Saturday, 30 August 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 97వ భాగం - బాబూ! వినరా! అన్నాతమ్ముల కథ ఒకటి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైయారవ భాగం ఇక్కడ

97వ సజీవరాగం - బాబూ! వినరా! అన్నాతమ్ముల కథ ఒకటి 

చిత్రం - పండంటి కాపురం
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - 
ఎస్.పి.కోదండపాణి

పల్లవి 

'బాబూ! వినరా! అన్నాతమ్ముల కధ ఒకటి - ప్రధమార్ధ గీతం.

 ద్వితీయార్థంలో అదే అన్నదమ్ముల కథ ఒకటి....

'ఒక్క మాటపై ఎపుడూ నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

కలతలు లేని నలుగురు సాగించారు పండంటి కాపురం....

ఆ నలుగురు నలభై కావచ్చునాలుగు వందలునాలుగు వేలులక్షలు, కోట్లు కావచ్చు. బుధ్ధిజీవియైన మనిషి తన శ్రేయస్సు కోసం,సమాజ శ్రేయస్సు కోసం తనకున్న పరిధిలో కొన్ని సూత్రాలనునియమాలను ఏర్పర్చుకొని క్రమబధ్ధమైన జీవనాన్ని ప్రారంభించాడు.

సనాతన ధర్మానికి మూల సూత్రం సర్వే జనా సుఖినోభవంతు. ఈ సనాతన ధర్మాన్ని తుచ తప్పక ఆచరించినవారు ఆథ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించిన మన భారతీయులు. సమిష్టి జీవనానికి, ఉమ్మడికుటుంబ వ్యవస్థకు జీవంపోసి వృధ్ధి చేసినవారు భారతీయులు. వారికి వారి కుటుంబం ఒక స్వర్గసీమపవిత్ర దేవాలయం. తల్లిదండ్రులు వారికి ప్రత్యక్ష దైవాలు. వారి చెప్పిందే వేదవాక్కుగా వారు సూచించిన అడుగుజాడల్లో నడుస్తూ వారి సంతానమంతా సుఖమయ జీవితాలను గడిపారు. కలసివుంటేనే కలదు సుఖమని నిరూపించారు. తల్లిదండ్రులు లేని కుటుంబానికి అన్నగారే పెద్ద దిక్కు. అన్నే వారికి దేవుడు.

అలాటి ఒక అన్నగారి ప్రాపకంలోని ఒక సమిష్టి కుటుంబం  తన కాలంలోనే తన కళ్ళముందే కక్షలు కార్పణ్యాలతో ఛిన్నాభిన్నమైనప్పుడు, అందరూ తలో దారిగా  విడిపోయినప్పుడు మనసు వికలమై ఆవేదనతో క్షోభ పడే ఆ అన్నగారి విలాపమే ....' బాబూ! వినరా ! అన్నాతమ్ములా కథ ఒకటి...'

--- అదే నేటి ఘంటసాలవారి సజీవరాగం.

 

అన్నదమ్ముల్లా సమిష్టిగా, ఉమ్మడి కుటుంబంలా మద్రాసు తమ గృహసీమగా  వేలాది సినిమాలను నిర్మించిన తెలుగు, కన్నడ, మలయాళతమిళ భాషల సినీ కళాకారులు భాషా ప్రాతిపదికన విభేదాలు ఏర్పడి ఏ భాషకు ఆ భాషవారు తలో కుంపటి పెట్టుకొని వేరింటి కాపురాలకు పోయినప్పుడు దక్షిణాదిచిత్రసీమలో  అందరికి కావలసినవాడుగా ఆప్తుడుపెద్దన్నగారిలాంటి ఘంటసాలగారు కూడా ఈ పాటలోని పెద్దన్నగారిలాగే తీవ్రంగా చలించి విలపించి వుంటారేమోననిపిస్తుంది.

ఆశలు ఆశయాలు మాటల్లో చెప్పినంత సులభంకాదు ఆచరణలో పెట్టడం. ఒక వయసు వచ్చేవరకే అన్నదమ్ములైనా, సంతానమైనా. సొంత సంపాదన వచ్చాక   స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్ర్యమంటూ రెక్కలు విప్పుకొని ఎగిరిపోయే ప్రయత్నాలు చేస్తారు. చేతివ్రేళ్ళు ఐదింటికి ఏవో విశిష్టతలున్నా వాటిలోని అసమానత్వమే అందరికీ కొట్టొచ్చినట్లు కనపడతాయి. సమిష్టి కుటుంబంలోని అందరి గుణగణాలువిద్యాబుధ్ధులు, సంపాదన ఒకేలా వుండవు. వాటివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే అసమానత్వాలు, అహంఈర్ష్యాద్వేషాల వలన స్వర్గధామంలా వుండిన  ఆ కుటుంబం నరకంలా మారుతుంది. ఒకే ఇంట్లో అందరూ కలిసివున్నా ఎవరికీ సుఖసంతోషాలు వుండవు. అందరూ కృత్రిమంగా జీవిస్తూంటారు. ఈ రకమైన మనోభావాలన్నీ ఘంటసాల మాస్టారు పాడిన 'బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటీ పాటలో మనం అనుభవిస్తాము.

ప్రధమార్థంలోని పండంటి కాపురం ద్వితీయార్థంలో  కృంగి కృశించే ఎండుటాకు.   పండంటి కాపురం సినిమా కాన్సెప్ట్ కు  ఘంటసాలగారు పాడిన  ఈ పాటే  జీవం. సన్నివేశపరంగా పెద్దన్నగారు ఎస్.వి.రంగారావుగారి నోట ఘంటసాలగారి హృదయాంతరాళాలలో నుండి వెలువడిన రెండవ శోకగీతం శ్రోతల గుండెలను పిండేస్తుంది. పాట వరస ఒకటేయైనా  కవి దాశరథిగారి సాహిత్యం లోని  వైవిధ్యం, బరువు మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. మొదటి పాటకు, రెండవ పాటకు మధ్య గల అంతరాన్నివైవిధ్యాన్ని ఘంటసాల మాస్టారిలా భావోద్వేగాలతో పలికించగలిగే గాయకులు లేరంటే అది అతిశయోక్తి కానేకాదు. అలాటి మహా గాయకుడి సుమధుర గాత్రాన్ని  తన ట్యూన్ కు అనుకూలంగా మలచుకున్నారు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి.

