కు చెందిన ఒక హిందుస్థానీ రాగం. సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మియా తాన్సేన్ పరమపదించినప్పుడు ఆయన కుమారుడు బిలాస్ఖాన్ శోకిస్తూ ఆలపించిన రాగమే బిలాస్ఖానీ తోడి రాగంగా సుప్రసిధ్ధమయిందని ఘంటసాలగారి భగవద్గీత శ్లోకాలలోని రాగరసస్ఫూర్తిని విశ్లేషించిన సందర్భంలో 'కలైమామణి' పట్రాయని సంగీతరావుగారు వివవరించారు.
కరుణరస ప్రధానమైన రాగాలను ఆలపించడంలో తనకు గల ప్రజ్ఞను మరోసారి నిరూపించి 'గంగిగోవు పాలు గంటెడైనను చాలు' అని అనిపించారు. అందుకే ఈ సినిమాను తమిళంలో 'అన్బుసగోదరర్గళ్' పేరిట తీసినప్పుడు ఈ ఒక్క పాటను ఘంటసాలగారిచేతే పాడించారు ఆ చిత్ర సంగీతదర్శకుడు కె.వి.మహాదేవన్. అక్కడ కూడా ఈ పాటను( సంతోషం & విషాదం) ఎస్.వి.రంగారావు మీదనే చిత్రీకరించారు. చాలా సంవత్సరాల తర్వాత ఘంటసాలగారు తమిళంలో పాడిన ఆ పాట అరుణాచల స్టూడియోలో రికార్డింగ్ జరిగినప్పుడు నేనూ వెళ్ళాను. తెలుగు పాటలాగే తమిళం పాట కూడా సూపర్ హిట్ అయి ఈ నాటికి ఘంటసాలను అక్కడి శ్రోతలకు జ్ఞప్తికి తెస్తోంది. సమిష్టి కుటుంబ సమస్యలపై తీసే సినిమాలలో, టివి సీరియల్స్ లో ఘంటసాల మాస్టారు పాడిన ఈ తమిళం పాట సందర్భోచితంగా ఈనాటికీ వినిపిస్తూనే వుంది.
ఎలాటి పాటలకైనా హెవీ ఆర్కెష్ట్రాను ఉపయోగించే కోదండపాణిగారు ఈ పాటకు కూడా ఎక్కువ వాద్యాలనే వినియోగించారు. బాబూ వినరా... అంటూ ఆనందంగా పాడే పాటలో కోరస్ గాయకులతోపాటు హార్ప్, వైయొలిన్స్, సెల్లో, డోలక్, తబలా, వైబ్రోఫోన్స్, సితార్, ఫ్లూట్ వాద్యాలు ప్రధానంగా వినిపిస్తాయి. ఈ పాటలో ఫ్లూట్ - నాగరాజన్ - కోదండపాణిగారి సంగీత సహాయకుడు. తర్వాతి కాలంలో డా.వెంపటి చినసత్యం డ్యాన్స్ బ్యాలేస్ లో మా నాన్నగారి వద్ద అనేక ప్రోగ్రామ్ లకు ఫ్లూటిస్ట్ గా పాల్గొనడం జరిగింది. పాట చివరలో కోరస్ వారితో ఘంటసాలవారి ఆలాపన చాలా హృద్యంగా వుంటుంది.
ఇదే పాట విషాదంగా ఆలపించినప్పుడు కబాష్, తాళాలు వినిపిస్తాయి. ఈ వెర్షన్ లో వైయొలిన్స్ తో పాటు సత్యంగారి షెహనాయ్, నాగరాజన్ ఫ్లూట్ పాటకు అదనపు బరువును తీసుకువచ్చాయి. పాట మధ్యలో అక్కడక్కడ ఎస్.వి.రంగారావుగారి వాయిస్ ను సింక్ చేస్తూ ఘంటసాలగారు పలికిన 'బాబూ, బాబూ' అనే మాటలు ఆ పాటకే హైలైట్. ఎలాటి పాషాణహృదయాన్నైనా కరిగించే శక్తి సంగీతానికి, తన గాత్రానికి వుందని ఘంటసాల మాస్టారు మరోసారి నిరూపించారు. అందుకే 'బాబూ వినరా' పాట ఐదు దశాబ్దాలుగా తెలుగు హృదయాలను ద్రవింపజేస్తూ సజీవరాగమై నిలచివుంది. ఇదొక అజరామర గీతం.
లక్ష్మీదీపక్ దర్శకత్వంలో నటుడు కృష్ణ సోదరుడు జి.హనుమంతరావు నిర్మాతగా కృష్ణ 'పండంటి కాపురం' చిత్రాన్ని జయప్రద మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఎస్.వి.రంగారావు, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, కృష్ణ, విజయనిర్మల, జమున, సరోజాదేవి, దేవిక మొదలగువారు నటించిన ఈ భారీ రంగుల సినిమా ఘనవిజయాన్ని సాధించింది. హీరోయిన్ విజయనిర్మల మేనకోడలు సుజాత (జయసుధ) కు తెరంగేట్రం జరిగింది పండంటి కాపురంలోనే. అలాగే ఆవిడ కొడుకు నరేష్ కూడా బాలనటుడిగా ఈ సినీమాలో నటించాడు.
ఇక హీరో కృష్ణ చిత్రాలలో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినీమా ఈ పండంటికాపురం. అంతేకాదు. ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఎవార్డ్, ఫిలింఫేర్ ఎవార్డ్ కూడా లభించాయి. నటుడు, నిర్మాత డా.ఎమ్.ప్రభాకరరెడ్డి కథ ఆధారంగా నిర్మించబడిన 'పండంటికాపురం' 'సున్హేరా సంసార్' గా హిందీలో కూడా నిర్మించబడింది.
ఈసినీమా కథాంశమే అన్ని భాషల్లో విజయవంతం కావడానికి ముఖ్యకారణం. సమిష్టి కుటుంబాలలో కలసివుంటే కలదు సుఖం అనే సూక్తిని ఆశగాను, ఆశయంగాను మాత్రమే ఈ రోజుల్లో చూడగలుగుతున్నాము తప్ప వాస్తవంలో, ఆచరణలో ఈ ఉమ్మడికుటుంబ వ్యవస్థ క్రమక్రమంగా కనుమరుగైపోతున్నది. ఆచరణలో కష్టసాధ్యమౌతున్న సమస్యలను సినిమాల ద్వారా, టివి సీరియల్స్ ద్వారా చూసి ఆనందిస్తున్నాము.
సమిష్టి కుటుంబ
వ్యవస్థ ఇంకా అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నది ఒక్క మనదేశంలోనే. సనాతనధర్మం పట్ల ఈ
దేశప్రజలకు గల భక్తి శ్రధ్ధలే ఇందుకు కారణం. ఈవిషయంలో నవతరం మరింత గురుతర బాధ్యత
వహించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసిన అవసరం ఎంతైనా
వుంది.
ఒక నాలుగు నిముషాల సినిమా పాట ఇంతటి సుదీర్ఘ ఆలోచనకు దోహదం చేసిందంటే ఆ పాట నిజంగా సజీవరాగమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