1955లో గాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఎస్.పి.కోదండపాణిగారు  సుసర్ల దక్షిణామూర్తి, కె.వి.మహాదేవన్ వంటి అనుభవజ్ఞుల వద్ద పనిచేసి సినీ సంగీత మెళకువలన్నీ తన కైవసం చేసుకున్నారు. కన్నకొడుకు చిత్రం ద్వారా 1961లో సంగీతదర్శక హోదాను పొందారు. తొలుత విఠలాచార్య జానపద చిత్రాల సంగీత దర్శకుడిగా  ముద్ర పడిన కోదండపాణి గారు తర్వాతి కాలంలో అన్ని రకాల సినీమాలకు సంగీతం సమకూర్చి తన ప్రజ్ఞను చాటుకున్నారు. ఈ శ్రీపతిపండితారాధ్యుడు మరో  శ్రీపతిపండితారాధ్యునికి గాయకుడిగా తొలి అవకాశమిచ్చి అతనికి ఆరాధ్యదైవమయ్యారు. ఈ పండంటికాపురం సినీమాలో హీరో పాడే మూడు పాటలను శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చేతనే పాడించారు.

సినిమా లో ఒకసారి సంతోషకరంగామరొకసారి విషాదభరితంగా వినవచ్చే 'బాబూ వినరా అన్నతమ్ములా కథ ఒకటిఅన్న ఒక్క థీమ్ పాటను మాత్రం ఘంటసాలగారు అసమానంగా ఆలపించి తన స్థాయి తనదేనని ఎలుగెత్తిచాటారు. 

కోదండపాణి గారు ఈ పాటను బిలాస్ఖానీ తోడిరాగ ఛాయలలో స్వరపర్చినట్లు తెలుస్తోంది. బిలాస్ఖానీ తోడి  భైరవి థాట్ కు చెందిన ఒక హిందుస్థానీ రాగం. సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మియా తాన్సేన్ పరమపదించినప్పుడు ఆయన కుమారుడు బిలాస్ఖాన్  శోకిస్తూ ఆలపించిన రాగమే బిలాస్ఖానీ తోడి రాగంగా సుప్రసిధ్ధమయిందని ఘంటసాలగారి భగవద్గీత శ్లోకాలలోని రాగరసస్ఫూర్తిని విశ్లేషించిన సందర్భంలో 'కలైమామణిపట్రాయని సంగీతరావుగారు వివవరించారు.

కరుణరస ప్రధానమైన రాగాలను ఆలపించడంలో  తనకు గల ప్రజ్ఞను మరోసారి నిరూపించి 'గంగిగోవు పాలు గంటెడైనను చాలు' అని అనిపించారు. అందుకే ఈ సినిమాను తమిళంలో 'అన్బుసగోదరర్గళ్' పేరిట తీసినప్పుడు ఈ ఒక్క పాటను ఘంటసాలగారిచేతే పాడించారు ఆ చిత్ర సంగీతదర్శకుడు కె.వి.మహాదేవన్. అక్కడ కూడా ఈ పాటను( సంతోషం & విషాదం) ఎస్.వి.రంగారావు మీదనే చిత్రీకరించారు. చాలా సంవత్సరాల తర్వాత ఘంటసాలగారు తమిళంలో పాడిన  ఆ పాట అరుణాచల స్టూడియోలో  రికార్డింగ్  జరిగినప్పుడు  నేనూ వెళ్ళాను. తెలుగు పాటలాగే తమిళం పాట కూడా సూపర్ హిట్ అయి ఈ నాటికి ఘంటసాలను అక్కడి శ్రోతలకు జ్ఞప్తికి తెస్తోంది. సమిష్టి కుటుంబ సమస్యలపై తీసే సినిమాలలోటివి సీరియల్స్ లో ఘంటసాల మాస్టారు పాడిన ఈ తమిళం పాట సందర్భోచితంగా ఈనాటికీ వినిపిస్తూనే వుంది. 

ఎలాటి పాటలకైనా హెవీ ఆర్కెష్ట్రాను ఉపయోగించే కోదండపాణిగారు ఈ పాటకు కూడా ఎక్కువ వాద్యాలనే వినియోగించారు. బాబూ వినరా...  అంటూ ఆనందంగా పాడే పాటలో కోరస్ గాయకులతోపాటు హార్ప్వైయొలిన్స్, సెల్లో, డోలక్తబలావైబ్రోఫోన్స్, సితార్, ఫ్లూట్ వాద్యాలు ప్రధానంగా వినిపిస్తాయి. ఈ పాటలో ఫ్లూట్ - నాగరాజన్ - కోదండపాణిగారి సంగీత సహాయకుడు. తర్వాతి కాలంలో డా.వెంపటి చినసత్యం డ్యాన్స్ బ్యాలేస్ లో  మా నాన్నగారి వద్ద అనేక ప్రోగ్రామ్ లకు ఫ్లూటిస్ట్ గా పాల్గొనడం జరిగింది. పాట చివరలో కోరస్ వారితో ఘంటసాలవారి ఆలాపన చాలా హృద్యంగా వుంటుంది.

ఇదే పాట విషాదంగా ఆలపించినప్పుడు కబాష్, తాళాలు వినిపిస్తాయి. ఈ వెర్షన్ లో  వైయొలిన్స్ తో పాటు సత్యంగారి షెహనాయ్, నాగరాజన్ ఫ్లూట్ పాటకు అదనపు బరువును తీసుకువచ్చాయి. పాట మధ్యలో అక్కడక్కడ ఎస్.వి.రంగారావుగారి వాయిస్ ను సింక్ చేస్తూ ఘంటసాలగారు పలికిన 'బాబూ, బాబూ' అనే మాటలు ఆ పాటకే హైలైట్. ఎలాటి పాషాణహృదయాన్నైనా కరిగించే శక్తి సంగీతానికితన గాత్రానికి వుందని ఘంటసాల మాస్టారు మరోసారి నిరూపించారు. అందుకే 'బాబూ వినరాపాట ఐదు దశాబ్దాలుగా తెలుగు హృదయాలను ద్రవింపజేస్తూ సజీవరాగమై నిలచివుంది. ఇదొక అజరామర గీతం.

లక్ష్మీదీపక్ దర్శకత్వంలో నటుడు కృష్ణ సోదరుడు జి.హనుమంతరావు నిర్మాతగా కృష్ణ 'పండంటి కాపురం' చిత్రాన్ని జయప్రద మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఎస్.వి.రంగారావు, గుమ్మడిప్రభాకరరెడ్డికృష్ణవిజయనిర్మల, జమునసరోజాదేవి, దేవిక మొదలగువారు నటించిన ఈ భారీ రంగుల సినిమా ఘనవిజయాన్ని సాధించింది.  హీరోయిన్ విజయనిర్మల మేనకోడలు సుజాత (జయసుధ) కు తెరంగేట్రం జరిగింది పండంటి కాపురంలోనే. అలాగే ఆవిడ కొడుకు నరేష్ కూడా బాలనటుడిగా ఈ  సినీమాలో నటించాడు.

ఇక హీరో కృష్ణ చిత్రాలలో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినీమా ఈ పండంటికాపురం. అంతేకాదు. ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఎవార్డ్, ఫిలింఫేర్ ఎవార్డ్ కూడా లభించాయి. నటుడు, నిర్మాత డా.ఎమ్.ప్రభాకరరెడ్డి కథ ఆధారంగా నిర్మించబడిన 'పండంటికాపురం'  'సున్హేరా సంసార్' గా హిందీలో కూడా నిర్మించబడింది.

ఈసినీమా కథాంశమే  అన్ని భాషల్లో విజయవంతం కావడానికి ముఖ్యకారణం. సమిష్టి కుటుంబాలలో కలసివుంటే కలదు సుఖం అనే సూక్తిని ఆశగానుఆశయంగాను మాత్రమే ఈ రోజుల్లో చూడగలుగుతున్నాము తప్ప వాస్తవంలో, ఆచరణలో ఈ ఉమ్మడికుటుంబ వ్యవస్థ క్రమక్రమంగా కనుమరుగైపోతున్నది. ఆచరణలో కష్టసాధ్యమౌతున్న సమస్యలను సినిమాల ద్వారాటివి సీరియల్స్ ద్వారా చూసి ఆనందిస్తున్నాము.

సమిష్టి కుటుంబ వ్యవస్థ ఇంకా అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నది ఒక్క మనదేశంలోనే. సనాతనధర్మం పట్ల ఈ దేశప్రజలకు గల భక్తి శ్రధ్ధలే ఇందుకు కారణం. ఈవిషయంలో నవతరం మరింత గురుతర బాధ్యత వహించి  మన  సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసిన అవసరం ఎంతైనా వుంది.

ఒక నాలుగు నిముషాల సినిమా పాట ఇంతటి సుదీర్ఘ ఆలోచనకు దోహదం చేసిందంటే ఆ పాట నిజంగా సజీవరాగమే.


సంతోషం


దుఃఖం

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  

Saturday, 23 August 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 96వ భాగం - తిరుమల మందిర సుందర

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైయైదవ భాగం ఇక్కడ

96వ సజీవరాగం - తిరుమల మందిర సుందర

చిత్రం - మేనకోడలు
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - 
ఘంటసాల

పల్లవి 
తిరుమల మందిర సుందర

సుమధుర కరుణాసాగరా

ఏ పేరున నిను పిలిచేనురా

ఏ రూపముగా కొలిచేనురా

చరణం 1: 

పాలకడలిలో శేషశయ్యపై

పవళించిన శ్రీపతివో 

వెండికొండపై    నిండు 

మనముతో వెలిగే గౌరీపతివో 

ముగురమ్మలకే మూలపుటమ్మగ 

భువిలో వెలసిన ఆదిశక్తివో

                            !!తిరుమల మందిర !!

 

చరణం 2:

కాంతులు చిందే నీ ముఖబింబము

కాంచిన చాలును ఘడియైనా-2

నీ గుడివాకిట దివ్వెను నేనై

వెలిగిన చాలొక రేయైనా

నీ పదములపై కుసుమము నేనై

నిలిచిన చాలును క్షణమైనా

తిరుమల మందిర సుందర

సుమధుర కరుణా సాగరా!!

వేంకటాద్రి సమం స్థానం నాస్తి కించన 

వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి

అని పురాణ వాక్కు. ఈ అనంతవిశ్వంలో వేంకటాద్రి కి సమానమైన పుణ్యక్షేత్రంగాని, కలియుగ దైవంగా విరాజిల్లే శ్రీ వేంకటేశ్వర స్వామికి మించిన దేవుడుగానీ ఇప్పటికి, ఎప్పటికీ మరెవ్వరూ వుండరని ఈ శ్లోకానికి అర్ధం.

శ్రీవేంకటేశ్వరునిగా,బాలాజీగాసప్తగిరీశునిగామలయప్పగా, ఇలా అనేక నామాలతో యుగాదిగా విరాజిల్లుతూ ప్రపంచవ్యాప్తంగా ఈనాటికీ భక్తజనులచే అనునిత్యము కొనియాడబడుతున్న ఈ తిరుమలగిరివాసుడైన శ్రీనివాసునికి ఇంతటి ప్రశస్తి ఎలా సంప్రాప్తించిందో!

అసలు, స్వయంభూగా వెలసిన ఈ వేంకటేశ్వరుడు ఎవరుపాలకడలిలో శేషశయ్యపై పవళించి సకలలోకాలను పాలించే శ్రీపతియాలేక, వెండికొండపై నెలకొని  నిండుమనసుతో  వెలుగొందే గౌరీపతా?అదీ కాదు, ముగురమ్మలకే మూలపుటమ్మగా ఈ భువిని వెలసిన ఆదిశక్తియా? ఎవరు ఈ తిరుమల మందిర సుందరుడు  అనే జిజ్ఞాసను పామరులకు రేకెత్తిస్తూ ఒక అద్భుతమైన పాటను మనకు ప్రసాదించారు దాశరధి కృష్ణమాచార్యులవారు. ఆ గీతమే "తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగరా"... ఇదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

మారుతున్న కాలానుగుణ్యంగా పౌరాణిక సినీమాల ప్రాభవం తగ్గి నూతన పోకడల సంగీతసాహితీ ధోరణులతో తెలుపు నలుపు యుగం నుండి క్రమక్రమంగా రంగులహంగుల సినీమా వేపు దృష్టిసారిస్తున్న సమయంలో   ఒక తెలుపు నలుపుల సాంఘిక సినీమాలో ప్రేక్షకులలో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావన పెంపొందిస్తూ ఈలాటి భక్తిగీతం చోటు చేసుకోవడంఆ పాట బహుళ జనాదరణ పొంది ఈనాటివరకు సంగీతాభిమానుల హృదయాలలో పదిలంగా గూడుకట్టుకొని వుండడం చాలా గొప్ప విషయం. ఇందుకు కారణం, ఆ పాట తిరుపతి వేంకటేశ్వరునికి సంబంధించినది కావడమా? లేక అజరామరమైన సంగీతాన్ని సమకూర్చి గానం చేసిన ఘంటసాల వేంకటేశ్వరుడి ప్రతిభా? లేక మంచి సాహిత్యాన్ని అందించిన కవి దాశరధిగారి విశిష్టతా  ఏది ఏమైనా ఒక మంచి విశ్లేషణకు అవకాశమిచ్చే మనోజ్ఞ భక్తిగీతం 'తిరుమల మందిర సుందరా....'

పల్లవిలో అనంత నామాలు గల ఆ దేవదేవుని ఏ నామంతో పిలిచిఏ రూపంతో కొలవాలని ప్రశ్నిస్తున్నాడు కవి. అలాగే చరణంలో, వేంకటేశ్వరుడు ముగ్గురు మూర్తుల సమన్వయ రూపమనే అనాది వాక్కును బలపరుస్తున్నాడాయన. నా ఉద్దేశ్యంలో, ఈ ముమూర్తుల సమన్వయ రూప కారణం చేతనే తిరుపతి వేంకటేశ్వరుడు అన్ని వర్గాలకు, మత విశ్వాసాలకు చెందిన కోట్లాది భక్తులందరిచేత సమానంగా కొలవబడి  సకల భోగాలు,నిత్య నీరాజానాలు అందుకుంటున్నాడు.

ఆఖరు చరణంలో కవి స్వామి సన్నిధిలో దివ్వెగా ఒక రేయైనాలేదా స్వామి దివ్య చరణాలపై కుసుమంగానైనా నిలవాలని ఆకాంక్షిస్తూ నవ విధ భక్తి మార్గంలోని ఆత్మనివేదనాన్ని  సూచిస్తున్నారు.

శ్రీవైష్ణవాచార్యునిగా దాశరథిగారు ఈ పాటలో తన భక్తితత్పరతను చాటిచెప్పుకున్నారు. 

ఇక సంగీతం విషయానికి వస్తే  ఈ గీతాన్ని రూపొందించడానికి సకలజన సమ్మోహనకారకమైన మోహన రాగాన్ని ఎన్నుకున్నారు ఘంటసాల మాస్టారు. మోహన రాగం కర్నాటక సంగీతంలో 28వ మేళకర్త అయిన హరికాంభోజికి జన్యరాగం. ఐదు స్వరాలు మాత్రమే కల ఔడవరాగం. 'సరిగపద', 'సదపగరి' అనే ఐదు స్వరాలు మాత్రమే ఆరోహణఅవరోహణ క్రమంలో పలికే ఈ మోహనరాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'భూప్' అని వ్యవహరిస్తారు. ఘంటసాల మాస్టారు ఈ మోహన రాగంలో కూడా అన్యస్వర ప్రయోగాలు చేసి సినీగీతాలలో మోహన రాగానికి  ఒక వినూతనత్వాన్ని కల్పించారు.

'మేనకోడలు' సినిమా కోసం స్వరపర్చబడిన ఈ భక్తిగీతం పి.సుశీల, ఘంటసాల ఇద్దరి గళాలలో విడివిడిగా గ్రామఫోన్ రికార్డ్ లుగా బహుళ ప్రచారం పొందాయి. భక్తిగీతాలమీద ముఖ్యంగా తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి పై గల ఆరాధనతో ఘంటసాల మాస్టారు ఈ పాటను మరోసారి పాడి రికార్డ్ చేశారు. మాస్టారు పాడిన పాట 'మేనకోడలు' సినిమా లో వుండదు.  ఘంటసాలగారు ముందుగా ఈ పాట ట్రాక్ పాడగా తర్వాత మరో రోజున ఎప్పుడో సుశీలగారు  వచ్చి ట్రాక్ మిక్స్ చేశారు. సుశీలగారు పాడిన వెర్షన్ మాత్రమే సినిమా లో జమునపై చిత్రీకరించడం జరిగింది.  ఈ చిత్రంలోని ఒక పాటను సెన్సర్ వారు కట్ చేయడం వలన ఆ పాట స్థానంలో మాస్టారు తిరిగి పాడిన 'తిరుమల మందిర సుందరా' పాట గ్రామఫోన్ రికార్డ్ గా తీసుకురావడం జరిగిందని  ఘంటసాలగారంటే అమిత భక్తి గల ఆ చిత్ర నిర్మాత వై సునీల్ చౌదరి  తర్వాతి కాలంలో ప్రకటించడం జరిగింది. ఆ విధంగా  సుశీలగారుఘంటసాలగారు పాడిన సుమధుర భక్తిగీతం 'తిరుమల మందిర సుందరా' పాట రూపుదిద్దుకుంది, ఆ రెండూ ఐదు దశాబ్దాలుగా వేంకటేశ్వర భక్తులనుసంగీతాభిమానులను అలరిస్తూండడం జరిగింది.

బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన మేనకోడలు చిత్రానికి మాదిరెడ్డి సులోచన గారి 'శిక్ష' నవల ఆధారం. కృష్ణజమునగుమ్మడి, రావు గోపాలరావు, సత్యనారాయణ, రాజబాబు, సూర్యకాంతం, మొదలగువారు నటించారు. ఈ సినిమా కు సంభాషణలు వ్రాసిన దాసరి నారాయణరావు  సహాయ దర్శకుడిగా పనిచేశారు.  పాటల కంపోజింగ్ అంతా ఘంటసాల మాస్టారి ఇంట్లోనే జరిగేది.  ఆ సందర్భంగా నిర్మాత సునీల్ చౌదరిగారు, డైరెక్టర్ బిఎస్ నారాయణ గారు, పాటల రచయిత లు  దాశరథి, సినారెకొసరాజు వచ్చేవారు.  అసిస్టెంట్ డైరక్టర్ దాసరి నారాయణరావు కూడా ఘంటసాలగారింటికి వచ్చి పాట సన్నివేశ పూర్వాపరాలను అత్యుత్సాహం తో వివరించడం నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత దాసరి దశ తిరిగి తెలుగు చిత్రసీమ ను ఏలిన విషయం అందరికీ తెలిసిందే.

ఘంటసాల మాస్టారుసుశీల పాడిన రెండు పాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్నచిన్న మార్పులు కనిపిస్తాయి. ఘంటసాల మాస్టారి వెర్షన్ లో సుశీల పాట ప్రారంభంలో వచ్చే హార్ప్ఫ్లూట్హార్ప్ బిట్స్ వుండవు. సరాసరి సితార్ బిట్ నుండి బిజిఎమ్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్), తర్వాత  పల్లవితో పాట ప్రారంభమౌతుంది. 

మాస్టారి కంపొజిషన్స్  ఎప్పుడూ రాగభావానికి, పద స్పష్టతకు ఎక్కువ ప్రధాన్యమిస్తారు.  పాట వరస సరళంగా వుంటుంది. నోట్స్ ఎక్కడా గజిబిజిగా కాంప్లికేటెడ్ గా వుండవు. పాట పల్లవో, చరణమో మరచిపోయేటంత సుదీర్ఘ బిజిఎమ్స్ వుండవు. చరణ చరణానికి వరస మార్చే పధ్ధతి ఘంటసాలగారి సంగీతంలో చాలా అరుదు. పల్లవి ఒక వరసలో సాగితే దానిని అనుసరించే మిగిలిన చరణాలు వుంటాయి. ఈ పాటలో వినవచ్చే దగ్గరదగ్గరి గమకాలు సుశ్రావ్యంగా వుంటూ గాయనీగాయకుల ప్రతిభకు దర్పణం పడతాయి. అనుభవం వుంటే తప్ప ఆ యా గమకాలను స్పష్టంగా పలకడం కష్టం.

ఘంటసాల మాస్టారు ఈ పాటలో హార్ప్, వైబ్రోఫోన్, ఫ్లూట్సితార్వైలిన్స్తబలడోలక్ ఇత్యాది వాద్యాలను ఉపయోగించారు.

తిరుపతి వెంకన్నలాగే, ఘంటసాలగారి 'తిరుమల మందిర సుందరా' గీతం కూడా  తెలుగువారి హృదయాలలో సుస్థిరంగా, శాశ్వతంగా నిలిచేవుంటుంది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  


Saturday, 16 August 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 95వ భాగం - నేలతో నీడ అన్నది నను తాకరాదని

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైనాలుగవ భాగం ఇక్కడ

95వ సజీవరాగం - నేలతో నీడ అన్నది నను తాకరాదని

చిత్రం - మంచిరోజులు వచ్చాయి
గానం - ఘంటసాల
రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి

సంగీతం - తాతినేని చలపతిరావు

పల్లవి 

నేలతో నీడ అన్నది నను తాకరాదని

పగటితో రేయి అన్నది నను తాకరాదని

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది

నేడు భర్తనే తాకరాదనీ ... హాహాహా...ఒక భార్య అన్నది

 చరణం 1: 

వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా

చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా

తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే నీవు లేవు, నేను లేను --- 

నీవు లేవు నేను లేను లోకమే లేదులే

                                    !నేలతో నీడ అన్నది!

చరణం 2: 

రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా 

మధుపం తను తాకనిదే మందారం మురిసేనా

మేను మేను తాకనిదే మనసు మనసు 

కలవనిదే మమత లేదుమనిషి లేడు

మమత లేదు,మనిషి లేడు మనుగడయే లేదులే 

                                    !నేలతో నీడ అన్నది!

 చరణం 3:

అంటరానితనము,ఒంటరితనము

అనాదిగా మీ జాతికి మూలధనము

ఇక సమభావం,సమధర్మం

సమజీవనమనివార్యం

తెలుసుకొనుట మీ ధర్మం

తెలియకుంటె మీ ఖర్మం

                                   !నేలతో నీడ అన్నది!

"చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం".... అని ఆనాడెప్పుడో కొసరాజుగారు అంటే  సమభావంసమధర్మం సమజీవనమనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం తెలియకుంటే మీ ఖర్మం..." అని  ఇక్కడ నిరాశానిస్పృహలతో కృంగిపోతున్న కథానాయకుడి కోసం దేవులపల్లివారంటున్నారు. మంచి సంగీతపు మెట్టుల వల్ల కొన్ని పాటలు మనసులను ఆకర్షించి జనబాహుళ్యంలో నిలిచిపోతే మరికొన్ని పాటలు సంగీతబలం లేకున్నా గీత రచయిత పాండితీప్రకర్ష వలన బహుళ జనాదరణ పొందాయి. ఆ కోవలోనికి చెందినదే ... 'నేలతో నీడ అన్నది నను తాకరాదని'

అనే 'మంచిరోజులు వచ్చాయి' చిత్రంలోని ఘంటసాలవారి ఏకగళ గీతం. అదే నేటి మన సజీవరాగం. 


సంగీతపరంగా ఈ పాటలో మనలను కట్టిపడవేసే  అద్భుతమైన సంగీతం ఏదీ వినపడదు. ఈ రకమైన వరసలు అనేకం గతంలో వినివున్నాము. ఉన్నంతలో శ్రోతలంతా సులభంగా పాడుకునే రీతిలోనే పాట వరసను మలచారు సంగీతదర్శకుడు తాతినేని చలపతిరావు గారు. అయితే, ఈ పాటలోని ప్రధానాకర్షణ అంతా కృష్ణశాస్త్రిగారి  కవితాశైలి వల్లనే.  ఈ పాట  ఆయన కాకుండా వేరెవరైనా వ్రాసివుంటే ఈనాడు మనం ఇలా తలచుకొని వుండేవారము కాదేమో!

చరణంలో ఒక దగ్గరంటారు ... 'అంటరానితనముఒంటరితనము అనాదిగా మీ జాతికి మూలధనము' అని. ఈ వాక్యంలో మూడు రకాల భావాలు స్ఫురిస్తాయి. ఒకటి ఒకప్పుడు అస్పృశ్యులుగా సమాజంలో నిరాదరణ పొందిన ఒక వర్గాన్ని సూచిస్తుంది. అయితే సన్నివేశపరంగా ఆ వర్గానికి చెందదు. ద్వేషం, కసి కారణాలతో భర్తను ఉదాసినపరుస్తున్న ఒక యువతిని ఉద్దేశిస్తూ పాడుతున్న పాట కావడం వలన ఈ వాక్యం స్త్రీ జాతికి అన్వయించవచ్చును. అలాగే, ధనమదంతో దుర్మార్గంగా పేద ప్రజలను హింసించే ధనికజాతిని కూడా ఉద్దేశించి ప్రయోగించిన వాక్యంగా కూడా భావించవచ్చును. ధనవంతులుపేదలు అనే తారతమ్యం ఈ కథలోని నాయికా నాయకులను విడదీసింది. అనివార్య కారణాల వలన  ధనిక వర్గానికి చెందిన నాయికకు, ఒక పేదవానితో ఇష్టంలేని బలవంతపు వివాహం జరుగుతుంది. మొదటినుండి అతనంటే తీవ్రంగా అసహ్యించుకునే ఆ నాయిక భర్త తనను తాకరాదని శాసిస్తుంది. భార్య విముఖతకుఅహంకారపూరిత ప్రవర్తనకు విసుగెత్తిన  ఆ భర్త నిరాశా నిస్పృహలతో ఈ పాటను పాడతాడు. ఈ పాటలో భావోద్వేగాలు తప్ప వీనులవిందైన సంగీతానికి చోటులేదు. అయితే ఘంటసాల మాస్టారి గళంలో కృష్ణశాస్త్రి గారి మనో భావాలన్ని సుస్పష్టంగా ప్రతిధ్వనించి ఈ పాటను అజరామరం చేశాయి. ఈ పాటలో దేవులపల్లివారు చూపించిన ఉదాహరణలు వారి విశిష్ట కవితా శైలికి దర్పణం పడతాయి. ఈతెరపై ఈ పాటను పాడేది అక్కినేనివారు కావడంతో నేపథ్యంలో ఈ పాటను పాడడానికి ఘంటసాల మాస్టారే తప్పనిసరి. ఈ మాటను ప్రయోగించడానికి ఒక చిన్న కారణం వుంది.

'మంచిరోజులు వచ్చాయి' చిత్రాన్ని తమిళ నిర్మాతలైన జెమినీ స్టూడియో నిర్మించింది. దక్షిణాదిన ప్రతిష్టాత్మక చలనచిత్ర సంస్థగా పేరుపొందిన జెమినీవారు 1940ల నుండి వివిధ భాషలలో శతాధికంగా చిత్రాలు నిర్మించారు. వాటిల్లో కొన్ని తెలుగు వున్నాయి. అయితే అక్కినేని నాగేశ్వరరావు  అంతవరకూ ఏ ఒక్క సినిమాలోను ఆ సంస్థకు పనిచేయలేదు. అలాగే ఘంటసాల మాస్టారు కూడా జెమినీ తీసిన  ఒక్క'మనుషులు మారాలిసినిమా లో మాత్రమే ఓ రెండు పాటలు పాడారు. అలాంటి జెమినీ వారు ఎస్.ఎస్.బాలన్ (ఎస్.ఎస్. వాసన్ కుమారుడు) నిర్మాతగా మొదటిసారిగా అక్కినేని  హీరోగా, వి.మధుసూదనరావు దర్శకత్వంలో ఒక తెలుగు సినిమా తీయ సంకల్పించారు. ఆ సందర్భంగా నాగేశ్వరరావుగారు మాస్టారితో మాట్లాడుతూ "జెమినిలో ఫస్ట్ టైమ్ పనిచేస్తున్నాను. నా పాటలన్నీ మీరే పాడాలని చెప్పాను. వారు అడిగితే కాదనకండి, ఇది మనకో ప్రిస్టేజ్ పిక్చర్" అని చెప్పారట. "మంచిరోజులు వచ్చాయి" సినిమాలో ఘంటసాల మాస్టారు మూడు సోలోలు, మూడు డ్యూయెట్లు మొత్తం ఆరు పాటలు పాడారు. వాటన్నిటిలో కృష్ణశాస్త్రిగారు వ్రాసి, ఘంటసాలగారు అద్భుతంగా ఆలపించిన 'నేలతో నీడ అన్నది నను తాకరాదని' పాటే తలమానికంగా భాసిల్లింది. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని అక్కినేనిఘంటసాలగార్ల పేరు నిలబెట్టింది.

అయితే ఈ పాటకు, సినిమాకు మూలం లేకపోలేదు, ఆ విషయమూ చెప్పుకోవాలి. సుప్రసిధ్ధ తమిళ నటుడు 'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ 150 వ చిత్రంగా 1971 లో 'సవాలే సమాళి' అనే తమిళ చిత్రం వచ్చింది.

జయలలిత హీరోయిన్.  ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం. అందులో కన్నదాసన్ వ్రాసిన 'నిలవై పార్త్ వానమ్ సొన్నదు ఎన్నై తొడాదే' అనే పాటలోని మూలభావమే తెలుగులోని ' నేలతో నీడ అన్నది...' పాటలో కూడా ధ్వనిస్తుంది. కన్నదాసన్, కృష్ణశాస్త్రి ఇద్దరూ కవికుల తిలకాలే. ఎవరి శైలి వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే. ఈ సినిమా కథలోని విశేషమేమిటో గానీ తమిళ మూల సినీమా ఆధారంగా తెలుగు, కన్నడమలయాళ భాషలతో పాటు హిందీలో కూడా తీసిన సినిమాలు అన్ని భాషలలోనూ విజయవంతం కావడం విశేషం.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  


Saturday, 9 August 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 94వ భాగం - రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభై మూడవ భాగం ఇక్కడ

94వ సజీవరాగం - రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ

చిత్రం - సంపూర్ణ రామాయణం
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి 

రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ మా నోములన్ని పండినాయి

రామయతండ్రి మా సామివంటే నువ్వేలే

రామయ తండ్రీ ! రామయతండ్రీ!

 

చరణం 1:

తాటకిని ఒక్కేటున కూల్చావంట

శివుని విల్లు ఒక్క దెబ్బకే యిరిశావంట

పరశురాముడంతవోణ్ణి పారదరిమినావంట 

ఆ కధలు సెపుతుంటె విని ఒళ్ళు మరచిపోతుంట

                            రామయ తండ్రీ ! రామయతండ్రీ!

 

ఆగు బాబు ఆగు !

అయ్యా నే వత్తుండా బాబూ నే

వత్తుండా - !అయ్యా!

చరణం 2:

నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది

అయినాదంట .... నాకు తెలుసులే

నా నావమీద కాలు పెడితె ఏమౌతుందో

తంట ! నీ కాలు!

దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట

మూడు మూర్తుల నువ్వు

నారాయణమూర్తివంట

                            రామయ తండ్రీ ! రామయతండ్రీ!

 చరణం 3:

అందరినీ దరిజేర్చు మా రాజువే

అద్దరిని జేర్చమని అడుగుతుండావే-2

నువు దాటలేక కాదులే రామయతండ్రి

నన్ను దయజూడగ వచ్ఛావు రామయతండ్రి! నువు..!

 

హైలెస్సా హేలో హైలెస్సా.....

ఓహోహో..... హైలెస్సా...

అందరిని దరిజేర్చు మారాజు( భగవంతుడు)

అద్దరిని జేర్చమని అడుగుతున్నాడట. యుగయుగాలుగా భగవంతుని పట్ల గల దృఢమైన విశ్వాసంనిరంతర ఆధ్యాత్మిక చింతన ఈ దేశవాసులను సత్ప్రవర్తనతో ధర్మపథాన ముందుకుసాగేలా చేస్తోంది. రామాయణమహాభారతభాగవతాది ఇతిహాసాలు వాస్తవాలు కావచ్చుకాకపోవచ్చు, కానీ అవి భోధించే నీతిని, ధర్మసూత్రాలను మాత్రం అనాదిగా భారతీయులు మనసావాచాకర్మేణా ఆచరిస్తూనేవున్నారు.

శ్రీమద్రామాయణంలోని అనేక అంశాలు ఈనాటికీ మనకు మంచి స్ఫూర్తిని కలిగిస్తూ ఆదర్శప్రాయమై నిలిచివున్నాయి. రామాయణ మహాకావ్యంలో చోటుచేసుకున్న -- తల్లిదండ్రులుగురువులుపెద్దలయెడల వినయవిధేయతలుపితృవాక్య పరిపాలనకుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ప్రేమానురాగాలుసహోదర ప్రేమ; సీతారాముల అన్యోన్యదాంపత్యం; రాముడు పాటించిన ఏకపత్నీ వ్రతం; పాలకుల పట్ల ప్రజల స్వామిభక్తిపరాయణత్వం; మైత్రీబంధం; రాముడి శాంతంసహనంసౌజన్యం, సచ్చీలత వంటి అంశాలకు మనము ఈనాటికీ ప్రధాన్యతనిచ్చి ఆచరిస్తూనే వున్నాము.

ప్రతీ భారతీయ స్త్రీ రాముడివంటి భర్తే లభించాలని కోరుకుంటూందంటే రాముడు ఎంతటి గుణ సంపన్నుడో అర్ధమౌతుంది. రాముడు మానవుడే అయినా ఆనాడుఈనాడు కూడా ఆయనను భగవత్స్వరూపునిగానే ఆరాధించి పూజిస్తున్నారు. బాల్యదశలోనే విశ్వామిత్రుని యాగరక్షణలో రాక్షస సంహారం; శివధనుర్భంగం; పరశురాముడిలోని క్రోధత్వాన్ని అణచడం వంటి  శౌర్యప్రతాపాలను గమనించిన ఆనాటి ప్రజలు రాముడిని దైవస్వరూపంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. రాముడికి సంబంధించిన అనేక విషయాలు కథలు కథలుగా ప్రచారమై దశరథరాముడిని దర్శించితరించాలని ఉవ్విళ్ళూరే స్వామిభక్తి పరాయణులైన పామరజనులెందరో. అలాటి స్వామిభక్తులలో ముఖ్యంగా చెప్పుకోవలసినవాడు గుహుడు. 

గుహుడు  పడవలు నడిపే సామాన్య పల్లెవాడు. అయోధ్య యువరాజు రఘురాముడి లీలలు విని ఆ రామచంద్రుని దర్శనం కోసం పరితపిస్తున్న గుహుడు, రాముడు నది ఆవలివొడ్డుకు చేర్చమని అడగడంతో  తనకు దక్కిన అదృష్టానికి ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబై  "రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ మా నోములన్ని పండినాయి రామయ తండ్రీ" అంటూ భక్తిప్రపత్తులతో తన అమాయక మనోభావాలను పాట రూపంలో వెల్లడిస్తున్నాడు. ఆ పాటే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

బాపురమణలకు అత్యంత ప్రీతిపాత్రమైన కథావస్తువు రామాయణమే. రామాయణం ఇతివృత్తంగా బాపు అనేక పౌరాణిక, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ప్రముఖమైనవి ముత్యాలముగ్గు, సీతాకళ్యాణం, శ్రీ రామాంజనేయయుధ్ధం, సంపూర్ణరామాయణం. అన్నీ  మంచి కళాత్మకదృష్టితో, ఉత్తమ సాంకేతిక విలువలతో బాపు తన అభిరుచికి తగినట్లు రూపొందించారు.

అందులోశోభన్ బాబుచంద్రకళ సీతారాములుగా నటించిన సంపూర్ణరామాయణంలోని గీతమే నేటి సజీవరాగం. గుహుడు పాడే పాట. సామాన్య జనపదాలకు చెందిన గుహుడిగా (నటుడి పేరు తెలియదు) రాముడిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళలక్ష్మణుడిగా నాగరాజు హృద్యమైన ఈ సన్నివేశంలో అగుపిస్తారు.

స్వామిభక్తుడైన గుహుడు శ్రీరాముడిని చూసిన ఆనందంలో పరవశించిపోతూ పాడిన ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాయగా, కె.వి.మహాదేవన్ సంగీతనిర్దేశకత్వంలో ఘంటసాల ఆలపించారు. కొసరాజుగారు గుహుడు పాత్ర ద్వారా రాముడి లీలలు వర్ణించే క్రమంలో...

రాముడి పాద స్పర్శతో శాపగ్రస్థయై బండగా పడివున్న అహల్య నిజరూపం ధరించడం; జీవులన్నిటికి మోక్షాన్ని ప్రసాదించే భగవంతుని అవతారం తనను నది దాటించమని కోరడం; వంటి విషయాలలో చిన్న చిన్న చమత్కార చెణుకులు విసరడం శ్రోతలకు మంచి వినోదాన్నే కలిగిస్తుంది.

కె.వి.మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 33 పాటలుపద్యాలుండగా  గాయకుడిగా ఘంటసాలగారి భాగస్వామ్యం మూడు పాటలు, ఐదు పద్యాల వరకే పరిమితమైయింది. వీటిని గుహుడు(పాత్రధారి పేరు తెలియదు) అర్జా జనార్దన్ రావు(హనుమంతుడు)శోభన్ బాబు (రాముడు), నాగయ్య(వశిష్టుడు)పై చిత్రీకరించడం జరిగింది. రాశి తక్కువగా వుంటేనేం, ఘంటసాల తన వాసిని, ముద్రను ఈ పాటల్లో ప్రస్ఫుటంగానే ప్రకటించారు. ఉన్నంతవరకు మంచి వైవిధ్యాన్నే ఘంటసాల చూపించారు.

స్టార్ నటులుచిన్న నటులు అనే తేడా లేకుండా వివిధరకాల పాత్రధారులకు అసంఖ్యాకంగా పాటలు పాడిన ఘనత ఘంటసాలగారికే దక్కింది. సంపూర్ణ రామాయణంలో గుహుడుగా నటించిన నటుడెవరోగానీ మరీ గొప్ప గుర్తింపు గల నటుడు కాదు. అలాటి నటులకు కూడా ఘంటసాల గళం వలన మంచి గుర్తింపు లభించింది.

సంపూర్ణ రామాయణంలోని గుహుడు పాడిన 'రామయ తండ్రీ ఓ రామయతండ్రీ మా నోములన్ని పండినాయి రామయతండ్రి...పాట బహుళ జనాదరణ పొంది ఈనాటికీ తరచు ఔత్సాహిక గాయకులందరిచేతా పాడబడుతూనేవుంది.

కె.వి.మహాదేవన్ ఈ పాటకోసం  కర్ణాటక సంగీతంలోని 28 వ మేళకర్త హరికాంభోజి రాగ స్వరాలనే తీసుకున్నా ఆ రాగానికి జన్యరాగమైన మోహన రాగపు ఛాయలతోనే పాటను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఐదుస్వరాలతో నిండిన మోహన ఇతర దేశ సంగీతాలలో కూడా పేరు పొందిన రాగం. పల్లెజనాలు పాడుకునే రీతిలో మహాదేవన్  స్వరపర్చగా ఘంటసాల మాస్టారు ఈ పాటను అసలు సిసలు జానపద  శైలిలో అలవోకగా ఆలపించి మరింత భావపుష్టినిరసపుష్టిని కలిగించారు. పాట చివరలో వినవచ్చే ఆలాపన ఈ పాటకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. గిటార్, మేండలిన్ఫ్లూట్, కాంబో ఆర్గన్, వైయొలిన్స్, తబలాటేప్, డోలక్బెల్స్ వాద్యాలతో నిండిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతలను అమితంగానే రంజింపజేసి ఈనాటికి సజీవంగా వుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...